Friday, September 7, 2012

రామాయణం - కిష్కింధా కాండ 5


తార లక్ష్మణుడికి అడ్డం వచ్చి, ‘‘లక్ష్మణా, తొందరపడి సుగ్రీవుణ్ణి నిందించ వద్దు. అతను రామ కార్యం ఏమరలేదు. వానరులందరూ పదిహేను రోజులలో రావాలనీ, రాని వారికి మరణశిక్ష అనీ సుగ్రీవుడు అదివరకే ప్రకటించాడు. ఈవాళే గడువు ఆఖరు రోజు. అన్న ఆగ్రహానికి గురై అడవులలో చాలాకాలం కష్టాలు అనుభవించిన సుగ్రీవుడు ఇప్పుడు భోగలాలసుడై ఉన్న మాట నిజమే.
 
అయినా దానిని క్షమించ వచ్చు. అందుచేత నువ్వు కోపం మాను,'' అన్నది. తార మాటలతో లక్ష్మణుడు మెత్త బడ్డాడు. అది చూసి సుగ్రీవుడికి కాస్త ధైర్యం వచ్చింది. అతను లక్ష్మణుడితో, ‘‘లక్ష్మణా, రాముడు నాకు చేసిన మహోపకారంలో నేనాయనకు చెయ్యబోయేది ఏపాటి? రాముడి పట్ల నాకున్న చనువుకొద్దీ నేను కొంచెం జాప్యం చేసి ఉంటే నన్ను క్షమించాలి. ఆగ్రహించ కూడదు.
 
లోకంలో తప్పు చెయ్యనివాడు ఉండడు గద,'' అన్నాడు ఎంతో వినయంగా. దానికి లక్ష్మణుడు, ‘‘సుగ్రీవా, నీ సహాయం మాకు దేవతలు చేసే సహాయమే. నువ్వు ఒకసారి వచ్చి ఎంతో దుఃఖంలో ఉన్న రాముణ్ణి ఊరడించు. ఆయన దుఃఖం చూడలేకనే నేను ఆగ్రహం చెందాను, నన్ను క్షమించు,'' అన్నాడు. సుగ్రీవుడు హనుమంతుడి కేసి తిరిగి, ‘‘వానరుల నందరినీ పిలుచుకు రమ్మని నే నింతకు ముందే దూతలను పంపాను.
 
వారి వెనక ఇప్పుడు మరికొందరు వానరులను పంపి, అనేక పర్వతాలలోనూ, సముద్ర తీరాలా, వనాలలోనూ ఉండే రకరకాల వానరులు శీఘ్రంగా వచ్చి చేరే ఏర్పాటు చెయ్యి. వారిని రప్పించటానికి సామ దానాది ఉపాయూలు ప్రయోగించు.

పది రోజులలోగా రాని వానరులకు మరణ శిక్ష! ఇది నా ఆజ్ఞ!'' అన్నాడు. అలాగే హనుమంతుడు అనేకమంది వానరులను అనేక దిక్కులకు పంపాడు. క్రమంగా వానర బలగాలు కిష్కింధకు రాసాగాయి. నల్ల కోతులు, పచ్చ కోతులు, తెల్ల కోతులు, భయంకరమైన ఎర్ర కోతులు- అన్ని రకాల కోతులూ వచ్చాయి. వానరులు తాముండే చోట దొరికే పళ్ళూ, సువాసన గల పూలూ కూడా తెచ్చారు; వాటిని సుగ్రీవుడికి కానుకగా ఇచ్చారు.
 
తమ నిమిత్తమై పెద్ద ఎత్తున పని ప్రారంభించిన సుగ్రీవుడి పైన భక్తి విశ్వాసాలేర్పడి లక్ష్మణుడు అతన్ని తాముండే చోటికి ఆహ్వానించాడు. సుగ్రీవుడు సమ్మతించి, తన పల్లకి తెప్పించి, అందులో లక్ష్మణుణ్ణి ఎక్కమని, అతనితోబాటు తాను కూడా ఎక్కి కూచుని, రాముడుండే చోటికి మేళ తాళాలతో బయలుదేరాడు.
 
