Sunday, August 2, 2015

శ్రీ మహాభారతంలో కథలు - గాంధారి శాపం

కురు పాండవ యుద్ధంలో ధృతరాష్ట్ర పుత్రులు అందరూ హతమయ్యారు. ఐశ్వర్యం పోయింది. బంధువులంతా నాశనమయ్యారు. “ఇంత దారుణం జరిగినా చావురాలేదు నాకు” అని వాపోయాడు ధృతరాష్ట్రుడు.
వ్యాసమహాముని ధృతరాష్ట్రుణ్ణి ఓదారుస్తూ, “నాయనా! ఎవ్వరి ప్రాణాలూ శాశ్వతం కాదు. ఈ సత్యాన్ని మనస్సుకు బాగ పట్టించుకున్నావంటే ఇంక నీకే దుఃఖం వుండదు. ఇప్పుడు విచారిస్తున్నావు కాని , జూదమాడేనాడు విదురుడెంత చెప్పినా విన్నావా? దైవకృత్యాన్ని మనుషులు తప్పించగలరా?” అన్నాడు.
“రాజా! ఒకనాడు దేవసభకు వెళ్ళాను నేను. దేవతలతో, మహామునులతో మట్లాడుతున్న సమయంలో భూదేవి ఏడుస్తూ వచ్చిందక్కడికి.
‘నా భారం తొలగిస్తానని మీరంతా బ్రహ్మసభలో ప్రతిజ్ఞలు పలికారు. ఇప్పుడిలా ఎందుకు ఆలస్యం చేస్తున్నారో తెలీడం లేదు. ఇంక నా భారం తొలిగే మార్గమేమిటి?’ అని దేవతలను ప్రశ్నించిందామె.
‘ధృతరాష్ట్రుడనే రాజుకు నూరుగురు కొడుకులు పుడతారు. వాళ్ళలో పెద్దవాడైన దుర్యోధనుడి వల్ల నీ భారమంతా నశిస్తుంది. వాణ్ణి చంపడానికీ, రక్షించడానికీ ముందుకు వచ్చి భూమిమీద వున్న రాజులంతా సేనలతో సహా కురుక్షేత్రంలో హతులవుతారు. ఆ దుర్యోధనుడు కూడా తమ్ములతో పాటు మరణిస్తాడు. అంతటితో నీ భారం తీరిపోతుంది. వెళ్ళు! నిశ్చింతగా భూతధారణం చెయ్యి ‘ అన్నాడు నారాయణుడు చిరునవ్వుతో.
“విన్నావు కదా రాజా! మరి కౌరవులు నాశనమయ్యారంటే ఆశ్చర్యమేముంది! విధిని ఎవరు తప్పిస్తారు?”
ధృతరాష్ట్రుడు ధైర్యం తెచ్చుకుని గాంధారినీ, కుంతినీ, కోడళ్ళనూ వెంటపెట్టుకుని యుద్ధభూమికి బయలుదేరాడు.
పెదతండ్రి వస్తున్నాడని తెలిసి ధర్మనందనుడు ముందే అక్కడికి వెళ్ళాడు. అతని వెంట తమ్ములూ ద్రౌపదీ కృష్ణుడూ కూడా వున్నారు.
ధర్మరాజు కంటపడగానే ధృతరాష్ట్రుడి కోడళ్ళందరూ బిగ్గరగా ఏడ్చారు. దుఃఖంతో, అవేశంతో పేరుపేరునా పాండవులందర్నీ నిందించారు.
కళ్ళనీళ్ళు కారుస్తూ మౌనంగా తల వంచుకున్నాడు ధర్మరాజు. ధృతరాష్ట్రుడి పాదాలకు నమస్కరించాడు. తరువాత పాండవులు కృష్ణసహితంగా వెళ్ళి గాంధారికి నమస్కరించారు.
కోపంతో మండిపడిందామె.
“శత్రువుల్ని చంపొచ్చు. కాని ఈ గుడ్డివాళ్ళిద్దరికీ ఊతకర్రగా ఒక్కణ్ణయినా మిగల్చకుండా అందర్నీ నాశనం చేశారే! మీకు అపకారం చెయ్యనివాడు వందమందిలో ఒక్కడైనా లేకపోయాడా? ఒక్కణ్ణి అట్టేపెడితే మీ ప్రతిజ్ఞ భంగమౌతుందా? అ ఒక్కడూ మిమ్మల్ని రాజ్యం చెయ్యనివ్వకుండా అడ్డగిస్తాడా? ఇంతకూ ఏడీ మీ మహారాజు?” ఎర్రబడిన ముఖంతో ప్రశ్నించింది.
అజాతశత్రుడు మోకరిల్లాడు. గాంధారి తలవంచి దీర్ఘంగా నిట్టూర్చింది. నేత్రాలను బంధించిన వస్త్రం సందులోంచి ఆ మహాసాధ్వి దృష్టి లిప్తపాటు ధర్మరాజు కాలిగోళ్ళ మీద పడింది. ఆ గోళ్ళు వెంటనే ఎర్రగా కందిపోయాయి. అది చూసి హడలిపోయి కృష్ణుడి వెనకాల దాగాడు అర్జునుడు.
మహాజ్ఞానీ, సంయమనం కలదీ కనుక గాంధారి కోపాన్ని శమింప చేసుకుని “నాయనా! వెళ్ళి కుంతీదేవిని చూడండి” అంది.
కానీ ఇంతటికీ కారణమైన కృష్ణుడి పట్ల ఆమె క్రోధం కట్టలుతెంచుకుంది.
“వాసుదేవా! ఇలా రావయ్యా” అని పిలిచింది గాంధారి.
“కృష్ణా! కౌరవ పాండవ కుమారులు తమలో తాము కలహించుకున్నప్పుడు నువ్వు నచ్చచెప్పకపోయావు. కదన రంగాన కాలూనినప్పుడూ నువ్వు అడ్డుపడకపోయవు. సమర్ధుడవై వుండి కూడా ఉపేక్ష చేశావు. అందర్నీ చంపించావు. దేశాలన్నీ పాడుబెట్టావు. జనక్షయానికి కారకుడైన జనర్థనా! దీని ఫలం నువ్వు అనుభవించవలసిందే. నా పాతివ్రత్య పుణ్యఫల తపశ్శక్తితో పలుకుతున్నాను – నువ్వు వీళ్ళందర్నీ ఇలా చంపావు కనుక ఈనాటికి ముప్ఫై ఆరో సంవత్సరంలో నీ జ్ఞాతులు కూడా వీళ్ళలాగే పరస్పరం కలహించుకుని చస్తారు. అదే సమయాన నువ్వు దిక్కులేక నీచపు చావు చస్తావు. మీ కుల స్తీలు కూడా ఇలాగే అందర్నీ తలుచుకుని ఏడుస్తారు. ఇది ఇలాగే జరుగుగాక” అని శపించిండి గాంధారి.
సమ్మోహకరంగా చిరునవ్వు నవ్వాడు కృష్ణుడు.
“అమ్మా! ఈ శాపం యాదవులకు ఇదివరకే ఇచ్చారు కొందరు మునులు. నువ్విప్పుడు చర్చిత చర్వణం చేశావు. యదువంశీయులను దేవతలు కూడా చంపలేరు. అందుచేత వాళ్ళలో వాళ్ళే కొట్టుకుచస్తారు. పోనీలే కానీ అందువల్ల నీకేం వస్తుంది చెప్పు?” అన్నాడు నవ్వుతూనే.
పుత్రశోకంతో పరితపిస్తూ అవధులెరగని ఆక్రోశంతో అచ్యుతుని శపించిన గాంధారి జవాబు చెప్పలేక మౌనం వహించింది.

పుష్పక విమానం

భారతీయ పురాణాలలో ప్రస్తావించబడ్డ గాలిలో ఎగరగలిగే ఒక వాహనం. ఎంతమంది ఇందులో కూర్చున్నా మరొకరికి చోటు ఉండటం దీని విశేషం.
రామాయణంలో పుష్పక విమానం గురించిన వర్ణన ఉంది. యుద్ధానంతరం సీతతో కూడి సకాలంలో అయోధ్య చేరడానికి రాముడు దీనిని ఉపయోగించాడు.
సుందర కాండ ఎనిమిదవ, తొమ్మిదవ సర్గలలో పుష్పక విమానం విపులంగా వర్ణించబడింది. సీతాన్వేషణా సమయంలో హనుమంతుడు పుష్పక విమానాన్ని చూశాడు.
నిజానికి ఇది బ్రహ్మ దేవుడి కోసం విశ్వకర్మ సర్వవిధ రత్నములతో 'పుష్పకం' అనే పేరుగల ఒక దివ్య విమానాన్ని స్వయంగా నిర్మించాడట. ఐతే కుబేరుడు తీవ్రమైన తపస్సు చేసి, బ్రహ్మను మెప్పించి ఆ విమానాన్ని బ్రహ్మ అనుగ్రహముతో కానుకగా పొందాడట. పిమ్మట రావణుడు, తన సోదరుడైన కుబేరుని జయించి ఆ పుష్పక విమానాన్ని తన స్వంతం చేసుకున్నాడట.
ఇంతకీ ఆవిమానంలో మనం ఉహించినట్టుగా కేవలం ఆసనాలు మాత్రమే ఉండవు. ఎందుకంటే మన హనుమంతుడు లంకలో ప్రవేశించినప్పుడు, రావణుడు కానుకగా పొందిన పుష్పకము లోపల చూడగానే సాక్షాత్తు స్వర్గలోకమే అవతరించిందా? అన్న భ్రాంతి కలిగిందట. ఇక ఆ పుష్పకము యజమాని మనసు ననుసరించి మనో వేగముతో పయనిస్తుందట. అసలు శత్రువులకు దొరికే పరిస్థితి ఎప్పుడూ ఉండదుట. అంతే కాదు ఆ విమానానికి బయట లోపలివైపున విశిష్టమైన శిల్ప రీతులు గోచరిస్తాయట. కర్ణ కుండలాలతో శోభిస్తున్న ముఖములుగల వారు, మహా కాయులు, ఆకాశంలో విహరించే రాక్షసులు తమ ప్రభువుకు అనుకూలంగా ప్రవర్తించే వారు, విశాల నేత్రములు గల వారు, అతి వేగముగా సంచరించ గల వేలాది భూతగణాల వారు ఆ విమానాన్ని మోస్తున్నట్టుగా దాని వెలుపలి భాగంలో శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. అదంతా చూసిన హనుమ ఈ విమానం రావణుడి స్థాయికి తగినట్టు దర్పంగా ఉంది అనుకున్నాడట. ఇంకా చెప్పాలంటే మెరుపు తీగల్లాంటి నారీ మణులు ఎందరెందరో ఆ విమానంలో ఉండటమే గాక అనేక సుందర దృశ్యాలు చిత్రీకరించ బడి ఉన్నాయట. వాటిలో అవి భూమి మీద పర్వత పంక్తులా? అన్నట్టుగా చిత్రించిన చిత్రాలు ఆ పర్వతాల మీద వృక్ష సమూహములు పుష్పాలు వాటి కేసరములు, పత్రములు స్పష్టముగా చిత్రీకరించబడి ఉన్నాయట.

కురుక్షేత్ర యుద్ధంలో ప్రముఖ వ్యూహాలు

మహాభారతంలో జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు ఏడు అక్షౌహిణీలు, కౌరవులు పదకొండు అక్షౌహిణీల సైన్యంతో యుద్ధాన్ని ప్రారంభించారు. రోజుకొక వ్యూహం నిర్మించి ఆ ఆకారంలో తమ సైన్యాలను నిలిపేవారు. అందులో కొన్ని ప్రముఖమైన వ్యూహాలు..
1. క్రౌంచారుణ వ్యూహం : పాండవ సేనాని దృష్టద్యుమ్నుడు క్రౌంచపక్షి ఆకారంలో సైన్యాన్ని నిలుపుతాడు.
2. గరుడ వ్యూహం : యుద్ధం మొదలైన మూడవ రోజున భీష్ముడు గరుడపక్షి ఆకారంలో ఈ వ్యూహాన్ని నిర్మించాడు. దీనినే సువర్ణ వ్యూహం అని కూడా అంటారు.
3. శకట వ్యూహం : మహాభారత యుద్ధ పదకొండవ రోజున ద్రోణుడు బండి ఆకారంలో ఈ వ్యూహాన్ని నిర్మించి సైన్యాన్ని నిలిపి తాను కేంద్ర స్థానంలో నిలబడ్డాడు.
4. చక్ర వ్యూహం : పదమూడవ రోజు ద్రోణుడు ఈ వ్యూహాన్ని రచించాడు. దీనినే పద్మవ్యూహం అని కూడా అంటారు. చక్రాకారంలో సైన్యాన్ని నిలుపుతారు. దీనిని చేదించడం అందరికీ సాధ్యం కాదు. అభిమన్యుడు ఈ వ్యూహంలో ప్రవేశించినా బయటకు రాలేక కౌరవుల మోసానికి బలయ్యాడు.
5. మకర వ్యూహం : ఐదవ రోజున భీష్ముడు ఈ వ్యూహాన్ని నిర్మించి మకరాకారంలో సైన్యాన్ని నిలిపి యుద్ధరంగంలో చెలరేగిపోయి పాండవులకు చాలా నష్టాన్ని కలిగించాడు.
6. బార్హస్పత్య వ్యూహం : పదిహేడవ రోజున బృహస్పతి సహకారంతో కర్ణుడు ఈ వ్యూహాన్ని పన్నుతాడు.
7. శృంగాటక వ్యూహం: ఎనిమిదవ రోజు భీష్ముని వ్యూహానికి ప్రతిగా దృష్టద్యుమ్నుడు ఈ వ్యూహాన్ని నిర్మించి త్రికోణాకారంలో సైన్యాన్ని నిలుపుతారు.
8. శ్యేన వ్యూహం: ఈ వ్యూహాన్ని కూడా భీష్ముడి మకర వ్యూహానికి ప్రతిగా దృష్టద్యుమ్నుడు డేగ ఆకారంలో నిర్మించాడు. ఐదవరోజు నిర్మించిన ఈ వ్యూహాన్ని డేగ వ్యూహం అని కూడా అంటారు.
9. అర్ధచంద్ర వ్యూహం : మూడవ రోజు భీష్ముడు పన్నిన గరుడ వ్యూహానికి ప్రతిగా దృష్టద్యుమ్నుడు అర్ధచంద్ర వ్యూహాన్ని నిలుపుతాడు.
10. మండల వ్యూహం : ఏడవ రోజున భీష్ముడు మండలాకారంలో వ్యూహాన్ని రచించి కౌరవ సైన్యాన్ని నిలుపుతాడు.
11. మండలార్ధ వ్యూహం : పన్నెండవ రోజు ద్రోణుడు పన్నిన గరుడ వ్యూహానికి ప్రతిగా ధర్మరాజు మండలార్ధ వ్యూహాన్ని నిర్మించి పాండవ సేనను నిలుపుతాడు.
12. వజ్ర వ్యూహం : ఏడవ రోజున భీష్ముడు కౌరవ సేనను మండల వ్యూహంలో నిర్మించగా ధర్మరాజు పాండవ సేనను వజ్ర వ్యూహంలో రచిస్తాడు.
13. సూచీ ముఖ వ్యూహం : ఆరవరోజు దృష్టద్యుమ్నుడు పాండవ సేనను మకర వ్యూహంలో నడిపింపగా భీష్ముడు కౌరవసేనను క్రౌంచ వ్యూహంలో నిలుపుతాడు. కాని ఈ రెండు వ్యూహాలు భంగపడదంతో అభిమన్యుడు సూచీ ముఖ వ్యూహాన్ని రచించి సూది ఆకారంలో సైన్యాన్ని నిలుపుతాడు.
14. వ్యాల వ్యూహం : నాలుగవ రోజు భీష్ముడు కౌరవ సేనను చుట్ట చుట్టుకున్న పాములా నిలుపుతాడు. ఇది చాలా కష్టమైన వ్యూహం. ఈ వ్య్హూహం ద్వారా సైన్యాల స్తంభనను అంచనా వెయ్యడం కష్టం.
15. సర్వతోభద్ర వ్యూహం : తొమ్మిదవ రోజు భీష్ముడు సైన్యాన్ని సర్వతోభద్ర వ్యూహంలో నిలిపాడు.
16. మహా వ్యూహం : భీష్ముడు రెండవ రోజు ఈ వ్యూహాన్ని నిర్మించి అజేయుడై శత్రు సైన్యాన్ని హడలగొట్టించాడు.

శ్రీకాళహస్తిశ్వరస్వామి మహత్యం

శ్రీకాళహస్తిశ్వరస్వామి స్వయంభువు,శ్రీ అనగా సాలె పురుగు,కళా అనగా పాము,హస్తి అనగా ఏనుగు,ఈ మూడు జంతువులు శివభక్తి వలన
సాయుజ్యం పొంది శివునిలో గలసిపోయినవి. అందువలన ఇచ్చట స్వామి వారికీ శ్రీ కాళహస్తిశ్వరుడు అని ఈ పురముకు శ్రీ కాళహస్తి అనియు పేరు వచ్చెను
*
సాలె పురుగు- శివ సాయుజ్యం
కృతయుగంలో చెలది పురుగు తన శరీరం నుంచి వచ్చు సన్నని దారంతో
కొండఫైనున్న శివునికి గుళ్ళ గోపురాలు ప్రాకారములు కట్టి శివుని
పూజించుచుండెను.ఒకనాడు శివుడు పరిక్షింపదలచి అక్కడ మండుచున్న
దేపములో తగిలి సాలీడు రచించిన గుడి గోపురములను తగులబడిపొవుచున్
నట్లు చేసిను.
ఇది చుసిన సాలీడు దీపమును మ్రింగుటకు పోగా శివుడు ప్రతక్ష్యమై దాని భక్తికి మెచ్చి వరము కోరుకోమనెను.అపుడు
సాలీడును మరల తనకు జన్మ లేకుండా చేయమని కోరుకొనెను.అందుకు శివుడు
సమ్మతించి సాలిడుని తనలో ఐఖ్యమైనపోవునట్లు చేసిను.ఈ విధముగా
సాలీడు శివసాయుజ్జ్యము పొంది తరించింది
*
నాగు పాము-ఏనుగు-శివారాధన చేసి తరించుట:
ఏనుగు పాముల కథ త్రేతాయుగమున జరిగినది.ఒక పాము పాతాళము నుండి
పెద్ద పెద్ద మణులను తెచ్చి ప్రతి దినము శివలింగమునకు పూజ చేసి
పోవుచుండెను.త్రేతాయుగం ముగిసి,ద్వాపరయుగం వచ్చినది.అప్పుడు ఏనుగు శివలింగమునకు పూజచేసి పోవుచుండెను.
త్రేతాయుగం ముగిసి ద్వాపరయుగం
వచ్చినది.అప్పుడు ఏనుగు శివలింగమును సేవింపజొచ్చెను.అది స్వర్ణముఖి
నదిలో స్నానమాచరించి తొండముతో నీరు,పుష్పములు,బిల్వదళములు
తెచ్చి,పాము సమర్పించిన మణులను త్రోసివేసి,తాను తెచ్చిన నీటితో
అభిషేకం చేసి పుష్పములతో అలంకరించి పూజించి వెడలి పోవుచుండెను.
మరునాడు ఉదయం పాము వచ్చి చూచి తాను పెట్టి వెళ్ళిన మణులను గానక వానికి
బదులు బిల్వములు,పుష్పములు పెట్టియుండుట గాంచెను.
అప్పడు పాము మనస్సున చాలా బాధపడి వాడుక ప్రకారం ఏనుగు ఉంచి
వెళ్ళిన పువ్వులను త్రోసివేసి,తాను ఇట్లు కొంత కాలము వరకు పాము ఉంచిన
మణులను ఏనుగు ,ఏనుగు ఉంచిన పుష్పదులను పాము శుబ్రపరచి తమ తమ
ఇష్టనుసరముగా పూజచేసి ఈశ్వరుని సేవించుచు వచ్చినవి..
ఒక రోజు పాము విసుగెత్తి తన మణుల త్రోయబడి ఉండుటకు కోపం చెంది.ఈ
విషయమునకు కారణము తెలుసుకొన గోరి ప్రక్కనే యున్నా పొదలో దాగి
పొంచి యుండెను.అది గమనించిన పాము కోపముతో తన శత్రువుఅయిన ఏనుగు
తొండములో దూరి కుంభస్టలమున నిలిచి డానికి ఉపిరి ఆడకుండా చేసిను.ఈ
భాధకు ఏనుగు తాళ్ళజాలక ఈశ్వర ధ్యానంతోతొండముతో శివలింగము తాకి
శిరస్సును గట్టిగా రాతికిమోది తుదకు మరణించెను.
ఆ శిలాఘతమునకు ఏనుగు కుంభస్టలమున నుండిన పాము గూడా చచ్చి బయటబడినది.ఇట్లు ఇద్దరు తమ తమ నిజ స్వరూపంతో రుద్ర గణములుగా మరి స్వామి
ఐఖ్యమొందిరి.
ఈ స్మృతి చిహ్నంగా కాళము పంచ ముఖ ఫణాకారముగా శిరోపరిభాగమునకు
ఏనుగు సూచకముగా రెండు దంతములను,సాలె పురుగు అడుగు భాగంలోనూ,తన లింగాకృతిలో నైక్యమొనరించుకొని శివుడు శ్రీ కాళహస్తిశ్వరుడుగా ఇచ్చట
దర్సనం ఇచ్చుచున్నాడు.ఆనాటి నుండి ఈ పుణ్యక్షేత్రంకు `శ్రీ -కళా- హస్తి అని పేరు వచ్చింది.
*
చారిత్మాక ప్రాశస్త్యం
క్రీస్తు పూర్వం ఒకటి రెండు శతాబ్దంలో వ్రాయబడిన తమిళ గ్రంధములో
శ్రీ కాళహస్తిని దక్షిణ కైలాసముగా పేర్కొనబడినది.రెండు మూడోవ
శతాబ్దంలో అరవైముగ్గురు శైవనాయన్మారులను శివ భక్తులలో ముఖ్యులైన అప్పర్ సుందరర్,సంభంధర్,మణిక్యవాచగర్ అనువారలు ఈ క్షేత్రమును సందర్శించి కీర్తించారు.
మూడోవ శతాబ్దంలో సట్కిరర్ అను
ప్రసిద్ధ తమిళ కవీశ్వరుడు రత్నముల వంటి నూరు తమిళ అందాదిలో శ్రీ
కాళహస్తిశ్వరుని సోత్రరుపంగా కీర్తించాడు.జగద్గురు శ్రీ శ్రీ శ్రీ
ఆదిశంకరులు వారి ఈ క్షేత్రమును సందర్శించి అమ్మవారి ఎదుట శ్రీ
చక్ర ప్రతిస్థాపన గావించియున్నారు.వారె స్పటికలింగము నొకటి
నెలకోల్పినారు.
పల్లవ,చోళ ,విజయనగర రాజుల కాలపు శిల్ప కళ
వైపుణ్యం ఈ క్షేత్రమును వెలసినవి.క్రి.శ. 1516 లో శ్రీ కృష్ణదేవరాయలు పెద్ద గాలిగోపురమును , నూరు కాళ్ళ మండపమును( రాయల మండపము) నిర్మించినారు
శ్రీకాళహస్తి పట్టణం చిత్తూర్ జిల్లలో ఆంధ్ర ప్రదేశ్ రాస్త్ర్హం లోనిది.కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమలకు కేవలం 40
కిలోమీటర్లు దూరంలో వెలసినది.పట్టణమునకు మూడు కిలోమీటర్ల దూరంలో
రైల్వేస్టేషన్ రేణిగుంట గూడూర్ మార్గం కలదు. ఈ క్షేత్రంను చేరుకొనుటకు
దేశంలోని అన్ని వైపుల నుండి బస్సు,రైలు విమాన సౌకర్యాలు గలవు

తొలి ఏకాదశి

తొలి ఏకాదశి ఆషాడ శుద్ధఏకాదశి నాడు ఆచరిస్తారు. ఆషాడమాసము లోనే ప్రత్యక్షనారాయణుడు తన మార్గాన్ని దక్షిణాయనములోనికి మార్చుకునేది.ఈ పండుగ దాదాపు దక్షిణాయనము ప్రారంభము అయిన తరువాత మొదటి పండుగని తొలి ఏకాదశి గా ప్రజలు చేస్తారు.ఈ పండుగ పూర్వ కాలములో ఏరువాక వేడుకల్లో భాగముగా చేసేవారు.
తొలి ఏకాదశి వైష్ణవం లో ముఖ్యమైన పండుగ. విష్ణుమూర్తి తన లోక పాలకత్వానికి కొద్దిగా విశ్రాంతినిస్తూ ఆషాడ శుద్ధ ఏకాదశి నాడు శేషువు పైన శయనించుటకు ప్రారంభించిన రోజు అందుకని తోలి ఏకాదశి అని శయనైక ఏకాదశి అని పిలుస్తారు.దశమి నాడు ముక్కోటి దేవతలు విష్ణువు ను పూజించి సేవిస్తారు.
ఆయన ఈరోజున యోగనిద్రకు ఉపక్రమిస్తాడు. ఆదిశేషువు పైన తన యోగనిద్రకు ఉపక్రమిస్తాడు అందువలన శేషశయన ఏకాదశి అని పిలుస్తారు.అందువలన దశమి నాటి రాత్రి నుంచి ముక్కోటి దేవతలు అయినను అర్చిస్తారు.
ఈ ఏకాదశిని పద్మఏకాదశి గా కూడా పిలుస్తారు.విష్ణువు లోక పాలకుడు. ప్రజల చైతన్యానికి ప్రతిక. మరి విష్ణువు యోగ నిద్ర అంటే.
ఈ యోగ నిద్ర అనేది భూమి పై రాత్రి సమయాలు పెరుగుతాయి అన్నదానికి సూచన.తద్వార ప్రజలలో నిద్రా సమయాలు పెరుగుతాయి.
భవిష్యోత్తరపురాణం లో కృష్ణుడు ధర్మరాజుకు ఈ ఏకాదశి మహత్యం వివరించాడని వున్నది.
సూర్య వంశం లో ప్రఖ్యాతరాజు మాంధాత. అతడు ధర్మము తప్పడు,సత్యసంధుడు. అతని రాజ్యం లో ఒకసారి తీవ్ర కరువు వచ్చింది. దానితో ప్రజలు పడరాని పాట్లు పడుతుంటే అంగిరసుడు సూచన పై ఈ శయనైక ఏకాదశి వ్రతాన్ని భక్తితో చేస్తాడు దానితో వర్షం వచ్చి కరువు తీరి ప్రజలు సుఖంగా వున్నారని పురాణాలు చెపుతున్నాయి

లోకహితం కోసం శివుడు ఎన్ని రూపాలు ధరించాడు. .?

