Tuesday, May 20, 2014

బదరీనాధ్

బస్సు ప్రయాణములో మేఘములు మన శరీరానికి తగులుతూ, ఊర్ద్వలోక విహారానుభూతిని కలిగిస్తాయి. ఉత్సాహముతో ఎంతో ఆనందముతో ప్రకృతి దృశ్యాలను తిలకిస్తూ బదరీ చెరుకోవాలి. ఇచ్చట వాతావరణం అతి శీతలముగా ఉండును. మంచుతో నిండియున్న ఆ ప్రదేశంలో చలికి తట్టుకోవడం చాలా కష్టం. 

బదరీ గద్వాల్ దేశములో ఉన్నది. బదరీని 'విశాలపురం' అని కూడా పిలుస్తారు. ఈ ప్రదేశము రేగువనముతో నిండి ఉన్నందున బదరీ అని పేరు వచ్చెను "బదరీ విశాల్ కి జై" అని భక్తులు అంటూ ఉంటారు. ఇచ్చట భగీరధుడు వేయి సంవత్సరములు తపమాచరించినాడు. నగరు చక్రవర్తి తొంభైతొమ్మిది అశ్వమేధ యాగములు చేసి, నూరవ యాగాశ్వాన్ని విడ్డిచిపెట్టినాడు. అది సఫలీకృతమైతే, అతనికి దేవేంద్రపదవి లభిస్తుంది. యిది గమనించిన దేవేంద్రుడు పదవీచ్చుతుడానవుతానని (పదవి పోతుందేమో నని), భయపడి, ఆ యాగాశ్వాన్ని అపహరించి, కపిల మహాముని చెంతకట్టి నిర్భంధించినాడు. నగరపుత్రులు, అరువది వేలమంది అశ్వము వెతుకుటకు దశదిశలు గాలించినారు. తుదకు కపిల మహాముని వద్ద ఆశ్వమును చూచి, సమాధిలో నున్న అతనిని దొంగగా నిర్ణయించి, కోపముతో నిప్పు ముట్టించినారు. కపిల మహాముని కళ్ళుతెరచి వారిని భస్మము కమ్మని శపించినాడు. ఈ విషయం తెలిసిన నగరుడు దుఃఖసాగరమున మునిగి, క్రమముగా కృశించిపోసాగాడు. అతని పెద్దకుమారుడు అయిన అంశమంతుని కూమారుడు భగీరధుడు, తన పితృమూర్తుల చితాభస్మముపై గంగను ప్రవహింపచేస్తానని వేయి సంవత్సరములు తపమాచరించినాడు. వియత్తలము నుండి గంగపడినప్పుడు, ఆపగల మహానుభావుడు ఈశ్వరుడొక్కడేయని తెలుసుకొని తపము చేసి అతనిని ఒప్పంచినాడు. ఇక్కడ నుండి గంగ గంగోత్రి అయినది. అలకనంద ఒడ్డునే బదరి ఉన్నది. సమీపాన కొండ చరియలలో ఉన్న మేడలు, మిద్దెలు చూస్తూ ఉంటే దేవలోకం స్మృతి కలుగుతుంది. అలకనంద ఒడ్డునే పయనిస్తూ రుద్రప్రయాగ దగ్గర మందాకినీ అలకనంద సంగమములైనవి. 

భగీరధుడు ఇక్కడ కూడా వేయి సంవతరములు తపస్సు చేయగా, రుద్రుడు ప్రత్యక్షమై భగీరధుని కోరిక మేరకు గంగను ధరించినాడు. గంగను జటాజూటమున బంధించి, రుద్రుడు ఒక దారను మాత్రమే విడువగా, భగీరధుని వెంట గంగ ప్రవహించి, మూడు లోకములను పవిత్రము చేసి భగీరధుని పితృ చితాభస్మము మీద ప్రవహించి వారిని ఉర్ద్వలోక, నివాసయోగ్యతను కల్పించెను. 

రుద్రప్రయాగ నుండి చాలా ఎత్తునకు వెళ్ళగా కర్ణ ప్రయాగ వచ్చును. కర్ణప్రయాగ నుండి నంద ప్రయాగ వెళ్ళాలి. ఇచ్చట నంద గంగ, అలకనంద నదులు సంగమము అగుచున్నవి. నందుడు విఘ్ణవును గూర్చి గొప్ప తపస్సు చేసెను. నంద ప్రయాగ నుండి, హనుమాన్ చెట్టి చేరుతాము. హనుమంతుడిచట చిరంజీవియై తపమాచరించుచున్నట్లు చెప్పుదురు. హనుమాన్ చెట్టి నుండి బదరీధామము చేరాలి. రెండు వేల అడుగుల ఎత్తున, అయిడు మెళ్ళు పొడవు, నారయణ పర్వతము ఉన్నది, ఎటు చూచినా మనోహరముగా కనిపించును.

