Friday, September 7, 2012

రామాయణం - సుందరకాండ 5


ఆ కాకి ఇంద్రుడి కొడుకు, పక్షులలో మేటి. బ్రహ్మాస్త్రం వెంట పడగా ఆ కాకి భయపడి మూడు లోకాలూ తిరిగింది. ఇంద్రుడుగాని, దేవతలు గాని దానిని కాపాడలేకపోయారు. అది తిరిగి రాముడి వద్దకే వచ్చి శరణన్నది. రాముడు శరణాగత వత్సలుడు గనక దాన్ని క్షమించాడు; కాని బ్రహ్మాస్త్రం వృథాపోవటానికి వీలులేనందున ఆ కాకి యొక్క కుడికన్ను నాశనం చేశాడు.

సీత హనుమంతుడికి ఈ సంగతంతా చెప్పి, ‘‘ఇంత సమర్థుడై ఉండి కూడా నా భర్త నన్ను రక్షించే ప్రయత్నం చెయ్యలేదంటే అందుకు నేను చేసి ఉండిన మహాపాపమే కారణమై ఉండాలి,’’ అన్నది విచారంగా. హనుమంతుడామెను ఓదార్చి, రామలక్ష్మణులకూ, సుగ్రీవుడికీ, వానరులకూ ఏం చెప్పమన్నావని అడిగాడు. ‘‘రాముడి కుశలం అడిగానని చెప్పు. ఆయనకు నా సాష్టాంగ నమస్కారం చెప్పు. నన్ను తల్లిలాగా చూసుకున్న లక్ష్మణుడి క్షేమం అడిగానని చెప్పు.
 
అతను సమయానికి దగ్గిర ఉన్నా నన్ను రావణుడపహరించి ఉండలేడు. రాముణ్ణి బయలుదేర దీయటానికి నీకన్న సమర్థులు లేరు,’’ అంటూ సీత తన కొంగున కట్టి ఉన్న చూడామణి తీసి హనుమంతుడికిచ్చి, ‘‘దీన్ని మా అమ్మ నాకు వివాహ సమయంలో ఇచ్చింది. అప్పుడు దశరథ మహారాజు కూడా అక్కడే ఉన్నాడు. దీన్ని చూడగానే రాముడికి మా అమ్మా, తన తండ్రీ, నేనూ జ్ఞాపకం వస్తాం,’’ అన్నది.

హనుమంతుడిప్పుడు తిరిగి మామూలు రూపం ధరించి ఉన్నాడు. అతనా చూడామణిని తీసుకుని, చేతికి తొడగటం సాధ్యం కాక, వేలికి తగిలించుకున్నాడు. హనుమంతుడు సీతకు చెప్పవలిసిన ధైర్యమంతా చెప్పి ఆమెను విడిచి ఇవతలికి వచ్చి, రావణుడి సంగతి కొంతవరకు అంతుతేల్చుకుని పోదామని నిశ్చయించుకున్నాడు. ఇంత శ్రమపడి లంకకు వచ్చి సీతను మాత్రం చూసి తిరిగి వెళ్ళిపోవటం అతనికి భావ్యంగా తోచలేదు. రాక్షసులేపాటి పరాక్రమవంతులో, యుద్ధం చెయ్యటంలో వారికీ, వానరులకూ గల తారతమ్యం ఏమిటో తెలుసుకుని వెళ్ళితే సుగ్రీవుడి ఆజ్ఞను సరిగా నెరవేర్చినట్టవుతుందని అతనికి అనిపించింది.

పనిలోపనిగా రావణుడికి కూడా వానర పరాక్రమం ఏమిటో చూపినట్టూ అవుతుంది! రావణుణ్ణి రెచ్చగొట్టాలంటే నందనవనం లాగున్న అశోకవనాన్ని నాశనం చెయ్యటం కన్న మంచి మార్గం లేదనుకుని హనుమంతుడు తన శక్తి కొద్దీ అశోకవనంలోని చెట్లను కూలదోయ సాగాడు. క్రీడా సరోవరాలను ధ్వంసం చేశాడు. క్రీడా పర్వతాలను కూలదోశాడు. అశోకవన మంతా బీభత్సమైపోయింది. చెట్ల మీది పక్షులన్నీ భయపడి అరిచాయి. లతలన్నీ తెగి వాడు ముఖాలు వేశాయి. ఇళ్ళన్నీ కూలిపోయాయి.