ఓంకార స్వరూపుడైన శివుడు లోకహితం కోసం ఎన్ని రూపాలు ధరించాడు. ఈ విషయంపై శివపురాణం ఓసారి తిరగేస్తే.. అందులో శివుడు ఎనిమిది రూపాలు ధరించినట్టు పేర్కొంటోంది. అవేంటంటే...
రుద్రుడు : దుఃఖ నివారకుడైన అగ్నిని అధిష్టించి ఉంటాడు.
శర్వుడు : జీవుల మనుగడ కోసం భూమిని అధిష్టించి ఉంటాడు.
భవుడు : ఈ జగానికి అత్యంతావశ్యకమైన జలాన్ని ఆశ్రయించి ఉంటాడు.
ఉగ్రుడు : జగత్తు కదలికలకు కారకుడైన వాయువును అధిష్టించి ఉంటాడు.
భీముడు : ఆకాశాన్ని ఆశ్రయించి ఉంటాడు.
పశుపతి : సంసారబద్ధులైన జీవులను పాపవిముక్తులను చేసేందుకై జీవాత్మను అధిష్టించి ఉంటాడు.
ఈశానుడు : ఈ చరాచర జీవులను శాసించే సూర్యునిలో ప్రకాశిస్తుంటాడు.
మహాదేవుడు : తన చల్లని కిరణాలతో జీవులను పాలించు చంద్రునిలో ప్రకాశిస్తుంటాడు.

కర్ణుడు కవచ కుండలాలతో ఎందుకు పుట్టాడు?

కర్ణుడు.. కుంతీదేవికి పుట్టలేదు. కుంతీదేవి కూడా నవమాసాలు మోసి ‘కర్ణుని’ కనలేదు. కర్ణుడు పసిబిడ్డగా సూర్యుని ద్వారా కుంతీదేవికి ఇవ్వబడ్డాడు... అంతే. కన్యగా ఉన్న కుంతికి., దూర్వాసమహర్షి ఇచ్చిన మంత్రం ‘సంతాన సాఫల్య మంత్రం’. ఆ మంత్రంతో ఏ దేవతను ఆవాహన చేస్తే, ఆ దేవత వచ్చి సంతానాన్ని మాత్రమే ఇచ్చి వెళ్లిపోతారు తప్ప మరే వరాలు అనుగ్రహించరు. ఆ మంత్ర ప్రభావం అలాంటిది.
పూర్వకాలంలో ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసి అభేద్యమైన వెయ్యి కవచాలు వరంగా పొందాడు. అప్పటినుంచి వాడికి ‘సహస్రకవచుడు’ అనే పేరు స్థిరపడిపోయింది. ఆ వరగర్వంతో వాడు సర్వలోకాలనూ నానా హింసలకు గురిచేసి ఆనందిస్తూండేవాడు. వాడి బాధలు పడలేక సకల ప్రాణికోటి శ్రీ మహావిష్ణువును శరణు కోరగా ‘భయపడకండి..నేను నర, నారాయణ రూపాలలో బదరికావనంలో తపస్సు చేస్తున్నాను. వాడికి అంత్యకాలం సమీపించినప్పుడు వాడే నా దగ్గరకు వస్తాడు. అప్పుడు నేనే వాడిని సంహరిస్తాను’ అని వారికి ధైర్యం చెప్పి పంపాడు.
హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత నరసింహస్వామి రెండురూపాలుగా విడిపోయాడు. నర రూపం ‘నరుని’గానూ., ‘సింహ’ రూపం ‘నారాయణుని’గా ‘ధర్ముని’ కుమారులుగా జన్మించాడు. వారే నర, నారాయణులు. వారిరువురూ పుట్టుకతోనే పరాక్రమవంతులు, విరాగులు. అందుకే వారిరువురూ ఆయుధధారులై బదరికావనంలో ఏకాగ్రచిత్తులై తపోదీక్ష వహించారు. ఏ ఆటంకం లేకుండా వారి తపస్సు కొనసాగుతోంది.
ఒకసారి ప్రహ్లాదుడు బదరికావనం సందర్శించి వెడుతూ.. నర, నారాయణులను చూసి, వారి ప్రక్కన ఆయుధాలు ఉండుట గమనించి..‘తాపసులైన వీరికి ఆయుధాలతో పనేమి? వీరెవరో కపట తాపసులైయుండవచ్చు’ అని భావించి వారికి తపోభంగం గావించి, వారిని యుద్ధానికి ఆహ్వానించాడు. వారిమద్య భీకరయుద్ధం జరిగింది. ఎంతకాలమైనా ప్రహ్లాదుడు వారిని జయించ లేకపోవడం చూసి, ఆశ్చర్యపడి శ్రీ మహావిష్ణువును ధ్యానించాడు. శ్రీహరి ప్రత్యక్షమై ‘ప్రహ్లాదా.. నర నారాయణులు నా అంశతో జన్మించినవారు. వారిని నీవు గెలవలేవు’ అని చెప్పాడు. ప్రహ్లాదుడు తన తప్పు తెలుపుకుని నర,నారాయణులను క్షమించమని వేడుకుని అక్కడ నుంచి వెళ్లిపోయాడు.
నర,నారాయణుల తపస్సు కొనసాగుతోంది. వారి తపస్సుకి ఇంద్రుడు భయపడి., వారికి తపోభంగం చేసిరమ్మని అప్సరసలను పంపాడు. వారు తమ రూప, వయో, నృత్య, గానాలతో నర,నారాయణుల తపస్సుకు భంగం కలిగించాలని ఎంతో ప్రయత్నించారు.. కానీ, ఫలితం శూన్యం. అప్పుడు నారాయణుడు వారిని దగ్గరకు పిలిచి, ‘మీ అందాలు మమ్ములను ఆకర్షించలేవు. ఇంద్రపదవి ఆశించి మేము ఈ తపస్సు చేయడంలేదు అని మా మాటగా మహేంద్రునకు తెలియజెప్పండి’ అని తన తొడమీద చరిచాడు. ఆ శబ్దం నుంచి ఓ అసాధారణ, అద్భుత సౌందర్యరాశి జన్మించింది. తన ఊరువుల(తొడల) నుంచి పుట్టిన ఆ సుందరికి ‘ఊర్వసి’ అని పేరు పెట్టి, ఆమెను ఆ అప్సరసలకు ఇస్తూ, ‘ఈమెను మా బహుమతిగా మహేంద్రునకు ఇవ్వండి’ అని చెప్పి వారిని పంపాడు. మహేంద్రుడు తన తప్పు తెలుసుకుని నర,నారాయణులను క్షమించమని వేడుకున్నాడు.
నర,నారాయణుల తపస్సు కొనసాగతోంది. ఆ సమయంలో వరగర్వాంధుడైన ‘సహస్రకవచుడు’ వారిదగ్గరకు వచ్చి, వారిని యుద్ధానికి ఆహ్వానించాడు. అప్పుడు నారాయణుడు అతనితో ‘రాక్షసేశ్వరా..నీ సమరోత్సాహం మాకు ఆనందం కలిగించింది. కానీ, మేమిద్దరం కలిసి నీ ఒక్కనితో యుద్ధం చెయ్యడం ధర్మం కాదు. కనుక, మాలో ఒకడు నీతో యుద్ధం చేస్తూంటే మరొకడు తపస్సు చేసుకుంటాడు. అతని తపస్సుకు ఎలాంటి అంతరాయం కలుగకూడదు. ఇందుకు నీకు సమ్మతమైతే యుద్ధం చేస్తాను’ అన్నాడు.
సహస్రకవచుడు ఈ ఒప్పందానికి సమ్మతించాడు. నరుడు తపస్సు చేస్తున్నాడు. నారాయణుడు యుద్ధానికి దిగాడు. యుద్ధం భీకరంగా సాగుతోంది. అలా వేయి సంవత్సరాలు గడిచిన అనంతరం నారాయణుడు సహస్రకవచుని వేయి కవచాలలో ఒక కవచాన్ని భేదించగలిగాడు. అప్పటికి అలసిన నారాయణుడు తపస్సుకు ఉపక్రమించగా, నరుడు సహస్రకవచునితో యుద్ధానికి దిగాడు. మరో వేయి సంవత్సరాలు గతించిన అనంతరం నరుడు సహస్రకవచుని మరో కవచాన్ని భేదించాడు.
ఇలా నర,నారాయణులిరువురూ కలిసి ఆ సహస్రకవచుని తొమ్మిది వందల తొంభై తొమ్మిది కవచాలు భేదించారు. ఇక సహస్రకవచునికి ఉన్నది ఒకేఒక కవచం. అది గమనించిన సహస్రకవచునికి భయం పుట్టి, యుద్దరంగం వదిలి, పరుగు పరుగున సూర్యుని దగ్గరకు వెళ్లి అభయం ఇమ్మని వేడుకున్నాడు. అప్పుడు సూర్యుడు ‘కలకాలం నేను నీకు అభయం ఇవ్వలేను., నర,నారాయణుల అనంతరం నీకు నానుంచి విడుదల కలిగిస్తాను’ అన్నాడు. సహస్రకవచుడు సమ్మతించి సూర్యుని దగ్గర ఉండిపోయాడు. కుంతి మంత్రబలానికి కట్టుబడి వచ్చిన సూర్యుడు., ఆ సహస్రకవచునే.., పసిబిడ్డగా మార్చి, కుంతి చేతికి అందించాడు. అందుకే కర్ణుడు సహజ కవచ కుండలాలతో జన్మించాడు. ఆ కర్ణుని సంహరించడానికే నర,నారాయణులిరువురూ.. కృష్ణార్జునులుగా జన్మించి, కురుక్షేత్ర రణభూమిలో కర్ణుని సంహరించారు.

శుక్రవారం – అష్ట లక్ష్మీప్రదం

హిందూ సంప్రదాయంలో లక్ష్మీదేవి సిరి సంపదల దేవత. వివిధ భాగ్యాల అధిష్టాన దేవతలుగా ఈ లక్ష్మీ దేవియే అష్ట లక్ష్మిలుగా పూజింపబడుతుంది. దేవాలయాలలో అష్ట లక్ష్మిలు ఒకే చోట అర్చింపబడడం సంప్రదాయం.
ఈ అష్ట లక్ష్మిలు:-
ఆదిలక్ష్మి :-
"మహాలక్ష్మి" అనికూడా అంటారు. నాలుగు హస్తాలతో, ఒక చేత పద్మం, మరొక చేత పతాకం ధరించి, రెండు చేతులందు అభయ వరద ముద్రలు కలిగి ఉంటుంది.
ధాన్యలక్ష్మి :-
ఎనిమిది చేతులతో, పచ్చని వస్త్రాలతో ఉంటుంది. రెండు చేతులలో పద్మాలు, ఒక చేత గద, మూడు చేతులలో వరి కంకి, చెరకు గడ, అరటి గెల కలిగి రెండు చేతులు వరదాభయ ముద్రలతో ఉంటుంది.
ధైర్యలక్ష్మి :-
"వీరలక్ష్మి" అని కూడా అంటారు. ఎనిమిది చేతులు కలిగినది. ఎర్రని వస్త్రములు ధరించినది. చక్రము, శంఖము, ధనుర్బాణములు, త్రిశూలము, పుస్తకము (?) ధరించినది. రెండు చేతులు వరదాభయ ముద్రలలో నుండును.
గజలక్ష్మి :-
రాజ్య ప్రదాత. నాలుగు హస్తములు కలిగిన మూర్తి. ఇరువైపులా రెండు గజాలు అభిషేకం ఛేస్తుంటాయి. ఎర్రని వస్త్రములు ధరించినది. రెండు చేతులలో రెండు పద్మములు కలిగినది. రెండు చేతులు వరదాభయ ముద్రలలో ఉంటాయి.
సంతానలక్ష్మి :-
ఆరు చేతులు కలిగినది. రెండు కలశములు, ఖడ్గము, డాలు ధరించినది. వడిలో బిడ్డ కలిగియున్నది. ఒకచేత అభయముద్ర కలిగినది. మరొక చేయి బిడ్డను పట్టుకొనియున్నది. బిడ్డ చేతిలో పద్మము ఉన్నది.
విజయలక్ష్మి :-
ఎనిమిది చేతులు కలిగినది. ఎర్రని వస్త్రములు ధరించినది. శంఖము, చక్రము, ఖడ్గము, డాలు, పాశము ధరించినది. రెండు చేతుల వరదాభయ ముద్రలు కలిగినది.
విద్యాలక్ష్మి :-
శారదా దేవి.చదువులతల్లి.చేతి యందు వీణ వుంటుంది.
ధనలక్ష్మి :-
ఆరు హస్తాలు కలిగిన మూర్తి. ఎర్రని వస్త్రాలు ధరించినది. శంఖ చక్రాలు, కలశము, ధనుర్బాణాలు, పద్మము ధరించిన మూర్తి. అభయ ముద్రలోనున్న చేతినుండి బంగారునాణేలు వర్షిస్తున్నట్లు చిత్రింపబడుతుంది.
కొన్ని చోట్ల ఐశ్వర్యలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, రాజ్యలక్ష్మి, వరలక్ష్మి అనే పేర్లు ఉంటాయి.
ప్రార్ధన:
అష్టలక్ష్మీ నమస్తుభ్యం వరదే కామరూపిణి
విష్ణు వక్షఃస్థలారూఢే భక్తమోక్ష ప్రదాయిని
శంఖచక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే
జగన్మాత్రేచ మోహిన్యై మంగళం శుభమంగళం

మంగళగిరిపై వెలసిన శ్రీ పానకాల నరసింహస్వామి :

దేవుని ముందు పెట్టిన ప్రసాదాన్ని దేవుడు తింటే అది చూసి పులకించని భక్తులు ఉండరు.కానీ అల ఎక్కడైనా జరుగుతుందా అంటే ఆ ప్రశ్నకు సమాధానము మంగళగిరి శ్రీ పానకాల నరసింహ స్వామి. ఈ విషయాన్ని వివరంగ తెలుసుకునే ముందు ఇక్కడి స్థల పురాణాన్ని కాస్త తెలుసుకుందాము.
ఈ క్షేత్రం విజయవాడ మరియు గుంటూరు కు అతి చేరువలో ఉంది.విజయవాడ నుంచి ప్రతి 10 నిమిషాలకు గుంటూరు కు బస్సు సౌకర్యం కలదు. ఆ మార్గ మధ్య లోనే ఈ ఆలయం కలదు.
మన రాష్ట్రము లోని అన్ని ప్రధాన పట్టణాల నుండి బస్సు లేదా రైల్ ప్రయాణం ద్వారా ఈ ఆలయాన్ని సులభంగా చేరుకోవచ్చు.మీకు ఈ ఆలయ సందర్శనార్ధం ఎలాంటి సమాచారాన్నైనా అందిచటానికి మా బ్లాగ్ సిద్ధoగా ఉంది.

స్థల పురాణం:
ఇక్కడ రెండు రకాలైన కథలు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి.
వాటిలో ....
మొదటిది
పూర్వం ఈ ప్రాంతాన్ని పారియాత్ర అను రాజు పాలించేవాడు.అతనికి సంతానము లేకపోవుటచే, సంతానం కొరకు దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలను తిరిగగా అతనికి ఒక శిశువు జన్మించాడు.అతనికి హస్తసృంగి అని పేరు పెట్టాడు. కానీ దురదృష్టవసాత్తు అ పిల్లవాడు అoగవికలాంగుడిగా జన్మించాడు.ఆ రాజు తన పుత్రుని చూసి చాల విచారపడ్డాడు.తండ్రి బాధ చూసి హస్తసృంగి బాధాతప్త హృదయంతో అడవులకు వెళ్లి భగవంతుని సాక్షాత్కారం కోసం ఘోరమైన తపస్సు చేసాడు.అంతట శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమవగా హస్తసృంగి తనకు తన జీవితాంతం భగవంతుని పాదాల చెంత ఉండాలని ఉండాలని చెప్పగా, శ్రీమహావిష్ణువు హస్తసృంగిని ఒక కొండగా మార్చివేసి దానిపై శ్రీమహావిష్ణువు నరసింహ అవతారం లో కొలువయ్యాడు.అదియే ఇప్పటి పానకాల నరసింహస్వామి ఆలయం.
మరియొక కథ కూడా ఈ ఆలయం గూర్చి ప్రచారం లో ఉంది.
మహిషాసుర వధ జరిగిన తరువాత దుర్గమ్మ ఆగ్రహాగ్నితో రగిలిపోయింది. అప్పుడు ఆమె అగ్ని తన రెండవ కంటి ద్వార ఒక కొండపైకి వదిలి ఆ కొండను పెళ్ళగించి గాలిలోకి విసిరివేసింది. అదియె ఇప్పటి నరసింహ స్వామి కొలువైన కొండ.కాని దుర్గమ్మ నుంచి వెలువడిన ఆ అగ్నిజ్వాలలు మాత్రం ఆ కొండ నుండి అలాగే వెలువడుతున్నాయి.తరువాతి కాలంలో నరసింహ స్వామి హిరణ్యకసిపున్ని చంపిన తరువాత అలాంటి అగ్నిజ్వాలల తోనే రగిలిపోయాడు.అప్పుడు ప్రహ్లాదుడు ఆయనను స్తుతించగా ప్రసన్నుడై తన నుంచి వెలువడుతున్న అగ్నిజ్వలను తను అదుపుచేసుకోదలచి అనువైన ప్రాంతాన్ని వెతకుచున్న సమయంలో అప్పటికే అగ్నితో రగులుతున్న ఈ కొండ కనిపించి అక్కడే తనకు అనువైన ప్రాంతo అని తలచి నరసింహ స్వామి ఇక్కడే కొలువైయ్యాడు. కాని అగ్ని జ్వాలలు మాత్రం చల్లారలేదు.
బ్రహ్మదేవుడు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ స్వామిని పానకంతో అభిషేకించగా అగ్నిజ్వాలలు పూర్తిగా ఆరిపోయాయి. అప్పటినుంచి ఇక్కడ పానకంతో అభిషేకించడం ఆనవాయితీగా మారింది.
ఇక్కడ చెప్పుకోతగ్గ విశేషం ఏమిటంటే స్వామి భక్తులు ఇచ్చిన పానకాన్ని అర్చకులు స్వామి నోటిలో పోస్తే నరసింహుడు ఆ పానకాన్ని గుటకలు వేస్తూ సంతోషంగా స్వీకరిస్తాడు.గుటకలు వేసిన శబ్దం కూడా స్ఫష్టంగా వినిపిస్తుంది.స్వామికి భక్తులు ఇచ్చిన పానకాన్ని అర్చకులు స్వామి కి అందివ్వగా స్వామి దానిని త్రాగి మరల కొంత పానకాన్ని బయటకు వదులుతాడు.దానినే భక్తులు ప్రసాదంగా స్వీకరిస్తారు.మరియొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇక్కడ నిరంతరం పానకం నైవేద్యం వల్ల అక్కడ పానకం నేలపై పడినా అక్కడ ఒక్క చీమ కూడా ఉండదు మరియు ఒక ఈగ కూడా వాలదు.
భగవంతుడుకి ఇచ్చిన ప్రసాదాన్ని భగవంతుడే తింటే వచ్చే అలౌకిక ఆనందాన్ని భక్తులు సొంతం చేసుకుంటారు. ఇది ప్రతి తెలుగువాడు ఖచ్చితంగా చూడదగ్గ ప్రాంతం.

