Friday, September 7, 2012

రామాయణం - అయోధ్యాకాండ 6


ఆ రాత్రి వారు ముగ్గురూ భరద్వాజుడు చెప్పిన కథలు అనేకం విని సుఖంగా నిద్ర పోయారు. మర్నాడు ఉదయం భరద్వాజుడు వారిని కొంతదూరం సాగనంపి, చిత్రకూటానికి తాను అనేక మార్లు వెళ్ళి వచ్చిన తోవ గుర్తులు చెప్పాడు. సీతారామ లక్ష్మణులు ఆయన వద్ద సెలవు పుచ్చుకుని ఆయన చెప్పిన దారినే నడుస్తూ యమునా నదిని దాటవలసిన రేవు వద్దకు వచ్చారు. అక్కడ లక్ష్మణుడు కొయ్యలమీద ఎండిన వెదుళ్ళతో ఒక విశాలమైన తెప్ప తయారు చేశాడు.
 
దానిపైన నేరేడు కొమ్మలతోనూ, పబ్బలి తీగలతోనూ ఒక సుఖమైన ఆసనం సీత కోసం అమర్చాడు. తెప్ప మీద తమ వస్తువుల నన్నిటినీ ఉంచి, తాము కూడా ఎక్కి నదిని దాటారు. ప్రవాహ మధ్యంలో సీత యమునా నదికి నమస్కరించి ఆవులూ, వెయ్యి కడవల పాలూ ఇస్తానని, గంగకు మొక్కుకున్నట్టే మొక్కుకున్నది.
 
వసంతకాలం కావటంచేత అడివి చెట్లు పుష్పించి మహాశోభగా ఉన్నాయి. మోదుగు చెట్లనిండా ఎరట్రి పూలున్నాయి. సీత ఇప్పుడు ఆ వసంత శోభను చూసి ఆనందించటం ప్రారంభించింది. లక్ష్మణుడు ఆమె ముందు నడుస్తూ, ఆమె కోరిన ప్రతి పువూ్వ, ప్రతి పండూ కోసి తెచ్చి ఇస్తూ, ఆమె చెట్లను గురించి అడిగే ప్రశ్నలన్నిటికీ వివరంగా సమాధానాలిచ్చాడు.
 
ఆ రాత్రికి వారు ఒక చదునైన చోటు చూసుకుని అక్కడ నిద్రపోయారు. తెల్లవారుతూనే రాముడు లేచి లక్ష్మణుణ్ణి లేపి చిత్రకూటానికి ప్రయాణం సాగించాడు. చిత్రకూట ప్రాంతంలో రాముడు ఒక స్థలం చూసి అక్కడ పర్ణశాల నిర్మిద్దామన్నాడు.

లక్ష్మణుడు మంచి గుంజలు నరికితెచ్చి, వాటితో దృఢమైన విభాగాలూ నిర్మించాడు. ఆ పర్ణశాలలో సీతారామలక్ష్మణులు శాస్త్రోక్తంగా గృహప్రవేశం చేసి, పక్కనే ప్రవహించే మాల్యవతీ నదిలో స్నానాలుచేస్తూ, చుట్టూ ఉండే అందమైన అరణ్య ప్రాంతంలో విహరిస్తూ, పట్టణ జీవితాన్ని మరిచి సుఖంగా కాలం గడపసాగారు. అక్కడ శృంగిబేరపురంలో గుహుడూ, సుమంత్రుడూ గంగ ఒడ్డున నిలబడి సీతారామ లక్ష్మణులు కనుమాటు అయినదాకా చూసి గుహుడి ఇంటికి వెళ్ళిపోయారు.
 
రాముడు మనసు మార్చుకుని తిరిగి వస్తాడేమోనని మూడు రోజులు చూసి సుమంత్రుడు ఖాళీ రథంతో అయోధ్యకు బయలుదేరి, రాముడు అయోధ్య విడిచి వెళ్ళిన అయిదు రోజులకు తిరిగివచ్చాడు. దారిలో పౌరులు ఖాళీగా రథం తిరిగి రావటం చూసి ఎవరికి తోచినట్టు వారు మాట్లాడుకున్నారు. సుమంత్రుడు తిన్నగా కౌసల్య ఇంటికి వెళ్ళి, సింహాసంపైన కూర్చుని ఉన్న దశరథుడితో రాముడు చెప్పి పంపిన మాటలు చెప్పేశాడు. దశరథుడు అమితమైన శోకోద్రేకంతో స్పృహతప్పి కింద పడి పోయాడు. కౌసల్య, సుమిత్ర సహాయంతో దశరథుణ్ణి లేవదీస్తూ, ``మహారాజా, రాముణ్ణి అరణ్యంలో దింపి వచ్చిన సుమంత్రుడికి జవాబైనా చెప్పరేం? కైక ఏమన్నా అనుకుని పోతుందనా? ఆవిడగారిక్కడ లేదుగా!'' అని చెప్పింది.
 
