Saturday, April 18, 2015

భవిష్య పురాణము

శౌనకాది మహామునులను చూసి ఈ విధంగా వర్ణిస్తాడు... ‘‘మహా మునులారా! ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడై దుష్టశిక్షణము శిష్టపరిపాలనము చేసిన శ్రీమన్నారాయణుడు మళ్లీ కలియుగంలో జన్మించి, ధర్మరక్షణ చేస్తాడు’’! అది విన్న మహామనులు.. ‘‘మహాత్మా! ఆ కలియుగం ఎలా వుండును? ఆ యుగంలో ధర్మముల స్థితి ఏ విధంగా వుండును? ధర్మమును పునరుద్ధరింపవలసినంత అవసరం ఎందుకు వచ్చింది? ఆ కలియుగ లక్షణం ఎలా వుండును? అప్పటి మానవుల స్వభావములు ఎలా వుండును? అన్నీ మాకు వివరంగా తెలియజెప్పు’’ అని అడగగా... సూతుడు ఈ విధంగా ఆరంభిస్తాడు. ‘‘అధర్ము, అసత్యము అను దంపతులకు కంభుడు, మాయ అను వారు పుడతారు. వారు దంపతులై దంభుడు, వికృతి అనువారిని కంటారు. వారికి క్రోధుడు, హింస అనే ఇద్దరు కొడుకు, కూతుళ్లు పుడతారు. ఆ దంపతులకే కలిపురుషుడు జన్మిస్తాడు. కలిపురుషుడు భయంకరమైన ఆకారాన్ని కలిగి వుంటాడు. ఎర్రని కళ్లు, బానవంటి కడుపుతో వికారంగా వుంటాడు. స్త్రీవ్యామోహము, సురాపానము, జూదము వంటి చెడుఅలవాట్లకు కలిగి వుంటాడు. అతడే ఈ కలియుగానికి అధిపతి.

అతని పాలనలో ధర్మమన్నది అస్సలు కనిపించదు. మానవులు తమ తల్లిదండ్రులను సరిగా చూడరు సరిగదా.. వారిని తిడుతూ వుంటారు. పెద్దలు మంచి అలవాట్లు అని చెప్పిన సూక్తుల్ని పట్టించుకోరు. వేదాలను నిందించి, వేద పండితులను నిరసనగా చూస్తారు. చదువుకొన్నవాడికి తగిన గౌరవముండదు. వేషభాషలతో, ఆడంబరంగా వున్నవారిని అందరూ భయభక్తలతో పూజిస్తారు. బ్రాహ్మణులు మంచిచెడ్డలు ఆలోచించకుండా అందరి ఇళ్లల్లోనూ పౌరోహిత్యము చేస్తారు. వితంతువులు మళ్లీ పెళ్లిళ్లు చేసుకుని గృహిణులు అవుతారు. తక్కువ జ్ఞానం గలవారు, అల్పమైన ఆయుర్దాయము గలవారు వుంటారు. దొంగతనాలు పెచ్చుమీరిపోతాయి. క్రూరత్వము పెరిగిపోతుంది. మాటలలో సత్యమన్నది, అసత్యమన్నది తేడా వుండదు. ఆవులను చంపి ఆ మాంసమునే తింటారు. స్త్రీలను అన్యాయంగా వరకట్నం కోసం హింసిస్తారు. స్త్రీలను వ్యభిచారములు చేసి, పుట్టిన శిశువులను చంపేస్తారు. పరుల ధనముల మీద మక్కువ చూపిస్తారు. వేదాధ్యయమనుములు, యజ్ఞగాదులు వారిలో క్షీణిస్తూ వస్తుంది. ఉత్తమ వంశాలలో పుట్టినవారు కూడా తక్కువ కులస్తులను సేవించి జీవిస్తారు. ఎవరికైతే అధిక బలం, ధనం వుంటుందో అతడే గౌరవనీయుడు. సభలలో ఏమైనా మాట్లాడి నేర్పినవాడే పూజ్యుడవుతాడు.