బదరీనాధ్ దేవాలయం

పూర్వము సూర్యని కుమారుడు కర్ణుడు, సహస్త్ర కవచధారియై సమస్త లోకములను బాధించుచుండగా, సమస్త లోకవాసులు, విష్ణువును శరణుజొచ్చినారు. కర్ణుని తపశ్శక్తి చేత చంపుటకు వీలుగాదని తలచి, విష్ణువు, నర, నారాయణుల ఇరురూపము దాల్చినాడు, బదరీ ప్రాంతమున వేయి సంవత్సరములు తపస్సు చేసినాడు. నారాయణరూపమున, కర్ణునితో వేయి సంవత్సరములు యుద్ధము చేసి ఒక కవచము ఊడగొట్టినాడు. మరల నరుని రూపమున మరియొక కవచము ఊడగొట్టినాడు. ఇట్లు కర్ణుని కవచములు తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఊడిపోగా, ఆ ఉన్న ఒక్క దానితో సూర్య మండలములో దాగినాడు. అప్పుడే ద్వాపరయుగము ప్రారంభమైనది. దూర్వాస మహర్షి మంత్ర ఫలితముగా సూర్యని వలన కర్ణుని తిరిగి కుంతి కన్నది. భూలోకమునకు వచ్చిన కర్ణుని సంహరించుటకు నర నారాయణులు తిరిగి కిరీటి, కృష్ణులుగా జన్మించినారు. 

బదరీలో ఉన్నంతసేపు ఆకలిదప్పులు ఉండవు. అంతకన్నా మానవునికి కావలసినదేమున్నది. బదరీలో నారద, గరుడ ప్రహ్లాద, నృసింహ, ఉద్దవ శిలలు, ఈ శిలల నుండి ఏనుగు తొండము లావున సెగలు, పొగలు, గ్రక్కు వేడినీరు ప్రవహిస్తున్నది. దీనినే అగ్ని తీర్ధమందురు. స్నానము చెసిన వెంటనే, శరీరము మువ్వలా తయారై అమరత్వము సిద్ధించునట్లు అనిపించును. 

అగ్ని తీర్ధము దగ్గరలో ఆలయము కలదు. దీనికి ముఫై రెండు మెట్లు కలవు. ఆలయ ప్రాంగణములో, మొదట ద్వారము పంచలోహములతో, రెండవ ద్వారము వెండితో, మూడవ ద్వారము బంగారముతో చేయబడినవి. యివి దాటి గర్భాలయము చేరుకుందుము. 

ఆదినారయణ స్వామి నిర్యాణస్ధితిలో పద్మాశనుడై భక్తులను ఆశీర్వదిస్తూ ఉంటాడు. కుడి ప్రక్క నరనారాయణులు, ఎడమ ప్రక్కన గణపతి, ఉద్దవుడు, గరుడుడు, మహాలక్ష్మీ ఉంటారు. పాదముల చెంత తుంబుర నారదులు గానము చేస్తూ కనిపిస్తారు. స్వామిని పరిశీలనగా చూడవలెను. లేకున్న కనిపించుకుండును. తొమ్మిది అంగుళముల స్వర్ణకీరీటము కనిపించును. కొందరు దీనినే స్వామి అనుకొనెదరు. భక్తి శ్రద్ధలతో స్వామిని దర్శించి తరించవలె నన్న ఏకాగ్రత ఉండవలెను.

అర్దరాత్రి వేళ, ఆలయ ప్రాంగణానికి వెళితే అమరగానం మనకు వినిపిస్తుంది. బదరీలో వర్ణ విచక్షణ లేదు. బదరీలో బ్రాహ్మణ ముదుసలి మూడు వందల అరువది రోజులుంటుందట. ఈ ఆలయంలో 6 నెలలు మానవులు, 6 నెలలు దేవతలు పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అక్టోబరు నెల నుండి ఆరు మాసములు, నరసంచారము ఉండదు. బ్రాహ్మణ ముదుసలి మూదు వందల అరువది రోజులుంటుందట. బ్రాహ్మణ ముదుసలి - నర నారాయణులు మాత్రమే ఉంటారు. మరల ఆలయము తెరుచు సమయమునకు, జ్యోతి దర్శనార్దం భక్తులు తండోపతండాలుగా వస్తారు. పాండవుల స్వర్గధామము చేరునపుడు, బదరీ నాధుని సేవించి తరించినారు. ఆనాడు మానవుడు జీవించి ఉండగా వైకుంఠ ప్రాప్తికి నోచుకోలేదు. మరి ఈనాడు, మానవుడు జీవించి ఉండగానే వైకుంఠము వెళ్ళి తిరిగి భూలోకమునకు వచ్చు చున్నాడు. కలియుగములో భక్తులకు ఆపూర్వ అవకాశము ఇది.

No comments:

Post a Comment