Wednesday, December 11, 2013

దత్తప్రభువుల జన్మవృత్తాంతం

ఆధిభౌతికం,ఆధిదైవికం,ఆధ్యా త్మికం అనే తాపాలను తొలగించుకున్న అత్రి మహర్షుల వారికి,కామక్రోధాది దుర్గుణాలన్నింటికీ మూలమైన అసూయను జయించిన అనసూయ మాతకు, కృతయుగంలో ఇప్పుటి నేపాల్‌ ప్రాంతంలోని చిత్రకూట పర్వతం వద్దనున్న అనసూయా పహాడ్ అనేచోట ఒకానొక వైశాఖ బహుళ దశమీ గురువారంనాడు రేవతీ నక్షత్రయుక్త మీన లగ్నంలో మీనాంశయందు ‘బ్రహ్మ అంశమున చంద్రుడు,విష్ణు అంశమున దత్తుడు, శివ అంశమున దుర్వాసులుగా’ దత్తాత్రేయులవారు జన్మించారు. తర్వాత చంద్రుడు,దుర్వాసుడు తమ తమ అంశములను దత్తునిలో నిక్షిప్తం చేసి తపస్సు చేయడానికి వెళ్లిపోయారు.

(బ్రహ్మ నా తండ్రి, మాయ(ప్రకృతి) నా తల్లి వారి ఐక్యం వల్లనే నాకీ దేహం వచ్చింది. నేనే దైవం,శిరిడీలోనూ సర్వత్రా నేనే వున్నాను, సర్వ జగత్తూ నాలోనే వుంది.నీవు చూస్తున్నదంతా కలిపి నేను..నేను శిరిడీలో మాత్రమే ఉన్నాననుకొనేవాడు నన్నసలు చూడనట్లే – అన్న సాయి వాక్కుని సదా స్మరించినట్లయితే ఆయనెవరో క్రమంగా అర్ధం అవుతుంది.)

బాల్య లీలలు :
————–
ఈ బాలుడు సామాన్యుడు కాదని అఙ్ఞానులను ఙ్ఞానమార్గాన నడిపి కైవల్యము చేర్చే మార్గదర్శకుడని ఙ్ఞానులు ఆయన్ను ప్రసంశించేవారు. దత్తులవారు మాత్రం గురుశుశ్రూష చేయక బాలునిగా, ఉన్మత్తునిగా, పిశాచపీడితునిలా విహరిస్తుండేవారు, అది చూచి సంశయించేవారు ఆయన కృపకి దూరమయ్యేవారు. ఒకసారి ఆశ్రమవాసులు, వయోవృద్ధులు దత్తస్వామిని చేరి గురువై తమను అనుగ్రహించవలసిందని ఆయన్ను కోరారు. దత్తులవారు వారితో ఏమీ మాట్లాడకుండా ఏకాంత నిష్టలో ఉండటానికి బయలుదేరారు, ఆశ్రమవాసులు ఆయన్ను వెంబడించారు. అది గమనించిన దత్తప్రభువు దగ్గరలో వున్న సరోవరంలో దిగి అదృశ్యులయ్యారు.

ఆయన్ను వెంబడిస్తూ వచ్చినవారు ఆయన దర్శనంకోసం అక్కడే వేచివున్నారు. ఇలా 100 సంవత్సరాలు గడిచేవరకు వారి సహనాన్ని, వారి దృఢ సంకల్పాన్ని పరిక్షించిన పిదప దత్తస్వామి వారి నమ్మకాన్ని పరిక్షించదలచి, ఒక స్త్రీని ఎడమతొడపై కూర్చోబెట్టుకుని సరోవరంలోంచి బయటకు వచ్చారు. దత్తులవారు ఈ విధంగా దర్శనమిచ్చినప్పటికీ ఆశ్రమవాసులు దృఢచిత్తులై అక్కడనుండి కదలలేదు. అప్పుడు దత్తులవారు మద్యాన్ని సేవిస్తూ. వెంటతెచ్చిన స్త్రీతో సరసాలాడటం మొదలుపెట్టారు. ఈ ఘటన కొందరిలో చిత్తచాంచల్యాన్ని కలిగించింది, ఇలా చిత్తం చెదిరినవారు – ఇటువంటి దురాచారుడు, స్త్రీలోలుడు ఆశ్రితులనెలా ఉద్ధరిస్తాడు? అంటూ ఆయన్ని విడిచివెళ్లారు(ఇటువంటివారినే శ్రీసాయి బాబా రాలిపోయే పూతతో పోల్చారు). అక్కడే మిగిలిన అతి కొద్దిమంది మాత్రం అక్కడ జరుగుతున్న చర్యల్ని పట్టించుకోకుండా చిత్తాన్ని కేవలం దత్తప్రభువుపైనే నిలిపివుంచి ఆయన్ని ఇలా స్తుతించారు – ఓ మహానుభావా నీవు యోగీశ్వరుడివి, పూర్ణ పరబ్రహ్మ స్వరూపూడివి, నిర్గుణుడవైనప్పటికీ భక్తులనుద్ధరించడానికి ఇలా సగుణరూపంలో సంచరిస్తున్నావు. ఇకనైనా ఈ దీనులని పరిక్షించటంమాని, నీ ఆశ్రయం కోరివచ్చిన మమ్ము ఉద్ధరించు ప్రభూ అంటూ స్తుతించగా, వారి ప్రార్ధనను మన్నించిన దత్తప్రభువు ఆ మునులకు తన నిజరూపాన్ని చూపి అనుగ్రహించారు.