దశరథుడితో బాటు కౌసల్యా, ఇతర అంతఃపురకాంతలూ రోదనాలు చేశారు. ``నా ఆజ్ఞకు ఎంత విలువ ఉన్నదో నాకు తెలియదు; నీవు మళ్ళీ వెళ్ళి రాముణ్ణి తీసుకురా! లేదా నన్ను ఆ రాముడి దగ్గిరికైనా తీసుకుపో,'' అన్నాడు దశరథుడు. కౌసల్యకూడా సుమంత్రుడితో గర్భశోకంతో తనను రాముడున్న చోటికి తీసుకుపొమ్మన్నది.
 
 సుమంత్రుడు కౌసల్యను ఊరడిస్తూ, రామలక్ష్మణులు సులువుగా అరణ్య వాసవ్రతం పూర్తి చేయగలరనీ, ఆ సీతకు అది అరణ్యంలాగా ఉన్నట్టే లేదనీ, రాముడు లేని అయోధ్యే ఆమెకు అరణ్యమనిపించి ఉండేదనీ అన్నాడు. మర్నాడంతా కౌసల్య దశరథుడు చేసిన పనికి ఆయన్ను నిషూ్ఠరాలు పలికింది. ఆ విధంగా తాను పడుతున్న బాధను కొంత బయట పెట్టుకున్నది.

దశరథుడూ బాధ పడ్డాడు. కౌసల్య పుత్రశోకానికి తోడు పశ్చాత్తాపంతో కుమిలిపోయింది. రాముడు వెళ్ళిపోయిన ఆరో రోజు రాత్రి, తన చావు కొన్ని ఘడియలలో ఉన్నదనగా దశరథుడికి తన చిన్ననాటి వృత్తాంతం జ్ఞాపకం వచ్చింది. ఇంకా కౌసల్యను పెళ్ళాడక పూర్వమే దశరథుడు పుత్రశోకంతో మరణించేటట్టు ఒక మునివల్ల శాపం పొందాడు.ఇప్పుడాయన కౌసల్యకు ఆ సంఘటన గురించి చెప్పాడు: ఆ రోజులలో దశరథుడు యవ్వనంలో ఉన్నాడు.
 
ఆయనకు చప్పుడును బట్టి బాణం గురి చేసి కొట్టటంలో చాలా నేర్పుండేది. ఈ శబ్దవేధిత్వాన్ని అందరూ మెచ్చుకునేవారు. అందుచేత యువరాజై ఉన్న దశరథుడు తరుచు రాత్రివేళ సరయూ నదీ తీరానికి వెళ్ళి, అక్కడ వన్యమృగాలు నీరు తాగటానికి వచ్చే రేవు కనిపెట్టి సమీపంలో దాక్కుని, నీటి చప్పుడును బట్టి బాణం వేసి ఏనుగులనూ, సింహాలనూ, ఇతర మృగాలనూ వేటాడుతూ ఉండేవాడు.
 
ఇలా ఉండగా ఒకసారి, వానకాలంలో రాత్రివేళ దశరథుడు గాఢాంధకారంలో మృగాల కోసం నదీతీరాన పొంచికూచున్నాడు. ఆ సమయంలో నది నీటిలో బుడబుడ మని చప్పుడయింది. అడవి ఏనుగు అయి ఉంటుందనుకుని దశరథుడు చప్పుడుకు గురి చేసి తీవ్రమైన బాణం ఒకటి వదిలాడు. మరుక్షణమే మనిషి ఆక్రోశం వినిపించింది. ``అయ్యయ్యో, తపస్సు చేసుకునే మా బోటివాళ్ళ మీద ఈ బాణం పడట మేమిటి? నేను ఎవరికి అపకారం చేశాను? నన్ను చంపిన వాడిక ఏం లాభిస్తుంది? ఎవడోగాని, ఒక్క బాణంతో మూడు ప్రాణాలు తీశాడే! నేను పోతే, ముసలివాళూ్ళ, గుడ్డివాళూ్ళ అయిన నా తల్లిదండ్రులెంతకాలం బతుకుతారు? ఎలా బతుకుతారు?'' అన్న మాటలు దశరథుడి చెవులపడ్డాయి.
 
