Thursday, January 1, 2015

కుమారస్వామి పుట్టడం-శ్రీ రామాయణం

"దేవతలందరూ ఇంద్రునితోనూ అగ్నిహోత్రునితోనూ కలిసి బ్రహ్మదగ్గిరికి వెళ్లి 'దేవా! నువ్వు మాకు శత్రుసంహారదక్షుడైన సేనాధిపతిని అనుగ్రహించావు; కాని అతను ఇంకా పుట్టనేలేదు. పైగా, భగవంతుడైన శివుడు హిమవచ్చిఖరం మీద ఉమాదేవితో కూడా గొప్ప తపస్సు చేస్తున్నాడు. అంచేత, ఇప్పుడు చెయ్యవలసిందేమో ఆలోచించి లోకాలను రక్షించు. నువ్వే మాకు గతి ' అని ప్రార్థించారు. దానిమీద బ్రహ్మ తియ్యనిమాటలతో వారిని ఓదార్చి 'ఉమాదేవి మిమ్ము శపించింది. కనక, మీభార్యలయందు మీకు సంతానం కలగదు. ఉమాదేవి మాట జరిగితీరుతుంది. కాని పొల్లుకాదు. ఇది సత్యం. ఇందులో సంశయం ఎంతమాత్రమూ లేదు. ఇదే, ఆకాశంలో ప్రవహించే గంగానది చూడండి. మీకు సేనాధిపతి కావలసిన మహావీరుణ్ణి అగ్నిహోత్రుడు అకాశగంగయందు పుట్టించగలడు. హిమవంతుని పెద్ద కూతురైన గంగ యందు పుట్టించగలడు. గంగ అగ్ని వల్ల తప్పకుండా కుమారుణ్ణి కంటుంది. ఉమాదేవికి అది ఇష్టమున్నూ అవుతుంది. సందేహం లేదు' అని చెప్పాడు.

అప్పుడు దేవత లందరూ బ్రహ్మను పూజించి ధాతుశోభితం అయిన కైలాసపర్వతానికి వెళ్లి 'దేవా! ఇది దేవకార్యం. కనుక, ఇది నెరవేర్చు. శైలపుత్రిక అయిన గంగాదేవియందు నువ్వు ధరించి వున్న మహాదేవుని రేతస్సు విడిచి పెట్టు ' అని కోరారు.

వెంటనే అగ్ని గంగదగ్గరికి వెళ్లి 'దేవీ! నువ్వు గర్భం ధరించు, ఇది దేవతలకు మిక్కిలి ప్రియమైనది ' అని చెప్పాడు. ఆ మాట విని గంగ చక్కని స్త్రీరూపం ధరించి రాగా అగ్ని ఆ సౌంధర్యం చూసి అన్ని అవయవాలనుంచీ విడిచి గంగ స్రోతస్సులన్నీ శివరేతస్సుతో నింపాడు. కాని 'అగ్నీ, నే నీ తేజస్సు భరించలేను ' అంది. 'అయితే , ఈ హిమవత్పర్వత పాదంమీద గర్భం ఉంచు' అని అగ్ని చెప్పాడు. ఆమాట మీద గంగాదేవి పరమభాస్వరం అయిన గర్భం స్రోతస్సుల నుంచి విడిచిపెట్టింది. గంగ విడిచిన శివరేతస్సు భూమిమీద పడడం వల్ల బంగారమూ, వెండీ, రాగీ, ఉక్కు,తగరమూ, సీసమూ పుట్టాయి. ఆ శ్వేతపర్వతం అంతా రెల్లువనంతో కూడా బంగారం అయిపోయింది. బంగారం అది మొదలు అగ్నిలాగ మెరుస్తూ జాతరూపం అని పేరుపొందింది.

ఇంద్రాది దేవతలు, కుమారుడు పుట్టగానే పాలిచ్చి పెంచడానికి షట్కృత్తికలనూ ఏర్పాటు చేశారు. 'ఈ బిడ్డ మా ఆరుగురికీ కొడుకే ' అని సమయం చేసుకుని కృత్తికలు అతన్ని పెంచడానికి ఉన్ముఖులయినారు. అది చూసి దేవతలు 'కుమారుడు కార్తికేయుడనిన్నీ పేరుపొందుతాడు. త్రిలోకాలయందూ విఖ్యాతుడున్నూ అవుతా' డన్నారు. అప్పుడు గర్భ పరిశ్రావంకాగా స్కన్నుడైన బాలుణ్ణి కృత్తికలు స్నానం చేయించారు. అగ్నిహోత్రంలాగ ప్రకాశిస్తున్న ఆ కుమారుడు స్కన్నుడైనాడు కనుక దేవతలు స్కందుడనిన్నీ పేరు పెట్టారు. వెంటనే కృత్తికలకు పాలు పుట్టాయి. కుమారుడు ఆరు మొగాలు కలవాడై ఏకకాలంలో ఆరుగురి పాలూ తాగి, సుకుమారదేహుడే అయినా తన అఖండపరాక్రమం వల్ల రాక్షస సేనలనన్నిటినీ జయించాడు. అగ్నిని పురస్కరించుకుని దేవతలందరూ కుమారుణ్ణి దేవసేనాధిపత్యం యిచ్చి అభిషేకించారు. రామా! గంగ వృత్తాంతం యిదీ. పుణ్యప్రదమైన కుమారస్వామి జననం ఈ విధంగా జరిగింది. ఇక్ష్వాకు వంశవర్ధనా! కార్తికేయుడైన కుమారస్వామి యెడల భక్తిగల మానవుడు ఇహలోకంలో దీర్ఘాయువూ అష్టైశ్వర్యాలూ అనుభవించి చివరికి స్కందసాలోక్యసిద్ధి పొందుతాడు.

