Saturday, April 18, 2015

అంతర్వేది ఆలయ స్థలపురాణం

స్థలపురాణం :

పూర్వం ఒకానొక సమయంలో హిరణ్యాక్షుని కుమారుడైన రక్తవలోచనుడు అనే రాక్షసుడు గోదావరి నదిఒడ్డున కొన్ని వేలాది సంవత్సరాలు శివునికి ఘోర తపస్సు చేస్తాడు. శివుని ఇతని తపస్సును మెచ్చుకుని ప్రత్యక్షమై వరాన్ని కోరుకొమ్మని ఆదేశిస్తాడు.

అప్పుడు రక్తవలోచనుడు దొరికిన అవకాశాన్ని అదునుగా తీసుకుని.. ప్రత్యేకంగా తన వరాన్ని కోరుకుంటాడు. ఆ వరం ప్రకారం.. రక్తవలోచనుడి శరీరం నుంచి నేల (ఇసుక రేణువులు)పై పడిన రక్తం.. తిరిగి తనంత పరాక్రమవంతులైన రక్తవలోచనులుగా పుట్టాలని కోరుకంటాడు. ఆ గర్వంతో అతను యజ్ఞాలు చేసుకునే ప్రతి బ్రాహ్మణులను, గోవులను తీవ్రంగా హింసించేవాడు.

ఇదిలావుండగా... విశ్వామిత్రునికి, వశిష్టుడికి మధ్య సమరం జరుగుతుంది. ఆ సమయంలో విశ్వామిత్రుడు.. వశిష్టుని సంహరించాల్సిందిగా రక్తవలోచనుడిని ఆజ్ఞాపిస్తాడు. దాంతో రాక్షసుడైన రక్తవలోచనుడు భీభత్సం సృష్టించి, వశిష్టుడి నూరుగురు కుమారులను సంహరించుకుంటూ పోతాడు.

అప్పుడు వశిష్ట మహర్షి తనకు అండగా నిలవవలసిందిగా.. శ్రీ మహావిష్ణువును ప్రార్థించుకుంటాడు. అప్పుడు విష్ణువు లక్ష్మీ సమేతుడై గరుడవాహనంపై చేరుకుంటాడు. విష్ణువు నరసింహుని అవతారం ఎత్తి రక్తవలోచనుడిని సంహరించడానికి వస్తాడు.

దీంతో నరసింహుడు, రక్తవిలోచనుడి మధ్య యుద్ధం సాగుతుండగా.. రక్తవిలోచనుడి శరీరం నుండి భూమిపై పడే రక్తపుచుక్క నుంచి ఒక్కొక్క రాక్షసుడిగా మారి వస్తుంటారు. ఆ సమయంలో నరసింహుడు అశ్వరూఢాంబికా అనే మాయాశక్తిని అక్కడికి రప్పించి... రక్తవిలోచనుడి రక్తం భూమి (నేల)పై పడకుండా నాలుకను చాచాలని సూచిస్తాడు.

స్వామి ఆదేశంప్రకారం ఆమె తన నాలుకను చాచి.. రక్తపు చుక్కలను నేలపై పడకుండా చూసుకుంటుంది. నరసింహుడు తన శక్తులతో ఆ రాక్షసుడిని ఓడించి, సంహరిస్తాడు.

అప్పుడు రక్తవలోచనుడి శరీరం నుంచి పారే రక్తం నేలపై పడకుండా రక్తకుల్య అనే నదిలోకి ప్రవహించేటట్లు చేస్తాడు. ఆ తరువాత వశిష్టుడి కోరిక మేరకు నరసింహస్వామి అంతర్వేది ప్రదేశంలో లక్ష్మీనరసింహస్వామిగా వెలిశాడు.

ఆలయ విశేషాలు :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, తూర్పు గోదావరి జిల్లాలో సఖినేటి మండలానికి చెందినదే ఈ అంతర్వేది గ్రామం. పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం సమీపంలో లక్ష్మీనరసింహ స్వామివారి పురాతన ఆలయన త్రికోణాకారపు దీవిపై ప్రసిద్ధి చెందింది.

ఒకప్పుడు బ్రహ్మ.. శివునిపట్ల చేసిన అపచారాలకు ప్రాయశ్చితం చేసుకోవాలని భావించి, రుద్రయాగం చేయాలని భావిస్తాడు. ఆ యాగం చేయడానికి ఒక వేదికగా ఈ ప్రదేశాన్ని ఎన్నుకున్నాడు. దాంతో ఈ ప్రాంతానికి అంతర్వేది (అంతర్ + వేదిక) అనే పేరు వచ్చిందని చెబుతారు.

మొదట ఈ ఆలయం శిథిలావస్థిలో వున్నప్పుడు శ్రీ కోపనాతి కృష్ణమ్మ అనే ఒక జమీందారు తిరిగి పునర్మిర్మాణం చేపట్టారు. ఆలయ ముఖద్వారంలో ఈయన శిలాగ్రహం కూడా వుంది. ఆయనిచ్చిన విరాళాలతోనే ఈ ఆలయం నిర్మాణం జరిగింది.

విష్ణువు ఆలయానికి పక్కనే ఆమె చెల్లలుగా భావించే అశ్వరూఢాంబిక ఆలయం కూడా వుంది. ఈమెకూడా రక్తవలోచనుడిని చంపడంలో ప్రముఖపాత్రను వహించింది.

No comments:

Post a Comment