Friday, May 23, 2014

నీతి, నిజాయితీ, ధర్మం కలగలిసిన పాలనే రామరాజ్యం

రాముడు మంచి బాలుడే!
రామాయణం జీవిత విలువల్ని బోధించడమే కాదు వాటిని కాపాడేందుకు మార్గాలు చూపిస్తుంది. మనిషి గుణగణాలు ఎలాఉండాలన్నదానికి రఘుకులోత్తముడైన శ్రీరాముడు ప్రతీక. అలాగే సాద్వీమణి సీతమ్మ కూడా ఆడవారికి మార్గదర్శి. రాముడి నుంచి మనం ఏం నేర్చుకోవాలన్నది రామాయణం చెప్తుంది. దైవికశక్తులతో దుష్టసంహారం చేసిన చారిత్రక పురుషుడు శ్రీరాముడు. దైర్యసాహసాలు, సహనశీలత, దయార్ధగుణం, పితృవాక్యపాలన, ధర్మనిరపేక్షత... ఇలా చెప్పకుంటూపోతే చాలా గుణాలుంటాయి. అందుకే సకల గుణాభిరాముడంటారు.

దేవుడెలా ఉంటాడో చెప్పిన మహామనిషి

రాముడు మనిషా... దేవుడా అనే సందేహం రావచ్చు. రాముడు ఆదర్శవంతమైన రాజు. అందుకే చారిత్రక పురుషుడయ్యాడు. శ్రీమహావిష్ణు అవతారం. కాబట్టి దేవుడయ్యాడు. సకల శక్తి సంపన్నుడైన రాజుగా జనాధరణ పొందాడు. దశరథ మహారాజు మాటను జవదాటని ఆదర్శ కుమారుడు రాముడు. ధర్మం నాలుగు పాదాలా నడిచేలా చూసిన ధర్మబద్ధపాలకుడు. ప్రజావాక్కునే దైవవాక్కుగా భావించిన న్యాయపరిపాలకుడు. ఏకపత్నీవ్రతానికి కట్టుబడిన ఆదర్శపతి. లక్ష్మణ, భరత, శత్రుఘ్నులకు మార్గనిర్దేశంనం చేసిన మంచి సోదరుడు. రావణుడి సోదరుడు విభీషణుడికి, వాలి సోదరుడైన సుగ్రీవుడికీ స్నేహహస్తం అందించిన మంచి మిత్రుడు. అతులిత బలశాలి హనుమంతుడికి గురువు. అందుకే రాముడు ఏ ఆజ్ఞ ఇచ్చినా శిరసావహించేందుకు ఎప్పుడూ వెనుకాడలేదు ఆ ఆంజనేయుడు.
ఆదర్శ కుమారుడు రాముడే

శ్రీరాముడు ఆదర్శ కుమారుడు కావడంతోనే రామాయణం మొదలవుతుంది. అయోధ్యానగరానికి రాజైన తండ్రి దశరథుడు, తల్లి కౌసల్యాదేవి మాటను రాముడేనాడూ జవదాటలేదు. దశరథుడి మరో భార్య అయిన కైకేయి... రాముడు రాజ్యాన్ని విడిచి వెళ్లాలని కోరగానే తండ్రి మాటను కాదనకుండా అడవులకు వెళ్లిపోయాడీ ఆదర్శ కుమారుడు. రాచరిక దర్పాన్ని, భోగభాగ్యాలను, సుఖసౌఖ్యాలను తృణప్రాయంగా భావించి అడవులకు వెళ్లిపోయిన నిరాడంబరత్వం రాముడిది.తనను రాజ్యం వదిలేసి వెళ్లమన్న తల్లి కైకేయి గురించి ఒక్క క్షణమైనా చెడుగా ఆలోచించలేదు. అరణ్యవాసం ముగించి తిరిగి రాజ్యానికి వచ్చినప్పుడు రాముడు మొదట కైకేయి పాదాలనే తాకి నమస్కరించాడు. ఆ తర్వాతే మిగతా ముగ్గురు తల్లులకు నమస్కరించాడు. రాముడు సదా తండ్రి మాటను గౌరవించడమొక్కటే తన ముందున్న మార్గమనుకున్నాడు.
సమర్ధుడైన సోదరుడు

