Saturday, April 18, 2015

మార్కండేయ పురాణము

పూర్వం శౌనకాది మహామునులు, సూతుడిని... ‘‘ఓ సూతపౌరాణికా! నీవల్ల మేము భాగవతం, భవిష్య పురాణాల గురించి చాలా సంతోషించాము. అలాగే మార్కండేయ పురాణం గురించి వివరించు’’ అని అడిగారు. అప్పుడు సూతుడు మార్కండేయ పురాణం గురించి ఇలా వివరించాడు...

‘‘పూర్వం ఒకప్పుడు వ్యాసుడు మొత్తం భారతకథను జైమిని వినిపించినప్పటికీ కూడా అతనిలో కొన్ని సందేహాలు మిగిలిపోతాయి. దాంతో జైమిని, వ్యాసుడి దగ్గరకు వెళ్లి.. ‘‘మునీంద్రా! భారతం విన్న తరువాత కూడా నాకు కొన్ని సందేహాలున్నాయి. వాటిని తీర్చు’’ అని అడుగుతాడు.

అప్పుడు వ్యాసుడు.. ‘‘నాకు తపస్సు చేసుకోవలసి సమయం ఆసన్నమయింది. నేను చెప్పలేను. నువ్వు కావాలంటే వింధ్యాపర్వాతాల మీద నివసిస్తున్న పింగాక్ష, నిబోధ, సుపత్ర, సుముఖములు అనే నాలుగు పక్షులు వుంటాయి. వాటిని అడిగి నీ సందేహాలను తీర్చుకో’’ అని సమాధానం చెబుతాడు.

జైమిని దానికి సమాధానంగా.. ‘‘ఓ మునివ్వరా! ఈ పక్షుటేంటి? అవి మాట్లాడడమేంటి? మహాపండితులులాగా వారు నా సందేహాలను తీర్చడం ఎలా?’’ అని అడుగుతాడు.

దుర్వాసునుడి శాపం :

దానికి మార్కండేయుడు (వ్యాసుడు).. జైమినీ! పూర్వం దుర్వాసుడు మహర్షి మహా తపస్సు చేస్తుండేవాడు. అతని తపస్సును చూసిన ఇంద్రుడు భయపడి.. అతని తపస్సును భంగం చేయడానికి ‘‘వవువు’’ అనే అప్సరసను పంపించాడు. ఆమె తన నృత్య, గాన, వినోదాలతో దుర్వాసుని తపస్సుని భంగం కలిగించింది.

దాంతో దుర్వాసుడు ఆగ్రహించి.. ‘‘ఓసీ! నువ్వు నా తపస్సును భంగం కలిగించావు. కాబట్టి నువ్వు ఒక కంక పక్షి (గ్రద్ద)గా జన్మిస్తావు’’ అని శపిస్తాడు. ఆమె వెంటనే దుర్వాసుని కాళ్లమీద పడి.. ‘‘నేను చేసిన అపరాధానికి మన్నించి, శాపవిముక్తి ఎలా కలగాలో తెలుపండి’’ అని కోరుకుంటుంది.

దుర్వాసుడు ఆమెను చూసి కనికరించి.. ‘‘గ్రద్ధగా మారిన తరువాత నీ గర్భంలో నలుగురు పిల్లలు పుడతారు. అప్పుడు అర్జునుని బాణం దెబ్బతగిలిన తరువాత నువ్వు మరణించి, నువ్వు నిజరూపం దాల్చుతావు. అప్పుడు స్వర్గానికి చేరుకుంటావు’’ అని అనుగ్రహిస్తాడు.

వవువు గ్రద్ధగా జన్మిస్తుంది. మందపాలపుత్రుడైన ద్రోణుడు అనే వానితో వివాహం చేసుకుని పద్నాలుగు సంవత్సరాలవరకు కాపురం చేస్తుంది. పద్నాల్గవ ఏట గర్భవతిగానే వుండగా.. భారతయుద్ధానికి వెళుతుంది. పైనుండి గ్రద్ద యుద్ధాన్ని చూస్తుండగా.. అర్జునుడు ప్రయోగించిన బాణాల్లో ఒకటి వచ్చి ఈ గ్రద్దకు తగులుతుంది.

అప్పుడు వెంటనే ఆ గ్రద్ద గర్భంలో వున్న నాలుగు గుడ్లు నేలమీద జారిపడతాయి. అప్పుడామె.. ‘‘నా పిల్లలను ఆ భగవంతుడే కాపాడాలి’’ అని ప్రార్థించి, తన శరీరాన్ని వదులుతుంది. ఆ యుద్ధం సంరంభంలో ఒక ఏనుగు మెడలో వున్న గంట, శత్రుసైనికుని బానం దెబ్బతో తెగి.. ఆ నాలుగు గుడ్లమీద పడుతుంది. అలా కింద పడిన ఆ నాలుగు గుడ్లు ఆ గంట కిందే సురక్షితంగా వుంటాయి. భారతయుద్ధం పూర్తయిన తరువాత ఆ ప్రాంతమంతా ప్రశాంతత నెలకొంటుంది.

ఒకనాడు ప్రభాతవేళ శమీకుడు అనే ఒక మహాముని.. ఆ కురుక్షేత్రం మీదుగా వెళ్తుంటాడు. గంటకింద వున్న గుడ్లు పిల్లలుగా మారి, కిచకిచలాడుతుంటాయి. అలా ధ్వని విన్న ఆ ముని గంటను పైకి ఎత్తి చూస్తాడు. ఆ గంట కింద అతనికి నాలుగు పక్షి పిల్లలు కనిపిస్తాయి.

శమీకుడు ముని ఆ పక్షి పిల్లల మీద కరుణ కలిగి తన ఆశ్రమానికి తీసుకుని వెళతాడు. అప్పుడు ఆ పక్షులు.. ‘‘ఓ మహానుభావా! తండ్రిలా మమ్మల్ని నువ్వు కాపాడావు. నీ ఋణము మేమెలా తీర్చుకోవాలి? మేము ఏ విధంగా నీకు సేవ చేయగలం చెప్పు’’ అని అడిగాయి.

