Friday, September 7, 2012

రామాయణం - యుద్దకాండ 11


దుఃఖంతో బాధపడుతున్న రాముడితో విభీషణుడు మరొక విషయం కూడా బయట పెట్టాడు. ‘‘నికుంభిల ఆ హోమం చేస్తూండగా మధ్యలో ఎవడు నీతో యుద్ధం చేస్తాడో వాడి చేతిలో నీకు చావున్నది,’’ అని బ్రహ్మ ఇంద్రజిత్తుకు చెప్పాడు. ఇప్పుడా హోమాన్ని భంగపరచటానికి అవకాశం దొరికింది. తరవాత రాముడి ఆజ్ఞ పొంది లక్ష్మణుడు సుగ్రీవ హనుమంత విభీషణులనూ, వానర సేననూ వెంటబెట్టుకుని, ఇంద్రజిత్తు హోమకార్యం భంగం చేసి అతణ్ణి చంపటానికి బయలుదేరాడు.

వారి దారికి అడ్డంగా రాక్షససేన నిలబడి ఉన్నది. ఇంద్రజిత్తు హోమం పూర్తి చేసే లోపలనే ఆ రాక్షస సేనను నిర్మూలించవలసి ఉంటుందని లక్ష్మణుడితో విభీషణుడన్నాడు. ఆ సేన నిర్మూలమయితే హోమం ముగియకపోయినా ఇంద్రజిత్తు బయలుదేరి వస్తాడు, అప్పుడతణ్ణి తేలికగా కడతేర్చవచ్చు. ఈ మాట విని వానరసేన రాక్షససేనపై విరుచుకుపడింది. ఉభయపక్షాలూ దారుణంగా పోరాడాయి. వానరులూ, రాక్షసులూ కూడా పెద్ద సంఖ్యలోనే చచ్చారుగాని, రాక్షసులు వానరుల ముందు నిలవలేక పోయారు.

ఆ వార్త విని ఇంద్రజిత్తు హోమకార్యం పూర్తికాకుండానే లేచి వచ్చి రథమెక్కాడు. రాక్షససేన అతని రథం చుట్టూ మూగింది. కాని హనుమంతుడు పర్వతాకారం ధరించి, పెద్దపెద్ద చెట్లతో రాక్షసులను చావమోదసాగాడు. రాక్షసులు వేల సంఖ్యలో హనుమంతుణ్ణి చుట్టుముట్టారు. తన మీద రకరకాల ఆయుధాలను ప్రయోగించే ఆ రాక్షసులందరితోనూ హనుమంతుడు ఒకేసారి భయంకరంగా యుద్ధం చేశాడు.


 రాక్షసులను అదేపనిగా హనుమంతుడు మట్టుపెట్టుతూ ఉండటం చూసి ఇంద్రజిత్తు తన రథాన్ని అతనికేసి నడిపించాడు. ఇంద్రజిత్తు వేసే బాణాలతో తీవ్రంగా గాయపడి హనుమంతుడు, ‘‘దుర్మార్గుడా, నువ్వు నిజంగా వీరుడవైతే ఆయుధాలు లేకుండా వట్టి చేతులతో నాతో యుద్ధం చెయ్యి,’’ అని అతడికేసి వెళ్ళాడు.‘‘ఇంద్రజిత్తు హనుమంతుణ్ణి బాణాలతో చంపెయ్యగలడు. నువ్వు వెళ్ళి ఇంద్రజిత్తు నెదుర్కొని యుద్ధం చేసి చంపెయ్యి,’’ అని లక్ష్మణుడితో విభీషణుడన్నాడు. వెంటనే ఇద్దరూ కలిసి నికుంభిలకేసి వెళ్ళారు. అది నల్లని రాక్షసిలాగా కనిపించే జమ్మిచెట్టు కింద ఉన్నది. ఇక్కడే ఇంద్రజిత్తు భూతాలకు బలులిచ్చి, యుద్ధానికి బయలుదేరుతాడు.