ఎవడికైతే బలముంటుందో అతడు చెప్పిందే ధర్మము, చెప్పింది శాస్త్రము.. మిగతాది అధర్మము. కులమత భేదాలు లేకుండా పెళ్లిళ్లు చేసుకుంటారు. భోగాలను అనుభవించడానికి స్త్రీ దొరికితే చాలు.. వారి వయస్సులతో పని వుండదు. ఎవడైతే అన్యాయ వృత్తిలో వుంటాడో.. అతడు ఇంకా పైకి ఎదుగుతూనే వుంటాడు. ఎదురించి నిలబడని వాడు పేదబ్రతుకులకంటే హీనంగా జీవిస్తాడు. ఎన్ని దారుణాలు చేసిన.. అతడు చేసిన ఒక చిన్న దానము కూడా అతడ్ని ధర్మాత్ముడని భావిస్తారు. జీవనోపాధి లేనివారు కాషాయములు కట్టుకొని, గురువులై ధనాన్ని సంపాదించుకుంటారు. ఎవరు పడితే వారి(స్త్రీ)తో సంసారసుఖాలు కూడా అనుభవిస్తారు. ధనము దొరుకుతుందన్న ఆశతో దొంగసాక్ష్యాలు చెప్పడానికి కూడా సిద్ధమవుతారు. క్షుద్రదేవతలన ఆరాధించి స్వల్పఫలమును గోరి దానితో తృప్తి చెందుతారు. తద్దినములు పెట్టుట, చనిపోయిన వారికి కర్మకాండలు చేయడం అనవసరం అనుకుంటారు. పంటలలో రాబడి తక్కువవుతుంది. సంతానములు కూడా అధికమవుతాయి. దేహాలు పొట్టిగా వుండి బలహీనులు అవుతారు.

యజ్ఞగాదలు లేక పోవటం వల్ల దేవతలు బ్రహ్మ దగ్గరకు బోయి మొరపెట్టుకుంటారు. ఆయన వారిని శ్రీమన్నారాయణుని దగ్గరకు తీసుకుపోయి వారి అవస్థలు వినిపిస్తారు. దయామయుడైన శ్రీమహావిష్ణువు వారి మొరలు ఆలకించి, వారిని ఓదార్చి ఈ విధంగా అభయమిస్తాడు... ‘‘దేవతలారా! నేను కలియుగంలో అధర్మంను నాశనం చేసి ధర్మమును ప్రతిష్ఠించడానికి భూమిమీద అవతారమెత్తుతాను. శంబళ అనే పేరుగల గ్రామంలో విష్ణుశర్మ అను బ్రాహ్మణునికి సుమతి అను భార్యయందు కలికి అనే పేరుతో పుడతాను. అధర్మపరులైన రాజులను సంహరించి, దేవాపి, మరత్తు అనువారులకు రాజ్యాభిషేకం చేస్తాను. అప్పటికి మీరు మీ అంశములతో పుట్టి నా రివారముగా వుంటారు’’. శ్రీహరి దేవతలకు చెప్పిన విధంగా విష్ణుశర్మ దంపతులకు కుమారుడుగా జన్మిస్తాడు. మహాత్ములయిన మునీంద్రులు వచ్చి ఆ బాలుడిని దీవిస్తారు. ఉపనయనము చేసే వయసు రాగానే విష్ణుశర్మ ఆ బాలుడికి ఉపనయనము చేస్తాడు. ఆ తరువాత కలికి పరశురాముని వద్ద అనేక విద్యలు, వేదాంతములు, వేదాంగములు, ధనుర్విద్యలు నేర్చుకుంటాడు. లక్ష్మీదేవి శ్రీహరిని విడిచి వుండజాలదు. కనుక సింహళ దేశములో పద్మావతిగా జన్మిస్తుంది. ఆమెను కలికి వివాహమాడుతాడు. ధర్మసంస్థాపనార్థము శంకరుడు అతడికి వాయువేగ, మనోవేగములు గల అశ్వమును బహూకరిస్తాడు. అతడా యశ్వమునెక్కి దుష్ట స్వభావం గల రాజులందరినీ తుదముట్టించి ధర్మాన్ని స్థాపిస్తాడు. విశ్వకర్మ దివ్యమైన నగరాన్ని నిర్మించి ఇస్తాడు. కలికి మూర్తి పద్మావతితో ఆ నగరంలో నివసిస్తుండగా, అతని తండ్రియైన విష్ణుశర్మ కుమారుడ్ని చూడడానికి వస్తాడు.

