Friday, September 7, 2012

రామాయణం - కిష్కింధా కాండ 7


సంపాతి తన తమ్ముడి మరణవార్త విని కన్నీరు కార్చుతూ, ‘‘జటాయువును చంపిన ఆ దుర్మార్గుడు రావణుడి పైన పగ తీర్చుకుందామన్నా నేను ముసలివాణ్ణి, రెక్కలు లేనివాణ్ణి, ఏం చేసేది? వెనక వృత్రాసురుడి వధ జరిగిన రోజుల్లో నేనూ, జటాయువూ పోటీ పడి ఒకరి కన్న ఒకరం వేగంగా ఎగురుతూ ఆకాశంలోకి వెళ్ళాం.
 
మిట్టమధ్యాహ్నపు ఎండ తీక్ష్ణతకు తట్టుకోలేక జటాయువు వివశుడై సోలి పోయూడు. అప్పుడు నేను ప్రేమ కొద్దీ నా రెక్కలు చాచి వాడికి నీడ ఇచ్చాను. దానితో నా రెక్కలు మాడిపోయూయి. నేను సొమ్మసిల్లి ఈ వింధ్యపర్వతం పైన పడ్డాను. తరవాత నాకు నా తమ్ముడి సమాచారమే తెలియలేదు,'' అన్నాడు. ఈ మాట విని అంగదుడు, ‘‘అయ్యూ, నువ్వు జటాయువు అన్నవైతే ఆ రావణుడు ఎక్కడ ఉంటాడో, ఎంత దూరాన ఉంటాడో చెప్పు,'' అన్నాడు.
 
‘‘నాయనా, న్యాయూనికి నేను స్వయంగా రామకార్యం చెయ్యవలసిన వాణ్ణేగాని, ముసలివాణ్ణీ, అశక్తుణ్ణీ కావటంచేత వాక్సహాయమైనా చేస్తాను. రావణుడు సీతను తీసుకునిపోయిన మాట నిజమే. అతడు లంకలో ఉంటాడు. అది ఇక్కడికి నూరామడల దూరాన సముద్ర మధ్యంలో ఉన్నది. లంకలోనే లంకా నగరం ఉన్నది. దాన్ని విశ్వకర్మ బంగారు ద్వారాలతో, బంగారు అరుగులతో, గొప్ప ప్రాకారాలతో నిర్మించాడు. ఆ లంకలోని రావణుడి అంతఃపురంలో సీత రాక్షస స్ర్తీల మధ్య దుఃఖిస్తూ ఉన్నది.

గద్ద జాతివాణ్ణి కావటంచేత ఇక్కడి నుంచే రావణుణ్ణీ, సీతనూ చూడగలుగుతున్నాను. మీ రక్కడికి వెంటనే వెళ్ళి నట్టయితే సీత తప్పక కనబడుతుంది,'' అన్నాడు సంపాతి. అప్పుడు జాంబవంతుడు సంపాతితో, ‘‘అయ్యూ, సీతను రావణుడు ఎత్తుకుపోగా చూసింది ఎవరు?'' అని అడిగాడు. మిగిలిన వానరులు సంపాతి చెప్పే మాటలను వినటానికి ఆసక్తితో ఎదురు చూశారు. ‘‘ఆ కథ చెబుతాను వినండి.
 
నేను కదలలేని వాణ్ణి కావటంచేత నా కొడుకు సుపార్శ్వుడు రోజూ నియమం తప్పకుండా నాకు ఆహారం తెచ్చి ఇస్తూ ఉంటాడు. అలాటిది వాడు ఒకనాడు వేళమించి, సూర్యాస్తమయం అయినాక రావటమేగాక వట్టి చేతులతో వచ్చాడు. అసలే ఆకలి దహించుకుపోతూ ఉండటంచేత నేను వాణ్ణి బాగా తిట్టాను. నా కోపం పోగొట్టుతూ వాడు జరిగిన సంగతి చెప్పాడు. వాడు నా ఆహారం నిమిత్తం మహేంద్ర పర్వతం వద్ద జంతువులు నడిచే దారికి అడ్డంగా నిలిచి ఉన్నాడట.
 
