Saturday, September 14, 2013

మోక్షం సిద్ధించాలంటే...?

భక్తి, జ్ఞానం ఒకటి కావు. భక్తికి పై మెట్టు జ్ఞానం. మనం భక్తి దగ్గరే ఆగిపోతున్నాం. మన కోరికలు తీరిస్తే భగవంతుడు మనల్ని అనుగ్రహించాడని సంబరపడతాం. తీరకుంటే ఖర్మ అనుకుని బాధపడతాం. భక్తి భావం నిజంగా చాలా గొప్పదే. మనలో భక్తిభావం కలిగిందీ అంటే ఆధ్యాత్మికమార్గంలో పయనిస్తున్నట్టే. కేవలం భగవంతుడిని కొలవడానికే ఆ భక్తి పరిమితం కాకూడదు. భగవదారాధన భక్తి వరకే పరిమితమైతే దైవత్వంలో ఇమిడి ఉన్న విశిష్టత తెలుసుకోలేము. దైవం ఏం చెప్పిందో గ్రహించలేము. భక్తి ముక్తిదాయకమైనది అయితే దానికి పైనున్న మెట్టే జ్ఞానం. ఆత్మజ్ఞానం సాధించిన మనిషి ఋషి అవుతాడు.

ఆత్మజ్ఞానం అంటే ఏమిటో కాదు. మనగురించి మనం తెలుసుకోవడమే! మనలోని శక్తుల్ని సాధన మార్గం వైపు మళ్ళించుకోవటమే. ఈ జ్ఞానం కలగడానికి భగవంతుడిని సాధనగా చేసుకోవాలి. భగవంతుని రూపలావణ్యాలను మాత్రమే కాక ఆయనచుట్టూ అలముకున్న దివ్యత్వాన్ని గ్రహించాలి. ఆ దివ్యత్వంలో ఉపదేశాలు, ప్రబోధాలు కూడా భాగమై ఉంటాయి. వాటిని గ్రహించాలి. ఆ ఉపదేశాలలో ఆచరణయోగ్యమైన వాటిని ఆచరించాలి. ఆ ప్రబోధాలలోని నీతిని గ్రహించాలి. తనలోని జ్ఞానాన్ని ఉపయోగించి మనిషి మోక్షసాధనకు ప్రయత్నిస్తే పుణ్యం కలుగుతుంది. ఆ పుణ్యమే మోక్షదాయకమవుతుంది.

అలా కాకుండా జ్ఞానాన్ని మరుగున పరుచుకుని అజ్ఞానంతో బ్రతికితే మోక్షం సిద్ధించదు. తిరిగి నీచమైన జన్మ ఎత్తవలసి ఉంటుంది. పాపపుణ్యాలు సమానంగా ఉన్నప్పుడే ఏ ఆత్మ అయినా మనిషిరూపంలో జన్మిస్తుంది. ఆ జన్మలో మోక్షసాధనకు కావలసిన మార్గాన్ని ఎంచుకోవడం మానవుల వివేచన మీద ఆధారపడి ఉంటుంది. భగవంతుడు సృష్టించిన జీవజాలమేదీ భగవంతుని శక్తిని గుర్తించలేకపోయాయి. భగవంతుని గుర్తించినవాడు మానవుడు ఒక్కడే. అందుకే ఈ మానవ జన్మ ఉత్తమోత్తమమైనది అని అంటారు. మనిషి తనకున్న జ్ఞానంతో వివేకంతో మెలగి భగవంతుని కీర్తిని గానం చేస్తుంటే భగవంతుడు పరవశం చెంది, ఆ భక్తునికి వశుడవుతాడు.

No comments:

Post a Comment