Friday, September 7, 2012

రామాయణం - యుద్దకాండ 8


కుంభకర్ణుణ్ణి గురించి విభీషణుడు రాముడితో ఇంకా ఈ విధంగా చెప్పాడు:

కుంభకర్ణుడు పుడుతూనే ఆకలివేసి మనుషులను వేల సంఖ్యలో తినసాగాడు. ప్రజలు బెదిరిపోయి ఇంద్రుణ్ణి శరణు జొచ్చారు.

ఇంద్రుడు ప్రజలను వెంటబెట్టుకుని బ్రహ్మ దగ్గిరికి వెళ్ళి, కుంభకర్ణుడు ప్రజలను తింటున్నాడనీ, దేవతలను అవమానిస్తున్నాడనీ, ఆశ్రమాలను ధ్వంసం చేస్తున్నాడనీ, పరస్ర్తీలను హరిస్తున్నాడనీ బ్రహ్మతో చెప్పాడు.

బ్రహ్మ రాక్షసులనందరినీ పిలిపించి, వారిలో కుంభకర్ణుణ్ణి చూశాడు. ఆయన కుంభకర్ణుడితో, ‘‘విశ్రవసుడు నిన్ను కన్నది ప్రజాక్షయం చెయ్యటానికిలాగా ఉందేమిరా! ఇది మొదలు నువ్వు ఒళ్ళు తెలియకుండా పడి నిద్రపోతూ ఉండు,’’ అన్నాడు. కుంభకర్ణుడు బ్రహ్మ ఎదటనే నిద్రముంచుకొచ్చి పడిపోయూడు.

అది చూసి రావణుడు, ‘‘తాతా, నీ మునిమనమణ్ణి ఇలా శపించటం అన్యాయం. వీడి నిద్రకూ, మెలకువకూ నిర్దిష్ట కాలనియమం తగిన ఏర్పాటు చెయ్యి,’’ అన్నాడు. ‘‘వీడు ఆరు మాసాల పాటు నిద్రపోయి ఒకరోజు మేలుకుని ఉంటాడు,’’ అన్నాడు బ్రహ్మ. విభీషణుడు రాముడికి ఈ విషయాలు చెప్పి, ‘‘రామా, నీ దెబ్బకు రావణుడు బెదిరిపోయి నిద్రపోతున్న కుంభకర్ణుణ్ణి లేపాడు. అతణ్ణి చూస్తేనే బెదిరి పారిపోయే వానరులు అతనికి యుద్ధంలో ఎదురునిల్చి ఏం పోరాడగలరు? అందుచేత వానరులతో మనం ఇదొక నడిచే యంత్రమని చెప్పాలి,’’ అని సూచించాడు.


ఈలోపల కుంభకర్ణుడు రావణుడి ఇంటికి వెళ్ళి, పుష్పకంలో విచారంగా కూర్చుని ఉన్న తన అన్నను చూశాడు. కుంభకర్ణుణ్ణి చూడగానే రావణుడు సంతోషంతో లేచి వెళ్ళి కౌగిలించుకున్నాడు. కుంభకర్ణుడు అన్నగారి పాదాలకు నమస్కరించి, ‘‘నన్ను నిద్రలేపిన కారణమేమిటి? ఏం భయం వచ్చి పడింది? ఎవరికి చావు మూడింది?’’ అని అడిగాడు.
‘‘నువ్వు చాలా కాలంగా సుఖ నిద్రలో మునిగి ఉన్నందున, రాముడు నాకు తెచ్చిపెట్టిన భయం గురించి నీకు తెలీదు.

రాముడు సుగ్రీవుడి సేనతో సహా సముద్రాన్ని దాటివచ్చి మన అంతు కనుక్కుంటున్నాడు. లంకలో ఉండే వనాలూ, ఉపవనాలూ చూడు; అన్నీ వానరమయం. మన రాక్షస ముఖ్యులనందరినీ వానరులు చంపేస్తున్నారు. వానర ముఖ్యులు మన చేతిలో చావటం కనబడదు. నువ్వు మహాబలుడివి, ఈ ఆపద నుంచి కాపాడుతావని నిద్రలేపాం,’’ అని రావణుడు కుంభకర్ణుడితో అన్నాడు. కుంభకర్ణుడు నవ్వాడు.

‘‘వెనక ఈ విషయం చర్చించుకున్నప్పుడు నీ హితం కోరినవారు ఏ ప్రమాదం వస్తుందని చెప్పారో అదే వచ్చిందన్నమాట! ముందువెనకలు ఆలోచించుకోకుండా బలగర్వంతో సీతను అపహరించి తెచ్చావు. మన తమ్ముడు విభీషణుడు చెప్పినట్టు చెయ్యి,’’ అన్నాడు.