‘‘లక్ష్మణా, ఇంద్రజిత్తు జమ్మిచెట్టును ప్రవేశించక ముందే అతణ్ణి రథాశ్వసారథి సహితంగా నిర్మూలించు,’’ అన్నాడు విభీషణుడు. లక్ష్మణుడు చప్పున జమ్మిచెట్టు వద్దకు వెళ్ళి, ఇంద్రజిత్తును తనతో యుద్ధానికి రావలసిందిగా పిలిచాడు. ఇంద్రజిత్తు లక్ష్మణుడితో ఏమీ అనక, విభీషణుడి కేసి తిరిగి, ‘‘విభీషణా, నీకు కులాభిమానం లేదు. ఈ గడ్డ మీద పుట్టి పెరిగిన వాడివి నాకెలా ద్రోహం తలపెట్టావు? నీకు బంధుత్వం గాని, మమకారం గాని, ధర్మం గాని లేదు. అయిన వారిని వదిలి శత్రువులకు భృత్యుడవయ్యావు!

అయిన వారి మధ్య గౌరవంగా ఉండటం కన్న శత్రువుల వద్ద నీచుడుగా ఉండటం నీకు సమ్మతమయింది. నీ బుద్ధి నశించింది. అందుకే నా హోమానికి విఘ్నం కలిగించటానికి లక్ష్మణుణ్ణి ప్రోత్సహించి జమ్మిచెట్టు దగ్గరికి తీసుకువచ్చావు. ఇలాంటి పని ఇంకెవడూ చెయ్యడు,’’ అన్నాడు. ఆ మాటలకు విభీషణుడు, ‘‘నా సంగతి తెలియనట్టుగా ఎందుకిలా మాట్లాడతావు? నేను రాక్షసుడనై పుట్టానే గాని, నాది రాక్షస స్వభావం కాదు. నేను అధర్మం సహించలేకనే నా సొంత అన్నను వదిలిపెట్టేశాను.

మంచి వాడైనా పాపులను అంటిపెట్టుకుని పాపాత్ముడౌతాడు. దుష్ట సర్పాలను దూరంగా ఉంచాలి. పర ధనాన్నీ, పర స్ర్తీలను కోరటమూ, స్నేహితులను నమ్మకపోవటమూ వినాశహేతువులు. వాటి మూలంగా నీ తండ్రీ, నువ్వూ కూడా చావనున్నారు. మాయా సీతను వధించి రామ లక్ష్మణులకు అవమానం కలిగించిన నువ్వూ బతికి ఉండటానికి తగవు. లక్ష్మణుడి చేతిలో చచ్చి నరకానికి వెళ్ళు,’’ అన్నాడు.

 ఇంద్రజిత్తు మహా కోపంతో అస్త్రాలు ధరించి రథమెక్కి, హనుమంతుడి వీపు మీద ఉన్న లక్ష్మణుడితో, ‘‘రాత్రి యుద్ధంలో నిన్నూ, నీ అన్ననూ, నా బాణాలతో మూర్ఛపోగొట్టాను. అది నువ్వు మరిచి అయినా ఉండాలి, లేక నీకు చావు దగ్గిర పడి అయినా ఉండాలి,’’ అన్నాడు. దానికి లక్ష్మణుడు, ‘‘ఓరీ రాక్షసుడా? నువ్వు మమ్మల్ని మాటలతోనే చంపుతున్నావు గాని నిజంగా చంపటం నీ తరం కాదు. కార్యశూరుడు ప్రగల్భాలు పలకడు. నువ్వు దొంగ లాగా మాకు కనిపించకుండా యుద్ధం చేశావు. అది వీరుడు చేసే పనికాదు. ఇలా ఎదురుగా కనిపిస్తూ నీ ప్రతాపం ఏ పాటిదో చూపు,’’ అన్నాడు.

మరుక్షణమే ఇంద్రజిత్తు వేగంగా లక్ష్మణుణ్ణి తన తీక్షణమైన బాణాల పరంపరతో కొట్టి సింహనాదం చేశాడు. లక్ష్మణుడు కూడా ఇంద్రజిత్తును క్రూరమైన బాణాలతో కొట్టాడు. ఇద్దరూ సమంగా యుద్ధం సాగించారు. మధ్యలో విభీషణుడు లక్ష్మణుడితో, ‘‘ఇంద్రజిత్తు ధైర్యం సన్నగిల్లుతున్నది. వాడి ముఖంలో వెలవెలపాటు కనిపిస్తున్నది. వీలయినంత త్వరలో వీణ్ణి చంపెయ్యి,’’ అని హెచ్చరించాడు. నిజంగానే లక్ష్మణుడి బాణాలకు ఇంద్రజిత్తు క్షణం పాటు స్పృహ తప్పి, అంతలోనే మళ్ళీ తెప్పిరిల్లాడు. ఇద్దరూ అమితమైన పట్టుదలతో పోరాడుతూ ఒకరినొకరు బాగా గాయపరచుకున్నారు.

