Friday, September 7, 2012

రామాయణం - బాలకాండ 3


తాటకను సంహరించి, మారీచ సుబాహులను కొట్టి, విశ్వామిత్రుడి యాగాన్ని నిర్విఘ్నంగా కొనసాగించిన నాటి రాత్రి రామ లక్ష్మణులు హాయిగా నిద్రపోయి వేకువతోనేలేచారు. వారు కాలకృతాలు తీర్చుకుని,విశ్వామిత్రుడూ ఇతర మునులూ ఉండేచోటికి వెళ్ళి, వారందరికీ నమస్కారాలు చేసి, విశ్వామిత్రు డితో, "మహామునీ, మీ ఆజ్ఞ నిర్వర్తించాము. ఇంకా చెయ్యవలిసిన పనులేవైనా ఉంటే సెలవియ్యండి," అని అడిగారు వినయంగా.

అప్పుడు మునులు రామలక్ష్మణులతో ఇలా చెప్పారు: "మిధిలానగరాన్ని పాలించే జనక మహారాజు ఒక గొప్పయాగం చెయ్యబోతున్నాడు. మేమంతా బయలుదేరి అక్కడికి వెళుతున్నాము. ఒకప్పుడా జనక మహారాజు ఒక యాగం చేసి దానికి ఫలితంగా దేవతల నుంచి ఒక అద్భుతమైన ధనుస్సు సంపాదించాడు. దేదీప్య మానంగా వెలిగిపోయే ఆ ధనుస్సును ఆ మహారాజు తన ఇంట ఉంచుకుని రోజూ సుగంధధూప దీపాలతో అర్చిస్తూఉంటాడు. ఆ ధనుస్సును దేవతలుగాని, రాక్షసులుగాని ఎక్కుపెట్టలేరంటే ఇక మనుషుల మాట చెప్పాలా? మహా బలశాలులైన రాజులూ, రాజకుమారులూ ఎందరో ప్రయత్నించి కూడా దాన్ని ఎక్కుపెట్టలేక పోయారు. కొందరయితే అసలు కదిలించలేక పోయారు. మీరు కూడా వచ్చినట్లయితే జనక మహారాజు చేసే యాగాన్నీ, ఆ అద్భుదమైన ధనుస్సునూ చూడగలుగుతారు."

అప్పుడే ప్రయాణ సన్నాహాలు జరిగాయి. విశ్వామిత్రుడు వనపాలకులతో, "నేను మిగిలిన మునులందరినీ వెంట బెట్టుకుని ఇప్పుడే బయలుదేరి గంగానదికి ఉత్తరంగా హిమాలయాలకేసి వెళుతున్నాను," అని చెప్పి, సిద్దాశ్రమానికి మూడుసార్లు ప్రదక్షిణంచేసి తిరిగి వచ్చాడు.


తరవాత మునులందరూ రామలక్ష్మణులతో ఉత్తరాభిముఖులైబయలుదేరారు. వారి వెనుక కొన్నివందల బండ్లమీద సమిధలూ, ఇంధనా లూ మొదలైన అగ్ని సాధనాలువచ్చాయి. వారు పగలల్లా చాలా దూరం నడిచి అస్తమయ వేళకు శోణానదీ తీరాన్ని చేరుకున్నారు.అక్కడ వారంతా స్నానసంధ్యానుష్ఠానాలన్నీ తీర్చు కున్నాక రామలక్ష్మణులు విశ్వామిత్రుడికి ఎదురుగా కూర్చుని, "స్వామీ, ఎటువైపుచూ సినా అందమైన వనాలుగల ఈ దేశం ఏదీ? దీని వృత్తాంతమేమిటి?" అని అడిగారు ఎంతో వినయంగా.

ఆ ప్రశ్నకు సమాధానంగా విశ్వామిత్రుడు ఆ దేశం గురించీ, తన వంశం గురించీ ఇలా చెప్పాడు: "పూర్వం బ్రహ్మయొక్క కుమారుడు కుశుడనే మహాతపస్వి ఉండేవాడు. ఆయన వైదర్భి అనే ఒక రాజకుమారైను పెళ్ళాడి, ఆవిడకు నలుగురు కుమారులను-కుశాంబుడు కుశనాభుడు, ఆధూర్తరజసుడు, వసువు అనేవారిని-కన్నాడు. ఆయన క్షత్రియధర్మాన్ని పెంపొందించగోరి తన నలుగురు కొడుకులనూ భూమిని పంచుకుని, న్యాయంగా ప్రజా పరిపాలన చేయవలిసిందిగా ఆజ్ఞాపించాడు. వారు కూడా ఆ విధంగానే నాలుగు గొప్ప నగరాలను తమ రాజధానులుగా చేసుకుని రాజ్యపాలన చేశారు.