వానరులతనికి తెల్లగొడుగు పట్టారు, వింజామరాలు వీచారు, శంఖ ధ్వానాలు చేశారు, భేరీ భాంకారాలు మోగించారు, స్తోత్రపాఠాలు దారి పొడుగునా చదివారు. కొన్ని వందలమంది వానర వీరులు అమితోత్సాహంతో పల్లకి వెంట నడిచారు. ప్రస్రణ పర్వతం మీది గుహ వద్ద పల్లకి దిగింది. సుగ్రీవుడు లక్ష్మణుడితో సహా పల్లకి దిగి రాముణ్ణి సమీపించి, చేతులు పైకెత్తి నమస్కారం చేసి నిలబడ్డాడు.

మిగిలిన వానరులంతా అలాగే చేతులు పైకెత్తి నమస్కారాలు చేస్తూ నిలబడ్డారు. వారి చేతులు రాముడికి చెరువులోని తామర మొగ్గల్లాగా కనిపించాయి. రాముడు సుగ్రీవుణ్ణి సమీపించి, అతను సాష్టాంగ పడగా లేవనెత్తి ఆలింగనం చేసుకుని, లాంఛనగా సహాయం అడిగాడు. దానికి సుగ్రీవుడు, ‘‘రామా, నా దూతలు పిలవగా ప్రపంచంలోని అన్ని మూలల నుంచీ మహా పరాక్రమవంతులైన వానరులు వేల, లక్షల, కోట్ల సంఖ్యలో వచ్చి ఉన్నారు. వారు రావణాసురుణ్ణి చంపి, సీతను నీకు తెచ్చి ఇవ్వటానికి సమర్థులు,'' అన్నాడు.
 
రాముడీ మాటకు సంతోషించి, ‘‘సుగ్రీవుడా, నీ వంటి వాడి సహాయంతో నేను రావణుణ్ణి అవలీలగా చంపి సీతను తెచ్చుకోగలను,'' అన్నాడు. ఇంకా కిష్కింధా పరిసరాలలో దుమ్ము లేస్తూనే ఉన్నది, భూమి కంపిస్తూనే ఉన్నది. వానరులింకా వస్తూనే ఉన్నారు. తార తండ్రి సుషేణుడు పది వేల కోట్ల వానరులతో వచ్చాడు. సుగ్రీవుడి మామా, రుమ తండ్రీ అయిన తారుడు వెయ్యి కోట్ల వానరులతో వచ్చాడు.
 
హనుమంతుడి తండ్రి కేసరి ఇరవైయొక్క వేల ఎనిమిది వందల డెబై్భ మంది వానరులతో వచ్చాడు. గోలాంగూలాలకు రాజయిన గవాక్షుడు వెయ్యి కోట్ల వానరులతో వచ్చాడు. ధూమ్రుడనేవాడు రెండువేల కోట్ల భల్లూకాలను తెచ్చాడు. ఇదే విధంగా పవనుడూ, నీలుడూ, గవయుడూ, దరీముఖుడూ, అశ్వనీ దేవతల కొడుకులైన మైంద ద్వివిదులూ, గజుడూ, జాంబవంతుడూ, రుమ ణ్వంతుడూ, గంధమాదనుడూ, అంగదుడూ మొదలైనవారు అంతులేని బలాలను వెంట తెచ్చారు.
 
ఈ వానరుల నందరినీ ఫల వృక్షాలు సమృద్ధిగా వున్న వనాలలోనూ, సెలయేళ్ళ దగ్గిరా, కొండల వద్దా విడియింపజేశారు. సుగ్రీవుడు ఈ వానర బలాలన్నిటినీ రాముడి పరం చేసి, వారిని కావలిసిన విధంగా ఉపయోగించుకోమని చెప్పాడు. ‘‘సుగ్రీవుడా, ముందుగా మనకు రెండు విషయూలు తెలియూలి. సీత బ్రతికి ఉన్నదా, లేదా అన్నది మొదటి విషయం. రెండో విషయం రావణుడి వాస స్థల మెక్కడ అన్నది. ఈ రెండు వార్తలూ తెలిసినాక నిర్వర్తించ వలసినకర్తవ్యం నిర్ణయింతాం.

ఈ వార్తలు సేకరంచటానికి నేనూ, లక్ష్మణుడూ సమర్థులం కాము. ఆ పని నీ వల్లనే జరగాలి,'' అని రాముడన్నాడు. అప్పుడు సుగ్రీవుడు వినతుడనే వానర నాయకుణ్ణి పిలిచి, ‘‘నువ్వు లక్ష వానరులను తీసుకుని తూర్పు దిక్కుగా వెళ్ళు. రావణుడుండే చోటు తెలుసుకుని సీత యొక్క స్థితిగతులు కనుక్కునిరా,'' అన్నాడు.
 
