Saturday, April 18, 2015

భక్తిమార్గాలతో విజయాలను సొంతం చేసుకోవచ్చు!

ఇంట్లో ప్రతిరోజూ గొడవలు, తగాదాలు, అశాంతి వాతావరణం వుంటే.. ఆయా ఇళ్లలో పూజా కార్యక్రమాలు, ఆయా గ్రహాలకు జపాలు, శాంతులు చేయించాలని పండితులు, పురోహితులు, జ్యోతిష్య శాస్త్రజ్ఞులు చెబుతుంటారు. ఏదైనా ఇంట్లోగానీ లేదా ఎవరితోనైనాగాని ఎల్లప్పుడూ అశుభం జరగడం, ఏదో ఒక ప్రమాదం జరుగుతుంటే... అప్పుడు వారి గ్రహస్థితిలో ఏవో మార్పులు వున్నాయిని తెలుపుతారు జ్యోతిష్యులు. అప్పుడు వాటికి సంబంధించిన యజ్ఞాలు, శాంతులు, జపాలు చేయిస్తే.. వాటి ప్రభావం తగ్గుతుందని శాస్త్రాలప్రకారం చెబుతుంటారు.

అయితే ఇలా కాకుండా సాధారణంగా ఏదైనా ఒక పని నిర్వహించాలనుకున్నప్పుడు అది సవ్యంగా జరగకపోతే.. ఏవైనా ఆటంకాలు ఎదురయినప్పుడుగాని, ఇతరత్రా దోషాలు ఏవైనా వుంటే.. వాటి నుంచి బయటపడడానికి వివిధ దేవతా స్తోత్రాలను కూడా పఠించవచ్చునని పురోహితులు వెల్లడిస్తున్నారు. ఏయే పనులకు ఏయే స్తోత్రాలు పఠిస్తే బాగుంటుంది... ఏయే దేవతా పూజలను నిర్వహించుకుంటే ఏయే ఫలితాలు దక్కుతాయి.. ఏయే యజ్ఞాలు చేస్తే ఏయే దోషాల నుంచి బయటపడవచ్చునన్న వాటి గురించి కూడా మనకు సవివరంగా వివరిస్తున్నారు.

అందులో ముఖ్యమైనవి ఒకసారి మనం కూడా పరిశీలిద్దాం...

1. కుటుంబసభ్యుల మధ్య వున్న విభేదాలు, తగాదాలు, ఘర్షణలు తొలగిపోయి... అందరూ కలిసి మెలిసి సత్సంబంధాలుగా ఏర్పడేందుకు ‘‘విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామాల’’ను నిత్యం పారాయణం చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. విష్ణ సహస్రనామాన్ని ప్రతిరోజూ పఠిస్తే.. ఏ సమస్యలు తలెత్తవు. పైగా అన్ని పనులలో విజయాలను సాధిస్తారు.

2. ‘‘కనకధార స్తోత్రం’’ను ప్రతిరోజు చదివితే నిర్వహించుకున్న వ్యాపారంలో మంచి అభివృద్ధి లభించడంతోపాటు... నూతనంగా ఏర్పాటు చేసుకున్న వ్యాపారాలు కూడా మంచి విజయాలు సాధిస్తాయి.

3. ప్రతిరోజూ ‘‘సూర్యాష్టకం, ఆదిత్య హృదయం’’ చదువుతూ.. ‘‘సూర్యధ్యానం’’ చేస్తే.. ఉద్యోగాలు చేస్తున్నవారికి మంచి పురోభివృద్ధి లభిస్తుంది. అలాగే ఉద్యోగాలు లేనివారిని మంచి అవకాశాలతోపాటు ఫలితాలు కూడా లభిస్తాయి.

4. ‘‘లక్ష్మీ అష్టోత్తర శతనామావళి’’ని నిత్యం పారాయణం చేస్తే మంచి సద్గుణాలతో కలిగినవారు వివాహ సంబంధాలు తీసుకువస్తారు. అలాగే పెళ్లి పనులు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా సక్రమంగా జరుగుతాయి.

5. ‘‘నవగ్రహ స్తోత్రా’’న్ని ప్రతిరోజు చదువుకుంటే.. ఋణబాధల నుంచి ఇబ్బందులు పడుతున్నవారు తక్షణమే వాటి నుంచి విముక్తి పొందుతారు. అంతేకాకుండా.. ధనానికి సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు ఇక తలెత్తవు.

6. విద్యార్థులు మంచి విద్యను పొందడానికి, చదువులో ఏకాగ్రతను పెంచుకోవడానికి ప్రతిరోజూ ‘‘హయగ్రీవ స్తోత్రం’’, ‘‘సరస్వతి ద్వాదశ నామాల’’ను పఠించాలి.

7. సంతానం లేని వారు ప్రతిరోజు ‘‘గోపాల స్తోత్రం’’ను పఠిస్తే.. మంచి ఫలితం లభిస్తుందని... అలాగే గర్భంతో వున్న ఇదే స్తోత్రాన్ని ప్రతిరోజు పఠిస్తే ప్రసవం సుఖంగా అవుతుందని పండితులు, పురోహితులు శాస్త్రాల ఆధారంగా చెబుతున్నారు.

No comments:

Post a Comment