Tuesday, May 20, 2014

శ్రీ అంతర్వేది క్షేత్ర మహత్యము

శిలా శాసనము

"శ్రీయుతుడంత్రవేది నరసింహులకున్‌ కొపనాతియాది నారాయణుడాధ్యుడై భగవదర్పిత బుద్దినివ ప్రసద్విమానయత మంటపాదులు ప్రయంబన కొన్ని ఘటించి సాంగమున్‌ జేయగా నాత్మ జాలికిని చెప్పిన తోడగు రంగనాధునితో దీయుతుడైన కృష్ణుడని దివ్య మహామహిమన్‌ జెలగంగా శాలివాహన శకాబ్ధము లింద్రయ వేద భూధరెంద్దల్‌ యిడివడ్డనగు 1745 తోరపు వత్సరమా స్వభాను వందాయది చైత్ర కృష్ణ దశమార్యమవాసర వేళ బూర్తి జత్యేయ కలంక భక్తి ఘనుతేనని నిచ్చె కృతార్ధచిత్తుడై" 

అంతర్వేదికి శ్రీరాముని రాక త్రేతాయుగమున శ్రీరామచంద్రుడు సీతా, లక్ష్మణ హనుమంతులతో తన గురువైన విశ్వామిత్రుని ఆశ్రమమగు "కౌశికీ సాగర సంగమము"నకు వెడలి, రామలక్ష్మణులిద్దరూ హనుమంతునిచే కొనితేబడిన శివలింగమును అచ్చట ప్రతిష్టించినారు. పిమ్మట తమ వంశ గురువగు వశిష్ఠాశ్రమమునకు "అంతర్వేది" విచ్చేయగా వశిష్ఠ మహర్షి మహదానందముతో స్వాగతము పలికి, తత్వధర్ములైన మునిపుంగవులతో శ్రీరామచంద్రుని పూజించెను. అనంతరము శ్రీరామచంద్రుడు సాగర సంగమమున స్నానమాచరించి, అనేక దానధర్మములు గావించి, నీలకంఠుని సేవించి - వశిష్ఠ మహర్షిచే పూజింపబడు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని సందర్శించి, మూడు అహోరాత్రములు, అంతర్వేదియందు వసించి, పిమ్మట మునిపుంగవుల అనుమతి గ్రహించి పశ్చిమ దిశగా ప్రయాణము చేసెను. 

ద్వాపర యుగమున పాండవ మధ్యముడైన అర్జునుడు తీర్ధయాత్రలు చేయుచూ "ద్రాక్షారామము" "అంతర్వేది" దర్శించినట్టు శ్రీ చామకోఠి వెంకటకవి తన 'విజయ విలాసము'న - కవిసార్వభౌమ శ్రీనాధుడు తన "హరి విలాసము"న స్పష్టము చేసినారు.

శ్రీ కూర్మావతారము

శ్రీ నరసింహ స్వామి సృష్టించిన మాయాశక్తి, రత్నలోచనుని దేహము నుండి రక్త బిందువులను భూమిపై పడనీక త్రాగుచూ - ఆ దానవుని సంహారానంతరము మహాశక్తి విడిచిన రక్తము మహానదియై "రక్త కుల్యానది" పేరుతో అంతర్వేది క్షేత్రము ఉత్తర భాగమున, సముద్రమున కలసినది. ఒక జాలరి చేపలు పట్టుటకై, ఈ నదియందు వలవేయగా అందు చేపలు చిక్కక ఒక శిల వలయందు పడినది. జాలరి ఆ శిలను నిర్లక్ష్యముగా నదిలో పారవేసినా, మరల మరల అదే శిల చిక్కుచుండెను. విసిగి వేసారిన జాలరి ఆ శిలను నేలపై మోది చూర్ణము చేయు ప్రయత్నించగా, ఆ శిలనుండి రక్తము స్రవించి తృటిలో నదియంతయు రక్తశిక్తమాయెను. బెస్తవాడు భయబ్రాంతుడై మూర్ఛిల్లెను. 