ఇలా సీతను వెదకబోయేవారు నెల రోజుల లోపుగా తిరిగి రావాలనీ, రానివారికి మరణదండన విధించబడుతుందనీ సుగ్రీవుడు హెచ్చరించాడు. తరవాత అతను నీలుణ్ణీ, హనుమంతుణ్ణీ, మహాబలుడు జాంబవంతుణ్ణీ, మహోత్రుణ్ణీ, శరారినీ, శరగుల్ముణ్ణీ, గజుణ్ణీ, గవాక్షుణ్ణీ, గవయుణ్ణీ, ఋషభుణ్ణీ, మైందుణ్ణీ, ద్వివిదుణ్ణీ, విజయుణ్ణీ, గంధమాదనుణ్ణీ, ఉల్కాముఖుణ్ణీ, అసంగుణ్ణీ, అంగదుణ్ణీ, మరికొందరు వానర వీరులనూ దక్షిణ దిశ అంతా వెదకమన్నాడు.
 
అతను వారికి దక్షిణానగల దేశాలన్నీ వివరించి, ‘‘మీరు దక్షిణ తీరం చేరినాక సముద్రం మీదుగా పోయే ఉపాయం ఆలోచించుకోండి. ఎందుకంటే సముద్రంలో నూరు యోజనాల వైశాల్యం గల లంక ఉన్నది. అదే రావణుడి నివాస స్థానం. సీత కోసం అక్కడ చక్కగా వెతకండి. సముద్రంలో ఇంకా పర్వతాలున్నాయి. వాటన్నిటిమీదా మీరు సీతాదేవిని వెదకండి. దక్షిణ దిక్కుగా ఇంకా ఏయే రహస్య ప్రదేశాలున్నా వాటి నన్నిటినీ గాలించండి.
 
నెల లోపలగా ఎవడైతే తిరిగి వచ్చి, ‘చూశాను సీతను' అని చెబుతాడో వాడికి నాతో సమమైన భోగభాగ్యాలు కలుగుతాయి. వాణ్ణి నా ప్రాణాలకన్న ఎక్కువగా చూసుకుంటాను,'' అని వానరులతో అన్నాడు. ఇదే విధంగా సుగ్రీవుడు పడమటి దిక్కుగా తార తండ్రి అయిన సుషేణుడు మొదలైన వారిని రెండు లక్షల వానర బలగంతో పంపాడు.
 
లక్షమంది వానర వీరులతో సహా శతవలి అనే వాణ్ణి ఉత్తరంగా పంపాడు. ఇంతమంది వానరులను అన్ని దిశలకూ పంపుతున్నప్పటికీ సుగ్రీవుడి ఆశలన్నీ హనుమంతుడిపైనే ఉన్నాయి. అందుచేత అతను హనుమంతుడితో, ‘‘నువ్వు భూమిపైనా; నీటిలోనూ, గాలిలోనూ పయనించ గలవాడివి-మూడు లోకాలూ తెలిసిన వాడివి.


నీ తండ్రి వాయుదేవుడికి ఉన్నంత అద్భుత ప్రతిభ నీకూ ఉన్నది. అందుచేత సీతాదేవి దొరకటానికి అవసరమైన ప్రయత్నమంతా నువ్వే చెయ్యూలి,'' అన్నాడు. ఈ మాటలు వినగానే రాముడు హనుమంతుడి యందు సుగ్రీవుడికి ఎంత నమ్మక మున్నదీ గ్రహించాడు. హనుమంతుడే పని సాధించుకురాగలడేమోనన్న ఆశ రాముడిలో కూడా తల ఎత్తింది.
 
అందుచేత తన పేరుగల ఉంగరాన్ని తీసి, సీతాదేవికి గుర్తుగా ఉండగలందులకై హనుమంతుడి కిచ్చాడు. అతను హనుమంతుడితో, ‘‘సీత ఈ ఉంగరం చూసినట్టయితే నిన్ను విశ్వసిస్తుంది, భయపడకుండా ఉంటుంది,'' అని చెప్పాడు. హనుమంతుడా ఉంగరాన్ని నెత్తిన పెట్టుకుని రాముడికి నమస్కారం చేసి బయలుదేరాడు. ‘‘హనుమంతుడా, నా ఆశలన్నీ నీపైనే పెట్టుకుని ఉన్నాను.
 
