Saturday, April 18, 2015

శ్రీగరుడ పురాణము

పరిచయము : గరుడ పురాణము అనగానే చాలామంది, అదేదో అశుభ పురాణమని, ఎవరో చనిపోయినప్పుడు తప్ప మిగతా రోజులలో చదవకూడదని ఒక దురాభిప్రాయం విశ్వంలో నాటుకునిపోయింది. కాని అది సరియైనది కాదు. ఇది విష్ణు మహాత్ముని గురించి తెలుపు వైష్ణవ పురాణము.

నారదపురాణములో దీని గురించి.. ‘‘మరీచే శృణువచ్మ్యద్య పురాణం గారుడం శుభమ్. గరుడా యాబ్రవీత్ పృష్ణో భగవాన్ గరుడాసన!’’ అని శుభమును కలిగించే పురాణముగా వర్ణింపబడింది. గారుడ కలప్పములో విశ్వాండము నుండి గరుడుడు జన్మించుటను, అతని చరిత్రను పురస్కరించుకొని ఈ గరుడ పురాణము వెలిసిందని మత్స్య పురాణంలో చెప్పబడింది.

అగ్నిపురాణములానే ఈ పురాణము కూడా విజ్ఞాన సర్వస్వమని చెప్పవచ్చు. ఇందులో కూడా అనేక విషయాలున్నాయి. అన్ని పురాణములలోలానే దీనిలోనూ బ్రహ్మాదుల సృష్టి, వారు చేసిన ప్రతిసృష్టి, వంశములు, మన్వంతరములు, వంశములలోని ప్రసిద్ధులైన రాజులు కథలు వున్నాయి.

యుగ ధర్మములు, పూజా విధానములు, విష్ణుని దశావతారములు, అనేక ధర్మములు, ఆయుర్వేదము, చికిత్సా విధానములు, ఛందశ్శాస్త్ర ప్రశంస, వ్యాకరణము, గీతా సారాంశము మొదలైనవి అన్ని వర్ణించబడి వున్నాయి. ఈ పురాణములో పూర్వఖండము, ఉత్తర ఖండము అని రెండు భాగాలుగా వున్నాయి.

ఉత్తరఖండములోని ప్రథమ భాగం ప్రేతకల్పము అని చెప్పబడును. చనిపోయినవారి ఆత్మశాంతి కోసం చేయవలసిన కార్యాలన్ని అందులో చెప్పబడినవి. కావున దానిని ఆ పదిరోజులలో చదువుట ఆచారంగా నడుస్తోంది. మిగిలిన భాగాలన్ని పవిత్ర సందర్భాలకు సంబంధించినవి కలిగి వుంటాయి.

అన్ని పురాణములలాగా ఎప్పుడు కావలసిన అప్పడు ఇంటిలో చదువుకోవడానికి వీలుగా వుంటుంది. నైమిశారణ్యములో నిశౌనకాదిమునీంద్రులు సూతునడుగగా, వారికతడీ గరుడపురాణమును ఇలా వినిపించెను.

గరుడుని పుట్టుక -  ఒక కల్పాంత ప్రళయ కాలంలో లోకమంతా నాశనం అయి జగమంతయు ఏకార్జమైపోయెను. ఒక్క స్థావరము కూడా లేదు. జంగమములు లేవు. సూర్యచంద్రులు లేరు, జగత్తులు లేవు, బ్రహ్మ లేడు. అంత సర్వశూన్యముగా మారిపోయి వుండెను. అన్నిచోట్లా అంధకారము వ్యాపించియుండేది. ఆ చీకటి కావల ఏదో ఒక మహాజ్యోతి.

అది స్వయం ప్రకాశమై వెలుగుచుండెను. అదే సర్వ జగత్కారణమైన మహస్సు. ఆ జ్యోతిస్స్వరూపుడైన భగవానుని సంకల్ప బలం వల్ల ఆ మహాజలనిధిలో ఒక పెద్ద అండము (గ్రుడ్డు) తేలుచుండెను. అది కొంతకాలం తర్వాత చితికి రెండు ముక్కలయ్యెను. ఒకటి నేలగాను, మరొకటి ఆకాశంగా రూపం దాల్చాయి. ఆ అండము నుండి గరుత్మంతుని రూపములో నారాయణుడు ఆవిర్భవించెను.

అతని నాభి కమలము నుండి బ్రహ్మ ఉదయించెను. అతనికి ఏమి చేయాలో తోచక దిక్కులు చూస్తుండగా ‘‘తప, తప’’ అని మాటలు వినిపించెను. అతడు చుట్టూ చూడగా తనను సృష్టించిన గరుడ రూపుడైన నారాయణుడు కనిపించెను. ఆ మూర్తినే అతడు ధ్యానిస్తూ కొన్ని వేల యేండ్లవరకు తపము చేసి మానసిక శక్తిని సంపాదిస్తాడు. నారాయణుడు అతడిని సృష్టి చేయమని ఆదేశించెను.

