Saturday, April 18, 2015

అత్తిరాల శ్రీ పరశురాముని ఆలయం

పురాణ గాధ :

పూర్వం సత్యయుగంలో శ్రీమన్నారాయణుడి ఆవర అవతారమైన శ్రీ పరశురాముడు... భూమండలంలో రక్తపాతం సృష్టించాడు. ఎడతెరిపి లేకుండా తను ఇరవై ఒక్కసార్లు రక్తపాతం జరపడం వల్ల.. ఆయనకు పాపం చుట్టుకుంటుంది. దాంతో ఆయన గొడ్డలి హస్తానికి అంటుకొని రాలేదు.

దీంతో పరశురాముడు, మహేశ్వరుడి ఆజ్ఞమేరకు పుణ్యనదులలో స్నానం చేస్తూ... పుణ్యక్షేత్రాలను దర్శనం చేసుకూంటూ చివరకు అత్తిరాల ప్రాంతానికి చేరుకుంటారు. (అప్పట్లో ఆ ప్రాంతానికి ‘అత్తిరాల’ అనే పేరు లేదు). ఈ ప్రాంతంలోనే వున్న బహుదా నదిలో స్నానం చేయగానే.. ఆయన చేతిలో వున్న పరుశువు (గొడ్డలి) రాలి, క్రింత పడిపోతుంది.

ఇలా ఈ విధంగా పరశురామునికి చుట్టుకున్న హత్యపాపం రాలిపవడంతో.. ఆ ప్రాంతానికి ‘హత్యరాల’ అనే పేరొచ్చింది. కాలక్రమంలో ఇప్పుడు ‘అత్తిరాల’గా పిలవబడుతోంది.

బాహుదా నది విశిష్టత :

పూర్వం ద్వాపరయుగంలో శంఖుడు, లిఖితుడు అనే ఇద్దరు సోదరులు అత్తిరాల ప్రాంతంలో నివసిస్తుండేవారు. వీరిద్దరూ సకల విద్యలలో, వేదాంతాలలో వీరికి వీరే సాటిగా వుండేవారు. వీరిద్దరూ ఒక్కొక్కటిగా తమతమ ఆశ్రమాలను స్థాపించుకుని, అక్కడే తపస్సు చేసుకునేవారు.

ఒకనాడు లిఖితుడు తన అన్న అయిన శంఖుడిని చూడాలని, అతని ఆశ్రమానికి చేరుకుంటాడు. కానీ శంఖుడు ఆశ్రమంలో వుండడు. దీంతో లిఖితుడు తన అన్న కోసం ఎదురుచూడసాగాడు. అక్కడి చెట్లకు వున్న ఫలాలను కోసి తింటూ, కాలక్షేపం చేస్తూ వుండేవాడు.

ఇంతలోనే శంఖుడు తిరిగి వచ్చి తన తమ్ముడు ఫలాలను తింటుండగా చూస్తాడు. దీంతో శంఖుడు.. ‘‘నువ్వు ఎవరి అనుమతితో ఈ ఫలాలను తింటున్నావు?’’ అని ప్రశ్నిస్తాడు. లిఖితుడు తన తప్పును అర్థం చేసుకుని, పరిహారం చూపమని అర్థించాడు.

అప్పుడు శంఖుడు.. ‘‘ఏదైనా ఒక వస్తువును అనుమతి లేకుండా తీసుకుంటే.. దానిని దొంగతనం అంటారు. ఇప్పుడు నువ్వు కూడా అదే చేశావు కాబట్టి.. రాజు దగ్గరకు వెళ్లి, నీ శిక్షకు సరైన నేరాన్ని అనుభవించు’’ అని ఆజ్ఞాపించాడు. లిఖితుడు తన అన్న మాటను శివసావహించి, రాజు భవనానికి వెళ్లాడు.

లిఖితుడు వస్తున్నాడన్న ఆనందంలో సుదుమ్న్య రాజు తనను ఘణంగా ఆహ్వానించడానికి అన్నివిధాలు ఏర్పాట్లను సిద్ధం చేసుకుంటాడు. అయితే లిఖితుడు దానిని తిరస్కరించి.. తను చేసిన తప్పు గురించి వివరించి, శిక్షను విధించమని కోరుకుంటాడు.