అంత స్వామి సాక్షాత్కరించి, నేను గండకీ నదియందు సాలగ్రామ రూపుడనై అవతరించిన విధముగ ఈ రక్త కుల్యానదియందు, కూర్మరూపుడనై అవతరించితిని, కావున ఈ నది పవిత్రమై వర్ధిల్లగలదు. మాఘమాసమున ఆదివారము రోజున సూర్యోదయ కాలమున ఈ నదిన స్నానమాచరించు వారికి, పాపములు తొలగి, సర్వ సౌభాగ్యములు కలుగును. కలియుగమున మానవులు యోగాభ్యాసార్హులు కారు, అంతటి శక్తి యుక్తులు కలవారికి మోక్షము సిద్ధించును, కావున నా శిలా రూపమును, శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారికి నమస్కరించి, స్వామి వారితో బాటు నాకును నిత్యాభిషేకము జరుపుట శుభప్రద మగునని నా ఆజ్ఞగా చెప్పుము"యని అంతర్ధానము అయ్యెను. 

బెస్తవాడు మూర్చనుండి కోల్కొని, ఆనంద పరవశుడై ఆ శిలారూపమును శ్రీ స్వామి సన్నిధికి సమర్పించి శ్రీ కూర్మనాధుని ఆజ్ఞను విన్నవించగా అమిత భక్తులై జనులందరూ శ్రీ కూర్మ నాయకునికి నిత్యపూజలు చేయసాగిరి. 

ఈ సంఘటన జరిగి ఎన్నో వేల సంవత్సరములయినను ఇప్పటికీ అంతర్వేది దర్శించువారు, శ్రీ కూర్మనాయకుని సందర్శించి పూజింతురు. ఈ పుణ్య క్షేత్రము నందలి సముద్రము, సాగర సంగమము, గోదావరినది, రక్త కుల్యానది, చక్ర తీర్ధము మున్నగునవి పంచతీర్ధములుగా ప్రసిద్ధినొందినవి. ఈ పుణ్యక్షేత్రమున పంచతీర్ధములలో స్నానమాచరించిన భక్తులకు సద్గతి ప్రాప్తించును.

కలియుగమున క్షేత్ర వైభవము

కలియుగము ప్రవేశించిన కొంత కాలమునకు అంతర్వేది యంతయు అడవిగా మారినది. కేశవదాసుఅను యాదవుడు, ప్రతిదినము తన గోవులను ఈ అడవియందు మేపుచుండెడివాడు. ఈ గోవుల మందయందు కపిలగోవు యొకటి ఉన్నది. అడవికి చేరిన వెంటనే కపిల గోవు మంద నుండి వేర్పడి, పొదలమాటునకు పోయెడిది, ఇంటికి పోయిన పిదప పాలు ఇవ్వకుండెడిది. కారణము తెలుకొననెంచి యాదవుడు మరునాడు గోవును వెంబడించెను. అడవి చేరి మందనుండి ఆ కపిల గోవు యధాప్రకారము వేర్పడి పొదల మాటున ఒక పుట్టపై క్షీర వర్షము కురిపించసాగెను. ఆ దృశ్యము చూసిన కేశవదాసు భయభ్రాంతుడై భక్తితో స్వామిని స్మరించుకొని గోవులను తోలుకొని ఇంటికేగెను. ఈ విచిత్ర సంఘటనకు కలవరపడి అన్నము భుజింపక, నిద్రరాక, ఏ నడిఝామునో నిద్రించెను. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అతడికి కలలో సాక్షాత్కరించి ఆపుట్టలో ఉన్నది తానేనని చెప్పి, తనకు ఆలయ నిర్మాణము చేయమని ఆజ్ఞాపించి, అంతర్ధానమయ్యెను. కేశవదాసు వెంటనే మేల్కొని, ఎప్పుడు తెల్లవారునాయని నిరీక్షించుచూ సూర్యోదయమగుసరికి గ్రామస్తులనందరినీ సమావేశపరచి, తన గోవు సంగతి, తాను కాంచిన విచిత్ర సంఘటన, కాంచిన స్వప్న వృత్తాంతము తెలుపగా వారందరూ ఆశ్చర్యచకితులైరి. అచట గల జన సమూహము నుండి ఒక బ్రాహ్మణుడు ముందుకువచ్చి, "బ్రహ్మ పురాణము నందు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని వశిష్ట మహర్షి ఈ అంతర్వేది క్షేత్రముననే సేవించి ప్రతిష్టించినట్లు చెప్పబడినది. శ్రీ నరసింహ స్వామియే కేశవదాసునకు కలలో కనబడియుండును. మనమందరమూ ఈ రోజున ఆ స్థలమునకేగి, పుట్టను పరిశీలించి పిమ్మట ఆలయ నిర్మాణము, మొదలగు ప్రయత్నములు గావించెదము"యని పలికెను. శుభ ముహూర్తమున గ్రామస్తులు గోవులతో అడవి చేరుకొనిరి. చేరిన వెంటనే కపిలగోవు మందను వీడి మాటుకుపోయి పుట్టపై క్షీరవర్షము కురిపించెను. అందరునూ విస్తుబోయి పుట్టను సమీపించి నారికేళ ఫలమర్పించి, ప్రణామములు పలికి, పుట్టను త్రవ్వగా శ్రీనరసింహ స్వామి శిలావిగ్రహము లభించెను. అందరునూ ఆలయ నిర్మాణమునకు పూనుకొని, నిర్మించి, స్వామి వారి ఉత్సవములన్నింటినీ వైభవముగా జరిపించుచుండిరి. అది మొదలు ఆ ప్రదేశము నిత్యము భక్త జనులతో కిక్కిరిసి తీర్ధరాజముగ మారినది. కేశవదాసు నివసించిన ప్రాంతము నేడు "కేశవపాలెం" పేరుతో వ్యవహరించబడుతుంది. కానీ కేశవదాసు ఏకాలమునాటి వాడో నిర్ణయము చేయుటకు తగిన ఆధారములు ఇప్పటికినీ లభ్యము కాలేదు. 