‘‘తండ్రీ! నీవు అనుమతిస్తే దుష్టులైన సకల రాజులను జయించి.. నీచేత అశ్వమేధయాగము చేయిస్తాను’’ అని తండ్రికి చెప్పి అతని దీవెనలందుకొని విశాఖయూపుడును వానితో కలిసి బౌద్ధ ధర్మావలంబులను, వేదధర్మమును పాటించనివారిని జయించెను. తరువాత జైనులు కూడా అటువంటివారే అవటం చేత వారికి కూడా యుద్ధంలో ఓడిస్తాడు. ఆ వెనుక మాయాదేవి అను ఆమెతో యుద్ధం చేసి విజయుడై తిరిగి వస్తాడు. ఆ తర్వాత యుద్ధములో ఇంతమందిని వధించిన పాపము పోవడానికి కలికిమూర్తి చక్రతీర్థమునస్నాన మాడటానికి వెళతాడు. వాలఖిల్యాదిమునలు అక్కడికి వచ్చి ‘‘కుంభకర్ణుని మనుమరా లోకతే యున్నది. దానిభర్త కాలకుంజుడు, వాని కొడుకు వికుంజుడు, ప్రశాంతముగా తపము చేసికొనుచున్న మమ్మల్ని పట్టి వారు బాధించుచున్నారు. వారి బాధలు పడలేకపోతున్నాము. మాకు రక్షణ కలిగించు’’ అని కోరుతారు. కలికిమూర్తి వారిపై దండెత్తి వెళ్లి ఘోర యుద్ధముంలో వారిని సంహరించి మునులకు ప్రశాంతి స్థితిని కల్పిస్తాడు. తరువాత కలికిమూర్తి హరిద్వారానికి వెళ్లి, గంగాస్నానము చేసి, అక్కడి మహామునులను సందర్శించి నమస్కరించి వారి దీవెనలు తీసుకొని.. వారందరు పూర్వధర్మమార్గాన్ని అనుసరించి నడిచిన క్షత్రియులేనని తెలుసుకొని వారి వృత్తాంతముల గురించి అడుగుతాడు. అపుడు మరుత్తు అను రాజు తన వంశచరిత్ర ఇలా కలికిమూర్తి వివరిస్తాడు. ‘‘నేను సూర్యవంశములో జన్మించాను. నా పూర్వులు రఘువు దశరథుడుమున్నగు మహానుభావులు. ఈ సూర్యవంశమనందే శ్రీమన్నారాయణ స్వరూపుడైన శ్రీరాముడు పుట్టి రావణుడిని రాక్షససంహారము చేసెను’’ అని చెప్పెను. కలికిమూర్తి ఆ శ్రీరామచంద్రుని కథ సర్వ పాపహారము కావున ఆ కథ వినవలెనని కుతూహలపడుచున్నాను. దయచేసి వినిపించమని అడగగా మరుత్తు తన వంశపూర్వుడైన శ్రీరాముని కథను ఈ విధంగా వివరిస్తాడు...

శ్రీరామ చరిత్ర :

దశరథుడు అయోద్యనగరానికి రాజు. అతనికి కౌశల్య, సుమిత్ర, కైకేయి అని ముగ్గురు భార్యలు. వీళ్లకు ఎన్నాళ్లకుగాను సంతానం కలుగలేదు. పుత్రకామేష్టిచేసెను. అలా యజ్ఞపురుషుడు వచ్చి వారికి పాయసమిచ్చెను. దశరథుడు తన ముగ్గురు భార్యలకు ఆ పాయసమును త్రాగించాడు. కౌశస్యలకు శ్రీరాముడు, సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అని ఇద్దరు, కైకేయికి భరతుడు పుట్టారు. దీంతో సంతోషించిన రాజు వారికి చదువులు చెప్పించాడు. విశ్వామిత్రుడు తన యజ్ఞాన్ని కాపాడుకునేందుకు శ్రీరామలక్ష్మణులను తీసుకుపోయి సకలశాస్త్రములను నేర్పించాడు. రాముడు మార్గమధ్యంలో వచ్చిన తాటకను కూడా హతమార్చాడు. వారి యాగమును పాడుచేయకుండా రక్షించెను. మిథిలకు వెళ్లి జనకుని ఇంట్లో శివధనస్సును విరిచి సీతను పెండ్లాడుతాడు. రాముడు అక్కడి నుంచి తిరిగి వస్తుండగా.. పరశురాముని గర్వమునణచెను. రాముడు పట్టాభిషేకం చేద్దామనుకొంటుండగా.. కైకేయి దశరథునికి వరములు కోరుతుంది. ఒకటి రాముడిని అరణ్యములకు పంపుట.. రెండవది భరతునికి పట్టాభిషిక్తుడు చేయడం. రాముడు తండ్రిమాటకు అనుగ్రహించి అడవులకు వెళ్తుండా సీతాలక్ష్మణులు కూడా అతని వెంటే వెళ్తారు. అప్పుడు భరతుడు చిత్రకూటమునకు వచ్చి రాముడిని తిరిగి అయోధ్యకు రమ్మని కోరగా... రాముడు తన పాదుకలనిచ్చి పంపిస్తాడు. జనస్థానమున 14వేల మంది రక్కసులను చంపుతాడు.