బ్రహ్మ మనస్సంకల్పంతో ముందు సనకసనందనాదులను సృజించగా వారు సంపారమునందు వైరాగ్యము గలవారై తపమునకు వెళ్తారు. అప్పుడు ఈ చరాచర సృష్టి చేయడం తన ఒక్కడివల్ల కాదని తెలిసి, దక్షమరిచి కశ్యపాది ప్రజాపతులను సృజించి, వారివారికి తగిన భార్యలను కూడా సృష్టించి, మీరు సృష్టిని వ్యాపించజేయండని ఆదేశించెను. వారు తమ తండ్రి యాజ్ఞను శిరసావహించి సృష్టిని కొనసాగించిరి.

కశ్యపు పుత్రుడైన గరత్మంతుడు

కశ్యపునికి చాలామంది భార్యలు వున్నారు. వారిలో వినత, కద్రువ అని ఇద్దరు. వీరిలో కద్రువకు సవతి మచ్చరం ఎక్కువ. కాని పతిని సేవించడంలో మాత్రం ఎవరికెవరూ తీసిపోరు. వినత సాధు స్వభావం గలది. ఆమె.. గరుడ రూపుడైన శ్రీమన్నారాయణుడే సృష్టికి ఆదిపురుషుడు అని వివి.. అటువంటి కుమారుడు కావలెనని శ్రీహరిని తపము చేస్తుంది.

నాయారణుడు ఆమెను అనుగ్రహించి.. ‘‘నీ గర్భమున గరుడుగా జన్మనిస్తాను’’ అని వరమిచ్చాడు. దాంతో ఆమె సంతోష భరితురాలయ్యింది. కొన్నాళ్లకు ఆమె గర్భవతి అవుతుంది. ఒకనాడు కద్రువు, వినతలు క్షీరసాగరతీరానికి విహారమునకు వెళ్తారు. అక్కడ ఉచ్చైశ్శ్రవము కనబడుతుంది.

దానిని చూసి కద్రువు.. ‘‘అదేంటి..? గుర్రం శరీరమంతా తెలుపుగానే వుంది. కానీ తోక మాత్రం నల్లగా వుంది’’ అని అంటుంది. దానిని విన్న వినత ‘‘అదేమి? అలా అంటున్నావు? తోక కూడా తెల్లగానే వుంది కదా?’’ అని సమాధానం ఇస్తుంది. కద్రవు ‘‘కాదు నలుపే. అది నల్లగా వుంటే నువ్వు నాకు దాస్యము చేయాలి. తెల్లగా వుంటే నేను నీకు దాస్యము చేస్తాను’’ అని చెబుతుంది. అప్పుడు వినత ‘‘సరే.. వెళ్లి చూద్దాం రమ్ము’’ అని పిలుస్తుంది.

కద్రవు ‘‘ఇప్పటికే సంధ్యాకాలం అయింది. మన భర్తకు కావలసినవి చూడవద్దా? పదా వెళ్దాం. రేపు పొద్దున్నే చూద్దాం’’ అని చేయిపట్టుకొని తీసుకునివెళ్తుంది. ఆ రాత్రి కద్రువ తన కుమారులైన వాసుకి తక్షక ప్రముఖులైన సర్పరాజులను పిలిచి ‘‘మీలో నల్లనివారు రేపు ఉదయమున ఉచ్చైశ్శ్రవము తోక పట్టుకుని వ్రేలాడుచు నల్లగా కనబడునట్లు చేయు’’ అని అంటాడు.‘‘విషయం ఏమి??’’ అని వారు అడగగా, జరిగినది చెప్తాడు. వారిది అన్యాయం అంటారు. ఆ పని మేము చేయము అని చెబుతారు. ఆమె వారిని ‘‘సర్పయాగములో నశింపు’’ అని శపించినది. ఆమె శాపానికి భయపడి కొందరు తల్లి మాట చేయడానికి సిద్ధపడ్డారు.

వాసుకి ‘‘నీవు అన్యాయంగా ఇచ్చిన శాపము మాలో వున్న ధర్మపరులకు గాకుండా ఇతరులకు వర్తించు’’ అని అంటాడు. మరునాడు కద్రువ, వినతను తీసుకునివెళ్లి నల్లగావున్న గుర్రపుతోకను దూరం నుండి చూపిస్తుంది. వినత అమాయకురాలు. వినత కద్రువకు దాస్యం చేస్తుంది. ఈ దాస్యం చేయడానికి అసూరుని శాపమే కారణం.. ఎందుకంటే.. తన సవతి కద్రువకు సర్పసంతానం కలుగుచుండెను. తాను గర్భవతియై వెయ్యి ఏళ్ల గర్భభారమును మోసినా సంతానం కలుగలేదని వినత గర్భమును బాదుకుంటుంది.