రావణుడీ మాటలు విని అలిగి, ‘‘నువ్వు చిన్నవాడివి; నేను పెద్దవాణ్ణి. నాకు నువ్వు బుద్ధులు చెప్పటం వట్టి కంఠశోష. జరిగిపోయినదాన్ని గురించి ఇప్పుడు చర్చ దేనికి? ప్రస్తుత కర్తవ్యం ఆలోచించు. నేను చేసిన తప్పును నీ శౌర్యంతో సరిదిద్దు,’’ అన్నాడు.

రావణుడికి కోపం వచ్చిందని గ్రహించి కుంభకర్ణుడు మృదువుగానూ, ఊరడింపుగానూ ఇలా అన్నాడు: ‘‘బాధపడకు! కోప్పడకు! నీకు తమ్ముణ్ణి, హితుణ్ణి కనక నీకు చెప్పవలసిన మాట చెప్పాను. యుద్ధంలో రామలక్ష్మణులను చంపేసి నీ కోరిక తీరుస్తాను. రాముడి తల తెచ్చి నీ ముందు పెట్టి నిన్ను సంతోషపెడతాను. నేను బతికి ఉండగా నీకు రాముడి భయం ఎందుకుంటుంది? నన్ను యుద్ధానికి పంపించు. నాకసలు ఆయుధాలతో పనిలేదు, ఉత్త చేతులతోనే ఎంతటి యోధులనైనా చంపెయ్యగలను.’’


 కుంభకర్ణుడి ఈ మాటలు విని మహోదరుడు మండిపడి, ‘‘నువ్వు మొరటు మనిషివి, అల్పబుద్ధివి, అహంకారివి! రావణుడు చెయ్యగూడని పని ఎందుకు చేస్తాడు? చెడ్డపని చేసినందువల్ల దుష్ఫలితం కలిగినట్టు చెప్పావే, అలా అనటానికి ప్రమాణమేమిటి? మంచి పనుల వల్ల దుఃఖమూ, చెడ్డ పనులవల్ల సుఖమూ కలగటం లేదా? సీతను అపహరించాలని రావణుడికి కోరిక పుట్టింది. ఆ కోరికను మేము కూడా బలపరిచాం. అది అలా ఉంచు. నువ్వొక్కడవే యుద్ధానికి పోతానంటున్నావే! జనస్థానంలో అంత మంది రాక్షస వీరులను చంపిన రాముణ్ణి నువ్వొక్కడవే చంపగలవా?’’ అన్నాడు.

తానూ, ద్విజిహ్వుడూ, సంహ్రాదీ, కుంభకర్ణుడూ, వితర్దనుడూ అనే ఐదుగురూ వెళ్ళి రాముణ్ణి చంపాలని మహోదరుడు సూచించాడు. రాముడు చచ్చాడా సరేసరి, ఒక వేళ అతను చావకపోయినా ఈ ఐదుగురూ యుద్ధరంగంలో తిన్న గాయాలతో, రక్త ప్రవాహాలతో తిరిగి వచ్చి, రావణుడితో, ‘‘మేము రామలక్ష్మణులను తినేశాం!’’ అని చెబుతారు. అప్పుడు రావణుడు సీతను ఓదార్చి, ధనకనక వస్తువాహనాలిచ్చి ఆమె మనసును వశ్యం చేసుకుంటాడు. రావణుడు యుద్ధానికి వెళ్ళి రాముణ్ణి ఎదుర్కోవలిసిన పని లేకుండానే సీత అతని వశమవుతుంది! ఇదీ మహోదరుడు చెప్పిన ఉపాయం.

అంతా విని కుంభకర్ణుడు, ‘‘ఇలాంటి మాటలెన్నడూ చెప్పకు. ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకో!’’ అని మహోదరుణ్ణి హెచ్చరించాడు. అతడివంటి వాళ్ళ సలహాలు వినే రావణుడికి ఈ గతి పట్టిందన్నాడు. రావణుడు గట్టిగా నవ్వి, ‘‘మహోదరుడికి రాముడంటే భయంలే! అందుచేత యుద్ధానికి పోవద్దంటున్నాడు. నువ్వెళ్ళి యుద్ధం చేసి జయించిరా. వెళ్ళి, రామలక్ష్మణులనూ, వానరులనూ భక్షించు,’’ అన్నాడు.

కుంభకర్ణుడు ఒక అపూర్వమైన శూలాన్ని తీసుకున్నాడు. అది బోలెడంత ఇనుము ఉపయోగించి చేసినది, బంగారు అలంకారాలు గలది, ఎర్రని పూలమాలికలు చుట్టినది, ఇంద్రుడి వజ్రాయుధానికి తీసిపోనిది. ఆ శూలం మాత్రం తీసుకుని, తాను ఒక్కడే యుద్ధానికి పోతాననీ, తనకు సహాయంగా సేన అవసరంలేదనీ కుంభకర్ణుడు చెప్పాడు.


