Tuesday, May 20, 2014

ఈ రోజు మనం రామేశ్వరం గురించి తెలుసుకుందాం ...

దేశంలోని చతుర్ధామాల్లోని మొదటి ధామంగా భావించబడుతుంది. ఈనాలుగు ధామములతో దేశం నలుమూలలూ చుట్టివేసినట్లే. మొదటిది రామేశ్వరం, రెండవది ద్వారక, మూడవది పూరి జగన్నాధ్, 4వది-బదరీనాధ్ ధామం. ఉత్తరాన కాశీ వెళ్తామని వెళ్ళకపోయినా ఫరవాలేదట. కాని దక్షిణాదిన రామేశ్వరం వెళ్తామని అనుకొని వెళ్ళకపోతే మహపాతకమట. మీ మనస్సులోకి వెళ్దామనే సంకల్పం మాత్రంగానే మన పితృదేవతలు మన రాకకోసం స్వర్గంలో నిరీక్షిస్తారట. కనుక ప్రతివారూ కనీసం ఒక్కసారైనా కాశీ క్షేత్రాన్ని దర్శించవలె. మొదటగా కాశీ వెళ్ళి గంగాజలం తెచ్చి రామేశ్వరంలోని శ్రీ రామలింగేశ్వరుని అర్పించితేగాని జన్మసాఫల్యంగాదు. ఇది ప్రతి భారతీయుడూ చేయదగినపని యని మా భావం. రామేశ్వరం దర్శించటానికి దేశం నలుమూలల నుండి అన్ని రాష్ట్రాలు నుండి రావటం గమనించగలం. 

ఇక్కడ చూడదగినవి-చూడవలసినవి- శ్రీరామనాధస్వామి లేక రామేశ్వర దేవాలయం. స్వామి రామలింగేశ్వర స్వామి. అమ్మవారు పర్వతవర్దనిదేవి. కోదండ రామస్వామి ఆలయం, గంధమాదన పర్వతం చూడదగినవి.

రామేశ్వర దేవాలయం:

ఆలయ నిర్మాణం దాదాపు క్రీ.శ. 12వ శతాబ్దంలో మొదలయి తరువాత అనేక రాజవంశాలు అనేక రీతుల అభివృద్ధి పరచినట్లుగా తెలుస్తుంది, పురాణకథగా రామాయణ కధాకాలంలో కధప్రకారం సీతమ్మవారిని లంకేశుడు చెరబట్టి తీసికొని వెళ్ళిన తరువాత, అమ్మవారి జాడ కనుగొని లంకాధిపతి రావణుని సంహరించివేశాడు శ్రీరాముల వారు. రావణుడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణుని చంపినాడు గాన బ్రహ్మ హత్యాదోషము అంటింది శ్రీరాములవారికి. అప్పుడు శివలింగ ప్రతిష్ఠ చేయవలసిందిగా పెద్దలుసలహా యిచ్చారు శ్రీరామచంద్రుల వారికి. వెంటనే ప్రియభక్తుడైన వాయుపుత్రుడు హనుమంతుని హిమాలయాల్లోని కైలాసగిరి యందున్న శివలింగమును తెమ్మని పంపారు. వాయువేగ, మనోవేగాల్తో వెళ్ళాడు హనుమ. ముహుర్తం దగ్గర పడుతోంది. హనుమ జాడలేదు. అప్పుడు సీతమ్మవారు తన స్వహస్తాలతో సైకత లింగమును అక్కడిక్కడే తయారు చేసింది. సీతారాములు శివలింగ ప్రతిష్ఠ జరిపారు. అంతలోనే హనుమ కైలాసగిరి నుండి వచ్చాడు శివలింగముతో. హనుమంతుని చిన్న బుచ్చకుండా అదిగూడా ప్రతిష్టించారు సీతారాములు మొదట హనుమతెచ్చిన లింగము పూజించబడింది. శ్రీరాముల వారిచేత ప్రతిష్టించబడినది, శ్రీరామ లింగేశ్వరుడని పిలుస్తారు శ్రీరామ భక్త హనుమాన్ తెచ్చినది శ్రీ కాశీవిశ్వేశ్వర లింగం. 

ఈ శివక్షేత్రంలో ఆలయం కట్టుబడిలోను, శిల్పకళలోను ద్రావిడ శిల్ప రీతులకి మణిపూసయై నిలిచింది. ముచ్చటగా మూడు ప్రాకారాలున్నాయి. మొదటి ప్రాకారంలో గర్భాలయం అయితే శ్రీరామ ప్రతిష్ఠిత జ్యోతిర్లింగము ప్రతిదినం గంగాజలాభిషేక వైభవం జరుగుతుంది. ప్రక్కనే కాశీవిశ్వనాధ లింగము. ఈ ప్రాకారంలో కోటితీర్ధము, సర్వతీర్ధము ఉన్నాయి. 

రెండవ ప్రాకారంలో అమ్మవారి దేవాలయం ఉంది. నూతనంగా అనేక విధముల అభివృద్ధి పరచబడింది. ఆలయ గోపురం, గొప్ప నందీశ్వరుని విగ్రహాలు సున్నంతో నిర్మించి రంగులు వేయబడియున్నవి.