హనుమంతుడు చేసిన విధ్వంసానికి రాక్షస స్ర్తీలందరూ పరిగెత్తుకొచ్చి హనుమంతుణ్ణి చూశారు. వాళ్ళు సీతతో, ‘‘వీడెవడు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఎవరు పంపారు? నీతో ఏమిటి మాట్లాడాడు?’’ అని అడిగారు. ‘‘అతనెవడో నాకేం తెలుస్తుంది? రాక్షసమాయలు మీ రాక్షసులకే తెలియాలి! అతణ్ణి చూస్తే నాకూ భయంగానే ఉంది. ఎవరతను? మీరే చెప్పండి,’’ అన్నది సీత. సీత ఇలా అనగానే రాక్షస స్త్రీలు హడలిపోయారు. వారిలో కొందరు సీతను రక్షించటానికి ఉండిపోతే, మిగిలిన వారు రావణుడితో చెప్పటానికి పరిగెత్తారు.

వాళ్ళు రావణుడితో, ‘‘భయంకరమైన దేహమూ, అపారమైన బలమూ కల వానరుడెవడో వచ్చి సీతతో ఏదో మాట్లాడాడు. వాడిప్పుడు అశోకవనంలో ఉన్నాడు. వాడెవడని అడిగితే సీత చెప్పటంలేదు. ఎవరు పంపగా వచ్చాడో గాని ఆ వానరుడు అంతఃపుర వనమంతా నాశనం చేసేశాడు. సీత కూర్చునే చెట్టు మాత్రం విరవలేదు. సీత ఒక శింశుపా వృక్షం కిందికి వెళ్ళింది. దాన్ని కూడా వాడు విరవ లేదు. అశోకవనం ధ్వంసం చేశాడు గనకా, నువ్వు తెచ్చిన సీతతో మాట్లాడాడు గనకా, రెండు విధాలా వాడు చంపదగిన వాడే,’’ అన్నారు.


 రావణుడీ మాటలు విని ఆగ్రహావేశం చెంది, హనుమంతుణ్ణి పట్టుకోమని తనంత పరాక్రమంగల ఎనభైవేల మంది రాక్షసులను, కింకరులనే పేరుగల వాళ్ళను ఆజ్ఞాపించాడు. వారు వివిధాయుధాలతో బయలుదేరి వెళ్ళి, అశోకవన ద్వారం వద్ద ఉన్న హనుమంతుడి పైకి విజృంభించారు. వారు తనను చుట్టుముట్టగానే హనుమంతుడు తన తోకను నేలకేసి కొట్టి గట్టిగా అరిచాడు. ఆ ధ్వనికీ, అతను భుజాలు చరచుకున్న చప్పుడుకూ లంక అంతా మారుమోగింది.

‘‘జయం రామలక్ష్మణులది, వానర రాజైన సుగ్రీవుడిది! నేను రాముడికి దాసుణ్ణి. నా పేరు హనుమంతుడు. శత్రు హంతకుణ్ణి. వెయ్యిమంది రావణులు నాకు యుద్ధంలో సాటిరారు. ఈ రాక్షసులంతా చూస్తూండగానే ఈ లంకానగరాన్ని నాశనం చేసి, సీతకు నమస్కరించి, రాముడి వద్దకు తిరిగి పోతాను,’’ అని హనుమంతుడు గట్టిగా అరిచాడు.

ఎరగ్రా పర్వతాకారుడై కనిపించే హనుమంతుణ్ణీ, అతని అరుపూ చూసి రాక్షసులు భయపడ్డారు గాని, రాజాజ్ఞ తప్పదు గనక రాక్షసులతని పైన ఆయుధాలను ప్రయోగించారు. హనుమంతుడు పెద్ద పరిఘను చేత బట్టుకుని, దానితో రాక్షసులను చావ మోదాడు. ఇలా కింకరులనే రాక్షసులను మట్టుబెట్టి, ఇంకా యుద్ధకాంక్ష తీరక, హనుమంతుడు ద్వారం వద్దనే వేచి ఉన్నాడు.

ఈలోపల పారిపోయిన రాక్షసులు కొందరు రావణుడి వద్దకు వెళ్ళి, కింకరులందరూ హనుమంతుడి చేత చచ్చారని చెప్పారు. రావణుడు మండిపడి గుడ్లు తిప్పుతూ, హనుమంతుడితో యుద్ధం చెయ్యమని ప్రహస్తుడి కొడుకైన జంబుమాలి అనే వాణ్ణి, యుద్ధంలో ఓటమిఎరగని మహాశూరుణ్ణి ఆజ్ఞాపించాడు. కింకరులను చంపి నిలబడి ఉన్న హనుమంతుడికి అశోక వనంలోని చైత్యంలాటి భవనం జ్ఞాపకం వచ్చింది. దాన్ని అతను ధ్వంసం చెయ్యలేదు. ఆ పని చేద్దామని అతను ఒక్క ఎగురున ఆ చైత్య ప్రాసాదం మీదికి దూకాడు. ఆ ప్రాసాదాన్ని రక్షించే వారు నూరుమంది  రాక్షసులు ఆయుధాలు తీసుకుని హనుమంతుడి పైకి వచ్చారు.