అపుడు తొడలు, కాళ్లు సరిగా ఏర్పడని అసూరుడు పుడతాడు. పుట్టిన అతడు ‘‘నీ సవతి మీద మత్సరముతో నన్న ఈ విధంగా అంగవికలుడిని చేశావు. కావున నీ సవతికి దాస్యము చేయు’’ అని శాపమిస్తాడు. అలాగే తాను సూర్యుని రథసారథిగా వెళుతూ.. ‘‘నీ గర్భములో ఇంకొక కొడుకు వున్నాడు. వాడు ఇంకా వెయ్యి ఏళ్లకు పుడతాడు. వాడు మహాబలవంతుడు అవుతాడు. వాడు జన్మించేంతవరకు తొందర పడకు. వాడే నీ దాస్యమును పోగొట్టు’’ అని చెబుతాడు.

వినతకు దాస్యములో వుండగానే గరుత్మంతుడు జన్మిస్తాడు. అతనిని కూడా కద్రువ దాసి కొడుకుగానే చూస్తుంది. తన పిల్లలను (సర్పములను) వీపుమీద ఎక్కించుకుని త్రిప్పి మోసుకొని రమ్మని ఆజ్ఞాపిస్తుంది. గరుడుడు వారిని ఎక్కించుకుని సూర్యమండలం దాకా ఎగిరేవాడు. వారు ఆ సూర్యుని వేడికి కమిలిపోయేవారు. ఆరోజున పాపము గరుడిది ఉపవాసము. సవతి తల్లి కోపంతో తిండి పెట్టేది కాదు. ఒకనాడు గరుడుడు తన తల్లి దగ్గరకు పోయి.. ‘‘మనకీ దురవస్థ ఏమి’’ అని ప్రశ్నిస్తాడు. ఆమె సర్వమును వినిపిస్తుంది.

గరుడుడు కద్రువ దగ్గరకు వెళ్లి ‘‘ఏమిచ్చినచో నీవు నా తల్లిని దాస్య విముక్తిరాలిని చేస్తావు’’ అని అడిగాడు. ఆహె ‘‘దేవలోకం నుండి అమృతభాండమును దెచ్చి ఇచ్చినచో నీ తల్లిని విడిచిపెడతాను’’ అని చెబుతుంది. గరుడుడు తండ్రి అయిన కశ్యపు దగ్గరికి వెళ్లి.. తన తల్లి దాస్యమును.. దాని విముక్తికి చేయవలసిని కార్యమును చెప్పి, ఇన్నాళ్లు తనకు సరైన ఆహారము లేక కృశించిపోతాడు. నాకు కడుపునిండ భోజనం పెట్టు’’ అని అడుగుతాడు.

కశ్యపుడు సముద్రతీరాన విస్తరించువున్న మ్లేచ్ఛజాతిని భక్షింపుమనగా గురుడు అలాగే చేస్తాడు. వారిలో చెడిన ఒక బ్రాహ్మణుడు గరుడుని గొంతులో అడ్డుపడతాడు. అతని కోసం మ్లేచ్ఛులను విడిచి పెడతాడు గరుడు. కశ్యపుడు గజకచ్ఛపములు పోరాడుచున్నవి, వానిని దిను అనగా ఆ రెండింటిని రెండు కాళ్లతో పట్టుకుని పోవుచూ.. ఎక్కడ పెట్టుకొని తినాలి అని వెదుకుతూ జంబూ వృక్ష కొమ్మపై వాలుతాడు. అది విరిగుతుంది. దానిపై వాలఖిల్యాది మునులు బొటన వ్రేలంతా ప్రమాణము గలవారుండి తపము చేసుకుంటుంటారు. అది తెలుసుకొని ఆ కొమ్మను ముక్కుతో పట్టుకుని పదిలంగా మేరు శిఖరంపై దింపి, తాను మరొక వైపు కూర్చొని గజకచ్ఛములను భక్షిస్తాడు.

ఆ తరువాత దేవలోకానికి వెళ్లి, అమృతకుంభమును తెస్తుండగా.. రక్షకులు అడ్డగిస్తారు. వారిని గెలిచి వస్తుండగా ఇంద్రుడు వచ్చి ఎదురించి పోరాడుతాడు. కాని గరుడుని పోరాడలేక వజ్రాయుధాన్ని ప్రయోగిస్తాడు. అదికూడా అతనిని ఏమి చేయలేకపోతుంది. అప్పుడు ఇంద్రుడు గరుడునితో ‘‘దేవతలకు సర్వస్వమైన ఈ అమృతమును పాములకు పోయుట మంచిది కాదు. నీ ప్రయత్నము విరమించుకో’’ అని అంటాడు. దానికి గరుడుడు ‘‘నా తల్లి దాస్యవిముక్తికై ఈ పని చేస్తున్నాను.

దీనిని నా సవతి తల్లికి ఇచ్చినచో, నా తల్లి విముక్తురాలవుతుంది’’ అని సమాధానం ఇస్తాడు. ‘‘అయితే దీనిని నీవు నీ సవతి తల్లికి ఇవ్వు. ఆమె, నీ తల్లికి దాస్యవిముక్తి అయినది అనగానే, అదృశ్యరూపుడనై వచ్చి ఈ అమృతకలశమున తీసుకుని పోయెదను. దీనికి నీవు అంగీకరించు’’ అని ప్రార్థిస్తాడు. గరుడుడు దీనికి ఒప్పుకుంటాడు. అమృత భాండమును కద్రువ చేతిలో పెట్టి ‘‘మా తల్లికి దాస్య విముక్తి కలిగినట్లే కదా!’’ అంటే ఆమె అవును అని సమాధానం ఇస్తుంది. వెంటనే ఆమె చేతిలోని అమృతకలశము అదృశ్యమవుతుంది. అంటే ఇంద్రుడు దానిని అపహరిస్తాడు. ఈ విధంగా గరుడుడు తన తల్లికి స్వాతంత్య్రాన్ని కలిగిస్తాడు.

