Saturday, April 18, 2015

కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర ఆలయం

పురాణకథ :

పూర్వం శ్రీరామచంద్రుడు రావణుడిని సంహరించిన తరువాత అయోధ్యనగరానికి తిరుగు వెళుతూ... మార్గమధ్యంలో కీసరగట్టు కొండమీద కొద్దిసేపు ఆగాడు. ఆ ప్రదేశంలో వున్న వాతావరణ ప్రభావాల వల్ల శ్రీరామచంద్రునికి ఒక ఆలోచన కలుగుతుంది.

రావణుడిని సంహరించినందుకు శ్రీరాముడు శివలింగాలను ప్రతిష్టించాలనుకుంటాడు. అందులో భాగంగానే.. ఈ ప్రాంతంలో కూడా ఒక శివలింగాన్ని ప్రతిష్టించాలని నిర్ణయం కలుగుతుంది. దాంతో అక్కడున్న మహర్షులు అంతా ఒక సుముహూర్తాన్ని నిర్ణయించారు.

శ్రీరాముడు వెంటనే ఆంజనేయుడిని పిలిచి.. కాశీ నుంచి శివలింగాన్ని తీసుకురావలసిందిగా ఆజ్ఞాపిస్తాడు. దీంతో ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ఆంజనేయుడు ఆకాశంలో ఎగురుకుంటూ అక్కడి నుంచి బయలుదేరాడు.

అయితే ముహూర్తిసమయం సమీపిస్తున్నా ఆంజనేయుడి జాడ ఎవ్వరికి కనిపించలేదు. ఎక్కడ ఆలస్యమౌతుందా అని శ్రీరాముడు మనసులో ఆలోచించుకుంటాడు. ఇంతలోనే శంకరుడు, రాముని ముందు ప్రత్యక్షమై ఒక ఆత్మలింగాన్ని ఇచ్చి.. వెంటనే అదృశ్యమైపోతాడు.

ముహూర్తం దాటిపోతోందనే నెపంతో రాముడు ఆలస్యం చేయకుండా శంకరుడు ఇచ్చిన ఆత్మలింగాన్ని ఆ ప్రాంతంలో ప్రతిష్టించాడు. కానీ ఇంతలోనే ఆంజనేయుడు నూటొక్క శివలింగాలను తన భుజాలమీద మోసుకుని రామచంద్రుని ముందుకు వచ్చాడు.

తను రావడానికి ముందే అక్కడున్న పరిస్థితులను, ఆత్మలింగాన్ని ప్రతిష్టించడం చూసి చాలా బాధపడ్డాడు. తాను పడిన శ్రమంతా ఒక్కసారిగా వృథా అయిందని... తాను తెచ్చిన శివలింగాలను కొండపైన ఎక్కడబడితే అక్కడ బాధతో విసిరేశాడు.

అయితే శ్రీరామచంద్రుడు, ఆంజనేయుడు చేసిన చేష్టలకు కోపగించుకోకుండా, చిరునవ్వుతోనే అనుగ్రహించి.. దగ్గరకు పిలిచి ఇలా అన్నాడు... ‘‘ఆలయంలో ఈశ్వర దర్శనానికి ముందే నిను, నువ్వు తెచ్చిన శివలింగాలను భక్తులు దర్శిస్తారు. ఆ తరువాతే శ్రీ రామలింగేశ్వరునిని దర్శించుకుంటారు’’ అని వరమిస్తాడు.

అంతేకాకుండా ఆంజనేయుని తండ్రి అయిన కేసరి పేరుమీదుగా ‘‘కేసరిగిరి’’గా ఆ ప్రాంతం పిలువబడుతుందని అనుగ్రహించాడు. (అలా కేసరిగిరిగా పెట్టిన పేరు కాలక్రమంలో కీసరగిరి, కీసర, కీసరగుట్టగా మారిపోయింది). దీంతో ఆంజనేయుడు తనలో వున్న బాధను తొలగించుకుని, రాముని ముందు సంతోషంగా నిలబడిపోయాడు.

ఆలయ విశేషాలు :

క్రీ.శ. 4 - 5 శతాబ్దాల్లో ఆంధ్రదేశాన్ని పరిపాలించిన విష్ణుకుండినులలో ప్రసిద్ధుడైన రెండవ మాథవవర్మ రాజధాని అయిన ఇంద్రపాలనగరం ఇదేనని కొన్ని ఆధారాలు కూడా లభించాయి. ఈ మహారాజు వేయికి యజ్ఞయాగాదులను నిర్వహించిన నర్మదానదీ తీరం వరకు వ్యాపింపచేసిన మహాపురుషుడు.

ఈ ప్రాంతంలో జరిపిన త్రవ్వకాల్లో పెద్దపెద్ద ఇటుకలతో నిర్మించిన పునాదులు, రాజప్రాసాదం, పూజామందిరాలు, వివిధ కట్టడాలు చాలా బయటపడ్డాయి. ఇప్పటికీ కొన్ని శిథిల కట్టడాలు అక్కడక్కడ కనిపిస్తాయి. ఇది భాగ్యనగారినిక 40 కిలీమీటర్ల దూరంలో వుంది.

ప్రధాన ఆలయం పశ్చిమానికి అభిముఖంగా వుంటూ.. శ్రీరామలింగేశ్వరుడి ప్రధాన దైవం వుంటుంది. ఈ ప్రథానఆలయం ముఖమండపం, అంతరాలయం, గర్భాలయాలుగా నిర్మించిబడింది.

ముఖమండపంలో శ్రీస్వామివారికి కుడి, ఎడమలుగా రెండు ఉపాలయాలు వున్నాయి. కుడివైపు వున్న ఉపాలయంలో పార్వతీదేవి, ఎడమవైపు వున్న ఉపాలయంలో శివగంగాదేవి దర్శనమిస్తారు. అలాగే ఈ మండపానికి కుడివైపున్న వేదికపై ఆంజనేయుడు, వినాయకుడు, శివలింగము.. ఎడమవైపున్న వేదికపై వల్లీదేవసేనా సమేత కుమారస్వామి దర్శనమిస్తారు.

ధ్వజస్థంభంతో కాలభైరవుడిని సేవించుకోవచ్చు. ఈస్వామికి ఎదురుగా నందీశ్వరుడు గంభీరముద్రలో దర్శనమిస్తాడు. రాహుకేతు పూజలు కూడా ఇక్కడే ప్రత్యేకం. భక్తులు ఈయనను కోరికలు తీర్చే తండ్రిగా భావిస్తారు.

ఆలయానికి ప్రాంగణం వెలుపల ఎక్కడ చూసిన శివలింగాలే కనిపిస్తాయి. (ఆంజనేయుడు ఈ లింగాలనే చెల్లాచెదురుగా విసిరేయడంతో ఇవి ఇలా దర్శనమిస్తున్నాయి). శివరాత్రి పర్వదినాల్లో భక్తులు ఇక్కడ వేలకొద్దీ వస్తుంటారు.

No comments:

Post a Comment