Saturday, April 18, 2015

బ్రహ్మదేవుడు చిత్రించిన పుణ్యస్థలం

పురాణగాధ :

పూర్వం కుట్రాల పుణ్యభూమిలో పరిపాలన చేస్తున్న పృథువు రాజ్యంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో తమ జీవితాన్ని కొనసాగించేవారు. ఆ రాజ్యంలో బృహస్పతి వంశానికి చెందిన రోచిష్మానుడు, సురుచి అనే ఇద్దరు అన్నదమ్ములు వుండేవారు. నాలుగు వేదాలను, సకల శాస్త్రాలను చదివిన వీరు అపరమైన విష్ణుభక్తులు. అయితే వీరిద్దరూ విష్ణుభక్తిని పారాయణం చేస్తూ దేశంలోని అన్ని ప్రాంతాలలో తిరుగుతూ శివునిపై నింద చేయడం మొదలుపెట్టారు. శివుడు కంటే విష్ణువే గొప్ప అన్న వాదనను చెప్పుకుంటూ తిరుగుతుండేవారు.

అయితే ఈ విషయం అలా అలా పాకుతూ మహారాజు పృథువు చెవిన పడింది. విషయం విన్న వెంటనే, మానసికంగా దిగ్ర్భాంతి చెంది, నేరుగా కైలాసానికి వెళ్లాడు. అక్కడ శివునితో.. ‘‘పరమేశ్వరా! నా దేశంలో శివభక్తి పారాయణాలు తప్ప మరేమీ వుండకూడదు. అందుకు నువ్వే ఏదైనా ఒక మార్గాన్ని చూపాలి’’ అని వేడుకుంటాడు. దానికి శివుడు.. ‘‘అగస్త్య మహాముని ద్వారా అందుకు తగిన ప్రయత్నాలు, తగిన సమయంలో మొదలవుతాయి’’ అని చెబుతాడు.

కొన్నాళ్ల తరువాత అగస్త్య మహాముని శివచిహ్నాలో కుట్రాలంలో వున్న విష్ణు సన్నిధికి చేరుకుంటాడు. ఆయన్ను ఆ రూపంలో చూసిన విష్ణుభక్తులు.. విష్ను సన్నిధిలో రాకుండా అడ్డుకున్నారు. దాంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మరుసటి రోజు అగస్త్య మహాముని విష్ణుభక్తునిలాగా రూపాన్ని ధరించి విష్ణు ఆలయానికి చేరుకున్నాడు. అగస్త్య మునిని ఆ రూపంలో చూసిన విష్ణుభక్తులు.. ఎంతో సాదరంగా ఆయన్ని ఆహ్వానించి, ఆలయం లోపలికి తీసుకెళ్లి, పూజావిధులు నిర్వహించమని చెప్పారు.

ఆలయగర్భంలోకి వెళ్లిన అగస్త్యుడు.. శివునిని ధ్యానిస్తూ తన చేతిలో వున్న పూదండతో విష్ణువును తాకుతాడు. ఆ మరుక్షణమే.. విష్ణుమూర్తి ప్రతిమ శివలింగంగా మారిపోయింది. ఆ సమయంలో అక్కడే వున్న విష్ణుపరివార దేవతలంతా.. శివపరివార దేవతలుగా మారిపోయారు. ఆ దృశ్యాన్ని చూసిన విష్ణుభక్తులు కూడా స్తంభించిపోయారు. అయితే అక్కడే వున్న సురుచి ఆవేశంతో ఊగిపోయి.. అగస్త్యునితో వాగ్యుద్ధానికి దిగుతాడు. అప్పుడు ఆకాశవాణి.. ‘‘ఎవరైనా మధ్యవర్తిని పెట్టుకుని వాదనలను కొనసాగించండి’’ అని చెప్పింది. ఆ మరుక్షణమే శివుని ఎడమభాగంవైపునున్న ధరణి పీఠం నుంచి ఒక దేవి ఆవిర్భవించింది.

