Friday, September 7, 2012

రామాయణం - అయోధ్యాకాండ 4


ఆ భార్యా భర్తల సంభాషణ అంతా వింటూ ఉండిన లక్ష్మణుడు, ``అన్నా! నీవు అరణ్యానికి వెళ్ళటానికే నిశ్చయించినట్టయితే నేను కూడా వస్తున్నాను,'' అన్నాడు. ఇందుకు రాముడు సమ్మతించక, ``నీవూ, నేనూ కూడా వెళ్ళిపోతే మన తల్లులు కౌసల్యా సుమిత్రలు బొత్తిగా దిక్కులేని వాళ్ళవుతారు. వాళ్ళను కనిపెట్టుకుని ఉండు,'' అన్నాడు. లక్ష్మణుడు ఒప్పుకోలేదు. ``నేను రాత్రీ, పగలూ నీకు కావలసిన పనులన్నీ చేస్తాను. నేను నీ వెంట వచ్చితీరాలి,'' అన్నాడు. రాముడు సంతోషించి సరే నన్నాడు. వసిష్ఠుడి వద్ద ఉండే దివ్యాయుధాలు తీసుకు రమ్మని లక్ష్మణుణ్ణి పంపాడు.
 
వాటిలో అక్షయతూణీరాలూ, ధనుస్సులూ, దుర్భేద్యమైన కవచాలూ, బంగారు పూతగల రెండు కత్తులూ ఉన్నాయి. లక్ష్మణుడు వెళ్ళి, తాను అడవికి పోతున్న సంగతి తన మిత్రులందరికీ చెప్పి, వసిష్ఠుడి వద్దవున్న ఆయుధాలు తెచ్చాడు. తరవాత రాముడు యాత్రాదానాలు చేశాడు. వసిష్ఠుడి కొడుకైన సుయజ్ఞుణ్ణి పిలిపించి, ఆయన భార్యకు సీతచేత ఆమె నగలూ, మంచమూ, పరుపులూ దానం చేయించి, తాను శత్రుంజయమనే ఏనుగునూ, అనేక ఇతర ఏనుగులనూ ఇచ్చి పంపాడు.
 
అగస్త్య కౌశికులనే బ్రాహ్మణులకూ, కౌసల్యను ఆశ్రయించుకుని ఉన్న ఒక వృద్ధ వేద పండితుడికీ, దశరథుడికి ఇష్టుడైన చిత్రరథుడనే సారథికీ, బ్రహ్మచారులకూ అంతులేని గోవులూ, బంగారమూ, బట్టలూ దానం చేశాడు. అయోధ్యకు సమీపంగా అరణ్యంలో ఒక ముసలి బ్రాహ్మణుడుండేవాడు. ఆయన పేరు త్రిజటుడు. ఆయనకు గంపెడు పిల్లలూ, పడుచు భార్యా ఉన్నారు.

ఆయన పరిగ ఏరుకునీ, కందమూలాలు తవు్వకునీ సంసారం నెట్టుకొస్తున్నాడు. రాముడు యాత్రాదానాలు చేస్తున్న మాట ఎలాగో తెలిసి త్రిజటుడు, చిరిగిన పైబట్ట కప్పుకుని రాముడి వద్దకు వచ్చి, ``రాజపుత్రా, నేను పేదవాణ్ణి. చాలామంది బిడ్డలు గలవాణ్ణి. ఇంత కాలంగా పరిగ ఏరుకు బతుకుతున్నాం. నన్ను కటాక్షించు,'' అన్నాడు. రాముడాయనతో, ``అయ్యా, నీవు నీ బలం కొద్దీ కర్ర విసురు.
 
అది ఎంత దూరాన పడుతుందో అంత బారున గోవుల నిస్తాను,'' అన్నాడు. త్రిజటుడు నడుము బిగించి, ఒక కర్ర తీసుకుని గిరగిరా తిప్పి విసిరే సరికి, అది సరయూనది అవతలి గట్టున వెళ్ళి పడింది. రాముడు త్రిజటుణ్ణి ఆప్యాయంగా కౌగలించుకుని, ``అయ్యా, నవు్వల కన్నాను, కోప్పడ వద్దు. నీ తపశ్శక్తి ఎంతో తెలుసుకుందామనిపించింది. అన్నప్రకారం గోవుల నివ్వటమేగాక ఇంకేమన్నా కావాలన్నా ఇస్తాను,'' అన్నాడు. త్రిజటుడు రాముణ్ణి దీవించి ఆవుల మందలను తోలుకుని తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు.
 