ధ్రువనక్షత్రం కథ

ఉత్తానపాదుడు అనే రాజుకు ఇద్దరు భార్యలు. వారి పేర్లు సునీతి, సురుచి. రాజుగారికి సురుచి అంటే ఎంతో ప్రేమ. ఆమె కొడుకు ఉత్తముడు. పెద్ద భార్య అయిన సునీత పేరుకే రాణి. దాసికన్నా హీనంగా చూసేవాడు. సునీత కొడుకు ధ్రువుడు, ఇతడు తండ్రి ప్రేమకు దగ్గరగా ఉండాలనుకొనేవాడు. కాని తండ్రి, పిన తల్లి అయిన సురుచి ఇంట్లోనే ఎక్కువగా గడిపేవాడు. అందువల్ల ద్రువునికి తండ్రి ప్రేమ కరువైంది.
ఒక రోజు తండ్రితో గడపాలని ధ్రువుడు పినతల్లి ఇంటికి వెళ్ళాడు. తండ్రి ఒడిలో ఉత్తముడు కూర్చొని ఉన్నాడు. ధ్రువుడు సంతోషంతో తండ్రి వద్దకు వెళ్ళాడు. తండ్రి ద్రువుడ్ని చీదరించుకున్నాడు. తండ్రి నిరాదరణకు ద్రువునికి దుఃఖం ఆగలేదు. అది చూసి పినతల్లి అయిన సురుచి కఠినంగా "ధ్రువా! నీవు నా కడుపున పుడితే మీ తండ్రిగారి తొడపై కూర్చొనే అదృష్టం కల్గేది. ఇప్పుడైనా ఈ సురుచి కడుపున పుట్టించమని శ్రీహరిని ప్రార్ధించు. అప్పుడు నీకు ఉత్తమ స్థానం లభిస్తుంది" అన్నది పినతల్లి సురుచి.
జరిగిన విషయమంతా తల్లితో చెప్పాడు ధ్రువుడు. అప్పుడు తల్లి "నాయనా ధ్రువా! నీ పినతల్లి నిజమే చెప్పింది. తండ్రి ప్రేమ కోసమే కాకుండా ఒక పెద్ద ఆశయం పెట్టుకొని శ్రీహరిని గూర్చి తపస్సు చెయ్యి ఫలితం ఉంటుంది" అన్నది తల్లి.
తల్లి మాటలకు ధ్రువుడు సంతోషపడి, తపస్సు చేయుటకు బయలుదేరాడు. దారిలో ద్రువునకు నారద మహర్షి ఎదురయ్యాడు. విషయం తెలిసుకొని నవ్వుతూ "నాయనా ధ్రువా! పసివాడివి పినతల్లి మాటలకు ఇంత పట్టింపా? తపస్సు అంటే మాటలు కాదు! చాలా కష్టము. నీ నిర్ణయం మార్చుకో" అన్నాడు. నారదుని మాటలకు ధ్రువుడు "మహర్షీ! పినతల్లి మాటలకు నాలో రేపిన బాధ అంత,ఇంత కాదు. ఉత్తముని కన్న నేను గొప్ప స్థానం సంపాదించాలి. అది పొందడానికి నేను కఠోర తపస్సు చేస్తాను" అని చెప్పాడు. "పట్టుదల గట్టిదే. నిశ్చలమైన మనస్సుతో తపస్సు చెయ్యి" అని ఆశీర్వదించి నారదుడు వెళ్ళిపోయాడు. ధ్రువుడు యమునా తీరాన ఉన్న మధువనానికి వెళ్ళి, దీక్షతో కొన్ని సంవత్సరాలు కఠోర తపస్సు చేశాడు.
అతని తపస్సుకు మెచ్చి నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. ధ్రువుడు ఆనందంతో పొంగిపోయి ఎన్నో స్తోత్రాలను స్తుతించాడు. అంతట విష్ణుమూర్తి "ధ్రువా! నీ మనస్సునందున్న కోరిక నెరవేరుస్తున్నాను. ఇంత వరకు ఎవరికీ దక్కని ఉన్నత స్థానాన్ని నీవు పొందుతావు. మహారాజువై గొప్పగా రాజ్యమేలుతూ, సుఖ సంతోషాలతో జీవించి చివరకు నక్షత్రమై, ఉత్తర దిక్కులో స్థిరంగా వెలుగుతావు. లోకమంతా ఆ నక్షత్రాన్ని 'ధ్రువ నక్షత్రం' అని పిలుస్తారు" అని వరమిచ్చి అంతర్దానమైనాడు. నేటికీ కనబడే ఉత్తర ద్రువంపై ఉన్న నక్షత్రమే ధ్రువనక్షత్రం. ధ్రువుడు గొప్ప లక్ష్యంతో తపస్సు చేసి, అనుకున్నది సాధించాడు. పట్టుదల ధృడ సంకల్పం ఉంటే ఏ పనైనా సాధించ వచ్చు అని మనందరం తెలుసుకోవాలి.

భోజనానికి ముందు కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి?

“అన్నం పరబ్రహ్మస్వరూపం” అని ఆర్యవాక్యం.
మనిషి మాటలు నేర్చి, వివేకం తెలిసి, వికసించి విజ్ఞానవంతుడైన తరువాత ఆహారానికి వున్న విలువను గుర్తించాడు. మానవుని ప్రాధమిక అవసరాలన్నిటిలోకి ఆహారమే ముఖ్యమైనది అని తెలిసిన
తరువాత సహజంగానే భక్తిభావం పెరిగింది. “ఆహార ఉపాహారాల యిష్టత లేనివానికి సుఖాపేక్ష ఉండదు. సుఖాపేక్ష లేనివానికి సంతుష్టత ఉండదు. ఆహారాన్ని సక్రమంగా తీసికోననివానికి ఏ
కోరికలు ఉండవు” అని చెబుతుంది భగవద్గీత.
పూర్వకాలంలో భోజనశాలను ప్రతినిత్యం ఆవుపేడతో అలికి సున్నంతో నాలుగువైపులా గీతలు (ముగ్గులు) వేసేవారు. దీనివలన
సూక్ష్మక్రిములు భోజన శాలలలోనికి ప్రవేశించేవి కావు. మనుషులను హానిచేసే సూక్షక్రిములులను చంపే శక్తి (పెన్సిలిన్) ఆవుపెడలోనూ, ఆవు మూత్రంలోనూ ఉంది.
భోజనం చేసిన తరువాత క్రిందపడిన ఆహారపదార్థాలను తీసివేసి మరలా నీతితో అలికి శుభ్రపరిచేవారు. చీమలు మొదలైన కీటకాలు
రాకుండా వుండేవి.
మనకు శక్తిని ప్రసాదించి, మన ప్రాణాలను కాపాడి, మనలను చైతన్య వంతులను చేసి నడిపించే ఆహారాన్ని దైవసమానంగా భావించి గౌరవించి పూజించటంలో తప్పులేదుకదా! చేతులు కడుక్కోకపోతే నీ ఆరోగ్యం మాత్రమే చెడుతుంది. కాళ్ళు కడుక్కోకపోతే
కుంటుంబంలోని వారందరి ఆరోగ్యం చెడిపోతుంది. బయటనుండి ఇంటిలోనికి ప్రవేశించే ముందు తప్పనిసరిగా కాళ్ళు కడుక్కోవటం కూడా మన ఆచారాల్లో ఒకటి. ఎవరైనా బంధువులు ఇంటికి
వచ్చినపుడు ముందుగా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు (పాద్యం) ఇస్తారు. తరువాత త్రాగటానికి
మంచినీరు (ఆర్ఘ్యం) ఇస్తారు.
“మనం బయట ఎక్కడెక్కడో తిరుగుతాం. తెలియకుండా అశుద్ధ పదార్థాలను త్రోక్కుతాం. అదే కాళ్ళతో రావటం వల్ల కుటుబంలోని అందరి ఆరోగ్యాలకూ హాని జరుగుతుంది కదా! ముఖ్యంగా పసిబిద్దలకు మరింత హానిదాయకం” ఇపుడు మన ప్రశాంతంగా తీరికగా అన్నం తింటున్నామా! కాలిబూట్లతో అన్నం తింటున్నాం.
పరుగులు తీస్తున్నాం. “బిజీ!బిజీ!బిజీ!”. అనవసరమైన అవసరాలకోసం అర్థంలేని జీవితమ గడుపుతున్నాం. కాళ్ళు కడుక్కోవటం విషయం అటుంచి చేతులు కూడా కడుక్కోలేని బిజీ
అయిపోతున్నాం. ఇక ఆహారాన్ని గౌరవించే ఓపికా తీరికా ఎవరికిఉంది?

ఈ ఆలయంలో నాలుగు వందల ఏళ్లుగా ఆరని దీపం....

భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న సీతారామచంద్రస్వామి
మానేరు నదీతీరం మధ్య ఉన్న ఆ గ్రామానిది ప్రత్యేకత..
అచంచెలమైన భక్తి విశ్వాసం ఆ గ్రామస్థుల నిత్యపూజలకు
నిదర్శనం.. గ్రామంలోని సీతారామచంద్ర స్వామి దేవాలయంలో
నందాదీపం తరతరాలుగా వెలుగుతోంది.
పూర్వీకులు వెలిగించిన ఆ దీపాన్ని గ్రామస్థులు భక్తి శ్రద్ధలతో కాపాడుతున్నారు. జ్యోతి వెలిగితేనే ఆవునూరు సిరిసంపదలతో
తులతూగుతుందని వారి ప్రగాఢ విశ్వాసం..
సిరిసిల్ల/ఆవునూరు: ముస్తాబాద్ మండలం ఆవునూరులోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో నందా దీపం తరతరాలుగా వెలుగుతోంది. ఈ దీపానికి 400 ఏళ్ల చరిత్ర ఉందని ప్రతీతి. నిత్యం
దీపధూప నైవేద్యాలతో సీతారామచంద్రస్వామిని పూజిస్తూ అచంచెల భక్తిభావాన్ని చాటుకుంటున్నారు గ్రామస్థులు.
జ్యోతి వెలిగినంతకాలం తమ గ్రామంలో సిరిసంపదలకు
లోటు ఉండదనేది ఇక్కడి ప్రజల నమ్మకం. నందాదీపంగా పిలిచే ఆ జ్యోతి వెలుగులకు నాలుగు వందల ఏళ్ల చరిత్రకు ఆధారాలు
లేకపోయినా దీపం నిత్యం వెలుగుతూనే ఉందని నాలుగు తరాలకు చెందిన గ్రామస్థులు పేర్కొంటున్నారు. ఆలయంలో కొలువుదీరిన
సీతారామచంద్రస్వామి భక్తుల కొంగుబంగారమై కోరినకోరికలు తీరుస్తున్నాడు. పీచర వంశీయులు ఇక్కడ బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఆలయం మానేరు నదీతీరంలోని
పచ్చని పొలాల మధ్య ఉండడంతో ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణ కనిపిస్తుంది. మరోవైపు ఆలయ అభివృద్ధిపై కమిటీ ప్రత్యేక శ్రద్ధతో పర్యవేక్షిస్తుంది.

ధర్మ సూత్రాలు

1. వాల్మీకి శ్రీరామ పట్టభిషేకానంతరం రామాయణ రచన చేశాడు. ముందుగా ఊహించి వ్రాసినది కాదు.
2. వినాశ కాలం వచ్చినవారు వివేకమును కోల్పోయి ధర్మవిరుద్ధమైన పనులు చేసి నశిస్తారు.
3. ఎవరిపాప కర్మలకు వారే బాధ్యులు. కానీ, పాపంలో భాగం కూడా పిల్లలకు రావటం తప్పదు.
4. రావణుడు, ఆంజనేయుడు నవ వ్యాకరణాలు చదివిన సర్వ శాస్త్రవేత్తలు.
5. పరమార్థం తెలియనిదే జీవితానికి ప్రయోజనం లేదు.
6. వ్యాసమహర్షి మహాభారతాన్ని కురుక్షేత్రము అయిన తరువాత చాలాకాలంకి వ్రాసిరి.
7. కైవల్య ముక్తి అంటే మోక్షమే. జీవన్ముక్తి అంటే జీవించి ఉండగనే ముక్తుడై యుండడం. జీవన్ముక్తికి ప్రారబ్దము నశించగావిదేహముక్తుడవుతాడు.
8. భగవత్కథలు ఎప్పుడూ మిధ్యలు కావు. ఇది పెద్దలమాట.
9. పున్నామ నరకం నుంచి రక్షించే వాడే పుత్రుడు.
10. నవగ్రహ స్తోత్ర పఠనంవల్ల నవగ్రహాలు ప్రసన్నములై శుభ ఫలాన్ని యిస్తాయి.
11. ఇతరులకు అపకారం చేసి, ఇతరుల బాధలవల్ల సంతోషము పొందే దుర్మార్గుడిని ఖలుడు అంటారు.
12. జమ్మి చాల పవిత్రమైన చెట్టు. అగ్ని స్వరూపము.
13. బ్రహ్మకపాలంలో పిండ ప్రదానం చాల మంచిపని. అంత మాత్రంచేత తద్దినాలు ఎగ్గొట్ట కూడదు. శరీరం ఉన్నంతవరకు పితృ దేవతలకు తద్దినం పెట్టుట శాస్త్రీయ ధర్మము.
14. ఇతరుల ఐశ్వర్యాన్ని చూసి ఎప్పుడూ దుఃఖపడకూడదని, సత్పురుషులను, ద్వేషించకూడదని, స్త్రీలను పరాభవించకూడదని, పరద్రవ్యాన్ని అన్యాయంగా అపహరించకూడదని, మహాభారతం ద్వారా గ్రహించిన నీతి.
15. భగవంతుని త్రికరణశుద్ధిగా పరమోత్తమ భక్తితో ఆశ్రయించిన భక్తులకు దేహాభిమానముగానీ, అహంకారముగానీ ఏమాత్రము వుండకూడదు.
16. పూర్వ కర్మను బట్టి ఇప్పటి జీవితంలో సుఖదుఃఖాలు సంప్రాప్త మౌతాయి.
17. దేవాలయల్లో ధ్వజస్థంభాలు పవిత్రమైనా, కాపురాలుండే ఇళ్ళపైన వాటి నీడ పడడం శాస్త్ర విరుద్ధం.
18. అశ్వథామ, బలి చక్రవర్తి, వ్యాస మహర్షి, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు, ఈ ఏడుగురు చిరంజీవులు.
19. గురువునకు, దైవమునకు ఎప్పుడూ వంగి నమస్కారం పెట్టగూడదు. సాష్టాంగం గానే పెట్టాలి.
20. శివాలయానికి ఎదురుగా ఇల్లు కట్టగూడదు.
21. జగమెరిగినవాడు అంటే తత్త్వవేత్త అన్నమాట. అతనికి దేహాభిమానం లేదు.
22. రాధ గోకులమునందు పరాశక్తి. శ్రీకృష్ణుడు పరమాత్మ. శక్తి, శక్తిమంతుల అభిన్నమైన ప్రేమ, భక్తులకు ఆదర్శం.
23. గాయత్రీ మంత్రం జపమాలతో చేసిన ఉత్తమము. విశేష ఫలం.
24. గాంధారి గర్భవతి గా వున్నప్పుడు, సేవ చేసిన మరొక స్త్రీకి కలిగిన ధృతరాష్ట్రుని కుమారుడు యుయుత్సువుడు.
25. విష్ణుమూర్తికి ఇద్దరు కుమారులు, బ్రహ్మ మరియు మన్మథుడు.
26. భక్తివల్ల జ్ఞానము, రక్తివల్ల అజ్ఞానము కలుగును.
27. కృతయుగమునందు తప్పస్సు, త్రేతాయుగమునందు జ్ఞానము, ద్వాపరయుగమునందు యజ్ఞము, విశేష ప్రాముఖ్యమును పొందియున్నవి. కలియుగమున దానము చేయుటయే ముఖ్య కర్తవ్యము.
28. ఏకాదశి వ్రత ఉపవాసమునకు దశమినాటి రాత్రి భోజనం చేయకూడదు. ఏకాదశి పూర్తి ఉపవాసం. ద్వాదశి ఘడియలు ఉండగానే భుజించుట సంప్రదాయం. దీనినే విష్ణువాసం అంటారు.
29. శివుడు అభిషేక ప్రియుడు కావున లింగరూప అభిషేకమే ఆయనకు ప్రియం.
30. మానవ జన్మకు జ్ఞానం విశేషం.

62 కళలు అంటారు..అవి ఏవి?

62 కాదు. చతుష్టష్టి కళలు అంటారు. అనగా 64. వీటినే విద్యాలని కూడ అంటారు. ఈ లెక్కలో కూడ కొన్ని మతభేదాలున్నాయి. కొందరు వేదాలన్నింటిని ఒక్కటిగా లెక్కించారు. కొందరు వాటిని నాలుగుగా చూపారు.
1. వేదం
2. శాస్త్రం
3. ధర్మశాస్త్రం (స్మృత్రి)
4. వ్యాకరణం
5. జ్యోతిశ్శాస్త్రం
6. ఆయుర్వేదం
7. సంగీతశాస్త్రం (గాంధర్వం)
8. కవిత్వం
9. స్వరశాస్త్రం
10. సాముద్రికశాస్త్రం
11. కొక్కోకం (కామశాస్త్రం)
12. శకునశాస్త్రం
13. మల్లయుద్ధవిద్య
14. గారుడం
15. వాక్చమత్కృతి
16. అర్థవేదం
17. దేశభాషా పాండిత్యం
18. వివిధ లిపిజ్ఞానం
19. లేఖనం
20. రథగమనం
21. రత్నపరీక్ష
22. అస్త్రవిద్య
23. పాకశాస్త్రజ్ఞానం
24. శిక్ష
25. వృక్షదోహదాలు
26. ఆగమశాస్త్రం
27. ఇంద్రజాలికం (గారడీ)
28. కల్పం
29. కుట్టుపని
30. శిల్పశాస్త్రనైపుణ్యం
31. రసవిద్య (బంగారం చేయటం – రసవాదం)
32. నృపాలనిధి (రాజనీతిశాస్త్రం)
33. అంజనవిశేషాలు (కాటుకలు)
34. వాయుజలస్తంభన
35. ధ్వనివిశేషం
36. ఘటికాశుద్ధి
37. పశురక్షణ
38. విహంగ భేదాగమన విద్య
39. చిత్రలేఖనం
40. అభినయశాస్త్రవిద్య
41. దొంగతనం
42. వాస్తుశాస్త్రం
43. మణిమంత్రౌషధసిద్ధి
44. లోహకార విద్య
45. స్వప్న శాస్త్రం
46. అష్టసిద్ధులు
47. వడ్రంగం
48. మూలికౌషదసిద్ధి
49. చర్మకారక విద్య
50. గణితశాస్త్రం
51. సూతికాకృత్యం
52. కార్యకారణవిద్య
53. చరాచారాన్యధాకరణం
54. తంతువిద్య
55. యోగవిద్య
56. వ్యవసాయం
57. ప్రశ్నశాస్త్రం
58. వ్యాపారం
59. మిగ్రభేదం
60. వేట
61. తుఅరగారోహణవిద్య
62. అలంకారాలు
63. ఉచ్చాటనం
64. నృత్యం.
వీనిలో కొన్నింటిని తీసివేసి కొందరు; అదృశ్యవిద్య, ధాతుపరీక్ష, శాంతి, నాటకం, పురాణం, సుషిణ, అనర్ధ, ఘనా అనేవాటిని చేర్చారు.

పుణ్యాన్ని ప్రసాదించే ‘గంగ’

పవిత్రమైన గంగానది స్పర్శతో ఎన్నో జీవితాలు పునీతమయ్యాయి. చీకటి అనే అజ్ఞానం తొలగిపోయి జ్ఞానకాంతులు వెల్లివిరిశాయి. అందుకే ఆ పుణ్యనది జ్ఞానగంగ!
గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతీ
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు
ఎక్కడ, ఏ నీళ్ళలో స్నానం చేస్తున్నప్పటికీ పై శ్లోకంలో పేర్కొన్న ఏడు నదులను స్మరించుకోవాలని పెద్దలవాక్కు. ఆ నదుల వరుసలో ప్రథమ తాంబూలం గంగానదికే. గంగ పేరును తలచుకుంటేనే ప్రతి ఒక్క భారతీయుని హృదయం భక్తితో పులకిస్తుంది. పశుపక్ష్యాదులకు, వృక్ష, మానవజాతికి ప్రాణాధారమైన నీటికే ‘గంగ’ పర్యాయపదమైనదంటే, ఆ తల్లి మన జీవనంలో ఎలా మమేకమైపోయిందో ఊహించుకోవచ్చు. అలా ఈ నేల మీద ప్రతి పుణ్యనది గంగా ప్రతి రూపమే, దివి నుంచి భువికి దిగివచ్చిన పావనగంగ పుట్టుక వెనుక ఒక రహస్యమైన కథ ఉంది.
భగీరథ ప్రయత్నం
మనలో ఎవరైనా అత్యంతకష్టమైన పనిని చేయ సంకల్పించినపుడు భగీరథప్రయత్నం అని అంటుంటాం. గంగమ్మతల్లి ఈ భూమికి రావడానికి వెనుక గల అసలు కారణం కూడ భగీరథ ప్రయత్నమే. భూలోకంలో సగరుడు పరిపాలిస్తున్న సమయం. అతనికి కేశిని, సుమతి అనే ఇద్దరు భార్యలు, కేశినివల్ల అసమంజసుడు అనే కొడుకు, సుమతి వల్ల అరవైవేలమంది పుత్రులు కలిగారు. అసమంజసుడు పేరుకు తగ్గట్టుగా క్రూరునిగా దుష్టకృత్యాలను చేస్తుండేవాడు. చిన్న పిల్లల్ని నదిలోకి విసిరేసి పైశాచిక ఆనందాన్ని పొండుతుండేవాడు. ప్రజలతడిని అసహ్యించుకుని సగరునికి మొరపెట్టుకోగా, అతడు కొడుకును రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు. అనంతరం సగరుడు ఏడు ఆశ్వమేథ యాగాలను తలపెట్టి, అశ్వాన్ని విడిచి, దానివెంట అరవైవేలమంది కొడుకులను పంపాడు. గుర్రం దేశమంతా తిరిగి చివరకు సముద్రంలో ప్రవేశించింది. అప్పడు ఆ గుర్రాన్ని చూసిన ఇంద్రుడు, వాయువును పిలిచి విషయాన్ని చెప్పగా, వాయువు ఆ గుర్రాన్ని బంధించి తీసుకెళ్ళి రాసాతలంలోని కపిలముని ఆశ్రమంలో కట్టేశాడు. సగరపుత్రులకు ఆ తర్వాత గుర్రం కనిపించకపోవడంతో రాజ్యానికి తిరిగి వెళ్ళి తండ్రికి జరిగిన విషయాన్ని చెప్పారు. అశ్వమే లేనప్పుడు ఇక అశ్వమేథ యాగానికి అర్థమేముంది? అని సగరుడు కుమిలిపోతాడు. గుర్రంతో తిరిగి వస్తే తప్ప, మరలా రాజ్యప్రవేశం లేదని కొడుకులను ఆజ్ఞాపించాడు సగర చక్రవర్తి. తండ్రిమాటకు ఎదురు చెప్పలేకపోయిన సగర పుత్రులు సముద్రంలోకి వెళ్ళి రసాతలానికి చేరుకొని అక్కడ కపిలమహర్షి ఆశ్రమంలో కట్టివున్నా అశ్వాన్ని చూశారు. కపిలుడే ఆ గురాన్ని దొంగిలించాడని భావించిన సగరపుత్రులు, కపిలుని దూషిస్తూ అనుచింతంగా ప్రవర్తించగా, ముని కోపంతో కనులు తెరవగా, ఆ జ్వాలల్లో భస్మమైపోయారు.
ఈలోపు అసమంజసుని అంశుమంతుడు అనే కుమారుడు కలుగగా, సగరుడు అతడికే రాజ్యాన్ని అప్పగించాడు. అతడు పినతండ్రుల జాడ కోసం ప్రయత్నిస్తాడు. అలా రసాతలానికి చేరుకున్న అతనికి పినతండ్రుల బూడిదకుప్పలుగా కనబడతారు. గరుత్మంతుని ద్వారా తన పినతండ్రులకు ఉత్తమగతులు కలగాలంటే గంగలోపునీతం చేయడం తప్ప మరోమార్గం లేదని తెలుస్తుంది. ఆ ప్రయత్నంలో కొన్ని తరాలు గడచినా తర్వాత భగీరథుని ప్రయత్నం ప్రారంభమవుతుంది. భగీరథుడు తన పూర్వీకులు కపిలుని ఆగ్రహానికి గురై భస్మమైన సంగతిని తెలుసుకుని, వారికి సద్గతులు కలగాలంటే, ఆ భస్మరాశులపై గంగను ప్రవహింపజేస్తే ఫలితముంటుందని తెలుసుకుంటాడు. గంగను తలచుకుని తప్పస్సు చేసిన భగీరథుడు, ఆమెను ఒప్పిస్తాడు. అయితే తానూ కిందికి ప్రవహిస్తున్నపుడు, తనను భరించగల శక్తి శివునికే ఉంది. కాబట్టి ఆయన భారిస్తానంటే, తను భూమిపైకి రావడానికి సమ్మతమేనని గంగ చెబుతుంది. భగీరథుడు తీవ్రమైన తప్పస్సుతో శివునికూడ ఒప్పిస్తాడు. ఆవిధంగా గంగమ్మ తల్లి భూమిపై వచ్చిందని పురాణ కథనం.
అయితే భూమిపైకి దిగిన గంగ జహ్నుముని ఆశ్రమం లోకి వెళ్లగా కోపగించుకున్న జహ్నుముని గంగను నోటపడతాడు. అప్పుడు భగీరథుడు ఆ మునిని ప్రార్థించగా, కరుణించి తన చెవుల నుండి విడిచి పెడతాడు. అలా భగీరథుని ప్రయత్నం వలన భూమికి వచ్చిన గంగ భాగీరథి అని పిలువబడి, అనంతరం జహ్నుముని వలన జాహ్నవి అయింది. చివరకు నగరపుత్రుల భస్మం మీదుగా గంగ ప్రవహించగా, వారికి ఉత్తమగతులు లభించాయి. అలా భగీరథప్రయత్నం ఫలించింది.
ఇలా గంగ గురించి అనేక పురాణాలలో వివిధ కథలను చూడగలం. ఒక కథ ప్రకారం, ఒకసారి నారదుడు భూలోకానికి రాగా, హిమాలయ ప్రాంతాలకు చేరుకునేసరికి సాయంతమయింది. అక్కడి ప్రకృతి సౌందర్యానికి పరవశించిపోతుండగా, అప్పుడే అతనికి వీనుల విందోనరిస్తూ చక్కని సంగీతధ్వనులు వినిపించసాగాయి. ఆ ప్రకృతిమాట అందించిన పారవశ్యంలో మునిగిపోయి ముందుకు కదిలిన నారదుడు బండరాళ్ళపై పాకుకుంటూ వెళ్తున్న బృందాన్ని చూశాడు. చూపులకు ఎంతో అందంగా కనిపించినప్పటికీ, ఏదో ఒక అవయవ లోపంతో ఉండటం కనిపించింది. నారదుడు విషయమేమిటని అడగ్గా, తాము గంధర్వులమనీ, తాము సంగీతంలోని రాగాలమనీ, ఏ గాయకుడైనా పాడుతున్నప్పుడు, వారి గొంతులో అపశ్రుతులు దొర్లినా, గాత్రంలో గర్వం, అహంకారం పొడసూపినా, రాగలక్షణాలను పట్టించుకోపోయినా తమకు దెబ్బలు తగులుతుంటాయని చెప్పారు. అందుకేమైనా తరుణోపాయం లేదా? అని నారదుడు అడగ్గా, శివుడు గానం చేస్తే, తమకు ఈ దురవస్థ తప్పుతుందని చెప్పారు. వారి మాటలను విన్న నారదుడు, కైలాసానికి వెళ్ళి శివుని పాడాల్సిందిగా అభ్యర్థించాడు.
నారదుని అభ్యర్థనను విన్న శివుడు, పాడేందుకు తన కెలాంటి అభ్యంతరాలు లేవనీ, అయితే, తను పాడుతున్నప్పుడు విని ఆనందించగలిగే శ్రోతలు కావాలని షరతు పెట్టాడు. శ్రోతలుగా బ్రహ్మ, విష్ణువులను ఆహ్వానించిన నారదుడు, అంగవైకల్యం గల గంధర్వులను అక్కడకు రప్పించాడు. శివుని గానంతో విశ్వమంతా మునకలేసింది. క్షణంలో గంధర్వుల అంగవైకల్యం మాయమైంది. అంతటితో కథ ఆగితే విశేషం ఏముంది. శివుని పాటలో మునిగి మైమరచిపోయిన విష్ణువు దేహం కరిగిపోయి నీరై ప్రవహించడం మొదలైయింది. ఈ సంగతిని గమనించిన బ్రహ్మ, ఆ నీటిని తన కమండలంలోకి తీసుకున్నాడు. కొన్ని యుగాలపాటు ఆ నీరు కమండలంలోనే ఉండిపోయింది.
దివినుంచి భువికిదిగిన గంగ శివుని జటలపై ముందుగా కాలిడి, అనంతరం ఈ భూమిపై అడుగుడిన విషయం మనకు తెలిసిందే. అయితే, అదే గంగను శివుడు తన జటలో బంధించిన ఉందంతం ఒకటి ఉంది.
పూర్వం కాలంలో ఒకసారి భూమిపై భయంకర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. ఎటుచూసినా నీతి చుక్క లేక భూమి బీటలు వారింది. ఆ స్థితిని చూసిన మునీశ్వరులంతా సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మదేవునితో, “స్వామీ! నిత్య నైమిత్తిక కర్మలను ఆచరించడానికి, స్నాన, పానాలకు మాకు నీరే లేదు. మమ్ములను అనుగ్రహించి నీతి ఎద్దడిని తొలగించు స్వామీ!” అని వేడుకున్నారు. వారి ప్రార్థనలను ఆలకించిన చతుర్ముఖుడు తన కమండలంలోని ఒక బిందువును వదిలాడు.
ఆ చిన్న నీతి బిందువే మహా ప్రవాహమై రంగత్తుంగ తరంగాలతో ఉవ్వెత్తున లేచి గలగలా ధ్వనులతో ప్రవహిస్తూ తుదకు ఈ భూమండలాన్నంత ఆక్రమించేట్లుగా విజృంభించింది. జరుగబోయే ఉపద్రవాన్ని గమనించిన శంకరుడు సకల లోకవాసులను కాపాడేందుకు ఆ జలాన్ని తన జటాజూటంలో బంధించి ఒక బిందువును మాత్రం ప్రజోపయోగాని కోసం మానస సరోవరంలో వదిలాడని కథనం.

