Saturday, September 8, 2012

రామాయణం - ఉత్తరకాండ 4


మర్నాడు తెల్లవారుతూనే లవణుడు ఆహారం సంపాదించడానికై మధుపురం దాటి బయటికి వెళ్లాడు. ఆ సమయంలో శత్రుఘ్నుడు యమునా నదిని దాటి మధుపుర ద్వారం వద్ద నిలబడ్డాడు. మధ్యాన్నం రెండు జాములయేసరికి లవణుడు తాను చంపిన జంతువుల న్నిటినీ మోస్తూ తన నగరానికి తిరిగి వచ్చి, ద్వారం వద్ద ఉన్న శత్రుఘ్నుడిని చూసి, విరగబడి నవ్వుతూ, ‘‘ఒరే మనిషీ, నాకు ఆహారం కావడానికా వచ్చావు? ఇవాళ నాకు మంచి విందే!’’ అన్నాడు. రోషంతో శత్రుఘ్నుడి కళ్లు ఎరబ్రడ్డాయి. ‘‘నీతో యుద్ధం చేసి, నిన్ను చంపడానికి వచ్చానురా, లవణుడా! నేను దశరథ మహా రాజు కొడుకును, రాముడి తమ్ముడిని, నా పేరు శత్రుఘ్నుడు. ఇవాళ నా చేత నీకు చావు తప్పదు,’’ అన్నాడతను.

లవణుడు వెటకారంగా నవ్వి, ‘‘నాకు మామ వరుస అయిన రావణుణ్ణి మీ అన్న చంపినా నేను లక్ష్యపెట్టలేదు. నేను మహామహా వాళ్లనే చంపాను. నాకు మీవంటివాళ్లు గడ్డితో సమానం. నన్నెవరూ జయించలేరు. నాతో యుద్ధం చెయ్యవచ్చావుగా? ఉండు, నీ తీట తీరుస్తాను. నన్ను వెళ్లి ఆయుధం పట్టుకు రానీ,’’ అన్నాడు.


లవణుడు పళ్లు కొరికి, చేతులు పిసుక్కుని, చెట్లు పెరికి శత్రుఘ్నుడిపైన విసరసాగాడు. శత్రుఘ్నుడు ఆ చెట్లనన్నిటినీ తన బాణాలతో నరికాడు. కాని ఒక చెట్టు తల మీద తగిలి శత్రుఘ్నుడు మూర్ఛపోయూడు. అది చూసి, శత్రుఘ్నుడు చచ్చాడనుకుని, లవ ణుడు తాను చంపిన మృగాల మోపు నెత్తుకుని బయలుదేరేటంతలో శత్రుఘ్నుడు మూర్ఛ తెలిసి ద్వారానికి అడ్డంగా నిలబడ్డాడు. మరు క్షణమే అతడు, రాముడు తనకు ఇచ్చిన బాణాన్ని ధనువుకు సంధించి, లవణుడిపైకి వదిలాడు. అది నిప్పులు కక్కుతూ వెళ్లి, లవ ణుడి గుండెను చీల్చింది. లవణుడు చచ్చాడు. వెంటనే వాడి ఇంట ఉండే త్రిశూలం శివుడి వద్దకు  వెళ్లిపోయింది.

తరువాత శత్రుఘ్నుడు తన సేనను పిలిపించి, మధుపురాన్ని ఆక్రమించి, దానికి రాజై పాలించసాగాడు. పన్నెండేళ్లు గడిచాక అతనికి రాముణ్ణి చూడాలనిపించింది. అతను కొద్ది సేననూ, పరివారాన్నీ వెంటబెట్టుకుని, అయోధ్యకు బయలు దేరి, వాల్మీకి ఆశ్ర మంలో ఒక రాత్రి మజిలీ చేశాడు.

