Friday, April 17, 2015

సరస్వతీదేవి మహిమను తెలిపే ఇతిహాసం

సరస్వతీదేవిని ప్రతిఒక్కరు ఎంతో దైవంగా పూజిస్తారు. ఈమెను చదువుల తల్లిగా పేర్కొంటారు. సరస్వతీదేవి సన్నిధిల్లో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తే.. వారికి చదువు ఎంతో బాగా లభిస్తుందని, భవిష్యత్తు కార్యకలాపాల్లో విజయాలు సాధిస్తారని, జీవిత ప్రయాణంలో ఎటువంటి ఆటంకాలు ఎదురుకావని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. దుష్టశక్తులను సంహారం చేసి, సామాన్య ప్రజల కష్టాలను దూరం చేసే సరస్వతీదేవి మహిమలు ఎన్నో వున్నాయి. అందులో భాగంగానే ఈమె మహిమను తెలిపే రామాయణ ఇతిహాసం గురించి తెలుసుకుందాం...

పూర్వం రామాయణ కాలంలో కుంభకర్ణుడు మృత్యువు లేని జీవితాన్ని పొందాలని కోరుకుంటాడు. ఎప్పటికీ జీవించే వుండి ప్రపంచాన్ని శాసించాలనే వరాన్ని పొందాలనుకుంటాడు. దానికోసం అతడు బ్రహ్మదేవునుని సంతోషపరిచి, ఆ వరాన్ని సంపాదించుకోవాలని ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నంలో భాగంగా కుంభకర్ణుడు కొన్ని వేల సంవత్సరాలవరకు బ్రహ్మదేవుని కోసం ఘోర తపస్సు చేయసాగాడు. అయితే బ్రహ్మదేవుని మాత్రం అతనికి ఆ వరాన్ని ప్రసాదించడం ఇష్టం వుండదు. ఒకవేళ అటువంటి వరాన్ని ప్రసాదిస్తే.. మొత్తం ప్రపంచం అల్లకల్లోలం అవుతుందని, ప్రతిఒక్కరిని హింసిస్తాడని బ్రహ్మదేవుడు అనుకుంటాడు. దాంతో కుంభకర్ణుడు ఎంతకాలం తపస్సు చేసినా.. బ్రహ్మదేవుడు మాత్రం అతనికి ప్రత్యక్ష్యం కాడు.

అయినా పట్టువదలకుండా కుంభకర్ణుడు తపస్సు కార్యక్రమాన్ని కొనసాగిస్తాడు. బ్రహ్మదేవుడికి ఇక దిక్కు తోచ సరస్వతీదేవి దగ్గరకు వెళతాడు. కుంభకర్ణుని వరం గురించి ఆమెకు వివరిస్తాడు. ఆమెను యుక్తితో వేడుకుంటూ... ‘‘దేవి! కుంభకర్ణునికి అమరత్వ వరాన్ని ప్రసాదిస్తే వినాశనం సృష్టిస్తాడు. ఆ వరాన్ని పొందేందుకు అతను పట్టువీడకుండా తపస్సు చేస్తూనే వున్నాడు. అందుకు నేను కూడా ఏమీ చేయలేకపోతున్నాను. కాబట్టి లోకకంటకుడైన కుంభకర్ణుడు వరాన్ని కోరుకునే సమయంలో అతని వాక్కును తారుమారు చేయాల్సిందిగా కోరుకుంటున్నాను’’ అని అంటాడు. అందుకు సరస్వతీదేవి ఒప్పుకుంటుంది.

వీరిద్దరి సంభాషణ ముగిని తరువాత బ్రహ్మదేవుడు, ఘోర తపస్సులో వున్న కుంభకర్ణుని ఎదుట ప్రత్యక్షమవుతాడు. అప్పుడు బ్రహ్మ... ‘‘నాయనా కుంభకర్ణా! నువ్వు నీ ఘోర తపస్సుతో నన్ను ఎంతో సంతుష్టం పరిచావు. నీకు ఏ వరం కావాలన్నా కోరుకో’’ అని అంటాడు. దొరికిన అవకాశాన్ని చేజిక్కించుకోకూడదనే ఆనందంలో కుంభకర్ణుడు అమరత్వ వరాన్ని కోరుకోబోతుండగా.. సరస్వతీ దేవి అతని వాక్కును తారుమారు చేస్తుంది. దాంతో అతను అమరత్వ వరానికి బదులు నిద్రను కోరుకుంటాడు. వెంటనే బ్రహ్మదేవుడు ‘‘తథాస్తు’’ అని నిద్రను ప్రసాదిస్తాడు. ఇలా ఈ విధంగా సరస్వతీదేవి, లోకకంటకుడై కుంభకర్ణుని శక్తులను అణచివేసి, లోకోపకారానికి ఎంతో సహాయం చేసింది.

No comments:

Post a Comment