సగరునికి అరవైవేలమంది కొడుకులు పుట్టడం:

విశ్వామిత్రుడు ఇంకా యిలా చెప్పాడు.

"రామా! పూర్వం సగరుడనే రాజు అయోధ్యాది పతి అయి ప్రజాపాలన చేస్తూ వుండేవాడు. అతను గొప్పశూరుడు. ధర్మాత్ముడు. కాని అతనికి సంతానం లేకపోయింది. అతనికిద్దరు భార్యలు. విదర్భరాజు కూతురైన కేశిని పెద్దభార్య. ఆమె ధర్మాత్మురాలు. సత్యవాదిని. అరికాశ్యపుడైన అరిష్టనేమి కూతురు సుమతి రెండో భార్య. ఆమె చాలా చక్కనిది. వారిద్దరితోనూ కలిసి సగరుడు హిమవత్పర్వతానికి వెళ్ళి భృగుమహర్షి నివసిస్తున్న ప్రత్యంత పర్వతం అయిన ప్రస్రవణ గిరిమీద తపస్సు చేశాడు. అతిదీక్షతో అతను వందసంవత్సరాలు తపస్సు చెయ్యగా, సత్యవంతులలో ఉత్తముడైన భృగుమహర్షి చాలా ఆనందించి 'రాజా! నీకు గొప్ప సంతానం కలుగుతుంది. లోకంలో సాటిలేని యశస్సున్నూ నీకు లభిస్తుంది. అయితే, నీ భార్యలలో ఒకామె వంశకరుడైన ఒక్క కొడుకును కంటుంది. ఇంకొకామె అరవైవేలమంది కొడుకులను కంటుంది ' అని అనుగ్రహించాడు.

ఆ మాట విని రాజు భార్యలు చాలా సంతోషించి దోసిలి వొగ్గి 'మహాత్మా! మాలో, ఒక్కకొడు కెవరికి పుడతాడు, అరవైవేలమంది యెవరికి పుడతారు?' అని అడిగారు. దానిమీద పరమధార్మికుడైన భృగుమహర్షి 'అది మీ ఇష్టం. వంశకరుడైన వొక్క కొడుకెవరికి కావాలో, మహా బలవంతులూ, కీర్తిమంతులూ, మహోత్సాహులూ అయిన అనేక వేలమంది ఎవరికి కావాలో మీలో మీరే నిర్ణయించుకుని చెప్పండి అన్నాడు. సగరుని యెదుట పెద్దభార్యఅయిన కేశిని 'అయితే నాకు వంశకరుడైన ఒక్కకొడుకే కావాలి ' అంది. చిన్నభార్య అయిన సుమతి 'అరవై వేలమంది కొడుకులే కాలా' లంది.

అంతట సగరుడు భార్యలతో గూడ భృగుమహర్షికి ప్రదక్షిణ సాష్ఠాంగ నమస్కారాలు చేసి, అనుజ్ఞ పొంది తన పట్నానికి వెళ్ళిపోయాడు. కొంతకాలానికి పెద్దభార్య ఒక్క కొడుకును కన్నది. ఆ బాలునికి అసమంజుడు అని పేరు పెట్టారు. చిన్నభార్య ఆనపకాయ వలె గుండ్రని గర్భపిండం కన్నది. ఆ పిండం బద్దలు చెయ్యగా అందులో నుంచి అరవైవేలమంది కొడుకులు పుట్టుకు వచ్చారు. దాదులు ఆ బాలురను నేతికుండలలో వుంచి పెంచారు. కాలక్రమాన వారందరూ యౌవనవంతులయినారు. జేష్ఠుడైన అసమంజుడు సుమతి కొడుకులనందర్నీ సరయూనదికి తీసుకుపోయి బలవంతాన వాళ్ళని ముంచి ఏడిపిస్తూ నవ్వుతూ వుండేవాడు. తమ్ములనే కాక సజ్జనులైన పౌరులను కూడా అనేక మందిని పీడిస్తూ ఉండేవాడు. అది చూసి సగరుడు భరించలేక అసమంజుణ్ణి పట్నానుంచి తరిమివేశాడు. అసమంజుని కొడుకు అంశుమంతుడు. అతను బలపరాక్రమశాలి. అందరికీ యిష్టుడై అందరితోనూ ప్రీతిగా మాట్లాడేవాడు.

తరువాత చాలాకాలానికి యజ్ఞంచెయ్యాలని సగరుడికి కోరిక పుట్టింది. ఋత్విక్కుల నందరినీ చేర్చుకుని అతను యాగం ప్రారంభించాడు.

No comments:

Post a Comment