లక్ష్మణ, భరత, శతృఘ్నులు ముగ్గురినీ సమానంగా ఆదరించిన అన్న రాముడు. సీతాదేవితో కలిసి రాముడు అరణ్యవాసం చేస్తున్నప్పుడు సోదరుడు లక్ష్మణుడు కూడా తోడుండేవాడు. రాజ్యానికి తిరిగిరావాలని, పాలనాధికారం చేబట్టాలని కోరేందుకు భరతుడు అన్నను వెతుక్కుంటూ అడవులకు వస్తాడు. అయితే భరతుడిని చూసిన లక్ష్మణుడు చెడుగా ఆలోచిస్తాడు. రాముడిని అరణ్యవాసానికి పంపించిన కైకేయి భరతుడికి తల్లి కావడమే ఆ కోపానికి కారణం. అయితే రాముడు సోదర ప్రేమతోనే ఆప్యాయంగా ఆహ్వానించి ఆదరిస్తాడు.

స్నేహశీలత చాటిన కిష్కింధకాండ

శ్రీరాముడిలోని స్నేహశీలతకు రామాయణంలోని కిష్కింధకాండ దర్పణం పడుతుంది. కిష్కింధ రాజైన వాలి సోదరుడు సుగ్రీవుడు, రావణుడి సోదరుడైన విభీషణుడు రాముడికి మంచి స్నేహితులు. సుగ్రీవుడి రాజ్యాన్ని తిరిగి అప్పగించడానికి రాముడు వాలిని హతమారుస్తాడు. లంకలో రావణుడితో యుద్ధం జరుగుతున్నప్పుడు న్నాయబద్ధ ఆలోచనతో విభీషణుడు రాముడికి అండగా నిలుస్తాడు. రావణ సంవారం తర్వాత లంకా రాజ్యాన్ని విభీషుణికే అప్పగించి తన గొప్పదనాన్ని చాటుకున్నాడు రాముడు.
ఏకపత్నీవ్రతుడిగా ఆదర్శనీయుడు

తండ్రి మాట జవదాటకుండా అడవుల్లోకి వెళ్తున్నప్పుడు ధర్మపత్రి సీతాదేవిని రాజ్యంలోనే ఉండిపొమ్మని ఎంతగానో నచ్చచెప్పాడు రాముడు. తాను అనుభవించబోయే కష్టాల్లో పాలుపంచుకోవాల్సిన అవసరం తన సతికి లేదనేది ఆయన భావన. అయినా సీతాదేవి పతియే ప్రత్యక్ష దైవమనుకుంటూ భర్తవెంట నడిచింది.
ప్రజాక్షేమం కోరిన రామరాజ్యం

అయోధ్య ప్రజలే తనకు ముఖ్యమనుకున్న ఆదర్శ రాజు రాముడు. అందుకే అరణ్యవాసం తర్వాత ఓ అనామకుడు లేవనెత్తిన సందేహాన్ని పరిగణనలోకి తీసుకుని కట్టుకున్న భార్యను అగ్ని పరీక్షకు పంపించాడు. ప్రజల మాటకు విలువనిచ్చాడే గానీ ఆ లోకాభిరాముడు ఏనాడూ సాద్వీమణి సీతాదేవిని శంకించలేదు. నీతి తప్పని ధర్మబద్ధపాలన అందించడమే రామ రాజ్యమనుకున్నాడు రాముడు. ప్రజలందరికీ సమాన న్యాయం, సమాన గౌరవం అందించడమే రాజుగా తన కర్తవ్యమని భావించాడు రాముడు. నీతి, నిజాయితీ, ధర్మం కలగలిసిన పాలనలోనే ప్రజలకు నిజమైన న్యాయం అందుతుందని ఆశించాడు. అందుకే సర్వాజనామోదం పొందిన మర్యాదాపురుషోత్తముడిగా కీర్తి ప్రతిష్టలందుకున్నా

No comments:

Post a Comment