గరుడు తల్లి దీవెనను పొంది, తండ్రి దగ్గరకు వెళ్లి మొత్తం విషయాన్ని వివరిస్తాడు. ఆయన తన కుమారుడి పరాక్రమ విశేషాలకు సంతోషించి ‘‘కుమారా! ఆదిపురుషుడైన శ్రీమన్నారాయణుని గురించి తపము చేసి ఆయన అనుగ్రహము సంపాదించు. ధర్మవర్తనుడనై వుండు. నీకు త్రిలోకములో ఎదురుండదు’’ అని చెప్తాడు. తండ్రి హితబోధను విని గరుడుడు శ్రీహరిని గూర్చి తీవ్ర తపము చేస్తాడు. చాలాకాలం వరకు అలా చేయగా శ్రీనాథుడు ప్రత్యక్షమై ‘‘గరుడా! నీ భక్తికి నేను మెచ్చినాను. నీవు నాకు వాహనమై వుండి నేను చెప్పిన పనులను నిర్వర్తించు’’ అని వరమిచ్చి తనకు వాహనంగా చేసుకున్నాడు.

గరుడుని గర్వభంగము :

గరుత్మంతునికి తాను మహాబలవంతుడునని ఎక్కువ గర్వం కలిగి వుంటుంది. అయినా తానేమీ తక్కువ వాడు కాదు. గజకచ్ఛపములను చెరియొక కాలితో పట్టుకుని కొన్ని యోజనముల దూరము ఎగురుట, అంతమంది రక్షకులను గెలిచి దేవలోకమునలో వున్న అమృతాన్ని తేవడం, ఇంద్రుని వజ్రాయుధానికి బెదరకుండా వుండడం వంటిని సామాన్యమైన విషయాలా? అవన్ని ఎందుకు?

సకలబ్రహ్మాండ భాండములను తన కడుపులో పెట్టుకున్న ఆ శ్రీమహావిష్ణువును అనాయాసముగా వహించుచు.. లోకములన్నియు తిరుగుతున్న తనకంటే బలవంతుడు ఈ చతుర్దశ భువనంలో ఇంకెవడున్నాడని గర్వపడతాడు. దాంతో ఇతడు అందరిని చులకనగా చూడడం ప్రవర్తించసాగాడు. ఇది నారాయణుని దృష్టిలో పడింది. ఇతనికి ఎలాగైనా గర్వభంగము చేయాలని సంకల్పిస్తాడు.

ఒకనాడు నారదారి మునులు శ్రీపతిని దర్శించడానికి వస్తారు. విష్ణుమూర్తి వారితో మాట్లాడుతూ అలవోకగా తన ప్రక్కనున్న గరుడునిపై చేయి వేస్తాడు. మునులతో మాధవుని సంభాషణ సాగుతుంటుంది. గరుడునికి విష్ణువుమూర్తి చేయి భరించలేనంత బరువుగా వుంటుంది. సంభాషణ ఎంతసేపు సాగిందోగానీ గరుడుడు ఈలోపున ప్రాణావశిష్టుడు అయ్యాడు. మునులు ఎప్పటికో సెలవు తీసుకొని వెళ్లారు. శ్రీహరి అప్పుడు చేయిని గరుడుని మీదనుండి తీసేశాడు.

గరుడు అప్పటికే సొమ్మసిల్లి పడిపోయాడు. శ్రీహరి అతనిని మృదువుగా స్పృశించెను. గరుడు ఆ స్పర్శతో తేరుకొని, విష్ణుమూర్తి పాదాలపై పడి, ‘‘ఓ మహాపురుషుడా! నీ కన్న సృష్టిలో అధికులెవ్వరు లేరు. ఈ పరమార్థతమును గ్రహింపలేక గర్వాంధుడునైన నాకు సరియైన గుణపాఠమును చెప్పావు. నా అపరాధమును మన్నించు’’ అని వేడుకున్నాడు. శ్రీహరి ప్రసన్నుడు అయి అతడిని క్షమించెను.

నవగ్రహాలు - రత్నాలు ;

సూర్యాది నవగ్రహాలకు తొమ్మిది రకాలైన రత్నాలు నిర్దేశించబడ్డాయి. ఆకాశంలో వున్న ఈ గ్రహాలకాంతులు సరిగా మనపై ప్రసరించకపోవచ్చు. ఆ కాంతులు మన శరీరంపై పడటంవల్లే అనేక అనారోగ్యాలు తొలగడమే కాక, విషమస్థానంలో వున్న ఆయా గ్రహాల వల్ల సత్ఫలితాలు, మంచి స్థానంలో వున్న ఆయా గ్రహాల వల్ల విశేష పలితాలు కలుగుతాయి. అందువల్ల నవగ్రహాల ఉంగరాలను ధరించడం నవగ్రహ ప్రీతి కోసంమే అని అర్థం చేసుకోవాలి.

