Friday, September 7, 2012

రామాయణం - సుందరకాండ 1


జాంబవంతుడు ప్రోత్సాహం ఇవ్వగా హనుమంతుడు రామముద్రికతో సహా లంకకు దాటి, రావణుడు సీతను ఉంచిన స్థలం కనిపెట్ట నిశ్చయించుకున్నాడు. అతను శరీరాన్ని పెంచి, మహేంద్రగిరి పైన అటూ ఇటూ తిరుగుతూ, పెద్ద వృక్షాలను తన రొమ్ముతో కూలదోస్తూ, మృగాలను చంపుతూ కొంతసేపు సంచరించాడు.
 
బయలుదేరే ముందు అతను సూర్యుడికీ, ఇంద్రుడికీ, వాయుదేవుడికీ, బ్రహ్మకూ నమస్కారాలు చేసి, మహేంద్రపర్వతం మీద చేతులూ, కాళ్ళూ ఆనించి ఒక్క ఊపు ఊపాడు. చలనం ఎరగని మహేంద్ర పర్వతం ఆ ఊపుకు కంపించిపోయింది. దాని మీది శిలలు బద్దలయ్యూయి. గుహలలో ఉండే ప్రాణులు ఆర్తనాదాలు చేశాయి. పర్వతం మీద ఉండే విద్యాధరులు కంగారు పడి ఆకాశంలోకి ఎగిరారు.
 
ఋషులూ, చారణులూ, సిద్ధులూ హనుమంతుడు సముద్రాన్ని లంఘించి లంకకు వెళ్ళే యత్నంలో ఉండటం గురించి మాట్లాడుకోసాగారు. హనుమంతుడు తన శరీరం మీది రోమాలను విదిల్చి, ఒక్క పెడబొబ్బ పెట్టాడు.
 
ఒకసారి దూరం కేసీ, ఒకసారి ఆకాశం కేసీ చూసి, తన సమీపంలో ఉన్న జాంబవంతుడు మొదలైన వారితో, ‘‘నేను రామబాణం లాగా వేగంతో లంకకు పోతాను, అక్కడ సీత కనిపించకపోతే అదే వేగంతో స్వర్గానికి వెళతాను. అక్కడ కూడా సీత లేని పక్షంలో తిరిగి లంకకు వెళ్ళి, ఆ రావణుణ్ణి బంధించి ఇక్కడికి తెస్తాను. అదృష్టం కలిసివస్తే సీతను తెస్తాను.

లేదా, రావణుడితో సహా లంకనే పెళ్ళగించి ఇక్కడికి తెస్తాను,'' అన్నాడు. ఈ మాట చెప్పి హనుమంతుడు ఆకాశం లోకి ఎగిరాడు. హనుమంతుడు ఎగిరిన వేగానికి పెద్దపెద్ద మానులు అతని వెనకగా గాలిలో లేచి కొంతదూరం ఎగిరి, తరవాత సముద్రంలో పడిపోయూయి. దూర ప్రయూణం మీద బయలుదేరే వాణ్ణి బంధువులు కొంతదూరం సాగనంపినట్టుగా ఆ చెట్లు హనుమంతుణ్ణి వెంబడించాయి.
 
అవి పడిపోయిన తరవాత కూడా వాటి పూలు మరికొంత దూరం హనుమంతుడి వెంట వెళ్ళాయి. దక్షిణ దిక్కుగా హనుమంతుడు అతి వేగంగా సముద్రం మీదుగా పోతూ ఉంటే, అతని చేతుల సందుగా వెళ్ళే గాలి గొప్ప రొద చేసింది. అతను లంకకు చేటు సూచించే తోకచుక్కలాగా లంక కేసి వెళ్ళాడు. అతని వేగానికి అతనికి దిగువగా ఉండే సముద్రంలో పెద్ద తరంగాలు కల్లోలంగా లేచాయి.
 
అతని నీడ సముద్రం మీద పది ఆమడల వెడల్పునా, ముపై్ఫ ఆమడల పొడుగునా పడింది. ఇలా సముద్రం మీదుగా వెళ్ళే హనుమంతుణ్ణి చూసి దేవతలు మెచ్చారు. సముద్రుడికి కూడా హనుమంతుడికి తోడ్పడాలనే ఆలోచన కలిగింది. ఎందుకంటే సముద్రుణ్ణి వృద్ధిపొందించిన సగరుడు ఇక్ష్వాకువంశం వాడు. అదే వంశంలో పుట్టిన రాముడి పని మీద హనుమంతుడు వెళుతున్నాడు.
 