వారి యుద్ధం చూస్తూంటే విభీషణుడికి కూడా యుద్ధం చెయ్యాలనిపించింది. అతను తన నలుగురు మంత్రులతో సహా రాక్షసులను సంహరించుతూ, వానరులతో, ‘‘వానర వీరులారా, ఇక రావణుడికి మిగిలి ఉన్న వీరుడు ఈ ఇంద్రజిత్తు ఒక్కడే. మిగిలిన వాళ్ళ నందర్నీ మీరే చంపేశారు. వీడు నా అన్న కొడుకు. నేను వీణ్ణి చంపలేను. ఆ పని లక్ష్మణుడు చేస్తాడు. ఇంద్రజిత్తుకు అండగా ఉన్న రాక్షసులను మీరు చంపేసి, ఇంద్రజిత్తు చావుకు తోడ్పడండి,’’ అన్నాడు.


వానరవీరులు ఎంతో ఉత్సాహంతో తోకలాడిస్తూ, సింహనాదాలు చేస్తూ రాక్షసులపైన తలపడ్డారు. ఈ లోపల లక్ష్మణుడు ఇంద్రజిత్తు సారథిని చంపేశాడు. ఇంద్రజిత్తు తన రథాన్ని తానే నడుపుకుంటూ యుద్ధం సాగించాడు. ఆ సమయంలో నలుగురు వానరవీరులు ఇంద్రజిత్తుయొక్క రథాశ్వాలపైన పడి వాటిని చంపేశారు, అతని రథాన్ని విరిచి పారేశారు. ఇంద్రజిత్తు నేలపైకి దిగి లక్ష్మణుడితో యుద్ధం సాగించాడు.

అతను తన రాక్షసులతో, ‘‘నేను రహస్యంగా నగరంలోకి పోయి ఇంకో రథంతో తిరిగి వస్తాను. నాకు అడ్డంగా నిలబడి మీరు వానరులతో యుద్ధం చేస్తూ ఉండండి. వానరులు నా దారికి అడ్డం రాకుండా చూడండి,’’ అన్నాడు. అతను రాక్షసుల వెనకనుంచి, వానరుల కంట పడకుండా లంకా నగరంలోకి వెళ్ళిపోయాడు. అతను మరొక రథం పైన యుద్ధ భూమికి తిరిగి వచ్చి, లక్ష్మణ విభీషణుల నెదుర్కొన్నాడు. ఎప్పుడు వెళ్ళాడో తెలియకుండా మరొక రథంలో ప్రత్యక్షమైన ఇంద్రజిత్తు ఉపజ్ఞను వాళ్ళిద్దరూ మెచ్చుకున్నారు.

మళ్ళీ ఇంద్రజిత్తూ, లక్ష్మణుడూ యుద్ధం సాగించారు. మరొకసారి లక్ష్మణుడు ఇంద్రజిత్తు సారథిని చంపాడు. కాని రథాశ్వాలు సారథి అవసరం లేకుండానే రథాన్ని నడపవలసిన విధంగా నడిపాయి. ఇంద్రజిత్తు లక్ష్మణుడితో బాటు విభీషణుడి మీద కూడా బాణాలు వేశాడు. విభీషణుడు మండిపడి తన గదతో ఇంద్రజిత్తు రథాశ్వాలను చంపేశాడు. ఇంద్రజిత్తు నేలపైకి దూకి, శక్తి తీసుకుని విభీషణుడి పైన విసిరాడు. లక్ష్మణుడు దాన్ని తన బాణాలతోనే పది ముక్కలుగా నరికేశాడు.

