Saturday, September 8, 2012

రామాయణం - ఉత్తరకాండ 2

లక్ష్మణుడు ఏమీ మాట్లాడలేక, ఏడుస్తూ సీతకు సాష్టాంగ నమస్కారం చేసి, ఆమె చుట్టూ ప్రదక్షణం చేసి, పడవలో ఎక్కి ఉత్తర తీరానికి చేరుకుని, రథమెక్కి, అనాధ లాగా అవతలి ఒడ్డున ఏడుస్తున్న సీతను మళ్ళీ మళ్ళీ వెనక్కు తిరిగి చూస్తూ వెళ్ళిపోయాడు. సీత ఆ రథం కేసే చూస్తూ ఉండిపోయి, పట్టలేక గట్టిగా ఏడవ నారంభించింది.

ఆ నిర్జనారణ్యంలో ఒంటరిగా ఏడుస్తున్న సీతను కొందరు మునికుమారులు చూసి వాల్మీకి వద్దకు పరిగెత్తి వెళ్లి, ‘‘స్వామీ గంగా తీరాన ఎవరో ఒక స్ర్తీ ఏ కారణం వల్లనో ఏడుస్తూ కనబడింది. మనిషి చూడబోతే ఆకాశం నుంచి దిగివచ్చిన దేవతా స్ర్తీ లాగా ఉన్నది. ఆమె కెవరూ ఉన్నట్లు లేరు. మీరు వెంటనే వెళ్లి ఒకసారి చూడండి,’’ అని చెప్పారు. వాల్మీకి మహాముని, తన శిష్యులు వెంటరాగా, ఆర్ఘ్యం తీసుకుని సీత ఉన్న చోటికి వచ్చి, ఆమెను గుర్తించి, ‘‘దశరథుడి కోడలికి స్వాగతం. అమ్మా, నీవిక్కడికి ఎలా చేరావో అది  నేను నా శక్తిచేత గ్రహించాను.

నేనుండగా నీకే భయమూ లేదు. నా ఆశ్రమం దగ్గిరలోనే ఉన్నది. అక్కడ తాపస స్ర్తీలున్నారు. వారు నిన్ను కనిపెట్టి ఉంటారు. దుఖించకు. ఈ ఆర్ఘ్యం  తీసుకో, మా ఆశ్రమంలో నీవు నీ సొంత ఇంట్లో ఉన్నట్లే ఉండవచ్చు,’’ అన్నాడు.


సీత ఆయనకు నమస్కారం చేసి, వాల్మీకి వెంట ఆయన ఆశ్రమం ప్రవేశించింది. వాల్మీకి ఆమెను మునిభార్యలకు అప్పజెప్పి, ఆమెను స్నేహ గౌరవాలతో చూడవలసిందని చెప్పాడు.

అయోధ్యకు తిరిగి పోతున్న లక్ష్మణుడు సుమంత్రుడితో ‘‘మంత్రా, అన్నకు సీతా వియోగం వల్ల ఎంతటి దుఃఖం సంప్రాప్త మయిందో చూశావు గదా. నిర్దోషురాలైన సీతకు ఎంత కష్టం వచ్చిందో చూడు,’’ అన్నాడు. సుంమత్రుడా మాటకు, ‘‘లక్ష్మణా రాముడికి సుఖం అల్పమనీ, అయినవారితో వియోగం కలుగుతుందనీ, పూర్వం మునులు చెప్పనే చెప్పారు. ఇది చాలా రహస్యం’’ అంటూ ఇలా చెప్పాడు.

ఒకనాడు దశరథుడు వశిష్టుడి ఆశ్రమానికి వెళ్ళేసరికి అక్కడ అత్రి మహాముని కుమారుడైన దుర్వాసుడున్నాడు. దశర థుడు మునులనుంచి స్వాగత సత్కారాలు పొంది, మాటల సందర్భంలో దుర్వాసుణ్ణి, ‘‘మహాత్మా, నా సంతతి యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? మా రాముడి ఆయుర్దాయమెంత? మిగిలిన నా కొడుకులెంత కాలం జీవిస్తారు? మా రాముడికెంతమంది కొడు కులుంటారు? వారెంత కాలం జీవిస్తారు?’’ అని అడిగాడు. ఆ ప్రశ్నలకు సమాధానంగా దుర్వాసుడు ఒక పాత గాధ చెప్పా.