రావణుడు శూర్పణఖ ప్రోత్సాహము మీద సీతను అపహరించడానికి నిశ్చయించుకొని, మారీచుని మాయలేడీ రూపంలో పంపుతాడు. రాముడు మాయలేడి వెంటబడిపోగా.. రావణుడు సీతను అపహరించుకుని లంకకు తీసుకెళ్తాడు. రామలక్ష్మణులు సీతను వెదకటానికి కిష్కింధర ప్రాంతానికి వెళ్తారు. హనుమంతుని ద్వారా రాముడు సుగ్రీవునితో స్నేహం సంపాదిస్తాడు. వాలిని సంహరించి సుగ్రీవుని కిష్కింధకు రాజును చేస్తాడు. హనుమంతుడు లంకకు వెళ్లి సీత జాడను తెలుసుకొని రామసుగ్రీవులకు తెలియజేస్తాడు. రాముడు వానర సేనలతో బయలుదేరి సముద్రము మీద సేతువును నిర్మించి లంకకు వెళ్లి రావణ, కుంభకర్ణలను వధించి, తనను ఆశ్రయించిన విభీషణునిలంకారాజ్యమునకు రాజుగా చేసెను. అగ్నిశుద్ధయైన సీతతోపుష్పక విమానముపై అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడై పదకొండువేల యేండ్లు ప్రజారంజకుడై రాజ్యమేలాడు. అతనికి కుశలవులను ఇద్దరు కుమారులు పుట్టారు. కుశునకు అతిథి పుట్టెను. వానికి నిషధుడును, వానికి నభునుడు, నభునకు పుండరీకుడు, పుండరీకునకు క్షేమధన్వుడు, అతనికి నృపశేఖరుడు, అతనికి దేవానీకుడు ఇట్లు ఆ శంశములో ప్రండ్రెండుగురు రాజుల తరువాత శీఘ్రడను రాజు పుట్టాడు. ఆ శీఘ్రుని వలన నేను జన్మించితిని’’ అని  తమ సూర్యవంశ చరిత్రమును కలికిమూర్తికి వినిపిస్తాడు. మరుత్తు ఇంకా కలికితో, ‘‘నేను, నా కొడుకు బుధుడును, మనుమడు సుమిత్రుడునుమ్లేచ్చలను ఎదిరించి బలము లేనివారై అవతార పురుషుడైన నీవు వచ్చి మమ్మల్ని ఉద్ధరిస్తావని ఎదురు చూస్తున్నాము. వ్యాసభగవానుడు నీ గురించి మాకు చెప్పాడు. అందుకే నీ దర్శనానికి వచ్చాము అని మరుత్తు విన్నవిస్తాడు.

చంద్రవంశరాజుల క్రమము :

తరువాత దేవాపి కలికిమూర్తికి తన వంశచరిత్ర గురించి ఈ విధంగా వివరిస్తాడు... ‘‘చతుర్ముఖ బ్రహ్మకు మానసపుత్రుడుగా తన వంశచరిత్రను వివరిస్తాడు. అత్రికి చంద్రుడు కుమారుడై జన్మిస్తాడు. చంద్రుని కొడుకు బుధుడు. అతనికి ఇలయందు పురూరవుడు జన్మిస్తాడు. పురూరవునకు యయాతి నహుషుడును ఇద్దరు కొడుకులు జన్మిస్తారు. సహుషునికి ఇంద్రపదవి రాగా మదాంధకారముతో నిలబెట్టుకోలేక ఆ పదవిని సమర్పించుకుంటాడు. యయాతికి పూరుడు, అతనికి జనమేజయుడు పుట్టారు. తరువాత కొన్ని తరాలకు హస్తియనువాడు పుట్టి తన పేరుమీద హస్తినాపురమును నిర్మించుకుంటాడు. అతనికి అజామీఢఢు పుడతాడు. ఆ వంశములోనే జరాసంధుడును, వానికి సహదేవుడును జన్మించిరి. ఆ తరువాత ఋక్షుడు పుట్టెను. వానికి దిలీపుడు, దిలీపునికి ప్రదీపుడు పుట్టిరి. ఆ ప్రదీపుడే నా తండ్రి. నన్ను దేవాపి యందురు. నేను నా కొడుకైన హూతునకు రాజ్యాభిషేకము చేసి, వ్యాసమహాముని ఆదేశము మీద కలాపిగ్రామంలో నీకోసం ఎదురుచూస్తున్నాను.

అంతట కలికిమూర్తి వారిద్దరిని చూసి.. ‘‘యెచ్చట ధర్మముండునో అక్కడ జయము కలుగుతుంది. మీరు ధర్మము తప్పక ప్రవర్తించి భగవానుని అనుగ్రహాన్ని పొందారు. కావున నేను మీకు ఇంకొక జన్మను ప్రసాదిస్తున్నానని కలికి చెబుతాడు. కలియుగ దోషాలు అంటకుండా కృతయుగమన్నట్లు రాజ్యపాలన చేయండి’’ అని అయోధ్యకు మరుత్తును, హస్తినాపురానికి దేవాపిని రాజులుగా చేస్తాడు. మరుత్తునకు విశాఖయూపుని పుత్రికను, దేవాపికి రుచిరాశ్వుని పుత్రికను ఇచ్చి వివాహములు చేసి, కాలగమనము గలిగిన రెండు దివ్య విమానాలను వారికి ఇచ్చాడు. ఆ సమయంలో కృతయుగము పురుష రూపము ధరించి కలికిమూర్తి దగ్గరకు వచ్చాడు. కలిగి అతనిని కలిసి నీవెవ్వరు అని అడగగా.. ‘‘నేను కృతయుగ పురుషుడిని. కలిపురుషుని బాధలు తట్టుకోలేక బాధలు పడుతూ, శ్రీమన్నారాయణుని అవతారమైన నీవు భూమిపై అవతరించావని తెలుసుకొని చూడడానికి వచ్చాని అని చెప్పి, అతనిచే సమ్మానము పొందుతాడు. ఈ విధంగా సూతుడు శౌనకాదులకు చెబుతాడు. శౌనకాదిమునుల కోరికపై కలియుగంలో మ్లేచ్చ పరిపాలనలను, రాజుల స్థితిగతులనను, మతసాంఘిక స్థితులను వివరింపసాగాడు.