ఈ విధంగా ఆశ్రమవాసుల్ని అనుగ్రహించిన తర్వాత దత్తప్రభువు తన తల్లిదండ్రుల చెంతకు వచ్చి, భక్తులను అనుగ్రహించడానికి, ప్రజలను సన్మార్గవర్తనులను చేయడానికి నేను సహ్యాద్రికి వెళ్లాలి నన్ను ఆశీర్వదించమనగా, సర్వఙ్ఞురాలైన ఆ మాత కూడా పుత్రవ్యామోహముతో అంగీకరించక – నా వద్దనే ఉండు,నన్ను విడిచి వెళ్లకని బ్రతిమాలింది. దత్తుల వారు పట్టు విడవకపోవడంతో – నా వల్ల కలిగిన దేహాన్ని నాకు ఇచ్చి నీ ఇచ్ఛ ప్రకారం నడుచుకోమని నిష్టూరమాడింది. దత్తాత్రేయుల వారు నవ్వుతూ తన చర్మాన్ని గోళ్లతో చీల్చి తన దేహాన్ని తల్లికి ప్రసాదించారు. ఆ దృశ్యాన్ని చూచిన అనసూయమాతకు దేహం నాశనమయినప్పటికీ, ఆత్మ శాశ్వతమనే సత్యం స్ఫురించినదై – కుమారా తల్లికి సహజమైన మాతృవ్యామోహంతో నిన్ను అర్ధం చేసుకోలేకపోయాను, అఙ్ఞానంతో అలమటించే మానవాళికి ఙ్ఞానాన్ని ప్రసాదించే మోక్షమార్గాన్ని అనుగ్రహించు అన్నది.
**వ్యామోహం సత్యాన్ని మరుగుపరుస్తుందనే విషయం తెలియజేయడానికే ఈ లీల జరిగిందని మనం గ్రహించాలి.

దత్తప్రభువు దినచర్య :
———————
దిగంబరుడూ,శరీమంతా భస్మం పులుముకొన్నవాడు,ఆత్మ ఙ్ఞానం కలిగించ గలవాడు, సర్వమతాల్లోనూ తన ప్రస్తావన ఏదో ఒక రూపంలో కలవాడు, ఏ అవతారంలోనూ లేని గురుదేవ అన్న విశేషణం కలవాడూ, సదా బ్రహ్మనిష్టకలవాడూ,ప్రసన్నుడు,నిర్మానసుడు ఐన దత్త ప్రభువుల వారు -
ప్రతిరోజూ కాశీలో గంగాస్నానము, మాహురపురములో ధ్యానము, కొల్హాపురిలో (కరవీరపురం) భిక్ష, నిర్మలమైన,స్వచ్ఛమైన తుంగభద్రా నీటితో దాహం తీర్చుకుని, సహ్యాద్రి పర్వతములో నిద్ర చేస్తారు. సహ్యాద్రి కల్పవృక్షము కింద మణిపీఠం ఉంది, దానిపై దత్త ప్రభువు ఆసీనుడై ఉంటాడు. మెడలో మణిహారం, మొలలో బంగారు మొలత్రాడు, వామాంకమున యోగలక్ష్మి మధుమతీదేవి, వెనుక కామధేనువు, నలుదిక్కులా నాల్గువేదాలూ నాలుగు కుక్కలుగా ఆయన పరివేష్టితుడై ఉండగా – ఆయన ముందు సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులూ, నవనాధుల ఆదిగాగల మహ్మాతులు ఆయన్ను స్తుతిస్తూ వుంటారు.కేవలం భిక్షాన్నం మాత్రమే గ్రహించే ఈ ప్రభువుకి అష్టసిద్ధులు,నవనిధులు దాస్యం చేస్తూ ఉంటాయి. ఎడమ చేతిలో త్రిశూలం, శంఖం, కమండలం ధరించి కుడి చేతిలో ఢమరుకం, చక్రం, జపమాల ధరించి ఉండగా గంధర్వుల గానం చేస్తూంటే. అప్సరసలు నృత్యం చేస్తూండగా దత్తప్రభువులు ప్రతిదినమూ దర్బార్ నిర్వహిస్తూవుంటారు. అట్టి ప్రభువు తనను దర్శించి, స్మరించినంత మాత్రానే ఇహ, పర సౌఖ్యాలు కలుగజేస్తుంటాడు.
**శ్రీ దత్తుల వారికి అవధూత అనే బిరుదువున్నది – అవదూతోపనిషత్తు ప్రకారం ఆ పదానికి అర్ధం.

