Saturday, February 9, 2013

పుష్కర స్నాన మహిమ

"జన్మ ప్రబృకియత పాపం స్త్రియావ పురుషేణ
పుష్కర్యోమాత్రశ్య సర్వయే ప్రణశ్యతి"

పుట్టినప్పటి నుంచి స్త్రీ, పురుషాదులచే చేయబడ్డ పాపాలన్నీ పుష్కరిణి నదిలో స్నానం చేయడం వల్ల నశించిపోతుందని, అంతేకాకుండా పూర్వ జన్మల పాపం, త్రికరణాదుల వల్ల చేసిన పాపాలన్నియూ నశించి మోక్ష ప్రాప్తి పొందుతారని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. పుష్కర స్నానం చేయడం వల్ల అశ్వమేథయాగం చేసినంత పుణ్య ఫలితాన్నిస్తుంది.

నర్మదా నదిలో తపస్సు, కురుక్షేత్రంలో దానం, కాశిలో మరణం ఎంత మోక్ష ప్రదమో ఈ మూడింటి ఫలితం ఒక్క పుష్కర స్నానం చేయడం వల్ల కలుగుతుందని వేద ఋషులు చెబుతారు.

తొలిగా నదిలో దిగునప్పుడు రేగు పండంత మట్టి ముద్దలను నదిలో వేయాలి. హే... నదీమతల్లీ నీలో నేను స్నానమాచరిస్తున్నాను.... అందుకు నీవు ఆజ్ఞ ఇవ్వాల్సిందిగా ప్రార్ధన చేయాలి. నదికి నమస్కారం చేస్తూ....స్నానం చేసి తుంగభద్ర, వరుణ దేవునికి, బృహస్పతికి, విష్ణుమూర్తికి, భోళాశంకరునికి , బ్రహ్మాది దేవతలకు, వశిష్టాది మునులకు, గంగాది సర్వ నదులకు, సూర్యునికి ఆర్థ్యం ఇవ్వాలి.

నదిజలాలను మూడుసార్లు తీసుకుని ఒడ్డుకు వచ్చి నీళ్లలో నిలబడి శ్లోకాలను పటిస్తూ... కట్టుకున్న వస్త్రంలోని నీళ్లను మూడుసార్లు ఒడ్డుమీద పిండాలి. ధరించిన వస్త్రాలను వదులుకుని నూతన వస్త్రాలను లేదా పొడివస్త్రాలను ధరించాలి. అనంతరం సూర్య ధ్యానం చేయాలి.

పుష్కర సమయంలో స్నానం చేయడం వల్ల జప, ధ్యాన, అర్చన, గాన, తర్పనాది అనుష్టానాలకు, పితృ పిండా ప్రధానాలకు అక్షయమైన పుణ్యం లభిస్తుందని మహర్షులు చెప్పారు.

ఈ కర్మల వల్ల శారీరక, మానసిక, బుద్ధి కల్మషాలు తొలగి మనశ్శాంతి లభించి, పవిత్రులు, పుణీతులు, తేజోవంతులు, ఉత్తేజితులు అవుతారు. ఈ పుష్కర సమయంలో పసిడి, రజతం, భూమి, ధనం, గోవులు, ధాన్యం, లవణాలు, ఔషధాలు, అశ్వం, పండ్లు, బెల్లం, వస్త్రాలు, తైలం, తేనే, కూరలు, పీఠం, అన్నం, పుస్తకం మొదలైనవి వారి వారి శక్త్యానుసారం దానంగా ఇస్తే... సువర్ణ రజితులు, సుఖ సంతోషాలతో బోగ భాగ్యాలతో అలరారుతారు.

భూదానం చేయడం వల్ల భూపతిత్వం, వస్త్రాన్ని దానంగా ఇవ్వడం వల్ల వసులోక ప్రాప్తి కలుగుతుంది. గోవును దానంగా ఇస్తే... రుద్రలోకప్రాప్తి, నెయ్యిని దానంగా ఇస్తే... ఆయుస్సు వృద్ధి, ఔషధాన్ని దానంచేస్తే... ఆరోగ్యవంతులవుతారు. సాలగ్రామందానం చేస్తే... విశ్వలోకాల ప్రాప్తి,తిలదానం వల్ల ఆపదలు కలుగవు

No comments:

Post a Comment