Friday, September 7, 2012

రామాయణం - యుద్దకాండ 14

విభీషణుడు వెళ్ళి పుష్పక విమానం తెచ్చి రాముడి ముందుంచాడు. అది చాలా పెద్దది. అందులో బంగారంతో చేసిన భాగాలున్నాయి. వైడూర్య మణులతో చేసిన ఆసనాలున్నాయి. దానికి బంగారు కమలాలూ, గజ్జెలూ, ఘంటలూ ఉన్నాయి. ‘‘విభీషణా, వానరులు మహత్తరమైన కార్యం సాధించారు. వారిని కానుకలతో సంతోషపెట్టు. అందువల్ల నీకు గొప్ప కీర్తి కలుగుతుంది,’’ అని చెప్పి రాముడు సీతాలక్ష్మణులతో సహా పుష్పకం ఎక్కాడు. అతను సుగ్రీవుడూ మొదలైన వారికీ, విభీషణుడికీ వీడ్కోలు చెప్పి, తాను అయోధ్యకు తిరిగి పోవటానికి వారి అనుమతి కోరాడు.

‘‘మమ్మల్ని కూడా నీ వెంట తీసుకుపోతే మేం నీ పట్టాభిషేకం చూసి ఆనందిస్తాం,’’ అన్నారు వాళ్ళంతా. ‘‘అలా అయితే మరీ సంతోషం,’’ అని రాముడు అందరినీ ఎక్కించుకుకోగా, పుష్పకం ఆకాశంలోకి లేచింది. అంత మంది ఎక్కినా విమానం ఇరుకనిపించలేదు. విమానం పోతూ ఉంటే రాముడు సీతకు రాక్షస వీరులు యుద్ధ భూమిలో చనిపోయిన స్థలాలూ, సేతువూ, విభీషణుడు తనను కలుసుకున్న చోటూ మొదలైనవి చూపుతూ వచ్చాడు. కిష్కింధ కనుచూపు మేర లోకి రాగానే సీత, తార మొదలైన సుగ్రీవుడి భార్యలనూ, ఇతర వానర వీరుల భార్యలనూ, తన వెంట తీసుకుపోవాలన్న కోరికను వెల్లడించింది. రాముడు సరేనని పుష్పకాన్ని కిష్కింధలో దింపి, సీత కోరికను సుగ్రీవుడికి తెలిపాడు. సుగ్రీవుడు తన అంతఃపురానికి వెళ్ళి, తారతో వానరవీరుల భార్యలందరినీ ప్రయాణం చెయ్యమన్నాడు. తార వానర స్ర్తీలనూ ప్రయాణానికి సిద్ధం చేసింది. వారందరూ బాగా అలంకారాలు చేసుకుని, సీతను చూడాలన్న అభిలాషతో వచ్చారు.


 వానర వనితలందరినీ ఎక్కించుకుని విమానం మళ్ళీ ప్రయాణం సాగించింది. సీతకు రాముడు ఋశ్యమూకం మీద తనను సుగ్రీవుడు కలుసుకున్న చోటు చూపించాడు. అలాగే అతను తనకు శబరి కనిపించిన చోటూ, జటాయువు రావణుడితో పోరాడిన చోటూ, జనస్థానంలో తాము నివశించిన ఆశ్రమమూ మొదలైనవన్నీ సీతకు చూపాడు.
క్రమంగా విమానం అయోధ్యకు చేరవచ్చింది. వానర రాక్షసులందరూ లేచి నిలబడి దూరాన కనిపించే అయోధ్యా నగరాన్ని ఆసక్తితో చూశారు.

కాని రాముడు తిన్నగా అయోధ్యకు వెళ్ళక భరద్వాజాశ్రమంలో దిగి, భరద్వాజమహాముని ద్వారా భరతుడి యోగ క్షేమాలూ, తన తల్లుల యోగక్షేమాలూ తెలుసుకున్నాడు. అతను చైత్రశుద్ధ పంచమి నాడు అయోధ్య నుంచి వనవాసం బయలుదేరాడు. ఇవాళ చైత్రశుద్ధ చవితి. ఈ రోజుతో సరిగా పధ్నాలుగేళ్ళు నిండాయి. ఆ రోజు రాముడు తన ఆతిథ్యం స్వీకరించి మర్నాడు అయోధ్యకు వెళ్ళాలని భరద్వాజుడు కోరాడు.