కుశాంబుడి రాజధాని కౌశాంబి; కుశనాభుడి రాజధాని పేరు మహొదయం; ఆధూర్తరజసుడు ధర్మరణ్యమనే పట్టణన్ని రాజధాని చేసుకున్నాడు; వసువు అనేవాడు గిరివ్రజం రాజధానిగా పెట్టుకుని పాలించాడు. మనం ఇప్పుడున్నది ఆయన పాలించిన అందమైన వనాలుగల దేశంలోనే. "ఈ దేశంచుట్టూ అయిదు అందమైన పర్వతాలున్నాయి. ఈ శోణానది ఆ పర్వతాలలోనే పుట్టి ఈ ప్రదేశాన్ని సారవంతంగానూ, సస్యశ్యామలంగానూ చేస్తున్నది. ఇది తూర్పున పుట్టి పడమరకు ప్రవహీంచే నది.


కుశుడి కుమారులలో కుశనాభుడనే వాడో కడని చెప్పానుగద. ఆయనకు ఘృతాచి అనే భార్య ఉండేది. వారిద్దరికీ నూరుమంది ఆడ పిల్లలు కలిగారు. వారంతా చక్కని చుక్కలు. ఒకనాడు ఆ నూరుమంది కన్యలూ ఆడుతూ, పాడుతూ ఉల్లాసంగా వనవిహారం చేస్తూండగా వాయుదేవుడు వారిని చూసి తనను పెళ్ళాడ మని కోరుతూ, అలా చేసినట్టయితే వారిని ముసలితనమూ, చావూ లేని దేవతలుగా చేస్తానన్నాడు. కాని ఆ కన్యలు వాయుదేవుణ్ణి తిట్టి, తమ తండ్రి నిర్ణయించిన భర్తను తప్ప చేసుకోమన్నారు. వాయుదేవుడికి ఆగ్రహం వచ్చి వారందరినీ మరుగుజ్జులుగా చేసేశాడు. అప్పుడా కన్యలు ఏడుస్తూ తండ్రి దగ్గిరికి వెళ్ళి జరిగినదంతా చెప్పుకు న్నారు. "తన కుమార్తెలు ప్రదర్శించిన ఐకమత్యమూ, వంశాభిమానమూ చూసి కుశనాభుడు ఎంతగానో సంతోషించాడు.

వారిని ఇక పెళ్ళిలేకుండా ఉంచటం అంత క్షేమం కాదనుకుని ఆయన, కాంపి ల్యపురాన్ని పాలించే బ్రహ్మదత్తుడనే రాజుకు తన కుమార్తెలందరినీ ఇచ్చి పెళ్ళిచేశాడు. బ్రహ్మదత్తుడు తాకగానే వారందరికీ మరుగుజ్జుతనం పోయింది. కూతుళ్ళ కందరికీ పెళ్ళిచేశాక కుశనాభుడు కొడుకునుకోరి పుత్రకామేష్టి చేశాడు. ఆయనకు గాధి అనే ధర్మాత్ముడైన కొడుకు కలిగాడు. ఆ గాధి రాజు కొడుకునే నేను.

నాకు సత్యవతి అనే అక్క ఒకామె ఉండేది. ఆమెను ఋచీకుడి కిచ్చి చేశారు. ఆవిడ మహా పతివ్రత. మేము కుసుశికవంశం వాళ్ళం గనక మమ్మల్ని కౌశికులని కూడా అంటారు. మా అక్కపేరుతో కౌశికి అనేనది ఏర్పడింది. మా అక్కపైగల అభిమనం కొద్దీ నేను హిమవత్ర్పాంతంలో కౌశికీ నదీ తీరానే ఉంటున్నాను. అయితే యాగం నిమిత్తమై సిద్ధాశ్రమానికి వచ్చానన్న మాట. మన కబుర్లతో అప్పుడే సగం రాత్రి గడిచిపొయింది. రామా, ఇక మీరిద్దరూ పడుకుని నిద్రపొండి!" ప్రయాణపు బడలిక మూలాన రామ లక్ష్మణులు ఆ రాత్రి గాఢ నిద్రపోయి, తెల్లవారి విశ్వామిత్రుడు లేపినదాకా లేవలేదు. అప్పుడు వారు కాలకృత్యలు తీర్చుకుని శోణానదిని అందరూ దాటే రేపులో దాటారు. అది ఆటే లోతైన నదికాదు; ఇసుకతిన్నెలతో చాలా అందంగా ఉన్నది.


