Friday, September 7, 2012

రామాయణం - యుద్దకాండ 4


సేతువు నిర్మించమని రాముడు ఆనతి ఇవ్వగానే లక్షల సంఖ్యలో వానరులు అరణ్యాలకు పోయి, సాలవృక్షాలనూ, అశోక వృక్షాలనూ, బిల్వ వృక్షాలనూ, మామిడి చెట్లనూ, ఇంకా అనేక రకాల చెట్లనూ పీకి తెచ్చి సముద్రం పైన వేశారు. తాటి, కొబ్బరి, తుమ్మ, పొగడ మొదలైన చెట్లను కూడా తెచ్చి సముద్రం మీద విసిరి వేశారు.

ఏనుగులంతేసి కొండరాళ్ళను యంత్ర సహాయంతో చేర్చారు. సేతువు సమంగా ఉండేటట్టు చూడటానికి కొందరు తాళ్ళు పట్టుకున్నారు, కొందరు కర్ర బద్దలు పట్టుకున్నారు, కొందరు కర్ర హెచ్చు తగ్గులు పరీక్షించారు. ఈ విధంగా వానరులు పది ఆమడలు వెడల్పూ, నూరు ఆమడలు నిడివీ గల సేతువును నిర్మించారు.

నళుడి ఆధ్వర్యంలో వారు మొదటి రోజు పధ్నాలుగామడలూ, రెండవ రోజు  ఇరవై ఆమడలూ, మూడో రోజు ఇరవై ఒక్క ఆమడలూ, నాలుగో రోజు ఇరవై రెండామడలూ, అయిదో రోజు ఇరవై మూడామడలూ సేతువు నిర్మించి, అయిదు రోజులలోగా సువేలపర్వతాన్ని చేరుకున్నారు. వానరులు సంతోషంతో గెంతుతూ, అరుస్తూ, కోట్ల సంఖ్యలో సముద్రాన్ని సేతువు మీదుగా దాటి సముద్రపు దక్షిణ తీరాన్ని చేరుకున్నారు.

విభీషణుడొక గద తీసుకుని, శత్రువు లెవరైనా వస్తే హతమార్చటానికి సిద్ధంగా తన మంత్రులతో ఆ దక్షిణతీరాన నిలబడి ఉన్నాడు.  రామలక్ష్మణులను హనుమంతుడూ, అంగదుడూ భుజాల మీద ఎత్తుకుని వారధి దాటించారు. అక్కడ అందరూ రాముడికి  వేరువేరుగా మంగళాభిషేకం చేశారు. వారతన్ని శత్రువులందరినీ సంహరించి, చిరకాలం భూమండలమంతా ఏలవలసిందని మంగళవాక్యాలతో ఆశీర్వదించారు.

రాముడు లక్ష్మణుడితో, ‘‘ మనం ఆలస్యం చెయ్యరాదు. వెంటనే లంకకు బయలుదేరి పోదాం,’’ అన్నాడు. రాముడు ధనుర్ధారి అయి ముందు నడుస్తూంటే వానరసేన వెనకగా  కదిలింది. విభీషణ, సుగ్రీవాది ప్రముఖులు సింహనాదాలు చేస్తూ కదిలారు.

ఇక్కడ వానర సేన విడియగానే లంకలో నుంచి భేరి మృదంగ ధ్వనులు భయంకరంగా వినవచ్చాయి. వాటిని విని వానరులు అంతకన్న గట్టిగా సింహనాదాలు చేశారు. ఆ ధ్వనిని లంకలోని రాక్షసులు విన్నారు.

రకరకాల ధ్వజాలతోనూ, పతాకలతోనూ కూడి ఉన్న లంకానగరాన్ని చూసి రాముడు, ‘‘ఇక్కడనే గదా సీత జింకపిల్ల లాగా రావణుడి నిర్బంధంలో ఉన్నది !’’ అని దిగులుగా అనుకుని, లక్ష్మణుడితో,‘‘ఆ త్రికూట పర్వతం మీద విశ్వకర్మ నిర్మించిన లంకా నగరాన్ని చూడు. అనేక పెద్ద భవనాలతో ఇది తెల్లని మబ్బులుగల ఆకాశంలాగున్నది. మంచి మంచి సుందర వనాలతో అందంగానూ, రకరకాల పక్షుల కూతలతో ఎంతో ఆహ్లాదకరంగానూ ఉన్నది,’’ అన్నాడు.

