Saturday, September 8, 2012

రామాయణం - ఉత్తరకాండ 6


రాముడు చేసిన అద్భుతమైన యజ్ఞానికి వాల్మీకి తన శిష్యులతో కూడా వచ్చి, ఋషి వాటికలో తన కోసం ప్రత్యేకించిన పర్ణశాలలో బస చేశాడు. ఆయన కుశలవులతో, ‘‘మీరెవరి బిడ్డలని ఎవరన్నా అడిగితే వాల్మీకి శిష్యులమని చెప్పండి. రాముడు పిలిస్తే ఆయన ఎదుట కూడా రామాయణాన్ని గానం చెయ్యండి’’ అన్నాడు. ‘‘అలాగే తాతా’’ అని వాళ్ళు పర్ణశాల నుంచి బయలుదేరారు.

వాళ్ళు రాగతాళయుక్తంగా రామాయణ గానం చేస్తున్న సంగతిని విని రాముడు వారిని సదస్సు మధ్యకు పిలిపించి, గానం చెయ్యమన్నాడు. ఆరోజు కుశలవులు రామాయణం నుంచి మొదటి ఇరవై సర్గలూ పాడారు. రాముడు లక్ష్మణుడితో, ‘‘ఈ కురవ్రాళ్ళకు పద్దెనిమిది వేల సువర్ణాలిప్పించు’’ అన్నాడు. కానీ లక్ష్మణుడు వారికి వేరు వేరుగా బంగారం ఇవ్వబోతే వాళ్ళు ‘‘ఈ బంగారం మాకెందుకు? మేము అరణ్యంలో కందమూల ఫలాలు తిని జీవించేవాళ్ళం’’ అన్నారు. రాముడు ఆ మాటలు విని ఆశ్చర్యపడి, ‘‘అబ్బాయిలూ, మీరు పాడే ఈ కావ్యం ఎంత ఉంటుంది?  దాన్ని ఎవరు రాశారు?’’ అని అడిగాడు.

‘‘దీన్ని వాల్మీకి మహాముని రాశారు. ఆయన కూడా ఈ యజ్ఞానికి వచ్చి ఉన్నారు. మీకు వినాలని ఉంటే రోజూ గానం చేస్తాం’’ అన్నారు సీత కొడుకులు.

రాముడు సరేనన్నాడు. పిల్లలు రోజూ వచ్చి, అందరి సమక్షంలో కొన్ని సర్గల చొప్పున చాలారోజులపాటు రామాయణాన్ని గానం చేశారు. ఈ గానంతో ఆ పిల్లలు సీత కొడుకులేనన్నది అందరికీ స్పష్టమయింది.


 రాముడు తన దూతలను పిలిచి, ‘‘మీరు వాల్మీకి మహాముని వద్దకు వెళ్ళి, సీత పవిత్రురాలైన పక్షంలో, ఆమె ఇక్కడికి వచ్చి ఆ సంగతి నిరూపించటానికి ఆ మహాముని అనుమతి కోరుతున్నానని ఆయనతో చెప్పండి’’ అని పంపాడు. దూతలు వచ్చి రాముడి కోరికను విన్నవించగానే వాల్మీకి మహాముని ‘‘సీత రాముడి కోరిక ప్రకారం వచ్చి శపథం చేస్తుంది’’ అని చెప్పాడు.

దూతలు ఆ మాట చెప్పగానే రాముడు సభికుల ఎదుట సీత తన పవిత్రతను వెల్లడించుకోబోతోందని ప్రకటించాడు. ఈ మాటకు సంతోషించి, అందరూ రాముణ్ణి అభినందించారు. మర్నాడు తెల్లవారగానే రాముడు యజ్ఞ వాటికకు వెళ్ళి, మహామునులందరికీ కబురు చేశాడు. రాక్షసులనూ, వానరులనూ, నానాదేశాల నుంచి వచ్చిన నాలుగు వర్ణాలవారినీ పిలిపించాడు. అందరూ కూర్చుని ఉండగా, వాల్మీకి మహాముని సీతను వెంటబెట్టుకుని వచ్చాడు. వాల్మీకి వెనక నడిచివచ్చే సీతను చూడగానే అందరికీ గుండెలు నీరయిపోయాయి. వాల్మీకి రాముడితో, రామా, ‘‘ఈ సీత మహా ఇల్లాలు, ధర్మం తప్పనిది. లోకోపవాదులకు వెరచి ఈమెను నా ఆశ్రమంవద్ద వదలిపెట్టావు. కనుక నీకు ఆమెయందు విశ్వాసం కుదిరేటట్టుగా శపథం చేస్తుంది. ఈ బిడ్డలిద్దరూ సీత కొడుకులు. నేనెన్నడూ అబద్ధమాడినవాణ్ణి కాను. వీరు నీ కొడుకులు. నేను  అంతులేని తపస్సు చేశాను. సీత నిజంగా చెడ్డదైతే, నా తపస్సు ఫలించకపోవుగాక! లోకోపవాదానికి వెరిచావేగానీ ఆమెలో ఎలాంటి దోషం లేదని నీకూ తెలుసు అన్నాడు.’’