కలిలో దేశకాల రాజకీయ స్థితిగతులు :

కలియుగంలో రెండు సంవత్సరాలు గడిచిన తరువాత కలిపురుషుని ప్రభావం ఎక్కువ అవుతుంది. సూర్యవంశపు, చంద్రవంశపు రాజులు దేశాలను పరిపాలిస్తారు. దేవత్తు అనే రాజు రాజ్యాన్ని పాలిస్తూ.. ఒకనాడు తన పురోహితుని పిలిచి.. ‘‘గురుదేవా! కలియుగం ప్రారంభమై రెండువేల సంవత్సరాలుపైగా అయింది. పురాణాలలో చెప్పిన విధంగా ఈ దేశంలో జరిగితే.. కొంతకాలంలో మ్లేచ్చులచే ఈ దేశం ఆక్రమణము చేయబడుతుంది గదా! అది ఎప్పుడు జరుగుతుందో సెలవియ్యండి’’ అని అడుగుతాడు. అతడు పురాణాలను శ్రద్ధగా చదివి, జ్యోతిశాస్త్రముల ప్రకారం లెక్కలు గట్టి.. ‘‘రాజా! ఈరోజు నుండి నలువదవ రోజున మధ్యాహ్నము మ్లేచ్ఛులు ఈ దేశాన్ని ఆక్రమిస్తారు. అయినాగాని వారి అధర్మ పరిపాలన చేతగాని, నీ ధర్మప్రవర్తన చేతగానీ మరలా నీ రాజ్యాన్ని నీకే స్వాధీనమవుతుందని’’ అని చెబుతాడు. దానిని రాజు ‘‘మహాత్మా! సూర్యచంద్రులు గతులు తప్పని తప్పవచ్చునుగాని.. శాస్త్రములు, పురాణములు ఎప్పుడూ అసత్యములు కావు. ఎందుకంటే.. ఐహిక భోగాలను త్యాగం చేసి మహా తపస్సులు చేసి.. దానివల్ల దివ్యజ్ఞానాలను సంపాదించిన ఋషులు చెప్పిన శాస్త్రాలు ఎలా అసత్యము అవుతాయి? మహాత్ముడు, నారాయణాంశ సంభవుడును అయిన వ్యాసమహాముని వేదరాశిని ఋక్, యజుస్, సామ, అధర్వణ వేదాలు అని నాలుగుగా విభజించి, తన అమోఘమైన బుద్ధితో భూత, భవిష్య, వర్తమానములను గ్రహించి, దేశంలో ధర్మము నశింపకుండా పురాణాలను రచించాడు. అతని వాక్కులందు అసత్యములుండవు’’ అని చెప్పాడు. ‘‘అయినచో శాంతిపౌష్టిక కర్మలు చేయించి రాగల ఆపదలను వీలయినంతలో తొలగించుకుందాం. ఆయా ఏర్పాట్లను చూడు’’ అని గురువుతో రాజు చెబుతాడు. అప్పుడా రాజగురువు భవిష్య పురాణంలోని చెప్పబడిన రీతిగా కార్తికశుద్ధ పాడ్యమినుండి ఏకాదశి వరకు పదకొండురోజులు పత్నీసహితుడైన రాజుచే దీక్ష వహింపజేసి మిత్రాది ద్వాదశాతత్మకుడై, పద్మినీచ్చాయోషాసమేతుడైన శ్రీ సూర్యదేవునికి మహాసౌర మంత్రాలతో, అరుణపారాయణముతో నమస్కారములు చేయిస్తాడు. రామాయణ, భారతాదులు పారాయణ చేయించియు, శ్రీమహా రుద్రాభిషేకములు, విష్ణు సహస్రనామార్చనలును, లక్ష్మగణపతి ఆరాధనమును చండీ పారాయణములను ఒక మహాయాగరూపముగా చేయించి శాంతిపౌష్టిక క్రియలు జరుపును. రాజు కూడా తనవంతు ప్రయాత్నాలు చేసి మిగిలిన కార్యభారాన్ని భగవంతునిపై వుంచి, మంత్రులతో రాజకార్యాలను నిర్వర్తిస్తాడు. క్రొత్తవారు ఎవ్వరును అనుమతి లేకుండా నగరములో ప్రవేశించుటకు వీలులేదని కట్టడి చేసి, వేగుల వారిని నియమించి, ఎప్పటి వార్తలు అప్పుడు తెలిసికొనుచు చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు.

