Friday, September 7, 2012

రామాయణం - అయోధ్యాకాండ 2


"రాముణ్ణి అడవులని నెట్టి భరతుడికి రాజ్యాభిషేకం జరిగే ఉపాయం నేను చెబుతాను విను. విని నేను చెప్పినట్టు నడుచుకో. ఒకప్పుడు దెవాసుర యుద్దంలో ఇంద్రుడికి నీ భర్త సహాయం వెళ్ళాడు. ఆయన వెంట నీవూ వెళ్ళావు. దండకారణ్యాలలో మత్స్యధ్యజుడేలే వైజయంతం వద్ద శంబరుడనే మహా బలశాలి అయిన అసురుడితో నీ భర్త గొప్పగా యుద్దంచేసి గాయపడి మూర్ఛిల్లాడు. అప్పుడాయనను నీవు యుద్ధరంగం నుంచి దూరంగా తీసుకుపోయి, ఆయన ప్రాణాలు కాపాడావు. స్పృహ తెలిసినాక ఆయన నీ సేవకు సంతోషించి, నీకు రెండు వరాలిచ్చాడు. కాని వాటిని నీవు తరవాత కోరుకుంటానన్నావు. ఆ సంఘటన జ్ఞాపకం ఉన్నదికదా. చూశావా? ఇప్పుడా రెండు వరాలూ కోరుకునే సమయం వచ్చింది.

రాముణ్ణి పద్నాలుగేళ్ళు అడవులకు పంపమనీ, భరతుడికి పట్టభిషేకం చెయ్యమనీ నీవిప్పుడు నీ భర్తను కోరు!" అని మంధర కైకేయికి హితవు చెప్పింది. కైకేయి, పాపం, సహజంగా మంచి స్వభావం కలదేగాని, మంధర చేసిన బోధనతో ఆమె మనస్సు పెడదారి పడింది. ఆ మంధర తన తలలో ఒక చెడ్డ భావం ప్రవేశపెట్టడంతో బాటు ఆ ఆలోచన సానుకూలమయ్యే ఉపాయం కూడా చెప్పింది.

కైకేయి మంధరను, "నిజంగా నీ వెంత తెలివిగల దాననే! నామేలు నీవు కోరినట్టుగా మరెవరూ కోరరు గదా!" అని ప్రశంసించింది. ఆమె మంధర సలహాతో తన నగలన్నీ తీసివేసి, చిరిగిన కోక ఒకటి చుట్టుకుని, కోపగృహానికి వెళ్ళి, కటిక నేల మీద అలిగిన దానిలాగా పడుకున్నది.


 "నీ భర్త నిన్ను చూడవచ్చినప్పుడు కంటికీ మంటికీ ఏకధారగా ఏడువు. నీ కోపంగాని, నీ శోకంగాని రాజు కొంచెమైనా భరించలేడు. వాటిని పోగొట్టటానికి ఆయన తన ప్రాణాలనైనా ఇస్తాడు. నేను చెప్పిన రెండు వరాలూ ఇచ్చినదాకా నీవు మెత్తబడకు! నీకు మణులూ, మాణిక్యాలూ, ముత్యాలూ, బంగారమూ ఇస్తానంటాడు. అక్కలేదని బెట్టు చెయ్యి. బాగా ఆలోచించులకో, భరతుడు పధ్నాలుగేళ్ళు రాజ్యపాలన చేసినాక అతన్ని ఎవరూ రాజ్యాధికారం నుంచి కదిలిందలేరు," అన్నది మంధర. "ఆ శంబరాసురుడి కన్న నీ కెక్కువ తంత్రాలు తెలుసు గదే!" అని కైకేయి మంధరను మెచ్చుకున్నది. తన భర్త తనకు వరాలివ్వని పక్షంలొ చచ్చిపో వటానికి కూడా అమె నిశ్చయించుకున్నది.

దశరథుడు రామ పట్టాభిషేక యత్నాలకాజ్ఞ ఇచ్చి, ఈ శుభవార్త కైకెయికి తానే స్వయంగా తెలిపే ఉద్దేశంతో కైకేయి శయన గృహానికి వచ్చి, అక్కడ ఆమె లేకపోవటం చూసి ఆశ్చర్యపడి, "కైకేయీ, ఎక్కడునావు?" అని పిలిచాడు. జవాబు లేదు. ఆయన అంతఃపుర ద్వారం దగ్గిరికి వచ్చి అక్కడి ద్వారపా లికను, "కైకేయి ఎక్కడ?" అని అడిగాడు. ద్వారపలిక భయంతో చేతులు జోడించి, "ప్రభూ,వారు కోపగృహంలో ఉన్నారు, అని చెప్పింది. దశరథుడు కలవరపడుతూ కోపగృహానికి వెళ్ళి, అక్కడ నేలపై పడుకుని ఉన్నకైకేయిని చూశాడు.

