Saturday, April 18, 2015

మగవారికి ప్రవేశం లేని ఆలయం

మన పూర్వీకులు నిర్వహించుకున్న కొన్ని ఆచారాలు, సంప్రదాయ పద్ధతులను మనం నమ్మడానికి, వాటిని అలవరుచుకోవడానికి ఎన్నో పురాణగాధలు వున్నాయి. వాటిద్వారే మనం అన్ని కార్యక్రమాలను, కార్యకలాపాలను నిర్వహించుకుంటాం. భూప్రపంచం స్తంభించిపోయి, తరాలు మారినా.. అవి మాత్రం ఎప్పటికీ అలాగే కొనసాగుతూనే వుంటాయి. వాటికి తగిన కొన్ని ఆధారాలు కూడా ప్రస్తుతకాలంలో చాలావరకు లభ్యమయ్యాయి కూడా! అందుకు ఉదాహరణగా ఉత్తరప్రదేశ్ లో వున్న ఒక ఆలయం! ఎటువంటి దేవతావిగ్రహం లేకుండానే నిత్యం పూజాకార్యక్రమాలు నిర్వహించే ఈ ఆలయంలో ఇంతవరకూ మగవారు అడుగుపెట్టనేలేదు. కేవలం మహిళలు మాత్రమే ఈ ఆలయంలోకి వెళ్లి పూజలు, వ్రతాలు, నోములను నిర్వహించుకుంటారు. ఇలా మగవారు ఆ గుడిలో అడుగుపెట్టకపోవడానికి గల బలమైన కారణానికి ఒక కథ కూడా వుంది.

1870వ సంవత్సరకాలంలో సాకాలేదిహ అనే ప్రాంతాన్ని పాలించే ఒక రాజు వుండేవాడు. అతనికి కొంతమంది కుమారులు, కుమార్తెలు కూడా వుంటారు. అదే ప్రాంతానికి చెందిన శ్రీపాదుడు అనే బ్రాహ్మణుడు ఒకడు గోవులను పెంచుకుంటూ సుఖంగా జీవిస్తూ వుంటాడు. ఒకనాడు శ్రీపాదుడి ఆవులు అనుకోకుండా రాజుగారి పొలంలోకి ప్రవేశిస్తాయి. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురయిన రాజు, అతని కుమారులు శ్రీపాదుడిని నిర్బంధించి ఒక కారాగారంలో పడేస్తారు. ఆ బ్రాహ్మణుడు వారిని.. ‘‘అయ్యా! పొరపాటు జరిగిపోయిందయ్యా... నన్ను క్షమించడం. ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకుంటాను’’ అని ఎంతగా వేడుకున్నా.. రాజు తన భటుల ద్వారా అతనిని అనేక చిత్రహింసలకు గురిచేశాడు. దాంతో తీవ్ర మనస్తాపానికి గురయిన శ్రీపాదుడు.. ఆ మరుక్షణం నుంచి అన్నపానీయాలను మానేసి, నిరాహారంగానే కాలం గడుపుతుంటాడు.

ఈ విషయం మొత్తం తెలుసుకున్న రాకుమార్తెలు చాలా బాధపడతారు. ఒక బ్రాహ్మణున్ని ఈ విధంగా ద్రోహం చేసి, చిత్రహింసలు పెట్టడం వల్ల వారి రాజవంశానికే అరిష్టమని భావించి ఆ రాకుమార్తెలు కారాగారంలో బంధించబడి వున్న శ్రీపాదుడుని రహస్యంగా కలుసుకుంటారు. తమ తండ్రి, సోదరులు చేసిన అన్యాయానికి, ద్రోహానికి క్షమించమని అతనితో వారు వేడుకుంటారు. దానికి శ్రీపాదుడు మాత్ర ఎటువంటి సమాధానం ఇవ్వకుండా, నిశ్శబ్దంగానే వుండిపోతాడు.

ఒకనాడు రాకుమార్తెలు తులసీతీర్థాన్ని తీసుకునివచ్చి.. శ్రీపాదుడిని అది తాగి దీక్ష విమరించుకోమని కోరుకుంటారు. కారాగారంలో బంధీగా వున్న బ్రాహ్మణ శ్రీపాదుడు వారిచ్చిన తులసీతీర్థాన్ని తీసుకుని... ‘‘మీకెప్పుడూ మంచే జరుగుతుంది. కలకాలం సుఖంగా జీవించండి’’ అని దీవిస్తూ.. తను కూర్చున్న చోటే ప్రాణాలను విడుస్తాడు. అది జరిగిన కొన్నాళ్ల తరువాత శ్రీపాదుడిని బంధించిన రాజు, అతని కుమారులు ఒకరోజు రథంలో వెళుతుండగా... అది లోయలో పడి వారందరూ ఒకేసారి మరణిస్తారు. అయితే రాకుమార్తెలు మాత్రం తమ తండ్రి చనిపోయినందుకు దు:ఖించకుండా.. బ్రాహ్మణుని ఆశీర్వాదం వల్లే తాము ప్రాణాలతో వున్నామని నమ్ముతూ... అతనికి కృతజ్ఞతలు తెలుపుకుంటారు.

శ్రీపాదునికి కృతజ్ఞతాభావంగా ఆ రాకుమార్తెలు... అతనిని బంధించిన కారాగారాన్నే దేవాలయంగా తయారుచేసి, అతను కూర్చున్న చోటును దైవపీఠంగా భావిస్తూ, పూజలు చేసేవారు. ఆ విధంగా నిర్మించిన ఆలయంలో కేవలం మహిళలకు మాత్రమే ప్రవేశమని... మగవారు ఎట్టిపరిస్థితుల్లోనూ లోపలికి రాకూడదని వారు శాసించారు. ఒకవేళ మగవారు లోపలికి వెళ్తే వారికి చెడు జరుగుతుందని చెప్పడంతో.. ఎవ్వరూ వెళ్లడానికి ప్రయత్నించలేదు. అలా ఆ విధంగా మొదలైన ఈ ఆచారం ఇప్పటికీ కొనసాగుతూనే వుంది. ఈరోజు వరకు కూడా మగవారు ఆ గుడిలోకి అడుగుపెట్టరు. కేవలం స్త్రీలు మాత్రమే లోపలికి వెళ్లి... ఒకప్పుడు శ్రీపాదుడు కూర్చున్న ఎత్తైన అరుగుకి పసుపురాసి... నెయ్యి, పూలతో పూజాకార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇలా ఈ విధంగా ఈ ఆలయం మహిళల కోసమే కట్టినట్లుగా ప్రసిద్ధి చెందింది.

No comments:

Post a Comment