మ్లేచ్ఛుల దురాక్రమణం :

అయినా దైవ నిర్ణయాలను ఎవరు తప్పించగలరు? నలువపదవరోజు మధ్యాహ్నము కొందరు వర్తకులను, వ్యాపారాలు చేసుకొనడానికి అనుమతిని ఇమ్మని రాజుని కోరగా.. రాజు మంత్రులతో ఆలోచించి వ్యాపారానికే కదా అని అనుమతినిస్తాడు. వారందరు మ్లేచ్ఛులు. ముత్యాలు, బంగారు వస్తువులు, అమ్ముకొంటున్నట్లుగా నాటకం చేసి.. వారు రహస్యంగా దాచుకున్న ఆయుధాలతో కావలివారిని చంపి, కోటలోనికి ప్రవేశిస్తారు. వెంటనే అక్కడున్న రాజును, మంత్రిపురోహితులను బంధించి, సేవలకును సంహరించి, స్మశానమంలో పాతివేస్తారు. రాజును, మంత్రిని, పురోహితునిని స్మశానంలో కంఠమువరకు భూమిలో పాతిపెట్టించి.. ఏనుగులతో వారిని తొక్కించిండని ఆజ్ఞాపిస్తారు. మ్లేచ్ఛభటులు రాజును, మంత్రిని, గురువులను స్మశానానికి తీసుకొని పోయి కంఠముదాక పూడ్చిపెట్టి, ఉదయ సమయంలో ఏనుగులతో తొక్కించాలని వెళ్లిపోతారు. ఆ రాత్రి కొన్ని నక్కలు శవాలను పీక్కు తినడానికి వచ్చి, అక్కడ చచ్చిపడి వున్న సేవకుల శవాల దగ్గరకు వెళ్లకుండా రాజు దగ్గరకు వచ్చి, అతనిని చుట్టు ముట్టి మట్టిని పెల్లగిస్తాయి. రాజుకు కొంత వీలు కలగగానే గోతిలో కదలగా.. నక్కలు భయపడి అక్కడినుండి పారిపోతాయి. వెంటనే రాజు తన మంత్రి, పురోహితులను పైకి తీసి, వారితో కలిసి రహస్యంగా నగరంలో ప్రవేశిస్తాడు. ఆ అర్థరాత్రి సమయంలో మ్లేచ్ఛులందరు తమకు కష్టంలేకుండానే దొరికిన విజయాన్ని ఆనందంగా తిన్నంత తిని, త్రాగినంత త్రాగి మైమరిచిపోయి పడివుంటారు. అదే సమయంలో నగరంలో ప్రవేశించిన రాజు, మంత్రిపురోహితులు.. మంత్రి ఇంటికి వెళ్లి స్నానభోజనాదులు చేసి, సేనాధిపతులను, సైన్యాలను సిద్ధం చేసుకుని రాజభవనంలోకి ప్రవేశిస్తారు. అక్కడ మ్లేచ్ఛనాయకుడ్ని, అతని భటులను సమూలంగా నాశనం చేసి మరలా రాజ్యాన్ని తన చేతిలోకి తీసుకొని తెల్లవారుజామున విజయభేరి మ్రోగిస్తాడు. ఆ విజయభేరిరి విన్న ప్రజలు తమ రాజు మ్లేచ్ఛులపై విజయం సాధించినందుకు పరమానందంతో ఆరోజు విజయోత్సవాలను జరుపుకొంటారు. మరునాడు రోజు, మంత్రిసామంత పురోహిత నాగర జానపదాలతో మహాసభ చేసి, మ్లేచ్ఛులలో ఇంకా బతికివున్న వారిని మరణదండన విధించి ప్రజలందరికి అభయప్రదానము చేయిస్తాడు. కలియుగంలో దైవారాధన చేయుటయే సకలశుభములకు కారణమగును. ‘‘కలౌ సంస్మరణాన్ముక్తి:’’ (కలియుగంలో భగవంతుని నామము కీర్తించినచో ముక్తి కలుగును). అని పెద్దల సూక్తి ప్రకారం ఆ రాజు కేవలం భగవంతుని నామసంకీర్తన చేయుటయే గాక దీక్షపూని ఏకాదశి దినములు యాగరూపముగా, శ్రీహరిని ఆరాధించినవాడు. ‘‘యజ్ఞో వై విష్ణు:’’ అని పేద వచనము. యజ్ఞమే విష్ణుస్వరూపము. ఆ విధంగా శ్రీమన్నారాయణుని ఆరాధించినవారిని అపజయ మేల కలుగుతుంది? అని సూతుడు చెప్పగా.. మునులు అతడు చెప్పిన కథలు విని, ఆనందించి, ఆ తరువాత కలియుగంలో జరుగు సంఘటనలను, విషయాలను వివరించమని కోరారు. అంతట సూతుడు ఈ విధంగా చెప్పసాగాడు. ‘‘ఆ దేవదత్తుడు ధర్మపరుడై చిరకాలము రాజ్యపాలన చేసి, తన కుమారుడైన దేవహూతికి రాజ్యము నిచ్చును. అతడును తండ్రి వలనే ధర్మబద్ధముగా రాజ్యపాలనమం చేయును. అతని వంశమువారు సమారు ఆరవందల సంవత్సరాలు పరిపాలిస్తారు. ఆపైన ప్రజలలో