Saturday, May 24, 2014

రుక్మిణీ కల్యాణం - శ్రీ విష్ణు పురాణము

కుండినపురం రాజధానిగా విదర్భనేలే భీష్మకునికి రుక్మిణి కూతురు. ఆమె అన్న రుక్మి. ఇతడికి కృష్ణుడంటే ఉన్న ద్వేషం చేత - తన సోదరి కృష్ణునే భర్తగా వరించెనని తెలిసికూడా వారి కల్యాణం జరిపించడాయెను. శిసుపాలునికిఇద్దామని అతడి ఆలోచన.

వివాహం రేపు జరగనున్నదనగా, కృష్ణుడామెను రథంపై ఎక్కించుకుని తీసుకువెళ్లి రాక్షసవివాహరీతిని ఆమెను పెండ్లాడాడు. ఆమెకు ప్రధ్యుమ్నుడు జన్మించాడు.

శంబరాసుర వథ:

ప్రద్యుమ్నుడు పుట్టిన అరవనాడు, అతడు తనకు ప్రాణాంతకుడని ఎరిగిన శంబరాసురుడు, ఆ శిశువును అపహరించి సముద్రంలో పారవేశాడు. జాలరులచేత రక్షించబడిన ఆ శిశువే పెరిగి పెద్దవాడై శంబరాసురుని 'నామమాత్రపు భార్య' అభోగ్య అయిన మయావతిచే పోషింపబడి, శంబరుని హతమార్చి, ఆమెతోకూడ నిజపురానికి చేరుకుని నారదమహర్షి వల్ల అతడు కృష్ణుని పుత్రుడని ధృవీకరింపబడి, తిరిగి అంతకాలానికి తల్ల్లితండ్రులను కలుసుకోగలిగాడు ఆ ప్రద్యుమ్నుడు.

రుక్మిణీకృష్ణులు, ద్వారక వాసులు చిరకాలమునకు ప్రద్యుమ్నుని చూసినందుకు ఆశ్చర్యానందాలు పొందారు. ఆ మాయవతి రతీదేవి అవతారం. ప్రద్యుమ్నుని భార్య అయింది.

రుక్మివథ:

రుక్మిణీదేవి కన్న సంతానం చారుదేష్ణుడు, చారుదేహుడు, సుదేష్ణుడు, సుషేణుడు, చారుగుప్తుడు, చారువిందుడు, చారువు, భద్రబాహువు అనే పుత్రులతో పాటు చారుమతి అనేపుత్రిక. రుక్మిణిగాక కృష్ణునికి ఇంకా ఏడుగురు పత్నులు. వారు సత్య, కాశింది, మిత్రవింద, రోహిణి, నాగ్నజితి, జాంబవతి, సుశీల, వీరుగాక 16000 మంది భామలు. ప్రద్యుమ్నుడు రుక్మికూతురు ఒకర్నొకరు పరస్పరం వరించారు. వీరికి జన్మించినవాడే అనిరుద్ధుడు. పెళ్లికి తరలివచ్చిన బంధుజనుల్లో కొందరు బలరాముడికి పాచికలాట తెలీదు, జూదంలో అతడ్ని మనం తేలిగ్గా గెల్వవచ్చునన్నారు.

బలమదం కొద్దీ రుక్మి సరేనన్నాడు. బలరామునితో ద్యూతక్రిడ మొదలెట్టారు. అప్పుడు బలరాముడు వెయ్యినిష్కాలు ఓడిపోయాడు. రెండో పందెంలో కూడ అంతే మొత్తం కోల్పోయాడు. మూడోపందెంలో పదివేలు ఓడిపోయాడు. ఈసారి కోటి నిష్కాల పందెం. బలరాముడు మౌనం వహించాడు. అందులో రుక్మి ఓడిపోయి కూడా, నేనే గెల్చానంటూ అబద్ధమాడగా, 'మౌనం అంగీకారసూచకం!' అని ఆకాశవాణి కూడ పలికి, బలరాముడే విజేత అని చెప్పింది. రుక్మిని పాచికలతో కొట్టాడు బలరాముడు. అటుపై అదంతా చూస్తూ అక్కడే ఉన్న కళింగరాజు పరిహాసం చేసినందుగ్గాను అతడి దవడ పళ్లూడగొట్టాడు.

ఈ సందడిట్లా నడుస్తూన్నంతలో పెండ్లికొడుకును తీసుకుని నెమ్మదిగా అక్కడ్నుంచి వచ్చాడు శ్రీకృష్ణుడు. రుక్మి హతుడయ్యాడు గనుక ఇక కలహాలుండవని ఆయనకు తెలుసు!

నరకాసుర వథ:

తరువాత కొంతకాలానికి ఇంద్రుడు, ద్వారకకు రాగా శ్రీకృష్ణుడు అతనికి అతిథి సత్కారాలు చేసి విషయమేమిటని అడిగాడు. దేవేంద్రుడు సందర్భవశంగా ఇలా అన్నాడు.