పక్షులు మానవభాషలో మాట్లాడుతున్నందువల్ల శమీకుడు ఆశ్చర్యపడి, ‘‘ఓ పక్షి పిల్లల్లారా! మీరు మానవభాషలో మాట్లాడడం చూస్తుంటే నాకు చాలా వింతగా వుంది. అసలు మీరెవ్వరు? ఎందుకు ఈ పక్షీ జన్మం ఎత్తారు? నాకు దయచేసి తెలపండి’’ అని అడగగా... ఆ పక్షిపిల్లలు ఈ విధంగా సమాధానం చెబుతాయి.

‘‘ఓ ఋషీశ్వరా! పూర్వం సుకృతి అనే మహామునికి మేము నలుగురం పుత్రులుగా జన్మించాం. వేదశాస్త్రాలను చదువుకుంటూ... మా తల్లిదండ్రులను సేవిస్తూ.. కాలాన్ని గడిపేవాళ్లం. ఇలా వుండగా.. ఒకరోజు దేవేంద్రుడు మా తండ్రిసత్యాన్ని పరీక్షించడానికి గ్రద్దరూపంలో వచ్చి నరమాంసాన్ని ఆహారంగా పెట్టమని కోరాడు.

అప్పుడు మా తండ్రి.. ‘‘మీలో ఎవరైనా ఇంద్రునికి ఆహారం అవ్వండి’’ అని ఆజ్ఞాపించారు. అయితే మేము మా ప్రాణాలను దక్కించుకోవడానికి భయంతో తండ్రి ఆజ్ఞాన్ని పాలించకుండా అలాగే వుండిపోయాం. అప్పుడు మా తండ్రి మమ్మల్ని పక్షలుగా పుట్టాలని శపించి, తన శరీరాన్ని ఇంద్రునికి ఆహారంగా సమర్పించుకున్నారు.

ఇంద్రుడు మా తండ్రి త్యాగబుద్ధిని సంతోషించి, మమ్మల్ని చూసి... ‘‘మీరు వింధ్యపర్వత గుహలలో నివసించండి. జైమిని అనే వ్యాసశిష్యుడు మీ దగ్గరకు వచ్చి, కొన్ని సందేహాలు అడుగుతాడు. ఆ సందేహాలను తీర్చి మీరు శాపవిముక్తి పొందండి. మీరు పక్షులైనా.. సర్వవేదాలను పొంది ధర్మపక్షులు, జ్ఞానపక్షులుగా పేరు పొందుతారు’’ అని మమ్మల్ని అనుగ్రహంచి వెళ్లిపోయాడు’’ అని ఆ పక్షులు తమ వృత్తాంతం గురించి శమీకునికి చెబుతాయి.

అప్పుడు శమీకుడు... ‘‘మీరు నాకోసం ఏ పని చేయాల్సిన అవసరం లేదు. మీరు మీ విధిని నిర్వర్తించడానికి వింధ్యపర్వతాలకు వెళ్లండి’’ అని సెలవిచ్చి వారిని అక్కడి నుంచి పంపివేశాడు’’

కాబట్టి.. ఓ జైమినీ! నువ్వు ఆ పక్షుల దగ్గరకు వెళ్లి నీ ధర్మసందేహాలను తీర్చుకో’’ అని జైమినికి చెప్పి.. మార్కండేయుడు తపస్సు చేసుకోవడానికి వెళతాడు.

జైమిని వింధ్యపర్వతంలో జ్ఞానపక్షులను వెదకడానికి వెళతాడు. అలా కొద్దిసేపు తరువాత అతనికి ఆ పక్షులు కనిపిస్తాయి. ఆ పక్షులు ఆ సమయంలో వేదాధ్యాయనం చేస్తున్నాయి. అతడు ఆ పక్షుల దగ్గరకు వెళ్లి.. ‘‘ఓ పక్షులారా! నేను వ్యాసుని శిష్యుడిని. నన్ను జైమిని అంటారు. మార్కండేయుడు చెప్పిన విధంగా నేను మీ దగ్గర కొన్ని ధర్మసందేహాల గురించి అడిగి తెలుసుకోవడానికి ఇక్కడికి చేరుకున్నాను. నా సందేహాలను తీర్చండి’’ అని చెప్పగా... ఆ పక్షులు ‘‘నీకున్న సందేహాలేంటో అడుగు.. మా చేతనైంతవరకు సమాధానాలు చెబుతాం’’ అని సమాధానం ఇస్తాయి.

జైమిని తన సందేహాలను ఈ విధంగా వెల్లడిస్తాడు :

1. ద్వాపరయుగంలో శ్రీమన్నారాయణుడు లీలామానుష విగ్రహుడై పుట్టడానికి కారణమేంటి?

2. లోకమంతా ఆశ్చర్యపోయేవిధంగా ద్రౌపతికి ఐదుగురు భర్తలు వుండడమేంటి?

3. కురుపాండవుల మధ్య యుద్ధం సంభవించినప్పుడు బలరాముడు తీర్థయాత్రలకు ఎందుకు వెళ్లాడు?

4. ద్రౌవపదికి పుట్టిన ఐదుగురు రాజపుత్రులు వివాహాది సంస్కారం లేక దిక్కులేని చావు చచ్చారు. దానికి కారణమేంటి?

ఈ విధంగా వ్యాసుని శిష్యుడైన జైమిని భారతంలో తనకున్న సందేహాల గురించి ఆ జ్ఞానపక్షులను అడగగా.. అవి ఈ విధంగా తమ సమాధానాన్ని వెల్లడిస్తాయి.