కొంతకాలమునకు ఆలయము శిధిలావస్థకు చేరగా, శ్రీ మారెమండ లక్ష్మీనరసింహారావు పంతులు అను భక్తుడు ఆలయ పునర్నిర్మాణమునకై కొంత ద్రవ్యము నిచ్చి, కలప కొని తెమ్మని భద్రాచల ప్రాంతపు అడవులకు తన మనుష్యులను పంపగా - వారు కలప ఖరీదు చేసి, వాటిపై శ్రీ స్వామి వారి నామము గుర్తిడి సరుకు తెచ్చుటకు నదియందు నీరు లేకపోవుటచే నేటివలె ఇతర సౌకర్యములు లేక, అంతర్వేదికి తిరిగి వచ్చి, శ్రీ పంతులు గారికి సర్వమూ విన్నవించినారు. శ్రీ పంతులుగారు మూడు దినముల నిరాహారులై సముద్ర తీరమున శ్రీ స్వామి వారిని గూర్చి తపమాచరించిననూ ఫలితము కన్పించలేదు. అంత పంతులుగారు ఆగ్రహావేశపరులై, "కొయ్య తెప్పలు తేలేని కొదమసింగమా! చేరగారావు చేతగాని తనమా"యని ఆశువుగా కొన్ని ధూషణ పద్యములు చెప్పిరి. అదేమి చిత్రమో గాని ఆరాత్రి బ్రహ్మాండమైన వర్షముకురిసి సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తినది. మూడవ రోజు శ్రీ నామాంకితమైన కలపంతయు అంతర్వేది గంత రేవుకు చేరినది. అది తెలిసి పంతులుగారు "గంత రేవునకొక్కగంతులో చేరె"ననుచూ కొన్ని పద్యములు చెప్పినారు. ఈ పద్యములు లభ్యము కాకపోయినా నేటికీ పెద్దలనోట మకుటములు మాత్రమే వినిపించుచున్నవి. శ్రీ పంతులుగారు త్వరిత గతిన ఆలయనిర్మాణం పూర్తిగావించి, స్వామి వారి వైభవములు జరిపించినారు. మరలా క్షేత్రము కళకళలాడుతూ వర్ధిల్లినది. శ్రీ పంతులుగారు నిత్యమూ అర్పించు ముప్పది సాలగ్రామముల మాలను స్వామి సన్నిధిని ఉంచి ధన్యులైనారు. ఈ సాలగ్రామములకు ప్రతి నిత్యమూ స్వామి వారితో పాటుగా నిత్య అభిషేకము జరుగుచున్నది. 