లక్షవరహాల విలువచేసే ముత్యాల హారాలూ, ఇతర ఆభరణాలూ నేలపై చెల్లా చెదురుగా పడి ఉండి, ఆకాశంలో నక్షత్రాల లాగా మెరుస్తునాయి. దశరథుడు కైకేయిని సమీపించి ఎంతో ప్రేమతో ఆమెను బుజ్జగిస్తూ, "దేవీ, నీ కెందుకిలా కోపం వచ్చింది? ఎవరుమీద? ఎవరన్నా నిన్ను తిట్టారా? అవమానించారా? ఒంట్లో సరిగా లేదా? వైద్యులను పెలిపించనా? ఎందు కేడుస్తావు? ఊరుకో! కావాలంటే నీ ఇష్టం వచ్చిన వాళ్ళను దండిస్తాను! నిర్దోషులైన సరే! నీ కోసం ఏ దరిత్రుణ్ణి అయినా ధనికుణ్ణి చేస్తాను. నీకు నాతో బాటు మిగిలిన వారంతా విధేయులై ఉండగా ఈ దుఃఖం దేనికి ? నీ కోరిక ఏమిటో చెప్పు ; నాప్రాణాలు ఒడ్డి అయినా సరే, ఆ కోరిక తీరుస్తాను! లే, కైకేయీ, లే!" అన్నాడు.


 ఈ మాటలు విని కైకేయి, "నాకెవరూ అపకారం చెయ్యలేదు, అవమా నమూ చెయ్యలేదు. నా కొక కోరిక ఉన్నది. దానిని మీరు తీరుస్తానని ప్రమాణం చేసేటట్టయితే చెబుతాను," అన్నది. దశరథుడీ మాటలకు చిరునవ్వు నవ్వి, కైకేయి జట్టు చేతితో నిమురుతూ, తన ప్రాణంతో సమానమైన రాముడిపైన ఒట్టుపెట్టుకుని, ఆమె కోరిక తీర్చటానికి ప్రమాణం చేశాడు.

అప్పుడు కైకేయి దశరథుడికి శంబరాసురుడితో జరిగిన యుద్దాన్నీ, మూర్ఛి తుడై ఉన్న సమయంలో తాను ఆయనను రక్షించి దూరంగా తీసుకుపోయి పరిచర్యలు చేసిన విషయాన్నీ, ఆ సమయంలో ఆయన రెండు వరాలిస్తాను కోరమంటే తాను తరవాత కోరుకుంటానన్న సంగతీ జ్ఞాపకం చేసింది. తరవాత ఆ వరాలు రెండూ బయట పెట్టింది: రాముడికి జరగబోతున్న పట్టాభిషేకాన్ని భరతుడికి చెయ్యాలి, రాముడు నారబట్టలనూ, కృష్ణాజినాన్నీ, జడలనూ, మునివేషాన్నీ ధరించి పధ్నాలుగేళ్ళు దండకారణ్యంలో నివసించాలి! ఈ మాటలు వింటుంటే దశరథుడి కెదో భయం పుట్టుకొచ్చింది, స్పృహతప్పి నట్టయింది. కాళ్ళూ, చేతులూ వణికాయి. బాధతో నిట్టూర్పులు విడుస్తూ, ఆయన కైకేయిని నానాతిట్లూ తిట్టాడు.

"నీవు రాజకుమార్తె వనుకుని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను. కాని నీవు విషం కక్కేపామువు. నిన్ను తల్లిగా చూసుకుంటాడు గదా, ఆ రాముడికి ఇంత ద్రోహం ఎలా తలపెట్తావు? నేను నీకేం చేశాను? ఏమహాపాతకం చేశాడని రాముణ్ణి అడవికి పంపను? నా ప్రాణాలనైనా వదలగలను గాని రాముణ్ణి చూడకుండా బతకలేనే! ఈ దిక్కు మాలిన ఆలోచన మనుకో! నీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను కరుణించి ఈ వరం అడగకు. భరతుడంటే నాకు ప్రేమ లేదేమోనని పరీక్ష చెయ్యటానికి ఇలా అని ఉంటావు. రాముడు చేసిన సేవలో నూరోవంతు కూడా భరతుడు నీకు చెయ్యలేదు. నీకు రాముడి కంటె భరతుడెక్కువ అంటే నేను నమ్మను. నీ మాటలతో నన్ను చాలా బాధపె ట్టావు. చూడూ, నేను ముసలివాణ్ణి. కాటికి కాళ్ళు చాచుకొని ఉన్నాను. కావలిస్తే భూమండలమంతా తీసుకో. కాని రాముడిపై మాత్రం ఆగ్రహించకు. నీకు చేతులు జోడించి నమస్కారం చేస్తాను," అని కైకేయిని దశరథుడు ఎంతో సేపు వేడుకున్నాడు.


