Friday, September 7, 2012

రామాయణం - యుద్దకాండ 6

రాముడు లంకా ప్రాసాదం సమీపానికి వచ్చి, లోపల ఉన్న సీతను తలుచుకుని, లంకపై దాడి ప్రారంభించమని వానరులకు ఆజ్ఞ ఇచ్చాడు. రావణుడు కూడా రాక్షసులను యుద్ధానికి ఉపక్రమించమని ఆదేశించాడు. సింహనాదాలతోనూ, భేరీ భాంకారాలతోనూ, శంఖు ధ్వానాలతోనూ వానర రాక్షసుల మధ్య యుద్ధం ప్రారంభమయింది. ఇంద్రజిత్తు అంగదుడితోనూ, జంబుమాలి హనుమంతుడితోనూ, తపనుడనే రాక్షసుడు గజుడితోనూ, నికుంభుడు నీలుడితోనూ ద్వంద్వ యుద్ధాలు చేశారు. ఈ యుద్ధాలలో సంపాతి అనే విభీషణ మంత్రి ప్రజంఘుడనే రాక్షసుణ్ణి చంపాడు. అలాగే ప్రఘనుడు సుగ్రీవుడి చేతిలో చచ్చాడు. విద్యున్మాలిని సుశేణుడనే వానరవీరుడు చంపాడు. ఇంతలో సూర్యుడస్తమించాడు.

ఆ రాత్రి వానరులకూ రాక్షసులకూ ఘోరమైన యుద్ధం జరిగింది. రక్తం నదులుకట్టి పారింది. ఉత్తర ద్వారాన్ని రక్షించే యమశత్రుడూ, మహాపార్శ్వుడూ, మహోదరుడూ, మహాకాయుడూ, వజ్రదంష్ట్రుడూ, శుకసారణులూ రాముడి పైకి యుద్ధానికి వెళ్ళి, తీవ్రమైన రాముడి బాణాలచే కొట్టబడి, పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నారు.
అంగదుడికీ, ఇంద్రజిత్తుకూ జరిగిన ద్వంద్వ యుద్ధంలో అంగదుడు ఇంద్రజిత్తు సారథినీ, గుర్రాలనూ చంపాడు. ఇంద్రజిత్తు అంతర్థానమయ్యాడు. అతను మాయా యుద్ధానికి పూనుకుని, వానరసేనపై పిడుగుల వంటి బాణాలు వేశాడు, రామలక్ష్మణులిద్దరి పైనా నాగాస్త్రాలు వేసి వారిని బంధించాడు.


అతను వారితో, ‘‘రామ లక్ష్మణులారా, నేను అదృశ్యంగా ఉండి యుద్ధం చేస్తుంటే ఇంద్రుడు కూడా నన్ను తెలుసుకోలేడు, సమీపించలేడు. మీరెంత? మిమ్మల్ని ఇప్పుడే యముడి వద్దకు పంపేస్తాను,’’ అంటూ సింహనాదాలు చేశాడు. రామ లక్ష్మణులు నేలపై పడిపోయి ఏమీ చెయ్యలేని స్థితిలో ఉండిపోయారు. ఇంద్రజిత్తు రామ లక్ష్మణుల నిద్దరినీ తాను చంపినట్టే భావించుకుని, వారు చచ్చారు చూడమని రాక్షసులకు చెప్పి, లంకలోకి తిరిగి వెళ్ళిపోయాడు.

రామ లక్ష్మణులను చూస్తున్న కొద్దీ సుగ్రీవుడికి భయమూ, దుఃఖమూ పుట్టుకొచ్చాయి. విభీషణుడు సుగ్రీవుడికి ధైర్యం చెప్పి, భయపడి పారిపోయే ప్రయత్నంలో ఉన్న వానరులకు ఉత్సాహం కలిగిస్తూ, సైన్యం నలుదిక్కులా తిరిగాడు. ఇంద్రజిత్తు తిన్నగా రావణుడి సభకు వెళ్ళి, తండ్రికి నమస్కారం చేసి, ‘‘రామ లక్ష్మణులను చంపేశాను,’’ అని చెప్పాడు. రావణుడు పరమ సంతోషంతో అసనం మీది నుంచి లేచి, కొడుకును కౌగిలించుకున్నాడు.