శ్లో II అక్షరద్వాద్వరేణ్యత్వాద్ధూత సంసార బంధనాత్
తత్వమస్యాది లక్ష్యత్వదవదూత ఇతీర్యతే II
తా II నాశరాహిత్యమూ,శ్రేష్టత్వమూ. విదిలించి వేయబడిన సంసారబంధము తత్త్వమసి అనే మహావాక్యానికి లక్షమవ్వడం వలన,అట్టి వారిని అవధూత అని చెబుతారు.

కార్త వీరార్జుని వృత్తాంతం :
————————-
త్రేతాయుగంలో ’హైహయ’ వంశానికి చెందిన కృతవీరుడనే చక్రవర్తి ’మహిష్మతి’ పట్టణాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తుండేవాడు. అతని భార్య శీలధారా దేవి. వీరికి ఎంతో మంది సంతానం కలిగినప్పటికీ, చ్యవన మహర్షి శాపం వల్ల ఒక్కరూ బ్రతకడంలేదు. సంతానం నిలబడటానికి ఎన్నో యాగాలు, పూజలు చేసినా ఫలితం లేకపోవడంతో శీలధారా దేవి ఎంతో మనో వేదనకు గురైంది. ఒకరోజు వారికి యఙ్ఞవల్క్య మహర్షుల వారిని దర్శించే భాగ్యం కలిగింది.

మహర్షుల వారి సతీమణి మైత్రేయి మాత వారి వ్యధ విని వారికి అనంత వ్రతం చేయమని చెప్పి, వ్రత విధానం తెలియజేసింది. ఆ వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తున్నప్పుడు, దేవగురువు బృహస్పతి వారి ఇంటికి విచ్చేసి వారిని సూర్యభగవానుణ్ని కూడా ఆరాధించమని చెప్పి ఆలా చేస్తే పాపాలు నశించి పుత్ర సంతానం కలుగుతుందని తెలియజేస్తాడు. వారు చెప్పినట్లే ఆచరించిన కొన్ని రోజుల తర్వాత శీలధారా దేవి గర్భం ధరించి మగబిడ్డకి జన్మనిచ్చింది. ఐతే ఆ బాలుడు చూడ ముచ్చటగా వున్నప్పటికీ, అతని చేతులు వంకర తిరిగి సన్నగా బలహీనంగా వుండి వేలాడుతున్నాయి. అంగ వైకల్యం గల పిల్లవాడు పుట్టేసరికి వారు ఎంతో దుఃఖించారు. అయినప్పటికీ ఆ బాలుణ్ని వారు ఎంతో ముద్దుగా పెంచసాగారు. ఆ బాలుడికి అర్జునడనే పేరు పెట్టారు. కృతవీర్యుని కొడుకు కావడం వల్ల కార్తవీరార్జునుడయ్యాడు. కొంతకాలానికి కృతవీర్యుడు మరణించాడు. రాజ్యభారం వహించడానికి కార్తవీరునికి అంగవైకల్యం దృష్ట్యా అర్హత లేకపోవడం వల్ల మంత్రులకు రాజ్యాన్ని అప్పగించి తాను తపస్సు ద్వారా శక్తులను పొంది రాజ్యానికి తిరిగి వస్తానని చెప్పి వెళ్లిపోతాడు. గర్గ మహాముని కార్తవీరునికి శ్రీ దత్తాత్రేయుల వారే ఈ వైకల్యాన్ని నివారించగలరని చెప్పి వారిని దర్శించుకోడానికి సహ్యాద్రికి వెళ్లమని రాజుకి చెప్తాడు. దత్తాత్రేయుల వారిని దర్శించినప్పుడు వారు తమ భక్తుల భక్తి శ్రద్ధలను కఠినంగా పరిక్షించి, ఆ తర్వాతే అనుగ్రహిస్తారని చెప్పి దేవేంద్రుడు దత్తుల వారి అనుగ్రహం వల్ల జంభాసురుని ఏ విధంగా వధించాడో తెలియజేస్తారు.