1. భూమిలో వున్న ధర్మం మొత్తం నశించి, నలువైపులా అధర్మం వ్యాపించగా.. దానిని తగ్గించడానికి శ్రీమన్నారాయణుడు అనేక అవతారాలను ఎత్తాడు. దానిలో భాగంగానే ద్వాపరయుగంలో మానవజన్మను ఎత్తాడు.

2. పూర్వం దేవేంద్రుడు, త్రిశురుడు అనే వానిని సంహరించడం వల్ల బ్రహ్మహత్యాపాతకం సంభవించింది. ఆ పాపం యమునికి, వాయువునికి, అశ్వినీదేవతలకు నాలుగు భాగాలు పంచియిచ్చారు. వారిలో అనుగ్రహం పొందినవాడు తన వంశాన్ని వారియందు నిలుపుతాడు. అందుకే యమప్రసాదం వల్ల ధర్మరాజు, వాయువు వల్ల భీముడు, అశ్వినీ వల్ల నుకుల సహదేవులు జన్మించారు. ఇంద్రుడు తన అంశతో అర్జునుడిగా జన్మించాడు. ఈ సంగతిని గ్రహించిన శచీదేవి.. తాను ద్రౌపదిగా యజ్ఞాగ్నిహోత్రాల నుంచి పుట్టి.. ఇంద్రాంశ కలిగిన పంచపాండవులకు ధర్మపత్ని అయింది.

3. బలరామునికి పాండవులు వరుసకు బావమరదలు అవుతారు. బలరామునికి సుభద్రను ఇచ్చి బంధువులుగా కలుపుకున్నారు. ఇంకొకవైపు తన దగ్గరే గదాయుద్ధం నేర్చుకున్న ప్రియశిష్యుడు దుర్యోధనుడు వున్నాడు. మరొకవైపు పాండవులకు పక్షపతి అయిన శ్రీకృష్ణుడు తనకు స్వయాన తమ్ముడు. బలరామునికి ఎటువైపు చూసినా తన ప్రియతమవారితోనే యుద్ధం చేయవలసి వస్తుంది. అందుకే బాగా ఆలోచించిన తరువాత తీర్థయాత్రల వంక పెట్టుకుని, బలరాముడు యుద్ధంవైపు కన్నెత్తి చూడకుండా వుండిపోయాడు.

4. ఉపపాండవులు విశ్వేదేవులు. విశ్వామిత్రుని శాపంవల్ల వీళ్లందరూ ద్రౌపది గర్భంలో పుట్టి.. వివాహం, భార్యాపుత్రులు వంటి కార్యాలు వీరికి అంటపట్టక బ్రహ్మచారులుగానే అశ్వత్థమ చేతిలో దారుణంగా మరణించారు.

ఇలా ఈ విధంగా ఆ జ్ఞానపక్షులు జైమిని సందేహాలను తీర్చగా.. జైమిని వీటిని విని చాలా సంతోషించాడు. తనకు ఇంకా కొన్ని సందేహాలు వున్నాయని జైమిని ఇలా అంటాడు.. ‘‘మహాత్ములారా! నాకింకా కొన్ని సందేహాలున్నాయి. అవి కూడా తీరుస్తారని నేను కోరుకుంటున్నాను’’ అని అనగా.. జ్ఞానపక్షులు అందుకు ఒప్పుకుంటాయి.

జైమిని... ‘‘పాపపుణ్యాలు ఏ విధంగా వుంటాయో తెలుపుతారని నేను కోరుకుంటున్నాను’’ అని తెలుపుతాడు. దీనికి సమాధానంగా జ్ఞానపక్షులు... ‘‘ఓ మునీంద్రా! పాపాలు రెండు రకాలుగా వుంటాయి. అవి తెలిసి చేసేవి.. మరొకటి తెలియక చేసేవి. అవి చిన్నచిన్నవైతే ఫలితాలు త్వరగా అనుభవంలోకి వస్తాయి. ఏదో ఒక రోగరూపంలో అనుభవిస్తారు. పెద్దవైతే జన్మాంతరాలతో తరుముకొని వస్తాయి. తెలిసి చేసిన పాపాలకు శిక్షలు చాలా పెద్దవిగా వుంటాయి.

ఒకప్పుడు మిథిలా నగరంలో జనకవంశానికి చెందిన విపశ్చితుడు అనే రాజు వుండేవాడు. అతడు మహా ధర్మాత్ముడు. తన రాజ్యంలో వున్న ప్రజలందరినీ తన బిడ్డలలాగా చూసుకునేవాడు. అయితే అతను మరణించిన తరువాత యమదూతలు వచ్చి నరకానికి తీసుకునిపోయారు. అప్పుడు రాజు ఆశ్చర్యంతో యమధర్మరాజుని చూసి.. ‘‘రాజా! నేను చేసిన పాపాలేమి? నన్ను నరకానికి ఎందుకు తీసుకువచ్చారు?’’ అని ప్రశ్నిస్తాడు.

దానికి సమాధానంగా యమధర్మరాజు.. ‘‘రాజా! నువ్వు మహా ధర్మాత్ముడివే! దానికి ఎటువంటి సందేహమూ లేదు. కాని నువ్వు నీ భార్యలిద్దరిలో ఒకదానినే మాత్రమే స్వీకరించి.. మరొకదానిని వదిలివేశావు. అందువల్ల నీకు పాపం చుట్టుకుంది. దానివల్లే నీకు నరకలోక దర్శనం కలిగింది’’ అని చెప్పి.. స్వర్గలోకానికి పంపిస్తారు.’’

కాబట్టి తెలియకుండా చేసిన తప్పు తప్పేకాని ఒప్పుకాదు’’ అని ఆ జ్ఞానపక్షులు జైమిని అడిగిన సందేహానికి సమాధానంగా ఒక కథను వివరించారు.