తరవాత ఇంద్రజిత్తూ, లక్ష్మణుడూ ఒకరి పైన ఒకరు దివ్యాస్త్రాలను ప్రయోగించుకున్నారు. అవి ఒక దాన్నొకటి తాకేసరికి నిప్పు రవ్వలూ, మంటలూ, పొగా బయలుదేరాయి. ఇలా కొంతసేపు ఒకరి అస్త్రాల నొకరు ధ్వంసం చేసుకున్నాక లక్ష్మణుడు ఒక దివ్యబాణంతో ఇంద్రజిత్తు తల నరికేశాడు. విభీషణుడూ, వానరులూ సింహనాదాలు చేశారు. రాక్షసులు పారిపోయారు.


 ఇంద్రజిత్తును చంపేసి వానరులకు మితిలేని ఆనందాన్ని కలిగించి, లక్ష్మణుడు హనుమంతుణ్ణీ, విభీషణుణ్ణీ వెంటబెట్టుకుని సుగ్రీవుడూ, రాముడూ, ఉన్న చోటికి వెళ్ళాడు. ‘‘ఇంద్రజిత్తు చచ్చాడు,’’ అని లక్ష్మణుడు చెప్పగానే, రాముడు అతణ్ణి కౌగలించుకుని, ‘‘ఇక రావణుడూ చచ్చిన వాడే. లక్ష్మణా, నువ్వు చేసినది చాలా గొప్ప పని!’’ అన్నాడు. వైద్యంలో నిపుణుడైన సుషేణుడు వచ్చి, లక్ష్మణ విభీషణులకు గుచ్చుకున్న బాణాలు తీసేసి, చికిత్స చేశాడు. వానరసైనికులు ఉత్సాహంతో గంతులు వేయసాగారు.

దేవేంద్రుణ్ణి సైతం జయించిన ఇంద్రజిత్తు లక్ష్మణుడి చేతిలో చచ్చిపోయాడని వినగానే రావణుడు మూర్ఛపోయాడు. అతను స్పృహ తెలిసి ఇంద్రజిత్తు కోసం చాలాసేపు దుఃఖించి, దుర్భరమైన రోషంతో, ‘‘అస్తమానమూ రాముణ్ణే ధ్యానించే సీత బతికి ఉండటం దేనికి? ఇప్పుడే చంపేస్తాను!’’ అంటూ కత్తిదూసి సీత ఉన్న చోటికి వేగంగా బయలుదేరాడు. అతణ్ణి మంత్రులూ, భార్యలూ వెంబడించి రాసాగారు. మంత్రులు వారించటానికి యత్నిస్తే రావణుడు వినిపించుకోలేదు.


సీత అతడి రౌద్రాకారాన్ని అంత దూరంలోనే చూసి తనకు చావు మూడిందని భయపడింది. ఆనాడే హనుమంతుడి వీపు మీద ఎక్కి రాముడి వద్దకు వెళ్ళిపోనందుకు పశ్చాతాపపడింది. చిట్టచివరకు రావణుడికి సుపార్శ్వుడనే మంత్రి అడ్డంపడి, ‘‘నీ వంటి బుద్ధిమంతుడు ఆడదాన్ని చంపటమేమిటి? చేతనయితే సీతను వశపరుచుకో. ఈ కోపమంతా రాముడిపైన చూపించు. ఇవాళ కృష్ణ చతర్దశి.యుద్ధ పయత్నం ప్రారంభించి, రేపు అమావాశ్య నాడు రామలక్ష్మణులతో యుద్ధం చెయ్యి,’’ అన్నాడు.


 సుపార్శ్వుడన్న మాటలు నచ్చి, రావణుడు మౌనంగా ఇంటికి తిరిగి వెళ్ళాడు. అతను తన సేనాపతులతో, ‘‘ఇవాళ మీరంతా వెళ్ళి రాముడితో యుద్ధం చెయ్యండి. అతణ్ణి మీరు చంపలేకపోయినా, మీతో పోరాడి నీరసించి ఉండేరాముణ్ణి నేను రేపు అవలీలగా చంపుతాను,’’ అని చెప్పాడు. రాక్షసులు యుద్ధానికి బయలుదేరి వెళ్ళి వానరులపై దారుణ యుద్ధకాండ సాగించే సరికి రాముడు పూనుకుని, వారిని తన బాణాలతో లక్షల సంఖ్యలో అంతమొందించాడు. లంకానగరంలో చచ్చిన రాక్షసుల భార్యల ఆర్తనాదాలు మిన్నుముట్టాయి.

