Sunday, April 19, 2015

దక్షుడు ఎవరు..? అతను శివునిని ఎందుకు శపించాడు..?

పూర్వం మహాశివుడు దక్షుడి కుమార్తె అయిన సతీదేవిని వివాహం చేసుకున్నాడు. అంటే దక్షుడు, పరమేశ్వరుడికి మామ అన్నమాట! అయితే దక్షునికి వున్న అల్లుళ్లలో శివుడు తప్ప మిగతావారందరూ కూడా మహా సంపన్నులు. కానీ శివుడు మాత్రం స్మశానంలో ధ్యానం చేసుకుంటూ, ఆవుని తన వాహనంగా చేసుకుని తిరుగుతుండేవాడు. దాంతో దక్షునికి అల్లుడైన శివుడు అంటే చాలా చిన్నచూపు. దక్షప్రజాపతి శివుడిని ఏ శుభకార్యానికిగానీ, ఇతరు కార్యక్రమాలకుగానీ ఆహ్వానించేవాడు కూడా కాదు.

ఇదిలా వుండగా... ఒకరోజు పరమేశ్వరుడు తన మామగారైన దక్షునికి సరిగ్గా పలకరించకపోవడం, పెద్దరికం చూపించకపోవడం, గౌరవించకపోవడంతో అతను కోపాద్రిక్తుడైపోతాడు. ఆ సమయంలో దక్షుడు తన మనసులో.. ‘‘ఎందరో మహానుభావులు, రాజులు, దేవతలు నన్ను గౌరవిస్తారు. ఆదరిస్తూ ఆహ్వానాలకు పిలుస్తారు. అటువంటి నన్ను ఈ పేదవాడు.. భిక్షం ఎత్తుకుని ఆరగించేవాడు.. ఎప్పుడూ స్మశానంలోనే కూర్చొని ధ్యానం చేసుకునేవాడు.. నన్ను కనీసం పలకరించకుండా ఇంత మౌనంగా వుంటాడా..! ఇంత పొగరా’’ అంటూ ఆందోళన చెందుతాడు.

అంతేకాకుండా దక్షుడు తనలో తాను.. ‘‘పశువు మీదెక్కి తిరగడమే కాకుండా.. పశువులా ప్రవర్తించడం మొదలుపెట్టేశాడు. అసలు అతనికి తెలివి లేకపోయినా.. కనీసం ఇతరులను గౌరవించాలన్న సంస్కారం కూడా లేదా? ఇటువంటి వాడిని నమ్మి నా కూతురిని ఇచ్చినందుకు నాకు చాలా బాధగా వుంది. సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తోంది’’ అంటూ కుమిలిపోతాడు. చివరికి తన లోపల వున్న ఆవేశాన్ని దాచుకోలేక దక్షుడు తన అల్లుడైన పరమశివుడిని అనరాని మాటలతో తిడతాడు. తనలో వున్న కోపాన్ని శివుడి మీద వెళ్లగక్కుతాడు. అయినా కూడా శివుడు మామగారి పరువుని కాపాడటం కోసం నోరు మెదపకుండా అలాగే వుండిపోయాడు.

కానీ అల్లుడు సమాధానం ఇవ్వడం లేదన్న భావంతో దక్షునికి ఆవేశం మరింత బయటికొచ్చేస్తుంది. తనలో వున్న మొత్తం కోపాన్ని వెళ్లగక్కుతూ... ‘‘నేను ఇంతలా నీకు అడుగుతుంటే.. నన్ను లెక్కచేయకుండా పరాభావిస్తావా? నువ్వు చాలా తప్పు చేసేశావు. ఇందుకు నువ్వు శిక్షను అనుభవించాల్సిందే..! ఇకపై నుంచి యజ్ఞయాగాదులలో నీకు హవిస్సులు లేకుండా పోతాయి. ఇది నా శాపం. ఇదే నేను జీవితాంతం నీకిచ్చే శిక్ష’’ అంటూ దక్షుడు తన అల్లుడైన పరమేశ్వరుడిని శపిస్తాడు.

No comments:

Post a Comment