ఈవిధంగా దానాలతో ఆబాలగోపాలాన్నీ తృప్తి పరచి రాముడు సీతా లక్ష్మణులతో తండ్రి నగరుకు బయలుదేరాడు. వారు ముగ్గురూ వీధులవెంబడి పోతుంటే మేడల మీది నుంచీ, మిద్దెల మీది నుంచీ చూసే పౌరులు బాధతో రకరకాలుగా తమలో తాము మాట్లాడుకున్నారు. ``చూడండర్రా, రాముడు కాలినడకను భార్యనూ, తము్మణ్ణీ వెంటబెట్టుకుని ఎలా పోతున్నాడో! కాకపోయినా ఈ దశరథుడికేదో అయింది. ఎంత దుర్మార్గుడైన కొడుకునైనా రాజైనవాడు అడవులకు పంపడుగదా, బంగారంలాటి రాముణ్ణి అడవికి పంపిస్తున్నాడే! మన మందరమూ కుటుంబాలతో సహా రాముడి వెంట పోతే సరిపోతుంది!'' పౌరులు అనుకునే ఈ మాటలన్నీ వింటూ సీతారామలక్ష్మణులు దశరథుడి నగరు చేరి, సుమంత్రుడి ద్వారా తాము ఆయనను చూడవచ్చినట్టు రాజుకు కబురు చేశారు.
 
దశరథుడు సీతా రామలక్ష్మణులను పిలుచుకురమ్మని సుమంత్రుడితో అన్నాడు. చేతులు జోడించి వచ్చే రాముడు కన బడగానే రాముడి కెదురు పోబోయి మధ్య దారిలోనే పడిపోయాడు. ఆయనను ఎత్తి పాన్పుపై పడుకోబెట్టారు.

స్పృహ వచ్చి దశరథుడు కళు్ళ తెరవగానే రాముడు, ``మహారాజా, నేను దండకారణ్యానికి పోతున్నాను. మీరు ప్రభువు గనక మీ అనుమతి కోసం వచ్చాను. నేనెంత చెప్పినా వినక సీతాలక్ష్మణులు నా వెంట బయలుదేరారు. వారి వనవాసానికి కూడా అనుమతి ఇవ్వండి,'' అన్నాడు. దశరథుడు రాముడితో, ``నాయనా, రామా! కైకేయికి వరమిచ్చి నేను మోసపోయాను. నీవు నా ఆనతి అతిక్రమించి పట్టాభిషేకం చేసుకో!'' అన్నాడు. ``మీరు అసత్యదోషం కట్టుకోకండి. అడవికి పోవటానికి నాకేమీ అభ్యంతరం లేదు.
 
పధ్నాలుగేళూ్ళ వనవాసం చేసి మళ్ళీ మీ దగ్గరికి వస్తాము,'' అన్నాడు రాముడు. ``మీరు ఇవాళే వెళ్ళాలని ఏమిటి? ఈ రాత్రికి ఇక్కడ ఉండి నా వల్ల మీకు కావలిసినవన్నీ పొంది, ఈ ఒక్క రాత్రీ మమ్మల్నందరినీ సంతోష పెట్టి, రేపు ఉదయం అరణ్యానికి బయలుదేర వచ్చు,'' అన్నాడు దశరథుడు. ``తండ్రీ, మా కోరికలన్నీ మీరు తీర్చినట్టే భావించి మమ్మల్ని వెళ్ళ నివ్వండి. మాకు మీ ఆశీర్వాదం ఇచ్చి సంతోషంగా పంపండి.
 
