Sunday, December 8, 2013

శ్రీ శిరిడీ సాయి తత్వం

ఈ కలియుగంలో మనము ప్రతీ క్షణం తెలిసో, తెలియకో ఎన్నొ పాపాలను చేస్తూ వుంటాం. ధనార్జనే పరమావధిగా బ్రతికే మానవునికి తన దైనందిన జీవితంలో దైవానికి, గురువుకు స్థానం లేకుండా చేసేసుకున్నాడు. తత్ఫలితంగా ఎన్నొ సమస్యలకు, అశాంతికి, ఆందొళనలకు గురవుతున్నాడు. కాని గురువుకు సర్వస్య శరణాగతి చేసిన వారు మాత్రం ఆ గురువు యొక్క అపూర్వ కరుణా కటాక్షాలకు పాత్రులగుతూ ఎంతో సంతోషకరమైన జీవితం అనుభవిస్తున్నారు. అంటే దీనర్ధం గురువు భక్తులకు చింతలు, సమస్యలు, కష్టాలు, కన్నీళ్ళు వుండవని కాదు.కల్లోల కడలిలో క్రుంగిపోతున్నా , తన భక్తులను ఆ గురువే వచ్చి రక్షించి, వారిని ఈ సంసారమనే కడలి నుండి సురక్షితంగా ఒడ్డుకు చేరుస్తాడు. ఆ సద్గురువును నమ్ముకున్న వారు మరింక ఏ విషయం గురించి ఆలోచించనవసరం లేదు. హాయిగా తమ బరువు బాధ్యతలను ఆ సద్గురువు పాదాలకు అప్పగించి నిశ్చింతగా వుండవచ్చు.ఈ సత్యాన్ని గ్రహించిన వారు ధన్యులు. మిగితా వారు మాత్రం అనుక్షణం ఆ బరువు బాధ్యతలను మోయలేక మోస్తూ, కృంగిపోతూవుంటారు.
ఈ కలియుగంలో ఆ సద్గురువుకు సర్వస్య శరణాగతి చెయ్యడమే సాధనమని తెలుసుకున్నాము కదా ! అట్లే సద్గురువు యొక్క బోధలే మనకు వేద శాస్త్రాలు.ఆయన చెప్పిన మార్గమే మనకు అనుసరణీయం.తన భక్తులకు సమర్ధ సద్గురువైన సాయి ఎన్నో బోధలను చేస్తుండేవారు. ఆయనకు బోధలను చేయడానికి ప్రత్యేక సమయం కాని, స్థలం కాని, సమయం కాని అవసరం లేకుండేది. సంధర్భావసరముల బట్టి వారి ప్రభోధము నిరంతరం జరుగుతూ వుండేది. ఓకనాడు ఒక భక్తుడు మశీదులో తన తోటి భక్తుని గురించి విమర్శించసాగాడు. ఆ తోటి భక్తుడు చేసిన మంచి పనులను విడిచి అతడు చేసిన తప్పుల గురించి తీవ్ర పదజాలంతో ఘాటైన విమర్శలను చేయసాగాడు.ఆ దూషణలను విన్న ఇతరులు విసిగిపోయారు. ఆర్త భక్త జన పరాయణుడైన సాయి సన్నిధిలో ఇటువంటి విమర్శలు ఏల అని మనస్సులో బాధపడసాగారు. ఆ భక్తుడు తన తోటి భక్తుడిని విమర్శిస్తూ ఎంతటి పాపం మూటకట్టుకుంటున్నారో సర్వజ్ఞుడైన సాయి గ్రహించారు. ఆ మధ్యాహ్నం శ్రీ సాయి లెండీ తొటకు వ్యాహ్యాళికొ పోయేసమయంలో ఆ భక్తుడు బాబాని దర్శించి ప్రణామం చేసాడు. అప్పుడు శ్రీ సాయి మలమును తింటున్న ఒక పందిని చూపించి ” చూడు నాయనా ! అమేధ్యాన్ని ఎంతో ప్రీతిగా తింటున్న ఆ పందిని చూడు.నీ ప్రవర్తన, స్వభావము కూడా అంతే. ఎంత ఆనందంగా నీ సాటి సోదరుని తిడుతున్నావు ? కోటి జన్మలలో ఎంతో పుణ్యం చేయగా నీకీ అరుదైన మానవ జన్మ లభించింది.దీనికి సార్ధకత చేకూర్చడానికి ప్రయత్నించాలి గాని ఈ విధమైన దోషణలను చేసి ఎందుకు కొండంత పాపాన్ని మూటకట్టుకుంటున్నావు ?” సాయి మాటలతో ఆ భక్తునికి తన తప్పు తెలిసి వచ్చింది. వెంటనే క్షంచమంటూ శ్రీ సాయి పాదాలపై పడ్డాడు. శ్రీ సాయి అప్పుడు తన బోధను ఈ విధంగా కొనసాగించారు. ” చూడు నాయనా ! ఇతరులను విమర్శించువాడు, దూషణములను చేయువాడు ఒక విధంగా తాను నిందించువానికి సేవ చేస్తున్నాడు. అది ఎట్లనిన, ఇతరులను నిందించడమంటే వారి శారీరక మలినములను తన నాలుకతో నాకి శుభ్రపరచడంతో సమానం.ఇట్టి అపరిశుభ్రమైన కార్యములను చేయడం నీకు తగునా ?భగవంతుని సృష్టిలో అందరూ సమానులే ! ఆ కుల, మత, జాతి , వర్ణ వైషమ్యాలను మనము సృష్టించుకున్నాము.ఎవరి పూర్వ జన్మ సంస్కారములను బట్టి వారు జీవితంలో ప్రవర్తించడం జరుగుతుంది.వారి ప్రవర్తన మనకు నచ్చనంత మాత్రాన, వారిని విమర్శించడం తగదు.ఇతరులను దూషించడం భగవంతుని దూషణతో సమానం.ఒకరు ఇంకొకరిని దూషిస్తే నాకెంతో బాధ కలుగుతుంది, కనుక ఆ పనులను ఇక మీదట చేయవద్దు” మానవ ప్రవర్తనపై శ్రీ సాయి ఎంతటి అపూర్వమైన దివ్య బోధను చేసారో చూడండి. ఆ పరిశుద్ధ పరమేశ్వర అవతార స్వరూపునికి ప్రణమిల్లి ఆ దివ్య సందేశాన్ని మనసులో పదిల పరచుకొని ఆ ప్రకారంగా జీవించి, సాయి అనుగ్రహ, కటాక్షములకు పాత్రులమవుదాము.

No comments:

Post a Comment