"శ్రీకృష్ణా! ఏం చెప్పమంటావు. భూమిపుత్రుడైన నరకాసురుడు నీకు తెలుసుకదా! వాడి దుశ్చర్యలు మితిమీరిపోతున్నాయి. అ విషయం నీకు విన్న వించడానికే నేను ఇక్కడకొచ్చాను. ప్రాగ్జ్యోతిషపురాథిపతి పెడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావు. దేవతలు, సిద్ధులు, మునులు....ఒక్కరేమిటీ - వాడి బారిన పడనివారు లేరనుకో! ఎందరు ధరణి పతుల కన్యలనో వాడు తన ఇంట బంధించాడు. వరుణుని చత్రం ఊడలాక్కున్నాడు. మందరర పర్వతశృంగం మీద మణులన్నీ కాజేశాడు. ఇవి వాడి దుశ్చర్యల్లో అత్యల్పభాగం మాతమే! కనుక తక్షణమే నువ్వేదైనా ప్రతిక్రియ ఆలోచించాలి" అని నివేదించాడు.

"అలాగే! సరే! నువ్వు ధైర్యంగా ఉండు! వాడి గర్వం అణచవలసిందే!' అని శ్రీకృష్ణుడు ఇంద్రునికి అభయమిచ్చి పంపేశాడు.

అనంతరం హృదయంలో గరుడుని తల్చుకుని, అతడు రాగా ఆ పక్షిరాజు మూపునధిరోహించి సత్యభామా సమేతుడై ప్రాగ్జ్యోతిష్యపురానికి వెళ్లాడు శ్రీకృష్ణుడు. నరకునిసేనలతో శ్రీకృష్ణునికి మొదట పెనుయుద్ధమయింది. అహర్నిశలు సాగిన ఆ యుద్ధంలో, సత్యాపతి ఇంచుక అలసి విశ్రమించగా, సత్యభామ ఆ దానవ వీరులతో పోరాడింది. వారిపైకి అస్త్రశస్త్రాలు వర్షంలా కురిపించింది. శ్రీకృష్ణుడు కొంతసేపు సేదతీరి, సత్యభామను ప్రశంసించి, తిరిగి తన కర్తవ్యాన్ని తానే నెరవేర్చాడు.

(శస్త్రాస్త్రవర్షం ముం చం తం తం భౌమం నరకం బలీ|
క్షి ప్త్యా చక్రం ద్విధా చక్రే చక్రీ దై తేయ చక్రహా||)

తన చక్రాయుధంతో నరకాసురుని రెండుగా ఖండించాడు. మురాసురుని, హయగ్రీవుని, పంచజనుడను వానిని కూల్చాడు. మురాసురుని 7వేల మంది పుత్రుల్ని సంహరించాడు. ఎవరెవరిదగ్గర నుంచి నరకుడు ఏమేమి అపహరించాడో, అవన్నీ వారికి అందేలా చేశాడు.

పృథివీ కృతకృష్ణస్తుతి:

"నాథా! వరాహమూర్తివై నీవు ఒకప్పుడు నన్నుద్ధరించగా, పుట్టినవాడు ఈ నరకుడు. ఈ పుత్రుని ఇచ్చినదీ నీవే! తిరిగి సంహరించినదీ నీవే! వీడు అపహరించిన (అథితి యొక్క) కర్ణకుండలాలు ఇవిగో! వీడి సంతతిని ఇంకా ముక్కపచ్చలారని వారిని కాపాడు!

జగత్కర్తవు, సంహార కారణుడవు నీవే! నా బరువును దింపటానికే అంశావతారం ఎత్తావు. నిన్నేమని స్తుతించను? వ్యాపించువాడవు వ్యాపించబడు విశ్వమూ నీవే! సర్వ భూతాంతరాత్మవగు నిన్నేమని స్తుతించను? వాక్కులకు అందనివాడివి. సర్వభూతాత్మా! దయచూడు! ధర్మసంస్థాపన కొరకు నీ కొడుకుని నువ్వే సంహరించావు గనుక, వీని తప్పిదాలను మన్నించు!" అని స్తుతించింది భూదేవి.

ఇతి శ్రీవిష్ణుమహాపురాణే పంచమాంశే ఏకోనత్రింశో ధ్యాయః

భూత భావనుడైన భగవానుడు పృధ్వీ స్తోత్రానికి ప్రసన్నుడై ఆమెకు అభయప్రదానం చేసి, నరకుని అంతఃపురంలో ఉన్న 16000 మంది (పైన 100 కూడా...శ్లోకప్రకారం 'శతాధికాని దృశే సహస్రాణి' కనుక) సౌందర్యవతులైన కన్యలను, విలువైన రత్నాలను, 16000 ఉత్తమమైన నాలుగు దంతాలుగల ఏనుగులను, 21 లక్షల ఉత్తమైన కాంభోజదేశపు గుర్రాలను నరకుని భటులచేతనే అప్పటికప్పుడు ద్వారకాపురికి రవాణా చేయించాడు.

వరుణుని గొడుగును, మణి పర్వతం యొక్క మణులను, ఇంద్రుని తల్లి అదితి యొక్క మణిమయ కుండలాలను (నరకుడు అపహరించిన ఈ దేవతల సొత్తును) స్వయంగా తానే అప్పగించదలచి సత్యభామతో సహా అదే గరుడునిపై అధిరోహించి స్వర్గానికి వెళ్లాడు.

శ్రీకృష్ణుడు విజయుడై తిరిగొచ్చాడన్న వార్త ఇంద్రునికి అందింది. స్వర్గానికి వచ్చాడనీ తెలిసి, ఎదురేగి స్వాగతం పలికి ఆదరించాడు. శ్రీకృష్ణుడు దేవమాత అదితిని దర్శించి ఆమె కుండలాలు అప్పగించాడు. ఆమె ఆనందంతో అ జగన్నాధుని సోత్రం చేసింది.

No comments:

Post a Comment