Saturday, April 18, 2015

మీనాక్షి సుందరేశ్వర్ ఆలయ విశేషాలు

మన భారతదేశానికి దక్షిణ భాగంలో చారిత్రాత్మకమైన ఎన్నో పవిత్ర దేవాలయాలు నిర్మించబడి వున్నాయి. అందులో ముఖ్యంగా శివపార్వతుల ఆలయాలు రకరకాల అవతారాలలో కొలువై వున్నాయి. అటువంటి దేవాలయాల్లో ఒకటైన మీనాక్షి సుందరేశ్వర్ ఆలయం కూడా ఎంతో ప్రాచీనమైనది. సుందరనాథుడు రూపంలో శివుడికి, మీనాక్షి రూపంలో పార్వతికి ఈ ఆలయం అంకితం చేయబడింది. ఈ ఆలయం సుమారు 2500 సంవత్సరాల కాలంనాటి మధురై నగరపు జీవన విధానాలను కలిగి వున్నట్టుగా కొన్ని శాసనాలు, ఆధారాలు కూడా ఇక్కడ లభ్యమయినట్టు అంటుంటారు. ఎంతో అద్భుతమైన శిల్ప, చిత్రకళా రీతులతో నిర్మించిన ఈ దేవాలయం... ప్రాచీన కాలం నుంచి తమిళ సాహిత్యంలో ప్రస్తావించబడుతోంది. అయితే ప్రస్తుతం వున్న ఆలయనిర్మాణం 1600 సంవత్సరంలో నిర్మించబడిందని కొంతమంది నిపుణులు అక్కడ లభించిన కొన్ని ఆనాటి శాసనాల ప్రకారం చెబుతున్నారు.

స్థలపురాణం - పురాణగాధ :

పూర్వం మధుర ప్రాంతాన్ని పాలించే మలయధ్వజ పాండ్య అనే పాలకుడు... శివపార్వతుల అనుగ్రహం పొందడానికి ఘోర తపస్సు చేయసాగాడు. అతను చేసిన తపస్సుకు మెచ్చుకుని పార్వతీదేవి ఒక చిన్న పాపరూపంలో భూమ్మీదకు వచ్చింది. ఆ పాలకుని దగ్గరే ఆమె పెరిగి పెద్దదవుతుంది. పెద్దయిన తరువాత ఆమె ఆ నగరాన్ని పాలించసాగింది. హిందూ పురాణాల ప్రకారం... దేవుడు (శివుడు) భూమ్మీద మానవరూపంలో అవతారం ఎత్తి ఆమెను (స్త్రీ రూపంలో రాజ్యాన్ని పాలిస్తున్న పార్వతీదేవిని) పెళ్లాడుతానని వాగ్దానం చేశాడు. తను ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తి చేసుకోవడం కోసం మానవుని రూపంలో వున్న దేవుడు ఆమెను పెళ్లాడుతాడు. ఈ పెళ్లిని చూడడానికి మధురై సమీపంలో, చుట్టుపక్కల వున్న గ్రామాల వారందరూ కూడా విచ్చేశారు. ఆ విధంగా జరిగిన వీరిద్దరి పెళ్లి భూమ్మీదనే అత్యంత పెద్ద కార్యక్రమంగా భావించబడింది.

శివపార్వతుల వివాహం జరిపించడం కోసం మీనాక్షీ సోదరుడు అయిన విష్ణువు వైకుంఠం నుంచి తరలివచ్చాడు. అయితే స్వర్గలోకంలో దేవతల నాటకం కారణంగా ఇంద్ర దేవుడి వంచనకు గురయి విష్ణువు రావడం కాస్త ఆలస్యం అవుతుంది. ఇతను రావడం ఆలస్యం కావడంతో ఆలోగా తురుప్పరాం కుండ్రంకికి చెందిన స్థానిక దేవుడు పవలాకనైవాల్ పెరుమాళ్ ఆధ్వర్యంలో వీరిద్దరి వివాహం జరిగిపోతుంది. ఈ విధంగా జరిగిన ఈ పెళ్లి సందర్భంగా ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా పెళ్లి కార్యక్రమాన్ని జరుపుకుంటారు. తరువాత నాయకరాజుల పాలనాకాలంలో తిరుమలై నాయకర్ అనే ఒక పాలకుడు ‘అళకర్ తిరువిళ’ను ‘మీనాక్షీ పెళ్లి’కి జత కుదిర్చాడు. దాంతో ఈ వేడకకు ‘చిత్తిరై తిరువిళ’గా అభివర్ణించడం జరుగుతోంది.