ఆయన దగ్గిరికి వెళ్ళి చూసేసరికి తన బాణం తగిలి ఒక ముని కుమారుడు కొలను ఒడ్డున బాధతో గిలగిల లాడిపోతున్నాడు. అతను నీటిలో ముంచిన పాత్ర పక్కనే పడి ఉంది. మతిపోయి, చెయ్యీ కాలూ ఆడక నిలబడి ఉన్న, దశరథుడితో ఆ ముని కుమారుడు, ``ఎందుకు చేశావీ పాడుపని? నేనిక్కడ ఉన్నట్టు నా తండ్రికి నీవే వెళ్ళి చెప్పు. లేకపోతే ఆయనకు తెలిసే మార్గం లేదు. తెలిసినా ఆయన రాలేడు.

దాహం జాస్తిగా ఉన్నదంటే నీరు తీసుకుపోదామని వచ్చి నీ బాణం వాత పడ్డాను. ఈ బాధ భరించలేను. ముందు ఈ బాణం లాగి మరీ వెళు్ళ,'' అన్నాడు. కురవ్రాడు బాధపడి పోతున్నాడు, బాణం లాగేస్తే చస్తాడేమోనని దశరథుడు మొదట తటపటాయించినా, చివరకు ఆ కురవ్రాడి ప్రోద్బలం మీదనే బాణం లాగేశాడు. వెంటనే మునికుమారుడు ప్రాణాలు వదిలాడు. తరవాత దశరథుడు ఆ కురవ్రాడి పాత్రలో నీరు ముంచుకుని, అతడు చెప్పిన దారినే అతని తల్లిదండ్రులుండే కుటీరానికి వెళ్ళాడు.
 
దశరథుడి అడుగుల చప్పుడు విని తన కొడుకే ననుకుని ఆ కుటీరంలో ఉండే వృద్ధుడు, ``నాయనా, ఎప్పుడో అనగా మంచినీటి కోసరం వెళ్ళిన వాడివి ఇంత ఆలస్యం చేశావేం? లోపలికి రా! త్వరగా నీరు ఇయ్యి!'' అన్నాడు.``నేను మీ అబ్బాయిని కాదు, దశరథుణ్ణి, క్షత్రియుణ్ణి,'' అంటూ, తడబాటుతో దశరథుడు తాను చేసిన ఘోరం కాస్తా ఆ వృద్ధ దంపతులకు చెప్పేశాడు. వారి దుఃఖానికి అంతు లేదు.
 
దశరథుడి సహాయంతో వారిద్దరూ తమ కొడుకు కళేబరం వద్దకు వెళ్ళి, దాని మీద పడి పెద్ద పెట్టున ఏడ్చారు. ముసలి ముని దశరథుడితో, ``మాకున్న ఒక్క కొడుకునూ అకారణంగా చంపి మాకు తీరని పుత్రశోకం కలిగించావు గనక నీవు కూడా పుత్రశోకంతోనే మరణించాలని నిన్ను శపిస్తున్నాను,'' అన్నాడు.

తరవాత ఆ వృద్ధ దంపతులు తమ కొడుకు చితిలోనే కాలి చనిపోయారు. ఎన్నడో జరిగిన ఈ సంఘటన దశరథుడికి ఇప్పుడు, తన ఆయువు తీరిపోయే దశలో, జ్ఞాపకం వచ్చింది. దానిని ఆయన కౌసల్యకు చెప్పాడు. కౌసల్యతో మాట్లాడుతుండగానే దశరథుడికి చూపు మందగించింది. క్రమంగా శ్రవణశక్తికూడా పోయింది. బుద్ధివికలమై పోసాగింది. ఆయన రాముణ్ణి కేకలు పెడుతూ, కైకేయిని తిడుతూ అర్ధరాత్రివేళ ప్రాణాలు వదిలాడు.
 