రావణుడు అతనితో సైన్యాన్నీ ఆయుధాలనూ తీసుకుపొమ్మనీ, యుద్ధంలో ఏమరుపాటుగా ఉన్నవాడికీ, ఒంటరిగాడికీ ప్రమాదం హెచ్చనీ అన్నాడు. అతను తన తమ్ముడి మెడలో రత్నఖచితమైన బంగారుహారం వేశాడు,  ఆభరణాలు పెట్టాడు. మంచి సువాసన గల పుష్పమాలలు వేశాడు. చెవులకు కుండలాలు పెట్టాడు, ఎంతో బరువైన బంగారు కవచం తొడిగాడు.

కుంభకర్ణుడు అన్నను ఆప్యాయంగా కౌగిలించుకుని, అతని చుట్టూ ప్రదక్షిణం చేసి, భక్తితో సాష్టాంగ నమస్కారం చేసి ఆవేశంతో యుద్ధానికి బయలుదేరాడు. అతని వెనకగా మహాబలశాలులైన రాక్షస వీరులూ, పెద్దసేనా ఆయుధాలు ధరించి బయలుదేరారు. కుంభకర్ణుణ్ణి చూసి పారిపోతున్న వానరవీరులలో నలుడూ, నీలుడూ, గవాక్షుడూ, కుముదుడూ లాంటి వానర ముఖ్యులున్నారు.

అంగదుడు వారిని చూసి, ‘‘మీరు మీ ఆత్మగౌరవాన్నీ, పరాక్రమాన్నీ కూడా మరిచి, చచ్చుకోతుల్లాగా బెదిరిపోయి ఎక్కడి కలా పారిపోతున్నారు? ఆ వచ్చేది యుద్ధం చేసే రాక్షసుడు కాదు, విభీషిక -భయం పుట్టించే బొమ్మ. వెనక్కు రండి, ఈ వెరబొమ్మను ధ్వంసం చేద్దాం,’’ అన్నాడు. ఆ మాటలతో ధైర్యం తెచ్చుకుని వానరులు వెనక్కు తిరిగివచ్చి కుంభకర్ణుడిపై తలపడ్డారు. వాళ్ళు తనపై విసిరిన కొండరాళ్ళకూ, చెట్లకూ కుంభకర్ణుడేమాత్రమూ చలించ లేదు. వానరులను నిర్మూలించసాగాడు.

ఆ దెబ్బతో వానరులు పరుగు లంకించుకున్నారు. కొందరు ఆకాశంలోకి ఎగిరారు. కొందరు వెళ్ళి సముద్రంలో పడ్డారు.   భల్లూకాలు కొందరు చెట్లలోనూ, మరికొందరు కొండలలోనూ దాక్కున్నారు. కొందరు చచ్చినట్టు కదలకుండా పడుకున్నారు. ‘‘ఆగండి! ఆగండి! వెనక్కు రండి!’’ అని అంగదుడు కేకపెట్టి వానరులను పిలిచాడు.

యోధులైనవాళ్ళు శత్రువును చంపి కీర్తి గడించటమో, శత్రువు చేతిలో చచ్చి బ్రహ్మలోకానికి పోవటమో చెయ్యాలిగాని, ప్రాణాలు కాపాడుకోవడానికి పిరికిపందల్లాగా పారిపోరాదనీ, కుంభకర్ణుడికి రాముడి చేతిలో నిశ్చయంగా చావు మూడిందనీ అతను వానరులతో అన్నాడు. కాని వాళ్ళు, ‘‘కుంభకర్ణుడు మమ్మల్ని దారుణంగా చంపేస్తున్నాడు. మేము పోతాం. మాకు ప్రాణాలు దక్కితే చాలు,’’ అని, కుంభకర్ణుడు వస్తూండటం చూసి పారిపోయారు.

 అయితే అలా పారిపోయే వానరులను అంగదుడూ, హనుమంతుడూ కలిసి మంచి మాటలతో నచ్చచెప్పి ఎలాగో వెనక్కు మరలించగలిగారు. తరవాత హనుమంతుడు పన్నెండు మంది వానరయోధులను వెంటబెట్టుకుని యుద్ధానికి బయలుదేరాడు.