 వారి ఆయుధాలు తగిలి హనుమంతుడాగ్రహించి తన శరీరాన్ని ఇంకా పెంచాడు. అతను ఆ ప్రాసాదంలోని ఒక స్తంభాన్ని ఒక్క ఊపున పెరికి దాన్ని గిరగిరా తిప్పేసరికి, ఆ వడికి నిప్పుపుట్టి చైత్య ప్రాసాదమంతా తగలబడిపోయింది. హనుమంతుడా స్తంభంతోనే నూరుగురు రాక్షసులనూ చంపాడు. తరవాత అతను గట్టిగా  అరుస్తూ,‘‘నా వంటి వానరులు అనేక వేల సంఖ్యలో సీతాదేవిని వెతకటానికి సుగ్రీవుడి చేత పంపబడ్డారు. లక్షల, కోట్ల వానరులతో సుగ్రీవుడిక్కడికి వస్తాడు. మీరు రాముడితో వైరం పెట్టుకున్నారు. ఇక లంక ఉండదు. నాశనమవుతుంది. మీరూ ఉండరు చస్తారు. రావణుడూ ఉండడు,’’ అన్నాడు.

ఎరన్రి పూలమాలలు ధరించి, తలలో పూలు పెట్టుకుని, కుండలాలు ధరించి, ఇంద్రధనుస్సు లాటి విల్లూ, అందమైన బాణాలూ తీసుకుని జంబుమాలి గాడిదలు పూన్చిన రథంలో వచ్చేసరికి హనుమంతుడు ద్వారతోరణం పైన కూర్చుని ఉన్నాడు. జంబుమాలి విల్లెక్కుపెట్టి అనేక బాణాలు ప్రయోగించి హనుమంతుడి ముఖాన్నీ, దేహాన్నీ గాయపరిచాడు; హనుమంతుడు పెద్ద రాయి విసిరితే దాన్ని బాణాలతో పడగొట్టాడు; సాలవృక్షం పీకితే దాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. చివరకు హనుమంతుడు మొదట తీసుకున్న పరిఘనే తీసి గిరగిరా తిప్పి విసిరే సరికి జంబుమాలితోబాటు రథమూ, గాడిదలూ నజ్జునజ్జయిపోయాయి.

కింకరులతో బాటు జంబుమాలి కూడా చచ్చాడని విని రావణుడు ఆగ్రహావేశం చెంది, అస్తవ్రేత్తలయిన ఏడుగురు మంత్రి పుత్రులను హనుమంతుడి పైకి పంపాడు. వారు తమతమ సైన్యాలను వెంటబెట్టుకుని, ఎవరు ముందు వెళ్ళి శత్రువుతో తలపడతారా అని పోటీలు పడుతూ, అమితోత్సాహంతో బయలుదేరారు. వాళ్ళు తన మీద వదిలిన బాణవర్షాన్ని తప్పించుకుని హనుమంతుడు గాలిలోనే సంచరిస్తూ, రాక్షసమూకను చేతులతోనూ, కాళ్ళతోనూ కొట్టి చంపాడు. వారు పెట్టిన చావు కేకలకు లంక యావత్తూ పిక్కటిల్లింది.


మంత్రి పుత్రులు కూడా ఎప్పుడైతే చచ్చారో, రావణుడికి భయం ఆరంభమయింది. కాని అతను దాన్ని లోపలనే అణచుకుని, విరూపాక్షుడూ, యూపాక్షుడూ, దుర్ధరుడూ, ప్రఘసుడూ, భాసకర్ణుడూ అనే అయిదుగురు అగ్రసేనానాయకులను పిలిచి, ‘‘సేనాధిపతులారా, మీరు చతురంగ బలాలతో వెళ్ళి ఆ వానరుణ్ణి శిక్షించండి. వాడు వానరుడుగా నాకు తోచలేదు. ఏ ఇంద్రుడో తపస్సు చేసి ఈ భూతాన్ని మన పైకి పంపాడేమో! నేను కూడా మహా బలవంతులైన వానరులను, వాలి సుగ్రీవ నీల ద్వివిదాదులను చూశాను గాని, వారి కన్న ఈ వానరుడు మిన్నగా కనబడతాడు. ఇదేదో వానర రూపంలో ఉన్న భూతం. ప్రయాసపడి ఎలాగైనా ఈ వానరుణ్ణి మీరు పట్టాలి. యుద్ధం చేసేటప్పుడేమాత్రమూ అశ్రద్ధగా ఉండకండి,’’ అని హెచ్చరించాడు.