అది రాముడు బయలుదేరి వెళ్ళిన ఆరో రోజు అర్ధరాత్రి. ఆ సమయానికి అంతఃపుర స్త్రీలందరూ, కౌసల్యా సుమిత్రలు సహితం, నిద్రపోతున్నారు. రాజు మరణించిన సంగతి మర్నాడు తెల్లవారిగాని అంతఃపుర కాంతలకు తెలియ లేదు. అంతఃపురంలో శోకాలు సాగినాక పై వారికి జరిగిన సంగతి తెలిసింది. త్వరలోనే వసిష్ఠుడు మొదలైనవారు వచ్చారు. దశరథుడు అంత్యక్రియలు జరపటానికి ఆయన కొడుకులలో ఒక్కడైనా దగ్గిర లేడు.
 
రామలక్ష్మణులు అరణ్యానికి వెళ్ళారు.భరత శత్రుఘు్నలు భరతుడి మేనమామ అయిన కేకయరాజు ఇంట ఉన్నారు. అందుచేత దశరథుడి శరీరాన్ని తైలంలో ఉంచారు. సిద్ధార్థుడు, విజయుడు, జయంతుడు, అశోకుడు, నందనుడు అనే వారిని పిలిచి వసిష్ఠుడు వారితో, ``మీరు వేగంగల గుర్రాల పైన కేకయ రాజుండే రాజగృహానికి వెళ్ళండి. భరతుడితో ఇక్కడ ఒక ముఖ్య కార్యమున్నదనీ, మేము రమ్మన్నామనీ చెప్పండి. 

తంగాని, రాజుగారు చనిపోయిన సంగతిగాని చెప్పనే వద్దు,'' అని చెప్పి, భరతుడికి మేలిమి వస్త్రాలూ, ఆభరణాలూ ఇచ్చి పంపాడు. వాళు్ళ అనేక నదులూ, పర్వతాలూ దాటి, దీర్ఘ ప్రయాణం చేసి, భరతుడి మేనమామగారి దేశం చేరి, వాటిని ఇచ్చి, అతని మేనమామకూ, తాతగారికీ కానుకలుగా తెచ్చిన వస్త్రాభరణాలు భరతుడికి అందించి, వసిష్ఠుడు చెప్పమన్న మాటలు అదే విధంగా చెప్పారు.
 
భరతుడు పెద్దవాళ్ళ అనుమతి తీసుకుని, అయోధ్య నుంచి తన కోసం వచ్చిన వారి వెంబడి, పెద్ద బలగంతో సహా బయలుదేరాడు. మిగిలిన పరివారాన్ని నింపాదిగా వెనక రానిచ్చి, భరత శత్రుఘు్నలు రథంలో ముందుగా అయోధ్యా నగరం చేరుకున్నారు. వారు ఏడు రోజులు ప్రయాణించారు. దూతలు అయోధ్య నుంచి వచ్చిన రాత్రే భరతుడికి ఒక పీడ కల వచ్చింది. అది వచ్చినప్పటి నుంచీ అతని మనుసులో ఏదో ఆందోళనగానే ఉన్నది. అయోధ్య ప్రవేశించగానే అతని ఆందోళన తిరిగి వచ్చింది. ఎందుకంటే నగరంలో సాధారణంగా ఉండే ఉత్సాహమూ, ఉల్లాసమూ లేవు.
 
జనం నీరసించి నట్టున్నారు, నగరం పాడుపడినట్టున్నది. భరతుడు ముందు తన తండ్రి నగరుకు వెళ్ళి అక్కడ ఆయన కనిపించక పోయేసరికి తన తల్లి ఇంటికి వచ్చాడు. కొడుకును చూస్తూనే కైకేయి ఆసనం మీది నుంచి లేచి, తన కాళ్ళకు నమస్కారం చేసిన భరతుణ్ణి తన చెంత కూచోబెట్టుకుని కుశల ప్రశ్నలు చేస్తూ, ``నీవు బయలుదేరి ఎన్నాళ్ళయింది, నాయనా? నీ మామా, తాతా క్షేమంగా ఉన్నారా? నీకక్కడ సుఖంగా జరిగిందా?'' అని ప్రశ్నించింది.
 
 భరతుడు అన్నిటికీ సమాధాన మిచ్చి, ``అమ్మా, నాన్నగారెక్కడ? పెద్దమ్మ కౌసల్య ఇంట ఉన్నాడా? నే నాయన కాళ్ళకు మొక్కాలి!'' అన్నాడు. ``ఆయన పెద్దల్లో కలిసిపోయారు, నాయనా,'' అంటూ కైకేయి చావు కబురు చెప్పింది. ఈ మాట వినగానే భరతుడు కుప్పకూలి పోయాడు. కైకేయి అతన్ని ఊరడించ యత్నించింది.

No comments:

Post a Comment