అతను సీతకు కాపలా ఉన్న త్రిజట మొదలైన రాక్షస స్త్రీలను పిలిపించి, ‘‘మన ఇంద్రజిత్తు చేతిలో రామ లక్ష్మణులు చచ్చారు. సీత మదమణిగింది. ఆమె ఇక సర్వాభరణాలూ ధరించి, నా దగ్గిరికి వచ్చేస్తుంది. ఆ సీతను పుష్పక విమానంలో ఎక్కించి, యుద్ధరంగానికి తీసుకుపోయి, విగత జీవులై పడి ఉన్న రామలక్ష్మణులను చూపించండి,’’ అన్నాడు. వాళ్ళు పుష్పకం ఉన్న చోటికి వెళ్ళి, దాన్ని తీసుకుని అశోకవనానికి పోయి, అందులో సీత నెక్కించుకుని యుద్ధరంగానికి తీసుకుపోయారు.



అక్కడ సీతకు పడి ఉన్న రామ లక్ష్మణులూ, వారి చుట్టూ కూర్చుని, ఏ మాత్రం అలికిడి వినిపించినా రాక్షసులు వచ్చి పడుతున్నారేమో నని భయపడుతున్న వానర ప్రముఖులూ కనిపించారు. సాముద్రిక వేత్తలూ, జ్యోతిశ్శాస్త్రం తెలిసినవారూ కూడా తనకు వైధవ్యం ఉండదన్నారు; తాను పుత్రవతి అవుతుందన్నారు, మహారాణి అవుతుందన్నారు. తనకు మహావీరుడు భర్త అవుతాడన్నారు. గోష్పాదమంత ఇంద్రజిత్తు ఆ మాటలన్నీ అబద్ధం చేసేశాడు.


రామ లక్ష్మణులకు తెలిసిన దివ్యాస్త్రాలన్నీ ఏమయ్యాయో? వాళ్ళు తన కోసం నాలుగు దిక్కులా వెతికించి, పెద్ద సేనతో సముద్రాన్ని దాటి లంకను చేరింది ఇంద్రజిత్తు మాయకు బలికావటానికా? పధ్నాలుగేళ్లూ పూర్తి కాగానే తన కొడుకు సీతాలక్ష్మణులతో తిరిగివస్తాడని ఎదురు చూసే కౌసల్య ఏంకాను?

ఈ విధంగా దుఃఖంతో కుములుతున్న సీతను చూసి, ‘‘అమ్మా, ఏడవకు. రామ లక్ష్మణులు చావలేదు. వారు చచ్చిన లక్షణాలేవీ కనిపించవు,’’ అన్నది త్రిజట. సీత ఆ మాట విని చేతులు జోడించి, ‘‘తథాస్తు!’’ అని పలికింది.

పుష్పకం తిరిగి వెళ్ళిపోయాక కొంత సేపటికి రాముడికి స్పృహ వచ్చింది. అతను తన పక్కన పడి ఉన్న లక్ష్మణుణ్ణి చూసి అతను చనిపోయాడనుకుని నిరాశచెందాడు. లక్ష్మణుడితో బాటు తాను కూడా చావాలని నిశ్చయించుకున్నాడు. సీత వంటి భార్య వెతికితే దొరక్క పోదు, లక్ష్మణుడి వంటి తమ్ము డెక్కడ దొరుకుతాడు? లక్ష్మణుడు లేకుండా యుద్ధమెందుకు, అందులో విజయమెందుకు? తాను ఒంటరిగా అయోధ్యకు తిరిగి పోయి సుమిత్ర ఎదటపడగలడా? అసంభవం!

తాను విభీషణుణ్ణి లంకకు రాజుగా చెయ్యలేక పోయినందుకు రాముడు చాలా చింతించాడు. తన కోసం సుగ్రీవుడు మొదలైన వానర యోధులు పడిన శ్రమకు కృతజ్ఞత చెప్పుకుని, వారు ప్రదర్శించిన శౌర్య పరాక్రమాలను మెచ్చుకుని, అందరినీ తిరిగి వెళ్ళి పొమ్మన్నాడు.

ఇంతలో విభీషణుడు తన గదతో సహా సుగ్రీవుడున్న చోటికి వచ్చాడు. అతణ్ణి దూరానే చూసి, ఇంద్రజిత్తు వస్తున్నాడనుకుని వానరులు భయపడి పారిపోసాగారు. జాంబవంతుడు వెళ్ళి వాళ్ళ భయాన్ని పోగొట్టాడు.

