Sunday, July 15, 2012

రామ, బలరామ, కృష్ణ, బుద్ధ, కల్కి అవతారాలు


రామావతారం:
నర దేవతమాపన్నః సురకార్య చికీర్షయా |
సముద్ర నిగ్రహాదీని చక్రే వీర్యాణి అనేకషః ||

దాని తరువాత దేవతలందరికీ ఏర్పడ్డ కష్టాలని తొలగించటానికి మనిషిగా అవతరించాడు. ఏం ఆశ్చర్యకరమైన పనులు చేసాడు, సముద్రాన్ని కూడా కోపించి నియంత్రించాడు చెప్పడానికి వీలుకానన్ని కృత్యాలు చేసాడు. ఇది మానవ అవతారం. ఇది పద్దెనిమిదవ అవతారం రామావతారం.
బలరామ-కృష్ణావతారాలు:
ఏకోనవింశే వింశతిమె వృష్ణిషు ప్రాప్య జన్మని |
రామకృష్ణావితిభువః భగవాన్ అహరద్భరమ్ ||

పంతొమ్మిది ఇరవైయవ అవతారాలు ఆయన అన్నతమ్ములుగా వచ్చాడు. శ్రీకృష్ణ బలరాములుగా యాదవుల్లో అవతరించి దుష్టసంహారం చేసి భూముకు ఏర్పడ్డ క్లేషాలని తొలగించాడు. ఇందులో ఒకటి సాక్షాదవతారం, మరొకటి జీవుణ్ణి ప్రధానం చేసుకొని వచ్చిన అవతారం. శ్రీకృష్ణుడిగా వచ్చింది సాక్షాదవతారం. బలరాముడిగా వచ్చినది అనుప్రవేశ అవతారం.
బుద్ధావతారం:
తతః కలై సంప్రవృత్తే సమ్మోహాయ సురద్విషామ్ |
బుద్ధో నామ్నాఙ్జన సుతః కీకఠేషు భవిష్యతి ||

ఇరవై ఒకటవ అవతారం బుద్ధావతారం. ఈ విషయం చెప్పేప్పుడు ఇంకా ఈ అవతారం రాలేదు. అందుకే సూతులవారు "భవిష్యతి", ఇది కాబోతోంది అని చెప్పారు. అంటే సూతులవారు శౌనకాదులకి ఉపదేశం చేసేవరకు బుద్ధావతారం జరగలేదు. కలియుగం ప్రారంభం అయినతరువాత లోకంలో ఉండే వారికి సంమోహం కలిగించేందుకు కలి యొక్క ప్రభావాన్ని లోకంలో వ్యాపింపజేయడం కోసం ఆయన జినుడి కుమారునిగా బుద్ధుడిగా కీకట దేశాల్లో అవతరిస్తాడు అని చెప్పాడు.
కల్కి అవతారం:
అథాసౌ యుగ సంధ్యాయామ్ దస్యు ప్రాయేషు రాజసు |
జనితా విష్ణు యశసః నామ్నా కల్కిర్ జగత్ పతిః ||

ఇరవై రెండవ అవతారం కూడా క్రమంగా వస్తుంది. ఈ కలియుగం అయిపోయాక యుగ సంధికాలంలో వస్తుంది. కలియుగం అయిపోయి కృత యుగం ప్రారంభం అవ్వాలి, అప్పుడు కల్కి అవతారం వస్తుంది. విష్ణు యశస్ అనే ఆయనకి పుడతాడు. కలియుగం మొత్తం నాలుగులక్షల ముప్పైరెండు వేల సంవత్సరాలు. ఇప్పుడు గడిచినది సుమారుగా ఐదువేల సంవత్సరాలు మాత్రమే. "యుగ సంధ్యాయామ్ దస్యు ప్రాయేషు రాజసు", అప్పుడు దేశాన్ని పాలించేవాళ్ళంతా దొంగలై పోతారు. ప్రజల్ని దోచుకు తింటారు. ఇప్పుడు ఇంకా అంతగా కాలం రాలేదు, ఇంకా మంచిగా పరిపాలన చేస్తాం అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. ఆనాటికి తెలిసి తెలిసి భయం లేక దోచుకు తింటారు. కలి పెరిగితే తప్పు జరుగుతుంటే ఇది తప్పు అని ఎవరికీ అనిపించదు, ఇది తప్పు అనేవాడు ప్రక్కన ఉండడు. ఇది ధర్మమని కానీ ఇది దైవమని కానీ ఎక్కడా మాటనే వినిపించని స్థితిని కలి ఆరంభం అయినట్లు అర్థం. అలా కొన్ని అవతారాలి సూతులవారు వివరించారు.



No comments:

Post a Comment