రాముడు వాల్మీకికి నమస్కరించి, ‘‘మునీశ్వరా, మీరన్నది నిజమే. లంకలోనే అగ్నిదేవుడు సీత పవిత్రతతకు సాక్ష్యం పలికాడు. అందుకే నేనీమెను నా వెంట ఇంటికి తెచ్చాను. ఈ మహాసభలో సీత తన నిర్దోషిత్వం రుజువు చేసుకునేటట్టుంటే నేనామెను సంతోషంగా ఏలుకుంటాను’’ అన్నాడు. సీత చేతులు జోడించి, నేల చూస్తూ ‘‘నా మనసులో రాముణ్ణి తప్ప మరెవరినీ స్మరించని పక్షంలో భూదేవి నాకు దారి ఇచ్చుగాక! మనోవాక్కాయాల నేను రాముణ్ణి పూజించే దాన్నయితే భూదేవి నాకు దారి ఇచ్చుగాక! రాముడు తప్ప నాకింకేమీ తెలియని పక్షంలో భూదేవి నాకు దారి ఇచ్చుగాక!’’ అన్నది. సీత అలా అంటుండగానే భూమిలో నుంచి ఒక దివ్య సింహాసనం పైకి వచ్చింది. ఆ సింహాసనం మీద ఉన్న భూదేవి తన రెండు చేతులూ చాచి, సీతను ఎత్తి సింహాసనం మీద కూర్చోబెట్టింది. వెంటనే సింహాసనం పాతాళానికి దిగిపోయింది.


ఇది చూసి అందరూ నిశ్చేష్టితులయిపోయారు. వానరులు ఏడ్చారు. ఎంత సాధ్వి అని మునులు మెచ్చుకున్నారు. రాముడు చేతికర్ర మీద బరువు వేసి తలవంచుకుని చాలాసేపు కన్నీరుగార్చి, ‘‘నేనింత కష్టం ఎన్నడూ అనుభవించలేదు. ఓ భూదేవీ నా సీతను నాకిచ్చెయ్యి లేదా నాకు కూడా దారి ఇయ్యి. ఎవరురా! నా ధనుర్బాణాలు తెండి. ఈ భూమిని బద్ధలు చేస్తాను’’ అని ఆవేశపడ్డాడు. అందరూ చేరి అతన్ని ఓదార్చారు.
మర్నాడు మళ్ళీ సభ జరిగినప్పుడు కుశలవులు ఉత్తర రామాయణాన్ని గానం చేశారు. దానితోనే యజ్ఞకాండ ముగిసింది. యజ్ఞానికి వచ్చినవారినందరినీ తగిన విధంగా సత్కరించిన రాముడు అయోధ్యకు తిరిగి వచ్చాడు. అతను వచ్చేటప్పుడు తన కొడుకులను వెంటతెచ్చుకున్నాడు. అతను మరొక స్త్రీని పెళ్ళాడక, బంగారు సీతను పక్కనే ఉంచుకుని అనేక అశ్వమేథ, వాజపేయ యజ్ఞాలు చేశాడు. అతను ధర్మం నిలబెట్టడానికి యత్నిస్తూ, న్యాయంగా పరిపాలన చేసి, ప్రజల ఆదరం పొందాడు. అతని పరిపాలనలో దేశం సుభిక్షంగా ఉన్నది.

కాలక్రమాన కౌసల్యా, సుమిత్రా, కైకేయీ మరణించారు. వారికి రాముడు ఉత్తరక్రియలు చేసి, గొప్పగా దానధర్మాలు చేశాడు. కొంతకాలం గడిచాక రాముడి వద్దకు కైకేయి అన్న అయిన యుధాజిత్తు వద్ద నుంచి గార్గ్యుడు పదివేల గుర్రాల కానుకతో సహా వచ్చి, ‘‘రామా, మీ మామ నీతో ఇలా చెప్పమన్నాడు. సింధునదికి రెండుపక్కలా గల గంధర్వదేశంలో శైలూఘడి సంతతికి చెందిన గంధర్వులు మూడుకోట్లమంది ఉన్నారు. వారిని జయించి గంధర్వదేశాన్ని వశపరచుకో. అని యుధాజిత్తు తరపున సందేశం ఇచ్చాడు. ‘‘మంచిది. ఈ కురవ్రాళ్ళు భరతుడి కొడుకులు. తక్షుడూ, పుష్కలుడూ అనే వాళ్ళు. వీళ్ళ వెంట భరతుణ్ణి, సేననూ పంపుతాను. భరతుడు  గంధర్వులను జయించి, గంధర్వదేశాన్ని రెండుగా విభజించి, తన ఇద్దరి కొడుకులనూ వాటికి రాజులుగా చేసి తిరిగి వస్తాడు’’ అన్నాడు.