అరణ్యంలో మా కేమీ కష్టాలుండవు. అనేక పర్వతాలూ, సరస్సులూ, వింతలూ చూస్తాం,'' అన్నాడు రాముడు. రాముడడవికి పోతున్నందుకు దశరథుడు పొందే సంతాపం చూసి సుమంత్రుడు పట్టరాని ఆగ్రహం వచ్చినవాడై, కైకేయితో, ``దుష్టురాలా! నిన్ను ప్రాణంకన్న ఎక్కువగా చూసుకునే మహారాజు కింత శోకం తెచ్చిపెట్టావే, నీ వింకేమి చెయ్యలేవు? నీ వాలకం చూస్తే భర్తను చంపుకునేదానివిగానూ, వంశనాశనం కలిగించే దానివిగానూ కనిపిస్తున్నావు. అందరిలోకీ పెద్ద కొడుకైన రాముడు పట్టాభిషేకం చేసుకోవటానికి నీ అభ్యంతర మేమిటి? భరతుడు రాజ్యం చేస్తే మేమంతా ఇక్కడ ఉంటామనుకుంటున్నావా? అయోధ్యలో ఒక్క బ్రాహ్మడుంటాడా? ఎందుకు చేస్తున్నావీ పాడుపని? మొత్తానికి ఆ తల్లి కూతురనిపించు కున్నావు! నీ తండ్రి అయిన అశ్వపతికి ఒక మునీశ్వరుడు ఒక అపూర్వమైన శక్తి ఇచ్చాడు.
 
దానితో ఆయన పశు పక్ష్యాదుల భాషలన్నీ నేర్చుకున్నాడు. ఒకనాడాయన మంచం మీద పడుకుని ఉండగా జృంభమనే ఒక చీమ ఏదో అనే సరికి ఆయన పకపకా నవ్వాడు. అది చూసి మీ అమ్మ, ఎందుకు నవ్వావో చెప్పు అన్నది. ఎందుకు నవ్వానో చెబితే నేను చచ్చిపోతాన న్నాడు మీ తండ్రి. నువు్వ చస్తావో, బతుకుతావో నాకు తెలీదు; నన్ను చూసి నవ్వలేదని నా కేమిటి నమ్మకం? అందుచేత నవ్విన కారణం చెప్పాలిసిందే నన్నది మీ అమ్మ.

అప్పుడు మీ నాన్న తనకు వరమిచ్చిన ముని దగ్గిరికి పోయి ఆయన సలహా అడిగాడు. నీ భార్య చచ్చిగీపెట్టినా చెప్పకు అన్నాడు ముని. అప్పుడు మీ నాన్న మీ అమ్మను వెళ్ళగొట్టి సుఖంగా ఉన్నాడు. నీ ధోరణి కూడా అలాగే ఉంది. తండ్రిని విడిచి రాముడు అడవికి వెళ్ళాడో గొప్ప ఆపద కలిగి తీరుతుంది. అందుచేత నీ వక్రబుద్ధి మాని రాముడి పట్టాభిషేకానికి ఒప్పుకో!'' అని హితవు చెప్పాడు. ఈ మాటలకు కైక సిగ్గు పడలేదు సరికదా, చలించను కూడా లేదు.
 
దశరథుడు మాత్రం సుమంత్రుడితో, ``రాముడి వెంట అడవికి చతురంగ బలాలనూ, విశేషమైన ధనాన్నీ, అందగత్తెలయిన స్త్రీలనూ, సంబారాలతో వర్తకులనూ పంపించు. బళు్ళ కూడా వెంట ఇచ్చి పంపించు. రాముడికి రాజ్యం లేదన్న లోపం ఏమాత్రం తెలియకుండా చూడు,'' అన్నాడు.
 
సుమంత్రుడి శాపనార్థాలకు చలించని కైకేయి ఈ మాటలు విని తెల్లబోయి, బెదిరి, గొంతు ఆర్చుకుపోయి, ``మహారాజా, అయోధ్యను పాడుబెట్టి అందరూ వెళ్ళిపోతే భరతుడు పాలించడు!'' అన్నది. ``ఓసి దుర్మార్గురాలా! నా మీద మొయ్య రానంత బరువు వేసింది చాలక, ఈ కొరడా దెబ్బలు కూడా ఏమిటి? ఇదంతా ఆ వరాల లోనే చేర్చి అడగక పోయావా?'' అన్నాడు దశరథుడు కోపంగా. కైకేయి అంతకన్న హెచ్చు కోపంతో, ``అది వేరే అడగాలా ఏమిటి? అరణ్యానికి పొమ్మంటే అన్నీ విడిచిపెట్టి పోవటం కాదా? మీ పూర్వీకుడు సగర చక్రవర్తి తన పెద్ద కొడుకైన అసమంజుణ్ణి వెళ్ళగొట్టినప్పుడు వాడి వెనకగా సైన్యాన్ని పంపాడా?'' అని అడిగింది. ఈ మాట విని సిద్ధార్థుడనే మంత్రి, ``అమ్మా, అసమంజుడి మాట ఇక్కడ దేనికి? వాడు పరమ దుష్టుడు.
 
