Tuesday, May 20, 2014

ఆలూరుకోన శ్రీరంగనాధస్వామి

భూలోకం సుభిక్షంగా ఉండడం కోసం, ప్రజలు ఆనందంగా జీవించడం కోసం, యాగాలనాచరించడమే కర్తవ్యంగా భావించి నిరంతరం భగవంతుడికీ ప్రజలకూ సేవలు చేసే సంకల్పమున్న మహర్షులు ఎందరో ఉన్నారు. వారి కోవకు చెందిన వారే విశ్వామిత్ర మహర్షి, ఒకసారి ఒక దట్టమైన వనంలో యాగం చేయడానికి సంకల్పించారు. 

ప్రజలు సంతోషంగా జీవించడం నచ్చని తాటకి అనే రాక్షసి తన తమ్ముడైన మారీచుడిని మరియు మరి కొందరు రాక్షసులను పిలిచి యాగాలను ఛిన్నా భిన్నం చెయమని ఆజ్ఞాపించింది. మారీచుడు తదితరులు మహర్షులు లోక సమ్రక్షణార్ధం చేసే యాగాలను ప్రతీసారి ధ్వంసం చేసి మునులను ఇక్కట్లుపాలు చేసేవారు. 

ఎన్ని మార్లు యాగాన్ని మొదలు పెట్టినా ఏదో ఒక అవాంతరం వాటిల్లి యాగాన్ని ముగించలేక పోయారు మహర్షులు. ఈ అన్యాయాలకు తాటకి మూలకారకురాలని తెలుసుకున్నాడు విశ్వామిత్రుడు. తన దివ్య దృష్టితో భవిష్యత్తులో జరిగే సంఘటనలు తెలుసుకున్నారు. వెంటనే అయోధ్యకు వెళ్ళి దశరధమహారాజుని కలుసుకుని తాటకి చేస్తున్న అక్రమాలను అరికట్టడానికి బాలురైన రామలక్ష్మణులను పంపి, లోకాన్ని రక్షించమన్నాడు విశ్వామిత్రుడు. 

బాలురైన రామలక్ష్మణులను రాక్షసిని సణారం చేయడానికి పంపడానికి సంకోచించాడు దశరధమహారాజు. రాజ వంశ కులగురువైన వశిష్టుడు ధైర్యం చెప్పగా బాలురను విశ్వామిత్రుని వెంట అడవులకు పంపాడు దశరధమహారాజు. 

రామలక్ష్మణులు తమ ధనస్సు తీసుకుని విశ్వామిత్రుడి వెంట యాగశాల వున్న దట్టమైన అడవికి బయల్దేరారు. విశ్వామిత్రుడు మరో మారు యాగాన్ని ప్రారంభించాడు. తాటకి తన అనుచర రాక్షసులతో అక్కడికి వచ్చింది. 

అసుర సంహారం కోసం వచ్చిన రాముడు యాగాన్ని ఆపడానికి వచ్చింది ఒక శ్త్రీ అని తెలుసుకుని వెనుకంజవేయగా, విశ్వామిత్రుడు భుజం తట్టి రాక్షసి పై విల్లు ఎకుపెట్టమని ఆజ్ఞాపించాడు. మహర్షి మాట కాదనలేక బాణము గురిపెట్టాడు రాముడు. 

రాముని బాణం భారీకాయురాలైన తాటకికి తగిలి నేలకొరిగింది. వైకుంఠనాధుని చేత మరణం వాటిల్లినందువల్ల మోక్షం పొందింది తాటకి. తాటకి సణారం గురించి తెలుసుకున్న మిగిలిన అసురులు పరుగు లంఘించారు. యాగం మొదలైంది. నిరాటకంగా సాగింది. 

అసుర సంహార దోషపరిహారం కావించడానికి ఒక శివలింగాన్ని ప్రతిష్టించమని చెప్పాడు విశ్వామిత్రుడు. తాటకిని సంహరించి, ఆమె ప్రాణాలు వదిలిన స్ధలంలో శివలింగాన్ని ప్రతిష్ఠ చేయడానికి నిశ్చయించుకుని తగిన చోటు కోసం వెదికాడు రాముడు. 

పెన్నానది ఒడ్డున అడుగుపెట్టిన రాముడు ఒక చిన్న ప్రాంతంలో ఉన్న ఒక బుగ్గలో కైలాసనాధుడు స్వయంభువ లింగరూపంలో దర్శనమివ్వడంతో పరమానందభరితుడయ్యాడు. పరుశురాముడు పూజించిన స్వయంభువు లింగం అదే అని తెలుసుకున్న విశ్వామిత్రుడు ఆ లింగాన్ని అక్కడే ప్రతిష్ట చేయమని చెప్పాడు. 

ఆ లింగాన్ని ప్రాణప్రతిష్ఠ చేసి పూజలు భక్తితో చేశాడు రాముడు. అసుర సంహారం వల్ల అదీ ఒక స్త్రీని సంహరించినందువల్ల పొందిన దోషం పరిహారమయ్యింది. ఆ తర్వాత అయోధ్యకు వెళ్ళే మార్గంలో విశ్వామిత్రుడి మార్గదర్శకత్వంలో రాముడు జనక మహారాజు కుమార్తె జానకిని స్వయంవరంలో గెలిచి పరిణయమాడాడు శ్రీరాముడు. 