ఆ సమయంలో నల్లని శరీరం గల వాడొకడు సూర్యోదయంలాగా వెలిగిపోయే ఒక స్ర్తీని తీసుకుపోతూ అటుగా వచ్చాడట. ఆ మగవాణ్ణీ, ఆడదాన్నీ నాకు ఆహారంగా తీసుకు వద్దామని సుపార్శ్వుడు ఆలోచిస్తుండగా ఆ నల్లటివాడు చాలా మంచితనంగా దారి విడవమని కోరాడట.
 
మర్యాదగా అడిగాడుగదా అని నా కొడుకు దారి ఇచ్చాడట. ఈ సంగతి తెలిసి అక్కడి మునులు సుపార్శ్వుడితో, ‘ఇవాళ నువ్వు బతికి బయట పడటం నీ అదృష్టం! నిన్ను దారి అడిగినవాడు మరెవరో కాదు, లంకానగరాన్ని ఏలే రావణుడు. 

వాడు ఎత్తుకు పోతున్నది రాముడి భార్య అయిన సీత!' అని అన్నారట. ఇదంతా జరగటం మూలాన వాడు నాకు వేళకు ఆహారం తీసుకు రాలేక పోయూనని చెప్పాడు,'' అన్నాడు సంపాతి. తరవాత సంపాతి తన తమ్ముడికి ఇన్ని నీళ్ళు విడిచి, స్నానం చేసి ఒక చోట కూర్చున్నాడు. వానరులు అతని చుట్టూ చేరి కూచున్నారు.
 
సంపాతి మళ్ళీ వారితో ఇలా అన్నాడు: ‘‘నేను సూర్యుడి వేడికి రెక్కలు కాలి ఇక్కడ పడిపోయూనని చెప్పాను కాదూ? ఆరు రోజులపాటు నాకు స్పృహలేదు. ఆ తరవాత, నేను పడినది వింధ్య పర్వతం మీద అని తెలుసుకున్నాను. అప్పుడిక్కడ నిశాకర మహర్షి ఆశ్రమం ఉండేది. ఆయన గొప్ప తపస్వి. అదివరకే నేనూ, వ……ూ జటాయువూ ఆ మహర్షిని ఎరుగుదుము.
 
నేను మెల్లిగా కాళ్ళీడ్చుకుంటూ ఆయన ఆశ్రమానికి వచ్చి ఆయన దర్శనం కోసం ఒక చెట్టు కింద నిలిచాను. కొంత సేపటికి ఆ మహర్షి స్నానం చేసి అటుగా వచ్చాడు. ఆయన తిన్నగా ఆశ్రమంలోకి వెళ్ళి, మళ్ళీ వచ్చి నన్ను చూసి నేను వచ్చిన పని అడిగాడు. నా దుస్థితికి కారణం ఏమిటన్నాడు. నన్ను గుర్తించాడు కూడా. నే నాయనతో జరిగినదంతా చెప్పాను. నాకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తున్నదని కూడా ఆయనతో అన్నాను.
 
నాకు దుఃఖం ఆగలేదు. ఆయన కొంతసేపు కళ్ళు మూసి ధ్యాన నిమగ్నుడై, ‘నీకు మళ్ళీ రెక్కలు వస్తాయి, జవసత్వా లేర్పడతాయి. భవిష్యత్తులో దశరథుడనే రాజు పుట్టబోతాడు. అతని కొడుకు భార్యతో అరణ్యవాసం చేయవస్తాడు. వారు జనస్థానంలో ఉండేటప్పుడు రావణుడనే రాక్షసరాజు రాముడి భార్యను అపహరిస్తాడు. ఆమె కోసం వెతకమని రాముడు పంపగా వానరులు నువ్వుండే చోటికి వస్తారు.
 