భరతుడు పెద్ద సేనను వెంటబెట్టుకుని, కేకయ దేశాన్ని చేరి, యుధాజిత్తును కలుసుకున్నాడు. ఇద్దరూ కలిసి గంధర్వుల మీదికి యుద్ధానికి వెళ్ళారు. యుద్ధంలో గంధర్వులు నశించారు. భరతుడు వారి దేశాన్ని జయించి, తక్షుడికి తక్షశిల నగరాన్నీ, పుష్కలుడికి పుష్కలావతి నగరాన్ని ఏర్పాటుచేసి, ఆ పట్టణాలలో ఐదేళ్ళపాటు ఉండి, అయోధ్యకు తిరిగి వచ్చాడు. ఇక లక్ష్మణుడి కొడుకులైన అంగదుడికీ, చంద్రకేతుడికీ రాజ్యాలు ఏర్పాటు కోసం ఆలోచించారు. కారుపధమనే దేశాన్ని అంగదుడి కోసమూ, చంద్రకాంతమనే దేశాన్ని చంద్రకేతుడి కోసమూ ఏర్పాటు చేస్తే బాగుంటుందని నిర్ణయం జరిగింది. అంగదుడి వెంట లక్ష్మణుడూ, చంద్రకేతుడి  వెంట భరతుడూ వెళ్ళి ఆయా దేశాలలో వారికి రాజ్యం ఏర్పాటుచేసి అయోధ్యకు తిరిగి వచ్చారు.


 కాలం గడిచింది. ఒకనాడు యముడు మునివేషంలో రాముడి రాజభవనానికి వచ్చి, లక్ష్మణుణ్ణి చూసి, ‘‘లక్ష్మణా, నేను ఒక గొప్ప మహర్షి దూతగా పనిమీద చూడవచ్చానని రాముడితో చెప్పు’’ అన్నాడు. లక్ష్మణుడా మాట చెప్పగానే రాముడు మునిని లోపలికి పంపమన్నాడు. యముడు వచ్చి, రాముడిచ్చిన ఆర్ఘ్యపాద్యాలు స్వీకరించి, ‘‘రామా, మనం ఏకాంతంగా మాట్లాడాలి. మనం మాట్లాడుకునేటప్పుడెవరైనా వచ్చే పక్షంలో నీవు వారికి మరణశిక్ష విధించాలి. అందుకిష్టమయే పక్షంలో నేను వచ్చిన పని చెబుతాను’’ అన్నాడు. రాముడు సరేనని, లక్ష్మణుణ్ణి పిలిచి, లక్ష్మణా, ద్వారపాలకుణ్ణి పంపేసి, ‘‘నువే ద్వారం వద్ద  ఉండు. మేం మాట్లాడుకుంటుండగా ఎవరు లోపలికి వచ్చినా మరణదండన తప్పదు’’ అని చెప్పాడు.

తరువాత యముడు రాముడితో ‘‘రామా, నేను మారువేషం ధరించి వచ్చిన యముణ్ణి, బ్రహ్మ నీతో ఇలా చెప్పమన్నాడు: నీవు రావణ సంహారం కోసం అవతరించిన విష్ణువువు. నీవు భూలోకానికి వచ్చిన పని అయిపోయింది. నీకు ఎప్పుడు తిరిగి రావాలని ఉంటే అప్పుడు తిరిగి రా,’’ అన్నాడు. రాముడు నవ్వి ‘‘నీ రాక నాకు చాలా సంతోషం కలిగించింది. నేను కూడా ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళటానికి సిద్ధంగానే ఉన్నాను’’ అన్నాడు. లోపల రాముడు యముడితో ఇలా మాట్లాడే సమయంలో దుర్వాసుడు వచ్చి, ‘‘లక్ష్మణా, ఇప్పుడే నేను రాముణ్ణి చూడాలి’’ అన్నాడు.