సుగ్రీవుడు తన సమీపంలో ఉన్న తన మామ సుశేణుడితో, ‘‘రామ లక్ష్మణులకు స్పృహ రాగానే వాళ్ళను తీసుకుని, కొందరు వానర వీరులతో సహా కిష్కింధకు వెళ్ళు, నేను ఈ రావణుణ్ణి చంపి సీతను తీసుకువస్తాను,’’ అన్నాడు.


‘‘పూర్వం దేవాసురులకు యుద్ధం జరిగినప్పుడు అనేక మంది దేవతలు మూర్ఛపోయారు, కొందరు చచ్చిపోయారు కూడా. అప్పుడు బృహస్పతి మృతసంజీవని లాంటి విద్యలు, మూలికల సహాయంతోనూ వాళ్ళకు చికిత్స చేశాడు. క్షీర సముద్ర మథనం జరిగిన చోట చంద్ర, ద్రోణ పర్వతాలున్నాయి. వాటి పైన దేవతలు సంజీవకరణి, విశల్యకరణి అనే ఓషధులను పెంచారు. హనుమంతుణ్ణి అక్కడికి పంపించి, వాటిని తెప్పించు,’’ అన్నాడు సుశేణుడు.

ఇంతలో పెనుగాలి వీచింది. ఆ గాలి తాకిడికి మేఘాలు దూదిపింజెల్లాగా కొట్టుకుపోయాయి, సముద్రంలో పెద్ద కెరటాలు పుట్టాయి. మరి కొంతసేపటికి గరుత్మంతుడక్కడికి వచ్చాడు. అతణ్ణి చూస్తూనే రామలక్ష్మణులను బాణాల రూపంలో బంధించిన పాములు పారిపోయాయి. తరవాత అతను తన చేతులతో వారిద్దరి ముఖాలూ తడివాడు. వెంటనే వారి గాయాలన్నీ నయమై, శరీరాలకు ఎప్పటి శక్తీ, తేజస్సూ సమకూరాయి.

రాముడు అతనితో, ‘‘అయ్యా, నిన్ను చూస్తే నాకు మా తండ్రినో, తాతనో చూసినంత ఆనందం కలుగుతున్నది. దివ్య లేపనాలూ, దివ్యాంబరాభరణాలూ ధరించి ఉన్నావు. నువ్వెవరు?’’ అని అడిగాడు. ‘‘నేను నీకు స్నేహితుణ్ణి. నా పేరు గరుత్మంతుడు. మిమ్మల్ని బంధించిన పాములు కద్రువ సంతానం. ఇంద్రజిత్తు తన మాయ చేత వాటికి బాణ రూపం ఇచ్చి మీపై ప్రయోగించాడు. ఈ వార్త తెలిసి నేనిక్కడికి వచ్చాను. నేను నీకు ఎలా స్నేహితుణ్ణో యుద్ధంలో నీకు జయం కలిగాక చెబుతాను. రాక్షసులు మహా మాయావులు. నువ్వు వారితో జాగ్రత్తగా యుద్ధం చెయ్యి. నీకు జయం కలుగుతుంది,’’ అని గరుత్మంతుడు రాముడి వద్ద శలవు తీసుకున్నాడు.

వానరులకు ఉత్సాహం తిరిగి వచ్చింది. వారు భేరులు మోగించి, శంఖాలు పూరించి, సింహనాదాలు చేశారు. లంకలో రావణుడికి ఆ ధ్వని వినిపించింది. రామలక్ష్మణులు చచ్చి, ఏడుస్తూ ఉండవలిసిన వానరులు ఉత్సాహంతో శంఖాలూ, భేరీలూ ఎందుకు మోగిస్తున్నారో కనుక్కురమ్మని అతను కావలివాళ్ళను పంపాడు. వాళ్ళు ప్రాకారాలపైకెక్కి, వానర సేన అంతా కలయజూసి, రావణుడి దగ్గిరికి వచ్చి, రామ లక్ష్మణులు బంధవిముక్తులై సుఖంగా ఉన్నారనీ, అదే వానరుల యుద్ధోత్సాహానికి కారణం అనీ చెప్పారు.