వాల్మీకి శత్రుఘ్నుడికి ఆర్ఘ్యపాద్యాలిచ్చి, ఆతిథ్యం జరిపి, అతనికీ, అతని సేనకూ, పరివారానికీ సంతుష్ఠిగా భోజనాలు పెట్టించాడు. భోజనాలయాక వారంతా వాల్మీకి రచితమైన రామకథను రాగతాళాలతో సహా విని ఎంతో అద్భుతం చెందారు. ఆ రాత్రంతా రామకథను వినటంలోనే గడిచిపోయింది. మర్నాడు శత్రుఘ్నుడు వాల్మీకి వద్ద సెలవు పుచ్చుకుని, అయోధ్యకు వెళ్లి, రాముణ్ని చూసి, ‘‘అన్నా నీ ఆజ్ఞానుసారం లవణుడిని చంపి అతడి రాజ్యాన్ని ఏలుతున్నాను. కాని పన్నెండేళ్ల పాటు నిన్ను చూడక తహతహపుట్టి బయలు దేరి వచ్చాను.’’ అన్నాడు.

రాముడు శత్రుఘ్నుడిని కౌగలించుకుని, ‘‘నాయనా, రాజుకు రాజ్యం చేయక తప్పదు గద. నీ రాజ్యం నీవు చూసుకో. ఎప్పుడన్నా నన్ను చూడాలనిపిస్తే వస్తూ ఉండు,’’ అని అతడిని పంపేశాడు. భరతలక్ష్మణులు సపరివారంగా బయలు దేరి, శత్రుఘ్నుడిని చాలా దూరం సాగనింపి, వెనక్కు తిరిగి వచ్చారు.

తరవాత కొన్ని రోజులకు ఒక పల్లెటూరి బ్రాహ్మణుడు తన అయిదేళ్ల కొడుకు శవం తెచ్చి రాజద్వారం దగ్గిర నిలబడి ఏడవడం మొదలుపెట్టాడు. తనకున్న ఒకే కొడుకు అకాలమరణం పొందినందుకు ఏడుస్తూ, రాజు సరిగా పాలిస్తే ఇలాంటి అకాల మరణాలుండవనీ, ఇన్నాళ్లకు ఇక్ష్వాకుల పరిపాలనలో రాముడి హయాంలో దేశం దిక్కుమాలినదయిందనీ అన్నాడు.


రాముడీ సంగతి తెలుసుకుని చాలా చింతించి, తన మంత్రులనూ, వసిష్టుడు మొదలైన బ్రాహ్మణులనూ పిలిపించి, వారితో బ్రాహ్మణ బాలుడి అకాల మరణం గురించి చెప్పాడు. ఒక శూద్రుడు తపస్సు చేస్తున్నాడనీ, అది యుగ ధర్మానికి విరుద్ధమనీ, అందుకే ఈ బాలుడు చనిపోయాడనీ నారదుడు రాముడితో అన్నాడు.

రాముడు లక్ష్మణుడితో, ‘‘నీవు వెళ్లి ఆ బ్రాహ్మణుడిని ఓదార్చి, ఆ బాలుడి కళేబరాన్ని తైలభాండంలో భద్రంగా ఉంచు.’’ అన్నాడు. తరవాత అతను ఆయుధాలు తీసుకుని పుష్పకం ఎక్కి, పడమరా, ఉత్తరమూ గాలించి, చివరకు దక్షిణ దిక్కున ఒక సరస్సులో తల కిందుగా తపస్సు చేస్తున్న మనిషి నొకడిని చూశాడు.

అతను విమానం దిగి ఆవ్యక్తిని సమీపించి, ‘‘నేను రాముడిని, దశరథ మహారాజు కొడుకును, తెలుసుకోవాలన్న కుతూహలం కొద్దీ అడుగుతున్నాను. నీవే జాతి వాడివి? ఏం కోరి ఈ కఠోర తపస్సు చేస్తున్నావు?’’ అని అడిగాడు. తలకిందులుగా ఉండే ఆ తాపసి, ‘‘రాజా, నేను శూద్రుడిని, నా పేరు శంబూకుడు. బొందితో స్వర్గానికి పోగోరి నేనీ తపస్సు చేస్తున్నాను,’’ అన్నాడు. అతనింకా మాట్లాడుతూండగానే రాముడు తన కత్తి దూసి శంబూకుడి తల నరికేశాడు.

వెంటనే దేవతలు రాముడి పైన పుష్పవర్షం కురిపించి, దుందుభులు మోగించి, ‘‘రామా, ఈ శూద్రుడు స్వర్గానికి రాకుండా చే శావు. మాకంతే చాలు. ఏం వరం కోరుతావో కోరు,’’ అన్నాడు. ‘‘అకాలమరణం పాలయిన ఆ బ్రాహ్మణ బాలుడిని బతికించండి,’’ అన్నాడు రాముడు. ‘‘శంబూకుడి తల తెగిన క్షణంలోనే ఆ బాలుడు బతికాడు,’’ అంటూ దేవతలు వెళ్లిపోయారు.