నమస్కార విధానం

నమః – అనగా త్యాగమని వాచ్యార్థం. నేను నీకంటే తక్కువవాడను. నీవు నాకంటే గొప్పవాడవు అనే “దాస్యభావం” (దైవానికి దైవవిషయాలకు) స్ఫురిస్తుంది.
“నాకు నేను ఉపయుక్తుడను కాను”, కాబట్టి, నీవే నన్ను ఉద్దరించగలవాడవు అని ‘ఆత్మార్పణము చేసుకోవటం’ అనునిక అపూర్వయోగాన్ని “నమః" అను పదం సూచిస్తోంది. తన నికృష్ణతను, పూజ్యడగువాని ఉత్కృష్ణతను చూపటానికి నమస్కారంలో ఓ రహస్యం ఉంది. నమస్కారం వంటి తారక మంత్రం ఇంకొకటి లేదు. శత్రువు యొక్క శత్రుభావాన్ని సమూలంగా పోగొట్టగల శక్తి ఈ నమస్కారానికి ఉంది. నమస్కారంతో సకలార్థసిద్ధిని పొందవచ్చు.
శ్రీకృష్ణ పరమాత్మకు ఒక్కసారి నమస్కరించితే పది ఆశ్వమేథయాగాల అనంతరం చేయబడు అవభృథస్నానంతో సమానమని, భారతంలో చెప్పబడింది.
నమస్కారం వలన దైన్యభావం అలవడతాయి. దీనిచే మనలోని అహంకారం తగ్గుతుంది. దైన్యమనగా (నిరాడంబరత) సేవాభావమని అర్థం. సేవాభావం వలన, భగవద్భక్తి పెంపొంది, భగవంతునిపట్ల ఆరాధనాభావం కలుగుతుంది. అట్టి ప్రేమారాధానమే ‘భక్తి’. అట్టి భక్తితో సాధింపరాని సిద్ధులు లేవు. భక్తియే ఆత్మా సాక్షాత్కార జ్ఞానానికి మూలం. పరమభాక్తియే మోక్షప్రాప్తికి ఉత్తమ సాధనం. నమస్కారము – కాయకము, వాచికము, మాసికము అని మూడు విధాలు.
1. కాయకము: ఇది శారీరకమైనది, రెండు అరచేతులు కలిపి చేసే నమస్కారం. పడుకుని అష్టాంగాల్ని నేలపైమోపి చేయబడు సాష్టాంగ నమస్కారం, మరియు ధ్యాన ముద్ర నమస్కారము. (ఎడమబోటనివేలిపై కుడి బొటనవేలు ఉంచి, పరస్పరం పట్టుకుని, ఇతర వ్రేళ్ళను సాచి ఉంచితే మహాముద్ర అవుతుంది) ఈ ధ్యానముద్ర నమస్కారంతో, భావంతుని దానించితే సత్ఫలితాలు సిద్ధిస్తాయి.
2. వాచికము: నోటితో ఉచ్ఛరించునది. “నమః”, “నమస్కారము” మొదలగు శబ్దములతో మనమనోభావాన్ని తెలుపటం.
3. మాసికము: దైవంపట్ల, మనఃపూర్వకమైన ‘నమస్కార’ భావమును మనస్సునందే ఏకాగ్రతతో తలచుట.
ఏవిధమైన నమస్కారమైనప్పటికీ ఆత్మార్పణ చేసుకొనుటయే అవుతుంది. కాయక నమస్కారంతో (శారీరక నమస్కారాలు) అష్టాంగము, పంచాంగము, త్రయ్యంగము, ఏకంగము అని నాలుగు విధానాలున్నాయి.
అష్టాంగ నమస్కారము: అష్టాంగ నమస్కారం ఉత్తమమైనది, ముఖ్యమైనది, తప్పని సరిగా ఆచరించవలసినది.
“శిరోహస్తౌచ కర్ణౌచ చుబుకమ్ బాహు యుగ్మం అష్టాంగ చ నమస్కారమ్” అనగా శిరస్సు, రెండుచేతులు, రెండుచెవులు, గడ్డం, రెండు భుజాలు వీనిని నేలపై ఆనించి చేయబడు నమస్కారం ‘అష్టాంగము’ అని చెప్పబడుతోంది. దేవతలకు, గురువులకు, పెద్దలకు ఈ విధమైన నమస్కారం చేయాలి. (స్త్రీలు ఈవిధమైన నమస్కారాన్ని చేయరాదు).
పంచాంగ నమస్కారము: “శిరోహస్తౌచ బాహుచ కృత్యా జానునీ, సంస్థితా ఇదం పంచాంగ మేవోక్తమ్”
అనగా శిరస్సు, రెండుచేతులు, రెండు భుజాలు, మోకాళ్ళు నేలపై ఆన్చి (మోకాళ్ళపై వంగి) చేయబడు నమస్కారం పంచాంగ నమస్కారమని పిలువబడుతోంది. ఈ విధమైన నమస్కారం స్త్రీలకు ఉత్తమమైనది.
త్రయ్యంగ నమస్కారము: “హస్తౌ బద్ధ్వాతు ముకళ వమ్మార్నిదేశేనియోజయేత్”
రెండుచేతులు ముకుళించి (జోడించి) తలపై ఉంచి చేయబడుతున్న నమస్కారం త్రయ్యంగ నమస్కారం.
ఏకంగా నమస్కారము: “ఏకాంగంతు నమస్కారం శిరసైనా కృతాభవేత్”
తలను మాత్రం వంచి చేయబడు నమస్కారం “ఏకాంగ” నమస్కారమని పిలువబడుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లోనే (చేతులను జోడించి నమస్కరించ లేని పరిస్థితులలోనే) ఈ పద్ధతిలో నమస్కరించాలి.
‘గురువు’కు ఈ క్రింది విధంగా నమస్కరించటం శ్రేయస్కరం.
“వ్యత్యప్త పాణినా కార్యమున సంగ్రహణం గురోః |
సవ్యేన సవ్యః స్పృష్టవ్యో దక్షిణేవ చ దక్షణ: ||”
అనగా రెండు చేతులులను మార్చి పట్టుకుని (అనగా కుడిచేతిలో గురువు యొక్క కుడిపాదాన్ని, ఎడమచేతిలో గురువుయొక్క ఎడమపాదాన్ని) పట్టుకుని నమస్కరించాలి. మీ పాదపద్మాలే నాకు శరణ్యమనే భక్తి భావనతో గురువుకు నమస్కరించాలి.
“ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాంకరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాం గముచ్యతే”
వక్షఃస్థలాన్ని, శిరస్సును భూమికితాకించి, దృష్టితో దైవాన్ని చూస్తూ, మనస్సులో దైవమును ప్రార్థన చేస్తూ, ‘నమః’ అని పలుకుతూ, రెండు పాదాగ్రాలను కలుపుతూ, రెండు చేతులతో నమస్కరిస్తూ, రెండు చెవులను నేలకు తాకిస్తూ బోర్లపడి నమస్కరించటం “సాష్టాంగ నమస్కారం” అనబడుతుంది. ఈ విధమైన నమస్కారంలో కాయికము, వాచికము, మానసికము అనబడు త్రివిధాలైన నమస్కారాలు అంతర్గర్భితాలై ఉన్నాయి. అనగా మనస్సు చేత చింతించుట, వాక్కుచే ‘నమః’ అని అనటం, బోర్లగిలి అష్టాంగనమస్కారం చేయుట కలిసున్నాయి. ఇంకా రెండుచేతులు, రెండుకాళ్ళు, వక్షస్థలం, నొసలు, రెండు భుజాలు మొత్తం ఎనిమిది అంగాలను నేలకు తాకుతున్నట్లు బోర్లగిలి నమస్కరిస్తున్నందువల్ల “సాష్టాంగ నమస్కారం” అని పిలువబడుతోంది. ఈవిధమైన “సాష్టాంగ నమస్కారం” శ్రేష్టమైనది. స్త్రీలు సాష్టాంగ నమస్కారాలు చేయరాదు.
నమస్కారాలు చేయటంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మొక్కుబడిగా, హడావుడిగా కాక మనస్ఫూర్తిగా నమస్కరించాలి. రెండు చేతులను పూర్తిగా కలిపి హృదయస్థానాన్నిగాని, నుదుటనుగాని స్పర్శిస్తూ నమస్కరించాలి. నమ్రతభావనతో నమస్కరించాలి. ఇవన్నీ పూర్తిగా పాటించి నమస్కరిస్తేనే ‘నమస్కారం’ యొక్క నమ్రతాక్రియకు పరిపూర్ణత సిద్ధిస్తుంది. 3,5,7,9,12 సంఖ్యలలో నమస్కారాలు చేయడం శ్రేయస్కరం.
Swami Vivekananda Quotes Telugu's photo.

Swami Vivekananda Quotes Telugu's photo.

దేవుళ్ళు పూజించిన శివలింగాలు..

శివ పరమాత్మను పూజించేందుకు సకల దేవతలు శివలింగాలను పొందారు. అవి:
విష్ణువు – ఇంద్ర లింగం
బ్రహ్మ – స్వర్ణలింగం
లక్ష్మి – నెయ్యితో చేయబడిన లింగం
సరస్వతి – స్వర్ణలింగం
ఇంద్రుడు – పద్మరాగ లింగం
యమధర్మరాజు – గోమేధక లింగం
వాయుదేవుడు – ఇత్తడి లింగం
చంద్రుడు – ముత్యపు లింగం
కుబేరుడు – స్వర్ణలింగం
నాగులు – పగడపు లింగం
అశ్వినీదేవతలు – మట్టితో చేయబడిన లింగాలు

మనలోని శక్తి ఆ పరాశక్తే!

ఈ పుణ్యభూమిలో భగవంతుని ఎదోఒక రూపంలో ఆరాధించడం జరుగుతుంటుంది. అయితే అన్ని విధాలైన పూజలలో శక్త్యారాధాన జరుగుతుంటుంది. ఆ శక్తి రూపమే జగన్మాత. చిత్ ప్రధానమైనది బ్రహ్మవిద్య. శక్తి ప్రధానమైనది శ్రీవిద్య. ఈ రెంటికీ భేదం లేదు. ఈ జగత్తు సృష్టి స్థితిలయలను కలిగించే బ్రహ్మమే శక్తి. ఆమె శ్రీమాత. జగజ్జనని. మూలప్రకృతి. మహామాయ. పిపీలికాది బ్రహ్మపర్యంతం వ్యాపించిన శక్తి ఆమె. పరతత్వానికి స్త్రీ పురుష బేధం లేదు. అయితే శక్తి అనే శబ్దం స్త్రీలింగం అయినందున పరబ్రహ్మమైన పరాశక్తి త్రిపురసుందరిగా పూజలందుకుంటొంది.

ఆ తల్లి ఆవిర్భావాన్ని బ్రహ్మాండాపురాణంలోని లలితాపాఖ్యానం ద్వారా తెలుసుకోగలం. అందులో హాయగ్రీవుడు శ్రీమాత ప్రాదుర్భావాన్ని, ప్రాభవాన్ని సవివరంగా చెబుతాడు. అనంతరం అగస్త్యుని కోరికపై ఆ తల్లి నామాలను చెబుతాడు. అదే శ్రీలలితా సహస్రం. లోకోత్తర లావణ్య భావంతో, చిన్మయ చైతన్యంతో, అణువు అణువులో ఆడిపాడి ఓలలాడే లీలావతి లితాపరమేశ్వరీదేవి. సమస్తలోక కల్యాణమే ఆమె లక్ష్యం. ఆమె హృదయంలో కరుణా సముద్రం పొంగిపొరలుతుంటుంది. చతుష్పష్టి కళలలో ఆమె ఆరితేరిన కళానిధి. ఆమె మృదుమధుర పలుకులలో సకల కళలు ఉట్టిపడుతుంటాయి. భూదేవి దాహాన్ని తీర్చే తీయని మధుధారలంటే ఆ తల్లికి అమితమైన ఇష్టం. తన చల్లని చూపులతో ఈ సమస్తలోకాలను అనుగ్రహిస్తోంది. ఈ లోకంలో ఆమెను మించిన మంచితనాన్ని మనం ఎక్కడా చూడలేం. సహస్రారం చేరేందుకు దారి చూపే వారుణీనాడి ఆమె చేతిలొ ఉంది. అందుకే ఆమె అనుగ్రహం లభించిన వారికి తెలుసుకోవలసింది అంతా పూర్తిగా తెలిసిపోతుంది.

ఆమె మానస సరోవరంలో మందగమనంతో సంచరించే రాజహంసలా తన భక్తుల మనోమందిరంలో నెలకొని ఉంటుంది. మంత్రరూపంలో గోచరించే ఆ తల్లిని ఆరుగురు దేవతలు ఆరాధిస్తారు. హృదయం, శిరస్సు, శిఖ, నేత్రత్రయం, కవచం, ఆస్త్రం – ఇది ప్రతి మంత్రానికి ఉండే అంగన్యాసం. ఇందులో పరమేశ్వరి ఆంగికంగా ఉంటుంది. సాంగంగా, పరమేశ్వరిని ఆరాధించినవాళ్ళకు కీర్తిప్రతిష్టలు, సంపదలు, సమృద్ధి, ప్రజ్ఞ, వైరాగ్యం, ధర్మం అనే ఆరు గుణాలు అలవడుతాయి.

ఆ పరమేశ్వరి తత్త్వాన్ని అర్థం చేసుకునేందుకు చతుర్వింశతి (24) తత్వాలే సోపానాలు. పంచభూతాలు (భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం) పంచ తన్మాత్రలు (శబ్దం, స్పర్శ, రూపం, రసం గంధం) పంచేంద్రియాల జంటలు (కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు) మనస్సు, బుద్ధి, అహంకారం, మహత్తు, వీటిద్వారా ఆ తల్లిని తెలుసుకోవాలి. వీటిలో, వీటికి అతీతంగా ఉండే పర్మేశ్వరి తత్త్వాసన, తత్త్వ సింహాసనంపై ఆసీనురాలైన తత్వాసనిని చూడగలిగిన తాత్వికుడు, ఆ తల్లికి తన అంతరంగాన్ని చెప్పుకుంటాడు.

ప్రపంచంలో ప్రతి పదార్థంలో ఎదో ఒక శక్తి ఉంది. ఆ శక్తికి మూలం పరాశక్తి. పరమేశ్వరిలోని అపరిమేయమైన పరాశక్తి అన్ని పదార్థాలలో వేర్వేరుగా ప్రతిఫలిస్తుంటుంది. ఆమెను మించిన శక్తిలేదు. శక్తిని ఆమె అనుగ్రహం వల్లనే సాధించుకోవలసి ఉంటుంది. అందుకు అచంచలమైన దీక్ష కావాలి. ఉత్కృష్టమైన నిష్ట కావాలి. ఆమె శక్తికే కాదు, జ్ఞానానికి కూడ పరాకాష్ఠ. ఈ సమస్త విశ్వంలోని ప్రజ్ఞా విశేషాలన్నీ అవ్యక్తదశలో పరావాక్కులో ఒదిగి ఉంటాయి. ఆ పరావాక్కే పరాశక్తి.

ఘనీభవించిన జ్ఞానమే కరిగి వాగ్రూపంలో ప్రవహిస్తుంది. అనంతమైన జ్ఞానం అమెలో ఇమిడి ఉన్నందువల్ల ఆమె జ్ఞానానందంలో తేలిపోతుంటుంది.

ఆమె పేరు చెబితేనే మాంగల్యం ఫలిస్తుంది. మంగళ ధ్వనులు వినిపిస్తాయి. ఆమెను దర్శించుకున్న ప్రతి బిందువు మహా సింధువులా పొంగిపోతుంది. ఆమె చరిత్రను తెలుసుకున్నవారికి ఆ తల్లి కరుణాకటాక్షాలు పూర్తిగా లభిస్తాయి. ఆమె సాయుజ్యమే అఖండమైన సామ్రాజ్యం. ఆ తల్లి కటాక్షవీక్షణం ప్రసరిస్తేచాలు, సమస్త ఐశ్వర్యాలు మన ముందుకొచ్చి పడతాయి. అన్యులను కూడ ధన్యులను చేసే కరుణామయి. అందరికీ ఆనందాన్ని పంచిపెట్టే కారుణ్యమూర్తి ఆ తల్లి. ఆ తల్లిని నిత్యం ప్రార్థించుకుంటే సమస్తశుభాలు కలుగుతాయి అన్ని విధాలైన కష్టాలు తొలగిపోతాయి.

వర్ణాశ్రమధర్మం అంటే ఏమిటి?

వర్ణాశ్రమధర్మం అంటే సాంఘిక జీవనం సాఫీగా సాగాతానికీ, ఒకే వృత్తిని అందరూ అవలంబించకుండా వుండతానికీ, మానవ సదుపయోగానికీ వర్ణాశ్రమ ధర్మం ప్రవేశ పెట్టడం జరిగింది.

1. వర్ణధర్మ ప్రారంభం ఎలా జరిగిందంటే, సూక్ష్మబుద్ధి, సాతవిక యోచన వున్నవారినీ, పాపభీతి అహింసాప్రవృత్తి, వున్నవారినీ, కాయకష్టం చేయలేని బలహీనుల్ని, ఒక భాగంగా విభజించారు. వీరే బ్రాహ్మణులు. అయితే ఈ విభాగంలోనివారు ధర్మప్రవృత్తికి కట్టుబడి, తమ వృత్తికి లోబడి వుండకపోతే వాళ్ళను బ్రాహ్మణులుగా పరిగణించేవారు కాదు. సంఘ బహిష్కారం జరిగించేవారు. క్రూరమృగాలున్నఅడవులకు నేట్టేవారు.

2. ధైర్యసాహాసాలు, దేహశక్తి, పోరాటపటిమతో పాటూ రక్షణా శక్తి గలిగిన వారని నాయకులుగా నియమించుకొన్నారు. వీరే ‘క్షత్రియులు’. తమ గుంపులోనివారిని మరొక గుంపువారినుండి ఏ ఆపదా రాకుండా కాపాడటం, క్రూర జంతువుల బారినుండి స్త్రీలకూ, వృద్ధులకు, పసివారికి రక్షణ కల్పించటం ఈ వర్ణంవారి బాధ్యత.