జైమిని తన మనసులో వున్న మరికొన్ని సందేహాల గురించి జ్ఞానపక్షులకు అడుగుతూ ఇలా అంటాడు... ‘‘ఓ జ్ఞాన మహాత్ములారా! పాతివ్రత్య మహిహత్యం ఎటువంటి వివరించండి’’ అని అనగా.. జ్ఞానపక్షులు ఒక కథను విశదీకరిస్తాయి.

పతివ్రత మహిత్యం - సుమతి కథ :

పూర్వం ప్రతిష్టానపురంలో కౌశికుడు అనే బ్రాహ్మణుడు వుండేవాడు. అతని అదృష్టం కొద్దీ సుమతి భార్యగా లభించింది. కౌశికుడు ఎంత కోపిష్టివాడో.. అతని భార్య అయిన సుమతి అంత శాంత స్వభావం కలది. వాడు నిత్యం బయట తిరుగుతూ, ఇతర స్త్రీల పట్ల అధికంగా వ్యమోహం కలిగి వున్నవాడు. దానికి విరుద్ధంగా సుమతీ మహాపతివ్రత. కౌశికుడు ఎక్కువగా చెడు తిరుగుళ్లు తిరగడంతో కుష్టురోగం తెచ్చుకుంటాడు. అయినప్పటికీ సుమతి మాత్రం అతనిని వదలకుండా దైవంలాగే సేవ చేసుకుంటూ తన జీవితాన్ని గడుపుతుంటుంది.

ఇలా వుండగా... కౌశికుడు ఒకనాడు వేశ్యకాంతను చూస్తాడు. తనను ఆమె దగ్గరకు తీసుకునివెళ్లాల్సిందిగా నిత్యం తన భార్యను వేధించేవాడు. దాంతో సుమతి ఒకరోజు వేశ్య దగ్గరకు వెళ్లి వేశ్యను ఒప్పిస్తుంది. అప్పుడు సుమతి తన భర్తను భుజాలపై ఎక్కించుకుని వేశ్య ఇంటిని తీసుకుపోతుండగా... దారిలో ఒకచోట కౌశికుని కాలు చీకటిలో ఒకరికి తగులుతుంది. అయితే కాలు తగిలిన వ్యక్తి ఒక మాండ్యముని. అతడు చిన్నప్పుడు తూనీగలకు పుల్లలు గుచ్చి చంపేవాడు.

మాండ్యమునికి కౌశికుడి కాలు తగలడంతో.. అతనిని వెంటనే శిక్షించవలసిందిగా రాజును కోరుతాడు. దాంతో రాజు అతనిని కొరత వేయించాడు. అప్పుడు కౌశికుని కాలు ఆ కొర్రమీద వున్న మాండ్యమునికి మళ్లీ తగిలింది. దీంతో మాండ్యముని కోపంతో.. ‘‘నన్ను బాధించిన నీ శిరస్సు సూర్యోదయం అయ్యేలోపు వెయ్యి ముక్కలు అవ్వాలి’’ అని శపిస్తాడు.

అక్కడే వున్న సుమతి, మాండ్యముని శాపం విని.. ‘‘నా భర్త చనిపోకుండా వుండాలంటే అసలు సూర్యోదయమే కాకుండా ఆగిపోవలెను’’ అని కోరుకుంటుంది. ఆమె కోరిక నెరవేరి సూర్యోదయం కాకుండా అలాగే వుండిపోతుంది. లోకమంతటా ఒక్కసారిగా తలక్రిందులు అయిపోతుంది.

అప్పుడు బ్రహ్మాది దేవతలు.. ‘‘తల్లీ! సూర్యోదయం కాకపోవడం వల్ల లోకాలన్ని తల్లడిల్లుతున్నాయి. నీ భర్త చనిపోకుండా మేము అతనిని రక్షించి, ఆరోగ్యవంతుణ్ణి, సుగుణవంతుణ్ణి చేస్తాం’’ అని చెబుతారు. దాంతో సుమతి తన శాపాన్ని ఉపసంహరించుకుని.. సూర్యోదయం కావాల్సిందిగా అనుమతించింది.

అలా సూర్యోదయం కాగానే కౌశికుడు మరణిస్తాడు. వెంటనే అనసూయ అక్కడికి చేరుకుని అతనిని పునర్జీవితున్ని చేస్తుంది. దాంతో అతడు నవమన్మథుడుగా మారి.. భార్యతో కలిసి బ్రహ్మాదిదేవతలను స్తుతించడం మొదలుపెట్టాడు. పాతివ్రత్యము అంతటి శక్తివంతమైంది’’ అంటూ జ్ఞానపక్షలు పవిత్రత గురించి జైమినికి వివరిస్తాయి.

దత్తాత్రేయుడు :

పూర్వం జంభాసురుడు అనే మహాబలవంతుడైన రాక్షసుడు స్వర్గంమీద దండయాత్రకు వస్తాడు. అప్పుడు దేవతలకు, రాక్షసులకు పెద్ద యుద్ధం జరుగుతుంది. అందులో దేవతలు ఓడిపోతారు. దాంతో దేవేంద్రుడు తన గురువైన బృహస్పతి దగ్గరకు వెళ్లి సలహా కోరుకుంటాడు. బృహస్పతి ఇచ్చిన సలహా మేరకు దత్తాత్రేయుని దగ్గరకు దేవేంద్రుడు చేరుకుంటాడు.

ఇంద్రుడు, దత్తాత్రేయుని భక్తశ్రద్ధలతో సేవించగా.. అతను ప్రసన్నుడై.. ‘‘దేవేంద్రా! నీకేం వరం కావాలో కోరుకో’’ అని చెప్పాడు. దేవేంద్రుడు.. ‘‘స్వామీ! జంభాసురుడు నా స్వర్గాన్ని ఆక్రమించుకున్నాడు. నా పరిస్థితి చాలా దయనీయంగా వుంది. నా రాజ్యం నాకు తిరిగి వచ్చేలా అనుగ్రహించు’’ అని కోరుకుంటాడు. అప్పుడు దత్తాత్రేయుడు, ఇంద్రునితో.. ‘‘నువ్వు ఎలాగైనా ఆ జంభాసురుడిని నా ఆశ్రమం దగ్గరకు వచ్చేటట్లు చేయు. ఆ తరువాత విషయాలన్నీ నేను చక్కబెడతాను’’ అని చెబుతాడు.