దైవభక్తి, ధర్మములు, వేదముల మీ భక్తి తగ్గతూ వస్తుంది. అప్పుడే శ్రావస్తినగరంలో బుద్ధుడు జన్మించిన యౌవనంలో వుండగానే సంసారాన్ని విడిచి, సత్యాన్వేషణ కోసం బయలుదేరి ఒక చోట తపస్సు చేసి జ్ఞానవంతుడు అవుతాడు. అతడొక ధర్మమును ప్రబోధిస్తాడు. ఆ వేదములను ప్రమాణముగా గ్రహించదు. కేవలం సత్యం, అహింస, జీవుడు స్వధర్మము ఆచరించుట, అష్టాంగ యోగాలను పాటించుట అను సిద్ధాంతాలతో కూడి వుంటుంది. అసలే ప్రజలలో వైదిక ధర్మాల మీద నిర్లక్ష్యము ప్రబలుతుండడం వల్ల ఆ రోజుల్లో ఈ బుద్ధుని బోధనలు ప్రజలను ఆకర్షిస్తాయి. అప్పుడు అందరు బౌద్ధులే అవుతుండగా.. వైదిక ధర్మము చెట్లు పుట్టలుగా పోతుంది. అది ఎంతగా వ్యాపిస్తుందంటే.. రాజులు కూడా బౌద్ధమతాలంబులై అదివరకు తాము ఆచరించుచున్న వైదికధర్మములను విడిచిపెట్టివేస్తారు. మౌర్యుడైన బింబిసారుడను రాజు వైదిక ధర్మము ప్రకారం యజ్ఞం చేయుచుండగా.. బుద్ధుడు జంతుహింస చేయనీయకుండా అడ్డు పడతాడు. అతడు బుద్ధుని బోధనలతో బౌద్ధుడవుతాడు. అతని కొడుకు అశోకుడు కూడా బౌద్ధసన్యాసి బోదనాల వల్ల తాను కూడా బౌద్ధుడు అవ్వడమే గాక బౌద్ధ ధర్మాలను దేశ దేశములకు వ్యాపింపచేస్తాడు. ఆ మతం ప్రజలపై చాలాకాలం ప్రభావం చూపి, క్రమంగా క్షీణిస్తుంది. కొంతకాలానికి మౌర్యుడైన బృహద్రదుని, శుంగవంవీయుడైన పుష్యమిత్రుడు వధించి రాజ్యాం చేయును. మౌర్యుల రాజ్యపాలనా కాలము సుమారు నూటనలువది సంవత్సరాలు. పుష్యమిత్రుని వంశీయులు నూటపన్నెండేళ్లు రాజ్యపాలను చేస్తారు. ఈ శుంగవంశమువారిలో చివరివాడైన దేవహూతుని అతని మంత్రి వసుదేవడనువాడు వధించి రాజ్యాన్ని ఆక్రమిస్తాడు. వీరు కణ్వవంశస్థులు. వీరు మూడువందల సంవత్సరాల వరకు రాజ్యాన్ని పాలిస్తారు. ఆ కాణ్వులలో చివరివాడైన సుశర్మడును వానిని ఆంధ్రజాతీయుడైన వృషలుడు సంహరించి రాజ్యమేలుతాడు. వీరే శాతవాహనులు. అతని కొడుకు కృష్ణుడు, అతని కొడుకు శాతకర్ణుడు. అతని వంశములోనే హాలుడు జన్మిస్తాడు. ఇతడు ప్రాకృతభాష యందు గాథాసప్తశతి రచిస్తాడు. (చరిత్రలో వున్న పేర్లకు, పురాణాలలో వున్న పేర్లకు చాలా తేడా వుంటాయి). ఈ శాతవాహనులు నాలుగువందల యాభైయారు సంవత్సరాలు భూమిని పాలిస్తారు. ఆ తరువాత ఆభీరులు, గర్దభులు, కంకవంశస్థులు, యవనులు, బర్బరులు, మురుండులు మొదలైనవారు పాలిస్తారు. యవనులో బాబరు ముఖ్యుడు. అతని వంశమువారు కొంతరు మతసామరస్యము కలిగి, కొంతరు లేకుండా వుంటారు. ఔరంగజేబు అనే యువరాజు పాలనలో మహారాష్ట్ర దేశమున శివప్రసాదు అనేవాడు జన్మించి, ప్రజలను ధర్మమార్గమున పాలించును. కలిలో మూడువేల సంవత్సరాలు దాటిన తర్వాత శాక్తేయము, గాణాపత్యము, చార్వాకము మొదలైన మతాలవారు (ఇవి వైదిక మతమునకు విరుద్ధములు) పుట్టి ప్రజలలో వ్యాపించును. అప్పడు శంకరాచార్యుడు, రామానుజచార్యుడు, మధ్వాచార్యుడు అనువారు జన్మించి వైదికమతమును తిరిగి ప్రజలలో ప్రబోధిస్తారు. వంగదేశంలో శ్రీకృష్ణ చైతన్యుడైన మహానుభావుడు జన్మించి.. ప్రజలలో శ్రీకృష్ణ భక్తితత్త్వమును ప్రబోధిస్తాడు. యవనరాజుల పరిపాలనలో చిన్నచిన్న రాజుల పోరాటాలు ఎక్కువవుతాయి. అప్పుడు మరుండులు (గరుండలు) వర్తకమునకై ఈ దేశానికి వచ్చి క్రమంగా భారతదేశ పాలకులు అవుతారు.

