Sunday, April 19, 2015

శివుని ‘ఆత్మలింగ’ క్షేత్రం

మనదేశంలోని అత్యంత ప్రాచీనమైన శివ క్షేత్రాలలో గోకర్ణం ఒకటి. కర్ణక్షేత్రానికి పడమట అరేబియా సముద్రం, తూర్పున సిద్ధేశ్వరక్షేత్రం, ఉత్తరాన గంగావళినది, దక్షిణాన అగనాశిని నది ఉన్నాయి. ఈ పుణ్యక్షేత్రం గురించి రామాయణం, మహాభారతాలలో చూడలం. ఇక స్కాందపురాణంలో ఒక అధ్యాయమే ఈ క్షేత్ర ప్రాముఖ్యాన్ని వివరిస్తోంది.

పురాణ కథ :

పూర్వం రావణాసురుడు శివుని కోసం ఘోరమైన తపస్సు చేస్తాడు. రావణుడి తపస్సు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఒక కోరిక కోరుకోమ్మని చెబుతాడ. దాంతో రావణాసురుడు ఒక ఆత్మలింగం కావాలని కోరాడు. అయితే శివుడు ఆత్మలింగాన్ని నిబంధన ప్రకారం రావణాసురుడికి ఇచ్చాడు. ఆ నిబంధన ఏమిటంటే.. రావణాసురుడు లంకకు వెళ్లేంతవరకు ఆత్మలింగాన్ని నేలపై వుంచకూడదు.

ఈ నిబంధనను ఒప్పుకుని ఆత్మలింగాన్ని తీసుకొని రావణాసురుడు లంకదారి పట్టాడు. కానీ ఆత్మలింగం రావణాసురుడి దగ్గర వుంటే లోకాలన్నీ అల్లకల్లోమైపోతాయని కలత చెందిన దేవతలు... తమను కాపాడవలసిందంటూ విష్ణుమూర్తి, బ్రహ్మ, విఘ్నేశ్వర తదితర దేవుళ్లను వేడుకుంటారు. అప్పుడు గణపతి చిన్నపిల్లాడి వేషంలో రావణాసురుడి మార్గమధ్యంలో చేరుకుంటాడు. అదే సమయంలో విష్ణుమూర్తి తన చక్రయుధాన్ని ఉపయోగించి సూర్యుడికి అడ్డంగా పెడతాడు. దీంతో సాయంత్రం అవుతుందనుకున్న రావణాసురుడు సంధ్యావందనాన్ని నిర్వర్తించాలనుకుంటాడు. కానీ అతని చేతిలో వున్న శివలింగాన్ని కింద పెట్టకూడదు కాబట్టి ఆలోచనలో పడతాడు.

అప్పుడు అదే మార్గంలో బాలరూపంలో వచ్చిన వినాయకుడ్ని చూసి రావణాసురుడు తన ఆత్మలింగాన్ని పట్టుకోమని చెబుతాడు. అయితే.. అందుకు ఒప్పుకున్న బాలవినాయకుడు.. తనని కేవలం మూడుసార్లు మాత్రమే పిలుస్తానని.. అప్పటికీ రాకపోతే ఆత్మలింగాన్ని నేలపై పెట్టేస్తానని చెబుతాడు. వేరేదారిలేక రావణాసురుడు వినాయకుని షరతును అంగీకరిస్తాడు. ఆ తరువాత రావణాసురుడు సంధ్యవందనం చేసుకోవడానికి వెళతాడు.

అదే అదునుగా తీసుకొని, రావణాసురుడికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వినాయకుడు గబగబా మూడుసార్లు పిలిచి, ఆత్మలింగాన్ని నేలపై పెట్టేస్తాడు. ఆ సంఘటనకు గోపగించుకున్న రావణాసురుడు బాలవినాయకునిపై ఒక మొట్టికాయ వేస్తాడు. ఫలితంగా గణపతి తలపై నొక్కు ఏర్పడుతుంది. ఆ తరువాత ఆత్మలింగాన్ని పైకి లేపడానికి రావణాసురుడు ఎంతో ప్రయత్నిస్తాడు... కాని ఫలితం లభించదు.

మొదటగా ఆత్మలింగాన్ని తెచ్చినపెట్టెను ఉత్తరంవైపు నుండి లాగుతాడు. అది విసురుగా వెళ్లి దూరంగా పడుతుంది. అక్కడ సజ్జేశ్వర లింగం వెలుస్తుంది. పెట్టె మూతపడిన చోట గుణేశ్వర లింగం ఉద్భవిస్తుంది. లింగంపై కప్పబడిన వస్త్రం పడిన చోట మురుడేశ్వర లింగం వెలుస్తుంది. పెట్టెను కట్టిన (తాళ్ళు) పడినచోట ధారేశ్వరలింగం ఉద్భవిస్తుంది. ఈ లింగాల మధ్య స్వామివారి ఆత్మలింగం మహాబలేశ్వరలింగంగా గోకర్ణంలో వెలుస్తుంది. ఆత్మలింగంతో ముడిపడిన ఐదుక్షేత్రాలను శైవ పంచక్షేత్రాలని పిలుచుకుంటుంటారు.