ఇంద్రుడు మళ్లీ జంభాసురుడిని యుద్ధం చేయడానికి పిలుస్తాడు. ఆ యుద్ధంలో ఇంద్రుడు, వెనక్కు తగ్గినట్లుగా నటించి.. మెల్లగా అతనిని దత్తాత్రేయ ఆశ్రమానికి తీసుకుని వెళతాడు. ఆ సమయంలో లక్ష్మీదేవి కూడా దత్తాత్రేయుని పక్కనే వుంటుంది. లక్ష్మీని చూసిన జంభాసురుడు.. మోహంతో యుద్ధాన్ని వదిలిపెట్టి.. ఆమెను ఒక తట్టలో పెట్టి, తలమీద పెట్టుకుని అక్కడి నుంచి పారిపోతాడు.

అప్పుడు దత్తాత్రేయుడు, ఇంద్రునిని పిలిచి.. ‘‘నువ్వు ఇప్పుడు అతని మీద దండెత్తు. విజయం నీకే దక్కుతుంది’’ అని అంటాడు. అలాగే.. ‘‘దేవేంద్రా! ఇప్పుడు లక్ష్మీ రాక్షసుల తలమీద వుంది కాబట్టి వారికి అది దౌర్భాగ్యసూచకం. ఇప్పుడే నీకు విజయం కలిగే అవకాశం వుంది. త్వరగా వెళ్లు’’ అని అంటాడు. దానికి ఇంద్రుడు లక్ష్మీనివాస స్థానం ఎక్కడుందో తెలుపుమని ప్రార్థిస్తాడు.

దత్తాత్రేయుడు, ఇంద్రునితో.. ‘‘మహాలక్ష్మీ పాదాల దగ్గర వుంటే ఐశ్రర్యాలు కలుగుతాయి. సంఘాలు (పిక్కలు) మధ్య వుంటే ధనవస్త్రాది లాభాలు కలుగుతాయి. గుహ్యాస్థానంలో వుంటే మంచి భార్య, స్త్రీలకు మంచి భర్త లభిస్తాడు. తొడలమీద వుంటే సంతానభాగ్యం కలుగుతుంది. హృదయంలో వుంటే కోరికకోరికలు నెరవేరుతాయి. కంఠం దగ్గరుంటే కనకమణిభూషణాది సంపదలు, ముఖం దగ్గరుంటే విద్యాపాండిత్యంతోపాటు కవితా పటుత్వం కూడా కలుగుతుందని చెబుతాడు.

అలాగే లక్ష్మీదేవి శిరస్సు మీద వుంటే సకలదారిద్ర్యాలు కలిగి, ఆయువు, భోగభాగ్యాలు నశిస్తాయి. ఇప్పుడు లక్ష్మీ రాక్షసుల శిరస్సుపై వుంది కాబట్టి వారికి అపజయం తధ్యం. నీకు జయం కలుగుతుంది. వెంటనే యుద్ధప్రయత్నాలు చేసి విజయం సాధించి, స్వర్గ సింహాసనాన్ని అధిష్టించు’’ అని దీవిస్తాడు. ఇంద్రుడు, దత్తాత్రేయుని అనుగ్రమంతో రాక్షసులను ఓడించి, స్వర్గసింహాసనాన్ని అధిష్టిస్తాడు.

అర్జునుని కథ :

పూర్వం గర్గుడు, అర్జునుని చూసి ఇలా అంటాడు.. ‘‘నువ్వు నా ఆశ్రమానికి వెళ్లి.. అక్కడ తపస్సు చేసుకుంటూ వుండు. దత్తాత్రేయునిని భక్తిశ్రద్ధలతో సేవిస్తూ వుండు. ఒకవేళ అతడు ఏమైనా చేస్తే.. దానికి నువ్వు సమాధానం గాని, కదలడం గాని చేయకుండా నీ పని చేసుకుంటూ వుండు’’ అని చెబుతాడు.

ఒకనాడు దత్తాత్రేయుడు అర్జునుని చూసి.. ‘‘నువ్వు నా ఆశ్రమానికి ఎందుకు వచ్చావు? నీవల్ల నా తపస్సు పాడయిపోయింది’’ అంటూ.. తన చేతిదండంతో కొడతాడు. అర్జునుడు ఆ దెబ్బను సహించి, తన పని చేసుకుంటూ వుండేవాడు.

అతని భక్తశ్రద్ధలను మెచ్చుకుని దత్తాత్రేయుడు కరుణించి.. ‘‘అర్జునా! నీ తపంతో నేను ప్రసన్నుడయ్యాను. ఏ వరం కావాలో కోరుకో’’ అని అంటాడు. అర్జునుడు.. ‘‘నా రాజ్యపరిపాలనలో అధర్మం లేకుండా, సర్వశత్రువులతో జయించే విధంగా అనుగ్రహించు’’ అని కోరుకుంటాడు.

దత్తాత్రేయుడు, అర్జునుడు కోరుకున్న వరాలన్ని ఇచ్చి.. ‘‘రాజా! నువ్వు శత్రువులను జయించడానికి వేయి బాహువులను, అణిమాది అష్టసిద్ధులను అనుగ్రహిస్తున్నావు. సుఖంగా రాజ్యపాలన చేసుకో’’ అని దీవించాడు. అర్జునుడు తిరిగి తన రాజ్యానికి చేరుకుని, పట్టాభిషిక్తుడై రాజ్యపాలన చేసుకుంటూ వుండేవాడు.’’

