Saturday, April 18, 2015

రామాయణం పఠించడం వల్ల కలిగే లాభాలు

ప్రాచీనకాలంలో దేవతల జీవన విధానం, వారు అనుసరించిన పద్ధతులకు సంబంధించిన పవిత్ర పురాణ గ్రంథాలు ఎన్నో వున్నాయి. వాటిని పఠించడంగానీ, వినడంగానీ చేస్తే... మన సర్వపాపాలు తొలగిపోవడమే కాకుండా... జీవితంలో వున్న కష్టాలు తొలగిపోయి, లాభాల పంటలు పండుతాయని ఆనాటి ఋషువులు పేర్కొన్నారు. అటువంటి పవిత్ర గ్రంథాల్లో వాల్మీకి రచించిన రామాయణం ఎంతో మహోన్నతమైంది.

24,000 శ్లోకాలతో కూడిన రామాయణం... హిందూ చరిత్ర, సంస్కృతి, ఆచారాలపై ప్రగాఢ ప్రభావాన్ని కలిగి వుంది. అందులో వున్న పాత్రల ద్వారా మంచి-చెడు మధ్య భేదాలు, ఆదర్శ జీవిన విధానం, గౌరవ-అగౌరవాలు వంటి విషయాలను ఎన్నో నేర్చుకోగలగుతాము. ముఖ్యంగా అందులో వున్న పాత్రలు మనకెంతో తోడ్పడుతాయి. బంధాలు, బంధువుల పట్ల ఎలా వ్యవహరించాలి... మన జీవితానికి సార్థకం ఏంటి..? అన్న వాటి గురించి క్లుప్తంగా విశదీకరిస్తుంది.

ఆదికావ్యం రామాయణం, వాల్మీకి రామాయణాన్ని చదవడం ద్వారా మన దోషాలను నివారించుకుంటూ... శత్రువులను కూడా జయించవచ్చు. ఆటుపోట్లను ఎదుర్కుంటూ... విజయాలబాటవైపు అడుగులు వేయొచ్చు. పెళ్లయిన స్త్రీలు రామాయణాన్ని చదివినాగానీ, విన్నాగానీ వారికి రాముడువంటి మంచి కుమారుడు జన్మిస్తాడు. పెళ్లికాని కన్యలకు శ్రీరాముడు వంటి సద్గుణాలు కలిగిన మంచి భర్త లభిస్తాడు.

రామాయణాన్ని నిత్యం పఠించడం ద్వారా మానవ శరీరంలో వున్న సమస్త రోగాలు తొలగిపోవడమే కాకుండా... ఆరోగ్యవంతుడిగా వెలుగుతాడు. మృత్యుదోషాలు తొలిగిపోయి, దీర్ఘాయుష్షును పొందుతాడు. అలాగే సంకల్ప సిద్ధి, దైవానుగ్రహం కూడా కలుగుతాయి. నలుగురిలో గౌరవ మర్యాదలు పొందుతారు. నిర్వహించుకునే ప్రతి కార్యక్రమంలోనూ మంచి ఫలితాలను పొందుతారు. జీవితంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని ఎదుర్కుంటూ ముందుకు సాగిపోతారు. అంతేకాదు... మానవ జీవితంలో అవసరమయ్యే విషయాలు అన్నీ సమకూరుతాయి.

No comments:

Post a Comment