Saturday, February 9, 2013

పాండవులకు కనిపించని పరమేశ్వరుడు


కైలాస పర్వతం గురించి మన పురాణాలలో ఎన్నెన్నో కథలు, గాథలు ఉన్నాయి. వాటిలో ఓ కథ ఇలా సాగుతుంది... పాండవులు ఒకసారి హిమాలయాల్లో శివుని జాడ కనుగొనేందుకు ప్రయత్నించారు. వారి ప్రయత్నాన్ని చూసిన పరమశివుడు వారిని ఆట పట్టించదలిచాడు.

పాండవులు తనను కనుగొనలేని విధంగా ఓ జంతు రూపాన్ని ధరించాడు. పరమేశ్వరుడు ఏ జంతువులో ప్రవేశించాడో తెలియక పాండవులు నానా తంటాలు పడ్డారు. చివరకు పాండవుల్లో అత్యంత బలశాలి అయిన భీముడు తాను శివుడు ఎక్కడున్నాడో తేల్చాస్తానని నడుం బిగించాడు.

శరీరాన్ని బాగా పెంచి తన రెండు కాళ్లను అక్కడ ఉన్న రెండు పర్వతాలపై ఉంచి నిల్చున్నాడు. అంతట నలుగురు సోదరులూ ఆ అడవిలోని జంతువులన్నిటినీ భీముడు చాచిన రెండు కాళ్ల మధ్య సందులోంచి వెళ్లేలా తరమసాగారు.

మానవమాత్రుడి కాళ్ల సందులో నుంచి వెళ్లడానికి అడవి జంతువులు సంకోచించవు, కానీ ఈశ్వరుడు అలా చేయడని వారికి తెలుసు. చివరకు ఒక భారీ వృషభం తప్ప అన్ని జంతువులు భీముని కాళ్ల మధ్య నుంచి వెళ్లాయి. భీముడు భారీకాయుడై కాళ్లు సాచి నిలబడడాన్ని చూసి, ఎద్దు రూపంలో ఉన్న పరమేశ్వరుడు భూమిలోనికి చొచ్చుకుపోయాడు.

ఆ వృషభం తల కైలాసం వద్ద పైకి లేస్తే... మూపురం మాత్రం హిమాలయాల్లోని కేదారం దగ్గరే ఉండిపోయిందని విశ్వాసం. కైలాస పర్వతాన్ని జాగ్రత్తగా గమనిస్తే.... ఇప్పటికీ పర్వత శిఖరం మీద ఎద్దు ముక్కు రంధ్రాలు, చెవులు ఆకారం కనిపిస్తాయి. ఇలా కైలాస గిరి గురించి ఎన్నో కథలు పురాణాల్లో ఉన్నాయి.

No comments:

Post a Comment