Friday, September 7, 2012

రామాయణం - యుద్దకాండ 2


ఈ విధంగా రావణుడి సభలో అనేకమంది రాక్షస ప్రముఖులు, ‘‘ఇప్పుడే వెళ్ళి రామలక్ష్మణులనూ, వానరసేననూ నాశనం చేస్తాం,’’ అంటూ లేవటం చూసి, విభీషణుడు వారిని వారించి కూర్చోమని, చేతులు మోడ్చి రావణుడితో ఇలా అన్నాడు:

‘‘సామ దాన భేదోపాయాల వల్ల సాధ్యం కాని దాన్నే దండోపాయం ద్వారా సాధించాలని బుద్ధిమంతులంటారు. ప్రమత్తులూ, దురాశాపరులూ, దైవోపహతులూ అయిన వారి పట్ల ప్రయోగిస్తే దండోపాయం ఫలిస్తుంది, లేకపోతే ఫలించదు. రాముడు అప్రమత్తుడు, బలవంతుడు. హనుమంతుడు సముద్రం దాటి, లంకకు వచ్చి చేసిన అద్భుత కార్యాలు చూస్తే దైవం రాముడికి అనుకూలంగా ఉన్నట్టు కూడా కనబడుతుంది. శత్రుబలాన్ని తక్కువ చేసి చూడవద్దు. రాముడు రాక్షసులకు చేసిన అపకారానికి ప్రతీకారంగా నువ్వు సీతను ఎత్తుకు వచ్చావందామనుకున్నా, రాముడు తానై ఖరుడు మొదలైన రాక్షసులను చంపలేదు. వాళ్ళే పనిపెట్టుకుని అతని పైకి వెళ్ళారు. రాముడు ఆత్మరక్షణ కోసం వారిని చంపవలసి వచ్చింది. సీతను తీసుకు రావటం మనకే చేటు. ఆమెను తిరిగి రాముడి కివ్వటం మంచిది. నీ మేలు కోరి ఈ మాట చెబుతున్నాను. రాముడి బాణాలు లంకను సర్వనాశనం చెయ్యక ముందే సీతను రాముడికిచ్చెయ్యి.’’

విభీషణుడీ మాటలనగానే రావణుడు సభ చాలించి తన ఇంటికి షణుడు మర్నాడు ఉదయం రావణుడి భవనానికి వెళ్ళి, మంత్రులు తప్ప మరెవరూ లేని సమయంలో తన అన్నతో, ‘‘సీత వచ్చినది మొదలు అనేక దుశ్శకునాలు కనిపిస్తున్నాయి.


ఈ సంగతి లంకలోని ప్రతి ఒక్కరికీ కూడా తెలుసు. మంత్రులు నీతో ఈ సంగతి చెప్పరు. అన్ని విషయాలూ చక్కగా ఆలోచించి న్యాయప్రకారం చెయ్యి,’’ అన్నాడు. రావణుడీ మాట విని కోపంచెంది, ‘‘నా కెవరి భయమూ లేదు. రాముడు సీతను పొందలేడు. దేవేంద్రుడు సహాయం వచ్చినా యుద్ధంలో నా ఎదుట నిలవలేడు,’’ అని చెప్పి విభీషణుణ్ణి పంపేశాడు.

తరవాత రావణుడు యుద్ధం గురించి తన మంత్రులతో ఆలోచించగోరి, తన రథాన్నెక్కి, సపరివారంగా సభాభవనానికి వెళ్ళి, రాక్షసులనందరినీ పిలుచుకు రమ్మని దూతలను పంపాడు. దూతలు రాక్షసులందరి ఇళ్ళకూ వెళ్ళి వేరువేరు పనులలో నిమగ్నులై ఉన్న రాక్షసులను పిలిచారు. వారందరూ వచ్చిన మీదట, రావణుడు విభీషణుణ్ణీ, శుకుణ్ణీ, ప్రహస్తుణ్ణీ ప్రత్యేక స్థానాలలో కూర్చోమని చెప్పి, ప్రహస్తుడితో, ‘‘మన రాక్షస సైనికులు లంకానగరాన్ని ఎప్పటికన్న జాగ్రత్తగా రక్షించాలని చెప్పు,’’ అన్నాడు.