ఈ విధంగా జ్ఞానపక్షలు దత్తాత్రేయుని కథని జైమినికి వివరిస్తారు.


కువలయాశ్వుడు :

పూర్వం శత్రుజిత్తు అనే పేరుగల రాజు వుండేవాడు. అతనికి ఋతధ్వజుడు అనే కొడుకు వుండేవాడు. ఒకనాడు గాలమహాముని తపస్సు చేసుకొంటుండగా.. పాతాళకేతువు అనే రాక్షసుడు ఆయన తపస్సును భగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. అప్పుడు మహాముని, ఋతధ్వజునితో.. ‘‘తన తపస్సుకు భంగం కలిగిస్తున్న రాక్షసుని నుంచి రక్షించు’’ అని కోరుకుంటాడు. అలాగే తన తపశ్శక్తితో ఒక అద్భుతమైన గుర్రాన్ని సృష్టించి.. ‘‘దీని పేరు కువలం. ఇది త్రిలోకాలలో ఎక్కడైనా విహరించగలదు. దీనికి ఎటువంటి అడ్డంకులు వుండవు. దీనిని తీసుకునివెళ్లి ఆ రాక్షసునితో పోరాడి జయించు’’ అని ఆ గుర్రాన్ని తనకిస్తాడు. కువలయం అనే పేరుగల గుర్రాన్ని ఉపయోగించడం వల్ల ఋతధ్వజునికి ‘‘కువలయాశ్వుడు’’ అనే పేరు వచ్చింది.

రాజు గుర్రమెక్కి ఆశ్రమానికి వెళ్లగా.. రాక్షసుడు అడవి పంది రూపంలో వచ్చి మునీంద్రునిని భాదిస్తుంటాడు. అది చూసిన రాజు ఒక బాణంతో కొట్టగా.. ఆ రాక్షసుడు ఒక బిలంలో దూరిపోతాడు. వారిద్దరి మధ్య పోరాటం జరుగుతూ కువలయాశ్వుడు, ఆ రాక్షసునితోపాటు పాతాళానికి వెళ్లిపోతాడు. అక్కడ ఒక ఒపురూపమైన సౌందర్యవతిని కువలయాశ్వుడు చూస్తాడు. ఆమె కూడా ఇతనిని చూసి మోహిస్తుంది. ఆమెతో వున్న చెలికెత్తె ద్వారా.. ఆమె పేరు మదాలస అని, పాతాళకేతు ఆమెను ఎత్తుకొచ్చి వివాహం చేసుకుంటున్నాడని తెలుసుకుంటాడు. ఆ అందగత్తె తనను ప్రేమిస్తోందని గ్రహించి.. ఆమెను గుర్రం మీద ఎక్కించుకుని వెళుతుండగా ఆ రాక్షసుడు యుద్ధానికి దిగుతాడు. కువలయాశ్వుడు తన దివ్యాస్త్రంతో ఆ రాక్షసుడ్ని సంహరించి, మదాలసను తనతోపాటు నగరానికి తీసుకెళతాడు. ఆమెను వివాహం చేసుకుని సుఖంగా జీవిస్తుంటాడు.

మరోవైపు పాతాళకేతువు తమ్ముడైన కేతువు.. సజ్జనులను బాధిస్తున్నాడని తెలిసి కువలయాశ్వుడు అతనిని సంహరించడానికి బయలుదేరుతాడు. కేతువు ఒక ముని రూపంలో వచ్చి.. ‘‘రాజా! వరుణుని గురించి నేను ఒక యాగం చేస్తున్నాను. నేను వచ్చేవరకు ఈ ఆశ్రమాన్ని జాగ్రత్తగా చూసుకో. నీ కంఠాభరణాన్ని నాకివ్వు’’ అని తీసుకుంటాడు. తరువాత రాక్షసుడు, కువలయాశ్వుని నగరానికి వెళ్లి అక్కడున్న వృద్ధరాజుతో.. ‘‘రాజా! నీ కుమారుడు రాక్షసులతో యుద్ధం చేస్తూ మరణించాడు. ఇదిగో, అతని కంఠాభరణం’’ అని చెబుతాడు. మదాలస ఆ మాట వినగానే తన ప్రాణాలను వదులుకుంటుంది. రాక్షసుడు తిరిగి ఆశ్రమానికి వస్తాడు. కువలయాశ్వుడు తన నగరానికి వెళ్లి.. తన భార్య చనిపోయిందని తెలుసుకుని తీవ్రంగా బాధపడుతూ వుండిపోతాడు.

తరువాత నాగరాజు కుమారులు భూసంచారం కోసం భూమికి వస్తారు. అక్కడ బాధతో క్రుంగిపోతున్న కువలయాశ్వునిని చూసి, వారు ఓదార్చి అతనికి మిత్రులవుతారు. తరుచుగా వారు రాకపోకలు జరుపుతుండగా.. తండ్రియైన అశ్వతరుడు వారిని చూసి.. ‘‘మీరు ఎక్కడికి వెళుతున్నారు’’ అని ప్రశ్నిస్తాడు. అప్పుడు వాళ్లు కువలయాశ్వుని గురించి చెప్పి, అతని విచారగాధను వివరిస్తారు. అప్పుడు నాగరాజు జాలిపడి, కువలయాశ్వునిని పిలిపిస్తాడు. తన పడగలలో నుంచి మదాలస రూపంతో వున్న యువతిని బయటకు తీసి, అతనికి వివాహం చేస్తాడు.