3. తెలివితేటలూ, ధర్మబుద్ధి, న్యాయవివక్ష కలిగి వినిమయ దక్షత కలిగినవార్నిని ఆహార పదార్థాలు అందరికీ, అన్నీ అందటంకోసం వస్తుమార్పిడి జరగటం కోసం నియమించబడినవారే ‘వైశ్యులు’. ఎవరు ఏ విధమైన ఆహార పదార్థాలు సేకరించినా అవి అందరకూ వస్తుమార్పిడి పద్ధతిలో అందేట్లు చేయటం వీరి కర్తవ్యం.

4. ఒక గుంపులో వేయిమంది జనంవుంటే పదిమందిని నాయకులుగానూ, ఇద్దరినీ ఆహార వస్తువుల మార్పిడికిగాను, ఇద్దరినీ (బ్రాహ్మణులను) న్యాయరక్షణకు గానూ, నియమించుకొని మిగిలిన వారందరూ వ్యవసాయ వృత్తికీ, అడవులలోని కందమూలాలకూ ఫలసేకరణకు వెళ్ళేవారు. అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణానికి చెందినవారు పదిమంది వుంటే మిగిలిన  తొంభైమంది శూద్రవర్ణంవారు వుండేవారు.
అందరూ నియమానికి కట్టుబడి వుండేవారు.

గుంపులు గుంపులుగా వుంది బ్రతుకు సాగించే ఆనాటి జనంలో ఒక దురాచారం వుండేది. ఎదుటి గుంపులో స్త్రీలను మాటువేసి అపహరించుకొని పోయేవారు. శాశ్వతంగా తమవద్దనే వుంచుకోనేవారు. అబలలైన స్త్రీలు దౌష్ట్యానికి తలవంచి జీవించేవారు. తమ గుంపులోని స్త్రీలను ఎదుటి గుంపువారు అపహరించుకొని పోవటం అవమానంగానూ, చేతగానితనంగాను భావించేవారు. సమయం చూచి మాటువేసి అవతలి గుంపువారి ఆడవారిని బలాత్కరంగా ఎత్తుకొచ్చి స్వంతం చేసుకొనేవారు.
ఈవిధంగా సాగుతుండేది వారి జీవనం.
ఈ పరిస్థితులలో – రక్షణకు క్షత్రియవర్ణం, ధర్మన్యాయ నిర్ణయానికి బ్రాహ్మణ వర్ణం, అందరికీ అవసరమయ్యాయి. ఈ రెండు వర్ణాలవారు పెద్దలయ్యారు. అయితే ఎవరు ధర్మం తప్పి చరించేవారు కాదు.
బుద్ధిచాతుర్యం, నియమపాలన, శాకాహార నియమం కలిగిన బ్రాహ్మణ వర్ణం అందరి అభిమానాన్ని, మెప్పునీ సాధించారు. క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలను శాసించేస్థితికి ఎదిగారు. నాలుగు వర్ణాలలో వీరే అగ్రస్థానం సాధించారు. చాల నియమబద్ధంగా కూడా వుండేవారు. పర స్త్రీలవంక కన్నెత్తి చూచేవారు కాదు. ఒక స్త్రీతోనే నియమబద్ధంగా వుండటం శూద్ర క్షత్రియ వైశ్య వర్ణాలవారిని ఎంతో ఆకర్షించింది. అందరూ బ్రాహ్మణ వర్ణాన్ని అగ్రవర్ణంగా అభిమానించి గౌరవించటం మొదలు పెట్టారు.
అప్పటికి భాష వున్నా లిపి లేదు. చతుర్వర్ణాలలో బుద్ధివంతులైన బ్రాహ్మణవర్ణమే భాషకు లిపిని సమకూర్చారు. క్షత్రియ వైశ్యవర్ణాలవారికి లిపిని నేర్పించి విద్యావంతులను చేయటమే కాకుండా న్యాయ నీతి ధర్మ సూత్రాలు రచించారు. అవన్నీ అందరికీ ఆమోదయోగ్యం అయ్యాయి.
బుద్ధికుశలత వున్నా బ్రాహ్మణ వర్ణం అగ్రవర్ణం అయింది. (ఈనాడు మనం చూస్తున్న బ్రాహ్మణ వర్ణానికి, ఆనాటి బ్రాహ్మణ వర్ణానికి ఏ విధమైన సారూప్య సంబంధాలు లేవంటే లేవని చెప్పటం దుస్సాహసమే అవుతుంది. క్షమించాలి.)
ఆనాటి బ్రాహ్మణ వర్ణానికి వర్ణ వివక్ష యింత నీచంగా లేదు. వుండివుంటే పరం బ్రహ్మర్షి సద్బ్రాహ్మణుడైన వశిష్టమహర్షికి పంచమ జాతికన్య అయిన అరుంధతి భార్యగా అయ్యేది కాదు గదా!
ఆ|| పాపవర్తనుండు బ్రాహ్మణుండయ్యును
నిజము శూద్రుకంటె నీచ తముడు
సత్యశౌచ ధర్మశాలి శూద్రుండయ్యు
అతడు సద్విజుండయనిరి మునులు
(శ్రీ మహాభారతం పంచమాశ్వాసం అరణ్యపర్వం 137)
గౌతముని శాపంవల్ల బ్రాహ్మణులు ధర్మదూరులై అపమార్గాన్ని అవలంబించి, సదాచారానికి దూరమై, ధనలోభానికి లొంగిపోయారు. శాస్త్రాలను తలక్రిందుల చేసారు. అసంబద్ధ ఆచారాలను అక్రమ సాంప్రదాయాలను అమాయక జనసామాన్యుల్లోకి చొప్పించారు. ఇది త్రేతాయుగంలో చివరి భాగాన జరిగిందని అంచనా.
అయితే అందరూ గమనించవలసిన విషయం ఒక్కటుంది. శ్రీ మద్రామాయణం వ్రాసిన వాల్మీకి బ్రాహ్మణుడు కాదు. భారతీయులు మాత్రమే కాదు బ్రాహ్మనవర్ణం ఆరాధించి పూజించే అయోధ్య రాజైన శ్రీరాముడు బ్రాహ్మణుడు కాదు. శ్రీకృష్ణుడు బ్రాహ్మణుడు కాదు. బ్రహ్మర్షి విశ్వామిత్రుడు బ్రాహ్మణుడు కాదు. ఇలా చెప్పుకుంటూ పొతే చాల వుంది!!
బ్రాహ్మణ – క్షత్రియ – వైశ్య – శూద్ర జాతులే కాక ఐదవ జాతిగా (పంచమజాతి) కొందరిని విభజించటం జరిగింది. వారే మాల మాదిగాలుగా ఊరికి దూరంగా ప్రత్యేకంగా వుంటూ వచ్చారు. మాంసాహారం వీరికి ప్రధానాహారం. చెప్పులు కుట్టటం చర్మ సాధానాలు తయారుచేయటం, కూలిపని చేయటం వీరికి ముఖ్యవృత్తిగా శాసించటం జరిగింది. శ్మశానాలను కాపలా కాయటం కూడా వీరి బాధ్యతే!!
పంచమజాతి వారికి ఆలయ ప్రవేశం వుండేది కాదు. వారికి ప్రత్యేక ఆచారాలు, ప్రత్యేక దేవతలు, ప్రత్యేక వస్త్రధారణ వుండేవి. మారెమ్మ, మహంకాళమ్మ, పోతమ్మ, కంకాళమ్మ మొదలైన దేవతలను కొలవటం, మాంసాహారులు కావటం వాళ్ళ జంతు బలులు ఇవ్వటం వారికి ఆచారమయింది.

అన్నదములైన హిందువులు కులాల పేరుతో విడిపోయి హిందూ శక్తినీ, హిందూ మతాన్నీ, హిందూ ఆదర్శాన్నీ , హిందూ తత్వాన్ని కకావికలు చేసారు. ప్రపంచ దేశాలలో ఎక్కువ కులాలు ఉన్న దేశంగా భారతేదేశం నమోదు అయింది.

హిందీ భాషను భారతీయుల భాషగా చేయాలనీ, భారతీయు లందరికీ ఒకే భాష వుండాలనీ ఎంతో మంది ప్రయత్నం చేసారు. కానీ మాతృభాషా వ్యామోహం వున్నా మన భారతీయులు అంగీకరించలేదు. దురదృష్టం!
“మానవ కల్యాణంకోసం నియమించు కొన్న వర్ణాశ్రమ ధర్మ వెర్రితలలు వేసి వికృతరూపం దాల్చి, విషపు కోరలు చాచి హిందూమతాన్ని వేయి ముక్కలుగా చేసింది. ప్రపంచ నాగరికతలో పేరుపొందిన హిందువులు వర్ణధర్మంతో విడిపోయారు. శూద్ర వర్ణం వ్రక్కలైపోయి వివిధ కులాలుగా మారిపోవటం జరిగింది. ఇపుడు మన కులాల సంఖ్య మూడువేలుకు పైనే వుంది.”

వర్ణాశ్రమ ధర్మ కాలక్రమంలో నశించిపోయింది. ధనసంపాదన జీవిత ధ్యేయంగా మారి అన్ని వర్ణాలవారూ అన్ని ధర్మాలనూ మన్నిస్తున్నారు.
శుభం సర్వేజనా: సుఖినోభవంతు.

వటపత్ర శాయి అనగా?

మర్రి ఆకు మీద శయనించిన దేవుడు అని. ఈ వృత్తాంతం మార్కండేయ మహర్షి చరిత్రలో ఉంటుంది. మార్కండేయుడు ఆరు మన్వంతరములు తపస్సు చేశాడు. ఏడో మన్వంతరములో ఇంద్రుడు తపస్సును చెడగొట్టడానికి అందమైన అప్సరసలను పంపాడు. వారి నాట్య హోయలకు మార్కండేయుడు చలించలేదు.
చలించని మార్కండేయునికి శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమై ‘ఏం వరం కావాలో కోరుకో’ అనగా ‘నీ మాయను చూడాలని ఉంది’ అని అడుగుతాడు.

ఆ తర్వాత కొన్ని రోజులకి ప్రచండ గాలీ, ధారాపాత వర్షమూ విపరీతంగా వచ్చి సముద్రాలు పొంగాయి. నీటి తో సమస్తం మునిగిపోతుంది. మార్కండేయుడు మోహశోకాలతో విష్ణుమాయతో నీటిపై జీవించాడు. అలా తిరుగుతున్న అతనికి ఓ చోట మర్రిఆకుపై శయనిస్తున్న బాలుడు కనిపించాడు. చేతి వ్రేళ్ళతో కాలిని పట్టుకుని నోట ఉంచుకొని చీకుతూ కనిపించాడు. అతడే వటపత్రశాయి.

మహావిష్ణువు ఆదేశంతో మర్రి ఆకుపై నున్న వటపత్రశాయి కడుపులోకెళ్లి చూస్తాడు. నీట మునిగిన సమస్త భూమీ, ప్రాణ కోటి కనిపిస్తుంది.


మళ్ళీ మరోచోట సృష్టి ప్రారంభము చేస్తాడని తెలుసుకుంటాడు మార్కండేయుడు. శ్రీమాహావిష్ణువు వరం ప్రకారం విష్ణు మాయను తెలుసుకుంటాడు.

మొగలిపూవు పూజకు అర్హత లేని పువ్వని అంటారు. నిజమేనా?

పూర్వం బ్రహ్మ విష్ణువులు నేను గొప్పంటే నేను గొప్పని కలహించుకుంటూ ఉండగా, అపుడు వారి మధ్య ఒక శివలింగం పుట్టి బ్రహ్మను, నా శిరస్సు ఎక్కడుందో కనుక్కోవలసిందని; విష్ణువును నా పాదాలేక్కడున్నాయో కనుక్కోవలసిందని ఆదేశించింది. హంసరూపంలో బ్రహ్మ పైకి; ఆదివరాహరూపంలో విష్ణువు క్రిందికి వెళ్లారు.

బ్రహ్మకు లింగంశిరస్సు, విష్ణువునకు లింగపాదాలు కన్పించలేదు. మన్వంతరాలు తిరిగిపోయాయి. ఇద్దరూ తిరిగి పోరాడుకున్న స్థలానికే వచ్చారు. విష్ణువు నాకు లింగంపాదాలు కనిపించాలేదన్నాడు. బ్రహ్మ తానూ లింగం శిరస్సు చూచానని; మొగిలిపూవును, కామధేనువును వెంటబెట్టుకొని వచ్చి మొగలిపూవుచేత చూచినట్లు సాక్ష్యం చెప్పించాడు. కామధేనువు నడగ్గా అది తన తోకను అడ్డంగా ఊపి ఇది అబద్ధమని తెలియజేసింది. అప్పుడు విష్ణువు మొగలిపూవు అబద్ధం చెప్పింది కనుక అది పూజకర్హం కాదనీ, కామధేనువు వృష్ఠభాగంతో సత్యం తెలిపింది కనుక ఆవుకు వెనుకభాగం పూజార్హమగుగాక యనిన్నీ శాపం పెట్టాడు. అందువల్ల మొగలి పూవు పూజకర్హం కాకుండా పోయింది. ఆవు వెనుకభాగమే పూజింపబడుతోంది. మల్లె, గులాబీ మొదలైన పూవులు కూడా పూజకనర్హాలే! మల్లె కేవలం అలంకారానికి మాత్రమే!

గుడిలో ఎందుకు ప్రదక్షిణలు చేస్తారు?

“ప్రదక్షిణం” లో ‘ ప్ర ‘ అనే అక్షరము పాపాలకి నాశనము… ‘ ద ‘ అనగా కోరికలు తీర్చమని , ‘ క్షి ‘ అన్న అక్షరము మరుజన్మలో మంచి జన్మ ఇవ్వమని. ‘ ణ ‘ అనగా అజ్ఞానము ప్రారద్రోలి ఆత్మజ్ఞానము ఇవ్వమని. గుడిలో భగవంతుడి చుట్టూ తిరిగే ప్రదక్షిణంలో ఇంత అర్థం ఉంది. పూర్వం ఆదిలో వినాయకుడు పార్వతీ, పరమేశ్వరుల చుట్టూ తిరిగి విశ్వానికి ప్రదక్షిణ చేసిన ఫలం పొందాడు. కాన భగవంతుని చుట్టూ చేసే ప్రదక్షిణ విశ్వ ప్రదక్షిణమవుతుంది. ఆత్మ ప్రదక్షిణ అవుతుంది. భగవంతుడా! నేను అన్నీ వైపుల నుంచి నిన్నే అనుసరిస్తూ ధ్యానిస్తున్నానని అర్థం.

అదివో అల్లదివో శ్రీహరి వాసము

అదివో ...ఓ.ఓ.ఓ
గోవింద గోవింద గోవింద గోవింద గోవింద
అదివో అల్లదివో శ్రీహరి వాసము
పదివేలు శేషుల పడగలమయము
అదివో అల్లదివో శ్రీహరి వాసము
పదివేలు శేషుల పడగలమయము
అదివో అల్లదివో శ్రీహరి వాసము
ఏడు కొండల వాడా వెంకట రమణ గోవిందా గోవిందా
అదే వేంకటాచల మఖిలోన్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము
అదివో నిత్యనివాస మఖిలమునులకు
వెంకటరమణ సంకట హరణ
నారాయణ నారాయణ
అదివో నిత్యనివాస మఖిలమునులకు
అదే చూడుడు అదే మ్రొక్కుడు ఆనందమయము
అదే చూడుడదె మ్రొక్కుడానందమయము
అదివో అల్లదివో శ్రీహరి వాసము
వడ్డికాసులవాడా వెంకటరమణ గోవిందా గోవిందా
ఆపదమొక్కులవాడా అనాధ రక్షకా గోవిందా గోవిందా
కైవల్య పదము వెంకటనగ మదివో
శ్రీ వేంకటపతికి సిరులైనది
భావింప సకల సంపద రూపమదివో అదివో అదివో
వెంకట రమణ సంకట హరణ
భావింప సకల సంపద రూపమదివో
పావనములకెల్ల పావనమయము
అదివో అల్లదివో శ్రీహరి వాసము
వెంకటేశా నమో శ్రీనివాసా నమో
ఏడు కొండల వాడా వెంకట రమణా గోవిందా గోవిందా
అదివో అదివో అదివో

బిల్వ వృక్షం ఎక్కడ పుట్టింది?

శ్రీమహావిష్ణువు తన సతితో కలిసి శివుని గూర్చి తపస్సు చేస్తుండగా లక్ష్మీదేవి కుడిచేతి నుంచి బిల్వవృక్షం జన్మించింది. మహాశివుడు ప్రత్యక్షమై జగద్రక్షణ భారాన్ని శ్రీమహావిష్ణువుపై ఉంచాడు.

శ్రీవృక్షమనే పేరుతో కూడా పిలిచే బిల్వ వృక్షంనుదేవతలు స్వర్గంలోనూ, మందార పర్వతం పైనా, వైకుంఠంలోనూ నాటారు. శివుని కిష్టమైన ఈ బిల్వ వృక్ష ఆకులతో ఏ రోజైనా పూజ చేయవచ్చు. సోమవారం కోస్తే సోమవారం నాడే పూజకి వినియోగించాలి.

ఎండినా, కోసి రెండు మూడు రోజులైనా శివ పూజకు వాడకూడదు. బిల్వ వృక్షానికి ప్రదక్షిణలు చేస్తే సమస్త దోషాలు పోతాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. బిల్వ వృక్ష పత్రం లక్ష బంగారు పూవులతో సమానం.

Wednesday, July 1, 2015

ఏకలవ్యుని పుట్టువూర్వోత్తరాలు

ఆరుద్ర గారి "వ్యాసపీఠం" నుంచి ఓ వ్యాసం
మహాభారతంలో "అయ్యో పాపం!" అనిపించి సానుభూతికి నోచుకునే కొన్ని పాత్రలలో ఏకలవ్యుడు ఒకడు. ఈ ఉదాత్త పాత్ర గురించి సామాన్య పాఠకులకూ సాధారణ సాహితీ పరులకూ తెలుగు భారతం, ఆది పర్వంలో లభ్యమైనంత సమాచారం మాత్రమే తెలుసు. ఆదిపర్ం పంచమాశ్వాసంలో ౨౩౧వ వచనం నుంచి ౨౫వ పద్యం దాకా పదిహేను గద్య పద్యాలలో నన్నయ్యగారు ఏకలవ్వుని అస్త్ర విద్యాభ్యాసం, పాటవ ప్రదర్శనం, గురుదక్షిణ సమర్పణం తెలియజేశారు. తన శిష్యులలో ఒకే ఒకణ్ణి అందరి అందరికన్నా మిన్నగా చేయాలని ఇంకొక అసమాన పరాక్రమశాలిని ఆచార్యుడు అంగవికలునిగా చేయడం అనుచితం. అడిగి బొటనవ్రేలు కోసి ఇచ్చిన శిష్యుడు మహోన్నత వ్యక్తి. ఈ ఘట్టం తర్వాత ఏకలవ్యుడు ఏమయ్యాడు?
ఈ ప్రశ్నకు తెలుగు భారతంలో జవాబు దొరకదు. భారత కథలో ఎంతో ప్రముఖ పాత్రను వహించకపోతే ఆదిపర్వంలో ఏకలవ్యుని కథను కథనం చేయడం అనవసరం. తెలుగు భారతంలో దొరకదు గానీ వ్యాస భారతంలో ఏకలవ్యుని అట్టు పుట్టు ఆనవాళ్ళన్నీ ఓపికతో గాలించితే చేతినిండా చిక్కుతాయి. నన్నయ్యగారు గానీ, తిక్కన గారు గానీ వ్యాస భారతాన్ని యధామూలంగా అనువదించకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. భారతానికి హరివంశం ఖిలపర్వం, సంస్కృత భారంతలో మూల హరివంశాన్ని జోడించి చదివితే ఏకలవ్వుని పుట్టు పూర్వోత్తరాలన్నీ పువ్వులాగ విచ్చుకొంటాయి.
సంస్కృత హరివంశంలోని ౩౪వ అధ్యాయాన్ని చదివితే ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. పాండవులకు గాని కృష్ణునికిగాని ఏకలవ్వుడు పరాయివాడు కాదు. పాండవులకు గాని కృష్ణునికిగాని ఏకలవ్వుడు పరాయివాడు కాదు. రక్తబంధువు. పాండవులు, ఏకలవ్యుడు పినతల్లి పెదతల్లి బిడ్డలు. కృష్ణుడూ ఏకలవ్యుడూ మేనత్త మేనమామ బిడ్డలు. ఈ బీరకాయ పీచు బంధుత్వాలు ఎర్రయ్యగారి తెలుగు హరివంశం వల్ల కూడా కొంత తెలుస్తాయి. ఏకలవ్యునికీ, కీచకునికి కూడా బంధుత్వం ఉంది. సుధేష్ణ పాండవులకు స్వయానా పినతల్లి కూతురు. ఉత్తరకుమారునికి పాండవులు మేనమామలు.
యాదవకులంలో అంధక వంశశాఖ ఉంది. అందులో శూరుడను రాజుకు వసుదేవుడు మొదలయిన తొమ్మండుగురు కొడుకులూ, అయిదుగురు కుమార్తెలూ వున్నారు. ఆ పుత్రికల పేర్లను హరివంశం ఇలా చెబుతుంది.
పృధుకీర్తి: పృథాచైవ
శ్రుతదేవా శ్రుత శ్రవఁ
రాజాధిదేవీ చకదా
పంచైతై వీరమాతరః
(అధ్యాయం శ్లో ౧౯-౩౨)
వసుదేవుని ఈ అయిదుగురు అక్క చెల్లెళ్లూ ఎవరెవరిని పెళ్ళాడారో, వాళ్ళ సంతానం పేరులేమిటో కూడా హరివంశం ఈ అధ్యాయంలోని ఇతర శ్లోకాలలో చెబుతుంది.
౧. పృదకీర్తి
భర్తః వృద్ధశర్మ కరూశాధిపతి
కొడుకుః దంతవక్త్రుడు
౨. శ్రుతదేవ
భర్తః కేకయేశ్వరుడు హిరణ్యధన్వుడు
కొడుకుఛ ఏకలవ్యుడు
౩. శ్రుతశ్రవ
భర్తః చేదిరాజు దనుఘోషుడు
కొడుకుః శిశుపాలుడు
౪. పృధ(కుంతి)
భర్తః పాండురాజు
కొడుకులుః పాండవులు
౫. రాజాధిదేవి
భర్తః అనంతపతి
కొడుకులుః విందాను విందులు
కేకయరాజుకూ శ్రుతదేవకూ పుట్టిన ఏకలవ్యుడు నిషాదుడెందుకయ్యాడు? హరివంశంలోనే ఒక శ్లోకం ఆ సంగతిని చెబుతుంది.
దేవశ్రవాః ప్రజాతస్తు
నైషాదిర్యః చ్రతిశ్రుతిః
ఏకలవ్యో మహారాజ
నిషాదైః వధివర్థితః
(౬-౪ శ్లో ౩౩)
ఈ శ్లోకార్థమేమిటంటే? దేవశ్రవునికి ఏకలవ్యుడు జన్మించి నిషాదులచే పెంచబడ్డాడని, దేవశ్రవుడు వసుదేవుని తమ్ముళ్ళలో ఒకడు. శ్రుతదేవ అనే పేరుకు బదులు దేవశ్రవ అనే పేరు ఈ శ్లోకంలో చోటుచేసుకుంది. ఎర్రయ్యగారు ఆంధ్ర హరివంశంలో "శ్రుతదేవ కుంగేకయేశ్వరుని వలన నేకలవ్యుడు పుట్టి నిషాదులలోన బెరిగె" అని ఈ శ్లోకాన్నే అనువదించారు.(పూర్వం ౩-౧౬౧) కేకయ రాజు సుక్షత్రియుడు కానందు వల్లనే నిషాదుడయ్యాడు.
సంస్కృత భారతం - విరాటపర్వం - పదహారో అధ్యాయంలో కేకయ రాజుల ప్రసక్తి వుంది. "కీచకుని వివరాలను జనమేజయుడు చెప్పమంటే వైశంపాయనుడు చెప్పాడు." క్షత్రియ పురుషునికి బ్రాహ్మణ స్త్రీ వలన పుట్టినవాడిని సూతుడంటారు.
ఈ విధమైన ప్రతిలోమ జాతులలో సూతునికి ద్విజత్వం ప్రాప్తిస్తుంది. వీళ్ళని రధకారులని పిలుస్తారు. పూర్వం రాజులకు సూతవంశాలతో వైవాహిక సంబంధాలు వుండేవి.
అయినా సూతుని రాజ శబ్దంలో వ్యవహరించరుగాని కొందరు సూతులు రాజులను ఆశ్రయించి రాజ్యాలు సంపాదించారు. వాళ్ళని సూతరాజులంటారు. వాళ్ళలో కేకయుడు కూడా ఒకడు. ఇతడు సూతులకు అధిపతి. క్షత్రియ స్ర్రీకే పుట్టాడు. ఇతనికి ఇద్దరు భార్యలు. పెద్దభార్య మాళవి. ఈమెకు బాణుడు అనే కొడుకు పుట్టి కీచకుడు అనే పేరుతో ప్రసిద్ధుడయ్యాడు. కేకయుని రెండో భార్యకు చిత్ర అనే కుమార్తె పుట్టి సుధేష్ణ అనే పేరుతో పెరిగింది. ఈమె విరటుని రెండో భార్య. పెద్ద భార్య శ్వేత చనిపోయాక విరటుడు ఈమెను పెళ్ళాడాడు.
మూలంలోని ఈ శ్లోకాలను తిక్కనగారు తమ విరాటపర్వంలో తెనిగించలేదు. పైగా మూలంలో లేని విషయాన్ని మరొకచోట చెప్పారు. ఉత్తర కుమారుడు శమీవృక్షం దగ్గర బృహన్నలతో పాండవుల గురించి అడిగి "ఏనమ్మహానుభావుల మేనల్లుండ" అని చాటుకొన్నట్టు రాశారు. (విరాట-౪-౧౨౦) సుధేష్ణ పాండవుల పినతల్లి కూతురే అన్న సంగతి ఇందువల్ల తేలుతుంది.
హరివంశంలో ఏకలవ్యడి విద్యాభ్యాసం ప్రసక్తిగాని, గురుదక్షిణ సంగతిగాని లేదు. ఏకలవ్యుడు జరాసంధుని ఆంతరంగికులలో ఒకడు. జరాసంధుని సైన్యాలకు ఏకలవ్యుడే సేనాధిపతి. మధర మీద పద్దెనిమిది సార్లు జరాసంధుడు దండెత్తాడు. ప్రతీముట్టడి లోనూ ఏకలవ్యుడు సైన్యాధిపత్యం వహించాడు. సంస్కృత హరివంశంలో ౯౩వ అధ్యాయం నుంచి ౯౯వ అధ్యాయం దాకా ఏకలవ్యుని సంగర విక్రమం కనబడుతుంది.