వారికి నువ్వు సీత సంగతి చెప్పు. నువ్వు ఎక్కడికీ పోలేవు గనక, ఇక్కడే ఉండటం మంచిది,' అన్నాడు. ఇదంతా ఎనిమిది వేల ఏళ్ళనాటి మాట. నాకీ సంగతి చెప్పిన నిశాకరమహర్షి నూరేళ్ళ అనంతరం దేహం చాలించాడు. నా మనసు అయోమయంలో పడిపోయింది. రావణుడు బలశాలి అయితేనేం గాక, ఆ దుర్మార్గుడు సీతను తీసుకుపోవటం నా కొడుకు కళ్ళారా చూశాడని తెలిసినప్పుడు, ‘వాడితో పోరి సీతను విడిపించి ఉండవలసింది,' అని నా కొడుకును మందలించాను.

నా తమ్ముడు ప్రాణాలు విడిచాడు. నా కొడుకు ఏమీ చేయనే లేదు. రావణుడు మహాపరాక్రమవంతు డనటానికి సందేహం లేదు. కాని మీరు తక్కువవాళ్ళు కారు. సుగ్రీవుడు సరి అయిన వాళ్ళనే ఎంచి పంపాడు. మీరు వెళ్ళినట్టయితే సీత తప్పక కనిపిస్తుంది. తరవాత రామలక్ష్మణుల బాణాలతో ఆ రావణుడు తప్పక చస్తాడు. వాడు నా తమ్ముడైన జటాయువును చంపినందుకు నా పగ కూడా తీరుతుంది.''
 
ఈ విధంగా సంపాతి వానరులతో చెబుతూండగానే అతనికి కొత్త రెక్కలూ, ఈకలూ మొలుచుకు వచ్చాయి. సంపాతి ఆనందంతో, ‘‘చూశారా, నిశాకరమహర్షి చెప్పినది అక్షరాలా జరిగింది. మీరు వెళ్ళే పని జరుగుతుందని కూడా ఆయన అన్నాడు. అందుచేత మీకు కార్యసిద్ధి తప్పక అవుతుంది,'' అంటూ ఆకాశంలోకి ఎగిరాడు.
 
ఇది చూసి వానరులు కూడా కొత్త ఉత్సాహంతో దక్షిణంగా బయలుదేరారు. సీత జాడ తెలిసిన సంతోషంతో వాళ్ళు గెంతారు, సింహనాదాలు చేశారు. ఈ విధంగా వెళ్ళి వారు దక్షిణ సముద్ర తీరాన్ని చేరుకున్నారు. అంతులేని ఆ సముద్రాన్ని చూడగానే వానరులకు భయం పుట్టింది.
 
ఆ సముద్రంలో నూరామడల దూరాన లంక ఉన్నది. దీన్ని ఎలా దాటటం? అంగదుడు మేటి వానరులను సమావేశ పరిచి, ‘‘మనం ఎలాగైనా ఈ సముద్రాన్ని దాటనిదే సీతాదేవిని చూడలేము. సీతను చూడకుండా తిరిగి పోయే కన్న ఇక్కడ ప్రాయోపవేశం చెయ్యటం మేలు.

సముద్రాన్ని చూసి భయపడి ప్రయోజనం లేదు. మీలో ఎవరెవరు ఎంతెంత దూరం దూకగలరో చెప్పండి,'' అన్నాడు. సముద్రం దాటి లంకకు చేరగల ఘటికుడి పైన అందరి క్షేమమూ ఆధారపడి ఉన్నది. గజుడు పది ఆమడల దూరం దూకగలనన్నాడు. గవాక్షుడు ఇరవై ఆమడలూ, గవయుడు ముపై్ఫ ఆమడలూ దూకగల మన్నారు. నలభై ఆమడలు దూకగల నన్నాడు శరభుడు.
 
గంధమాదనుడూ, మైందుడూ, ద్వివిదుడూ వరసగా యూభై, అరవై, డెబై్భ ఆమడలు దూకగల మన్నారు. సుషేణుడు ఎనభై ఆమడలు దూకగలనన్నాడు. జాంబవంతుడు, ‘‘ఒకప్పుడు నేను ఎంత దూరమైనా దూకేవాణ్ణి. త్రివిక్రముడు వామనావతార మెత్తి మూడడుగులతో మూడు లోకాలూ ఆక్రమించినప్పుడు నేను అతని చుట్టూ ప్రదక్షిణం తిరిగి వచ్చాను. ఇప్పుడు ముసలివాణ్ణి, తొంభై ఆమడలు మించి దూకలేను,'' అన్నాడు.
 