ఈ విధంగా సృష్టించబడిన మదాలస.. సకల విద్యాలు నేర్చిన మహాపండితురాలు. రాజనీతిశాస్త్రం కూడా ఆమె నేర్చుకుని వుంటుంది. కొన్నాళ్ల తరువాత ఆమెకు నలుగురు కుమారులు పుడతారు. మొదటి ముగ్గురు కుమారులు తమ తల్లి అయిన మదాలస దగ్గర జీవబ్రహ్మతత్త్వం గురించి తెలుసుకుని విరాగులై యోగనిష్టాలను అవలంభించి.. ఇంటి నుంచి వెళ్లిపోతారు. నాలుగవవాడైన అలర్కుడు.. కువలాయశ్వుని రాజ్యానికి రాజు అవుతాడు. అతడు కూడా తన తల్లి దగ్గర అనేక ధర్మాలు, రాజనీతి గురించి అడిగి తెలుసుకుంటాడు.

అలర్కునికి తల్లి మదాలస చేసిన ధర్మబోధ :

మదాలస పట్టాభిషిక్తుడైన తన కుమారుడు అలర్కునిని చూసి.. ‘‘కుమారా! నువ్వు రాజ్యాభిషక్తుడివయ్యావు. రాజయినవాడు ధర్మాలు తెలుసుకుని.. వాటి ప్రకారం రాజ్యాన్ని పాలించాలి’’ అని చెప్పగా.. అలర్కుడు.. ‘‘అమ్మా! నాకు రాజనీతి ధర్మాలు, వర్ణాశ్రమ ధర్మాల గురించి వివరించి చెప్పండి’’ అని వినయంగా అడుగుతాడు. అప్పుడు ఆమె అలర్కునికి ఈ విధంగా వివరిస్తుంది.

‘‘కుమారా! స్త్రీ లోలత్వము, మద్యపానం, జూదం, వేట, కఠినత్వం, దొంగతనం, పరనింద అనేవి ఏడు సప్త వ్యసనాలు. రాజు అనేవాడు వాటికి లోబడి వుండకూడదు. రాజు తన బంధువులను కూడా నమ్మకూడదు. మంత్రులను, భృత్యులను వారిస్వభావాలలోని గుణదోషాలను తెలుసుకుని నియమించుకోవాలి. రాజులు గూఢాచారులను నియమించుకుంచుకోవాలి వారివల్ల రాజ్యంలో జరుగుతున్న ప్రతి విసయం తెలుసుకుని, ఎప్పుడు ఏ చర్య అవసరమో ఆ చర్యను తీసుకోవాలి. రాజులకు గూఢాచారులే కన్నులు అన్నమాటను ఎప్పటికీ మరువకూడదు. అవసరమైనప్పుడు శత్రువులతో కూడా స్నేహం చేయాలి. సామదానబేధ దండోపాయాలు సయమోచితంగా ప్రయోగించే నేర్పు కలిగి వుండాలి’’.

‘‘స్థాన, వృద్ధి, క్షయ, సంధి విగ్రహనాదుల గురించి చక్కని పరిజ్ఞానం కలిగి వుండాలి. ప్రజా సంక్షేమం కోసం ఆహారపదార్థాలను సేకరించే స్వభావాన్ని కలిగి వుండాలి. అవసరమైనప్పుడు రాజు తన శత్రువులను తగిన ఉపాయాలను తీసుకుని వారున్న ప్రాంతాన్ని ధ్వంసం చేసే కీటకవృత్తిని అవలంభించుకోవాలి. ముఖ్యంగా రాజు కామక్రోధాలనే అరిషడ్వర్గానికి వశుడై వుండకూడదు. ఇంద్రియాలమీద నిగ్రమం కలిగినవానికి ఎక్కడ అపజయం వుండదు. ఈతిబాధలు లేకుండా ప్రజాపరిపాలన చేయడటమే రాజు కర్తవ్యం’’ అంటూ మాదలస తన కుమారుడైన అలర్కునికి రాజు పాలన గురించి వివరిస్తుంది.


ఈతిబాధలు :

అతివృష్టి, అనావృష్టి, ఎలుకలు, చిలుకలు, మిడుతలు, రాజులు అతిమీపంలో వుండటాన్నే ఈతిబాధలు అంటారు. పూర్వం కొందరు కామక్రోధులకు వశమైపోవడం వల్ల వారు ప్రజలను సరిగ్గా పాలించలేకపోయారు. అందువల్లే రాజైనా వానికి ఈ నియమాలు తప్పకుండా వుండాల్సిందే!

ఇంద్రుడు భూలోకంలో వర్షాలను కురిపించి, పంటలను వృద్ధిచేసి, ప్రజలు చేసే యజ్ఞయాగాదుల ద్వారా తాను కూడా తృప్తి పొందేవాడు. అదేవిధంగా రాజులు కూడా ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించి, వారినుంచి పన్నులను గ్రహించి ఆదరణాలను పొందేవారు. అయితే తీసుకునే పన్నులు కూడా ప్రజలకు ఎటువంటి బాధలు కలిగించకుండా వుండేటట్లు చూసుకోవాలి.

సూర్యుడు.. సుమారు ఎనిమిది మాసాలవరకు మహీమండలంలో వున్న జలాన్ని తన కిరణాలతో పీల్చేస్తాడు. తరువాత ఆ పీల్చిన నీటిని నాలుగుమాసాలవరకు వర్షరూపంలో భూమండలానికి అందిస్తాడు. అలాగే రాజుకూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా పన్నులను గ్రహించి.. తిరిగి వారికే క్షేమంగా ఖర్చు పెట్టేలా చూసుకోవాలి. వాయువు అన్ని జీవరాసులకు సమానంగా ప్రాణవాయువును అందించినట్లే.. రాజు సర్వప్రజలకు ఒకేదృష్టితో ఆదరించాలి.

యమలోకంలో వున్న యముడు కూడా ఏ జీవి ఏయే పాపాలు చేస్తుందో.. వారికి తగిన దండనను విధిస్తాడు. బంధుత్వ, సన్నిహిత వ్యవహారాలు వంటివి తేడా లేకుండా అందరికీ సమానంగా దండన ఇస్తాడు. అలాగే రాజు కూడా అనవసరవారి మీద నిందలు మోపనీయకుండా జాగ్రత్తలు తీసుకుంటూ.. తప్పు చేసినవారికి దండన విధించాలి.

