Friday, January 11, 2013

భగవద్గీత... శ్రీ మహావిష్టువు - శ్రీకృష్ణావతరం

రాక్షసుల ఆగడాలను భరించలేక దేవతలు, మహర్షులు పాలకడలిలో పవళించియున్న శ్రీమహావిష్ణువుకు మొరపెట్టుకున్నారు. వారి బాధలను ఆలకించిన ద్వాపరయుగంలో భూమిపై అవతరిస్తానని వారికి అభయమిస్తాడు లక్ష్మీవల్లభుడు. అనంతరం కంసుని చెరలో ఉన్న దేవకీ వసుదేవులకు చెరసాలలో శ్రావణమాసంలో అష్టమినాడు శిష్టుల రక్షించేందుకు శ్రీకృష్ణునిగా జన్మిస్తాడు శ్రీమహావిష్ణువు.

శ్రీకృష్ణుని కంసుని నుంచి కాపాడే నిమిత్తం వసుదేవుడు బాలకృష్ణుని యశోద దగ్గరుకు చేరుస్తాడు. గోకులంలో సోదరుడు బలరామునితో కలిసి పూతన తదితర రాక్షసులను తుదముట్టిస్తాడు యదునందనుడు. అనంతర కాలంలో శ్రీకృష్ణుని లీలలకు గోకులం పరవశించిపోతుంది. కృష్ణుని జన్మవృత్తాంతాన్ని తెలుసుకుని అతనిని తుదముట్టించేందుకు గాను కంసుడు శ్రీకృష్ణుని తన రాజస్థానానికి పిలిపించుకున్న కంసుని సంహరించి ఉగ్రసేనునికి మధురను అప్పగిస్తారు బలరామకృష్ణులు.

మధురలో గార్గముని వద్ద గాయత్రీ మంత్రాన్ని ఉపాసించి న అనంతరం విద్యాభ్యాసానికై సాందీపుని ఆశ్రమానికి బలరామకృష్ణులు చేరుకుంటారు. యుక్తవయస్సు వచ్చిన తరువాత బలరాముడు రేవతిని వివాహమాడగా, రుక్మిణి, సత్యభామలతో పాటుగా పలువురు రాజకుమార్తెలను శ్రీకృష్ణుడు వివాహమాడుతాడు. తనకు అత్యంత ఆప్తులైన పాండవులను ఆదుకుంటూ వారి పట్ల మానురాగాలను గోపాలుడు చాటుకుంటాడు. అంతేకాక శకుని మాయాజూదంలో సర్వం కోల్పోయి అడవులు పాలైన పాండవులకు అడుగడుగునా అండగా నిలిచి వారి అజ్ఞాతవాసానికి ఆటంకాలు లేకుండా కాపు కాస్తాడు.

దాయాదులైన కౌరవ, పాండవుల మధ్య యుద్ధం అనివార్యమౌతుంది. కురుక్షేత్ర మహాసంగ్రామంలో బంధువులపై అస్త్రశస్త్రాలు సంధించడానికి విముఖత వ్యక్తం చేసి వైరాగ్యభావనకు లోనవుతాడు అర్జునుడు. రధసారధి అయిన పాండురంగడు రణక్షేత్రంలో ధర్మక్షేత్రానికి నాంది పలుకుతూ అర్జునునికి భగవద్గీతను బోధిస్తాడు మురారి. కలియుగానికి శ్రీకారం చుడుతూ బోయవాని బాణం పాదాన్ని తాకడంతో అవతారాన్ని ముగిస్తాడు శేషతల్పసాయి.  

No comments:

Post a Comment