Thursday, February 7, 2013

రుద్రాభిషేకంతో మృత్యువును జయించండి...!

ఈ రుద్రాభిషేకం చేసేటప్పుడు లింగముపై మారేడు దళములుంచి ఒక్కొక్క కలశంలోని నీళ్ళతో కలశపూజచేసి ప్రతి కలశమునందు శివపంచాక్షరితో అభిమంత్రించి ఆ విధముగా 108 కలశములూ మంత్ర పూరితము చేసి సిద్ధము చేసుకొని అప్పుడు రుద్రాభిషేకము ప్రారంభించాలి. అభిషేకము పూర్తి అయ్యేసరికి కలశములలో అభిమంత్రించిన తీర్థము సరిగ్గా సరిపోవునట్లు చేయవలె. అలా చేస్తేనే రుద్రాభిషేక ఫలితము పూర్తిగా కలుగుతుంది.

రుద్రాభిషేకంలో దోషాలు:

అట్లుకాక చాలామంది బిందెలలో చెరువునీటిని గాని, నూతినీటినిగాని తెచ్చి, అట్లే అభిషేకంగా రుద్రమంత్రం చెపుతూ అభిషేకం చేస్తారు. దీనివల్ల ప్రయోజనము లేదు! ఈ విషయం చాలామంది పురోహితులకు, (వేదపండితులకు) సహితము తెలియదు.

చెరువునీటిని కాని, నూతినీటిని కాని, ఏ నీరైననూ, సరే తెచ్చినది తెచ్చినట్లు అభిషేకము చేయరాదు! ఇది శాస్త్ర విరుద్ధము. ఎందుకనగా నీటియందు విషమ ఉండును అని వేద ప్రమాణము. ఈ విషము అట్లేవుంచి అభిషేకం చేసిన నిష్ఫలము కాబట్టి కలశములలో నింపిన జలమును ముందుగా 'నిర్విషము' చేయవలె. అట్లు నిర్విషము చేయుటకు 'తార్యముద్ర' లేక గరుడ ముద్రను చేతితో వట్టి నీటిపై ఉంచి విషాహార మంత్రములతో లేక మృత్యుంజయ బీజాక్షరములతో అభిమంత్రించి ఆ పైన 'అమృత ముద్ర' పట్టి అమృత బీజాక్షరమునుచ్చరించి, ఆ జలమును అమృతీకరణము చేయాల్సి వుంది. అట్లు అమృతీకరణము చేయబడిన జలమునే శివాభిషేకము చేయుటకు ఉపయోగించవలె. పై విధముగా నూతి నీరు నిర్విషీకరణము చేయలేదు గనుక వీలుపడదు. ఇదియే శాస్త్ర విహితమైనది, చాలా మంచిది. ఇది రుద్రాభిషేకము యావజ్జీవం చేయుచుండువారికి కూడా తెలియదు! అందువల్ల రుద్రాభిషేక ఫలము వీరికి కలుగుట లేదు.

రుద్రాభిషేక ఫలము:

పైన చెప్పిన విధంగా రుద్రాభిషేకము చేయువారి హస్తం అమృతీకరణం పొందుతుంది. అతడు ముట్టుకున్న ప్రతి వస్తువునకూ 'అమృతత్వము' కలుగుతుంది. అతడు ముట్టుకున్న ప్రతి వస్తువునకూ అమృతత్వము కలుగుతుంది. దీనికి నిదర్శనమేమనగా - అతని చేతితో తాకిన రోగములన్నీ ఎలాంటి మందు లేకుంటానే పోగలవు. దీనికి రుద్రాభిషేక మంత్రములలోనే 'శివా విశ్వాయ భేషజే'. (విశ్వములోని అన్ని రోగములకూ శివుడే వైద్యము అన్న మంత్రము) అప్పుడే సిద్ధించును. కాని ఇట్లు సిద్ధించుటలేదు. దీనికి కారణం జలము నిర్విషము చేయకయే అభిషేకిస్తూ వున్నారు. అమృతీకరణము చేయని జలముతో శివాభిషేకము ఫలితం ఇవ్వదు! ఈ రహస్యము తెలిసి, శివపూజలు చేసిన మృత్యువును సహితం జయించవచ్చు! ఇట్టి రహస్యములు యోగియైన సద్గురువునుండియే, తెలియవలె...

ఈ రుద్రాభిషేకమునకు 'నమక చమకము'లతోనే సామాన్యంగా అభిషేకం చేయడం ఉంది. అలాగాక 'మన్యుసూక్తం'తోను, మృత్యుంజయ మంత్రసహితంగా కాని పాశుపత బీజాక్షర సహితంకాని, రుద్రాభిషేకము చేయవచ్చును. దీనికి పాశుపత, మన్యుసూక్తమంత్రాలు ఉపదేశంగా పొందాలి. వీనికి అంగన్యాస, కరన్యాసములు, ధ్యాన, ఆవాహనములు, మూల మంత్రములు తెలియవలె. శివాభిషేక విధి ఇంత తెలిసిన చాలును!

No comments:

Post a Comment