ఇక్ష్వాకు వంశానికి తన కృతజ్ఞత చూపుకోవాలంటే సముద్రుడికి ఇది మంచి అవకాశం. అందుకని సముద్రుడు తనలో దాగి ఉన్న మైనాకపర్వతంతో, ‘‘ఓ మైనాకుడా, పాతాళంలోని రాక్షసులు పైకి రాకుండా అడ్డం ఉన్న నీకిప్పుడు చిన్నపని చెబుతాను. వానర శ్రేష్ఠుడైన హనుమంతుడు రాముడి పని మీద అత్యంత సాహసంతో లంకకు ఎగురుతూ ఇటుగా వస్తున్నాడు.
 
నీకు పైకీ, పక్కలకూ కూడా పెరిగే శక్తి ఉన్నది గనక, నీటి పైకి పెరిగి ఆ హనుమంతుడికి కాస్సేపు విశ్రాంతి ఇవ్వు. నీపైన కాస్సేపు విశ్రమించిన మీదట హనుమంతుడు మిగిలిన దూరం మరింత తేలికగా వెళ్ళగలడు,'' అన్నాడు. అప్పుడు బంగారు శిఖరాలు గల మైనాక పర్వతం సముద్రుడు కోరిన ప్రకారం ఆకాశంలోకి పెరిగింది. దాని బంగారు శిఖరాలు నూరు సూర్యుళ్ళలాగా వెలిగాయి.

ఆకస్మికంగా తన దారికి అడ్డంగా పెరిగిన ఆ మైనాకాన్ని చూసి హనుమంతుడు, ‘‘ఇది నా పనికి విఘ్నంచెయ్యూలనే దుర్బుద్ధితో నా దారికి అడ్డంగా లేచింది,'' అనుకుని ఆ పర్వతాన్ని తన రొమ్ముతో ఒక్క తోపు తోసేసరికి, అది పక్కకు పడిపోయింది.
 
తనను సునాయూసంగా పడదోసిన హనుమంతుడి వేగానికి మైనాకుడెంతో సంతోషించి, మానవరూపం ధరించి ఒక శిఖరంపై నిలబడి, ‘‘వానరవీరుడా, నువ్వు అసాధ్యమైన సముద్ర లంఘనం చేస్తూ కూడా, కొంచెమైనా అలియకపోగా, నన్ను పడదోశావు.
 
నా శిఖరం మీద కాస్సేపు విశ్రమించు. ఒకప్పుడు రాముడి పూర్వీకుడైన సగరుడూ, అతడి కొడుకులూ సముద్రుడికి మహోపకారం చేశారు. అందుచేత రాముడి పని మీద వెళ్ళే నీకు కొంత సహాయం చేసి ఇక్ష్వాకులకు ప్రత్యుపకారం చెయ్యూలని సముద్రుడి కోరిక. అందుచేత నీకు విశ్రాంతి కలిగించమని సముద్రుడు నన్ను కోరాడు. నా మీద నిలిచి, అలసట తీర్చుకుని కందమూలఫలాలు ఆరగించి మరీ వెళ్ళు.
 
ఏ అతిథి అయినా పూజనీయుడే అన్నప్పుడు, నీ వంటి అతిథి మాట వేరే చెప్పాలా? నువ్వు మహాపండితుడవు. అది అలాగుంచి, వాయుదేవుడికి ఋణపడి ఉన్నాను. ఎలాగంటే: కృతయుగంలో పర్వతాలన్నిటికీ రెక్కలుండేవి. అవి వేగంగా గాలిలో ఎగురుతూ ఉండేవి. అందుచేత వాటిని చూసి దేవతలూ, ఋషులూ కూడా భయపడ్డారు.

అప్పుడు దేవేంద్రుడు వజ్రాయుధంతో పర్వతాల రెక్కలు అనేకవేల సంఖ్యలో తెగవేశాడు. నా రెక్కలు కూడా తెగవేయటానికి ఇంద్రుడు రాగా, నీ తండ్రి అయిన వాయుదేవుడు నన్ను అతివేగంగా తీసుకుపోయి ఇంద్రుడి బారినుంచి కాపాడాడు. ఆయన దయవల్ల నా రెక్కలు దక్కాయి. అందు చేత నువ్వు కాదనకుండా నేనూ, సముద్రుడూ ఇచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించాలి,'' అని చెప్పాడు.
 