 వారా నదిని దాటి మళ్ళీ నడక సాగించి మధ్యా హ్నం వేళకు గంగాతీరాన్ని చేరుకున్నారు. పవిత్రమైన గంగను చూడగానే అందరికీ అంతు లేని ఆనందం కలిగింది. అక్కడవారు స్నానం చేసి, దేవతర్పణలూ, పితృతర్పణలూ చేసుకుని, హొమం చేసి, భోజనాలు పూర్తిచేసుకుని గంగా తీరాన విశ్వామిత్రుడి చుట్టూ కూచున్నారు. అప్పుడా మహర్షి వారందరికీ గంగ వృత్తాంతం ఇలా చెప్పాడు:
హిమవంతుడనే పర్వతరాజుకు గంగ, ఉమ అని ఇద్దరు కుమార్తెలు. వారిలో పెద్దదైన గంగను దేవతలు పర్వతరాజును బతిమాలి స్వర్గానికి తీసుకుపోయారు. ఉమను పరమశివుడు పెళ్ళి చేసుకున్నాడు. కాలక్రమాన సగర చక్రవర్తి మనమడికి మనమడైన భగీరధుడు గంగను అతి ప్రయాసతో స్వర్గం నుంచి భూమికి తెచ్చి, భూమి నుంచి పాతాళానికి కూడా తీసుకుపోయాడు.

విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు గంగావతరణకధా, కుమారస్వామి జన్మవృత్తాంతమూ సవిస్తరంగా చెప్పాడు. ఆ రాత్రి వారందరూ గంగయొక్క దక్షిణపు గట్టున గడిపి, మర్నాడు తెల్లవారగానే దర్భాసనాలు పరిచిన పడవలలో ఉత్తరపు గట్టుకు చేరుకున్నారు. అక్కడ వారికి విశాలానగరం కనిపించింది. ఆ నగరాన్ని చాలాసేపు చూసినాక రాముడు విశ్వామిత్రుణ్ణి, "మహామునీ, ఈ నగరాన్ని పాలిస్తున్నది ఏ వంశపు రాజులు? వారి కధ ఏమిటి?" అని అడిగాడు.

ఆప్రశ్నకు సమాధానంగా విశ్వామిత్రుడు, దేవదానవులు క్షీరసాగరాన్ని మధించటమూ, అందులో పుట్టిన హాలాహలాన్ని శివుడు మింగటమూ, అమృతం పుట్టగా దానికోసం దేవదానవులు పోట్లాడుకుంటూంటే విష్ణువు మోహిని రూపంలో వచ్చి అమృతాన్ని హరించి, తనను ఎదిరించిన వారినందరినీ చంపి, తనను శరణు జోచ్చిన వారిని కాపాడటమూ మొదలైన విషయాలన్ని వివరంగా చెప్పి, ఇలా అన్నాడు:తన కొడుకులందరూ ఇంద్రుడి చేతిలో చనిపోయేసరికి దితి తన భర్త అయిన కశ్యపుడి వద్దకు వెళ్ళి, ఇంద్రుణ్ణి చంపగల కొడుకు తనకు కలిగేటట్టు వరమి య్యవలిసిందని వేడుకున్నది. "నీవు వెయ్యి సంవత్సరాలు నిష్ఠతో, ఎలాటిమై లకూడా సోకకుండా, తపస్సు చేసినట్టయితే, ఇంద్రుణ్ణి చంపి, ముల్లోకాలూ ఏలగల కొడుకు కలుగుతాడు," అని కశ్యపుడు దితికి వరమిచ్చాడు.దితి సంతోషించి కుశప్లవనమనే చోట చేరి కఠోరమైన తపస్సు ప్రారంభించింది.


 ఇంద్రుడు ఆమె వద్దకు వచ్చి ఎంతో భక్తితో ఆమెకు సేవలు చేస్తూ, నీరూ, సమిధలూ, దర్భలూ, కందమూల ఫలాలూ తెచ్చి ఇస్తూ వచ్చాడు. తొమ్మిది వందల తొంబై సంవత్సరాలు గడిచాయి. ఇంకా పదేళ్ళు గడిస్తే దితి గర్బం నుంచి ఇంద్రుణ్ణి చంపగలవాడుబయటికి వస్తాడు. ఒకనాటి మధ్యాన్నం ఈ సంగతి దితి ఇంద్రుడితో చెప్పి, "నాయనా, నాకు విసురుతున్నావు, కాళ్ళు పిసుకుతున్నవు. అందుచేత నాకు పుట్టే కొడుకు నీతో సఖ్యంగా ఉండేటట్లు నేను చూస్తాలే!" అన్నది. అలా అంటూ ఆమె తలను కాళ్ళు పెట్టవలిసిన చోట ఉంచి పక్క మీద పడుకుని నిద్రపోయింది.