పురాతన ప్రాశస్త్యం :

కాళిదాసు, తన 'రఘువంశం' కావ్యంలో ఈ క్షేత్రం గురించి ప్రస్తావన చేసాడు. క్రీ.శ. ఏడవ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన హర్షవర్ధనుడు 'నాగానంద' కావ్యంలో ఈ క్షేత్రం గురించి వివరించాడు. కదంబ చక్రవర్తి మయూరశర్మ ఈ ఆలయంలో నిత్యపూజాదికాలైన ఏర్పాట్లు చేసాడనీ, చెన్నమ్మాజీ, ఆమె కుమారుడు సోమశేఖర నాయకుడు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నప్పుడు హళసునాడు - కుందపురానికి చెందిన విశ్వేశ్వరాయుడు చంద్రశాల, నందిమంటపాలను నిర్మించాడని శసనాల ద్వారా తెలుస్తోంది. అనంతరం గోకర్ణం క్షేత్రాన్ని విజయనగర రాజులు అభివృద్ధి చేసారు.

కోటితీర్థం :

గోకర్ణంలో ప్రధానాలయం శ్రీ మహాబలేశ్వరాలయం. ఈ ఆలయంలో స్వామిని దర్శించుకునే ముందు భక్తులు కోటితీర్థంలో స్నానం చేస్తారు. కోటితీర్థంలో స్నానం చేస్తే సమస్తరోగాలు నయమవుతాయని ప్రతీతి. కోటితీర్థంలో స్నానం చేసిన తరువాత భక్తులంతా ప్రక్కనున్న సముద్రంలో స్నానం చేస్తారు. ఆలయానికి ప్రక్కనున్న అరేబియా సముద్రంలో స్నానం చేస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. కోటితీర్థానికి దక్షిణం వైపు అగస్త్యులవారిచే ప్రతిష్ఠింప బడిన వరటేశ్వరలింగం ఉంది.

మహాబలేశ్వరాలయం :

రావణాసురుడు ఈ శివలింగాన్ని పైకి లాగడానికి ప్రయత్నం చేయడం వల్ల లింగంపై భాగాన సన్నగా ఉందంటారు. ఈ లింగం కిందివైపు కాస్త వెడల్పుగా, పైన సన్నగా కనబడుతుంటుంది. పైకి ఉండే ఒక రంధ్రంలో వ్రేలును ఉంచినపుడు కిందనున్న లింగం వ్రేలుకి తగులుతుంది. భక్తులు శివలింగం చుట్టూ కూర్చుని పూజలు నిర్వహిస్తారు.

ఇక్కడ పన్నెండు సంవత్సరాల కొకసారి ఒక విశేషమైన కార్యక్రమము జరుగుతుంది. అప్పుడు శివలీంగాన్ని బయటకు తీసి, నిజస్వరూప లింగానికి పూజలు చేస్తారు. ఈ పుష్కర ఉత్సవాలకు దేశవిదేశాల నుండి లక్షలసంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ ఆలయంలో మధ్యాహ్నం పన్నెండున్నర నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు మంగళహారతి పూజలు జరుగుతుంటాయి.

తామ్రగౌరీ ఆలయం :

మహాబలేశ్వర ఆలయప్రాంగణంలో ఉత్తరం వైపున ఈ ఆలయం ఉంది. ఈమె మహాబలేశ్వరుని పత్ని. ఈమె బ్రహ్మదేవుని కుడిచేయినుండి ఉద్భవించిందని చెబుతారు. ఈ దేవి తపస్సు చేసి రుద్రున్ని వివాహం చేసుకుంది. ఈ ఆలయం ఉదయం ఆరుగంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు, సాయంత్రం ఐదుగంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు తెరిచి ఉంటుంది.

మహాగణపతి ఆలయం :

రావణుడు ఆత్మలింగాన్ని తీసుకెళ్తున్నప్పుడు, అతడిని అడ్డుకున్న గణపతి చాతుర్యాన్ని మెచ్చుకుంటాడు. దాంతో పరమశివుడు మహాబలేశ్వరక్షేత్రంలో ముందుగా వినాయకుని దర్శించుకున్న తరువాతే భక్తులు తన సన్నిధికి వస్తారని వరమిచ్చాడు. రావణుడు వేసిన మొట్టికాయకు గుర్తుగా ఈ స్వామి తలపై చిన్న పల్లం కనబడుతుంటుంది. ఈ ఆలయం మహాబలేశ్వర ఆలయానికి తూర్పుదిక్కున ఉంది.

ఇంకా ఈ క్షేత్ర ప్రాంగణంలో భద్రకాళి, కాలభైరవ శ్రీకృష్ణ, నరసింహస్వామి దేవాలయాలున్నాయి. నేత్రాసురుడు అనే రాక్షసుని సంహరించేందుకై, త్రిమూర్తుల శక్తితో భద్రకాళి ఆవిర్భవించారట. అమృతమధనం జరుగుతున్నప్పుడు దేవతలు ఇక్కడకు వచ్చి ఆత్మలింగానికి పూజలు చేయడం వల్ల వారికి అమృతం లభించిందని ప్రతీతి.

No comments:

Post a Comment