‘‘దేవాసుర యుద్ధంలో ఓడిపోయి అసురులు భృగు మహాముని భార్యను శరణు జొచ్చారు. ఆమె వారికి అభయం ఇచ్చింది. ఇది చూసి విష్ణువు ఆగ్రహించి భృగుడి భార్య శిరస్సును తన చక్రాయుధంతో ఖండించాడు. వెంటనే భృగుమహాముని మండిపడి, విష్ణువును భూలోకంలో పుట్టి భార్యావియోగంతో తపించమని శపించాడు. ఆ శాప ప్రభావం చేత విష్ణువు దశరథుడికి కొడుకుగా పుట్టి, రాముడనే పేరుతో ప్రసిద్ధి చెందాడు.

రాముడు భృగు శాపఫలం అనుభవించి తీరుతాడు. అతను పదకొండు వేల ఏళ్లు అయోధ్యను పాలించి, అనేక అశ్వమేధాలు చేసి, బ్రహ్మలోకానికి పోతాడు. అతనికి ఇద్దరు కొడుకులు పుడతారు. అయితే వారు అయోధ్యలో గాక మరొక చోట పుడ తారు. వారికి రాముడు పట్టాభిషేకం చేస్తాడు,’’ అని దుర్వాసుడు దశరథుడితో చెప్పాడు.


ఇలా మాట్లాడుకుంటూ, లక్ష్మణ సుమంత్రులు సాయంకాలానికి గోమతి అనే చోటికి వచ్చి ఆరాత్రి అక్కడ గడిపారు. మర్నాడు ఉదయం వారు తిరిగి ప్రయాణం సాగించి అయోధ్యకు వెళ్లేటప్పుడు లక్ష్మణుడు, రాముడితో ఏమని చెప్పడమా అని చాలా మధనపడ్డాడు.

రథం అయోధ్య చేరింది. రాముడి ఇంటి ముందు లక్ష్మణుడు రథం దిగి, లోపలికి వెళ్లి, దీనంగా కన్నీరు కార్చుతూ, సింహా సనం మీద కూర్చుని ఉన్న రాముడికి నమస్కరించి, ‘‘మీ ఆజ్ఞానుసారం సీతను గంగాతీరాన వాల్మీకి మహాముని ఆశ్రమంలో విడిచి వచ్చాను. విచారించవద్దు. వృద్ధి నుంచి క్షయమూ, ఉన్నతి నుంచి పతనమూ, సంయోగం నుంచి వియోగం తప్పవు. వచ్చిన అపవాదు దానంతట అదే పోతుంది,’’ అన్నాడు.

‘‘లక్ష్మణా, నా మాట పాటించావు. చాలా సంతోషం. నాకు విచారమేమీ లేదు,’’ అన్నాడు రాముడు. అప్పటికతను నాలుగు రోజులుగా ప్రజల గొడవలు విచారించలేదు. అది చాలా తప్పు. రాముడా సంగతి లక్ష్మణుడితో అని, అందుకు తార్కాణంగా నృగ మహారాజు కథ ఇలా చెప్పాడు.

పూర్వం నృగమహారాజు కోట్లకొద్దీ ఆవులను బ్రాహ్మణులకు దానం చేశాడు. ఆయన దానమిచ్చిన ఆవులలో ఒకటి ప్రమాదవశాన తిరిగి రాజుగారి ఆవులమందలలో కలిసిపోయింది. అది తెలియక రాజు దాన్ని మరొక బ్రాహ్మణుడికి దానమిచ్చాడు. మొదట దానం పుచ్చుకున్న బ్రాహ్మణుడు తన ఆవును వెతుక్కుంటూ తిరుగుతూ, కనఖలం అనే చోట రెండో బ్రాహ్మణుడి ఇంట తన ఆవును చూసి గుర్తించి, దానికి తాను పెట్టుకున్న పేరుతో పిలిచాడు.


 ఆ ఆవు తన పాత యజమాని గొంతు గుర్తించి కట్టుతాడు తెంచుకుని, అతని వెంట బులుదేరింది. ఆది చూసి రెండో బ్రాహ్మణుడు, ‘‘నా ఆవును నువు తోలుకుపోతున్నావేమిటి? దీన్ని నాకు నృగమహరాజు దానమిచ్చాడు.’’  అన్నాడు.
‘‘ఆ నృగమహారాజే దీన్ని నాక్కూడా దానమిచ్చాడు, అన్నాడు మొదటి బ్రాహ్మణుడు. ఈ తగాదా వారిద్దరి మధ్యా పరిష్కారం అయ్యేది కాదు గనక వారు తిన్నగా నృగమహారాజు వద్దకే వెళ్లారు. అయితే వారికి రాజదర్శనం ఎంతకూ కాలేదు. బయటి ద్వారం వద్ద రోజుల తరబడి పడిగాపులు కాయవలిసి వచ్చింది. చివరకు వాళ్లు ఆగ్రహించి ఊసర వెల్లి అయిపోయి ఎవరికంటా పడకుండా పడకుండా గోతిలో జీవించమని రాజును శపించారు. రాజు బతిమాలగా, యదువంశంలో వామదేవుడు పుట్టి శాపవిమోచనం కలిగిస్తాడని చెప్పి ఆ బ్రాహ్మణులు వెళ్ళిపోయారు. తరవాత నృగమహారాజు వసువనే తన కుమారుడికి పట్టాభిషేకం చేసి, తాను ప్రజల కంట పడకుండా ఊసరవెల్లి జీవితం సుఖంగా గడపడానికి గాను కొన్ని గోతులు తవ్వించి వాటిమీద చెట్ల నీడా, వాటి చుట్టూ పూల మొక్కలూ ఏర్పాటు చేయించుకున్నాడు.

