Saturday, June 16, 2012

అయ్యప్పస్వామి!…… 5 స్వరూపాలు!!


శ్రితజనప్రియం స్వామి చించితప్రదం
శ్రుతి విభూషణం స్వామి సాధుజీవనం
శ్రుతి మనోహరం స్వామి గీతలాలసం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే

నారాయణుడు, పరమశివుడు – వీరిద్దరూ తత్త్వతః ఒక్కరే అని పురాణాలు ఘోషిస్తున్నాయి. అయ్యప్ప పూజలో శంకరుని ఇష్టమైన క్షీరాభిషేకం ఉంటే, విష్ణువుకు ఇష్టమైన హోమము ఉంది. తలపై ధరించే మున్ ముడిలో శంకరునికి సంబంధించిన  మూడునేత్రాలున్న కొబ్బరికాయ, నేయి ఉండగా, పిన్ ముడిలో జీవించడానికి అవసరమైన వస్తువులున్నాయి. విష్ణువు స్థితికారుడు కాదా మరి! శంకరుని నిరాడంబరమైన నేలపడక, తెల్లవారుఝామున స్నానం, చెప్పులులేని నడక, భస్మధారణ వంటివి కనిపిస్తుండగా, మెడలో పుష్పమాల శ్రీవారి మెడలోని వనమాలను తలపిస్తుంది.

పానవట్టంపై కూర్చోబెట్టిన శివలింగంగా కనిపిస్తున్న అయ్యప్ప, ఎడమచేతి వయ్యారపు వంపుతో  విష్ణువు మోహిని అవతారానికి ప్రతీకగా కనిపిస్తున్నాడు. ఒంటినిండా భస్మం హరరూపాన్ని తలపిస్తుంటే, ముఖాన ఉండే తిరునామం హరి రూపాన్ని చూపిస్తుంది. మెడలో రుద్రాక్షమాల శంకరునిరైతే, తులసిమాల శ్రీహరికి ప్రితిపాత్రమైనది. అయ్యప్పస్వామి దీక్ష శంకరునికి ఇష్టమైన కార్తీకమాసంలో ప్రారంభమై, శ్రీహరికి ఇష్టమైన మార్గశిరమాసంలో ముగుస్తుంది.

అయ్యప్ప దర్శనానికి మండలకాలం(40 రోజులు) దీక్షను పాటిస్తారు. మన శారీరిక, మానసిక వ్యవస్థ భక్తితో చైతన్యవంతం కావాడానికి సుమారు 40 రోజులు పడుతుంది. అందుకే ఆయుర్వేదంలో మందులను మండల కాలం పాటు ఉపయోగించమంటుంటారు. ఆ మందులను మండల కాలంపాటు వాడితే బాగా ఒంట పడతాయన్న మాట. అలాగే మంత్ర, దీక్ష నియమాలకు కూడా మండల కాలాన్ని నిర్ణయించారు. భారతీయ శాస్త్ర సంప్రదాయంలో మండలకాల దీక్షకు ఉన్న శక్తి అటువంటిది.

అయ్యప్ప స్వామి గుడికి ఉన్న పద్దెనిమిది మెట్లు, మోక్షమనే మేడకు ఉన్న పద్దెనిమిదిమెట్లు  అని శాస్త్రవచనం . ఇంకా ఈ 18 గురించి ఇలా చెబుతున్నారు. ఆవాహన సమయంలో అష్టదిక్పాలకులు (8), త్రిమూర్తులు (13), వారి భార్యలు (3), ఇంద్రుడు (1), బృహస్పతి (1), ఆదిపరాశక్తి (1), సూర్యుడు (1) అంటూ మొత్తం పద్దెనిమిది మంది దివినుండి భువికి దిగిరాగా, దేవాలయ ప్రతిష్ఠనాడు మృదంగ-భేరి-కాహళ-దుందుభి-తుంబుర-మర్దల-వీణ-వేణు-నూపుర-మట్టుక-డింఢిమ-ఢమరుక-ఢక్క-ధవళ-శంఖ-పటహ-జజ్జరి-జంత్ర వాయిద్యాలనే 18 వాయిద్యాలను మ్రోగించారట.

అయ్యప్ప దీక్షను మొదలుపెట్టిన స్వాములు, వర్ణాశ్రమ ధర్మభేదం లేకుండా, మండలకాలం పాటు చెప్పే శరణు ఘోష ఓ పవిత్రమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని మన ముందు సాక్షాత్కారింపజేస్తుంటుంది. దీక్ష ప్రారంభించిన రోజునుంచి అయ్యప్ప స్వాములు విడివిడిగా, విడువకుండా శరణుఘోష చేయడం,అక్కడక్కడ దేవాలయాలలో చిన్న చిన్న బృందాలుగా ఏర్పడి శరణుఘోష చేస్తూ,  వన యత్రదారులతో, కొండదారులలో శరణుఘోష చేస్తూ నిరంతరం ఆ స్వామి శరణు ఘోషను చేస్తుంటారు. ఈ ఘోష ఓ మహా శబ్ద కదలివలె శబరిమలకు చేరుకొని, ఆ శబరిగిరీశుని జ్ఞానరూపంలో ఐక్యమౌతోంది. అక్కడ శరనాభిషేకం జరిగి, భక్తుల మనసు నిర్మలమౌతుంది.