ము(గ)రుండులు - భారతదేశ పాలన :



మనులు అడగగా.. మురుండులు గురించి సూతిడు ఇలా చెబుతాడు. ‘‘లంకలో రామరావణులకు మహాయుద్ధమైంది. వానరుల సహాయంతో రాముడు గెలుపొంది, విభీషునికి పట్టాభిషేకం చేసి.. తాను సీతాలక్ష్మణ సుగ్రీవులతోను, వానరులతోను, విభీషునితోను పుష్పక విమానంపై అయోధ్యకు బయలుదేరుతాడు. వానరులు కొందరు శ్రీరాముని చూసి, ‘‘రామచంద్రా! మేము ఈ లంకానగర సౌందర్యానికి ముగ్దులమయ్యాము. ఇందులో కొన్నాళ్లు నివసించాలని కోరికగా వున్నది’’ అని చెప్పారు. రాముడు విభూషినివైపు చూసి.. అతడు ‘‘దానికేమున్నది? వీరికి ఇష్టమున్నంత కాలం లంకలో వుండచ్చునని అనుమతిస్తాడు. ఆ వానరులు సంతోషించి, లంకలో వుండిపోయి రాక్షసకన్యలను వివాహమాడి, వారితో కాపురాలు చేసి బిడ్డలను కంటారు.

అయితే వారు అటు వానరులు కాక ఇటు రాక్షసులు కూడా కాకపోయిరి. వారికి వేరే నివాసప్రదేశము కావలసి వచ్చింది. ఆ వానరులు తమ బిడ్డలను వెంటబెట్టుకుని శ్రీరాముని సన్నిధికి వచ్చి వినయంతో ఈ విధంగా చెబుతారు. ‘‘శ్రీరామచంద్రా! మేము ఇలా లంకలో వుండిపయి, రాక్షస కన్యలను వివాహమాడి సంతానమును పొందితిమి. ఇప్పడు వారికి నివాసములు కావలసి వచ్చింది. వీరందరు ఎక్కడో నివసింపవలెనో మీరే నిర్ణయించి చెప్పండి’’. రాముడు వారిని చూసి.. ‘‘వానరులారా! మీరందరు భూమియందు పశ్చిమముగానున్న ద్వీపములు ఆక్రమించి రాజ్యపాలన చేస్తూ సుఖంగా జీవించండి. వారే మురుండులు లేక గరుండులు అని పిలువబడుతూ చాలా కాలం రాజ్యపాలన చేశారు. కలియుగంలో 4500 సంవత్సరాలు దాటిన తరువాత వర్తకము పేరుతో భారతదేశానికి వచ్చి పరస్పరము కలహాలతో చీకాకు పడుతున్న చిన్నచిన్న రాజులను లొంగదీసుకుని ఆ మురుండులు మొత్తం భారతదేశాన్ని స్వాధీనం చేసుకుని పరిపాలిస్తారు. ఈ మురుండులే ఆంగ్లేయులు.

No comments:

Post a Comment