Monday, June 29, 2015

పురుష వాక్కు

విస్పష్టమైన భావవ్యక్తీకరణకు భగవంతుడు మానవులకు ప్రసాదించిన అమోఘమైన వరమే వాక్కు. ఈ వాగ్భూషణం మానవులను మహనీయులుగా తీర్చిదిద్దగలుగుతుంది. పశుపక్ష్యాదులకు లేని సౌకర్యం మానవులకు లభించినందుకు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొనవలసినదే. అంతే తప్ప ఏ దశలోనూ వాక్కును దుర్వినియోగం చేయరాదు.
ప్రియమైన వాక్కుతో సాధ్యమైనంతగా అందరినీ సంతోషింపచేయాలి. అంతే కాని ఎదుటివారిని నొప్పించే పద్ధతిలో పరుషమైన వాక్కులను పలుకవద్దు అని ఆర్యాశతకకర్తయైన సుందరపాండ్యుడు లోకానికి హితప్రబోధం చేశాడు.
యుద్ధాలలో మనుషలను ఆయుధాలు గాయపరుస్తూ ఉంటాయి. విషం మానవుల ప్రాణాల ను హరిస్తుంది. నిప్పు నిలువునా మనిషిని కాల్చివేస్తుంది. పాపకర్మలు మనిషిని అప్పుడప్పు డూ ఆయా సందర్భాలనుబట్టి పీడిస్తూ ఉంటాయి. కాని ఇవేవీ బాధించని రీతిలో హృదయానికి కుచ్చుకున్న ముల్లులా మనుషలను ప్రతి క్షణం పట్టి పీడించేవి పరుషంగా పలికే పలుకులే .

న తథా రిపుః న శస్త్రం నాగ్నిః న విషం న దారుణో వ్యాధిః
పరితాపయతి చ పురుషం యథా కటుకభాషిణీ వాణీ ॥
అని సుందరపాండ్యుని ఆర్యోక్తి. (ఆర్యావృత్తంలో పలికిన సూక్తి).
కఠినంగా, పరుషంగా మాట్లాడేవారికి ఆప్తులు, ఆత్మీయులు దూరమౌతారు. సన్మార్గంలో పయనించేవారు అట్లే అన్యమార్గంలో పయనించేవారు అనే భేదం లేకుండా స్త్రీలు-పురుషులు చిన్నలు-పెద్దలు అనే తేడా లేకుండా అన్ని కాలాలకు అన్ని ప్రాంతాలకు చెందిన వ్యక్తులందరికీ మనోవేదనను కలిగించేవి పరుషవాక్కులే అనే సత్యాన్ని గుర్తిద్దాం. పుల్లవిరుపు మాటలతో, వ్యంగ్యోక్తులతో, అధిక్షేపాలతో, నిష్ఠరమైన వాక్కులతో హృదయానికి గాయాన్ని కలిగించే విధానానికి స్వ్తిచెప్పే ప్రయత్నాన్ని చేద్దాం.
పాముకాటుతో, విషప్రయోగంతో, అగ్నిప్రమాదంతో ఒకేసారి ప్రాణాలు పోతాయి. ఈ విషాదాన్ని మించినరీతిలో పరుషవాక్కులచేత గాయపడినవారు అటు ప్రాణాలు పోక, ఇటు ప్రశాంతంగా ఉండలేక ప్రతిక్షణం సతమతమవుతూ విలవిలలాడుతూ ఉంటారు. ఇటువంటి బాధ మనవల్ల మరొకరికి కలగడం సరికాదనే సత్యాన్ని గుర్తిద్దాం. ఆచరించే ప్రయత్నం కూడా చేద్దాం.

జ్యోతిర్లింగ దర్శనం-సోమనాథ జ్యోతిర్లింగం

స్వామి సోమనాథునిగా వెలసిన కథ స్కాంద పురాణంలో ఉంది.
బ్రహ్మదేవుని మానసపుత్రుడైన దక్షప్రజాపతికి అశ్విని నుంచి రేవతి వరకు 27 కుమార్తెలున్నారు.
తన కుమార్తెలను చంద్రునికి ఇచ్చి ఘనంగ వివాహం జరిపించాడు దక్షుడు. అయితే చంద్రుడు రోహిణిని మాత్రం అనురాగంతో
చూస్తూ,మిగిలినవారిని అలక్ష్యం చేయసాగాడు.
మిగిలినవారు తండ్రితో ఈ విషయాన్నీ మొరపెట్టుకోగా,దక్షుడు అల్లుడైన చంద్రుడిని మందలిస్తాడు. అయినప్పటికీ, చంద్రుని ప్రవర్తనలో మార్పురాకపోవడంతో,
క్షయరోగగ్రస్తుడవు కమ్మని చంద్రుని శపిస్తాడు దక్షుడు.
ఫలితంగా చంద్రుడు క్షీణించసాగాడు. చంద్రకాంతి లేకపోవడంతో ఔషధాలు, పుష్పాలు
ఫలించలేదు. ఈ పరిస్థితిని చూసిన సమస్తలోకవాసులు, తమ కష్టాలు తీరేమార్గం చూపమని బ్రహ్మ దేవుని ప్రార్థించారు.
బ్రహ్మ ఆదేశాన్ననుసరించి ప్రభాసక్షేత్రంలో మహామృత్యుంజయ మంత్రానుష్ఠానంగా
శంకరుని ఆరాధించిన చంద్రుడు, పార్థివలింగాన్ని ప్రతిష్టించి పూజించగా, శంకరుడు ప్రత్యక్షమై, చంద్రుని రోగ విముక్తుని గావించి, కృష్ణపక్షంలో చంద్రకళలు రోజు రోజుకీ తగ్గుతాయనీ, శుక్లపక్షంలో దిన మొక కళ
చొప్పున పెరుగుతుందని అనుగ్రహించాడు.
ఆనాటి నుండి చంద్రుని కోరిక మేర,
అతని కీర్తిదిశదిశలా వ్యాపించేందుకై చంద్రుని పేరుతో సోమనాథునిగా, కుష్టు వంటి మహా రోగాలను తగ్గించే సోమనాథ్ జ్యోతిర్లింగ రూపునిగా పార్వతీదేవిసమేతంగా వెలసి భక్తులను కరుణిస్తున్నాడు

ఆచమనం

మనం చేసే ఆచమనంలో వైదికాంశాలతోపాటు వైజ్ఞానిక రహస్యాలు కూడా ఇమిడి ఉన్నాయి.మన గొంతులో 'స్వరపేటిక' అనే శరీర అంతర్భాగం వుంటుంది. మనం చేసే ధ్వనులు అంటే మన మాటలు స్వరపేటిక నుండే పుడతాయి. మన ధ్వని గాంభీర్యానికి, స్పష్టతకు ఈ స్వరపేటికే ఆ ధారం.
స్వరపేటికలోకి గాలి జొరబడినప్పుడు అంటే మన శ్వాసకోశాల నుండి వెలువడే ఉచ్ఛ్వాస వాయువు ధ్వని తంతులమీదుగా పయనించినప్పుడు, ఈ ధ్వని తంతువులలో ఏర్పడిన శబ్దాలు బయటకు రావడానికి నోరు, ముక్కు రంధ్రాలు సహాయపడతాయి. అదేవిధంగా నాలుక పెదవులు శబ్దాల ఉచ్ఛారణకు, స్పష్టతకు దోహదం చేస్తాయి.
ప్రతి అక్షరానికి తనదైన ధ్వని ఉంటుంది. నోటిలోని అవయవాలు కదులుతూ ఈ ధ్వనులను ఉత్పత్తి చేస్తాయి. ఈ ధ్వని (అక్షరం) ఏ భాగం నుండి ఉత్పత్తి అవుతుందో దాని ఆధారంగా అక్షరాలను కాంఠ్యాలు, తాలవ్యాలు మొ|| గా విభజించారు.
ఇక మనం వైదిక కర్మలను ఆచరించేటప్పుడు చేసే ఆచమనం వలన మన నాలుకకు, గొంతుకు ఒకరకమైన ఉత్తేజం కలుగుతుంది. అంతేకాకుండా మన గొంతునుండి మాట బయటకు వచ్చేటప్పుడు, ధ్వనితోపాటు గొంతు నుండి వాయువు కూడా బయటకు వస్తుంది. ఈ విధంగా లోపలి నుండి వాయువు బయటకు వచ్చేటప్పుడు ఎలాంటి అడ్డంకి లేకుండా ఉండేందుకు ఆచమనం ద్వారా మనం త్రాగే నీరు ఉపయోగపడుతుంది. నిర్దిష్ట పరమాణంలో మనం తీసుకున్న నీరు గొంతు నుండి వెలుపలివైపు మార్గాన్ని నునుపుగా చేసి మన మాట సులభంగా, స్పష్టంగా వచ్చేందుకు దోహదం చేస్తుంది.
పూజాది వైదిక కార్యాలను ఆచరించేటప్పుడు మంత్రోచ్చారణ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఆయా మంత్రాలన్నీ గొంతునుండి ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చేందుకే మన మహర్షులు ఈ ఆచమన సంప్రదయాన్ని ఏర్పరచారు.
ఇక ఆచమనంలో కేశవాది నామాలను ఉచ్చరించడంలో కూడా ఎంతో వైజ్ఞానిక అంశం ఇమిడి ఉంది. ఆచమనంలో ముందుగా "కేశవాయస్వాహా: అని చెప్పుకుంటారు. 'కే" శబ్దము గొంతునుండి పుడుతుంది. తర్వాత పలికే "నారయణస్వాహా" అనే నామము నాలుక నుండి వస్తుంది. ఇక మూడవసారి చెప్పుకునే "మాధవాయస్వాహా" అనే పదము పెదవుల సహాయంతో పలుక బడుతుంది. కాబట్టి కేశవాది నామాలను పలకడం వలన గొంతుకు, నాలుకకు, పెదవులకు ఒకేసారి వ్యాయామం కలుగుతుంది మరియు ఆ తరువాత వచ్చే శబ్దాలకు ఉచ్చారణ కూడా స్పష్టంగా ఉంతుంది.
మన శరీరము ఒక విద్యుత్ కేంద్రములాంటిది. మన శరీరమంతా విద్యుత్ ప్రవహిస్తూ ఉంటుంది. ఆచమన సమయంలో మనం అరచేతిలో తక్కువ ప్రమాణంలో నీటిని వేసుకున్నప్పుడు ఎలక్ట్రో మాగ్నిటిజమ్ పద్ధతిలో అరచేతిలో ఉన్న నీరు పీల్చుకొంటుంది. ఈ నీటిని త్రాగినప్పుడు, నీరు జీర్ణకోశమును చేరి, అక్కడి గోడలలో ప్రవహించే విద్యుత్తుతో కలిసి, శరీరమంతా ఒకే క్రమపద్ధతిలో విద్యుత్తు ప్రవహించేలాగా చేస్తుంది. ఇలా విద్యుత్తీకరణము చెందిన నీరువల్ల గొంతు, నాలుక, స్వరపేటిక మొ|| భాగాలు కూడా ఉత్తేజము పొందుతాయి.
ఇంతటి వైజ్ఞానికాంశాలు ఇమిడి ఉన్నాయి కాబట్టే, మన మహర్షులు ఆచమనాన్ని ఒక తప్పనిసరి వైదిక నియమంగా ఏర్పరిచారు.

అంజనీపుత్రుడు

యుద్ధంలో సహాయంగా ఉండేందుకు విష్ణు మూర్తి తన శంకు, చక్రాలను
హనుమంతుడికి ప్రసాదించారు. బ్రహ్మదేవుడు తన కమండలాన్ని, పరమ
శివుడు తన మూడో కంటిని ఆంజనేయుడికి ప్రసాదించారు.
ఇలా వివిధ దేవతల నుంచి పది ఆయుధాలు పొందిన అంజనీపుత్రుడు దశభుజుడయ్యాడు.
హనుమాన్... ఈ పేరు వినగానే మనకు వానర రూపంలో ఉండే ఆంజనేయుడు
గుర్తుకు వస్తాడు.
అంతే కాదు భక్తికి మారుపేరుగా, బ్రహ్మచర్యానికి
ప్రతీకగా కూడా ఆంజనేయుడు కీర్తికెక్కాడు. హనుమంతుడు సాధారణంగా చేతిలో
సంజీవని పర్వతంతోనో, లేదా రాముని పాదాల వద్దో మనకు కనిపిస్తాడు.
అయితే పదిభుజాలు, మూడు కళ్లు కలిగిన ఆంజనేయుడిని ఎప్పుడైనా
చూశారా?
అయితే ఆ రూపాన్ని చూసేందుకు తమిళనాడు రాష్ట్రం, నాగపట్నం జిల్లాలోని
ఆనందమంగళంలో ఉన్న త్రినేత్ర దశభుజ వీరాంజనేయ ఆలయానికి
వెళ్లాల్సిందే.
ఈ ఆలయంలో పది భుజాలు, నుదురుపై మూడో కన్ను కలిగిన ఆంజనేయుడు భక్తుల పూజలందుకుంటున్నాడు. త్రేతాయుగంలో విష్ణుమూర్తి రామావతారమెత్తి రావణుడిని సంహరించిన పిమ్మట నారదుడు ఆయనను
కలుసుకున్నాడు.
స్వామి లంక నాశనముతో మీ యుద్ధము పూర్తికాలేదు. రావణుని వారసులు
ఉన్నారు. తండ్రి మృతిపై ప్రతీకారం తీర్చుకునేందుకు వారు తప్పకుండా మీపై
యుద్ధానికి వస్తారు. వారు ప్రస్తుతం సముద్ర అడుగు భాగంలో తపస్సు
చేస్తున్నారు.
వారి తపస్సు పూర్తి కాకముందే మీరు వారిని సంహరించాలని వేడుకున్నాడు.
అప్పుడు రాముడు నారదమహర్షి రామావతారంలో నా కర్తవ్యం
పూర్తయినది. మరికొన్ని రోజుల్లో ఈ అవతారాన్ని చాలించనున్నాను.
ఇందుకు ఇంకెవరినైనా ఎంపిక చేయుమ"ని అన్నాడు. కాగా, రాక్షస వధకు
హనుమంతుడిని పంపించాలని అందరూ నిర్ణయించారు. యుద్ధంలో సహాయంగా ఉండేందుకు విష్ణు మూర్తి తన శంకు, చక్రాలను
హనుమంతుడికి ప్రసాదించారు. బ్రహ్మదేవుడు తన కమండలాన్ని, పరమ
శివుడు తన మూడో కంటిని ఆంజనేయుడికి ప్రసాదించారు.
ఇలా వివిధ దేవతల
నుంచి పది ఆయుధాలు పొందిన అంజనీపుత్రుడు దశభుజుడయ్యాడు.
కైలాసనాధుని నుంచి మూడో కన్ను పొందడంతో ముక్కంటిగా మారాడు.
వానర శ్రేష్టుడు రాక్షస వధ పూర్తిచేసి విజయంతో తిరిగి వచ్చాడు.
ఈ రూపంలో ఆయన రాక్షసులను అంతమొందించి అక్కడ వెలిసినందున ఆ ప్రాంతంలో
ఆలయాన్ని నిర్మించి భక్తులు పూజిస్తున్నారు. రాక్షస వధతో హనుమంతుడు
ఆనందంగా ఉన్నందున ఆ ప్రాంతానికి ఆనందమంగళమ్ అనే పేరు స్థిరపడిందని
భక్తులు చెబుతుంటారు

దేవాలయంను దర్శించుకునే పధ్ధతి దయచేసి చదవండి.

దేవాలయం అంటే దైవం నెలవున్న స్థలం. పరమపవిత్రమైన క్షేత్రం. అఖిలాండకోటి బ్రహ్మాండ
నాయకుడు భక్తుల అభీష్టములు తీర్చడానికి కొలువైఉన్న పరమ పావన నివాసం. అలాంటి
దేవాలయమునకు దర్శనమునకు వెళ్ళునపుడు కొన్ని ధర్మములను / పద్ధతులను ఆచరించాలి.
అప్పుడే ఆ దైవం యొక్క అనుగ్రహమునకు పాత్రులము అవుతాము.
1) ప్రతి భక్తుడు ( స్త్రీ పురుషులు ) గుడికి వెళ్ళే ముందు శుచిగా స్నానం చేసి, విధిగా నుదుట కుంకుమ ధరించాలి.
2) సంప్రదాయమైన వస్త్రములు ధరించాలి. స్త్రీలు చీరలు, పురుషులు ధోవతి-ఉత్తరీయం, ఆడపిల్లలు పరికిణీలు లేదా చుడీదార్ ధరించాలి. ( చాలామంది ఆడపిల్లలు జీన్స్ టీ షర్టులు- మగపిల్లలు షార్టులు ధరించి వెళుతున్నారు.
ఇలా ధరించినవారిని ఆలయ ప్రవెశమునకు అనుమతిని ఇవ్వకుండా యాజమాన్యం చూసుకోవాలి. తల్లి
తండ్రులు ప్రొత్సహించరాదు .)
3) కనీస పూజా సామాగ్రిని తీసుకొని వెళ్ళాలి. పెద్దవారి దగ్గరికి వెళ్ళినా మహాత్ముల దగ్గరికి వెళ్ళినా ఒట్టి చేతితో
వెల్లరాదు. గీతలో పరమాత్ముడు '' పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి" ...ఎవరైతే నాకు భక్తీతో పత్రం కాని పుష్పం కాని ఫలం కాని ఉదకం కాని సమర్పిస్తారొ వాటిని ప్రీతితో స్వీకరిస్తాను'' అన్నాడు.
4) గుడి ముందుకు చేరుకోగానే మొదట కాళ్ళూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
5) ఆలయం ప్రవేశించడానికి ముందు గోపురానికి నమస్కరించి తర్వాత మెట్లకు నమస్కరించాలి.
6) లోనికి ప్రవేశించినప్పటినుండి భగవంతుని నామం జపిస్తూ అన్యమస్కంగా కాకుండా ఏకాగ్రత
అంతా దేవుడిపైనే ఉంచాలి.
7) నామ జపం చేస్తూ మధ్యమ వేగంతో గర్భాలయం చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి పురుషులు స్వామికి కుడి వైపు, స్త్రీలు ఎడమ వైపు నిల్చోవాలి.
8) మొదట మూల విగ్రహం పాదాలను దర్శించి అందులో లీనం కావాలి.తరువాత స్వామి కళ్ళలోకి చూస్తూ లీనం కావాలి.
9) అర్చన చేసుకునేవారు తమ గోత్రము ఇంటిపేరు నక్షత్రము చెప్పుకోవాలి. తీర్థం తీసుకునే  సమయంలో అరచేయిని గొకర్నాక్రుతిలొ ఉంచి చేయి కింద ఏదైనా వస్త్రం ఉంచుకుని '' అకాల మృత్యు  హరణం ...'' అనే మంత్రం స్వయంగా చెప్పుకుంటూ భక్తితో తీర్థాన్ని చప్పుడురాకుండా తీస్కోవాలి.
10) దర్శనం అయిన తరువాత కాసేపు కూర్చొని నామ జపం చేస్తూ ప్రశాంత చిత్తంతో ఉండాలి.
11) ప్రసాదం భక్తులందరికీ పంచి తామూ భక్తితో తీస్కోవాలి.
12) తిరిగి వెళ్ళే ముందు మళ్ళీ స్వామికి నమస్కరించుకుని బయటికి వచ్చిన తరువాత మళ్ళీ గోపురానికి నమస్కరించి వెళ్ళాలి.
13) ఆలయ ప్రదక్షిణలు చేసేటప్పుడు వేగం కూడదు.
14) అనవసరంగా మాట్లాడటం.. పరుషపదజాలం ఉపయోగించకూడదు
15) ఆవలింతలు, జుట్టు పీక్కోవడం, తల గీక్కోవడం, తమలపాకులు వేయకూడదు.
16) జననం, మరణం సంబంధించిన విషయాలపై మాట్లాడకూడదు.
17) టోపీలు, తలకు వస్త్రాలు కట్టుకోవడం చేయకూడదు.
18) ధ్వజస్తంభం, బలిపీఠం, గోపుర స్థలాలను తొక్క కూడదు.
19) ఆకర్షణీయ దుస్తులను ధరించకూడదు.
20) నందీశ్వరుడు, శివలింగానికి మధ్యలో వెళ్ళకూడదు.
21) దర్శనం పూర్తయ్యాక వెనకవైపు కాస్త దూరం నడిచి, తర్వాత తిరగాలి.
22) ఒక చేత్తో దర్శనం చేయకూడదు.
23) భుజాలపై టవల్స్ వేసుకుని దర్శనం చేయకూడదు.
24) ఆలయంలో భుజించడం, నిద్రించడం చేయకూడదు.
25) ఆలయంలో ఎత్తైన ప్రాంతంలో కూర్చోకూడదు.
26) బలిపీఠంలో ఉన్న సన్నిధిని మ్రొక్కకూడదు.
27) ఆలయ ఆస్తులను అపహరించకూడదు.
28) అష్టమి, నవమి, అమావాస్య, పౌర్ణమి, మాస ప్రారంభం, సోమవారం, ప్రదోషం, చతుర్థి రోజుల్లో బిల్వ దళాలను తుంచకూడదు.
29) ఆలయంలో స్నానం చేయకుండా ప్రవేశించకూడదు.
30) మూల విరాట్ వద్ద దీపం లేకుండా దర్శనం చేయకూడదు.
31) ఆలయానికి వెళ్లొచ్చిన వెంటే కాళ్లను కడగకూడదు. కాసేపు కూర్చున్న తర్వాతే ఇవన్నీ
చేయాలి.
32) ఆలయంలోకి ప్రవేశించి, తిరిగి వచ్చేంతవరకు నిదానం ప్రదానంగా ఉండాలి.
33) గోపుర దర్శనం తప్పక చేయాలి.
34) ఆలయంలోని మర్రి చెట్టును సాయంత్రం 6గంటల తర్వాత ప్రదక్షిణలు చేయకూడదు.
35) ఆలయంలోపల గట్టిగా మాట్లాడకూడదు.
36) మన మాటలు, చేష్ఠలు ఇతరులకు ఆటంకంగా ఉండకూడదు.