పురాతన ఆలయ నిర్మాణం :

ఈ ఆలయ నిర్మాణం ఎంతో ప్రాచీనమైనది కాబట్టి.. ప్రాచీన మధురై నగరానికి సంబంధించిన భౌగోళిక, సంప్రాదాయిక ఆచారాలను కలిగి వుంటూ... ఒక కేంద్రంగా గుర్తించబడుతుంది. ఈ ప్రాచీన ఆలయానికి చుట్టూ వుండే గోడలు, వీధులు, నగర గోడలు చతురస్రాకారంలో నిర్మించబడి వుండేవి. నాలుగు ముఖాలతో ప్రవేశ ద్వారాలతో కలిగిన ఆలయాలో తమిళనాడులో వుండే అతికొద్ది దేవాయాల్లోనే ఇది ఒకటి. ఆలయ సముదాయం 45 ఎకరాలతో గుండ్రంగా వుండి, 254/237 మీటర్లతో పొడవున భారీ నిర్మాణంగా వుండేది. అప్పటిలో ఈ ఆలయానికి 12 గోపురాలు వుండేవి.

పురాతన ఆలయం అయిన ఇందులో ఎందరో దేవతల సముదాయం వుండేది. అందులో ముఖ్యంగా శివాలయం ఆలయ సముదాయానికి నడిబొడ్డులో వుండేది. అలాగే ఆలయానికి వెలుపల ఏకశిలపై మలిచిన గణేశుని భారీ విగ్రహం వుంది. దీనిని ముఖురుని వినాయకర్ అని పిలుస్తారు. మీనాక్షీ విగ్రహం శివు విగ్రహానికి ఎడమవైపున వుంది.

ప్రస్తుతమున్న ఆలయం పరిస్థితి :

ప్రాచీన కాలంలో నిర్మించిబడిన ఈ ఆలయం పునర్మిర్మాణం 1600 సంవత్సరాలలో చేయబడిందని కొన్ని ఆధారాలు తెలుపుతున్నాయి. అలా ఆ విధంగా నిర్మించబడిన ఈ ఆలయానికి అప్పుడప్పుడు మార్పులు, చేర్పులు చేయిస్తూ... ఆలయంలో వున్న శిల్పాలకు రకరకాల రంగులు అద్దుతూ వస్తున్నారు. ఆలయ గోపురాలను మార్చినెల 2009 వరకు రంగులు అద్దడానికిగాను పరంజాలతో కప్పి వుండేవారు. ఈ పని మొత్తం అదే సంవత్సరంలో ఏప్రిల్ నెలలో పూర్తయ్యింది. పురావస్తుపరంగా పునరుద్ధరించే విధంగా ఆలయ లోపల పెయింటింగులు, గోడలు, శిల్పాలు విగ్రహవాలు వంటి వాటిని యుద్ధప్రాతిపదికన నిర్వహించారు.

ఆలయ ప్రత్యేకతలు :

ఆలయానికి నలువైపులా నాలుగు ఎత్తైన రాజు గోపురాలు ఎంతో గంభీరంగా దర్శనమిస్తాయి. తూర్పు - పశ్చిమ దిశగా వున్న గోపురాలను 13, 14వ శతాబ్దాలలో సుందరపాండ్యన్, పరాక్రమ పాండ్యన్ అనే ఇద్దరు పాలకులు నిర్మించారని... అదేవిధంగా దక్షిణ గోపురాన్ని శివ్వంది చెట్టియార్ అనే పాలకుడు 16వ శతాబ్దంలో నిర్మించినట్టు స్థలపురాణం పేర్కోబడుతోంది. దక్షిణవైపుగా వున్న గోపురం సుమారు 160 అడుగుల ఎత్తు వుంది. ఈ ఆలయంలో సుందరేశ్వర స్వామి, మీనాక్షీ అమ్మవారు మొదలగు దేవతలు కొలువై వున్నారు.

మధురై ప్రాంతంలో వున్న సంస్కృతీ - సంప్రదాయాల ప్రకారం... ఆలయానికి తూర్పువైపున వున్న అష్టలక్ష్మీ మండపం ద్వారా లోపలికి ప్రవేశం చేసి, మీనాక్షీ అమ్మవారిని దర్శించుకోవాలి. ఈ ప్రవేశ ద్వారంపై అమ్మవారి ఘట్టాలు శిల్పాల రూపంలో ఎంతో అందంగా చెక్కబడి వున్నాయి. అలాగే స్వర్ణ కమల తటాకం కూడా ఎందో ఆకర్షణీయంగా వుంటూ భక్తులను ఎంతో ఉత్సాహపరుస్తుంది. ఆలయ సముదాయంలో వుండే రెండుబంగారు గోపురాలతోపాటు 14 అద్భుతమైన గోపురాలకు ముఖ్యదేవతలకు నిలయంగా వుంది.