నీ శక్తికొద్దీ ప్రయత్నించి ఎలాగైనా సీత దక్కేటట్టు చెయ్యూలి,'' అని రాముడు హనుమంతుడితో చివరి మాటగా అన్నాడు. హనుమంతుడు తన జట్టు వానరులతో బయలుదేరి వెళ్ళాడు. అలాగే అన్ని దిక్కులకూ వానర సమూహాలు బయలుదేరి వెళ్ళాయి.
 
వారు తిరిగి రావటానికి ఒక్క నెల గడు వివ్వబడింది. ఈ నెల రోజులూ సీత వార్తకై ఎదురు చూస్తూ రాముడు లక్ష్మణుడితో సహా ప్రస్రణ పర్వతం పైనే గడిపాడు. సుగ్రీ వుడు తన విధిని నెరవేర్చినవాడై పెద్ద బరువు దిగి పోయినట్టు సంతోషించాడు.

సుగ్రీవుడి చేత వేరువేరు దిక్కులకు పంపబడిన వానరులు సీత కోసం చాలా శ్రద్ధగా వెతికారు. వారు పగలంతా వేరు వేరు స్థలాలకు వెళ్ళి వెతుకుతూ, రాత్రి పూట ఏ పళ్ళ తోటల్లోనో తిరిగి కలుసుకుని నిద్రపోతూ నెల రోజులూ వెతికారు. నెల పూర్తి అయ్యేసరికి తూర్పు నుంచీ, పడమటి నుంచీ, ఉత్తరం నుంచీ వానరులు తిరిగి వచ్చి, తమకు సీత జాడ తెలియరాలేదని సుగ్రీవుడితో చెప్పుకున్నారు.
 
ఇక దక్షిణంగా బయలుదేరిన వానర వీరులు సీతను వెదుకుతూ చాలా దూరం వెళ్ళి వింధ్య పర్వతాన్ని చేరుకున్నారు. వింధ్య పర్వతం సామాన్యమైన పర్వతం కాదు. దానిపై ఎన్నో శిఖరాలు, ఎన్నో గుహలు! దాని పరిసరాలలో ఎన్నో నదులు, ఎన్నో దుర్గమారణ్యాలు! వానరులు ఎంతో ఓపికగా ప్రతి ప్రదేశమూ వెతికారు. ఒక చోట వారికి ఒక భయంకరుడైన రాక్షసుడు కనిపించాడు.
 
వాడే రావణుడై ఉంటాడనుకుని అంగదుడు వాణ్ణి ఒక్క దెబ్బతో నెత్తురు కక్కి చచ్చేట్టు చేశాడు. ఆ సమీపంలో సీత ఉంటుందేమోనని వెతికారు. కాని వారి ఆశ ఫలించలేదు. చిట్టచివరకు అందరూ అలిసిపోయి ఒక చెట్టు కింద కూచున్నారు. అప్పుడు అంగదుడు మిగిలిన వాళ్ళతో, ‘‘సీత కోసం మనం పడిన శ్రమ ఇంతవరకు ఫలించ లేదు. రోజులా చాలా గడిచాయి. సుగ్రీవుడు తీవ్రంగా దండించే మనిషి.
 
అందుచేత మనం మరింత ఒళ్ళు వంచి వెతకాలి, నిద్రకూడా మానాలి,'' అన్నాడు. గంధమాదనుడు కూడా అంగదుడి అభిప్రాయూన్ని బలపరిచాడు. ఆకలి దప్పులతో ఆర్చుకు పోతున్న గొంతుతో అతను, ‘‘సుగ్రీవుడి ఆజ్ఞ ప్రకారం అందరూ సమస్త వనాలూ, పర్వతాలూ, గుహలూ, బిలాలూ సీత కోసం వెతకండి,'' అన్నాడు. వెంటనే వానరులంతా లేచి వింధ్యారణ్యాలన్నీ సీత కోసం గాలించ సాగారు. వారా పర్వతమంతా గాలించే లోపలనే నెల రోజుల గడువు పూర్తి అయిపోయింది.

No comments:

Post a Comment