రాముడు హనుమంతుణ్ణి పిలిచి, ‘‘నీవు అయోధ్యకు వెళ్ళు. దారిలో శృంగిబేరపురంలో గుహుణ్ణి కలుసుకుని నా క్షేమ సమాచారాలు చెప్పు. నాకతను ప్రాణం లాంటి వాడు. అతని ద్వారా నీకు అయోధ్య వార్తలు తెలుస్తాయి. నా క్షేమ సమాచారం విని అతను చాలా సంతోషిస్తాడు. అయోధ్యకు వెళ్ళి భరతుడికి మన వార్తలన్నీ వివరంగా చెప్పు. నా విజయవార్త విన్నప్పుడు భరతుడి ముఖంలో ఏ మార్పులు కలిగేదీ శ్రద్ధగా గమనించు. ఇంత కాలం రాజ్యభోగాలనుభవించిన వాడికి అవన్నీ పోతాయంటే బాధగానే ఉంటుంది. అందుచేత అతని మనోభావం సరిగా గ్రహించు. అతనికే రాజ్యం చెయ్యూలని ఉంటే అలాగే చెయ్యవచ్చు. అతనికలాంటి కోరిక ఉన్నట్టు తోస్తే, మేం అయోధ్యకు చేరక ముందే ఎదురు వచ్చి కలుసుకో,’’ అన్నాడు.

 హనుమంతుడు మానవ రూపం ధరించి వాయు మార్గాన బయలుదేరి, గంగాయమునా సంగమం దాటి శృంగిబేరపురం చేరుకుని, గుహుణ్ణి కలుసుకున్నాడు. గుహుడితో, రాముడు రేపు ఉదయం భరద్వాజాశ్రమం నుంచి బయలుదేరి వస్తున్నాడని చెప్పి, హనుమంతుడు బయలుదేరి, అయోధ్యకు కొంచెం దూరంగా ఉన్న నందిగ్రామానికి చేరుకున్నాడు.

అక్కడ భరతుడొక ఆశ్రమం కల్పించుకుని తపస్విలాగా ఉంటున్నాడు. పధ్నాలుగేళ్ళూ నిండినప్పటికీ రాముడింకా రాలేదే అని విచారిస్తున్నాడు. హనుమంతుడు భరతుణ్ణి కలుసుకుని, ‘‘రాజా, శుభవార్త తెచ్చాను. రాముడు రావణుణ్ణి చంపి, సీతను తిరిగి సంపాదించుకుని, మహాబలులైన మిత్రులతో వస్తున్నాడు. సీతారాముల వెంట లక్ష్మణుడు కూడా వస్తున్నాడు,’’ అని చెప్పాడు.

ఈ మాట వినగానే భరతుడు ఆనందపారవశ్యంతో మూర్ఛపోయాడు. అతను తిరిగి స్పృహ తెలియగానే హనుమంతుణ్ణి కౌగలించుకుని, ‘‘ఈ సంతోష వార్త తెచ్చిన నీవు మనిషివో, దేవతవో నాకుతెలీదు. ఇందుకు నీకు లక్ష గోవులనూ, నూరు ఉత్తమ గ్రామాలనూ, పదహారు మంది అందగత్తెలైన కన్యకలనూ దానంగా ఇస్తాను,’’ అన్నాడు. ఇద్దరూ చాలాసేపు కూర్చుని మాట్లాడుకున్నారు. రామ వనవాస కాలంలో జరిగిన సంగతులన్నిటినీ హనుమంతుడు భరతుడికి చెప్పాడు. భరతుడు శత్రుఘ్నుడితో ఊరంతా అలంకరింపజేయమనీ, వాద్యాలు ఏర్పాటు చేయమనీ, రాముడి కెదురు వెళ్ళటానికి వేశ్యలను సిద్ధ పరచమనీ అన్నాడు.

నందిగ్రామానికి అయోధ్యకూ మధ్యనున్న మార్గాన్ని చక్కగా చదును చేశారు. అంతటా నీళ్ళూ, పూలూ చల్లారు. రాజ మార్గాలు పూల తోరణాలు కట్టి, గంధం చల్లి రంగురంగుల ముగ్గులు పెట్టారు. రాజ పరివారమూ స్ర్తీ జనమూ రామ దర్శనార్థం గుంపులు గుంపులుగా బయలుదేరారు. వేలాది ఏనుగులనూ, గుర్రాలనూ అలంకరించారు. వాటి పైన కొందరూ, రథాలెక్కి కొందరూ బయలుదేరారు. కౌసల్యా, కైకేయీ సుమిత్రల వెనకగా దశరథుడి భార్యలందరూ పల్లకీలెక్కి వచ్చారు. వీరందరితో బాటు నగరవాసులందరూ నందిగ్రామం చేరుకున్నారు.