ఆలయంలో వున్న కొన్ని ప్రత్యేకమైన నిర్మాణాలు :

వెళ్లి అంబాలమ్ : శివునికి సంబంధించిన అయిదు రాజమందిరాలలో ఈ వెళ్లి అంబాలమ్ ఒకటి. తమిళంలో వెళ్లి అంబాలమ్ అంటే దైవపీఠం లేదా రజిత పీఠం. శివుని పీఠం హిందూ దేవుడు అయిన నటరాజుని అసాధారణ శిల్పంతో కూడి వుంది. శివుని నృత్యరూపంలో వున్న విగ్రహాన్ని సుప్రసిద్ధమైన హిందూ గోపురంగా పరిగణిస్తారు. సాధారణంగా శివుని నృత్యరూపంలో ఎడమ పాదం ఎప్పటికీ లేపి వుంటుంది. కానీ ఈ ఆలయంలో మాత్రం కుడిపాదం లేపి వుంటుంది. పురాణ కథనాల ప్రకారం... శివుని ప్రియ భక్తుడైన రాజశేఖర పాండ్య అభ్యర్థన మేరకు ఇలా జరిగిందని పరిగణించబడింది. తన వ్యక్తిగత ప్రాతిపదికన ప్రకారం... ఎప్పుడూ ఒకేపాదాన్ని లేపి వుంటే అది అపారమైన ఒత్తిడిని కలుగజేస్తుందని భావించాడు. దాంతో అతను దేవుడిని తన స్థానం మార్చుకోమని కోరుకుంటే జరిగిందని చెబుతుంటారు.

అష్టశక్తి మండపం : ఆలయానికి తూర్పుదిక్కున వున్న గోపురానికి సమీపంలోని మీనాక్షీ గర్భగుడి గోపుర ప్రవేశ ద్వారం వద్ద వున్న మొదటి మండపం. ఈ మండపంలో ఎనిమండుగురు దేవతలు వుంటారు కాబట్టి దీనిని అష్టశక్తి మండటం అని పిలుస్తారు. అయితే ప్రస్తుతమున్న ఈ మండపంలో అనేక పూజాసామాగ్రిని అమ్మే అంగళ్లు వున్నాయి.

పోర్తమారై కులమ్ (సరస్సు) : భక్తులు ఈ సరస్సును ఎంతో పవిత్రమైన స్థలంగా పేర్కొంటారు. ప్రధాన మండలపంలోకి ప్రవేశించడానికి ముందే ఈ సరస్సు చుట్టూ (50 మీటర్లు) తిరుగుతారు. పోర్తుమారై కులమ్ అనే పదానికి ‘‘స్వర్ణ కమలంతో కూడిన సరస్సు’’ అని అర్థం. ఇందులో ఒక ప్రత్యేకమైన విషయం ఏమిటంటే.. సరస్సులో పెరుగుతున్న ఒక కమలం బంగారం రంగులో వుంటుంది. ఈ సరస్సులో ఎటువంటి జీవప్రాణులు వుండవు. పురాణాల ప్రకారం... పూర్వం శివుడు ఒక పక్షికి ఈ ఆలయంలో వున్న సరస్సులో సముద్రానికి చెందిన ఈ జీవికానీ ఈ తటాకంలో పెరగలేవని వాగ్దానం చేశాడట! అందువల్లే ఇందులో ఎటువంటి సముద్ర ప్రాణులు కనిపించవు. తమిళ పురాణాల ప్రకారం... ఈ సరస్సు సాహిత్య విలువలను నిర్ణయించే న్యాయమూర్తిగా భావించబడేది. అదెలా అంటే.. పేలవంగా రాయబడిన రచనలను ఇక్కడి నీటిలో వేసినప్పుడు మునిగిపోయేవి.. అదేవిధంగా ప్రతిభావంతులైన వారి రచనలను వేసినప్పుడు అవి నీటిపైనే తేలివి. అందువల్ల రచయితలు తమ రచనలను ఇక్కడ వుంచేవారు.

వేయిస్తంభాల మండపం : ఆలయంలోని వేయి స్తంభాల మండపాన్ని తిరునల్వేవిలో వుండే పురాతన నెల్లయప్పార ఆలయానికి నమూనాగా నిర్మించబడింది. దీనిని భారతీయ పురావస్తు సర్వే విభాగం వారు నిర్వహిస్తున్నారు. ఈ వేయి స్తంభాల మండపం 1569వ సంవత్సరంలో అరియనాథ ముదలియార్ పాలకుని ద్వారా నిర్మించబడింది. ఇతడు మొట్టమొదట తెలుగు మధురై నాయక రాజు అయిన విశ్వనాధ నాయకుడికి ప్రధానమంత్రిగా, సేనాధిపతిగా వుండేవాడు.

No comments:

Post a Comment