Saturday, April 18, 2015

జగన్నాథ క్షేత్రం స్థలపురాణం

స్థలపురాణం :

కృష్ణుడి అవతారం అయిన జగన్నాథుడు.. ఒకనాడు ఒక అత్తిచెట్టు కింద ఇంద్రనీలం రూపంలో మెరుస్తూ ధర్మరాజుకు కనిపించాడు. అది చూసిన అతను... ఒక విలువైన రాయి అని భావించి.. నేలమాళిగలో ఎవరికంటా పడకుండా నిక్షిప్తం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్నుడు దానిని ఎలాగైనా సొంతం చేసుకోవాలనే ఆశతో వెదకడం మొదలుపెడతాడు. అయితే అది ఎక్కడుందో కనిపెట్టలేక భూమంతా తవ్వి వెదికాడు. అయినా అధి లభించకపోవడంతో నిరాశతో నీరసించిపోతాడు. అక్కడే కొద్దిసేపటివరకు సేద తీర్చుకోవాలని నిద్రపోతాడు.

ఇంద్రద్యుమ్నుడు నిద్రిస్తున్న సమయంలో అతని కలలోకి విష్ణువు కనిపించి.. పూరి సముద్ర తీరానికి వెళ్తే అక్కడ ఒక కొయ్యదుంగ కొట్టుకు వస్తుందనీ.. దానిని దారుశిల్పంగా చెక్కమని ఆదేశించాడు. దాంతో ఆ రాజు నిద్రనుంచి మేలుకుని అప్పటికప్పుడే అక్కడకు బయలుదేరుతాడు. విష్ణువు చెప్పినట్లుగానే నీటి అలలపై తేలియాడుతున్న ఒక కొయ్యదుంగ ఆ రాజుకు కనిపిస్తుంది. అదే సమయంలో విష్ణువు, విశ్వకర్మ ఇద్దరూ వృద్ధశిల్పకళాకారుల వేషంలో అతని దగ్గరకు చేరుకుంటారు.

వారిముగ్గురి మధ్య కొద్దిసేపటివరకు సంభాషణలు జరిగిన అనంతరం... వారిద్దరూ ఆ కొయ్యదుంగను విగ్రహాలుగా చెక్కేపని తామే చేస్తామని ఒప్పుకుంటారు. అయితే ఆ పని పూర్తయ్యేంతవరకు వాటివంక చూడకూడదని రాజుకు ఆజ్ఞాపిస్తారు. ఒకవేళ విగ్రహాలు చెక్కేటప్పుడు రాజుగానీ, ఇతరులు ఎవరైనాగానీ చూస్తే.. వారు తమ పనిని అర్థాంతరంగా ముగించేస్తామని హెచ్చరించారు. అందుకు ఇంద్రద్యుమ్నుడు ఒప్పుకుంటాడు. కొన్నాళ్లు ఇలాగే గడిచాక.. రాజు భార్య అయిన గుండిచాదేవి ప్రోద్బలంతో ఆ విగ్రహాలు ఎంతవరకు పూర్తయ్యాయోనని తెలుసుకోవడానికి ఇంద్రద్యుమ్నుడు విగ్రహాలు తయారుచేస్తున్న చోటుకు చేరుకుంటాడు.

అయితే ఆ శిల్పాలు కాస్త మాయమై, సగం మాత్రమే చెక్కి వున్నట్లు కనిపించాయి. దాంతో ఆ రాజు తాను చేసిన పొరపాటుకి బాధపడుతూ, కుంగిపోతాడు. అప్పుడు బ్రహ్మాది దేవతలు అతని ముందు ప్రత్యక్షమై, అతడిని ఓదార్చి, వాటిని అలాగే ప్రతిష్టింపజేశారు. నాటినుంచి అవి అలాగే పూజలు అందుకుంటున్నాయి. అందువల్లే కృష్ణుడు, బలరాముడు, సుభద్ర విగ్రహాలకు చేతులు వుండవు. జగన్నాథ ఆలయానికి సంబంధించి మరో కథ కూడా పురాణాలలో ప్రచురించబడి వుంది. అందులో జగన్నాథుడు సవరల దేవుడనీ.. నీలమ్దవుడు అనే పేరుతో గిరిజనుల నుంచి పూజలు అందుకునేవాడని స్థలపురాణం చెబుతోంది.

ఆలయ చరిత్ర :

12వ శతాబ్దంలో అప్పటి కళింగరాజు అయిన అనంత వర్మన్ చోడరంగ దేవుడు ఈ ఆలయాన్ని నిర్మించారని చారిత్రకారులు ఇక్కడ లభించిన కొన్ని శాసనాలు, ఆధారాల ద్వారా వెల్లడించారు. అయితే అతని మరణం తరువాత ఈ ఆలయం ఆఫ్గన్ల దండయాత్రల్లో ధ్వంసం కావడంతో ఆయన మనవడు అయిన అనంగ భీమదేవుడు తిరిగి దీనిని పునర్మించి, విగ్రహాలను పున:ప్రతిష్టించాడని వారు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఇప్పుడున్న ఆలయం ఆకారం కూడా ఆయన కాలందేనని వారు పేర్కొంటున్నారు.

జగన్నాథుని కన్నుల పండువగా రథయాత్రను నిర్వహిస్తారు. ఈ యాత్రను ఆషాడశుక్ల విదియనాడు ప్రారంభం అవుతుంది. అంటే జూన్ లేదా జూలై నెలల్లో జరుగుతుంది. ఈ యాత్రకు సంబంధించిన సన్నాహాలను 60రోజుల ముందునుంచే అంటే బహుళ విదియనాటి నుంచే ఇక్కడి పూజారులు ప్రారంభిస్తారు.

No comments:

Post a Comment