తరవాత రాముడు వానర సేనను గరుడ వ్యూహంలో అమర్చి, దానికి ముందు తానూ, లక్ష్మణుడూ ఉండేట్టూ, అంగదుడు నీలుడితో బాటు తన సేనతో సహా హృదయ స్థానంలో ఉండేటట్టూ, బుషభుడు తన సేనతో కుడిపక్కా, గంధమాదనుడు ఎడమ పక్కా ఉండేటట్టూ,  జాంబవంతుడూ, సుషేణుడూ, వేగదర్శి కడుపుస్థానంలో ఉండే విధంగా, సుగ్రీవుడు వెనుక భాగాన్ని రక్షించేట్టూ ఏర్పాటు చేశాడు.

వ్యూహం ఏర్పాటు కాగానే రాముడి ఆజ్ఞపై సుగ్రీవుడు శుకుణ్ణి బంధవిముక్తుణ్ణి చేశాడు. వాడు అక్కడ క్షణమైనా ఉండక రావణుడి దగ్గిరికి వెళ్ళాడు. రావణుడు వాణ్ణి చూసి,  ‘‘ఎవరో నీ రెక్కలు విరిచినట్టున్నారు. నువ్వు కోతులకు చిక్క లేదు కద?’’ అన్నాడు. ‘‘నేను సముద్రం దాటి వెళ్ళి, సుగ్రీవుణ్ణి చూసి, తమరు చెప్పమన్నట్టుగానే చెప్పాను. ఆ వానరులు నన్ను చూసి మండిపడి, ఆకాశంలోకి ఎగిరి నన్ను పట్టుకుని, నానా హింసలూ పెట్టి, చంపటానికి సిద్ధపడ్డారు.

 వాళ్ళు అమిత కోప స్వభావులూ, క్రూరులూనూ. వాళ్ళతో మాట్లాడటమే కష్టం, ఇంక జవాబు చెప్పించటం ఎట్లా? రాముడు లంకాద్వీపానికి చేరాడు. సముద్రానికి సేతువు నిర్మించి లంకాద్వారం దాకా వచ్చాడు. వానర సేనలు ఇసుక వేస్తే రాలకుండా ఉన్నాయి. వెంటనే సీతను రాముడి కిచ్చెయ్యటమో, యుద్ధానికి సిద్ధం కావటమో, ఏదో ఒకటి చెయ్యాలి, ’’ అన్నాడు శుకుడు.

రావణుడు శుకుడితో తాను యుద్ధానికే నిశ్చయించుకున్నట్టు చెప్పి, వానర సేన  వివరాలన్నీ రహస్యంగా తెలుసుకు రమ్మని శుకసారణులను పంపాడు. వారు వానర రూపాలు ధరించి వానరసేన ప్రవేశించారు.

వాళ్ళకు వానర సేన అంతు చిక్కలేదు. పర్వత శిఖరాల మీదా, పర్వతాల మధ్యా, అరణ్యాలలో, సముద్రతీరానా, వనాలలో, ఉద్యానాలలో ఎక్కడ చూసినా వారికి వానర సేన కనిపించింది. ఆ సేనలో ఒక భాగం ఇంకా సేతువు దాటుతూనే ఉన్నది !

ఇంతలో శుకసారణుల మాయా రూపాలను విభీషణుడు పోల్చుకుని, వారిని పట్టుకుని రాముడితో, ‘‘వీళ్ళు శుకసారణులనేవారు. రావణుడి మంత్రులు. మన రహస్యాలు తెలుసుకు పోవటానికి లంక నుంచి వచ్చారు,’’ అని చెప్పాడు. రావణుడు పంపగా వానర సేనను గురించి తెలుసుకోవటానికి వచ్చినట్టు శుక సారణులు ఒప్పుకున్నారు.
రాముడు నవ్వుతూ, ‘‘ఇకనేం? సైన్యమంతా  చూసుకోండి. మమ్మల్ని చూడండి.