 రాముడింకా రాడేమని భరతుడు ఆరాటపడి, హనుమంతుడు తనతో అబద్ధం చెప్పాడని సంశయించాడు. కాని అంతలోనే పుష్పకం కనబడింది. అది త్వరలోనే ఎగిరి వచ్చి నేలమీద వాలింది. భరతుడు రాముడికి ఎదురు వెళ్ళి నమస్కరించాడు. వానరవీరులందరూ మానవ రూపాలు ధరించి ఉన్నారు. భరతుడు వారి నందరినీ పరామర్శించాడు. అతను సుగ్రీవుడితో, ‘‘సుగ్రీవా, మేమిదివరకు నలుగురం అన్నదమ్ములం. నీ విప్పుడు మాలో అయిదోవాడి వయ్యావు,’’ అన్నాడు. విభీషణుణ్ణి కూడా, అతను చేసిన సహాయానికి మెచ్చుకున్నాడు.

రాముడు కౌసల్యకూ, ఇతర తల్లులకూ, వశిష్ఠుడికీ నమస్కరించాడు. భరతుడు తన వద్ద ఉన్న రామపాదుకలను రాముడి కాళ్ళకు స్వయంగా తగిలించాడు. తరవాత అతను రాముడికి చేతులు మోడ్చి, ‘‘రాజా, నీ రాజ్యాన్ని నీవు తీసుకో. ఈ రాజ్యం తిరిగి నీకు అప్పగించటంతో నా జన్మ ధన్యమయింది. నీవు వెళ్ళే నాటి కన్న ఇప్పుడు బొక్కసమూ, ధాన్యమూ, సైన్యమూ పదింతలున్నది,’’ అన్నాడు. రాముడు నందిగ్రామం చేరుతూనే పుష్పక విమానాన్ని కుబేరుడి వద్దకు పంపేశాడు.

అందరూ కూర్చున్న మీదట భరతుడు రాముడితో, ‘‘అన్నా, నీవు నా తల్లిని సంతోష పెట్టటానికి రాజ్య త్యాగం చేసి వనవాసం వెళ్ళావు. ఈ రాజ్యాన్ని నా కిచ్చావు. నా వద్ద ఇల్లడగా ఉన్న రాజ్యాన్ని నీవు తిరిగి తీసుకో. దీన్ని నీవు కోరకుండానే తొందరపడి ఎందు కిచ్చేస్తున్నా నంటావేమో, ఈ రాజ్య భారం వహించటానికి నీ కున్న దార్ఢ్యం నాకు లేదు. హంసతో సమంగా కాకి ఎలా ఎగురుతుంది? మన తండ్రి పుత్రకామేష్ఠి చేసి నిన్ను ఎందుకు కన్నాడో ఆ ప్రయోజనం తీరాలంటే నీవీ రాజ్య భారం వహించాలి, మమ్మల్నందరినీ పాలించాలి,’’ అన్నాడు.

భరతుడు చెప్పిన మాటలకు రాముడు సమ్మతించాడు. ముందు భరతుడూ, తరవాత లక్ష్మణుడూ, సుగ్రీవుడూ, విభీషణుడూ మంగళ స్నానాలు చేశారు. రాముడి జుట్టు చిక్కుతీసి సరిచేశారు, శరీరానికి లేపనాలు పూశారు, మాలలు ధరింపజేశారు. పీతాంబరం కట్టించారు. అతను సింహాసనం పైన కూర్చున్నాడు. దశరథుడి భార్యలు సీతను చక్కగా అలంకరించారు. కౌసల్య వానర భార్య లందరికీ అలంకారాలు చేయించింది.

సుమంత్రుడు ఉత్తమాశ్వాలు పూన్చిన రథం తెచ్చాడు. రాముడందులో ఎక్కి కూర్చున్నాడు. రథం అయోధ్య కేసి బయలుదేరింది. సుగ్రీవ హనుమంతులు స్నానాలు చేసి, మంచి బట్టలు ధరించి, కుండలాలు ధరించి బయలుదేరారు. సీత సుగ్రీవుడి భార్యలతో కలిసి బయలుదేరింది. దశరథుడి మంత్రులు వశిష్ఠుడితో సహా ముందుగానే అయోధ్యకు వెళ్ళి పట్టాభిషేకం ఏర్పాట్లు ప్రారంభించారు. తరవాత మంత్రులు రాముడి కెదురు వచ్చారు. రాము డెక్కిన రథానికి కట్టిన గుర్రాలు పచ్చనివి. భరతుడు సారథిగా కూర్చున్నాడు. శత్రుఘ్నుడు ఛత్రం పట్టాడు. లక్ష్మణుడు వింజామర పట్టాడు. విభీషణుడు మరొక వింజామర పట్టాడు.