1. సూర్యుడు - పద్మరాగము (కెంపు)

2. చంద్రుడు - ముత్యము

3. అంగారకుడు - పగడము

4. బుధుడు - ఆకుపచ్చ

5. గురుడు - పుష్యరాగము (గరుడపచ్చ)

6. శుక్రుడు - వజ్రము

7. శని - నీలము (ఇంద్రనీలము)

8. రాహువు - గోమేధికము

9. కేతువు - వైడూర్యము

ఈ విధంగా నవగ్రహాలకు తొమ్మిది రత్నాలు నిర్దేశించబడ్డాయి.

పంచ మహాయజ్ఞాలు :

‘‘యజ్ఞం’’ అనే శబ్దం ‘‘యజ ఆరాధనే’’ అనే ధాతువు నుండి పుట్టింది. పృథ్విలో పుట్టిన ప్రతిమానవుడు ప్రతిదినం ఈ యజ్ఞాలను ఆచరించాలి. ఈ యజ్ఞాలు ఐదు రకాలుగా వుంటాయి. అవి

1. దేవయజ్ఞము : దీనినే వైశ్యదేవం (గృహస్థులకు మాత్రమే) అంటారు. గృహస్థులు గార్హాపత్యాగ్నిలో దేవతలను ఉద్దేశించి ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తారు. బ్రహ్మచారులైనవారు లౌకికమైన అగ్నిలేని అగ్నికార్యాన్ని చేసుకుంటారు. శూద్రులకు నమస్కరించుకోవడం వల్ల దేవయజ్ఞ ఫలితం లభిస్తుంది.

2. పితృయజ్ఞం : తల్లిదండ్రులు లేనివారు ఈ యజ్ఞాన్ని నిర్వహించుకుంటారు. పితృ, మాతృవర్గాలను చెబుతూ.. స్వధికారంతో జలంతోగాని, తిలలు కలిపిన జలంతోగాని తర్ఫణం చేయడాన్ని పితృయజ్ఞం అంటారు. సాధారణంగా తండ్రిలేనివారికే ఈ తర్పణం చేసే అధికారం వుంటుంది. తండ్రి వుండి, తల్లి లేనివారు ఈ తర్ఫణం చేయడం అధికారం లేదని కొందరు మతస్థులు నమ్మతారు.

3. భూతయజ్ఞం : గృహస్థుడు తాను భోజనం చేయడానికి ముందు, తన ఇంటిచుట్టూ పరిసర వాతావరణంలో వున్న దిరుగు కాకులకు, ఇతర జంతువులకు ఆహారం పెట్టడాన్ని భూతబలి. భూతదయ కలవారు ఎవరైనా దీనిని నిర్వహించుకోవచ్చు.

4. మనుష్య యజ్ఞం : ఇంటికి వచ్చిన అతిథులను సత్కరించి భోజనం పెట్టడం లేదా సామూహిక అన్నదానాలు జరిగినప్పుడు ధనాన్నిగాని, వస్తుసంభారములుగాని ఇచ్చి సహకరించుట.

5. బ్రహ్మయజ్ఞం : ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదాలలో తమ శాఖను చెందిన ఏదో ఒక దానిని అధ్యయనం చేయడం లేదా అధ్యయనం చేసిన దానిని పునశ్చరణం చేయడాన్ని బ్రహ్మయజ్ఞం అంటారు. శూద్రాదివర్ణములవారు బ్రహ్మజ్ఞానులైన ఋషులు రచించిన పురాణాలను, ధర్మశాస్త్రాలను చదవడం లేదా వినడం బ్రహ్మయజ్ఞమంటారు.

బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు ప్రతిదినం ఉదయం, మధ్యాహ్ననం, సాయంత్ర కాలములలో మంత్రయుక్తంగా సంధ్యోపాసనమం చేయాలి. ‘‘అహరహస్సంధ్యా ముపాసీత’’ అని పెద్దల ఆదేశం. శూద్రాదివర్ణములవారు ఉదయాన్నే స్నానం చేసి జగత్కర్మసాక్షియైన సూర్యునికి నమస్కారం చేసి ధ్యానించడం వల్ల అది సంధ్యావందనం అవుతుంది. సాయంకాలం కూడా ఇలాగే చేయాలి.

దానములు - ధర్మాలు ;

దానములు వేరు, ధర్మములు వేరు. దానమంటే.. ఇచ్చే వస్తువు మీద మమత్వము విచిడి ఇతరులకు ఇచ్చేది. ధర్మమంటే.. ప్రజోపయోగార్థమైచేయు ఇష్టాపూర్తరూపమైనది. బావులు, మంచినీటి నూతులు, చెరువులు తవ్వించుట, దేవాలయ నిర్మాణం, ఉద్యాపనములు, పండ్లతోటలను నాటించుట మొదలైన కార్యాలు ధర్మంలోకి వస్తాయి. అగ్నిహోత్రం, తపస్సు, సత్యవ్రతము, వేదాధ్యయనము, అతిథిమర్యాద, వైశ్యదేవము మొదలైన వాటిని ఇష్టాలు అంటారు.