‘‘స్వామీ మా అన్న మరొక పనిలో నిమగ్నుడై ఉన్నాడు. కొంచెం ఆగాలి. మీరేంపనిమీద వచ్చారో, మీకేం కావాలో చెప్పండి’’ అన్నాడు లక్ష్మణుడు. దుర్వాసుడు ఉగ్రుడై వెంటనే ‘‘నన్ను రాముడి దగ్గిరికి తీసుకుపోక పోయావో మీ వంశమంతా నిర్మూలమయ్యేటట్టు శపిస్తాను’’ అన్నాడు. తాను ఒక్కడే చచ్చినా నష్టంలేదనీ, సర్వనాశనం కారాదని ఆలోచించి లక్ష్మణుడు లోపలికి  వెళ్ళి రాముడిని పిలిచాడు. రాముడు లేచివచ్చి దుర్వాసుడికి నమస్కరించి ‘‘స్వామీ, ఏమి ఆజ్ఞ?’’ అని అడిగాడు. ‘‘నాకు వెంటనే భోజనం పెట్టించు’’ అన్నాడు దుర్వాసుడు. రాముడాయనకు భోజనం పెట్టించాడు.


దుర్వాసుడు భోజనం చేసి, సంతోషించి వెళ్ళిపోయాడు. రాముడికి తన శపథం జ్ఞాపకం వచ్చి విచారం కలిగింది. లక్ష్మణుడతన్ని సమీపించి, ‘‘అన్నా, నా కోసం దిగులుపడకు. నన్ను చంపి నీ మాట నిలబెట్టుకో’’ అని చెప్పాడు. రాముడు తన మంత్రి పురోహితులను పిలిచి జరిగినదంతా చెప్పి వారి సలహా కోరాడు. ‘‘రామా, లక్ష్మణుణ్ణి విడిచి పెట్టెయ్యి. త్యాగం వధతో సమానం. ధర్మ భంగం కలగరాదు’’ అని వశిష్టుడన్నాడు.

లక్ష్మణుడు రాముడికి నమస్కారం చేసి, తన ఇంటికి కూడా పోకుండా, తిన్నగా సరయూ తీరానికి వెళ్ళి, శ్వాస స్తంభింపజేసి, యోగం పట్టాడు. ఇంద్రుడు విమానంలో అదృశ్యంగా దిగివచ్చి లక్ష్మణుణ్ణి శరీరంతో సహా స్వర్గానికి తీసుకుపోయూడు.

తరవాత రాముడు సభచేసి, ‘‘లక్ష్మణుడిలాగే నేను కూడా వెళ్ళిపోతాను. భరతుడికి పట్టాభిషేకం చేసే ఏర్పాట్లు చెయ్యండి’’ అన్నాడు. ఆ మాట విని భరతుడికి మతిపోయినట్లయింది. ‘‘నువులేని రాజ్యం నాకెందుకు? కుశలవులకు పట్టం కట్టు. కోసలకు కుశుణ్ణి, ఉత్తర కోసలకు  లవుణ్ణీ రాజును చేయ్యి. మనం స్వర్గానికి పోతున్నామని శత్రుఘ్నుడికి కబురు చేద్దాం’’ అన్నాడతను. భరతుడు అన్న ప్రకారమే కుశలవుల పట్టాభిషేకం జరిగింది. శత్రుఘ్నుణ్ణి పిలుచుకు రావటానికి మధురాపురానికి దూత వెళ్లాడు. శత్రుఘ్నుడు తన రాజ్యాన్ని కూడా తన కొడుకులైన సుబాహుడూ, శత్రుఘాతీ అనే వాళ్ళకు పంచి అయోధ్యకు తిరిగి వచ్చాడు. రాముడు స్వర్గానికి పోతున్నాడన్న వార్త విని సుగ్రీవ విభీషణులు సపరివారంగా విచ్చేశారు. సుగ్రీవుడు అంగదుడికి పట్టాభిషేకం చేసి మరీ వచ్చాడు.

తరువాత రామ ప్రస్థానం ప్రారంభమయింది. రాముడు సన్నని బట్ట కట్టుకుని, చేత దర్పలు పట్టుకుని, మౌనంగా నడవసాగాడు. అతనివెంట అంతఃపుర స్త్రీలూ, భరత శత్రుఘ్నులూ, వానరులూ బయలుదేరారు. కొంతదూరం నడిచి రాముడు ఆ నదిలో పాదాలు పెట్టాడు. అతనికి బ్రహ్మ పిలుపు వినబడింది. రాముడికీ, భరత శత్రుఘ్నులకూ వైష్ణవ శరీరాలు వచ్చేశాయి. విష్ణువు బ్రహ్మను చేరాడు. అతనితోబాటు అవతరించిన వారందరూ తమ తమ లోకాలకు తిరిగి చేరుకున్నారు.





No comments:

Post a Comment