ప్రహస్తుడు బయటికి వెళ్ళి తిరిగి వచ్చి, ‘‘సమస్త సైన్యమూ సంసిద్ధంగా ఉన్నది,’’ అని చెప్పాడు.‘‘మీ సలహాతో ప్రారంభించిన ప్రతి పనీ సఫలమయింది. ఇప్పుడు కూడా మీ సహాయంతో నాకు జయం లభించి తీరుతుంది. ఇప్పుడున్న సమస్య ఏమిటో మీకు ముందే చెప్పాను. ఆరు కంటే ఒక్క వానరుడు సముద్రం దాటి వచ్చి పెద్ద యుద్ధం చేసి పోయాడు.

 అందుచేత బాగా ఆలోచించండి. రాముడు వానర సేనతో సముద్రం అవతలి ఒడ్డున చేరి ఉన్నాడు. సీతను ఇచ్చేమాట అబద్ధం. రామలక్ష్మణులను చంపే ఉపాయం చూడండి,’’ అని రావణుడన్నాడు.

రావణుడన్న మాటలు విని కుంభకర్ణుడు మండిపడుతూ, ‘‘సీతను తీసుకురాకపూర్వం మాతో ఈ ఆలోచన చేసి ఉండవలసింది. ఏ పని చేసేటప్పుడైనా ముందుగానే చక్కగా ఆలోచిస్తే తరవాత పశ్చాత్తాపపడనవసరముండదు. కొంచెంకూడా ఆలోచించకుండా సీతను అపహరించి తెచ్చావు. రాముడు నిన్నిదివరకే చంపక పోవటం అదృష్టం. ఈ స్థితిలో నీ శత్రువుల నందరినీ చంపి నీ కార్యం నెరవేర్చే శక్తిగలవాణ్ణి  నేనొక్కణ్ణే ఉన్నాను. నేనా పని చేస్తాను. అందుచేత నువ్వు నిశ్చింతగా ఉండు,’’ అన్నాడు.

కుంభకర్ణుడి మాటలు రావణుడికి కోపం కలిగించాయి. ఆ సంగతి గ్రహించి మహాపార్శ్వుడనే రాక్షసుడు, ‘‘తేనె కోసం భయంకర మృగాలున్న వనంలో ప్రవేశించి తేనె సంపాదించుకున్న వాడు, దాన్ని తాగకపోతే వాడు వట్టి మూఢుడు. రావణా, అందరికీ నువ్వే ఈశ్వరుడవు, నిన్నడ్డగల వారెవరు? సీతను యధేచ్ఛగా అనుభవించు. ఆమె ఒప్పకపోతే బలాత్కారంగానైనా అనుభవించు. నీ కోరిక తీరినాక ఏం వచ్చినా రానీ. నువ్వు అన్నిటినీ ఎదుర్కోగలవు. దేవేంద్రుణ్ణి సయితం జయించగల వారు కుంభకర్ణుడూ, ఇంద్రజిత్తూ ఉండనే ఉన్నారు. సామ దాన భేదాలన్నవి చేతగాని వారికి.
నువ్వు దండోపాయంతోనే కార్యసిద్ధి పొందు,’’ అన్నాడు.

ఈ మాట రావణుడికి నచ్చింది. అతడు మహాపార్శ్వుడితో, ‘‘నన్ను గురించి ఒక రహస్యమున్నది. ఒకప్పుడు పుంజికస్థల అనే అప్సరస బ్రహ్మదేవుడి ఇంటికి పోతూ ఉంటే చూసి బలాత్కారంగా చెరిచాను. ఆ సంగతి బ్రహ్మకు తెలిసిందట. ఆయన, అది మొదలు నేను ఏ పరస్ర్తీని గాని బలాత్కారంగా అనుభవిస్తే నా తల నూరు ముక్కలవుతుందని శపించాడు. ఆ శాపానికి భయపడే నేను సీతను బలాత్కారంగా అనుభవించ లేదు. నాకు గల వేగమూ, గమనశక్తీ తెలియక రాముడు నా పైకి వస్తున్నాడు. గుహలో నిద్ర పోయే సింహాన్ని లేపినట్టుగా మృత్యువులాటి నన్ను కవ్విస్తున్నాడు.