అందరన్న మాటలూ విని అంగదుడు, ‘‘నేను నూరు ఆమడల దూరం సులువుగానే దూక గలను. కాని తిరిగి రాగలనని నిశ్చయంగా చెప్పలేను,'' అన్నాడు. ఆ మాట విని జాంబవంతుడు, ‘‘నాయనా, మాకు రాజువంటి వాడవు. నువ్వు మాలో ఒకణ్ణి, లంకకు పంపవచ్చు గాని, నిన్ను మేమెలా పంపుతాము? అది పొసగదు,'' అన్నాడు తల అడ్డంగా ఊపుతూ.

‘‘నేనూ వెళ్ళక, మీలో వెళ్ళేవారూ లేకపోతే ఇక మనకు ప్రాయోపవేశమేగదా గతి?'' అన్నాడు అంగదుడు. ‘‘నాయనా, ఆ విషయం గురించి నువ్వేమీ విచారించకు. మన పని సానుకూలం చెయ్యగల మహామహుడు అడుగో దూరాన ఒంటరిగా కూచున్నాడు,'' అంటూ జాంబవంతుడు హనుమంతుణ్ణి చూపాడు.
 
అతడు హనుమంతుడి వద్దకు వెళ్ళి, ‘‘మేమంతా తలలు పగల గొట్టుకుంటూ ఉంటే మాకందరికీ మేటివైన నువ్వు ఉలుకూ, పలుకూ లేకుండా ఇక్కడ ఒంటిగా కూర్చున్నావేమిటి? పుట్టుతూనే సూర్యుణ్ణి చూసి పండనుకుని ఆకాశాని కెగిరిన వాడవుకదా, నువ్వు కాక ఈ మహాసముద్రాన్ని మరెవరు దాట గలరు? వేగంలో వాయువుకు సమానమైన వాడవు, గరుత్మంతుడికి తీసిపోనివాడవు. ఎగరటంలో నీకు సరి వచ్చేవాళ్ళు మాలో ఎవరున్నారు? నీ ప్రజ్ఞ చూడటానికి ఈ వానరులంతా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. మరి లే! లేచి నీ శక్తి చూపించు!'' అని ఉత్సాహపరిచాడు.
 
ఈ మాటలు వింటూంటే హనుమంతుడి శరీరం పొంగిపోయింది. హనుమంతుడి శరీరం పెరిగి పోతున్న కొద్దీ వానరులు ఉత్సాహాతిశయంతో సింహనాదాలు చేశారు. వారి ప్రశంసలు వింటున్న కొద్దీ హనుమంతుడి బలం కూడా పెరగ సాగింది. ఆ ఉత్సాహంలో అతడు, ‘‘ఔను, ఈ సముద్రాన్ని అవలీలగా దాటుతాను.
 
కావలిస్తే నేను సూర్యుడితో బాటు తూర్పు నుంచి బయలుదేరి పడమరకు వెళ్ళి మధ్యాహ్నానికల్లా సూర్యుడికి ఎదురు రాగలను. శుభ శకునాలు కలుగుతున్నాయి. మనసెంతో ఉత్సాహంగా ఉంది. నేను సీతాదేవిని తప్పక చూసి వస్తాను. మీరేమీ దిగులు పడకండి,'' అన్నాడు.
 
తాను భూమిని తన్ని పైకి లేచేటప్పుడు భూమి కంపిస్తుందనే ఉద్దేశంతో హనుమంతుడు సమీపంలో ఉన్న మహేంద్రపర్వత శిఖరాన్ని ఎక్కాడు. అతను అక్కడ నడుస్తుంటే అతడి పాద ఘట్టనకు రాళ్ళు పిండి అయ్యూయి, మహేంద్రగిరిపై ఉండే జంతువులు భయపడి నలు దిక్కులకూ పారిపోయూయి. 
 
                                                     [కిష్కింధాకాండ సమాప్తం]

No comments:

Post a Comment