Saturday, June 27, 2015

తీర్ధ ప్రసాధాల్లో నాలుగు రకాలు

1. జల తీర్ధం
2. కషాయ తీర్ధం
3. పంచామృత తీర్ధం
4. పానకా తీర్ధం
01. జల తీర్ధం
ఈ తీర్ధం ద్వార అకాల మరణం ,సర్వ రోగాలు నివారించాభాడుతాయి .అన్ని కష్ట్టలు , ఉపసమానాన్ని ఇస్తాయి .బుద్ధి ,అధర్మం వైపు పయనించకుండా అడ్డుపడుతుంది .
02. కషాయ తీర్ధం
ఈ తీర్ధం కొల్లాపురంలోని శ్రీమహాలక్ష్మిదేవాలయం ,కొల్లూరు ముకాంబిక దేవాలయం ,హిమాచలప్రదేశ్ లోని జ్వాలమాలిని దేవాలయం ,అస్సాంలోని శ్రీ కామాఖ్య దేవాలయములో ఇస్తారు .రాత్రి పూజ తరువాత తీర్థనీ కషాయం రూపంలోపంచుతారు.వీటిని సేవెంచటం ద్వారా కనిపెంచే -కనిపించని రోగాలు త్వరలో నయం అవుతాయి .
03. పంచామృత అభిషేక తీర్థం
పంచామృత సేవనం ద్వార చేపట్టిన అన్ని పనులు దిగ్విజయంగా పూర్తికావటం మరియు బ్రహ్మలోకం
ప్రాప్తిస్తుంది .
04. పానకా తీర్ధం
శ్రీ మంగళగిరి నరసింహస్వామి దేవునికి ,అహోబిలం నరసింహ దేవునికి పానకం నివేధ్యంగా పెట్టడంతో పానకాల స్వామి ,పానకాల నరసింహస్వామి దేవునిగా ఖ్యాతినర్జించారు ..
కారణం స్వామికి పానకాన్ని నివేధ్యంగా పెట్టి వచ్చే భక్తులకు పానకాన్ని తీర్ధంగా పంచుతారు .
* పానకా తీర్ధాన్ని సేవిస్తే....
దేహంలో ఉత్సహం ఎక్కువ అవుతుంది .కొత్త చైతన్యం వస్తుంది .
దేహంలో వుండే వేడి సమస్తితికి వచ్చే విధంగా చేస్తుంది .
రక్తపోటు ఉన్నవారికి ,తల తిరగడం ,నోరు ఎండిపోయినట్లు ఉండడం జరగదు
రుమాటిజం , ఎముకులుకు సంభందించిన వ్యాధులు నయం అవుతాయి .
నీరసం దరిచేరదు .
* ఆకలి బాగా వేస్తుంది
దేవుని తీర్ధమైన పానకం సేవించటం ద్వార మధుమేహ వ్యాది అదుపులో ఉంటుంది .
జేవితంలో శత్రువుల బాధ ఉండదు బుద్ది చురుకుగా పని చేస్తుంది జ్ఞాపకశక్తి పెరుగుతుంది .

కలిపురుషుడి ప్రభావం ఎవరి యందు ఉంటుంది?

ఒకనాడు పరీక్షిత్ మహారాజు దిగ్విజయ యాత్ర చేస్తున్న సందర్భంలో ఒక ఆశ్చర్య కరమైన విషంయం చూశాడు. ఒంటి కాలు కలిగిన ఎద్దు ఒకటి నిలుచుని ఉంటే, దాని ముందు ఆవు ఒకటి నిలబడి పిల్లలగూర్చి జాడ తెలియక బాధపడుచున్న దానివలే ఏడుస్తూ ఉంది. అప్పుడు ఆ ఎద్దు " ఎందుకు ఏడుస్తున్నావు మంగళ ప్రదురాలా? " అని ప్రశ్నిస్తుంది. అందుకా ఆవు "నేను ఏడుస్తున్నది నాగురించి కాదు, నేడు ఆశ్రీలలనేశుడి లేమి వలన కాలముచే నీకు ఒంటి కలయ్యెను కదా!? అని దుఃఖిస్తున్నాను. ఆ కలి ప్రభావముచే దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, ధీయుతులకు, నీకు, నాకు, గోవులకు, వర్ణాశ్రమలకు బాధ కలుగుతుంది కదా అని బాధ పడుతున్నాను" అంటుంది.
ఒక్క కాలు మీద ఎద్దు ఎలా నిలబడగలదూ? దానిని చూసి ఆవు విలపించడమేమిటీ? అంటే అక్కడ ఉన్నది మామూలు ఆవూ, ఎద్దులు కాదు. ఆ ఆవు భూదేవి, వృషభం ధర్మ దేవత. కృష్ణ నిర్యాణానంతరం కలియుగం ప్రారంభ సమయంలో కలి ప్రవేశించి నపుడు ఆ కలి పురుషుని ప్రభావం వలన ధర్మము యొక్క ( సత్యము, శౌచము, తపస్సు, దయ అను ) నాలుగు పాదములలో 3 నశించి ఒక్క కాలు మాత్రమే మిగిలినందులకు ఆ భూదేవి విలపించుచున్నది. నశించినవేవి? శౌచము, తపస్సు, దయ అను నవి నశించినవి. మిగిలినది సత్యము. ఇది ఎప్పటికీ నశించదు.
దుష్ట సంగము వలన శౌచము, సమ్మోహము వలన తపస్సు, అహం కారము వలన దయ నశించినవి. అవి నశించుట వలన పైన తెలిపిన 8 మందికీ బాధ కలుగుతుంది.
ఈ విధంగా ఆవు దుఃఖిస్తుండగా అపారమైన కోపం కలవాడు, దండము చేతిలో కలిగినవాడు, రాజు ఆకారంలో ఉన్న వాడు, ఖఠినాత్ముండు అయిన వాడు ఒకడు వచ్చి ఆవును తన కాలితో తన్నాడు. ఆ ఆవు క్రింద పడి పోయినది. ఒంటి కాలు మీద నిలబడిన ఎద్దుని కూడా తన్నాడు. అది కూడా క్రింద పడి పోయినది. క్రింద పడి వాటిని తన చేతిలోని దండముతో విపరీతముగా కొట్టనారంభించాడు. అవి కనులనుండి నీరు కారుతుండగా విలపిస్తున్నాయి.
దూరమునుండి అది చూచిన పరీక్షిత్తు వాటిని సమీపించి ఆ గోవును భూమాతగాను, వృషభమును ధర్మముగాను గుర్తించి అమ్మా మీకీ దీనావస్థ కలుగుటకు కారణము ఎవరు? మీకు మూడు కాళ్లు లేక పోవుటకు కారణము ఎవరు ? ఎంతటి వారైనప్పటికినీ నేను వారి చేతులను ఖండఖండములుగా చేసి మిమ్ము రక్షించెదను సెలవిమ్మని అడిగెను.
అందుకా గోమాత " కొందరు కాలమన్నారు,కొందరు కర్మ అన్నారు, ఇది యుగ సంధి అన్నారు, యుగ లక్షణమన్నారు. ఏవేవో కారణాలు చెప్పారు, ఏది ఏమైనప్పటికినీ వీరి పాదములు తెగిపోయాయి" అన్నది.
పరీక్షిత్తు ఇందాక గోవును బాధించిన వానిగురించి వెతుకు చుండగా, ఆ నృపాకారుడైన వాడు వచ్చి గభాలున పరీక్షిత్తు పాదాలమీద పడి అయ్యా రక్షించండి నేనే నరికేశాను ఆపాదాలు అన్నాడు. నన్ను కలి పురుషుడంటారు. నా ప్రవేశం వలననే ధర్మమునకు 3 పాదాలు తెగిపోయాయి. ఈ కలియుగంలో నేను నిలబడాలంటే ధర్మం నశించాలి. అందుకు అనువుగా భగవంతుడే తన అవతారం చాలించాడు. కానీ నేను ఇంకా సరిగా నా ప్రభావాన్ని చూపకముందే, నీవు నన్ను అవరోధిస్తున్నావు. నేను ఎక్కడికెళితే అక్కడ నీవు ధనుర్భాణాలు పట్టుకు నిల్చుంటున్నావు. అలా కాదు నాకో అవకాశం ఇవ్వు. నువ్వు ఫలానా చోట ఉండు అని చెప్పు. నేనక్కడ ఉంటాను. అంతే కానీ నే వెళ్లినచోటల్లా నీవు అండగా నిలబడితే యుగధర్మం నెరవేరదు. ఇది కలియుగం. నేను ప్రవేశించి తీరాలి. కా బట్టి నాకు కొన్ని స్థానాలు ఇవ్వు. అని వేడుకున్నాడు.
అప్పుడు పరీక్షిత్తు చెప్పాడు. నీకు 4 స్థానాలు ఇస్తున్నాను అక్కడ నీవు ఉండవచ్చు.
1 : జూదశాల యందు నీవు ఉండ వచ్చు.
2 : పాన ( మద్య ) శాలయందు నీవు ఉండవచ్చు.
3 : స్వేఛ్చావిహరిణులై ధర్మమునకు కట్టు బడక ఆచార భ్రష్టులైన స్త్రీల యందు నీవు ఉండవచ్చు.
4 : జీవ హింస జరిగే టటువంటి ప్రదేశములయందు నీవు ఉండవచ్చు.
అది విని కలిపురుషుడు అయ్యా మీరు నాలుగుస్థానాలిచ్చారు. కానీ వాటయందు నేను నిలబడడానికి వీలుకలిగేటట్టు లేదు. ( పరీక్షిత్తు పరిపాలనలో ప్రజలెవ్వరూ వాటి జోలికి వెళ్లరు కనుక ) నాకు ఇంకొక్క స్థానాన్ని ప్రసాదించండి అని అడిగాడు.
అందుకు పరీక్షిత్తు
5 : బంగారం ఇచ్చాను అన్నాడు.
అది విని చాలు మహాప్రభో చాలు అని నమస్కరించి వెళ్లి పోయాడు కలిపురుషుడు.
పరీక్షిత్ మహారాజు ఒంటినిండా బంగారమే.. అలా కలి పరీక్షిత్తు నందు ప్రవేశించాడు. పరీక్షిత్తు ఆ ప్రభావంతో వేటకి ( అహింస కు ) వెళ్లి, అక్కడ తపస్సునందు నిమగ్నుడైన శమీక మహాముని పై చచ్చిన పామును వేస్తాడు. అది తెలిసి శమీక మహర్షి కుమారుడు శృంగి కోపోగ్రుడై "ఏడురోజులలో తక్షకుని చేతిలో మరణించమని" పరీక్షిత్తును శపించడము, రాజ్యానికి తిరిగి వచ్చినతరువాత తన తప్పు తెలుసుకున్న పరీక్షిత్తు పశ్చాత్తాప హృదయుడై ఉండగా శుకుడు వచ్చి భాగవతమును ఏడురోజులలో వినిపిస్తాడు.
కావున పై 5 విషయములందును కలి పురుషుని ప్రభావం ఉండును. వీనిలో దేనికి లోనైననూ మనం నైతికంగా పతనమవుతాము. భగవంతునికి దూరమవుతాము. కలి ప్రభావమునుండి భగవన్నామము ఒక్కటే మనను రక్షించ గలదు.

ఏకబిల్వం శివార్పణం!!!

పరమశివుని పూజించుకునేటప్పుడు మనం ఏకబిల్వం శివార్పణం అంటూ మారేడు దళాలను సమర్పించుకుంటూ పూజించుకుంటుంటాము.
జ్ఞానస్వరూపమయినపరమాత్మయే పరమశివుడు. మనలోని అజ్ఞానాన్ని ( మందబుద్ధిని) రూపుమాపి,
జ్ఞానజ్యోతి’ ని వెలిగించి, మన మనసులను పవిత్రం చేసి, నిర్మలమైన జీవనాన్ని కల్గించమని, జ్ఞానస్వరూపమైన మారేడు దళాలను స్వామికి సమర్పించుకుంటుంటాము.

పూజకుడు – పూజ్యము – పూజ/స్తోత్రము – స్తుత్యము – స్తుతి /జ్ఞాత – జ్ఞేయము – జ్ఞానము అనే అర్థాలను చెబుతున్నారు. ఇలా (3×3) మూడు x మూడును వేర్వేరుగా భావించుటయే త్రిపుతిజ్ఞానం. ఒక వృక్షానికి కొమ్మలు వేరువేరుగా కనిపించినప్పటికీ, ఆధారకాండము ఒక్కటే అయినట్లు, సృష్టి, స్థితి, లయ కారకుడైన ఆ మహాదేవుడు మారేడు దళాలలో మూడుపత్రాలుగా వేరు వేరుగా వున్నట్లు గోచరిస్తున్నాడు.
కానీ, ఆయన సర్వాంతర్యామి. బిల్వపత్ర దర్శనం వలన అత్యంత పుణ్యం లభిస్తుంది. వాటిని స్పృశించటం వలన సర్వపాపాలు నశిస్తాయి.
ఒక బిల్వ పత్రాన్ని శివునికి భక్తిశ్రద్ధలతో అర్పించటం వలన, ఘోరాతిఘోరమైన పాపాలు సైతం తొలగిపోతుంటాయి.అటువంటి త్రిగుణాలుగల బిల్వ దళాన్ని స్వామికి అర్పించుకుంటే ఆయన అనుగ్రహం సులభంగా కలుగుతుంది. పూజకుడవు నీవే, పూజింపబడేది నీవే, పూజాక్రియవు నీవే” అనే భావంతో శివుని పూజించుటయే సరియైన పద్ధతి.
ఈ జ్ఞానరహస్యాన్నితెలుసుకుని – బిల్వపత్రరూపంతో‘త్రిపుటి జ్ఞానాన్ని’ నీ పాదాల చెంత నేను సమర్పిస్తున్నాను అని స్వామికి విన్నవించుకుని ‘శివోహం, శివోహం’ అనే మహావాక్యజ్ఞానాన్ని స్థిరపరిచేదే బిల్వార్చన అవుతుంది.
పవిత్రమయిన ఈశ్వరపూజకు ‘బిల్వపత్రం’ సర్వశ్రేష్టమైనది. శివార్చనలకు మూడురేకులతోనున్న పూర్తి బిల్వదళాన్నే ఉపయోగించాలి. ఒకసారి కోసిన బిల్వపత్రాలు, సుమారు 15 రోజులవరకు పూజార్హత కలిగి ఉంటాయి. వాదిపోయినప్పటికీ దోషం ఉండదు.ఏకబిలపత్రంలోని మూడురేకులలో ఎడమవైపునది బ్రహ్మఅనీ, కుదివైపుది విష్ణువనీ, మధ్యనున్నది శివుడని చెప్పబడుతోంది.
ఇంకా బిల్వదళములోని ముందుభాగంలో అమృతము, వెనుక భాగంలో యక్షులుండటంచేత,బిల్వపత్రంయొక్కమున్డుభాగాన్ని శివునివైపు ఉంచి పూజించాలి. బిల్వవనం కాశీక్షేత్రంతో సరిసమానమైనది అని శాస్త్రవచనం. మారేడుచెట్టు ఉన్నచోట, ఆ చెట్టు క్రింద ‘లింగాకారం’లో శివుడు వెలసి ఉంటాడుట.
ఇంటి ఆవరణలో ఈశాన్యభాగంలో మారేడుచెట్టు ఉంటే, ఆపదలు తొలగి సర్వైశ్వర్యాలు కలుగుతాయి. తూర్పున ఉంటే సుఖప్రాప్తి కలుగుతుంది. పడమరవైపున ఉంటే సుపుత్రసంతాన ప్రాప్తి, దక్షిణవైపు ఉంటే యమబాధాలు ఉండవు.

Friday, June 26, 2015

అయి గిరినందిని

అయి గిరినందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే |
గిరివర వింధ్య షిరోధిని వాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే |
భగవతి హే శితికంఠ కుటుంబిని భూరికుటుంబిని భూరికృతే |
జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్దిని శైలసుతే ||
సురవరవర్షిణి దుర్ధరధర్శిని దుర్ముఖమర్షిణి హర్షరతే |
త్రిభువనపోషిణి శంకరతోషిణి కల్మషమోషిణి ఘోషరతే |
ధనుజనిరోషిణి దితిసుతరోషిణి దుర్మదశోషిణి సింధుసుతే |
జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్దిని శైలసుతే ||
అయి జగదంబ మదంబ కదంబవనప్రియవాసిని హాసరతే |
శిఖరిశిరోమణి తుంగహిమాలయ శృంగనిజాలయ మధ్యగతే |
మధుమధురే మధుకైతభగంజిని కైతభభంజిని రాసరతే |
జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్దిని శైలసుతే ||
అయి శతఖండ విఖండితరుండ వితుండితశుండ గజాధిపతే |
రిపుగజగండ విదారణచండ పరాక్రమశుండ మృగాధిపతే |
నిజభుజదండ నిపాతితఖండ విపాతితముండ భటాధిపతే |
జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్దిని శైలసుతే ||
అయి రణదుర్మదశత్రువదోదిత దుర్ధరనిర్జర శక్తిభ్రుతే |
చతురవిచారదురీణమహాశివ దూతక్రిత ప్రమతాదిపతే |
దురితదురీహదురాశయదుర్మతి దానవదూత కృతాంతమతే |
జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్దిని శైలసుతే ||
అయి శరణాగత వైరివధూవర వీరవరాభయదాయకరే |
త్రిభువనమస్తక శూలవిరోధిశిరోదిక్రితామల శూలకరే |
దుమిదుమితామర దుంధుభినాధ మహోముఖరీక్రిత తిగ్మకరే |
జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్దిని శైలసుతే ||
అయి నిజహుంకృతి మాత్రనిరాకృత దూమ్రవిలోచన దూమ్రశతే |
సమరవిశోషిత శోణితబీజ సముద్భవశోణిత బీజలతే |
శివశివశుంభని శుంభమహాహవతర్పిత భూతపిశాచరతే |
జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్దిని శైలసుతే ||
ధనురనుసంగారణక్షణసంగ పరిస్పురదంగ నతత్కటకే |
కనకపిశంగ ప్రిశత్కనిశంగ రసద్భటశ్రింగ హతాబటుకే |
క్రుతచతురంగ బలక్షితిరంగ ఘటద్బహురంగ రటద్బటుకే |
జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్దిని శైలసుతే ||
సురలలనాతత ధేయత ధేయత థాళనిమిత్తజ లాస్యరతే
కుకుభాం పతివరథో గత తాలకతాల కుతూహల నాద రతే
ధింధిం ధిమికిత ధింధింమితధ్వని ధీరమృదంగ నినాదరతే
జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్దిని శైలసుతే ||
జయ జయ జప్యజయే జయశబ్ద పరస్తుతితత్పర విశ్వనుతే |
భణ భణ భింజిమిభిక్రితనూపుర సింజితమోహిత భూతపతే |
నటిత నటార్ధనటీనటనాయక నాటితనాట్యసుగానరతే |
జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్దిని శైలసుతే ||
అయి సుమనః సుమనః సుమనః సుమనోహరకాంతియుతే |
శ్రిత రజనీ రజనీ రజనీ రజనీ రజనీకరవక్రవృతే |
సునయనవిభ్ర మరభ్ర మరభ్ర మరభ్ర మరభ్ర మరాదిపతే|
జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్దిని శైలసుతే ||
సహితమహాహవ మల్లమతల్లిక మల్లితరల్లక మల్లరతే |
విరచితవల్లిక పల్లికమల్లిక భిల్లికభిల్లిక వర్గవృతే |
సిత కృత పుల్లిసముల్లసితారునతల్లజ పల్లవసల్లలితే |
జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్దిని శైలసుతే ||
అవిరలగండ గళన్మదమేదుర మత్తమతంగజరాజపతే |
త్రిభువన భూషణ భూతకలానిది రూపపయోనిదిరాజసుతే |
అయి సుదతీజనలాలసమానస మోహనమన్మతరాజసుతే |
జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్దిని శైలసుతే ||
కమలదలామల కోమల కాంతికలాకలితామల భాలలతే |
సకలవిలాసకలానిలయక్రమ కేలిచలత్కల హంసకులే |
అలికులసంకుల కువలయమండల మౌలిమిలద్బకులాలికులే |
జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్దిని శైలసుతే ||
కరమురళీరవ వీజిత కూజిత లజ్జిత కోకిల మంజుమతే |
మిళితపులింద మనోహరగుంజిత రంజితశైలనికుంజగతే |
నిజగుణభూత మహాశబరీగుణ సద్గుణసంభృత కేలితలే |
జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్దిని శైలసుతే ||
కటితటపీతదుకూలవిచిత్ర మయూఖతిరస్క్రిత చంద్రరుచే|
ప్రణతసురాసుర మౌళిమణిస్పురదంశులసంనఖ చంద్రరుచే|
జితకనకాచల మౌళిపదోర్జిత నిర్భరకుంజర కుంభకుచే |
జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్దిని శైలసుతే ||
విజితసహస్ర కరైకసహస్ర కరైకసహస్ర కరైకనుతే |
క్రుతసురతారక సంగరతారక సంగరతారక సూనుసుతే |
సురతసమాది సమానసమాది సమాధి సమాధి సుజాతరతే |
జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్దిని శైలసుతే ||
పదకమలం కరుణానిలయే వరివస్యతి యోనుదినం శశివే |
అయి కమలే కమలానిలయే కమలానిలయః సకతం న భవేత్ |
తవ పదమేవ పరం పదమిత్యనుశీలయతో మమ కిం న శివే |
జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్దిని శైలసుతే ||
కనకలసత్కల సింధుజలైరనుసింజినుతే గుణరంగభువం |
భజతి స కిం న సచీకుచకుంభ తటీపరిరంభ సుఖానుభవం |
తవ చరణం శరణం కరవాణి నతామరవాణి నివాసిశివం |
జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్దిని శైలసుతే ||
తవ విమలేందుకులం వదనేందుమలం సకలం నను కూలయతే |
కిము పురుహూత పురీందుముఖీసుముఖీభిరసు విముఖీక్రియతే |
మమ తు మతం శివనామధనే భవతీ కృపయ కిముత క్రియతే |
జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్దిని శైలసుతే ||
అయి మయి దీనదయాలుతయ క్రుపయైవ త్వయ భవితవ్యముమే |
అయి జగతో జననీ క్రుపయాసి యథాసి తతానుమితాసిరతే |
యదుచితమత్ర భవత్యురరీకురుతాదురుతాప మపాకురుతే |
జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్దిని శైలసుతే ||