ఇది విని రావణుడు తెల్లబోయి, ‘‘ఇంద్రజిత్తు ప్రయోగించిన నాగబంధాలను విప్పటం దేవతలకైనా సాధ్యంకాదు. రామ లక్ష్మణులు వాటి నుంచి బయటపడటం రాక్షస సేనకు అపాయాన్ని సూచిస్తున్నది,’’ అన్నాడు. అతను ధూమ్రాక్షుడనే వాణ్ణి పిలిచి, ‘‘సేనతో సహా వెళ్ళి రాముణ్ణి వధించిరా!’’ అని ఆజ్ఞాపించాడు.

ధూమ్రాక్షుడు ఒక పెద్ద సేన తీసుకుని, తోడేలు ముఖాలూ, సింహం ముఖాలూ గల గాడిదలను పూన్చిన రథ మెక్కి యుద్ధానికి బయలుదేరాడు. రాక్షసులకూ, వానరులకూ గొప్ప యుద్ధం జరిగింది. ఉభయపక్షాలా అపారమైన ప్రాణ నష్టం జరిగింది. చిట్ట చివరకు వానరుల దెబ్బకు తట్టుకోలేక రాక్షసులు పారిపోసాగారు. ఇది చూసి ధూమ్రాక్షుడు వానర సేనపై విజృంభించాడు. హనుమంతుడికి కోపం వచ్చి, పెద్ద శిలను తీసుకు వచ్చి, ధూమ్రాక్షుడి రథంపై వేశాడు.


రథం నుగ్గయింది గాని ధూమ్రాక్షుడు గదతో సహా కిందికి దూకేశాడు. హనుమంతుడికీ, అతనికీ యుద్ధమయింది. ధూమ్రాక్షుడు తన గదను హనుమంతుడి తలపైకి విసిరాడు. దాని దెబ్బకు హనుమంతుడు చలించక, ధూమ్రాక్షుడి నెత్తిన పర్వత శిఖరాన్ని వేసి చంపేశాడు. ధూమ్రాక్షుడు చచ్చాడని విని రావణుడు వజ్రదంష్ట్రుణ్ణి సేనతో సహా పంపాడు. ఆ సేన లంక యొక్క దక్షిణ ద్వారం గుండా వెళ్ళింది. ఆ ద్వారం వద్ద అంగదుడున్నాడు. ఉభయపక్షాల మధ్యా దొమ్మి యుద్ధం, ద్వంద్వ యుద్ధాలు జరిగాయి.

 యుద్ధంలో వానరులు నష్టమవుతూ ఉండటం చూసి మండిపడి, అంగదుడు విజృంభించి రాక్షసుల తలలు పగలగొట్టనారంభించాడు. రాక్షసులా తాకిడికి తట్టుకోలేక చలించిపోయారు. తన పక్షం దెబ్బ తింటూ ఉండటం చూసి వజ్రదంష్ట్రుడు అంగదుడితో తలపడ్డాడు. అంగదుడు కత్తితో వజ్రదంష్ట్రుడి తల తెగవేశాడు.

ఈసారి రావణుడు అకంపనుడనే రాక్షస సేనానిని పంపాడు. రాక్షస వానర పక్షాలు రెండూ విజయకాంక్షతో పట్టుదలగా యుద్ధం చేశాయి. కుముదుడూ, నలుడూ, మైందుడూ, ద్వివిదుడూ అనే వానరవీరులు ఒక్కసారిగా రాక్షస సేనపైన పడి రాక్షసులను గుంపులు గుంపులుగా వధించసాగారు. ఇది గమనించి అకంపనుడు తన రథాన్ని ఆ వానర వీరులున్న చోటికి తోలించాడు. అతని బాణాల తాకిడికి వానర వీరులు తట్టుకోలేకపోయారు.

హనుమంతుడు వానరులకు సాయంగా ఒక కొండను పెరికి, ఒంటి చేత పట్టి గిరగిరా తిప్పి, అంకపనుడి పైకి వేశాడు. అకంపనుడు తన బాణాలతో ఆ కొండ శిఖరాన్ని ముక్కలు చేసేశాడు. హనుమంతుడు మండిపడి, ఒక పెద్ద చెట్టు పెరికి, దానితో అకంపనుడి తల చితకగొట్టి చంపేశాడు.





No comments:

Post a Comment