సూర్య, చంద్రగ్రహణ సమయాలలో ఇచ్చే దానం వల్ల స్వర్గాది పుణ్యలోకాలను పొందుతారు. దేశాన్ని, కాలాన్ని, పాత్రతతను (యోగ్యతను) గమనించి ఇచ్చిన దానం కోటి గుణితలవుతాయి. కర్కాటక, మకర సంక్రమణలు అందుతాయి. అమా, పూర్ణిమాది పర్వములలో చేసే దానం విశేష ఫలితాతలనిస్తాయి.

దాత తూర్పు ముఖంగా కూర్చుని సంకల్సము, గోత్రనామములతో చెప్పి దానాలు ఇవ్వాలి. పుచ్చుకునేవాడు ఉత్తరాభిముఖుడై స్వీకరించాలి. అలా చేయడం వల్ల దాతకు ఆయుర్ధాయము పెరుగుతుంది. గ్రహీతకు పుచ్చుకున్నది అక్షయమవుతుంది. మహాదానములు పదిరకాలుగా వుంటాయి.

శ్లోకము : కనకాశ్వతిలానాగా దాసీరథ మహీగృహా:!

కన్యాచ కపిలా ధేను: మహాదానాని వై దశ !!

బంగారము, గుర్రము, తిలలు, ఏనుగులు, దాసీజనము, రథాలు, భూమి, గృహాలు, కన్యక నల్లని ధేనువు మొదలైనవాటిని మహాదానాలు అంటారు. ఇవి దేవతలకుగాని, బ్రాహ్మనులకుగాని, గురువులకుగాని, తల్లిదండ్రులకుగాని ఇచ్చేటట్లుగా వాగ్దానం చేసిన దానిని ఇయ్యకుండా ఎగ్గొడితే.. వంశనాశనం జరుగుతుంది.

ప్రతిగ్రహీత నుండి ఏదో ఒక లాభాన్ని ఆశించి దానమిస్తే.. అది నిష్ర్పయోజనం అవుతుంది. ప్రతిగ్రహీతను ఉద్దేశించి దానం చేస్తూ, ఆ దానధారను భూమిపై విడవడం వల్ల ఆ దానఫలం మహాసాగరంకన్నా అనంతమైంది అవుతుంది. గౌతమీ, గంగా, గయా, ప్రయాగాది, తీర్థములం మొదలైన దానాలు విశేష ఫలితాలు అందిస్తాయి.

వైవస్వత మన్వంతరంలోని వ్యాసులు :

ఇప్పుడు జరుగుతున్నది వైవస్వత మన్వంతరంలో ఇరవై ఎనిమిదవ మహాయుగం. అదికూడా కలియుగం. వ్యాసుడు జన్మించి, వేదాలను నాలుగుగా విభజించి, పద్దెనిమిది పురాణాలను రచించింది ద్వాపరయుగంలోనే. గతించిన ఇరవైఏడు మహాయుగములలోను ద్వాపరంనందు ఇరవైఏడుగురు వ్యాసులు జనియించారు. ప్రతి కలియుగంలోను మానవుని శక్తి సామర్థ్యాలు పూర్వయుగం కంటే తక్కువగా వుంటాయి. వారు అనంతవేదాలను అధ్యయనం చేయలేరు. అందుకు నిక్షిప్లమైన గూఢ ధర్మాలను గ్రహించి ఆచరించలేరు.

అందుచేత ప్రతి మహాయుగంలో ఒక వ్యాసుడు జన్మించి.. ఆ వేదరాశిని ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలు అని నాలుగు విభాగాలు చేసి, ఒక్కొక్క శాఖను కొన్ని వంశాలయిన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణములవారు అధ్యయనం చేయాలని నియమించారు.

అంతేకాదు.. ఆ వేదాలలోని ధర్మాలను బోధించడానికి పద్దెనిమిది పురాణాలను, పద్దెనిమిది ఉపపురాణాలు వెలిశాయి. గతించిన ఇరవైయేడు ద్వాపరయుగాలలో జన్మించిన వ్యాసులు వీరు.....