 నా బాణాల దెబ్బ ఎరగడు. ఇక తెలియజేస్తాను,’’ అన్నాడు. ఈ ధోరణిని విభీషణుడు సహించలేక తనకు తోచిన మాటలు నాలుగూ దులిపేశాడు. సీతను తీసుకురావటం అయిదు తలల విష సర్పాన్ని తెచ్చుకోవటమేనన్నాడు; రాముణ్ణి ఇంద్రజిత్తయేది, రావణుడయేది, ఎవరయేది జయించటం కల్ల అన్నాడు; రావణుడు తప్పు తోవను పోతుంటే మిగిలినవారు అతణ్ణి సరి అయిన మార్గానికి తిప్పటానికి బదులు ఇచ్చకాలాడుతున్నారన్నాడు; సీతను రాముడి వద్దకు పంపెయ్యటం అందరికీ క్షేమమని తేల్చాడు.

విభీషణుడు చెప్పిన ఈ మాటలకు ఇంద్రజిత్తు, ‘‘బాబాయీ, పులస్త్య వంశంలో పుట్టిననువ్వు అనరాని మాటలన్నావు. బల శౌర్య పరాక్రమాలు లేని పిరికిపందవు! ఎందుకు అందరినీ భయపెట్టుతున్నావు? రామ లక్ష్మణులను చంపటానికి ఒక్క రాక్షసుడు చాలు. నేను ఇంద్రుణ్ణి ఓడించాను. నన్ను చూసి దేవతలు గొర్రెల మందలాగా పారిపోయారు. ఐరావతాన్ని కూల్చి, దాని దంతాలు పెరికాను. అల్పులైన ఈ రాజకుమారులను జయించలేనా?’’ అన్నాడు.
‘‘నాయనా, కురవ్రాడివి. నీ బుద్ధి పరిపక్వం కాలేదు. నీ తండ్రి పక్షంగా మాట్లాడుతూ అతనికే శత్రుడివవుతున్నావు. ఈ సభలో నిన్ను మాట్లాడనివ్వటమే తప్పు. సీతను కానుకలతో సహా రాముడికి అర్పించినట్టయితే మనమంతా సుఖంగా ఉండవచ్చు,’’ అన్నాడు విభీషణుడు. ఈ మాట అన్నందుకు రావణుడు విభీషణుడిపై విరుచుకుపడ్డాడు. ‘‘జ్ఞాతివి, శత్రు పక్షపాతివి. జ్ఞాతి కన్న పగవాడు లేడు. తమ్ముడివని క్షమించాను. మరొకడైతే చీల్చేసి ఉందును. ఛీ, వంశం చెడబుట్టిన వాడా!’’ అన్నాడు.

రావణుడిలా చీదరించుకోగానే విభీషణుడు మరి నలుగురు రాక్షస అనుచరులతో సహా ఆకాశంలోకి లేచి, ‘‘అన్న వని నీ మేలు కోరి చెప్పాను. నా మీద లేని తప్పు మోపి, నిందించావు. అది సహించరానిది. ఇష్టమైన మాటలు చెప్పేవారు కొల్లలు, కటువుగా ఉన్నప్పటికీ మేలు చేసే మాటలు చెప్పేవారు దొరకరు. నువ్వు రాముడి చేతిలో చావగా చూడలేను. నీ మంచి కోరి చెప్పిన మాటలను క్షమించు. నువ్వూ, లంకా, ఈ రాక్షసులూ క్షేమంగా ఉండేటట్టు చూసుకో.

నేను పోతున్నాను. నువ్వు సుఖంగా ఉండు,’’ అని చెప్పి, అక్కడి నుంచి బయలుదేరి రామలక్ష్మణులూ, వానరసేనా వున్న చోటికి క్షణంలో సమీపించాడు.

ఆయుధాలు ధరించి ఆకాశమార్గాన అతి వేగంగా వస్తున్న విభీషణుణ్ణీ, అతని వెంట ఉన్న నలుగురు రాక్షసులనూ వానరులంతా చూశారు. సుగ్రీవుడు ఆ రాక్షసులను చూసి, హనుమంతుడు మొదలైన వారితో, ‘‘ఈ రాక్షసులు తప్పకుండా మనని చంపటానికే ఇటు వస్తున్నారు, చూడండి!’’ అన్నాడు. వెంటనే వానర ప్రముఖులు చెట్లనూ, శిలలనూ తీసుకుని, ‘‘ఈ దుర్మార్గులను చావగొట్టి కింద పడేస్తాం. వీళ్ళెంత?’’ అన్నారు. ఈలోపల విభీషణుడు తన అనుచరులతో సహా సముద్రపు ఉత్తర తీరాన్ని చేరి, ఆకాశంలోనే నిలబడి, సుగ్రీవుణ్ణీ, వానరులనూ చూసి ఇలా అన్నాడు:

 ‘‘దుర్మార్గుడైన రాక్షస రాజు రావణుడనే వాడికి నేను తమ్ముణ్ణి. నన్ను విభీషణుడంటారు. అతను జటాయువును చంపి, దుఃఖితురాలూ, వివశురాలూ అయి ఉన్న సీతను జనస్థానం నుంచి ఎత్తుకు వచ్చి రాక్షస స్ర్తీల రక్షణలో ఉంచాడు. సీతను రాముడికి తిరిగి ఇచ్చి వెయ్యమని నయాన ఎన్నోసార్లు చెప్పాను. కాలం మూడిన రావణుడికి నా మాట రుచించింది కాదు. అందుచేత అతడు నన్ను భృత్యుడిలాగా చూసి పరుష వాక్యాలన్నాడు. నేను భార్యా పుత్రులను సైతం విడిచి పెట్టి రాముడి శరణు కోరి వచ్చాను.


నేనిలా వచ్చానని రాముడికి వెంటనే నివేదించండి.’’ఈ మాటలు వింటూనే సుగ్రీవుడు లక్ష్మణుడి వెంట రాముడున్న చోటికి వెళ్ళి, ‘‘రావణుడి తమ్ముడు విభీషణుడట, నలుగురు రాక్షసులను వెంట బెట్టుకుని నిన్ను శరణు వేడ వచ్చాడు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ రాక్షసులను నమ్మరాదు; వారు కామరూపులు, శూరులు, అదృశ్యంగా ఉండగలవారు, మాయావులు. ఇతను రావణుడి వేగులవాడుగా వచ్చి, మన విశ్వాసం సంపాదించి, మన మధ్య భేదాలు కలిగించవచ్చు; సందేహం లేదు. లేదా ఎప్పుడో ఒకప్పుడు ఇతనే మన మీద దెబ్బ తీయవచ్చు. మన శత్రువుకు తమ్ముడైన ఇతని నెలా నమ్మటం? రావణుడే ఇతణ్ణి పంపి ఉండవచ్చు. ఇతణ్ణీ, ఇతడి అనుచరులనూ వెంటనే చంపటం మంచిది,’’ అని హెచ్చరించాడు.

రాముడు సుగ్రీవుడి సలహా విన్న మీదట వానర ప్రముఖుల కేసి చూసి, ‘‘సుగ్రీవుడు ఆలోచించి చెప్పిన మాట విన్నారు గదా. అలాగే మీరందరూ కూడా బాగా ఆలోచించి మీకు మీకు తోచిన సలహాలివ్వవచ్చు,’’ అన్నాడు.విభీషణుడు ఎలాటి వాడయినదీ స్పష్టంగా తేల్చుకున్న మీదట అతనిని నమ్మటమో, మానటమో తేల్చుకుందామని అంగదుడన్నాడు. అతణ్ణి పరీక్షించటానికి సూక్ష్మ బుద్ధిగల చారుణ్ణి పంపుదామని శరభుడన్నాడు. విభీషణుడు ఇక్కడికి రావటమే అనుమానాస్పదంగా ఉన్నదని జాంబవంతుడన్నాడు.

హనుమంతుడు అందరి సలహాలనూ కొట్టి పారేశాడు. ‘‘విభీషణుడి మంచి చెడ్డలు విచారించటం ఎలా? సమీపంలో ఉన్న వాడి వద్దకు చారుణ్ణి ఎలా పంపటం? విభీషణుడు ఈ సమయంలో ఇక్కడికి రావటానికి తగిన కారణం ఉన్నది. రావణుడు దుర్మార్గుడని అతనికి తెలుసు. అలాగే రాముడు వాలిని చంపి సుగ్రీవుడికి రాజ్యాభిషేకం చేసిన సంగతి కూడా అతనికి తెలుసు. అతను రాజ్యం కోరి బుద్ధిపూర్వకంగానే తన అన్నను వదిలి ఇక్కడికి వచ్చాడు. ఇలా నాకు తోస్తున్నది. తరవాత నీ ఇష్టం,’’ అన్నాడు హనుమంతుడు రాముడితో.



No comments:

Post a Comment