రాముడు లక్ష్మణుడికి నృగ మహారాజు కథ చెప్పి, ఆ తరవాత నిమి అనే వాడి కథ కూడా చెప్పాడు.

నిమి ఇక్ష్వాకు మహారాజు కొడుకులలో పన్నెండోవాడు. అతను ఒక దివ్యమైన పురం కట్టించి, దానికి వైజుంతమని పేరు పెట్టాడు. అతను తన తండ్రికి సంతోషం కలిగించడానికై ఒక యజ్ఞం తలపెట్టి, వసిష్టుడిని ఋత్విక్కుగా ఉండమని కోరాడు. అయితే వసిష్టుడు తనను ఇంద్రుడు ముందుగానే యజ్ఞం చేయించమని కోరాడని, ఇంద్రుడి యజ్ఞం పూర్తి కాగానే తాను వచ్చి యజ్ఞం చేయిస్తానని చెప్పి వెళ్లిపోయాడు. అందుచేత నిమి గౌతముడిని పెట్టుకుని యజ్ఞం పూర్తి చేసేశాడు. ఇంద్రుడి యజ్ఞం పూర్తి కాగానే వసిష్టుడు తిరిగి వచ్చి, నిమి తన కోసం వేచి ఉండక గౌతముడి చేత యజ్ఞం పూర్తి చేయించుకున్నాడని తెలుసుకుని కోపం చెంది, రాజును  చూడ బోయాడు.

సరిగా ఆ సమయానికి నిమి నిద్రపోతూ ఉండటం జరిగింది. వసిష్టుడు రాజదర్శనం కోసం కొద్ది సేవు చూసి, కావా లనే నిమి తనను వేచి ఉంచాడనుకుని, ‘‘రాజా మరొకరి చేత యజ్ఞం చేయించుకుని నన్నవమానించావు గనక నీ శరీరం నిశ్చేతనమగుగాక,’’ అని శపించాడు.


 తరవాత రాజు మేలుకుని వసిష్టుడిచ్చిన శాపం తెలుసుకుని, ‘‘నిద్రపోయే నన్ను శపించిన నీ శరీరం కూడా చేతనం లేనిదై పోవు గాక,’’ అని ప్రతిశాపమిచ్చాడు. ఇలా ఒకరినొకరు శపించుకుని నిమి వశిష్టులు ‘విదేహు’లయిపోయారు. అప్పుడు వశిష్టుడు తన తండ్రి అయిన బ్రహ్మ వద్దకు వాయురూపం ధరించి వెళ్లి ‘‘తండ్రీ, నిమి శాపం వల్ల నా దేహం కాస్తా పోయింది. దేహం లేకపోవటం చేత నన్ను అనుగ్రహించి నాకు మరొక శరీరం కలిగేటట్టు చెయ్యి,’’ అన్నాడు. బ్రహ్మ వసిష్టుడిని మిత్రావరుణుల తేజస్సుతో తిరిగి శరీరాన్ని సంపాదించుకొమ్మన్నాడు. ఆవిధంగా మరొక దేహాన్ని సంపాదించుకున్న వసిష్టుడే ఇక్ష్వాకువంశం వారికి పురోహితుడయ్యాడు.
ఇక నిమి సంగతి, నిమి శరీరాన్ని మునులు రక్షించి, దేహం పోయిన నిమి సమస్త ప్రాణుల కళ్లలోనూ ఉండేటట్టుగా, వరమిచ్చారు. తరవాత వారు నిమి దేహాన్ని మధించగా అందులో నుంచి ఒక పిల్లవాడు పుట్టి మిధి అని పిలవబడ్డాడు. అతని పేరనే మిధిలాన గరం ఏర్పడింది. అతనికి జనకుడని కూడా పేరు. రాముడు చెప్పిన ఈ కథలు విని లక్ష్మణుడు, ‘‘అన్నా, క్షత్రియుడై ఉండి కూడా నిమి వసిష్టుడి లాంటి మహాత్ముడి పట్ల ఎందుకు శాంతి వహించలేదు?’’ అన్నాడు.