మొదటి ద్వాపరంలో - వ్యాసుడు స్వాయంభువు

రెండవ ద్వాపరంలో - ప్రజాపతి

మూడవ ద్వాపరంలో - ఉశనసుడు

నాలుగవ ద్వాపరంలో - బృహస్పతి

ఐదవ ద్వాపరంలో - సవితృడు

ఆరవ ద్వాపరంలో - మృత్యువు

ఏడవ ద్వాపరంలో - ఇంద్రుడు

ఎనిమిదవ ద్వాపరంలో - వసిష్ఠుడు

తొమ్మిదవ ద్వాపరంలో - సారస్వతుడు

పదవ ద్వాపరంలో - త్రిథాముడు

పదకొండవ ద్వాపరంలో - త్రివృషుడు

పన్నెండవ ద్వాపరంలో - శతతేజుడు

పదమూడవ ద్వాపరంలో - ధర్ముడు

పద్నాలుగవ ద్వాపరంలో - తరక్షుడు

పదిహేనవ ద్వాపరంలో - త్య్రారుణి

పదహారవ ద్వాపరంలో - ధనుంజయుడు

పదిహేడవ ద్వాపరంలో - కృతంజయుడు

పద్దెనిమిదవ ద్వాపరంలో - ఋతంజయుడు

పంతొమ్మిదవ ద్వాపరంలో - భరద్వాజుడు

ఇరవైయవ ద్వాపరంలో - గౌతముడు

ఇరవైఒకటవ ద్వాపరంలో - రాజశ్రవుడు

ఇరవైరెండవ ద్వాపరంలో - శుష్మాయనుడు

ఇరవైమూడవ ద్వాపరంలో - తృణబిందుడు

ఇరవైనాలుగవ ద్వాపరంలో - వాల్మీకి

ఇరవైఅయిదవ ద్వాపరంలో - శక్తి

ఇరవైఆరవ ద్వాపరంలో - పరాశరుడు

ఇరవైఏడవ ద్వాపరంలో - జాతూకర్ణుడు

ఇరవైఎనిమిదవ ద్వాపరంలో - కృష్ణద్వైపాయనుడు.

చివరివాడైన కృష్ణద్వైపాయనుడు బ్రహ్మశాసనం మీద వేదాలను నాలుగుగా విభజించి జెమిని, సుమంతు, వైశంపాయులనే శిష్యులకు బోధించి, అష్టాదశ పురాణాలను రచించి, రోమహర్షణునకు బోధించి (సూతునికి) లోకమంతా వ్యాపింపచేశాడు.

శ్రీహరి దశావతారాలు ;

1. మత్స్యావతారం : వైవస్వతమను ఒకనాడు నదిలో సూర్యునికి అర్ఘ్యమిస్తుండగా.. ఒక చేపపిల్ల అతని చేతిలో పడుతుంది. అది పెరిగి పెద్దదవుతుండగా గంగాళంలోను, చెరువులలోను, సరస్సులోను వేశాను. అయినా అది పెరుగుతుండడంతో దాన్ని సముద్రంలో వేశాడు. అప్పుడు ఆ చేప మనుపుతో ‘‘ప్రళయ కాలంలో ఒక నావ వచ్చును. దానిలో సప్తమహర్షులు, నీవు ఎక్కి కూర్చోండి. ప్రళయాంతం వరకు ఆ నావను మహాసముద్రంలో నా కొమ్ముకు కట్టుకుని, లాగుకొని పోవుచునెయుందు’’ అని చెప్పెను. మను అలాగే చేసి ఆ ప్రళయాన్ని దాటుతాడు. మళ్లీ బ్రహ్మసృష్టి చేయడానికి పూనుకున్నప్పుడు హయగ్రీవుడనే రాక్షసుడు (ఇతనిని సోమకాసురుడు అని కూడా అంటారు) వేదాలను అపహరించి, సముద్రంలో దాచిపెట్టగా, శ్రీమన్నారాయణుడు మత్స్యావతారాన్ని మళ్లీ ధరించి, వానిని సంహరించి, వేదాలను మళ్లీ బ్రహ్మ దగ్గరకు చేరుస్తాడు.

2. కూర్మావతారం : దుర్వాసుని శాపంవల్ల ఇంద్రుడు సంపదలన్ని సముద్రంలో కలిసిపోగా.. విష్ణుమూర్తి సలహా మీద దేవదానవులు సముద్రాన్ని మథించారు. ఈ పాలసముద్రాన్ని మథించడం ప్రారంభించినప్పుడు కవ్వంగా వేసిన మందరపర్వతము మునిగిపోసాగింది. అప్పుడు నారాయణుడు కూర్మావతారం ధరించి, దాని క్రింద ఆధారంగా నిలబడతాడు. దానితో సముద్ర మథనము జరిగి సర్వవస్తువులు, అమృతాలు పుట్టకొచ్చాయి.

3. వరహావతారము : హిరణ్యాక్షుడు దేవతలను గెలిచి, స్వర్గాన్ని ఆక్రమించేటప్పుడు అతనిని యజ్ఞవరాహ రూపంతో సంహరించెను.

4. నృసింహావతారం : అతని సోదరుడు హిరణ్యకశిపుడు తరువాత దేవలోకాన్ని ఆక్రమించి యజ్ఞభాగాలను కాజేయగా.. నారసింహరూపం ధరించి అతనిని సంహరించెను.

5. వామనావతారం : బలిచక్రవర్తి ఇంద్రుడై దేవతలను స్వర్గంనుండి తరిమివేయగా.. శ్రీహరి వామనుడైపుట్టి.. బలిని మూడడుగుల నేల అడిగి, వామనుడు అవామనుడై రెండడుగులలో భూమి, ఆకాశాలను ఆక్రమించి, అతనిని పాతాళానికి తొక్కేశాడు.