దానికి హనుమంతుడు, ‘‘చాలా సంతోషం! నీ మాటలే నాకు ఆతిథ్యం. మీ ఆతిథ్యాన్ని నిరాకరించినందుకు మీరు కోపగించ వద్దు. కార్యార్థినైన నేను విశ్రాంతి తీసుకోవటం అసాధ్యం. రామబాణంలాగా లంకకు పోతానని వానరులకు మాట ఇచ్చాను,'' అంటూ మైనాకుణ్ణి తన చేతితో తాకి, సంతోషం తాండవించే ముఖంతో ముందుకు సాగాడు. ‘‘నీకు కార్యసిద్ధి అగుగాక!'' అని సముద్రుడూ, మైనాకుడూ అతన్ని దీవించారు.
 
హనుమంతుడు అక్కడి నుంచి ఆకాశం లోకి మరింత ఎత్తుగా ఎగిరి ముందుకు సాగాడు. మైనాకుడిచ్చిన ఆశ్రయూన్ని నిరాకరించి దీక్షతో లంకకు వెళ్ళే హనుమంతుడికి దేవతలు పరీక్ష పెట్టగోరి, పాములకు తల్లి అయిన సురస వద్దకు వెళ్ళి, ‘‘వాయుపుత్రుడైన హనుమంతుడు సముద్రం మీదుగా ఎగురుతూ లంకకు పోతున్నాడు. నువ్వు భయంకరాకారం ధరించి అతని దారికి అడ్డం తగులు.
 
అతను నిన్ను జయించి పోతాడో, నిన్ను చూసి భయపడతాడో చూడగోరుతున్నాం. అతని పరాక్రమం ఎంతటిదో తెలుసుకోవాలని మా అందరి కోరిక,'' అన్నారు. సురస వారి కోరిక తీర్చటానికై కొండంత రాక్షసరూపం ధరించి, పెద్ద కోరలతోనూ, గోరోజనం రంగుగల కళ్ళతోనూ భయంకరంగా తయూరై, హనుమంతుడి దారికడ్డంగా నిలబడి, ‘‘హనుమంతుడా, నిన్ను భక్షించటానికి దేవతలు నాకు అనుజ్ఞ ఇచ్చారు.
 
కనక నువ్వు నా నోట్లోకి ప్రవేశించు,'' అన్నది. హనుమంతుడు సురసకు నమస్కారం చేసి, నవ్వుతూ, ‘‘రాముడు వనవాసం చేస్తూండే సమయంలో, ఆయన లేనప్పుడు రావణుడు ఆయన భార్య అయిన సీతను ఎత్తుకు పోయూడు. నేను రాముడి దూతగా ఇప్పుడు సీత వద్దకు పోతున్నాను.

రాముడి రాజ్యంలో ఉండే దానివే గనక నువ్వు కూడా రామకార్యానికి తోడ్పడాలి. కాదంటావా, రాముడి వద్దకు వెళ్ళి అనుమతి పొంది, నీ నోట ప్రవేశిస్తాను. ఇందుకు నా కేమీ అభ్యంతరం లేదు,'' అన్నాడు. సురస ఆ మాటకు జవాబివ్వక, ‘‘నన్ను దాటి ఎవరూ వెళ్ళలేరు. ఆ విధంగా నాకు వరం ఉన్నది. నా నోటి ముందుకు వచ్చిన వాడు తప్పించుకు పోలేకుండా నాకు బ్రహ్మ వరమిచ్చాడు.
 
కనక నా నోట ప్రవేశించు,'' అంటూ నోరు తెరిచి హనుమంతుడి ముందు నిలబడింది. ఈ మాటకు హనుమంతుడు అలిగి, ‘‘అయితే, నన్ను మింగేటంతగా నోరు తెరు!'' అంటూ, తన శరీరాన్ని పది ఆమడల ప్రమాణానికి పెంచాడు. వెంటనే సురస తన నోటిని ఇరవై ఆమడల ప్రమాణానికి పెంచింది. హనుమంతుడు కోపంతో తన దేహాన్ని ముపై్ఫ ఆమడలకు పెంచాడు. సురస తన నోటిని నలభై ఆమడలు చేసింది.
 
హనుమంతుడు తన శరీరాన్ని యూభై ఆమడలకు పెంచాడు. ఈ విధంగా పోటీ పడటంతో హనుమంతుడి శరీరం తొంభై ఆమడలూ, సురస నోరు నూరామడలూ అయ్యూయి. అకస్మాత్తుగా హనుమంతుడు తన శరీరాన్ని వేలంతదిగా చేసి, తూనీగలాగా సురస నోట్లో ప్రవేశించి మళ్ళీ బయటికి వచ్చి, ‘‘ఓ సురసా, బ్రహ్మదేవుడు నీ కిచ్చిన వరం సార్థక మయింది.
 