దశరథుడు ఇల దిగజారిపోతున్న కొద్దీ కైకేయికి అగ్రహం రెచ్చింది. మొదట వరాలిస్తాననీ, కోరిక తీరుస్తాననీ ప్రమాణాలు చేసి ఇప్పుడు దశరథుడు బేలగా మాట్లాడటం రాజకులానికే కళంకమని ఆమె అన్నది. తన వరాలను ఉప సంహరించుకోననీ, రాముడి పట్టాభిషేకం జరిగే పక్షంలో తాను చచ్చిపో తాననీ అన్నది. దశరథుడు మానసిక వేదనతో దహీంచుకుపోయాడు. ఎటువంటి విషమపరిస్థితి ! "నాయనా, అడవికి పోరా!" అని రాముడితో ఎలా చెప్పటం? కైకేయి కోరిక ప్రకారం రామపట్టాభిషేకం మానేస్తే ఇతర రాజులంతా, "పట్టాభి షేకం చాలా బాగా చెశారే ?" అని హేళన చెయ్యారూ? కౌసల్య ముఖం ఎలా చూడటం? ఆయన తనలో తాను దుఃఖించాడు, కైకేయిని తిట్టాడు, బతిమాలాడు, మధ్య మధ్య మూర్ఛపోయాడు. ఆ రాత్రి ఆయనకు భయంక రమైన కాలరాత్రి లాగా గడిచి తెల్లవారింది.

వసిష్ఠుడు తన శిష్యులతో సహా రాచనగరుకు వచ్చి, దశరథుడి అంతఃపుర వాకిలి దగ్గిర సుమంత్రుడెదురుకాగా, తాను వచ్చిన సంగతి రాజుగారికి చెప్పమన్నాడు. పట్టాభిషేకం ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాయనీ, రాజుగారు కదిలిరావటమే వ్యవధి అనీ వసిష్ఠుడు చెప్పగా సుమంత్రుడు స్వేచ్చగా అంతఃపురం ప్రవేశించాడు. సుమంత్రుడు వృద్దుడు కావటంచెతా, రాజుగారికి ఆబల్య మిత్రుడు గనకా, ఆయనను ఎవరూ అడ్డరు. ఆయన తిన్నగా రాజుగారున్న చోటికి వెళ్ళి, రాజుగారి మనస్థితి ఊహించక, ఆయన నిద్రపోతు న్నాడనుకుని, "మహారాజా, లేవండి సూర్యోదయం కూడా అయింది. రామపట్టభిషేకం జరిపించటానికి అందరూ తమ రాక కోసం చాలాసేపుగా ఎదురు చూస్తున్నారు," అని చెప్పాడు. దశరథుడు శోకంతో వాచి ఎర్రగా ఉన్న కళ్ళతో సుమంత్రుణ్ణి చూసి, "సుమంత్రా, నన్ను నీ మాటలతో ఇంకా ఎందుకు దుఃఖపెడతావు?" అన్నాడు.

దశరథుడు దుఃఖంలో ఉన్నాడని తెలియగానే సుమంత్రుడు చెతులు జోడించి, రెండడుగులు వెనక్కు వేశాడు. దశరథుడు సుమంత్రుడితో మాట్లాడేస్థితిలో లేనందున కైకేయి, "సుమంత్రుడా, తెల్లవార్లూ మహారాజుకు రామపట్టభి షేకమన్న ఆనందంతో నిద్రలేదు . ఇప్పుడే కాస్తా కునుకు పట్టింది. నీవు వెళ్ళి రాముణ్ణి పిలుచుకురా. ఇదే రాజుగారి అజ్ఞ అనుకో," అన్నది.