జంభాసురుడు దేవతలని జయించినప్పుడు ఇంద్రుడు దేవ గురువు బృహస్పతిని మార్గం తెలియజేయమని అడుగుతాడు. అప్పుడు బృహస్పతి సహ్యాద్రి పై కొలువై ఉన్న దత్త ప్రభువులే ఈ సమస్యని పరిష్కరించగలరని చెప్పి, ఆయన అనుగ్రహం పొందడంలో ఎదురయ్యే ఆటంకాలు జయించిన వారికే ఆయన తన నిజరూప దర్శనమిస్తాడని, దానికి ఎంతో భక్తి, శ్రద్ధలు అవసరమని చెప్తాడు. ఇంద్రుడు సహ్యాద్రికి చేరుకుని దత్తుల వారి దర్శనం కోసం వెళ్లినప్పుడు ఆయన మగువతో కలిసి మద్యాన్ని పానం చేస్తూ కనిపించారు. ఇలా ఎన్ని పరీక్షలు ఎదురయినా దేవేంద్రుడు ఆయన్ని విడువక సేవిస్తూనే వున్నాడు. కొన్ని రోజులకి ఇంద్రుని భక్తికి ప్రసన్నుడైన దత్త ప్రభువు తన నిజ రూపంలో దర్శనమిచ్చి జంభాసురుని సహ్యాద్రికి వచ్చేలా చెయ్యమని చెప్తాడు. ఇంద్రుడు జంభాసురుని కవ్వించి అతన్ని సహ్యాద్రికి వచ్చేలా చేస్తాడు. జంభాసురుడు తన సైన్యంతో సహా సహ్యాద్రికి రాగానే వాళ్లకి మహాసౌందర్యవతియైన అనఘా దేవి కనిపిస్తుంది. ఆమె సౌందర్యానికి మోహితులై యుద్ధాన్ని చేయడం మాని ఆమెను పల్లకీలో కూర్చోబెట్టారు. ఆమెను ముందుగా ఎవరు పొందాలని వారిలో వారు కలహించుకుంటున్నప్పుడు దత్తప్రభువు ఇంద్రున్ని పిలిచి రాక్షసులను ఓడించడానికి ఇదే సరైన సమయం అని తెలియజేస్తాడు. అప్పుడు ఇంద్రుడు వారిని సునాయాసంగా ఓడిస్తాడు. అలా ఇంద్రుడు దత్త ప్రభువుల కృపకు పాత్రుడై తన రాజ్యాన్ని తిరిగి పొందాడు అని పై వృత్తాంతాన్ని గర్గముని, కార్తవీరునికి తెలియజేస్తారు.