‘‘రోషం మూలాన ఎలాటి వాడైనా శాంతిని కోల్పోవడం సహజం. అలా రోషాన్ని నిగ్రహించుకున్న వాడు ఒక్క యయాతి మాత్రమే,’’ అంటూ రాముడు లక్ష్మణుడికి యయాతి వృత్తాంతం ఈ విధంగా చెప్పాడు.

యయాతి నహుషుడి కొడుకు, అతని కిద్దరు భార్యలు. ఒకతె వృషపర్వ మహారాజు కుమార్తె అయిన శర్మిష్ట, రెండవది శుక్రాచార్యుడి కుమార్తె అయిన దేవయాని. కాని యయాతికి శర్మిష్టపైన ఉండే ప్రేమ దేవయాని పైన ఉండేది కాదు. అదేవిధంగా అతనికి శర్మిష్ట కొడుకైన పూరుడి పైన ఉన్నంత మమకారం దేవయాని కొడుకైన యదుడి పైన ఉండేది కాదు. నిజానికి పూరుడు మంచి గుణవంతుడు. ఆపైన శర్మిష్ట కొడుకు కూడానూ, తన తండ్రి పూరుడిపైన హెచ్చు ప్రేమ చూపటం సహించలేక యదుడు తన తల్లి అయిన దేవయానితో ‘‘అమ్మా, శుక్రాచార్యుడంతటి వాడి కూతురివై ఉండి నువూ, నీ కొడుకైన నేనూ అంత అవమానాన్ని ఎందుకు సహించాలి? మనమిద్దరమూ అగ్నిలో దూకి ప్రాణత్యాగం చేద్దాం. ఈ అవమానాన్ని ఒకవేళ నువు సహించినా, నేను సహించలేను, ఆత్మహత్య చేసుకుంటాను, నాకు అనుజ్ఞ ఇయ్యి,’’ అని పెద్ద పెట్టున ఏడ్చాడు.



కొడుకు దుఃఖం చూసి దేవయానికి రోషం వచ్చి, తన తండ్రిని తలుచుకున్నది, వెంటనే శుక్రాచార్యుడు వచ్చాడు. ‘‘నా భర్త నన్ను చాలా లోకువగా చూస్తున్నారు. ఆ అవమానం భరించటం కష్టంగా ఉంది. నేను అగ్నిలో దూకో, విషం తినో, నీటిలో పడో ఆత్మహత్యం చేసుకుందామనుకుంటున్నాను,’’ అన్నది దేవయాని తండ్రితో.

శుక్రాచార్యుడికి పట్టరాని ఆగ్రహం వచ్చి, యయాతిని ముసలితనంతో జీవించమని శపించి, కూతురి నోదార్చి, ఇంటికి తిరిగిపో యాడు. శుక్రాచార్యుడి శాపాన్ని యయాతి ఎంతో సహనంతో స్వీకరించాడు.

అతను యదువును పిలిచి, ‘‘నాయనా నేనింకా భోగాలతో తృప్తిపడలేదు. అందుచేత నా ముసలితనాన్ని నువు కొంత కాలం భరిస్తావా? నాకు భోగాలతో తృప్తి కలిగాక నీ యౌవనం నీకు ఇచ్చి నా ముసలితనం తీసుకుంటాను,’’ అన్నాడు. ‘‘నీ సరసన భోజనం చెయ్యడానికి అర్హుడైన పూరుడండగా నీ ముసలితనాన్ని నేనెందుకు తీసుకోవాలి? వాడినే తీసుకోమను,’’ అన్నాడు యదువు.

అప్పుడు యయాతి పూరుణ్ని పిలిచి యదువు నడిగినట్లే అడిగాడు. తన తండ్రి వార్థక్యాన్ని స్వీకరించడానికి పూరుడు మన స్పూర్తిగా అంగీకరించాడు. యయాతి తన ముసలితనాన్ని పూరుడి కిచ్చి, వాడి వనం తాను పొంది, అనేక వేల యజ్ఞాలు చేశాడు. చివరకతను తన కొడుకు నుంచి ముసలితనం తీసుకుని, వాడికే రాజ్యాభిషేకం చేసి, దేవయాని కొడుకైన యదువుకు రాజ్యార్హత లేకుండా చేశాడు. యయాతి అనంతరం పూరుడు ప్రతిష్టానపురం రాజధానిగా పెట్టుకుని చాలా కాలం  రాజ్యం చేశాడు.

రామలక్ష్మణులిలా కథలు చెప్పుకుంటూండగానే రాత్రి గడిచిపోయింది. తూర్పున అరుణరేఖలు కనిపించాయి.




No comments:

Post a Comment