 చూడవలసినదంతా చూశాక స్వేచ్ఛగా లంకకు వెళ్ళిపొండి,’’ అని వారితో అన్నాడు. వాళ్ళు నిరాయుధులు కనక వారిని చంపనని కూడా అతనన్నాడు. అతను రావణుడితో తన మాటలుగా ఇలా చెప్పమన్నాడు: ‘‘నువ్వు ఏ ధైర్యంతో నా భార్య సీతను అపహరించావో ఆ ధైర్యాన్ని ఇప్పుడు ప్రదర్శించు. రేపు తెల్లవారుతూనే లంకా ప్రాకారాన్నీ, ద్వారాలనూ, నీ రాక్షస సైన్యాన్నీ నా బాణాలతో నుగ్గు చెయ్యబోతున్నాను. జాగ్రత్త!’’ శుకసారణులు లంకకు తిరిగి వెళ్ళి రావణుడితో, ‘‘రాజా, మేము వానర సేనలో ప్రవేశించి విభీషణుడికి పట్టుబడ్డాం. అయితే ధర్మా త్ముడైన రాముడు మమ్మల్ని విడిచి పెట్టాడు.

 వానర సేనకు రాముడూ, లక్ష్మణుడూ, విభీషణుడూ, సుగ్రీవుడూ చాలు-వారు పరాక్రమంలో దేవేంద్రుడికి తీసిపోరు. రాముడి రూపమూ, ఆయుధాలూ చూస్తే అతనొక్కడే చాలు, లక్ష్మణ విభీషణ సుగ్రీవులెందు కనిపిస్తుంది. ఇక వానర వీరులు యుద్ధోత్సాహులై, ఎప్పుడా అన్నట్టున్నారు.  అందుచేత వాళ్ళతో  విరోధం పెట్టుకోవటం కన్న వెంటనే సీతను రాముడి కిచ్చెయ్యటం మంచిది,’’  అన్నారు.

ఈ మాటలు విని రావణుడు సారణుడితో, ‘‘అన్ని లోకాలూ ఒక్క పెట్టున నా పైకి ఎత్తివచ్చి భయపెట్టినా నేను సీతను పోని వ్వను. నువ్వు మెత్తని వాడవు కావటం చేత వానరుల దెబ్బలకు బెదిరిపోయి సీత నిచ్చెయ్యమంటున్నావు,’’ అని, శుకసారణులను వెంటబెట్టుకుని మంచు కొండలాటి తెల్లని తన భవనం పైకి ఎక్కి, అక్కడినుంచి కనిపించే పర్వతాలూ, వనాలూ, సమస్తమూ వానర సేనతో నిండి ఉండటం గమనించాడు.

అతను సారణుడి కేసి తిరిగి,‘‘వానరులలో అగ్రనాయకు లెవరు? ముఖ్యులెవరు?’’ అని అడిగాడు.  ‘‘లంక కేసి తిరిగి సింహనాదం చేస్తున్న ఆ వానరుడు నీలుడు; వానర సేనా నాయకుడు, చేతులు పైకెత్తి నిలబడి, తోకను నేల కేసి కొట్టుతున్న వాడు  అంగదుడు; సుగ్రీవుడి చేత యువరాజుగా అభిషేకం చేయించుకున్నవాడు; వాలి కొడుకు. హనుమంతుడు లంకకు వచ్చి సీతను చూసిన వాడే.

అంగదుడికి వెనకగా ఉన్నవాడు నళుడు; అతనే సముద్రానికి సేతువు కట్టినది! సైనికులను సర్దుతూ, ఉత్సాహ పరుస్తూ తిరిగే ఆ తెల్లని వానరుడు హుశ్వేతుడు. అడుగో, అతను కుముదుడు, చాలా తీవ్రస్వభావం గలవాడు, భయంకరుడు. ఆ వానరుడు రంభుడు. ఆ ఆవులించే వాడు శరభుడు; అని చెబుతూ సారణుడు రావణుడికి ఒక్కొక్క వానర ప్రముఖుణ్ణీ పరిచయం చేశాడు. సారణుడు చెప్పేది పూర్తి అయ్యాక, శుకుడు మరి కొందరు శత్రు ప్రముఖుల గురించీ, వారి ఘనతను గురించీ రావణుడికి వివరించి చెప్పాడు.

తన మంత్రులు శత్రువీరులను ఆవిధంగా తెగ పొగడటం విని రావణుడికి ఆగ్రహం కలిగింది. అతను వారితో,‘‘నా ఉప్పు తిని బతికే వాళ్ళు నాకు అప్రియంగా ఇలా మాట్లాడవచ్చా? ఒక వంక యుద్ధం జరగబోతుండగా శత్రువుల నిలా పొగడవచ్చా? పెద్దల దగ్గిర మీరేం నేర్చుకున్నట్టు? మీరు చదివిన నీతి శాస్తమ్రంతా ఏమైనట్టు? మిమ్మల్ని చంపెయ్యవలిసిందే, కాని మీరు లోగడ చేసిన మేలుతలచి మిమ్మల్ని విడిచి పెట్టేస్తున్నాను. అదే మీకు మృత్యువుతో సమానం,’’ అన్నాడు.