ఆ అయిదుగురూ బయలుదేరి అశోకవన ద్వారం దగ్గిరికి వెళ్ళి హనుమంతుణ్ణి చూసి, అతన్ని అన్నివైపుల నుంచీ చుట్టుముట్టి యుద్ధం ఆరంభించారు. దుర్ధరుడు హనుమంతుడి తలను అయిదు బాణాలతో కొట్టాడు. హనుమంతుడొక్క పెడబొబ్బ పెట్టి ఆకాశంలోకి ఎగిరాడు. అక్కడి నుంచి అతను అతి వేగంగా, సూటిగా దుర్ధరుడి రథం పైకి దూకే సరికి, ఆ పాటుకు రథమూ, దానికి కట్టిన ఎనిమిది గుర్రాలూ, అందులో వున్న దుర్ధరుడూ క్షణంలో నాశనమయ్యారు.

దుర్ధరుడు చచ్చేసరికి విరూపాక్ష యూపాక్షులు ఆగ్రహం చెంది ఆకాశానికి ఎగిరి, ముద్గరాలతో హనుమంతుణ్ణి రొమ్ము మీద కొట్టారు. హనుమంతుడొక మద్దిచెట్టు పెరికి, దాంతో వారిద్దరినీ చావ మోదాడు. ముగ్గురు చావగా మిగిలిన ఇద్దరూ అడ్డకత్తీ, శూలమూ తీసుకుని హనుమంతుడిపై కలియబడి, అతణ్ణి గాయపరిచారు. హనుమంతుడొక పర్వత శిఖరాన్ని, దానిపై గల వృక్షాలతోనూ, జంతువులతోనూ సహా విరిచి, దాన్ని ఎత్తి ప్రఘసుడి పైనా, భాసకర్ణుడి పైనా కొట్టి, వారిని కూడా చంపాడు. ఇలా అయిదుగురు యోధులనూ చంపి హనుమంతుడు వారి సేనలను అవలీలగా నిర్మూలించాడు.


ఈ వార్తకూడా తెలియరాగానే, రావణుడి కన్ను యుద్ధోద్రిక్తుడై ఉన్న తన కొడుకు అక్షుడి పైన పడింది. తండ్రి తన కేసి చూడటమే ఆలస్యంగా అక్షుడు చివాలున లేచి, బంగారం పొదిగిన తన విల్లు తీసుకుని, బంగారు అలంకరణలు గల తన గొప్ప రథ మెక్కి హనుమంతుడి పైకి వెళ్ళాడు. ఆ రథం నిండా ఆయుధాలున్నాయి. అది యుద్ధానికి ఆయత్తం చేయబడి ఉన్న రథం. అతని వెంట సైన్యం కూడా వెళ్ళింది.

హనుమంతుడింకా అశోకవన ద్వారం వద్దనే ఉన్నాడు. అతణ్ణి చూస్తూనే అక్షుడు తన శత్రువు పరాక్రమవంతుడని గ్రహించి గౌరవభావంతో చూశాడు. ఇద్దరికీ గొప్ప యుద్ధం జరిగింది. అక్షుడు కురవ్రాడైనా అతని పరాక్రమం చూసి హనుమంతుడు కూడా సంతోషించాడు. అతను అక్షుడి బాణాలకు అందకుండా తప్పుకుంటూ గాలిలో తిరుగుతూ, ‘‘ఈ కురవ్రాణ్ణి ఎలా చంపడం? అయినా వీడిప్పుడే ఇంత ప్రతాపం చూపుతున్నాడే, ముందుముందింకా ఎంత ప్రబలుడవుతాడో!

ఇప్పుడే వీణ్ణి చంపటం మంచిది,’’ అనుకున్నాడు. అక్షకుమారుడి రథం ఆకాశంలో కూడా సంచరించగలది. అది ఆకాశంలో ఉండగానే హనుమంతుడు ఆ రథానికి గల గుర్రాలను చేత్తో కొట్టి చంపి, చక్రాలు విరిచాడు. రథం నేల కూలింది, కాని అక్షుడు విల్లుతో రివ్వున ఆకాశంలోకి లేచాడు. అలా లేచిన అక్షుడి కాళ్ళు రెండూ ఉపాయంగా పట్టుకుని, హనుమంతుడు అతణ్ణి గాలిలో గిరగిరా తిప్పి, బలంగా నేల కేసి కొట్టి చంపేశాడు.




No comments:

Post a Comment