తాటకికి మోక్షం శ్రీరాముడి పరిణయం ఈ దృశ్యాలన్నిటిని విశ్వామిత్రుడు తన దివ్యదృష్టితో ఏనాడో తెలుసుకున్న విషయాలు. తాటకికి మోక్షప్రాప్తి లభించిన చోటే ఈనాడు తాడిపత్రిగా పరిగణించబడుతుంది. ఇక్కడ రాముడు ప్రాణప్రతిష్ఠ చేసి పూజించిన లింగాన్ని రామలింగం అంటారు. ఆలయము నిర్మించబడింది. 

క్రీ.పూ. 1460 సంవత్సరంలో మొదలైన ఆలయనిర్మాణం క్రీ.పూ 1475 సంవత్సరంలో ముగిసింది. బుక్కా రామలింగస్వామి ఆలయం పేరున పిలువబడుతుంది. ఒక అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం చూడగలం. 

విశ్వామిత్రుడు యాగం జరిపిన అరణ్య ప్రాంతం తాడిపత్రికి దగ్గరలో వున్న కొండ చరియపై నెలకొన్న ఆలూరుకోన అని అంటారు. పురాణకధ ప్రకారం ఈ పుణ్యక్షేత్రం 14వ శతాబ్దంలో పాలించిన ఎర్రమ్మ తిమ్మరాజు అనే రాజు ఆలయాన్ని నిర్మించారు. 

ఆ ఆలయంలో తాటకికి మోక్షాన్నిచ్చిన వైకుంఠవాసుడు శ్రీరాముడికి కులదైవమైన శ్రీరంగనాధుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.కొండపై చిన్న ఆలయ ద్వారం దాకా మనం వాహనాల్లో వెళ్ళగలిగేంత సౌకర్యంగా ఉన్నాయి రహదారులు. 

తాడిపత్రి నుండి ఆరు కి.మీ దూరంలో ఉన్న ఆల్లొరు కోన దట్టమైన అడవిలో పక్షులు కలకలరవాలు మధ్య ప్రయాణం చేయాలి. సహజమైన ప్రకృతిని ఆస్వాదిస్తూ కోనను చేరుకోవచ్చు. 

ఆలయ దరిదాపులకు వెళ్ళినప్పుడు ఎక్కడో జలపాతం సవ్వళ్ళు మంద్రంగా వినిపిస్తాయి. సుమారు 50 మెట్లు ఎక్కి వెళ్తే ఒక మండపం ఆ తర్వాత ఆలయగోపుర ద్వారం గుడి లోపలికి ప్రవేశిస్తే విశాలమైన వసార చివర బలిపీఠం, ధ్వజస్తంభం, గరుడ ్భగవాన్‌ సన్నిధి. గరుడ భగవాన్‌ శ్రీరంఘనాధుని సేవలoోనిరంతరం తన్మయత్వంతో ఉన్నట్టు దర్శనమిచ్చే విగ్రహం. 

గరుడ భగవాన్‌ ఎదుట ఒక మండపం ఆ తర్వాత గర్భగుడి. భక్తుల కోరికలను తీర్చే ఈ శ్రీరంగనాధుడు పడమటి దిక్కున శిరస్సు నుంచుకొని తూర్పువైపుకి కాళ్ళు పెట్టుకుని శేషశయనంపై పవళించిన విగ్రహం పాదాల వద్ద శ్రీదేవి, భూదేవి కూర్చున్నట్టున్న విగ్రహాలు దర్శనమిస్తాయి. నాభియందు బ్రహ్మ సాక్షాత్కరిస్తాడు. 

మాములుగా శేషశయనంపై పవళించే శ్రీరంగనాధుని విగ్రహాలు మట్టితో తయారు చేసినవే. కాని ఈ క్షేత్రంలో వున్న శయనించిన శ్రీరంగనాధుడి విగ్రహం నల్లరాతితో చెక్కిన విగ్రహం. వైష్ణవ గురువైన శ్రీరామానుజల వారికి గర్భగుడి నిర్మించారు. 

బయటి ప్రాకారంలో వరుసగా శంఖుచక్రాలు దర్శనమిస్తాయి. ప్రతి సంవత్సరమూ చైత్రంలో బ్రహ్మోత్సవము జరుగుతుంది. ధ్వజారోహణ, సింహవాహనము, హనుమాన్‌ వాహనములపై స్వామి వారి ఊరేగింపు పురవీధులలో జరుగుతుంది. 

రధోత్సవము, కళ్యాణోత్సవము మొదలైనవి చాలా ఘనంగా జరుగుతున్నాయి. శ్రీరాముడి కులదైవమైన శ్రీరంగనాధుడే ఈ ప్రాంతం లోని ప్రజలకు ఇష్టదైవం. ఇంటి దైవముగా బాసిల్లుతున్నాడు. తమ కోర్కెలు తీర్చే ఈ దేవుడికి ముడుపులు చెల్లించడానికి ఎందరో భక్తులు అనంతపురం, ధర్మవరం, బళ్ళారి, కదిరి, నుండే కాక ఆంధ్ర రాష్ట్రములో పలు చోట్ల నుండి కూడా వస్తారు. 

ఆలయంలో వాయువ్య మూలలో ఎప్పుడూ ఊరే బుగ్గలో స్నానం చేసి స్వామిని దర్శించి కానుకలను, ముడుపులను చెల్లించి ప్రశాంతంగా ఆలయం వెలుపలికి వస్తారు భక్తజనులు. 

పచ్చని చెట్ల మధ్యన ప్రకృతి సౌందర్యంతో నెలకొన్న ఈ ఆలయంలోని శ్రీరంగనాధుని దర్శించి స్వామి వారి అనుగ్రహం పొందుతాం.

No comments:

Post a Comment