ఈ విధంగా ఆమెకు మైలసోకింది. ఇలాటి అవకాశం కోసమే వేచివున్న ఇంద్రుడు వెంటనే అమె గర్భంలో ప్రవేశించి, పిండాన్ని తన వజ్రాయుధంతో ఏడు ముక్కలుగా నరికాడు. వారే దేవతా సమానులైన సప్తమారుతాలు.
"రామా, ఆ సమయంలో దితి తపస్సు చేసుకుంటూ ఉంటే ఇంద్రుడు ఈ ప్రదేశంలోనే ఆమెకు సేవలుచేశాడు. అటు తరవాత ఇక్ష్వాకు మహారాజుకు విశాలుడనే కుమారుడు కలిగాడు. అతనే ఈ మహానగరాన్ని నిర్మించాడు. అందుకే దీనికి విశాలా నగరమనే పేరువచ్చింది. ఇప్పుడీ నగరాన్ని వారి వంశానికి చెందిన సుమతి అనేవాడు పాలిస్తున్నాడు," అనివిశ్వాత్రుడు రాముడితో అన్నాడు.

ఈలోపల సుమతి కూడా విశ్వామిత్రాదుల రాక తెలిసి బంధు మంత్రి పురోహి తులు మొదలైనవారితో ఎదురువచ్చి స్వాగతం చెప్పాడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను సుమతికి పరిచయం చేశాడు. వారందరూ ఆ రాత్రికి సుమ తి అతిధులుగా ఉండి, తెల్లవారగానే మిధిలానగరానికి ప్రయాణమయ్యరు.


వారు మిధిలను చేరవచ్చే సమయంలో దారిలో ఒక పాడుబడిన ఆశ్రమం కనబడింది. ఆ ఆశ్రమం అందంగా ఉన్నప్పటికీ అందులో జనసంచారం లేకపో వటానికి కారణమేమిటని రాముడు అడిగాడు. "నాయనా,ఒకప్పుడీ ఆశ్రమంలో గౌతమ మహాముని తన భార్య అయిన అహల్యతో కూడా సాటిలేని తపస్సు చేసాడు. ఆయనకు ఆగ్రహం తెప్పించి ఆయన తపశ్శక్తి నిర్మూలించాలనే ఉద్దేశంతో, ఇంద్రుడు గౌతముడుస్నానానికిగాను నదికి వెళ్ళి ఉన్న సమ యంలో గౌతముడి రూపం ధరించి అహల్య వద్దకు వచ్చాడు. అహల్య అతన్ని తన భర్తే అనిపొరబడింది.

తిరిగి వెళుతూన్న ఇంద్రుడికి గౌతముడు తడిబట్టలతో ఎదురై, ఇంద్రుడికి శాపమిచ్చి, ఆశ్రమానికి వచ్చి తన భార్యను కూడా శపించాడు. ఆ శాపం ఫలితంగా ఆమెగాలి తప్ప మరొక ఆహారం లేక, ఎవరికీ కనబడకుండా ఈ ఆశ్రమంలో తపస్సమాధిలో ఉండిపోయింది. నిన్ను చూడగానే ఆమెకు శాపవిమోచనం కలిగేలాగు గౌతముడు అనుగ్రహించాడు గనక, మనం ఈ ఆశ్రమం ప్రవేశించి, ఆ అహల్య అందరికీ తిరిగి కనబడేలాగు చేద్దాం," అన్నాడు విశ్వామిత్రుడు. వారు లోపలికి వెళ్ళేసరికి రాముడి కళ్ళకు సూర్యుడి కాంతితో వెలిగిపోతూ, దేవతను బోలిన అందంగల అహల్య కనిపించింది.

ఆమె రాముణ్ణి చూడగానే ఆమెను మిగిలినవారు కూడా చూడగలిగారు. రామలక్ష్మణులు వంగి ఆమె కాళ్ళుతాకి నమస్కరించారు. తన భర్త చెప్పిన మాటలు జ్ఞాపకం తెచ్చుకుని అహల్య రామలక్ష్మణుల కాళ్ళుతాకి, వారికి అర్ఘ్యపాద్యాలిచ్చింది. ఆ సమయానికే గౌతముడు కూడా తిరిగి వచ్చాడు. విశ్వామిత్రుడు అక్కడి నుంచి బయలుదేరి, రామలక్ష్మణులను వెంటబెట్టుకుని మిధాలినగరం ప్రవేశించాడు.






No comments:

Post a Comment