3వ ప్రాకారం:

ఇది ఒక మహల్ మాదిరిగా నిర్మించబడింది. ప్రాకారంలోని మంటపము కడుంగడు ఆశ్చర్యాన్ని గొలిపేది. 4000 అడుగుల పొడవు, 21 అడుగుల వెడల్పు, 30 అడుగుల ఎత్తుగలిగి ఈ చివరినుండి ఆ చివరివరకు కనబడుతూ గాలికొరకు వెంటిలేషన్ ఏర్పాటుతో మండప స్థంభాలన్నీ చిత్రవిచిత్రాలైన శిల్పాలతో పొదిగియున్నది. ప్రపంచం మొత్తం మీద ఇది ఒక్కటే అని చెప్పవచ్చు. చక్కటి ఆర్చీలు తీర్చిన ప్రాకారంలో రామలింగ విగ్రహములు, శ్రీ కోదండ రామస్వామి, నటరాజ మందిరం, సేతుమాధవ స్వామి ఆలయం, కోనేరు, ఇతర తీర్దాలు ప్రాకారంలోని విశేషాలు తూర్పువైపున సముద్రం, పడమటి వైపున గోపురాలు ఉన్నాయి. ఆలయ నిర్మాణ విశిష్టత అంతా గోపురాల్లోను, ఈ ప్రాకారంలో మండపంలోను నిక్షిప్తమైఉంది. సేతు యాత్రాక్రమం ఆనంద రామాయణంలో ఉన్నది. అనుసరించదగినది. 

దేవాలయంలో 22 తీర్ధాలు, ఇతరత్రా 21 తీర్ధములు ఉన్నాయి. తీర్దాల్లో స్నానం చేయువారు ముందుగా పురోహితునితో మాట్లాడుకొని సాగించవలెను. ఓషధుల కలయిక ఉందని నమ్మకం ఉండటంచేత శరీర రుగ్మతలతోబాటు, ఆత్మ ప్రక్షాళనం జరుగుతుందని ప్రతీతి.

తీర్ధములు ఆలయం లోనివి:

మహాలక్ష్మి, సావిత్రి, గాయత్రి, సరస్వతి, మాధవ, గంధమాదన, గవాక్ష, గవయ. నల, నీల, శంక, శంకర, బ్రహ్మహత్యా విమోచన, సూర్య, చంద్ర, గంగ, యమున, గయ, శివ, సత్యామృత, సర్వతీర్ధము, కోటి తీర్ధము. ఇవి 1,2,3 ప్రాకారాల్లోనే అమరియున్నవి. ఆలయం వెలుపల, పరిసర ప్రదేశాల్లో మరో 21 తీర్ధాలున్నాయి. చాలావరకు గంధమాదన పర్వతానికి వెళ్ళివచ్చే దారిలో ఉన్నాయి. 

దేవస్థానంలో వివిధ రాజవంశీయులు సమర్పించిన గొప్ప విలువగల ఆభరణాదులు ఎన్నో ఉన్నవి. గంధామదన పర్వత మార్గంలోగల తీర్ధస్నానములు, తీర్ధవిధుల నిర్వహిస్తూ చేయబడేవాటికి ముందుగా మాట్లాడి తరువాత అనుసరించటం ఎంతయినా మంచిది.

రామేశ్వర పరిసరాల్లో దర్శించదగిన క్షేత్రాలు:- 

గంధమాదన పర్వతము:

రామాయణ యుద్ధకాండంలో దీనికి విశిష్ట ప్రాధాన్యత ఉంది. హనుమంతుడు లంకకు వెళ్ళటానికి, శ్రీరాములవారు తన వానర సైన్యమును నడిపించినది కూడ ఇక్కడి నుండే. శ్రీరాముల వారు రావణ వధానంతరం లింగప్రతిష్ఠను గూర్చి అలోచించినదిక్కడేనట. రెండస్థుల ఈ దేవాలయం ఎక్కితే రామేశ్వర ద్వీపం దృశ్యమానంగా కనబడుతుంది. 

ఇంకా - ఏకాంత రామేశ్వరాలయం, నంబినాయకి అమ్మన్, సీతాగుండం, విల్లోరినీ తీర్ధము, భైరవతీర్ధం కోదండరాముని కోవెల మొదలగునవి దర్శించతగినవి.

ధనుష్కోటి:

1964లో వచ్చిన తుఫానులో మిగిలింది కోదండరామస్వామి ఆలయం మాత్రమేనట. ఇది ఒక ద్వీపం. ఇక్కడే రావణుని తమ్ముడు విభీషణుడు శరణుజొచ్చినచోటు. యుద్ధానంతరం వానరులు నిర్మించిన సేతువును పగుల గొట్టారట ఇక్కడ. శ్రీరాములవారు బాణముతో కొట్టగా వంతెన విచ్చిపోయి రత్నాకరము, మహొదధి, రెండున్నూ కలిసిపోయాయట. ధనుస్సుచే పగులగొట్టటంచేత ధనుష్కోటి అనే పేరు సార్ధకమయిందంటారు. ఇక్కడ 108గాని, 36గాని సముద్రస్నానాలు చేయాలని అంటారు భరద్వాజ మహర్షి పిర్ణయానుసారంగా చాంద్రాయణ వ్రతఫలం గలుగుతుందని నమ్మిక. 

రెండు సముద్రాలు కలిసేచోట యిసుకను తీసికొని రామేశ్వరంలో 3భాగాలు చేసి పూజించాలట. 2 భాగాలు దానంచేసి 3వభాగం జాగ్రత్తగా పదిలంగా పట్టుకువెళ్ళి ప్రయాగలో త్రివేణి సంగమంలో సమర్పించాలట. ఇక్కడ చేసిన దానం కోటి రెట్లధిక ఫలమట.

No comments:

Post a Comment