ఇలా దేవి మధ్యవర్తిత్వం వహించగా.. అగస్య, సురుచిల వాదనలు కొనసాగుతాయి. ఇందులో షరతు ఏమిటంటే.. ఎవరైతే వాదనలో ఓడిపోతారో, వారు తెలిపినవారి మతాన్ని అనుసరించాలి. ఈ నిబంధనతో వారిద్దరి మధ్య ఐదురోజులపాటు వాదన కొనసాగుతుంది. చివరకు అగస్త్యమునీశ్వరుడే గెలుస్తాడు. ఫలితంగా అక్కడే వున్న విష్ణుభక్తులంతా అగస్త్యుని ద్వారా శివదీక్షను స్వీకరించారు. అయితే వీరిద్దరి వాదనకు మధ్యవర్తిత్వం వహించింది ఆ పరాశక్తియే.

ధరణీపీఠ నాయకి :

ఒకనాడు ఈ ప్రాంతంలో శుంభని, శుంభులు శివుని వల్ల అనేక రకాల వరాలను పొందుతారు. పురుషులవల్ల మరణం రాకుండా వరాన్ని పొందిన వారు.. అందరినీ బాధపెడుతుండేవారు. దీంతో మునులందరూ ప్రార్థించగా.. ఆదిపరాశక్తి వారిద్దరిని సంహరిస్తుంది. ఇదంతా గమనించిన శుంభని, శుంభుల గురువు ఉదంబరునికి కూడా వణుకు పుడుతుంది. తనను కూడా పరాశక్తి ఎక్కడ అంతం చేస్తుందోనన్న భయంతో కునుకులేకుండా వుండేవాడు. ఆమెనుంచి తప్పించుకోవడానికి ఉపాయం కోసం యముడిని ఆశ్రయిస్తాడు.

ఉదంబరుని పరిస్థితిని అర్థం చేసుకున్న యముడు.. కుట్రాలం పక్కనేవున్న ఒక పర్వత అరణ్యంలో దాక్కుని వుండమని చెప్పాడు. అలా దాక్కున్న ఉదంబరుడు.. పగలంతా ఎవరికీ తెలియకుండా లోపలేవుండి.. రాత్రి అవగానే బయటకు వచ్చి జీవులను పీడిస్తుండేవాడు. ఆ రాక్షసుని బాధలు తట్టుకోలేక మునీశ్వరులు దేవిని ప్రార్థించగా.. ఆమె ఆ రాక్షసునిని, అతని పరివారంతో అంత మొందించింది. అనంతరం ఆ మునులతో దేవి.. ‘‘మీకు తోడుగా నేను కూడా ఇక్కడే కొలువై వుంటాను’’ అని ఓ చెట్టు కింద ధరణీపీఠ నాయకిగా కొలువై వుంది.

ఈ పవిత్రప్రదేశం కుట్రాలం జలపాతానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో వుంది. ఇక్కడున్న తీర్థాన్ని దేవి పేరుతో శెన్బగతీర్థం అంటారు. అమ్మవారి ఆలయానికి పైబాగంలో ‘‘శివమధుగంగ’’ అనే జలపాతం వుంది. ఇక్కడ గంగాదేవి, శివలింగానికి తేనెతో అభిషేకం చేయించడంవల్ల దీనకి ‘‘శివమధుగంగ’’ అనే పేరు ఏర్పడిందని అంటారు. ఇక్కడ పౌర్ణమిరోజున పసుపువర్ణంతో కూడిన వర్షం పడుతుందని పెద్దలు చెబుతుంటారు.

పరమశివుడు ఐదుచోట్ల తాండవనృత్యం చేశాడని విశ్వసిస్తారు. స్వామివారు నృత్యం చేసిన సభను చిత్రసభగా పిలుస్తారు. ఈ చిత్రసభ, మిగతా వాటికంటే ఎంతో భిన్నమైంది. మిగతా వాటిలో శివుడు విగ్రహరూపంలో గోచరిస్తుండగా.. ఇక్కడ మాత్రం చిత్రరూపంలో దర్శనమిస్తాడు. చిత్రసభలో పరమశివుడు దేవేరితోపాటు తాండవం చేస్తుండగా.. ఆ దృశ్యాన్ని బ్రహ్మదేవుడు ఒక గోడపై చిత్రీకరించాడని పురాణకథనం. మార్గశిర మాసంలో ఇక్కడ ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. తమిళనాడులో ఈ కుట్రాల పుణ్యస్థలం.. పర్యాటకకేంద్రంగా ప్రతిఒక్కరు భావిస్తారు.

No comments:

Post a Comment