సుగ్రీవుడు శత్రుంజయమనే మదగజాన్ని ఎక్కాడు. రాముడి వెంబడి శంకాలూదారు. భేరీభాంకారాలూ, జనుల కోలాహలమూ మిన్ను ముట్టాయి. రాముడు అయోధ్య ప్రవేశించే సరికి ప్రతి ఇంటి మీదా జెండా ఎగిరింది. అతను తిన్నగా దశరథుడి ఇంటికి వెళ్ళి, సుగ్రీవుడికి విడిది చూపమని భరతుడితో చెప్పాడు. సుగ్రీవుడు విడిది చేరుతూనే నాలుగు సువర్ణ కలశాలను నలుగురు వానరోత్తముల కిచ్చి, మర్నాడు తెల్లవారే లోపుగా వాటితో సముద్రజలం తీసుకు రమ్మన్నాడు. వాళ్ళా కలశాలు తీసుకుని ఆకాశ మార్గాన బయలుదేరి వెళ్ళారు. అలా వెళ్ళిన వారు జాంబవంతుడూ, హనుమంతుడూ, వేగదర్శీ, ఋషభుడూనూ.

తరవాత రామపట్టాభిషేకం జరిగింది. సీతారాములను రత్నపీఠం పైన కూర్చుండబెట్టారు. వసిష్ఠుడూ, వామదేవుడూ, జాబాలీ, కాశ్యపుడూ, కాత్యాయనుడూ, సుయజ్ఞుడూ,గౌతముడూ, విజయుడూ అనే ఎనిమిది మంది మహర్షులూ రాముడికి అభిషేకం చేశారు. వారి అనంతరం బ్రాహ్మణులూ, కన్యలూ, మంత్రులూ, పౌరులూ, యోధులూ రాముణ్ణి అభిషేకించారు.

శత్రుఘ్నుడు రాముడికి ఛత్రం పట్టాడు. సుగ్రీవ విభీషణులు వింజామరలు పట్టారు. దేవేంద్రుడు వాయుదేవుడి ద్వారా నూరు కమలాలతో కూడిన బంగారు హారాన్నీ, నవరత్న హారాన్నీ పంపాడు. గురు, జన, పరివార సమేతుడైన రాముడు నిండు సభలో ఉజ్వలంగా ప్రకాశించాడు. రాముడు బ్రాహ్మణులకు లక్ష గుర్రాలనూ, దూడలు గల లక్ష ఆవులనూ, నూరు ఆబోతులనూ దానం చేశాడు; ముప్పై కోట్ల బంగారు నాణాలనూ, వస్త్రాలనూ, నగలనూ దానం చేశాడు, సుగ్రీవుడి కొక దివ్యమైన కాంచనమాలను బహూకరించాడు. సీత కొక ముత్యాల హారం ఇచ్చాడు. సీత హనుమంతుడికి రెండు బట్టలు పెట్టి, అందమైన నగలిచ్చింది.

రాముడు సీతకు ఒక ముత్యాల హారం ఇచ్చి, ‘‘నీకు ఎక్కువ సంతోషం కలిగించిన వాడికి ఇచ్చెయ్యి,’’ అన్నాడు. సీత దాన్ని హనుమంతుడి కిచ్చింది. హనుమంతుడు దాన్ని వెంటనే మెడలో వేసుకున్నాడు. రాముడు ఇతర వానర ప్రముఖులకూ, విభీషణుడికీ యథోచితమైన కానుకలిచ్చాడు. పట్టాభిషేకం ముగియగానే రాముడి వద్ద సెలవు తీసుకుని వానరులూ, విభీషణుడూ తిరిగి వెళ్ళిపోయారు.

రాముడు రాజ్య భారం సగం లక్ష్మణుడిపైన ఉంచి, భరతుణ్ణి యువరాజుగా అభిషేకించి కీర్తివంతంగా రాజ్యం చేశాడు. అతను నూరు అశ్వమేధాలు చేశాడు. రాముడి పరిపాలనలో ప్రజలకు ఎలాంటి ఈతి బాధలూ లేవు, అకాల మరణాలు లేవు. రామరాజ్యం అంటే ఆదర్శవంతమైన రాజ్యం అనే అర్థం ఏర్పడింది.

                                          [యుద్ధకాండ సమాప్తం]

No comments:

Post a Comment