‘‘ఒక మహా తపస్వి చేసిన చిన్న నేరానికే నేను శిక్షించాలా’’ అంటూ బాధపడుతూనే... అతని చేతులు నరకమని ఆజ్ఞాపిస్తాడు రాజు. లిఖితుడు రాజు విధించిన శిక్షను సంతోషంగా అనుభవించి, తన దగ్గరకు తిరిగి చేరుకుంటాడు.

అప్పుడు శంఖుడు.. ‘‘నువ్వు చేసిన నేరాన్ని అంగీకరించి, శిక్షను అనుభవించినందుకు పునీతుడివయ్యావు. నదిలో వెళ్లి భగవంతుడికి, పితృదేవతలకు అర్ఠ్యం సమర్పించు. అంతా మంచి జరుగుతుంది’’ అని ఆదేశించాడు.

నదిలో మునిగి బయటికి వచ్చిన లిఖితుడికి తిరిగి చేతులు వచ్చేస్తాయి. ఈ విధంగా లిఖితునికి చేతులు ప్రసాదించినందుకు ఆ పవిత్ర నదికి ‘‘బాహుదా’’ అనే పేరొచ్చింది. దానినే ఇప్పుడు ‘‘చెయ్యేరు’’గా పిలుస్తున్నారు.

మరికొన్ని పురాణగాధలు :

పూర్వం ప్రజాపతులలో ఒకరైన పులస్త్య బ్రహ్మ.. ఈ పవిత్ర క్షేత్రంలో నిత్యం తపం ఆచరించేవాడు. దాంతో ఆయన శివుని సాక్షాత్కారం పొంది, కోరికలను కోరుకోమని వరాన్ని ప్రసాదించాడు. బ్రహ్మ కోర్కె మేరకు సదాశివుడు ‘‘శ్రీ త్రేతేశ్వర స్వామి’’ అనే నామంతో పర్వతం మీద స్యయంభూగా వెలిశారు.

అలాగే పూర్వం సప్త మహర్షులలో ఒకరైన ‘‘భ్రగు’’ కూడా ఈ పుణ్య స్థలంలో తపము ఆచరించి, శ్రీహరిని ప్రసన్నం చేసుకున్నారు. భ్రగు ముని కోర్కె మేరకు శ్రీహరి ఒక పాదాన్ని అత్తిరాలలో వుంచి.. ‘‘శ్రీ గదాధర స్వామి’’గా వెలిశారు.

ఈ అత్తిరాల ప్రాంతానికి ‘‘దక్షిణ గయ’’ అనే పేరు కూడా వుంది. ఎందుకంటే.. పూర్వం చనిపోయిన రక్త సంబంధీకులు ఎవరైనా చెయ్యేరు నదిలో పిండ ప్రదానం, తర్పణం... గయలో చేసిన వాటితో సమానమని ప్రతిఒక్కరు విశ్వసిస్తారు.

ఆలయ విశేషాలు :

ఈ అత్తిరాల పరశురాముని ఆలయం ప్రాముఖ్యత గురించి మహాభారతంలోనే ఉదహరించబడింది. ప్రస్తుతమున్న ఈ ఆలయం నిర్మణం.. 10వ శతాబ్దంలో చోళరాజుల సహకారంతోనూ, ఏకా తాతయ్య దొర సారధ్యంలో జరిపినట్లు శాస్త్రీయ పరిశోధనలు తెలుపుతున్నాయి. చోళులు, పాండ్యులు, శాతవాహనులు, కాకతీయులు, విజయనగర పాలకులు, కాయస్థ వంశం వారు అత్తిరాల ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి తమవంతు సహకారాన్ని అందించారు.

శ్రీ త్రేతేశ్వర, శ్రీ గదాధర, ఇంకా పురాతన ఆలయాలు శిథిలం కావడంతో.. అవి తిరిగి భక్తుల సహకారంతో పునరుద్ధరించారు. ఈ ప్రాంతంలో నలువైపులా శిథిలమైన విగ్రహాలు, నిర్మాణాలు చాలా కనబడుతాయి.

ఈ ప్రాంతానికి నలువైపులా కొండలు.. ఒకవైపు చెయ్యేరు నది.. అన్నివైపులా ఆలయాలతో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఆధ్యాత్మికంగా వెల్లివిరిస్తుంది. ఇంకా ఈ ఆలయ నిర్మాణం కూడా ఎంతో విశేషంగా వుంటుంది. ఒక్కొక్కచోట వున్న విగ్రహం.. ఒక్కొక్క చరిత్రను కలిగి వుంటాయి.

No comments:

Post a Comment