కార్తవీరార్జునుడు సహ్యాద్రి చేరి దత్తప్రభువుని దర్శించి, భక్తి శ్రద్ధలతో వారిని సేవించిన తర్వాత కొంతకాలానికి ఆయన ప్రసన్నులై అతని వైకల్యాన్ని నివారించారు. అంతేగాక అతనికి వేయి బాహువులను, ఇతరుల మనసులను గ్రహించే శక్తిని అనుగ్రహించి, తనంత వాడి చేతిలో మరణం పొందే వరాన్ని ఇచ్చారు. దత్త ప్రభువు అనుగ్రహ బలం చేత కార్తవీరార్జునుడు రావణాసురుడ్ని యుద్ధంలో ఓడించాడు. అలా చాలా కాలం రాజ్య పాలన చేసిన తర్వాత రాజ్యభోగాల పట్ల విసుగు చెంది సత్యాన్ని తెలుసుకోవాలనే కోరిక తీవ్రంగా కలిగి దత్త ప్రభువుని ఆశ్రయించాడు. లౌకిక శాస్త్రాలు విషయాల పట్ల ఆసక్తిని పెంచుతున్నాయి, తత్త్వ శాస్త్రానికి పండితులు తెలియజేసే అర్ధాలు పరస్పర విరుద్ధంగా వుండి సాధకులను గందరగోళానికి గురిచేస్తున్నాయి అని దత్త ప్రభువుతో చెప్పగా. దత్త ప్రభువు “కార్త వీర్యా ! కొన్ని అర్ధాల్లో బాహ్యంగా బేధాలు కనిపించినా, అవి ఒకే తత్త్వాన్ని భిన్నమైన కోణాల్లోంచి ప్రతిపాదించిన సూత్ర పరిశీలనలు మాత్రమే. ఉత్తమమైనది తత్త్వ శాస్త్రమే. అలా అని ఇతర శాస్త్రాలు లౌకికములు అని వాటిని నిరసించరాదు. శాస్త్రాలన్నీ మంచి మార్గానికి దారి చూపేవే. వాటి ద్వారా కూడా ముక్తి సాధించవచ్చు.” అని చెప్పారు. ఆ తర్వాత అతనికి నిర్వికల్ప సమాధి స్థితి కలుగజేసి, ఆత్మ తత్త్వం విచారణ చేసే పద్ధతులను తెలియజేసి అతన్ని ఆశీర్వదించారు. చివరికి కార్త వీరార్జునుడు తాను పొందిన వరం వల్ల పరశురామ అవతారంగా వచ్చిన భగవంతుని చేతిలో మరణాన్ని పొందాడు.

ఙ్ఞానబోధ :
———-
**దత్తాత్రేయుల వారు అలర్కునికి, ప్రహ్లాదునికి, పరశురామునికి ఙ్ఞానబోధ చేసారు.

షోడశ అవతారాలు :
——————-
1.యోగిరాజు 2.అత్రివరదుడు 3.శ్రీ దత్తాత్రేయుడు 4.కాలాగ్ని శమనుడు 5.యోగిజన వల్లభుడు 6.శ్రీ లీలా విశ్వంభరుడు 7.సిద్ధరాజు 8.ఙ్ఞాన సాగరుడు 9.విశ్వంభరావధూత 10.శ్రీ అవధూత 11.మాయాముక్తావధూత 12.ఆది గురువు 13.శివరూపుడు 14.శ్రీ దేవదేవ 15.దిగంబరుడు 16.శ్రీకృష్ణ శ్యామకమలనయనుడు.
**శ్రీ దత్తాత్రేయ సంప్రదాయంలో కలియుగానికి ముందు స్వామికి పదహారు అవతారాలని చెప్పబడింది.ఆయన పరతత్త్వంతో నిత్యం భూలోక నివాసం చేస్తాడు గనుక మహర్షులకు ఆయన ప్రసాదించిన సగుణ సాక్షాత్కారాలనే ఆయన అవతారాలని కీర్తించారని మనం గమనించాలి.

ఈ దత్తప్రభువు మానవజాతి నిలిచివున్నంతవరకూ గురురూపంలో మానవాళిని ఉద్ధరించడమే తన కార్యంగా చేసుకుని, వివిధ గురుసంప్రదాయాల ద్వారా అన్నిమతాల్లో, ప్రతియుగంలో 1,25,000 మంది అవధూతలు, మహాత్ముల రూపంలో ఈ భూమిపై తన కార్యం నిర్వహిస్తూవుంటారు. అట్టి గురుపరంపరలో భాగంగా, కలియుగంలో ఆంధ్రదేశంలోని తూర్పుగోదావరి జిల్లాలో అన్నవరానికి దగ్గరగా ఉన్న శ్రీ పీఠికాపురం (పిఠాపురం) అనే గ్రామంలో శ్రీపాద శ్రీవల్లభులుగా దత్తప్రభువు తన ప్రపధమ అవతారాన్ని ప్రకటించారు.

కృతే జనార్ధనో దేవః
త్రేతాయాం రఘునందనః
ద్వాపరే రామకృష్ణాచ
కలౌ శ్రీపాద వల్లభః


తా II కృత యుగములో జనార్ధనుడు,త్రేతా యుగములో రాముడు,ద్వాపర యుగములోకృష్ణుడు,కలి యుగములో శ్రీపాద శ్రీవల్లభుడు అవతార పురుషులని ఆది గురువు వేదవ్యాస మహర్షి తమ భవిష్యపురాణంలో తెలియజేసారు

No comments:

Post a Comment