ప్రజలు పుణ్యకార్యాలు చేస్తే.. అందులో ఆరవభాగం రాజుకు చెందుతుంది. పాపాలను చేస్తే అందులో సమభాగం రాజుకు చెందుతుంది. కాబట్టి రాజు జాగ్రత్తగా వుంటూ.. తన పరిపాలన చూసుకోవాలి. నిండు చంద్రునిని చూసి ప్రజలు ఏ విధంగా సంతోషపడతారో.. అదేవిధంగా రాజును చూసి కూడా ప్రజలు సంతోషపడేలా ఆనందింపచేయాలి. ప్రజలను పట్టించుకోని రాజు నరకానికి పంపబడతాడు.

ఈవిధంగా మదాలస ఈతిబాధల గురించి, రాజా ధర్మాల గురించి తన కుమారుడు అలర్కునకు వినిపిస్తుండగా.. అలర్కుడు.. ‘‘అమ్మా! వర్ణాశ్రమ ధర్మాల గురించి కూడా వివరించండి’’ అని అడుగుతాడు.

వర్ణాశ్రమ ధర్మాలు :

భగవంతుని ద్వారా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే నాలుగు వర్ణాలు సృష్టించబడ్డాయి. బ్రాహ్మణుడు ఎప్పుడూ అధ్యయనం, అధ్యాపనం, యజనం, దానం, ప్రతిగ్రహనం అనే కర్మాలను నిత్యం ఆచరిస్తూనే వుండాలి. ఇందులో అధ్యాపనం (చదువు చెప్పడం), ప్రతిగ్రహణం (యోగ్యమైన వస్తువులు దానమిచ్చినప్పుడు పుచ్చుకోవడం) అనేవి బ్రాహ్మణులకు జీవనోపాధిగా పనికొస్తాయి. అంతేకాదు.. నిత్యాగ్రిహోత్రం, తపస్సు, శుచిత్వం, శాంతం అనేవి బ్రాహ్మణునిలో వుండాలి. అహంకారం అనేది ఎన్నటికీ పనికిరాదు.

క్షత్రియుడు వేదాధ్యాయం, యజ్ఞయాగాదులు చేయడం ముఖ్యం. అలాగే అర్హులైనవారికి దానం చేయడం, విహితమైన పనులు చేయాలి. రాజోచితమైన విద్యలు నేర్చుకుని, ధర్మరక్షణ, ప్రజాపాలన చేయడం వీరి కర్తవ్యం. వైశ్యులు కూడ వేదాలు అధ్యయనం చేసి, యజ్ఞాలు, దానాలు వంటివి చేస్తూ.. వర్తకం, వ్యవసాయం, పశుపోషణ కూడా చేయడం వీరిముందున్న ప్రాథమిక లక్ష్యం. శూద్రులు మాత్రం.. పైన చెప్పిన మూడు వర్ణాలవారుచేసే కార్యాలలో సహకరిస్తూ.. వారికి శక్తియుక్తులు అందించాలి.

ఆశ్రమాలు :

బ్రహ్మచర్యం, గార్హస్థ్యము, వానప్రస్థము, సన్యాసం అనేవి నాలుగు ఆశ్రమాలు. బ్రాహ్మణ, క్షత్రియులకు బ్రహ్మచర్యం, గార్హస్థ్య, వానప్రస్థములు మూడు సమానంగా వుంటాయి. సన్యాసం తప్ప మిగిలిన మూడు శూద్రులకు ఆచరణీయమములే.

బ్రహ్మచర్యం : గురుకులవాసం చేసి ఏ ఇతర ఆలోచనలు లేకుండా విద్యాభ్యాసం చేయడం, నియమనిబంధనలతో వుంటూ వాటిని పాటించడం వంటివి బ్రహ్మచర్యంలో జరుగుతుంది.

గార్హస్థ్యము : విద్యాభ్యాసం పూర్తయిన తరువాత తనకు నచ్చిన కన్యతో వివాహం చేసుకుని గృహస్థుడు కావాలి. మనుష్యయజ్ఞం, భూతయజ్ఞం, దేవయజ్ఞం, పితృయజ్ఞం, బ్రహ్మయజ్ఞం వంటివి ఐదు మహాయజ్ఞాలను ఆచరిస్తూ వారిని సంతోషపరచాలి. ఇంటికి వచ్చిన అతిథులను, బంధవులను ఆదరించి, సంతోషపరచాలి. గోసేవ చేయాలి. స్నానసంధ్యావందనాలు, అగ్నిహోత్రాలు, పితృతర్పణాలను నిత్య కర్మలుగా చేస్తూ వుండాలి. పుత్రి, పుత్రికలకు విద్యాభ్యాసం చేయించి.. వారికి వివాహాలు జరిపించాలి.

వారప్రస్థము : ఇంట్లో వున్న బాధ్యతలన్నీ తన కొడుకుకు అప్పగించి, ఇతర చింతనలు పెట్టుకోకుండా కేవలం భగధ్యానం చేసుకుంటూ ప్రశాంతంగా వుండటమే ఈ ఆశ్రమంలో చేయాల్సిన పని.

సన్యాసం : ఇంద్రియనిగ్రహాలు కలిగిన ప్రాపంచిక భోగాలకు వికర్తుడై.. కేవలం భగవంతునిలో చేరడానికి సాధన చేయడం సన్యాసి కర్తవ్యం. ఇంట్లో ఒక్కరోజు కూడా వుండకుండా ప్రతిరోజూ భిక్షాటన చేస్తుండాలి. అహంకారం గల సన్యాసి బ్రహ్మపదాన్ని చేరుకోలేడు.

No comments:

Post a Comment