అయ్యప్ప పూజలో ‘దీక్ష’కు ఒక విధమైన తాత్కాలిక సన్యాసం. ఈ దీక్ష నిత్యం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ క్రమశిక్షణకు దూరమైన వ్యక్తులకు క్రమశిక్షణను గుర్తు చేసే క్రియ. తనను తానూ పరిశుద్ధం చేసుకోవడమే ఈ దిక్షలోని అంతరార్థం. వ్రత నియమాలను అయ్యప్ప భక్తులు ఎత్తి పరిస్థితుల్లో అతిక్రమించారు. ఆ నియమాలనుసరించి,

తులసి మాలను ధరించడం
నీలం, నలుపు వస్త్రాలు ధరించడం 
బ్రహ్మచర్యాన్ని పాటించడం
మాంసాహారం మాని, మితాహారం భుజించడం
చెప్పులను వేసుకోకపోవడం
పొగత్రాగడం, మద్యపానాలు వదిలేయడం
నిరాడంబరంగా జీవించడం
శుభ్రంగా ఉండటం
ఉదయం, సాయింత్రం స్నానం చేయడం
పరుపులు, దిండ్లు ఉపయోగించకపోవడం
తక్కువగా మాట్లాడటం
అన్నదానం చేయడం
బృందాలుగా ప్రార్థించడం
మరణం, దుఃఖాలకు దూరంగా ఉండటం
శాంతి స్వభావంతో మెలగడం
స్త్రీలను మాత్రుముర్తిగా, చెల్లెలిగా భావించడం

గురుస్వామి ఆశీర్వచనములతో దీక్ష  ప్రారంభించిన రోజు నుండి ఒకరికొకరు ఎదురైనప్పుడు “స్వామి శరణం -అయ్యప్ప శరణం” అని చెప్పుకోవడం ద్వార ఓ విధమైన ఆధ్యాత్మిక ఆనందం వెల్లివిరుస్తుంటుంది.

ఈ విధంగా శబరిమల యాత్ర భక్తుల జీవనాన్ని ఓ క్రమపద్ధతిలో పెట్టే యాత్ర అని చెప్పొచ్చు.

మనిషి జీవిన్నీ ఐదు దశలుగా మన పెద్దలు చెబుతుంటారు.ఈ ఐదు దశలకు ప్రాతినిధ్యం వహించే విధంగా అయ్యప్ప అవతారాలున్నాయి. ఆయన కేరళలో ఐదు చోట్ల ఈ నాలుగు రూపాలలో దర్శనమిస్తున్నారు.

బాల్యం – కుళత్తుపుళా
యవ్వనం – ఆరియంగావు
గృహస్థాశ్రమం – అచ్చన్ కోవిల్
వానప్రస్థం – శబరిమల
ఏకాంతం – కాంతి మలై

కుళత్తుపుళా

పూర్వం కొట్టార్కర అనే ప్రాంతాన్ని పరిపాలించిన రాజు, ప్రస్తుతం మనకు కనబడుతున్న ఆలయాన్ని నిర్మించాడు. ఆయన వేటకోసం  ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయనతో పాటు వచ్చిన వంటవాళ్ళు, మూడు రాళ్ళతో పొయ్యని పెట్టారట. అందులో ఒక రాయి  కాస్త పెద్దదిగా ఉండడంతో, దాన్ని సరిగ్గా పెట్టేందుకు వాళ్ళు రకరకాలుగా ప్రయత్నించారు. కానీ, వారి వల్ల కాలేదు. సరే ఈ రాయిని పగుల గొడదామనుకొని, ఆ రాయిపై ఇంకొక రాయి వేసి కొట్టారు. కానీ పోయ్యకోసం వీళ్ళనుకున్న రాయి పగులకపోగా, వీళ్ళు తీసి కొట్టిన రాయి పగిలింది. అంతకంటే ఆశ్చర్యం. ఆ రాయి నుంచి రక్తం కారడం. వెంటనే ఈ విషయాన్నీ రాజుకు చెప్పగా రాజు వేద పండితులను, నంబూద్రిలను పిలిపించారు.