రాముడక్కడినుంచి, ఆ సమీపంలోనే ఉన్న అగస్త్యాశ్రమానికి వెళ్లి ఆ ముని ఇచ్చిన అతిథి సత్కారాలు స్వీకరించాడు.

అగస్త్యుడు రాముడి కొక ఆభరణాన్ని బహూకరించాడు. రాముడు దాన్ని స్వీకరించి, ‘‘స్వామీ ఇది దివ్యాభరణంలాగున్నది. ఇది తమకు ఎవరిచ్చారు?’’ అని అడిగాడు. ఆ ప్రశ్నకు సమాధానంగా అగస్త్యుడు శ్వేతుడి కథ చెప్పాడు.


వెయ్యి యోజనాల విస్తృతి గల ఒక అరణ్యం ఉండేది. దాని మధ్య యోజనం చదరం గల సరస్సుండేది. ఆ అరణ్యంలో ఒక్క పక్షిగాని, మృగం గాని ఉండేది కాదు. సరస్సుకు సమీపంలో ఒక ఆశ్రమం ఉండేది. అగస్త్యుడా ఆశ్రమానికి వెళ్లి, ఒక రాత్రి అందులో గడిపి, తెల్లవారుజామున సరస్సు వద్దకు వెళ్లాడు. దాని ఒడ్డున ఆయన కొక పుష్టి గల శవం కనబడింది.

అది ఏ మాత్రమూ చెక్కు చెదరలేదు. అది ఏవిధమైన శవం అయి ఉంటుందా అని అగస్త్యుడు ఆలోచిస్తుండగా, అక్కడ ఒక విమానం ఆకాశం నుంచి దిగింది. అదొక దివ్య విమానం. అందులో ఒక దివ్య పురుషుడూ, అతన్ని సేవిస్తూ అనేక మంది అప్సరసలూ ఉన్నారు. అప్సరసలలో కొందరు పాడుతున్నారు. కొందరు వాద్యాలు వాయిస్తున్నారు, మరికొందరు నృత్యాలు చేస్తున్నారు.

కొంతసేపయ్యాక ఆ దివ్యపురుషుడు విమానం నుంచి దిగి, సరస్సు తీరాన ఉన్న శవాన్ని తిని, సరస్సులో చెయ్యీ, నోరూ కడుక్కుని, తిరిగి విమానం ఎక్కబోయాడు. అదంతా చూస్తూండిన అగస్త్యుడు, ‘‘అయ్యా, నీవెవరు? ఇలాంటి పనికిమాలిన భోజనం చెయ్యడానికి కారణం ఏమిటి? ఎంత హీనులు కూడా ఇలాంటి పని చేయరు గదా!’’ అన్నాడు.

ఆ దివ్య పురుషుడు అగస్త్యుడికి తన పూర్వ కథ చెప్పాడు. అతను విదర్భ రాజైన సుదేవుడి కొడుకు. అతడి పేరు శ్వేతుడు. సుదేవుడి కిద్దరు భార్యలు, ఇద్దరికీ ఇద్దరు కొడుకులు కలిగారు. వారిలో పెద్దవాడీ శ్వేతుడు. తన తండ్రి అనంతరం చాలాకాలం రాజ్యం ఏలి, చివరకు సురధుడికి పట్టం కట్టి, తాను తపస్సు చేసుకున్నాడు. దీర్ఘ తపస్సు చేసి అతను దేహం చాలించి, బ్రహ్మలోకానికి వెళ్లాడు. కాని, బ్రహ్మలోకంలో కూడా అతడిని ఆకలి దప్పులు విడవలేదు. అది చూసి కంగారు పడి అతను బ్రహ్మ వద్దకు వెళ్లి, బ్రహ్మలోకంలో కూడా తనను ఆకలిదప్పులు వేధించడానికి తాను ఏం తప్పు చేసి ఉండాలని అడిగాడు.

