Saturday, April 18, 2015

లక్ష్మీదేవి జన్మరహస్యం

లక్ష్మీదేవి ప్రతిఒక్కరి ఇంట్లో కొలువై వుంటుందని అందరూ ప్రగాఢంగా నమ్ముతారు. ఆమెను భక్తిశ్రద్ధులతో పూజలు నిర్వహించి, నోములను పాటిస్తే.. సిరిసంపదలను, సౌభాగ్యాలను, సంతోష జీవితాన్ని అందిస్తుందని విశ్వసిస్తారు.

లక్ష్మీదేవి జన్మం.....

ఒకరోజు ఇంద్రుడు ఐరావతంపై స్వర్గానికి వెళుతుండగా.. అల్లంతదూరం నుంచి దుర్వాస మహర్షి చూస్తాడు. అమరావతికి అధిపతి అయిన ఇంద్రుడికి గౌరవసూచికంగా తన మెడలో వున్న దండని సమర్పిస్తాడు.

కానీ గర్వంతో కళ్లు మూసుకుపోయిన ఇంద్రుడు.. దండం ఇచ్చినందుకు కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పకుండా, తన ఏనుగు తొండానికి తగిలిస్తాడు. ఏనుగు తన తొండాన్ని అటు, ఇటు ఆడిస్తూ దండాన్ని కిందకు విసిరేసి.. కాళ్లతో తొక్కి నుజ్జునుజ్జు చేసేస్తుంది.

ఈ విషయం మొత్తాన్ని చూసిన దుర్వాసుడు కోపాద్రిక్తుడై.. ‘‘ఓ ఇంద్రా! మితిమీరిన గర్వం, అహంకారంతో ప్రవర్తించిన నిన్ను.. ఈ భోగభాగ్యాలన్నీ వీడిపోతాయి’’ అని శపిస్తాడు. అప్పుడు ఇంద్రుడు తన కళ్లకు కప్పుకున్న తెరలను తొలగించుకుని.. దుర్వాస మునిని క్షమించమని వేడుకున్నాడు.

అప్పుడు దుర్వాసుడు తన కోపాన్ని తగ్గించుకుని.. ‘‘నువ్వు శాపాన్ని అనుభవించక తప్పదు.. అయితే విష్ణుమూర్తి కృపతో నువ్వు పూర్వవైభవాన్ని తిరిగి పొందవచ్చు’’ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

అలా వెళ్లిన తరువాత ఇంద్రునిపై దుర్వాసుని శాపం పనిచేయడం ప్రారంభమవుతుంది. అప్పుడు బలి తన రాక్షసులతో అమరావతిపై దండెత్తుతారు. ఇంద్రుడిని, అతని పరవారంతోపాటు స్వర్గం నుంచి బయటకు తరిమేస్తారు.

అలా అజ్ఞాతంగా మారిపోయిన ఇంద్రుడు.. తన గురువు బృహస్పతి దగ్గరకు వెళ్లి సలహా అడుగుతాడు. అప్పుడు బృహస్పతి.. ‘‘దీనికి తగిన పరిష్కారం బ్రహ్మదేవుడే సూచించగలడు’’ అని చెబుతాడు.

గురువు మాటలు విని ఇంద్రుడు తన పరివారంతో బ్రహ్మదేవుని దగ్గరకు చేరుకుంటాడు. అప్పుడు బ్రహ్మ.. ‘‘ఈ విషయంలో నేనూ ఏమి చేయలేను. దీనికి పరిష్కారం ఆ విష్ణుమూర్తియే చెప్పగలడు’’ అంటూ పలుకుతాడు.

అప్పుడు ఇంద్రాది దేవతలంతా విష్ణుమూర్తి సన్నిధికి చేరుకుని.. జరిగిన మొత్తం ఉదంతాన్ని విష్ణువుకు చెబుతారు. అప్పుడు విష్ణుమూర్తి.. ‘‘రాక్షసుల సహాయంతో పాలసముద్రాన్ని చిలికి.. అందులోనుంచి వెలువడిన అమృతాన్ని అందుకుంటే.. తిరిగి అధికారాన్ని పొందవచ్చు’’ అని అంటాడు.

ఆ మాటలు విన్న ఇంద్రాది దేవతలంతా, రాక్షసులను తమవెంట పాలసముద్రానికి చేరుకుంటారు. మందరపర్వతం, వాసుకి సహాయంతో ఆ పాలసముద్రాన్ని చిలకడం మొదలు పెడతారు. అక్కడే వున్న విష్ణుమూర్తి.. కూర్మావతారంలో మందపర్వతం మునిగిపోకుండా మొత్తం భారాన్ని భరిస్తాడు.

అప్పుడు పాలసముద్రం చిలికి.. అందులో నుంచి అనేక రకాల జీవులు, వస్తువులు బయటకు వెలువడుతాయి. అందులో నుంచి ఓ అందమైన యువతి, చేతిలో కలువలమాలతో ఉదయిస్తుంది. అలా బయటికి వచ్చిన ఆ యువతే లక్ష్మీదేవి. ఆమె విష్ణుమూర్తిని భర్తగా అంగీకరిస్తూ.. ఆయన మెడలో మాలవేసి, చెంతన చేరుకుంటుంది. అలా బయటకు వచ్చిన లక్ష్మీదేవి.. మహావిష్ణువు అన్ని అవతారాలలోనూ ఆయన సరసనే వుంటుంది.

No comments:

Post a Comment