వాడు వీధుల్లో ఆడుకునే పిల్లలను తీసుకుపోయి సరయూ నదిలో పడేసి ఆనందించే పాపాత్ముడు. అందుచేత పౌరులు కడుపుమంటతో రాజువద్దకు వెళ్ళి, `అయ్యా, తమరు అసమంజుణ్ణి వెళ్ళగొడతారా, మమ్మల్ని దేశం విడిచి వెళ్ళి పొమ్మన్నారా? ఏదో ఒకటి తేల్చి చెప్పండి!' అని అడగగా సగర మహారాజు జనద్రోహి అయిన తన కొడుకునూ, వాడి భార్యనూ, పరివారాన్నీ వెళ్ళగొట్టి, వాణ్ణి తిరిగి రాజ్యంలో అడుగు పెట్టనివ్వ వద్దని కట్టుదిట్టం చేశాడు.

జనద్రోహి అసమంజుడికీ జనప్రియుడైన రాముడికీ సాపత్యం చెప్పావే!'' అన్నాడు. ఈ మాటలకు కైక చలించక పోవటం చూసి దశరథుడు, ``ఓసి పాపాత్మురాలా! నిన్ను చూస్తే నీకు హితం తల కెక్కేటట్టు లేదు. నేను కూడా రాముడి వెంట అడవికి పోతాను. నీవూ, భరతుడూ సుఖంగా రాజ్య మేలండి,'' అన్నాడు. ఈ సంభాషణ అంతా వింటున్న రాముడు తండ్రితో, ``మహారాజా, అన్ని సుఖాలూ విడిచి, అడవిలో కందమూలాలు తినబోయే నా వెంట సేన కూడా దేనికి? ఏనుగును దానం చేసి కట్టుతాడు దగ్గిర లోభించే పద్ధతి మానండి. మాకు నారబట్టలూ, దుంపలు తవు్వకునే పరికరాలూ, ఒక బుట్టా ఇప్పించండి, చాలు,'' అన్నాడు.
 
మానాభిమానాలు విడిచిపెట్టిన కైకేయి, ``ఇదుగో, నారబట్టలు తెస్తున్నాను,'' అంటూ వచ్చింది. రామలక్ష్మణులు తమ మేలి వస్త్రాలు విప్పేసి, తండ్రి ఎదటనే నారబట్టలు ధరించారు. సీతకు మాత్రం అవి ఎలా కట్టుకోవాలో తెలియక రాముడి కేసి చూసింది. తరవాత ఒక బట్ట మెడకు చుట్టుకుని, మరొకటి చేత పట్టుకుని, సిగ్గుతో తల వంచి నిలబడింది. అప్పుడు రాముడు ఆమె వద్దకు వెళ్ళి, ఆమె చేతిలో ఉన్న నారచీరె పైన దానిని చుట్టాడు. ఇది చూసి దశరథుడి భార్యలు కన్నీరు కారుస్తూ, ``నాయనా, నీవు తండ్రిమాట ప్రకారం అడవికి వెళ్ళదలిచావు, వద్దన్నా మానవు. కాని సీతను కూడా ఎందుకు తీసుకు పోతావు? ఆమె వనవాసం చెయ్య లేదు. మా వద్ద విడిచిపెట్టి వెళు్ళ.
 