నీ నోటి ముందుకు వచ్చిన నేను నీ నోట ప్రవేశించాను. ఇంతటితో నన్ను వదిలిపెట్టు. సీత ఉండే చోటికి వెళ్ళాలి,'' అన్నాడు. సురస రాక్షస రూపం విడిచిపెట్టి మామూలు రూపు ధరించి, ‘‘వెళ్ళిరా, నాయనా. నీకు విజయం కలుగుతుంది. రాముణ్ణీ, సీతనూ తిరిగి కలుపు!'' అని చెప్పి తన నివాసానికి వెళ్ళింది. హనుమంతుడు తిరిగి ప్రయూణం సాగించాడు.
 
ఆకాశంలో ఎగిరిపోయే హనుమంతుణ్ణి సింహిక అనే రాక్షస జంతువు సముద్రంలో ఉండి చూసింది. అది ఆకలితో ఉండటం చేత హనుమంతుణ్ణి తినగోరి, అతని నీడను పట్టుకుని ఈడ్చింది. తనను ఎవరో వెనక్కు లాగేస్తూండటం గమనించి హనుమంతుడాశ్చర్యపోయి, అటూ, ఇటూ, అన్ని పక్కలా చూసేసరికి సముద్రం మీద సింహిక కనిపించింది.

అది తన నీడను పట్టుకుని ఉండటం చూడగానే హనుమంతుడికి సుగ్రీవుడు ఎప్పుడో అన్న మాట జ్ఞాపకం వచ్చింది. దక్షిణ సముద్రంలో ఒక వింత జంతువు వున్నదనీ, అది నీడను పట్టుకోగలదనీ సుగ్రీవుడన్నాడు. అదే ఇది అయి ఉంటుందని హనుమంతుడనుకున్నాడు. సింహిక శక్తి ముందు హనుమంతుడి పరాక్రమం ఎందుకూ పనికి రాలేదు.
 
అది అతణ్ణి తన కేసి ఈడ్చుకున్నది. హనుమంతుడు తన శరీరాన్ని అపారంగా పెంచాడు. అందుకు తగ్గట్టుగానే సింహిక కూడా భయంకరంగా నోరు తెరిచింది. ఆ తెరిచిన నోటికుండా హనుమంతుడు దాని శరీరంలోని మర్మస్థానాలు గమనించి, తన శరీరాన్ని చిన్నదిగా చేసి, లోపలికి ప్రవేశించి, సింహిక మర్మాలు చీల్చేసి, అది తిరిగి నోరు మూసే లోపుగా బయటికి వచ్చేసి, తన శరీరాన్ని పెద్దది చేసుకున్నాడు.
 
సింహిక గుండెలు చీలిపోయి స్పృహ తప్పి చచ్చి, నీటిపై తేలింది. చచ్చిన సింహికనూ, చంపిన హనుమంతుణ్ణీ చూసి ఆకాశంలో సంచరించే భూతాలు ఎంతో సంతోషించి, హనుమంతుణ్ణి కీర్తించాయి. హనుమంతుడు మళ్ళీ బయలుదేరాడు. కొంత సేపటికి అతనికి సముద్రపు అవతలి తీరం కనిపించింది. అక్కడ అడవులున్నాయి. పోయినకొద్దీ లంకాద్వీపమూ, అక్కడి వనాలూ, చెట్లూ మరింత బాగా కనిపించాయి.
 
లంకలోని నదులు సముద్రంలో వచ్చి పడటం కనిపించింది. తన దేహం ఇంకా పెద్దదిగానే ఉండటం హనుమంతుడికి జ్ఞాపకం వచ్చింది. లంకలోని రాక్షసులు అంత శరీరంతో ఉన్న తనను చూశారంటే హాహాకారాలు చేసి, అందరికీ చెబుతారు; అప్పుడు తాను వచ్చిన పని కాస్తా పాడైపోతుంది.
 
అందుచేత హనుమంతుడు తన దేహాన్ని చిన్నదిగా చేసుకున్నాడు. ఆ శరీరంతో అతను ఆలంబపర్వతం మీద దిగాడు. దాని మీద విరిగిచెట్లూ, మొగలి పొదలూ, కొబ్బరిచెట్లూ ఉన్నాయి. ఎత్తుగా త్రికూటపర్వతం పైన లంకానగరం కనిపిస్తున్నది. అది దేవేంద్రుడి అమరావతీ నగరంలాగున్నది.

No comments:

Post a Comment