వీరంతా ఏకంగా చేసిన యుద్ధంలో అనేక మంది రాక్షసులు చచ్చారు, రథాలు నుగ్గయ్యాయి, ఏనుగులూ, గుర్రాలూ, ఒంటెలూ చచ్చాయి. హనుమంతుడు గాలిలోకి ఎగిరి కుంభకర్ణుడి పైన కొండరాళ్ళ వర్షం కురిపించాడు, వృక్షాలు వేశాడు. కుంభకర్ణుడు వాటినన్నిటినీ తన శూలంతో పక్కకు నెట్టేశాడు. కుంభకర్ణుడు వానరులను తరుముతూ పోతూంటే హనుమంతుడొక పర్వతశిఖరం పట్టుకుని అతనికి అడ్డంగా నిలబడ్డాడు. దాన్ని పెట్టి హనుమంతుడు కొట్టేసరికి కుంభకర్ణుడికి తలపగిలి, శరీరం రక్తంతో తడిసింది. వెంటనే కుంభకర్ణుడు తన శూలంతో రొమ్ములో పొడిచే సరికి, హనుమంతుడు నోట నెత్తురు కక్కుతూ మూర్ఛపోయాడు. హనుమంతుడు పడగానే మళ్ళీ పారిపోసాగిన వానరులను నీలుడు నిలిపివేసి, కుంభకర్ణుడిపై ఒక పెద్ద కొండరాయి వేశాడు. కుంభకర్ణుడు దాన్ని పిడికిలితో పొడిచి చూర్ణం చేశాడు.

అది చూసి అనేక వేలమంది వానరులు కుంభకర్ణుడిపైన వచ్చి పడ్డారు. కుంభకర్ణుడు వాళ్ళను పట్టుకుని తినసాగాడు. వానరులలో హాహాకారాలు చెలరేగాయి.

అంగదుడు కుంభకర్ణుడి తలపైన పెద్ద కొండరాయి వేసి కొట్టాడు. కుంభకర్ణుడు మండిపడి శూలం విసిరితే అంగదుడు ఉపాయంగా తప్పించుకుని, చప్పున కుంభకర్ణుణ్ణి సమీపించి, రొమ్ముల్లో అదిరేటట్టుగా కొట్టాడు. ఆ దెబ్బకు కుంభకర్ణుడికి మూర్ఛ వచ్చింది. వెంటనే స్పృహ తెచ్చుకుని కుంభకర్ణుడు అంగదుణ్ణి ఎడమచేతి పిడికిలితో పొడిచి మూర్ఛ పోగొట్టి, శూలాన్ని ఎత్తుకుని సుగ్రీవుడి పైకి వెళ్ళాడు.

 కుంభకర్ణుడు తన శూలాన్ని గిరగిరా తిప్పి సుగ్రీవుడిపైన విసిరాడు. అంతలో హనుమంతుడు వచ్చి మధ్య దారిలో దాన్ని పట్టుకుని, రెండు చేతులా పట్టి విరిచి పారేశాడు.

శూలం పోయేసరికి కుంభకర్ణుడు కోపించి ఒక రాయి విసిరి సుగ్రీవుణ్ణి మూర్ఛపోగొట్టాడు. మూర్ఛలో ఉన్న సుగ్రీవుణ్ణి కుంభకర్ణుడు పట్టుకుని ఎత్తుకుపోయాడు. సుగ్రీవుణ్ణి కాజేస్తే వానరసేనా, రామలక్ష్మణులూ నిర్వీర్యులయిపోతారని అతని ఉద్దేశం. అతను సుగ్రీవుణ్ణి తీసుకుని లంకకు వెళ్ళిపోయాడు. కుంభకర్ణుణ్ణి ఎదిరించి సుగ్రీవుణ్ణి విడిపించుదామా అని హనుమంతుడొక క్షణం పాటు ఆలోచించి, చివరకు అలా చేయటం అనవసరమని తేల్చుకున్నాడు. ఎందుచేతనంటే, స్పృహ తెలిసిన మరుక్షణం అతను తనను తానే విడిపించుకోగలడు.

లంకా పౌరులు కుంభకర్ణుడిపై చల్లిన సుగంధ జలాలతో సుగ్రీవుడికి స్పృహ వచ్చింది. తానిప్పుడు ఏవిధమైన ప్రతిక్రియ చేస్తే బాగుంటుందా అని అతను ఆలోచించాడు. చివరకతను తన గోళ్ళతో కుంభకర్ణుడి చెవులు గిల్లి, ముక్కూ, చెంపలూ కొరికేశాడు. కుంభకర్ణుడు అలిగి సుగ్రీవుణ్ణి నేలకేసి కొట్టి తొక్కాడు. అయినా సుగ్రీవుడు లక్ష్యపెట్టక వాయువేగంతో గాలిలోకి లేచి రాముడున్న చోట వాలాడు.




No comments:

Post a Comment