6. పరశురాముడు : శ్రీహరి తన అంశంతో జమదగ్నికి పరశురాముడై పుట్టి, మదాంధులై రాజులను ఇరవైఒక్కసార్లు దండయాత్రలు చేసి సంహరించెను. చివరికి దశరథ రాముని చేతిలో ఓడి తపమునకు వెళ్లిబోయాడు.

7. శ్రీరాముడు : రావణ, కుంభకర్ణులను సంహరించడానికి దేవతలు ప్రార్థించిన తరువాత దశరథునకు రామునిగా పుట్టి, సీతను పెళ్లి చేసుకుని, సీతాలక్ష్మణులతో అరణ్యవాసం చేసి అనేక రాక్షసులను వధించాడు. రావణుడు సీతను ఎత్తుకుని పోగా, సుగ్రీవుని సహాయంతో లంకకు వెళ్లి రావణకుంభకర్ణ రాక్షసులను సంహరించి, అయోధ్యకు వచ్చి పట్టాన్ని కట్టుగొన్నాడు. లోకాపవాదానికి భయపడి సీతను అడవిలో వదలగా.. ఆమె వాల్మీకి ఆశ్రమానికి చేరుకుంటుంది. అప్పటికే గర్భవతియై వున్న సీత, అక్కడ కుశలవులను ఇద్దరు కొడుకులను గనెను. రాముడు పదకొండేళ్లు రాజ్యం చేసి, కుశునికి పట్టాభిషేకం చేసి, సీతాసమేధుడై అయోధ్యాపురవాసులతో సహా పరమపదానికి వేంచేశాడు.

8. శ్రీకృష్ణావతారం : ఇరవై ఎనిమిదవ ద్వాపరయుగంలో అధర్మప్రవృత్తులైన రాజులవల్ల భూభారం పెరిగినప్పుడు.. భూదేవి కోరికపై శ్రీహరి, కృష్ణావతారాన్ని ఎత్తెను. దేవకీ, వసుదేవులకు అష్టగర్భమున జన్మించి, రేపల్లెలో నందయశోదల ఇంట పెరిగి, బాల్యక్రీడలతో వారిని అలరించి, దుష్టరాక్షసులను సంహరించాడు. మధురాపురానికి పోయి కంసుని సంహరించి, మాతామహుని రాజ్యాన్ని నిలిపి, బలరామునితో కలిసి శత్రువులను నిర్మూలించాడు. రుక్మిణ్యాది అష్టమహిషులను వివాహమాడెను. నరుకుని చంపి 16000 మందిని అతని చెరనుండి విడిపించి, వారిని పెండ్లాడాడు. ద్వారకా నగరాన్ని నిర్మించి, భార్యాపుత్రబంధుమిత్ర పరివారంతో నూటపాతికయేండ్లు భూలోకంలో నివసించాడు. భారత యుద్ధంలో పాండవుల పక్షంనుండి అధర్మపరులను నాశనం చేశాడు. తరువాత యాదవులు మదించి, అధర్మంగా ప్రవర్తిస్తుండగా ముసలం వంకతో వారిని కూడా సంహరించి, తాను పరమపదానికి చేరెను.

9. బుద్ధావతారం : ఒకప్పుడు రాక్షసులు విజృంభించి, దేవలోకంపై దండెత్తి, దేవతలను ఓడించి తరిమివేశారు. దేవతలు ప్రార్థించగా.. మాధవుడు, మాయామోహ స్వరూపంతో శుద్ధోదనుని కుమారుడుగా జన్మించాడు. వేదవిరుద్ధమైన బోధాలతో రాక్షసులను సమ్మోహపరిచి వారిని వేదబాహ్యులను చేశాడు. ఒక్క రాక్షసులనే కాక.. భూలోక వాసులను కూడా భ్రమింపచేశాడు. రాక్షసులు పాషండులై బలాన్ని, తేజాన్ని కోల్పోయారు. అప్పుడు దేవతలు వారిని ఓడించి, స్వర్గాన్ని చేజిక్కించుకున్నారు.

10. కల్క్యవతారం : బుద్ధుని బోధనల ప్రభావం భోలోకంలో వున్న రాజులపై ప్రసరిస్తుంది. వారు అధర్మపరులై ప్రజాకంటకులై ప్రవర్తిస్తారు. ప్రజలు కూడా అన్యాయ ప్రవర్తనులై వేదకర్మలను ఆచరించక వుంటారు. అప్పుడు కలియుగంలో విష్ణుయశుడను వానికి శ్రీహరి, కల్కిరూపంతో జన్మించెను. ధర్మాన్ని తిరిగి ప్రతిష్టించాడు.

ఇలా శ్రీమన్నారాయణుడు ఇంకా ఎన్నో అవతారాలు ఎత్తాడు. అవన్ని ధర్మసంస్థానం చేయడానికినని గ్రహించుకోవాలి.


No comments:

Post a Comment