దేవాలయానికి వెళ్ళినపుడు పాటించవలసిన నియమలు

1)
తీర్ధము తీసుకొనునపుడు ౩సార్లు విడివిడిగా, ఒకదాని తర్వాత మరొకటి కలవకుండా పుచ్చుకొనవలెను. వెంటవెంటనే మూడుసార్లు ఒకేకాలమున తీసుకొనరాదు.
2)
ఒత్తిని నూనెలో తడిపి వెలిగించి, దానితో రెండు ఒత్తులను(దీపారాధన) వెలిగించాలి. ఉదయంపూట తూర్పు దిశగా రెండు ఒత్తులు ఉండేటట్లు దీపము యొక్క ముఖం ఉండాలి. సాయంత్రము పూట ఒక ఒత్తి తూర్పుగా, రెండవది పడమటగా ఉండాలి.
3)
శివునికి అభిషేకం,సూర్యునికి నమస్కారం, విష్ణువుకి అలంకారం, వినాయకునికి తర్పణం,అమ్మవారికి కుమ్కుమపూజ ఇష్టం. ఇవి చేస్తే మంచి జరుగుతుంది.
4)
ధైవప్రసాదాన్ని తినాలి కాని పారవేయరాదు.
5)
దీపమును నోటితో ఆర్పరాదు. ఒక దీపం వెలుగుచుండగా, రెండవదీపాన్ని మొదటిదీపంతో వెలిగించరాదు. దీపం వెలిగించగానే బయటకు వెళ్ళరాదు.
6)
దేవునిపూజకు ఉపయోగించు ఆసనం వేరొకపనికి వాడరాదు.
7)
దేవాలయానికి వెళ్ళినపుడు విగ్రహానికి ఎదురుగా నిలబడి నమస్కారం స్తోత్రములు చదవకూడదు. ప్రక్కగా నిలబడి చేతులు జోడించి నమస్కరించి వేడుకోవాలి.
8)
పురుషులు దేవునికి సాష్టాన్గానమస్కారం చేయవచ్చు.స్త్రీలు చేయరాదు. వారు మోకాళ్ళపై వంగి,నుదురును నేలకు ఆనించి నమస్కారం చెయ్యాలి.
9)
యుద్దమునకై శంఖమును పూరించుచున్న కృష్ణుడు మరియు ఒక్కడే నిలబడి వేణువు ఊదుతున్న కృష్ణుడు ఫోటో గాని,విగ్రహం గాని ఇంటిలో ఉండరాదు. మరియు ధ్యానం చేయుచున్న ఈశ్వరుడు,హనుమంతుడు ఫోటోలు ఉండరాదు. లక్ష్మీ దేవి కూర్చునిఉన్న ఫోటోగాని,విగ్రహంగాని ఉండాలి.నిలబడి ఉన్నది వాడరాదు.
10)
శివ లింగానికి, నందీశ్వరునికి మధ్యలో మనుష్యులు నడవరాదు.
11)
ఉదయం ,సాయంకాలం రెండు సార్లు దీపం పెట్టడం అలవాటు చేసుకోండి.
12)
తులసి దళములను పూజ చేయునపుడు దలములుగానే వెయ్యాలి.ఆకులుగా త్రుంచిన దోషము. మరు జన్మలో భార్యా వియోగము కలుగును. ఏ పుష్పములు అయినా త్రుంచి,ఆకులతో పూజించిన భార్యాభర్తలకు వియోగము సంభవించును.
13)
తాకుట వల్ల దోషము లేనివి:(అంటే అంటూ కానివి) తీర్దయాత్రలందు, పున్యక్షేత్రములందు, దేవాలయములందు,మార్గమునందు,వివాహ
మునండు,సభలందు,పడవలు,కార్లు,రైళ్ళు,విమానాలు మొదలగు వాహనాలలో
ప్రయానమందు స్పర్శ దోషం లేదు.
14)
ఆదివారం సూర్యుని ఆలయం, సోమవారం శివుడు(మరియు)గౌరిమాత ఆలయం, మంగళవారం) ఆంజనేయస్వామి, సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు,బుధవారం వినాయకుడు మరియు అయ్యప్పస్వామి ఆలయాలు, గురువారం సాయిబాబా, దత్తాత్రేయ, వెంకయ్యస్వామి మొదలగు గురువుల ఆలయాలు, శుక్రవారం అమ్మవారి ఆలయాలు, శనివారం వెంకటేశ్వరస్వామి
ఆలయాలు మరియు గ్రామదేవతల ఆలయాలు వారి వారి సంప్రదాయసిద్ధంగా దర్శించుట మంచిది.
15)
ఏ దేవాలయానికి వెళ్ళినా మొదట ధ్వజస్తంభాన్ని దర్శించాలి. శివాలయమునకు వెళ్ళినపుడు మొదట నవగ్రహాలను దర్శించి , ప్రదక్షిణాలు చేసి, కాళ్ళు కడుగుకొని తరువాత శివ దర్శనం చేసుకోవాలి. అదే విష్ణు ఆలయాలు (అనగా రాముడు,కృష్ణుడు,వెంకటేశ్వరస్వామి)
దర్శించినపుడు మొదట విష్ణుమూర్తిని దర్శించి తరువాత మిగతావారిని దర్శించాలి. మొదట పాదములను చూసి,తరువాత ఆపాదమస్తకము దర్శించాలి.
16)
నవ విధ భక్తి మార్గములు: శ్రవణం (వినటం), కీర్తనం(పాడటం), స్మరణము(మనసులో జపించుట), పాద సేవనము, అర్చన(పూజ),
నమస్కారము, దాస్యము(సేవ), సఖ్యము, ఆత్మనివేదనము(మనోనిగ్రహముతో సమర్పించుట) వీటిలో ఏ పద్ధతి ఐనను దేవునికి
ప్రీతికరము.
17)
జపములు మూడు రకములు.అవి: (ఏ) వాచకజపము:అందరికి
వినపడేలా బిగ్గరగా చేసేది. (బి) ఉపామ్సుజపం:ఎవరికి వినపడకుండా
పెదాలను కదుపుతూ చేసేది. (సి) మానసజపం: ఎవరికి వినపడకుండా , పెదాలు
కదపకుండా, మనసులో చేసేది. అన్ని జపాలలో కెల్లా మానసజపం ఉత్తమం,వాచకజపం సామాన్యం,ఉపంసుజపం మధ్యమం.
18)
స్త్రీలు ఓంకారాన్ని జపించకూడదు.
19)
ప్రదక్షిణాలు: వినాయకుని ఒకటి,ఈశ్వరునికి మూడు, అమ్మవార్లకు నాలుగు,విష్ణు మూర్తికి నాలుగు,మర్రిచేట్టుకి ఏడు ప్రదక్షిణాలు చెయ్యాలి

Thursday, June 25, 2015

నమ్మకద్రోహం

దేవీపురం జమీందారు దగ్గర మల్లయ్య నగదు వ్యవహారాలు చూసేవాడు. ఓసారి జమీందారు అతనికి వంద వజ్రాలు ఇచ్చి జాగ్రత్త చేయమన్నాడు. ఓరోజు రాత్రి దివాణంలో దొంగ ప్రవేశించి వజ్రాలు దొంగిలించాడు. మర్నాడు మల్లయ్య వచ్చి చూసేసరికి ఒకటే వజ్రం కనిపించింది. దొంగ హడావుడిలో దాన్ని వదిలేశాడని అర్థమైన మల్లన్నకి దురాశ పుట్టింది. వెంటనే దాన్ని తన తలపాగాలో దాచేసి, ఏమీ ఎరగనట్టు జమీందారు దగ్గరకు వెళ్లి చోరీ సంగతి చెప్పాడు. జమీందారు వెంటనే రక్షక భటులను నలుమూలలా పంపించాడు. కాసేపటికే ఆ దొంగ దొరికి పోయాడు. భటులు వాడిని జమీందారు దగ్గరకు తీసుకు వచ్చి సోదా చేస్తే వజ్రాల సంచీ కనిపించింది. అయితే అందులో 99 మాత్రమే ఉన్నాయి.
'ఏదీ మరో వజ్రం? బయటకి తియ్‌' అంటూ జమీందారు గద్దించాడు. ఆ దొంగ వణికి పోతూ 'నేను సంచీ విప్పి చూస్తే వజ్రాలు కనిపించాయి. వాటిని సంచీలో వేసుకుని పారిపోయానేగానీ, ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు' అన్నాడు.
ఆ సమాధానం విన్న మల్లన్నకి వణుకు పుట్టింది. వెంటనే దొంగ దగ్గరకి వెళ్లి వాడి చెంప మీద కొట్టి 'నిజం చెప్పకపోతే వూరుకునేది లేదు' అంటూ దబాయించాడు. ఆ వూపులో అనుకోకుండా మల్లన్న తలపాగా కిందపడి వందో వజ్రం బయటకి దొర్లింది. జమీందారు సంగతంతా గ్రహించి, 'ఇద్దరూ దొంగలే. చెరో వంద కొరడా దెబ్బలు కొట్టి తరిమేయండి' అన్నాడు కోపంగా.
అది విన్న మల్లన్న మొండిగా, 'ఇది అన్యాయం. 99 వజ్రాల దొంగకి, ఒకటి తీసుకున్న నాకూ శిక్ష ఒకటేనా?' అని ఎదిరించాడు.
జమీందారు ఒక్క క్షణం ఆలోచించి 'సరే. నువ్వన్నట్టే శిక్ష మారుస్తాను' అంటూ దొంగవైపు తిరిగి, 'నువ్వు ఎన్ని దొంగిలించావు?' అని అడిగాడు.
'తొంభై తొమ్మిది' అన్నాడు దొంగ.
'అయితే నీకు 99 కొరడా దెబ్బలు' అన్న జమీందారు, ఆపై మల్లన్న వైపు తిరిగి, 'నువ్వు ఎన్నో వజ్రం దొంగిలించావు?' అని అడిగాడు.
'వందోది' అన్నాడు మల్లన్న. 'అయితే వందో దెబ్బ నీకు' అన్నాడు జమీందారు. అమ్మయ్య అనుకున్నాడు మల్లన్న.
భటులు ముందుగా దొంగకి తొంభై తొమ్మిది కొరడా దెబ్బలు కొట్టారు. మల్లన్న వెంటనే 'ఆ వందోది నాకు వేసేయండి' అన్నాడు. జమీందారు నవ్వి, 'వందో దెబ్బ తినాలంటే మొదట తొంభైతొమ్మిదీ భరించాలి కదా? కీలకమైన బాధ్యతలో ఉంటూ నమ్మకద్రోహం చేసిన నువ్వు ఆ దొంగ కన్నా ప్రమాదకారివి' అన్నాడు. మల్లన్న తెల్లబోయి మొత్తం వంద కొరడా దెబ్బలూ తిన్నాడు.

అనంత పద్యనాభుడి అనంత విశేషాలు !!!

కేరళ రాష్ట్రంలో రాజధాని నగరం తిరువనంతపురానికి మూడు-నాలుగు మైళ్ల దూరంలో "శ్రీ పద్మనాభ స్వామి దేవాలయం" వుంది. ప్రస్తుతం ఉన్న గోపురాన్ని మాత్రం 1566లోనే నిర్మించారు.
10008 సాల గ్రామాలతో రూపు దిద్దుకున్న ఈ ఆలయాన్ని ఆసాంతం చూడాలంటే వరుసగా మూడు ద్వారాలను దర్శించుకోవాల్సిందే. ఇక్కడ దీర్ఘ చతురస్రంగా వున్న వరండా నిర్మించడానికి 4000 మంది తాపీ పనివారు, 6 వేల మంది నిపుణులు, 100 ఏనుగులను ఉపయోగించి 7 నెలల్లో పూర్తిచేసారని అంటారు. ఈ దేవాలయ ప్రాంగణం 7 ఎకరాల వరకూ వుంటుంది. ప్రత్యేకమైన టేకుతో బంగారు కవచంతో తయారు చేయబడిన ఈ దేవాలయం ధ్వజ స్తంభం ఎత్తు 80 అడుగులు.
1750 ప్రాంతంలో ట్రావన్ కోర్ను పరిపాలించిన మార్తాండ వర్మ అనంతపద్మనాభ స్వామికి రాజ్యాన్ని అంకితం చేశాడు. ఇక నుంచి రాజులు అనంతపద్మనాభుని సేవకులుగా మాత్రమే రాజ్యాన్ని పరిపాలిస్తారని మార్తాండ వర్మ ప్రకటించారు. అప్పటి నుంచి ట్రావన్ కోర్ రాజులకు అనంత పద్మనాభ దాస అనే బిరుదు కూడా వచ్చింది. నేటికి ఈ ఆలయం ట్రావెన్ కోర్ రాజ కుటుంబీకుల ఆధీనంలోనే ఉంది.
ఆలయం నుంచి లభించిన అపార సంపద ట్రావన్ కోర్ రాజవంశం వారసులకు చెందుతుందని పలువురు అంటున్నా, రాజ వంశానికి చెందిన వారు మాత్రం ఆ సంపద అంతా అనంత పద్మనాభుడికే చెందుతుందనడం వారి అపార భక్తికి నిదర్శనం.
ఈ దేవాలయంలో దైవ దర్శనమంటే, ఆదిశేషుడి మీద శయనించి ఉన్న అనంత పద్మనాభుడి 18 అడుగుల మూర్తిని మూడు ద్వారాల నుంచి-ముఖాన్ని దక్షిణ ద్వారం నుండి, పాదాలను ఉత్తర ద్వారం నుండి, నాభిని మధ్య ద్వారం నుండి దర్శించు కోవడమే. 10008 సాలగ్రామాలతో రూపు దిద్దుకొని, అమూల్యమైన వజ్రాలు పొదిగిన ఆభరణాలు ధరించిన స్వామి ధగధగా మెరిసిపోతూ దర్శనం ఇస్తారు. ఆదిశేషుడిపై యోగనిద్రలో వుండే విగ్రహం ఎదుట వుండే మండపం పై కప్పు ఒకే ఒక్క గ్రైనేట్ రాయితో మలచింది.
శ్రీ మహావిష్ణువు యోగనిద్రా మూర్తిగా దర్శనం ఇచ్చే అనంత పద్మనాభ స్వామి ఆలయం అపురూప శిల్పకళకు నిలయం. ఆలయం లోని స్తంభాలపై అనేక రకాల శిల్పాలు చెక్క బడి వుంటాయి. శ్రీ మహావిష్ణువు కొలువుండే 108 పవిత్ర క్షేత్రాల్లో అనంతపద్మనాభ క్షేత్రం ఒకటి. విష్ణుమూర్తి ఇక్కడ మూడు భంగిమల్లో... శయన భంగిమలో యోగ నిద్రా మూర్తిగా, నిలుచొని, కూర్చొని దర్శనం ఇస్తారు.
ఆలయంలోకి హిందువులను మాత్రమే అనుమతిస్తారు. పురుషులు పంచె, ఉత్తరీయం, స్త్రీలు చీరె ధరించి స్వామి దర్శనం చేసుకోవాలి. ఈ ఆలయంలో ఈ సంప్రదాయాన్ని విధిగా పాటిస్తారు.
"పద్మ నాభ" అంటే పద్మం ఆకారంలో ఉన్న నాభి కల వాడని అర్థం. యోగ నిద్రా మూర్తిగా శయనించి ఉండగా, నాభి నుంచి వచ్చిన కమలంలో బ్రహ్మ ఆసీనుడై వున్న అనంత పద్మనాభ స్వామి దివ్య మంగళ రూపం, నయనానందకరంగా కనిపిస్తుంది భక్తులకు. శేషుడు మీద శయనించిన శ్రీ మహావిష్ణువు చేతి కింద శివ లింగం కూడా ఉంటుంది. ఈ విధంగా, ఆలయం, త్రిమూర్తులకు నిలయంగా వెలిసిపోతుంటుంది.
గర్భగుడితో పాటు గాలి గోపురం మీద కూడా అందమైన శిల్పాలు దర్శనం ఇస్తాయి.ఆలయం ముందు పద్మ తీర్థం అనే కోనేరు ఉంటుంది. ఆలయం లోపల 80 ధ్వజస్తంభాలు ఉండడం ఇక్కడి విశేషం. ఆలయ ప్రాంగణంలో ఉన్న బలిపీఠం మండపం, ముఖమండపాల్లో కూడా దేవతామూర్తుల అపురూప శిల్పాలు కనిపిస్తాయి.
ప్రధాన ఆలయ మండపం ఒక మహాద్భుతం. 365 రాతి స్తంభాలతో ఈ మండపాన్ని నిర్మించారు. ఈ రాతి స్తంభాలతో పాటు మండపం పై కప్పు మీద కూడా దేవతామూర్తుల శిల్పాలను అందంగా చెక్కడం విశేషం.
బ్రహ్మ, వాయు, వరాహ, పద్మ-నాలుగు పురాణాలలో ఈ దేవాలయం ప్రస్తావన వుంది. దేవాలయంలో ఇప్పుడున్న వంద అడుగుల-ఏడంతస్తుల గోపురం పునాదులు 1566 లోనే పడ్డాయి. "పద్మ తీర్థం" అనే విశాలమైన చెరువు సరస్సును ఆనుకుని వుంటుంది దేవాలయం. 365 గ్రానైట్ రాతి స్తంభాలతో కూడిన విశాలమైన దేవాలయ ప్రాకారం, తూర్పు దిశగా విస్తరించి, గర్భ గుడిలోకి దారితీస్తుంది. ప్రాకారం నుండి లోనికెళ్లే ప్రధాన ద్వారం ముందర ఎనభై అడుగుల జండా స్తంభం వుంది.
అనంత శయనుడి విగ్రహాన్ని రూపొందించడానికి వాడిన సాల గ్రామాలను, నేపాల్ లోని గండకి నది ఒడ్డునుంచి తెప్పించారు. సాల గ్రామాలను ఏనుగులపై వూరేగించుకుంటూ అక్కడకు తెచ్చారట. ప్రతి సాల గ్రామం పైన ప్రత్యేకమైన ఆయుర్వేద మిశ్రమంతో తయారుచేసిన పదార్థాన్ని, అతకడానికి వీలయ్యే ప్లాస్టర్ లాగా ఉపయోగించారట. క్రిమి కీటకాల నుంచి విగ్రహం కాపాడబడ్డానికి అలా చేశారంటారు.
ఒక్క ట్రావన్ కోర్ రాజు మినహా ఎవరికీ సాష్టాంగపడి ప్రణామం చేసే అర్హత లేదక్కడ. ఆ రాజులు మాత్రమే "పద్మనాభ సేవకులు" గా పిలువ బడుతారు.
శ్రీ మహావిష్ణువు కొలువుండే 108 పవిత్ర క్షేత్రాల్లో, మూడు భంగిమల్లో ఏదో ఒక భంగిమలో మాత్రమే స్వామి దర్శనమివ్వడం జరుగుతుంది. ఈ దేవాలయంలో మాత్రం, శయన భంగిమలో యోగ నిద్రా మూర్తిగా, నిలుచొని, కూర్చొని స్వామి దర్శనం ఇస్తారు స్వామి.
పద్మనాభ స్వామి విగ్రహం, ముఖం, ఛాతీ మినహా, పూర్తిగా బంగారంతో చేయ బడింది. ముస్లిం రాజుల దండయాత్రలలో విగ్రహాలను ధ్వంసం కాకుండా కాపాడుకోవడానికి ఆయుర్వేద మిశ్రమాన్ని పూతగా వాడేవారు. స్వామి కిరీటం, చెవులకున్న కుండలాలు, ఛాతీని అలంకరించిన భారీ సాల గ్రామ మాల, మొత్తం ఛాతీ భాగం, శివుడి విగ్రహం వున్న చేతికున్న కంకణం, కమలం పట్టుకున్న ఎడమ చేయి, నాభి నుండి బ్రహ్మ వున్న కమలం వరకున్న తీగ, స్వామి పూర్తి పాదాలు కూడా బంగారు మయమే.
కోట్లాది రూపాయల విలువగల అపార సంపద ఆ దేవాలయం నేల మాళిగలలో నిక్షిప్తమై వుందని అత్యున్నత న్యాయస్థానం దృష్టికి పోవడంతో, న్యాయమూర్తుల ఆదేశానుసారం, ఆ నిధి నిక్షేపాలను వెలికితీయడంతో…
లభ్యమైన సంపద అంతులేనిది, అపారమైనది.
ఆ మందిరం భూగర్భంలో వెలువడిన.., వెలువడుతున్న వెలకట్టలేని నిధులకు, ఏకంగా అంతరిక్ష పహారాతో పటిష్ఠమైన భధ్రతను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గగన తలంలోని ఉపగ్రహ సేవలను ఇందుకోసం వినియోగించుకునేందుకు రంగం సిద్ధమవుతోంది.
సుమారు ఐదువేల సంవత్సరాల క్రితం అక్కడ కట్టబడిన, అత్యంత పురాతనమైన అనంత పద్మనాభుడి ఆలయం ఒకప్పుడు "ఎట్టువీట్టిల్ పిల్ల మార్" అనే ఎనిమిది కుటుంబాల వారి నిర్వహణలో వుండేది.
తర్వాతి కాలంలో ట్రావెన్ కోర్ సంస్థాపకుడైన కేరళ రాజు మార్తాండ వర్మ ఈ ఆలయాన్ని తన అధీనంలోకి తెచ్చుకుని, 1729 సంవత్సరంలో పునరుద్ధరించి, ఆలయానికి తామే సమస్తమంటూ ప్రకటించి, ఆలయంలోని శంఖాన్ని తమ సంస్థానానికి సంకేతంగా పెట్టుకున్నాడు.
తిరుమల ఆస్తులను మించి పోయిన తిరువనంతపురం పద్మనాభుడి సంపద ఎలా వచ్చిందన్న దాని పై ఎవరి వాదనలు వారే వినిపిస్తున్నారు. ఈ గదులకు వేసిన తాళాల తీరు, రాళ్లతో పకడ్బందీగా గదులను మూసి వేసిన వైనం, వాటిని తెరిపించిన కమిటీ సభ్యులను ఆశ్చర్య పరిచింది. ఒక్కో గది తాళాలు తీయడానికి చాలా సమయం పట్టినట్లు అధికారులు చెప్పారట.
అనంత పద్మనాభ స్వామి ఆలయ నేల మాళిగల్లోంచి బయటపడిన సొత్తు విలువ ఎంతనేది అప్రస్తుతం. ఆ సంపదంతా భగవంతుడు కే చెందాలి. దాని పరిరక్షణ ఉపయోగం, న్యాయ బద్ధంగా న్యాయ స్థానాల తీర్పు మేరకు నియమితులయ్యే, ట్రస్టీలే నిర్ణయించడం సమంజసం. ఇన్నాళ్లు, ఇంత పకడ్బందీగా, ఆ సొత్తును కాపాడుకుంటూ వస్తున్న, ని స్వార్థ ట్రావెన్ కోర్ రాజ వంశీయుల వారసులకే ఆ బాధ్యత అప్ప చెప్పడం హర్షణీయంగా వుంటుంది.
ఆ సంపదకున్న పురావస్తు ప్రాధాన్యతా దృష్టితో మాత్రమే దాన్ని చూస్తే, ఆ విలువ మరిన్ని రెట్లనడమే కాకుండా, బహుశా విలువ కట్టలేనిదని కూడా అనాల్సి వస్తుందేమో!
విలువ కట్టడానికి, ఆ సంపదేమన్నా బహిరంగ మార్కెట్లో అమ్మే అంగడి సరుకు కాదు కదా! అందుకే కేరళ రాష్ట్ర ముఖ్య మంత్రి అంతులేని ఆ వింత సంపదంతా పద్మనాభుడిదేనని తేల్చి చెప్పారు…
ఈ అధ్భుత విషయాలన్నింటిని మీరు కల్లారా చూడాలనుకుంటే అనంత పధ్మనాభుడి ధర్శనం చేసుకోవల్సిందే…