నీకు బదులుగా ఆమెను చూసుకుంటూ ఉంటాం,'' అన్నారు. ఈలోపల వసిష్ఠుడు సీతకు నారచీరెలిస్తున్న కైకేయితో, ``గుణ హీనురాలా, నీ సాహసానికి అంతు లేకుండా ఉన్నదే. సీత అడవికి వెళ్ళవలసిన అవసరమేమున్నది? రాముడి కోసం సిద్ధం చేసిన పట్టాభిషేకం ఆమెకు జరిపి రాజ్యం పాలించేటట్టు చేయవచ్చు, తెలుసా? సీత ఈ నార చీరెలు కట్టవలసిన అవసరం లేదు సరే కదా, ఆమె తన వెంట వాహనాలూ, వస్తువులూ, పరిచారికలూ, సమస్తమూ తీసుకు పోవచ్చును. భరతుడు సంతోషిస్తాడని నీవు చేసిన ఈ దుర్మార్గం అతనికి ఎంత మాత్రమూ రుచిం చదు.

అతను దశరథుడి కొడుకే అయితే, తన తండ్రి వ్యథకు కారణమైన రామ వనవాసానికి ఎంత మాత్రమూ సమ్మతించడు!'' అన్నాడు. చుట్టూ ఉన్నవారు, ``ఛీ,ఛీ!'' అనుకోవటం దశరథుడు విన్నాడు. ఆయన సీతను చూసి, ``సుకుమారి, చిన్న పిల్ల! ఆ సీత మునిపత్నిలాగా నారచీరె గట్టి ఎలా వెలవెల పోతున్నదో చూడండి! ఆమె నారచీరెలు కట్టటానికి వీల్లేదు,'' అన్నాడు.
 
రాముడు బయలుదేరే ప్రయత్నంలో తండ్రికి అప్పగింతలు చెప్పి, తన తల్లి అయిన కౌసల్యను కాపాడమని కోరాడు. దశరథుడు సుమంత్రుడితో, ``మంచి గుర్రాలను పూన్చిన మేలైన రథంలో వీళ్ళ నెక్కించి, నగరం బయట అరణ్యంలో విడిచి పెట్టిరా!'' అన్నాడు. ధనాధికారిని పిలిచి, ``పధ్నాలుగేళ్ళ పాటు సీతకు సరిపోయే మేలైన చీరెలూ, నగలూ తీసుకురా,'' అని ఆజ్ఞాపించాడు. సీత పెళ్ళికి పోతున్నదానిలాగా వికసించిన ముఖంతో తన కోసం తెచ్చిన నగలు పెట్టుకుంటూంటే కౌసల్య ఆమెను ఆలింగనం చేసుకుని, ``సీతా, నీ భర్త పేదవాడై పోయినాడని వనవాస కాలంలో అశ్రద్ధగా చూడకమ్మా!'' అంటూ నీతిబోధ చేసింది. రాముడు తల్లి దండ్రులకు ప్రదక్షిణ నమస్కారం చేసి, తల్లితో, ``అమ్మా, దిగులు పడక తండ్రిగారిని కనిపెట్టుకుని ఉండు. పధ్నాలుగేళ్ళంటే ఎంత? కన్నుమూసి తెరిచేసరికి గడిచిపోతాయి,'' అన్నాడు.
 
లక్ష్మణుడు కూడా తల్లి దండ్రులకు మొక్కి తన తల్లి అయిన సుమిత్ర వద్ద సెలవు తీసుకున్నాడు. ఆమె, ``లక్ష్మణా, ఇక నీకు రాముడే తండ్రి, సీతే తల్లి, అరణ్యమే అయోధ్య! అన్నను ఆపదరాకుండా చూసుకో, నాయనా!'' అని చెప్పింది. ముగ్గురూ బయటికి వచ్చారు. పెళ్ళి కూతురులాగా అలంకరించుకున్న సీత తాను వనవాసం వెళుతున్నాననే చింత కొంచెమైనా లేకుండా, ముందుగా రథమెక్కి కూచున్నది. తరవాత రామలక్ష్మణులెక్కి కూచున్నారు. సుమంత్రుడు రథంలో సీతకు దశరథుడిచ్చిన వస్త్రాభరణాలూ, ఆయుధాలూ, కవచాలూ, చిన్న గునపమూ, బుట్టా ఉంచాడు. రథం కదిలింది. 

No comments:

Post a Comment