ఈ మాటలకు సిగ్గుపడి, శుకసారణులు రావణుడికి జయం పలికి వెళ్ళిపోయారు. రావణుడు మహోదరుడనే వాణ్ణి పంపి వేగులవాళ్ళను పిలిపించి వారితో, ‘‘మీరు రాముడి వద్దకు వెళ్ళి, అతని ప్రయత్నాలేవో, అతని అంతరంగికులెవరో తెలుసుకోండి. రాముడు ఎప్పుడు పడుకుంటాడో, ఎప్పుడు మేలుకుంటాడో, ఏంచేస్తాడో, సమస్తమూ తెలుసుకురండి. మీరు తెలుసుకు వచ్చే విషయాలు యుద్ధంలో మనం సులువుగా గెలవటానికి సహాయం కావాలి,’’ అన్నాడు.

ఆ చారులు శార్దూలుడనే వాణ్ణి వెంట బెట్టుకుని, మారు రూపాలతో, సువేల పర్వత సమీపంలో రామ లక్ష్మణులున్న చోటికి చేరుకున్నారు. రామలక్ష్మణులనూ, వానర సేననూ చూడగానే వారికి భయం వేసింది.

విభీషణుడు వాళ్ళను పోల్చనే పోల్చాడు. వారిలో శార్దూలుడు మరీ దుష్టుడు. విభీషణుడు చారులను పట్టుకుని, శార్దూలుణ్ణి వానరులకు అప్పగించాడు. వానరులు వాణ్ణి చంపబోతుంటే రాముడు అడ్డుపడి, శార్దూలుణ్ణీ, మిగిలిన చారులనూ కూడా విడిపించాడు. వారు లంకకు తిరిగి వెళ్ళి, రాముడు సేనతో సహా సువేల పర్వతప్రాంతంలో ఉన్నాడని రావణుడికి చెప్పారు.

రావణుడు శార్దూలుణ్ణి చూసి, ‘‘నీముఖం అలా వాడి ఉన్నదేమిటి? శత్రువులు నిన్నేమీ చెయ్యలేదు గద?’’ అని అడిగాడు.  శార్దూలుడు రావణుడితో, ‘‘ఆ వానరుల మీద వేగు చెయ్యటం చాలా కష్టం. నేను వానర సేనలో ప్రవేశించానో లేదో, నన్ను పట్టుకున్నారు. విభీషణుడి మంత్రులు నన్ను హూనం చేసేశారు. ఆ తరవాత వానరులు నన్ను పొడిచి, కరిచి, కొట్టి చాలా విధాల బాధించారు. నేను రక్తంకారి, స్పృహ తప్పి, చావటానికి సిద్ధంగా ఉండగా రాముడు నన్ను దయతలచి కాపాడాడు. అతను త్వరలోనే లంకను ముట్టడించనున్నాడు. ఇచ్చావా సీతను ఇచ్చెయ్యి, లేదా యుద్ధానికి సిద్ధంకా!’’ అన్నాడు.

రావణుడు శార్దూలుడి చేత కూడ వానర ప్రముఖులను గురించి చెప్పించుకుని, తన మంత్రులను పిలిపించి వారితో కార్యాలోచన చేశాడు. అతను కర్తవ్యం నిర్ణయించుకుని, మంత్రులను పంపేసి, మాయలలో ఆరి తేరిన విద్యుజ్జిహ్వుణ్ణి వెంటబెట్టుకుని, సీత వద్దకు బయలుదేరాడు. అతను విద్యుజ్జిహ్వుడితో, ‘‘మనం మాయ చేత సీతను మోసపుచ్చాలి. నువ్వు మాయ చేత రాముడి తలను కల్పించి, ధనుర్బాణాలతో సహా దాన్ని తీసుకుని నావెంట రా,’’ అన్నాడు.

విద్యుజ్జిహ్వుడందుకు సమ్మతించి, రావణుడు బహుమానంగా ఇచ్చిన ఆభరణాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. రావణుడు అశోకవనంలో రాక్షస స్త్రీల మధ్య ఉన్న సీత వద్దకు బయలుదేరి వెళ్ళాడు.

No comments:

Post a Comment