 "రాముడు ఇక్కడికి వచ్చి పట్టభిషేకం చెసుకుంటాడు కాబోలు !" అనుకుంటూ సుమంత్రుడు అక్కడి నుంచి కదిలాడు. నగరమంతా ఉత్సవం లాగా కోలాహ లంగా ఉన్నది. రాజసభ జనంతో కిక్కిరిసి ఉన్నది. రాజులందరూ కానుకలు తెచ్చారు. వారు తమలోతాము, "రాజుగారు కనిపించరు. మనం వచ్చిన సంగతి వరికెలా తెలియడం ?" అనుకుంటున్నారు. సుమంత్రుడు మర్యాదగా వారిని పలకరించి, "తామంతా వచ్చిన సంగతి నేను మహారాజు గారికి తెలియజేస్తాను. వారి దగ్గిరికి రాముణ్ణి తీసుకుపోతున్నాను," అని చెప్పాడు. ఆయన మళ్ళీ వెనక్కు తిరిగి దశరథుడి అంతఃపురానికి వెళ్ళి, దశరథుడు పడుకుని ఉన్న చోటికిచేరి, "మహారాజా, విజయీభవ. రాత్రిగడిచి, తెల్లవారి, సూర్యోదయంకూడా అయింది. మీ కోసం బ్రహ్మణులూ సేనాపటులూ, పట్టణంలోని పెద్దలూ ఎదురు చూస్తున్నారు. నిద్రమెలుకుని జరగవలసిన కర్మకాండ జరిపించండి," అన్నాడు.

"రాముణ్ణి తీసుకు రమ్మని కైకేయి నీతో చెప్పనే? తీసుకురాకుండా ఎందుకు వచ్చావు? ఆమె అజ్ఞ నా ఆజ్ఞకాదా? నేను నిద్రపోవటం లేదు. మేలుకునే ఉన్నాను. వేగిరం రాముణ్ణి తీసుకురా!" అన్నాడు దశరథుడు.

సుమంత్రుడు చిత్తమని చెప్పి, రాజుకు నమస్కారంచేసి, "ఏదో గొప్ప ఏర్పటే జరగబోతున్నది!" అని తనలో తాను సంతోషపటుతూ, రాజవీథి వెంట జనం ఉత్సాహంగా పట్టాభిషేకం గురించి అనుకునే మాటలు వింటూ రాముడుండే నగరుకు రథం తోలుకుని వచ్చాడు. అక్కడ జనం గుంపులు గుంపులుగా చేరి ఉన్నారు.

రాముడి అంతఃపురం చుట్టూ ఏనుగులూ, గుర్రాలూ, సైనికులూ, మంత్రులూ కిటకిట లాడుతున్నారు. సుమంత్రుడు వారి నందరినీ తోసుకుంటూ వెళ్ళి, రాముడుండే ఏడంతస్తులమేడ ప్రవేశించాడు. తాను వచ్చినట్టు రాముడికి కబురు పంపి, అతని అనుమతితో రాముడుండే చోటికి వెళ్ళాడు. రాముడు చక్కగా అలంకరించుకుని బంగారు చక్కీపై కూచుని ఉన్నాడు. సీత పక్కనే నిలబడి వింజామర వీస్తున్నది. సుమంత్రుడు అతన్ని సమిపించి, నమస్క రించి, "తండ్రిగారు కైకేయి అంతఃపురంలో ఉన్నారు. నిన్ను చూడాలంటు న్నారు," అని చెప్పాడు. ఈ మాటలువిని రాముడు ఆనందంతో పొంగిపో యాడు. అతను సీతను లోపలికి పంపి, పట్టాభిషేకానికి చేసిన అలంకారా లన్నిటితోనూ సుమంత్రుడి వెంట బయలుదేరాడు.

రాముడు పులితోలు పరిచిన రథం ఎక్కికూచోగానే, లక్ష్మణుడుకూడా వెనకగా ఎక్కి, ఒక చేత్తో అన్నగారికి ఛత్రం పట్టి, రెండవ చేత్తో చామరం వీచాడు. రాముడి వెనకగా గుర్రాలూ, ఏనుగులూ ఎక్కెన రౌతులూ, కోలాహలంగా వేలకొద్దీ జనమూ నడిచారు. రాముడి రథం దశరథుడి నగరు ప్రవేశించి, మూడు ప్రాకరాలు దాటి నిలిచి పోయింది. తన వెంట వచ్చిన బలగమూ, ప్రజలూ అక్కడ నిలిచిపోగా, రాముడు కాలినడకను మరి రెండు ప్రాకారాలు దాటి దశరథుడి అంతఃపురం ప్రవేశిందాడు.

ఒక అందమైన ఆసనంపైన దశరథుడూ, కైకేయి కూచుని ఉన్నారు. రాముడు తండ్రి కాళ్ళకు, తరవాత కైకేయి కాళ్ళకూ నమస్కరించాడు. "రామా," అంటూ ఏదో చెప్పబోయి, దశరథుడు గొంతు పెగలక, కళ్ళు మూత పడి, కన్నీరు కారుస్తూ దుఃఖంతో వివశుడయ్యాడు.





No comments:

Post a Comment