కాలక్రమములో ఈ ఆలయము మరలా జీర్ణావస్థకు రాగా కొందరు భక్తులు పునరుద్ధణకు సంకల్పించినారు. శ్రీ స్వామివారు ఒక భక్తునికి కలయందు సాక్షాత్కరించి, "బెండమూర్లంక" గ్రామమున కొపనాతి ఆదినారాయణుడు అను అగ్నికులక్షత్రియుడు కలడు. అతడు సంపన్నుడు, పరమ భక్తుడు. అతడి కుమారులైన రంగదాసు - కృష్ణుడు ఇరువురునూ దైవభక్తులే. వారికి చెప్పిన ఆలయ నిర్మాణము వారే చేపట్టి కార్యము సఫలము చేసెదరు అని పలికెను. తెల్లవారిన వెంటనే ఆ భక్తుడు తన స్వప్నము ఊరివారికి చెప్పి - బెండమూర్లంక వెళ్ళుటకు బృందమును సిద్ధము చేసి స్వామిని పంచామృతములతో అభిషేకించి, పూజించి శుభముహూర్తమునకు బెండమూర్లంకకు చేరిరి. అచట స్వామి వారు చెప్పిన ప్రకారము కొపనాతి ఆదినారాయణ గృహమునకేగి స్వామి ఆజ్ఞను తెలిపిరి. అంత ఆదినారాయణ "నాయనలారా! నాకు కల ఏడు ఓడలు ఎక్కడకు పోయినవో... ఎట్లు పోయినవో జాడ కూడ తెలియకున్నది. ఇది జరిగి చాలా కాలమైనది. నా సర్వస్వమూ అవియే! ఈ స్థితిలో యున్న నేను మీకేమి చెప్పగలను, శ్రీ స్వామికి నేనేమి చేయగలను" అని పలుకగా రంగనాధుడు తండ్రితో గతరాత్రి కలలో స్వామి కనబడి ఆలయ మండపాదులు తామే నిర్మింపవలసినదిగా ఆజ్ఞాపించిన విధము చెప్పెను. కుమారుని పలుకులు విన్న ఆదినారాయణుడు పులకాంకితుడై కర... పాద ప్రక్షాళన గావించుకొని, అందరి సమక్షమున చేతులు జోడించి స్వామిని ధ్యానించి ఈ "అంతర్వేది పుణ్యక్షేత్రమునకు సత్యము... మహత్యముయున్నచో, నా సర్వస్వమూ అయిన ఏడు ఓడలునూ, సురక్షితముగ మారేవు చేరవలయును, ఓడల నుండి లభ్యమగు మొత్తమునంతయూ స్వామికై ఆలయ పండప గోపురాదులకు వెచ్చించెదను" అని మ్రొక్కుకొనెను. ఆదినారాయణుని మ్రొక్కు నెరవేర్చమని భక్తబృందము అంతర్వేది చేరుకొని స్వామిని ప్రార్ధించినారు. స్వామి కటాక్షించినాడు. మూడవ నాటికే ఓడలు సురక్షితముగ, లాభదాయకముగ రేవుకు చేరినవి. 

ఈ వార్త వినిన ఆదినారాయణుడు ఆనంద పరవశుడై, శ్రీ స్వామి మహాత్మ్యము కొనియాడుచూ, స్వామిని స్తుతించుచూ ఓడలలోని సొమ్ము ఇంటికి చేరనీక, అంతర్వేదికే తరలించి, ఆలయ నిర్మాణమునకు కావలసిన రాతిని కొని తెమ్మని నావికులకు ఆజ్ఞాపించగా, వారు అట్లే గావించిరి. దైవజ్ఞులు నిర్ధేశించిన శుభ సమయమున ఆలయ నిర్మాణమునకు ప్రధమేష్టికా స్థాపన గావించెను. 

అది శలివాహన శకము 1745 సంవత్సరము అనగా హూణశకము, 1823 సంవత్సరము ఆలయ గోపురాంతరాళ ముఖమండప ప్రాకారములు అన్నియూ శ్రీ ఆదినారాయణునిచే ప్రారంభింపబడి, రంగనాధుని సహాయమున కృష్ణుడు పూర్తిచేసెను. 

శ్రీ కొపనాతి ఆదినారాయణుడు, కుమారులు తరించినారు. వారు ధన్యులు... మాన్యులు... చరితార్ధులు...

సర్వేజనాః సుఖినోభవంతు.

No comments:

Post a Comment