దానికి బ్రహ్మ, ‘‘జంతువులు లేని అడవిలో నీకు భోజన సంతుష్టి ఏమాత్రమూ లభించలేదు. అదీకాక నీవు అస్తమానమూ తపస్సులో ఉండి అతిథులకు భోజనం పెట్టలేదు. అందుకే నిన్ను ఆకలి దప్పులు వదలకుండా ఉన్నాయి. అరణ్యంలో ఉన్న నీ శవాన్నే తిని నీ ఆకలి దప్పులను తీర్చుకుంటూ ఉండు. కొంత కాలానికి అక్కడకు అగస్త్యుడు వచ్చి, నీ ఆకలిదప్పులను పూర్తిగా పోగొడతాడు,’’ అని చెప్పాడు.


తనను పలకరించినవాడు అగస్త్యుడేనని తెలియగానే ఆ దివ్య పురుషుడు, ‘‘స్వామీ, నన్ననుగ్రహించి, నాకీ కష్టం తొలగించండి. దానికి ప్రత్యుపకారంగా ఈ ఆభరణం స్వీకరించండి. ఇది ప్రతి రోజూ బంగారాన్నీ, ధనాన్నీ, బట్టలనూ, ఆహారాన్నీ, నగలనూ ఇస్తూ ఉంటుంది.’’ అన్నాడు.

అగస్త్యుడా ఆభరణాన్ని స్వీకరించగానే శవం కాస్తా శిథిలమైపోయింది. దివ్యపురుషుడు సంతోషించి స్వర్గానికి వెళ్లిపోయాడు. రాముడీ కథ విని అగస్త్యుడితో ‘‘స్వామీ, శ్వేతుడు తపస్సు చేసిన వనంలో మృగాలూ, పక్షులూ లేకపోవటాని కేమిటి కారణం?’’ అని అడిగాడు. ఆ కథను అగస్త్యుడీ విధంగా చెప్పాడు. కృతయుగంలో మనుచక్రవర్తి తన కొడుకైన ఇక్ష్వాకుడికి పట్టం గట్టి, తాను బ్రహ్మలోకానికి వెళ్లిపోయాడు. ఇక్ష్వాకు నూరుగురు కొడుకులను కన్నాడు. వారిలో ఆఖరివాడు దండుడు. అతడు బుద్ధిహీనుడు. ఆ దండుడికి ఇక్ష్వాకు వింధ్యశైవల ప్రాంతాల మధ్య రాజ్యం ఇచ్చాడు. దండుడు అక్కడ మధుమంతమనే చక్కని నగరం నిర్మించుకుని శుక్రాచార్యులను గురువుగా పెట్టుకుని, రాజ్యం చేస్తూ వచ్చాడు.

శుక్రాచార్యులకు అరజ అనే అందమైన కూతురుండేది. ఒకనాడు దండుడు వనంలో తిరుగుతూ, ఒంటరిగా ఉన్న అరజను చూసి ఆమెను కోరాడు. అరజ, తాను శుక్రాచార్యులు కూతురిననీ, దండుడు వెర్రిమొర్రి వేషాలు వేస్తే తన తండ్రి ఘోరమైన శాపం ఇస్తాడనీ హితవు చెప్పింది. కాని మందమతి అయిన దండుడు అరజ హితబోధ వినక, ఆమెను బలాత్కరించాడు. అతను మధుమంతానికి తిరిగి వెళ్లాక, అతడి దుష్ర్పవర్తన శుక్రుడికి తెలిసింది.

మధుమంతం చుట్టూ నూరు యోజనాల మేర ఏడురోజుల పాటు ధూళివర్షం కురిసి సమస్తమూ నశించి పోవాలని, శుక్రాచార్యుడు శపించాడు. ఈ శాపం సంగతి వింటూనే అక్కడ నివసించే వారందరూ ఆ ప్రాంతం వదలి వెళ్లిపోయారు. శుక్రుడు చెప్పినట్లే ఆ ప్రాంతలో వారం రోజులపాటు ధూళివర్షం కురిసి నాశనమైపోయింది. ఈ కథలు వింటూ రాముడు అగస్త్యాశ్రమంలో కొంతసేపుండి, ఆ మహాముని వద్ద సెలవు పుచ్చుకుని అయోధ్యకు వచ్చేశాడు.





No comments:

Post a Comment