విరుగగోట్టింది అయ్యప్ప విగ్రహం అని వారు చెప్పడంతో, జరిగిన అపరాధానికి  మన్నించమని అయ్యప్పను వేడుకున్న రాజు, వెంటనే ఆ ప్రాంతంలో ఓ గుడిని కట్టించాడు. ఆ ప్రాంతమే ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న కుళత్తుపుళా, ఇక్కడ అయ్యప్ప బాలకునిగా వెలసినప్పటికి, ఎనిమిది ముక్కలుగా చేయబడ్డ ఆ రాళ్ళను గర్భ గృహంలో నేటికి చూడొచ్చు. పూజ చేసేటప్పుడు ఒక్కటిగా చేర్చబడే ఆ రాళ్ళు, పూజానంతరం దూరంగా జరుపబడుతుంటాయి. ఈ ఆచారం నేటికి కొనసాగుతోంది. ఈ ఆలయంలో మకర విళక్కు, విషు పండుగలు గొప్పగా జరుపబడతాయి. కుళత్తుపుళా తిరువనంతపురం నుండి సుమారు 45 కి.మీ. దూరంలో ఉంది. ఈ ఆలయానికి విరివిగా భక్తులు వస్తుంటారు.

అరియంగావు

బ్రహ్మచారి అయిన అయ్యప్పకు కల్యాణోత్సవం జరిగే ఒకే ఒక పుణ్యస్థలం అరియంగావు. ఇందుకొక కారణం ఉంది. ఈ ఆలయంలో అయ్యప్ప గృహస్థాశ్రమంలో వెలసి ఉన్నాడు. అయ్యప్ప పుష్పకళాదేవిని పరిణయమాడాడు. అయితే, ఘోటక బ్రహ్మచారి అయిన అయ్యప్పకు పెళ్ళెప్పుడు జరిగిందనే సందేహం కలుగుతుంది కదూ! యోగనిష్ఠలో ఉన్న అవతారంలో ఆయనకు వివాహం జరగలేదు. శాస్తాకు మరొక అవతారంలో వివాహం జరిగిందట.

ఈ కధనం ప్రకారం, ఓ సౌరాష్ట్రీయుడు పట్టు  వస్త్రాలను నేసి, ట్రావెన్  కూర్ మహారాజుకు సమర్పించి, ఆయన నుంచి కానుకలను పుచ్చుకుంటుండేవాడు. అలా ఒకసారి ఆ వ్యాపారి తన కూతురు పుష్పకళని కూడా పిలుచుకొని వెళుతుండగా, ఆరియంగావు వచ్చేసరికి చీకటి పడింది. దాంతో వారు అక్కడున్న ఆలయంలో తలదాచుకున్నారు. మరునాడు ట్రావెన్ కూర్ బయలుదేరిన తండ్రితో పుష్పకల, తనకు స్వామిని వదిలి కదలబుద్ధి కావడం లేదని, అందుకని తండ్రిని ట్రావెన్ కూర్  వెళ్ళి రమ్మని, ఆయన తిరిగి వచ్చేదాకా తను దేవాలయంలోనే ఉంటానని చెప్పింది. మరుమాట్లాడలేని ఆ వ్యాపారి ఆలయ మేల్ శాంతి(అర్చకుడు) దగ్గర పుష్పకలను వదలి రాజు దగ్గరకు బయలుదేరాడు. అలా వెళ్తున్నపుడు ఆ వ్యాపారి ఓ మదపటేనుగు బారిన పడగా, ఓ యువకుడు అతడిని కాపాడతాడు. మెరుపులా దూసుకొచ్చి తన ప్రాణాలు కాపాడిన ఆ యువకునుకి, తన దగ్గరున్న పట్టువస్త్రంతో అలంకరించిన ఆ వ్యాపారి, ఏం కావాలో కోరుకోమ్మంటాడు. అప్పుడా యువకుడు నీ కూతురిని నాకిచ్చి పెళ్ళి చేయమని చెప్పి, అరియంగావు గుడిలో తనను కలుసుకోమని వెళ్ళిపోతాడు. అరియంగావు గుడికి వచ్చిన ఆ వ్యాపారికి, ఎంత వెదికినా తన కూతురు కనబడదు. మేల్ శాంతి దగ్గర ఆరా తీస్తే, ఆమె స్వామిలో ఐక్యమైనట్లు చెబుతాడు. ఆ తెల్లవారుఝామున ఆలయ ద్వారాలు తెరచి, లోపలకి వెళ్ళిన పూజారి, వ్యాపారులకు ఆశ్చర్యం! అడవిలో తను ఇచ్చిన శాలువాతో ప్రత్క్షమైన స్వామిని చూసి అ స్వామి సాష్టాంగ పడతాడు. ఈ ఆలయములో స్వామివారి శ్రీకల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుతారు. ఈ ఉరికి తిరువనంతపురం నుంచి విరివిగా బస్సు సౌకర్యాలున్నాయి.

అచ్చన్ కోవిల్

శబరిమలలో వలె ఈ ఆలయానికి పద్దెనిమిది మెట్లున్నాయి. పూర్ణ, పుష్కళలతో అయ్యప్ప దర్శనమిస్తుంటాడు. ఈ ఆలయములో ప్రత్యేకత బంగారపు కత్తి. ఇది సాక్షాత్ దేవతలు భూమికి తీసుకువచ్చిన కత్తి అని చెప్పబడుతుంది. మిగతా రెండు దశలకు శబరిమల, కాంతిమలై  ప్రాతినిథ్యం వహిస్తున్నాయి.

No comments:

Post a Comment