ఇంక రావణుడు తానే స్వయంగా రామలక్ష్మణులను చంపటానికి బయలుదేరాడు. అతని వెంట రథాలపై మహాపార్శ్వుడూ, మహోదరుడూ, విరూపాక్షుడూ మొదలైనవారు బయలుదేరారు. అందరూ కలిసి, రామలక్ష్మణులుండే ఉత్తర ద్వారం కేసి వెళ్ళారు. రాక్షస సేన యుద్ధసన్నద్ధమై వస్తూండటం తెలిసి వానరులు కూడా యుద్ధానికి సిద్ధంగా నిలబడ్డారు. రావణుడు తన బాణాలతో వానరులను అపారమైన సంఖ్యలో చంపేస్తూ రాముడున్న చోటికి పోసాగాడు. అది చూసి సుగ్రీవుడు రాక్షస సేనలపైన కొండ రాళ్ళ వర్షం కురిపించి, రాక్షసులను కూడా అపారమైన సంఖ్యలో చంపసాగాడు. అప్పుడు విరూపాక్షుడు రథం మీది నుంచి ఒక ఏనుగు మీదికి మారి సుగ్రీవుడితో పోరాడవచ్చాడు.

సుగ్రీవుడతనితో భయంకరంగా యుద్ధం చేసి మొదట ఏనుగునూ తరవాత విరూపాక్షుణ్ణీ కూడా చంపేశాడు. తన సైన్యాలు క్షీణించిపోతూ ఉండటం చూసి రావణుడు వానరసేనను నిర్మూలించమని మహోదరుణ్ణి ఆజ్ఞాపించాడు. సుగ్రీవుడు మహోదరుడితో కూడా చాలా సేపు యుద్ధం చేసి చివరకతణ్ణి చంపాడు. వానరులు సింహనాదాలు చేశారు.

ఈ లోపల మహాపార్శ్వుడు అంగదుడి సేన పైకి వెళ్ళి, అంగదుడితో ద్వంద్వయుద్ధం చేసి, కొంత సేపటికి అతని చేతిలో ప్రాణాలు విడిచాడు.


తన వెంట వచ్చిన ముగ్గురు మంత్రులూ చావటం చూసి రావణుడు మహాకోపంతో రాముడి పైకి వెళ్ళి, యుద్ధం ప్రారంభించాడు. ఇద్దరూ ఒకరిపైన ఒకరు మహాస్త్రాలు ప్రయోగించుకున్నారు; ఒకరి అస్త్రాలను ఒకరు నిర్మూలించారు. చివరకు ఒకరినొకరు బాణాలతో మర్మస్థానాలలో కొట్టారు. రాముడు రావణుణ్ణి తీవ్రంగా గాయపరిచి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో లక్ష్మణుడు విల్లు ఎక్కుపెట్టి రావణుడి ధ్వజాన్నీ, వింటినీ విరగగొట్టాడు.

విభీషణుడు గద తీసుకుని రావణుడి రథాశ్వాలను చంపాడు. రావణుడు రథం నుంచి కిందికి దిగి, తన తమ్ముడైన విభీషణుడి పైన ఒక శక్తిని ప్రయోగించాడు. లక్ష్మణుడాశక్తిని దారిలోనే తన బాణాలతో ఖండించాడు. అది చూసి రావణుడు మరింత పెద్ద శక్తిని తీసి గిరగిరా తిప్పి, విభీషణుడిపై విసరబోయూడు. లక్ష్మణుడు దానికి అంతరాయం కలిగించాడు. రావణుడు మహాకోపంతో ఆ శక్తిని లక్ష్మణుడి పైకే విసిరాడు. అది లక్ష్మణుడి రొమ్ములో లోతుగా దిగబడింది. లక్ష్మణుడు పడిపోయాడు. రాముడది చూసి భరించరాని ఆగ్రహంతో రావణుడి పైన అతి దారుణమైన బాణాలు వేసి తీవ్రంగా బాధించాడు. రావణుడు రాముడి ధాటికి తట్టుకోలేక పారిపోయాడు.







No comments:

Post a Comment